11, ఫిబ్రవరి 2014, మంగళవారం

Seven Holy places in Karnataka

                             కర్ణాటక లోని ఏడు ముక్తి స్థలాలు 

భారత పురాణాలు మనకు ఏడు ముక్తిని ప్రసాదించే దివ్య క్షేత్రాల గురించి తెలియచేశాయి. 
దర్శన, స్మరణ,పఠన, శ్రవణ  మాత్రాననే మానవుల సర్వ పాపాలు తొలగిపోయి వారిని  భగవతుని సన్నిధికి  చేర్చే అవి అయోధ్య, మథుర, మాయ ( హరిద్వార్), కాశి, కంచి, అవంతిక
(ఉజ్జయిని), మరియు ద్వారక. 
వాటితో సరిసమానమైన స్తలాలు కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి పరిసర ప్రాంతాలలో ఉన్నాయి. 
అవి ఉడిపి, కుక్కే సుబ్రహ్మణ్యం, కుంబాసి, కోటేశ్వర, శంకర నారాయణ, కొల్లూర్ మరియు గోకర్ణం.
స్కాందపురాణం లోని సహ్యాద్రి కాండలో ఈ క్షేత్రాల ప్రస్తావన ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇంతటి  పురాణ ప్రాశస్త్యం ఉన్న ఈ క్షేత్రాలు ఉత్తర కర్నాటకలో పరశురాముడు సృష్టించిన నేటి కొంకణ భూభాగంలో నెలకొని ఉన్నాయి. చక్కని ప్రకృతికి నిలయమైన ఈ క్షేత్రాలన్నీ సందర్శకులను ఆకట్టుకొంటాయి.
 ఈ ఏడు క్షేత్రాలు కూడా ఎన్నో శతాబ్దాల చరిత్రకు, మరెన్నో ప్రత్యేకతలకు నిలయాలు.

ఉడిపి :


ప్రసిద్ధి చెందిన శ్రీ కృష్ణ క్షేత్రాలలో ఒకటిగా పేరొందిన "ఉడిపి"కి ఆ పేరు రావడానికి సంభందించి రెండు రకాల కధనాలు వ్యాప్తిలో ఉన్నాయి.
ఉడిపి అంటే నక్షత్రాల దేవుడు అని అర్ధం. నక్షత్రాల దేవుడు వెన్నెల రేడు చంద్రుడు కదా !
దక్ష శాపం నుండి సదాశివుని కృప వలన విముక్తుడైన నెలరాజు శాశ్వతంగా ఆయన శిరమందు నిలిచిపోయే భాగ్యాన్ని పొందిన క్షేత్రం అయినందున ఈ పేరు వచ్చినట్లుగా ఒక కధనం తెలుపుతున్నది. దీనికి నిదర్శనంగా ఇక్కడ ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి ఆలయాన్ని చూపుతారు.
రెండవ కధనం ప్రకారం ఉడిపి అన్న పదం "ఒడిపు" అన్న తుళు పదం నుండి వచ్చినది అని, దానికి అర్ధం పవిత్ర గ్రామం అని అంటారు.జగన్నాటక సూత్రధారి శ్రీ కృష్ణుడు కొలువైన ప్రదేశం పవిత్రమైనదే కదా !
ఉడిపి ద్వైత సిద్దాంత సృష్టి కర్త అయిన శ్రీ శ్రీ శ్రీ మధ్వాచార్యుల వారి జన్మస్థలం.పదమూడవ శతాబ్దంలో ఆయన ఇక్కడ శ్రీ కృష్ణ విగ్రహం ప్రతిష్టించి మఠాన్ని స్థాపించారు.ఈ శ్రీ కృష్ణ విగ్రహం గురించి ఆసక్తికర సంఘటన ఒకటి ప్రచారంలో ఉన్నది.
ఒకనాడు మధ్వాచార్యులవారు సముద్ర తీరంలో నడుస్తుండగా దూరంగా అల్లకల్లోలంగా ఉన్న సాగరంలో ఒక నావ చిక్కుకొని పోయి, అందులోని వారు ఆర్తనాదాలు చేస్తుండటం చూసారు.
ఆయన వారికి మార్గదర్శకత్వం చేసి క్షేమంగా ఒడ్డుకు చేర్చారు.దానికి ఆ నావికులు కృతజ్ఞతగా ఆయనకి వారి వద్ద ఉన్న కృష్ణ బలరామ విగ్రహాలను బహుకరించారు.బలరామ మూర్తిని దగ్గరలోని మాల్పే ( వడపాండేశ్వర ఆలయం) అన్న చోట ప్రతిష్టించారు.సాగర తీరంలో నేటికి సందర్శించుకొనవచ్చును. కృష్ణ విగ్రహాన్ని ఉడిపిలో ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని దేవ శిల్పి విశ్వకర్మ రుక్మిణి దేవి నిత్య పూజ కొరకు ద్వాపరయుగంలో ప్రత్యేకంగా తయారుచేసినట్లుగా తెలుస్తోంది.
ఉడిపి లోను చుట్టుపక్కల ఎన్నో దర్శనీయ స్థలాలు ఉన్నాయి.




ఉడిపి శ్రీ కృష్ణ మఠం 

మాల్పే - శ్రీ వడపాండేశ్వర ఆలయం 

ఉడిపి కృష్ణుడు 


కుక్కే  సుబ్రహ్మణ్యం దేవస్థానం :

ఉడిపితో సహా మిగిలిన అయిదు క్షేత్రాలు ఉత్తర కర్ణాటకలో సాగర తీరంలో ఉండగా ఈ ఒక్క క్షేత్రం దూరంగా (160  కి. మీ ) దక్షిణ కర్ణాటకలో ఉంటుంది. ఈ దివ్య క్షేత్ర పురాణ గాధ సత్య యుగం నాటిది. 
లోకకంటకులైన తారకాసుర మొదలైన రాక్షసులను సంహరించిన శివ కుమారునికి దేవేంద్రుని  కుమార్తె అయిన దేవ సేనతో మార్గశిర సుద్ద షష్టి నాడు ఇక్కడే జరిగినది అని అంటారు. 
స్కందునికి మంగళ స్నానం చేయించడానికి దేవతలు అనేక పవిత్ర నదీ జలాలను తెచ్చారు. 
ఆ జలాల ప్రవాహమే నేటి కుమార ధార. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య కుక్కే క్షేత్రాన్ని సందర్శించినట్లుగా శంకర విజయం తెలుపుతోంది.
కుక్కె నాగదోష పూజలకు ప్రసిద్ది. గరుడుని వలన ప్రాణ భయం ఏర్పడటంతో సర్ప రాజు వాసుకి ఇక్కడ దాక్కొని సర్వేశ్వరుని గురించి తపము చేసాడు. కుమారస్వామి తన వివాహ సందర్భంగా తండ్రి ఆదేశం మేరకు నాగారాజుకి అభయమిచ్చారు. ఇద్దరూ కలిసి ఇక్కడ కొలువైనారు. అందువలన ఇక్కడ చేసే పూజలు నాగ దోషాన్ని తొలగిస్తాయి. భక్తులు వివాహం, సంతానం మరియు ఆరోగ్యం కొరకు ఇక్కడికి వస్తుంటారు. నాగప్రతిష్ఠలు చేస్తుంటారు. 
కుమారధారలో స్నానం చేయడం వలన కుష్టు వ్యాధి లాంటివి కూడా తగ్గుతాయి విశ్వసిస్తారు.
ప్రతి నిత్యం వేలాది మందికి అన్నదానం జరుగుతుందిక్కడ.





శంకర నారాయణ ఆలయం (కుందుపుర)

కర్ణాటకలో ఉన్న పరశురామ సృష్టిత సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటైన శంకరనారాయణ లోని శివ కేశవ ఆలయం చాలా ప్రత్యేకమైనది మరియు పవిత్రమైనది. పద్మపురాణం ప్రకారం ఖరాసుర మరియు రట్ఠాసుర అనే ఇద్దరు రాక్షసులు ప్రజలను హింసిస్తుండేవారు. క్రోడ మహర్షి  అసురుల బారి నుండి ప్రజలను కాపాడమని ఒకేసారి శివకేశవుల గురించి తపస్సు చేశారు. హరిహరులు  ఆయన తపస్సుకు సంతృప్తి చెంది భూలోకానికి వచ్చి అసురసంహారం చేశారు. ఈ కారణంగా పర్వతాన్ని క్రోడ గిరి అని పిలుస్తారు. ఆలయాన్ని వెయ్యి సంవత్సరాల క్రిందట సోమశేఖర రాయ అనే రాజు కట్టించినట్లుగా లభించిన ఆధారాల వలన తెలుస్తోంది. సహ్యాద్రి పర్వతాలలో ఒకే పానువట్టం మీద హరిహరులిరువురూ లింగ రూపాలలో కొలువుతీరిన ఒకే ఒక్క క్షేత్రం ఇదేనేమో ! ఎడమ పక్కన ఉన్న శివలింగం గుండ్రంగా ఉంటుంది. కుడివైపున ఉండే శ్రీ నారాయణ లింగం చదునుగా ఉంది పై భాగాన గోవు గిట్టల ముద్రలు కలిగి ఉంటుంది. లింగాల చుట్టూ నిరంతరం జలం నిలిచి ఉంటుంది. వెనుక భాగాన ఆరడుగుల ఎత్తైన శంకరనారాయణ వెండి విగ్రహం ఉంటుంది. అమ్మవార్లు శ్రీ గౌరీ, శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ శంకరనారాయణలు పంచలోహ విగ్రాహాల రూపంలో వేరే సన్నిధిలో కొలువుతీరి ఉంటారు. ద్వారపాలకులుగా జయవిజయులు మరియు నందీశ్వరుడు ఉండటం ఒక విశేషం.ముఖమండపం సుందర శిల్పాలతో నిండి ఉంటుంది. భోగ మండపానికి బంగారు రేకులతో అలంకరించారు.
ఈ ఆలయంలో ఎన్నో పరివర దేవతల సన్నిదులుంటాయి.వారాహి నదీతీరంలో ఉన్న శ్రీ వెంకట రమణ మూర్తి, శ్రీ గణేష ఉప ఆలయాలతో కూడిన శ్రీ సదాశివ ఆలయం మరియు శ్రీ నందికేశ్వర స్వామి ఆలయం కూడా తప్పని సరిగా దర్శించవలసినవే !!!!
సంక్రాంతి నాడు పెద్ద ఉత్సవం జరుగుతుంది. లక్షల మంది భక్తులు పాల్గొంటారు. 






కోటేశ్వర :

 విధాత పరమేశ్వరుని కోటేశ్వర రూపంగా ఆరాధించి ఇక్కడ దర్శనం చేసుకున్నాడట.   అందుమూలాన క్షేత్రాన్ని కోటేశ్వర అని, స్వామిని శ్రీ కోటేశ్వర స్వామి అని పిలుస్తారు. కేరళ నిర్మాణ శైలిలో ఉండే ఈ ఆలయం నల్లని రాతి నిర్మాణము. గతంలో నిర్మించిన ఏడు ప్రాకారాలలో కొంత వరకు కనుమరుగయ్యాయి. ఆలయ వెలుపల పెద్ద గద్దెను నిర్మించారు.  దానిని ఎక్కితే లోపల గర్భాలయంలో ఉన్నశ్రీ  కోటిలింగేశ్వర స్వామిని నేరుగా కాంచవచ్చును.
శ్రీ గణపతి,  శ్రీ కార్తికేయ, శ్రీ అర్ధనారీశ్వర స్వామి, గోపాలకృష్ణ, మహిషాసురమర్దని మరియు శ్రీ పార్వతీ ఉపాలయాలలో కొలువై ఉంటారు. 
ఆలయం పక్కనే పెద్దదైన కోటి తీర్థం ఉంటుంది. ఈ సరస్సును శుభ్రం చేస్తున్నప్పుడు రాతి మీద చెక్కిన పెద్ద పెద్ద దేవతా రూపాలు బయల్పడ్డాయి. లోహపు విగ్రహాలు, పళ్ళాలు రాతి శిలా శాసనాలు కూడా లభించాయి. 
కోటేశ్వర ఆలయంలో సంవత్సరానికి ఒక సారి నిర్వహించే రధోత్సవం ఉడిపి జిల్లా లోనే కాదు కర్ణాటక లోనే ప్రసిద్ధి. భూమి మీద రథంలో సర్వేశ్వరుడు భక్త జనులకు దర్శనం ప్రజాఆడించే సమయంలో ఆకాశ మార్గాన ఒక గరుడ పక్షి రధాన్ని అనుసరిస్తుంటుంది అంటారు. ఈ పక్షి ఎక్కడి నుండి వస్తుందో ఎవరికీ తెలియదు. 
ఈ ప్రాంతం చెరకు పంటకు పెట్టింది పేరు. రధోత్సవంలో పాల్గొనే నూతన దంపతులు ఆలయం వద్ద అమ్మే చెరుకు గడలను తప్పని సరిగా కొనుక్కొని వెళతారు. మహేశ్వరుని కృప వలన చెరకు లాగా వారి జీవితాలు సుఖమయం కావాలన్న ఆశ కోరిక దీనిలో కనపడతాయి. 


     




ఈ ఆలయంలో అన్ని ప్రత్యేక రూపాలలో కనపడతాయి. 
ఇరవై అయిదు అడుగుల ఎత్తు ప్రధాన ద్వారం, వంద అడుగుల ధ్వజస్తంభం, డమరుకము ఆకారంలో ఆలయ పుష్కరణి, రెండో ప్రాకారంలో ఉన్న ఏనాటిదో తెలియని పెద్ద శిలా శాసనం (ఇందులోని భాష గురించి ఇంకా చర్చలు జరుగుతున్నాయని అంటారు) ఇలా ప్రతి ఒక్కటి ఒక విశేషమే !గణపతి, వేణుగోపాల, దేవి, సప్త మాతృకలు, సుబ్రహ్మణ్య, వెంకట రమణ మూర్తి ఉప ఆలయాల్లో కొలువై ఉంటారు.ఉపాలయంలో కొలువైన శ్రీ కాళి లక్ష్మి ఒక చేతిలో పసి బాలుని మరో చేత్తో చీపురు ధరించి ప్రత్యేకంగా కనపడతారు.గర్భాలయంలో శ్రీ కోటిలింగేశ్వర స్వామి లింగ రూపంలో చందన,కుంకుమ,విభూతి లేపనాలతో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. 

అనెగుద్దె ( కుంభాషి ) :

సప్త ముక్తి క్షేత్రాలలో ఐదవది అనెగుద్దె లేక కుంభాషి. ఈ క్షేత్రంలోని మూలవిరాట్టు విఘ్న నాయకుడు శ్రీ గణేశుడు. గర్భాలయంలో స్థానిక భంగిమలో పెద్దతల, చెవులు,చతుర్భుజాలతో వెండి తొడుగు ధరించి దర్శనమిస్తారు. స్వామివారి ముందరివి వరద హస్తాలు కావడాన సకల అభీష్టాలను నెరవేర్చేవానిగా భక్తులు విశ్వసిస్తారు.   గజముఖుదు ఏనుగు తల ఆకారంలో ఉన్న కొండ మీద కొలువైనందున అనే గుద్దే ( ఏనుగు తల)గా పిలవబడుతోంది. 
పాండవులు అరణ్య వాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారట.తీవ్ర కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ఇక్కడి ప్రజలను చూసి చలించిపోయి ప్రార్ధించగా గౌతమ ముని వచ్చి వరుణ దేవుని సంతృప్తి పరచడానికి యాగం చేయమని సలహా ఇచ్చారట. పాండునందనులు యజ్ఞం ఆరంభించారట. సమీపంలోని అడవిలో నివసించే  కుంభాసురుడు అనే రాక్షసుడు యాగాన్ని భగ్నం చేయడానికి చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టిన భీమసేనుడు వానిని సంహరించారట. 
కుంభాసురుడు మరణించిన ప్రదేశం కావడాన కుంభాషిగా పిలవబడుతోంది. యాగం     నిర్విఘ్నంగా సాగి ఈ ప్రాంతం మరల సుభిక్షంగా మారినదట.యాగారంభములో పాడవుల తొలి పూజ లందుకొన్న శ్రీ మహా గణపతి నేటికీ పూజలు అనుకొంటున్నారు.
ఆలయం వద్ద చంద్ర మరియు సూర్య పుష్కరుణులు ఉంటాయి. గట్టున లోకాలకు వెలుగును అందించే ఆ దేవతల ఉపాలయాలుంటాయి. దగ్గర లోని బిలం నుండి జలం నిరంతరం ప్రవహిస్తుంటుంది. దానిని పవిత్ర గంగా ప్రవాహంగా భక్తులు భావిస్తారు.  ఆలయ గోడల పైన భార్గవ పురాణ ఘట్టాలను సుందరంగా మలచారు. ఇది పరశురామ భూమి కదా ! ఈ ఆలయంలో గణేశ చతుర్ధి ఘనంగా జరుపుతారు.
అనెగుద్దె లోని శ్రీ పట్టాభి రామ స్వామి ఆలయం మరియు మహాలింగేశ్వర స్వామి ఆలయం తప్పక దర్శించవలసినవి. 









కొల్లూరు శ్రీ మూకాంబిక దేవి :

ఉత్తర కర్ణాటక, పక్కనే ఉన్న కేరళలో భక్తులు అమితంగా  విశ్వసించే దేవత కొల్లూరు శ్రీ మూకాంబిక దేవి. పేరెన్నికగన్న శక్తి స్థలం. కౌమాశుర అనే అసురుడు పరమశివుని ఎవరి చేతిలోనూ మరణం పొందకుండా ఉండేలా వరం కోరబోయిన సమయంలో వాగ్దేవి అతని స్వరం మూగబోయేలా చేసిందట. అప్పుడు దుర్గాదేవి మిగిలిన దేవీదేవతల శక్తులను స్వీకరించి మహాశక్తిగా మారి వానిని అంతం చేసిందట. మూగగా మారిన రాక్షసుని అంతంచేసిన దేవి "మూకాంబిక"గా పిలవబడుతోంది. ముగ్గురు దేవతల మూలపుటమ్మగా అమ్మవారు ఉదయం సరస్వతిగా, మధ్యాహన్నం శ్రీ మహాలక్ష్మిగా సాయంత్రం శ్రీ మహా దుర్గగా పూజలందుకొంటారు. గర్భాలయంలో అమ్మవారు ఉపస్థిత భంగిమలో శంఖుచక్రాలు ధరించి, అభయ వరద హస్తాలతో దర్శనమిస్తారు.
కోలమహర్షి లోక కళ్యాణార్ధం చేసిన తపస్సుకు సంతసించిన సదాశివుడు సాక్షాత్కరించారు. మహర్షి ఆనందించి ఆది దంపతులను ఒకటిగా ఆరాధించే భాగ్యాన్ని కోరుకోన్నారట. అందుకే  అమ్మవారి విగ్రహం ముందున్నలింగానికి మధ్యలో సువర్ణ రేఖ ఉంటుంది.జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు ఇక్కడకొంత కాలం తపస్సు చేశారట. ఆయన నాడు తపస్సు చేసిన పీఠంగా చెప్పబడే రాతి గద్దె గర్భాలయానికి పడమర పక్కన ఉంటుంది. ప్రదక్షిణాపధంలో కంభ గణపతి, దశభుజ వినాయక,నాగప్రతిష్ఠలు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి మరియు శ్రీ వీరభద్ర స్వామి సన్నిధులు ఉంటాయి.
ప్రధాన ఆలయానికి సమీపంలో శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ చౌడేశ్వరి, శ్రీ గణపతి, శ్రీ సిద్దేశ్వర స్వామి, శ్రీ మారియమ్మ ఆలయాలుంటాయి.







గోకర్ణం 


 ఉత్తర కర్ణాటకలోని సప్త ముక్తి క్షేత్రాలలో ఆఖరిది శ్రీ మహాబలేశ్వర స్వామి కొలువు తీరిన గోకర్ణం. రామాయణ కాలం నాటి ఈ క్షేత్ర గాధ అందరికి తెలిసినదే ! పరమ శివుని మెప్పించి ఆత్మ లింగాన్ని తీసుకొని లంకానగరానికి వెళుతున్న రావణాసురుని నుండి ఉపాయంతో గణపతి ఇక్కడ ఉంచాడు అన్నదే ఆ గాధ ! శ్రీ మహా బలేశ్వర స్వామి కొలువు తీరిన, అరేబియా సముద్ర తీరాన ఉన్న గోకర్ణం ఒక ఆద్యాత్మిక పర్యాటక కేంద్రం. 
సదాశివుని ఆత్మలింగం కొలువైనందున భక్తులు  కాశీ సమాన క్షేత్రంగా "దక్షిణ కాశీ"గా భావించి   గౌరవిస్తారు. మహాకవి కాళిదాసు రచించిన "హరివంశం"లో గోకర్ణం ప్రస్థాపన ఉన్నది. అరవై మూడు మంది శైవ గాయక భక్తులైన నయనారులు గానం చేసిన పాటికాల ద్వారా గోకర్ణం పడాల్ పెట్ర స్థలాలలో ఒకటిగా గుర్తింపు పొందినది. లభించిన  శాసనాధారాల ద్వారా తొలి ఆలయం క్రీస్తుశకం నాలుగో శతాబ్దంలో కదంబ వంశ రాజులు నిర్మించినట్లుగా తెలుస్తోంది. తదనంతర కాలంలో విజయనగర రాజుల ఆధ్వర్యంలో ప్రస్తుత నిర్మాణాలు నిర్మించబడినాయి.
ప్రతి నిత్యం వేలాదిగా భక్తులు శ్రీ మహాబలేశ్వర స్వామి ఆశీస్సుల ల కొరకు తరలి వస్తుంటారు. నిత్య పండగ వాతావరణం నెలకొని ఉంటుందీ ఆలయంలో ! మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 





శ్రీ మరుడేశ్వర్ 




ఉత్తర కర్ణాటకలో ఉన్న సప్త ముక్తి స్థలాలను సందర్శించుకోవాలనే ఆసక్తి గల యాత్రీకులు ముందుగా మంగళూరు చేరుకొని అక్కడ నుండి వరుసగా ఉడిపి, అనే గుద్దే, కోటేశ్వర, కుందపుర, కొల్లూరు మరియు గోకర్ణం దర్శించుకొని తిరిగి మంగళూరు చేరుకోవాలి. దక్షిణ కర్ణాటకలో ఉన్న కుక్కే సుబ్రహ్మణ్యం మంగళూరుకు(ధర్మస్థల మీదుగా) నూట అరవై కిలోమీటర్ల దూరం. అలా మొత్తం సప్త ముక్తి క్షేత్రాల మరియు మరుడేశ్వర్ లాంటి ఇతర క్షేత్రాల సందర్శన ఆరు రోజులలో పూర్తి చేసుకోని మరుపురాని ఆధ్యాత్మిక అనుభూతులను సొంతం చేసుకోవచ్చును.


  




  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...