12, ఆగస్టు 2017, శనివారం

Sri Kachabeswara Temple, Kanchipuram

             శ్రీ కచ్చభేశ్వర స్వామి ఆలయం, కాంచీపురం 



సహస్రాధిక ఆలయాల నగరం కాంచీపురం. ఊరిలో ప్రతి వంద అడుగులకి ఒక చిన్న పెద్ద ఆలయం కనపడుతుంది నేటికీ ! ఎన్నో పురాతన ఆలయాల, మండపాల శిధిలాలు నగరం నలుమూలలా దర్శనమిస్తారు.  
కాలగతిలో కొన్ని కలిసిపోగా, మరి కొన్ని వివిధ దండయాత్రలలో ధ్వసం అవ్వగా మిగిలిన కొన్ని ఆలయాలలో శ్రీ కచ్చభేశ్వర ఆలయం ఒకటి. నగర నడిబొడ్డున విశాలమైన ప్రాగణంలో ఉండే ఈ ఆలయం అన్నిరకాలుగా భక్తులను ఆకర్షిస్తుంది. శుచీ శుభ్రతలతో ప్రశాంత వాతావరం లో ఉండే ఈ ఆలయం యొక్క చరిత్ర క్షీరసాగర మధన సమయానికి చెందినదిగా తెలుస్తోంది. 











దేవదానవులు కలిసి చేపట్టిన పాల సముద్ర మధనం లో మందార పర్వతం పదే పదే మునిగి పోతుండటంతో వారంతా శ్రీ హరి శరణు కోరారు. సాయం చేయడానికి అంగీకరించిన వైకుంఠ వాసుడు కూర్మ (తాబేలు)రూపం ధరించారు.ఆరూపం లోనే సాగర మధనం కార్యక్రమం నిర్విఘ్నంగా నెరవేరాలని కోరుతూ లయకారుని లింగ రూపంలో ఆరాధించారట ఇక్కడ.ఈ కారణం చేత ఈ స్వామిని శ్రీ కచ్చభేశ్వరుడు" అని పిలుస్తారు.ఉదంతానికి నిదర్శనంగా ప్రధాన ఆలయ మండపం వద్ద ఈ పురాణ గాధ  మొత్తం తెలిపే ఒక చిత్ర పటాన్ని ఉంచారు.














తొలుత పల్లవ రాజులు తరువాత చోళులు, విజయనగర రాజులు నిర్మించిన పెక్కు నిర్మాణాలు ఈ ప్రాంగణంలో కనిపిస్తాయి.శ్రీ గణపతి, శ్రీ సరస్వతి, శ్రీ భైరవ, శ్రీ చంద్రముఖేశ్వర, శ్రీ ధర్మశాస్త ఉపాలయాలతో పాటు అమ్మవారు శ్రీ సుందరాంబిక దేవి లేక శ్రీ అంబుజాక్షి ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. భక్తులను తన కంటిలో పాపల్లాగా కాపాడే దేవిగాను మరియు అత్యంత సుందర రూపం కలదానిగా అమ్మవారికి ఈ రెండు పేర్లు వచ్ఛాయి.అమ్మవారి ఆలయంలో ప్రతిష్టించబడిన శ్రీ చక్రానికి విశేష పూజలు జరుపుతుంటారు. అమావాస్య, పౌర్ణమి శుక్రవారం రోజులలో  పెద్ద సంఖ్యలో మహిళలు తరలి వస్తుంటారు.











ఎత్తైన రాజ గోపురానికి ఉన్న ద్వారం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశించగానే ఎదురుగా కనిపిస్తుంది శ్రీ సత్యమొళి వినాయక సన్నిధి.  విఘ్ననాయకునికి మొక్కి లోనికి వెళ్ళాలి.
కుడి పక్కన శ్రీ షణ్ముగ సన్నిధి ఉంటుంది.













ప్రాకారపు గోడలో  కొలువైన శ్రీ ధర్మశాస్త అరుదైన ప్రత్యేక భంగిమలో ఉపస్థితులై దర్శనమిస్తారు. 
ఆయనకు ఇరువైపులా పూర్ణ మరియు పుష్కలా దేవేరులు స్థానక భంగిమలో కొలువుతీరి దర్శనమిస్తారు. 




















ఆలయం లోనికి ప్రవేశించగానే కుడి పక్కన కనిపించే ఇష్ట సిద్ది పుష్కరణి నీరు ఎంతో   స్వచ్ఛంగా ఉంటుంది. తమిళనాడులోని అన్ని ఆలయాలకు ఒక పుష్కరణి అన్నా ఉంటుంది. ఇంత శుభ్రంగా ఉండే కోనేరు  దాదాపుగా అరుదు. కోనేటికి  నాలుగు పక్కలా ధర్మ, కామ, అర్థ మరియు మోక్ష సిద్దేశ్వర స్వామిగా పిలవబడే కైలాసనాధుని ఆలయాలు ఉంటాయి. ఒకపక్కన లెక్కలేనన్ని నాగ ప్రతిష్టలు వట వృక్షం క్రింద ప్రతిష్టించబడి ఉంటాయి. సంతానాన్ని ఆకాంక్షించే దంపతులు నాగప్రతిష్ఠ చేయడం తమిళనాడులో ఒక పురాతన ఆచారం. మన రాష్ట్రంలో కూడా ఈ ఆచారం ఉన్నది.














ప్రతి నిత్యం స్థానిక దూర ప్రాంత భక్తులతో కళకళలాడే ఆలయం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సౌలభ్యం కొరకు తెరచి ఉంటుంది. ప్రతి నిత్యం నియమంగా ఆరు పూజలు నిర్వహిస్తారు. ప్రతి నెల విశేష ఉత్సవాలు, చైత్ర మాసంలో బ్రహ్మోత్సవాలు జరుపుతారు.
పౌర్ణమి కి, అమావాస్యకి, త్రయోదశికి, సోమవారాలు విశేష అభిషేకాలు చేస్తారు. కార్తీక మాసంలో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది.











కంచి బస్సు స్టాండ్  నుండి కంచి మఠం మీదగా శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఉంటుందీ ఆలయం. నగర నడి  మధ్యలో ఉన్నా  ప్రశాంత వాతావరణం మరియు శుచి శుభ్రతలతో  ఆకట్టుకొంటుంది శ్రీ కచ్చభేశ్వర ఆలయం. కంచిలో తప్పక సందర్శించవలసిన ఆలయాలలో ఇదొకటి. 

నమః శివాయ !!!


Sri Ekambareswara Swamy Temple, Kanchipuram

                   శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం, కాంచీపురం 

దక్షిణ భారత దేశంలో ప్రసిద్ధి చెందిన పంచ భూత ఆలయాలలో కాంచీపురం లోని శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం ఒకటి. 
భూమి, నీరు, నిప్పు, ఆకాశం, వాయువు కి ప్రతి రూపాలుగా సర్వేశ్వరుడు చిదంబరం, తిరువణ్ణామలై, జంబుకేశ్వరం, శ్రీ కాళహస్తి మరియు కాంచీపురాలలో పూజలందుకొంటున్నారు. 
కంచి లోనిది పృద్వీ (భూమి)కి ప్రతిరూపం. సైకత లింగం. 
ఏంతో  విశేషమైన పురాణ గాధ మరియు చారిత్రక నేపథ్యం గలిగిన శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయం శివ కంచి లో ప్రధాన ఆలయంగా పరిగణిస్తారు. 







క్రీస్తు శకం ఆరో శతాబ్దం నుండి భక్త జనుల పూజలు అందుకొంటున్న శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఇక్కడ కొలువుతీరడం వెనకున్న పురాణ గాధ  సత్య యుగం నాటిదిగా తెలుస్తోంది.
ఒకనాడు ఇష్టోక్తులు సలుపుతున్న సమయంలో పార్వతి దేవి సరదాగా సదాశివుని రెండు కళ్ళను తన చేతులతో మూసివేసినదట. లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యచంద్రులైన ఆ నేత్రాలను మూయడం వలన అంతటా అంధకారం అలముకొన్నదట. చిలిపిచేష్ట అయినా లోకాలకు హాని చేసేది కావడం వలన మహేశ్వరుడు ఆమెను చీకటి తో సమానమైన నల్లని శరీరవర్ణం ధరించి  భూలోకంలో శరీర ఛాయ  తిరిగి గత వర్ణం సంతరించుకొనేవరకూ తపము ఆచరించమని ఆదేశించారట.






అలా తాను తెలియక చేసిన పొరబాటు కారణంగా పరమాత్మకు దూరం అయిన లోకపావని తిరిగి కైలాసం తొందరగా చేరుకోవాలన్న ఆశయంతో వేగావతి నదీ తీరాన మామిడి వనంలో ఒక సైకత లింగాన్ని ఏర్పాటు చేసుకొని తదేక దీక్షతో తపస్సు చేయసాగినది.
ఆమె ఏకాగ్రతను భగ్నం చేసి ఆమె యొక్క భక్తిని పరీక్షించడానికి ప్రచండ జ్వాలలతో కూడిన అగ్నిని పంపారట పరమ శివుడు. ఈ ఆపద నుండి కాపాడమని సోదరుడైన శ్రీ మహా విష్ణువును ప్రార్ధించారట అమ్మవారు. అంతట శ్రీ హరి చంద్ర కిరణాలను ప్రసరింపచేసి అగ్ని భాధ నుండి సోదరిని రక్షించారు.
ఈ కారణం చేతనే ఈ ఆలయంలో వైకుంఠ వాసుడు "నీలతింగళ్ తూండం పెరుమాళ్"అన్న పేరుతొ పూజలందుకొంటుంటారు. ఇది ఒక శ్రీ వైష్ణవ దివ్యదేశం.
ఒక శివాలయంలో నెలకొన్న దివ్య దేశం ఇదొక్కటే ! 









మరోసారి అమ్మవారి భక్తిని పరీక్షించడానికి ఉదృతంగా ప్రవహించమని  ఆదేశించారట గంగాధరుడు.
అమిత వేగంతో వస్తున్న నీటి ప్రవాహంలో ఇసుకతో చేసిన లింగానికి ఏమి జరుగుతుందో అన్న ఆతుర్దాతో ఆలింగనం చేసుకొన్నా అమ్మవారు గంగా ప్రవాహంతో తామిద్దరూ అక్కచెల్లము కదా నా దీక్ష భగ్నం చేయడం తగునా అని ప్రశ్నించగా అక్క మీద అభిమానంతో తన ప్రవాహాన్ని తగ్గించుకొని మార్గం మరల్చుకొన్నాదట వేగావతి.
అంతట ఆమె భక్తికి సంతసించిన సర్వేశ్వరుడు ఆమెకు అర్ధ భాగాన్ని ఇచ్చి అర్ధాంగిని చేసుకున్నారట.
ఇలా అమ్మవారి కౌగిలిలో ఉన్న స్వామి కనుక "తళువ కుళైన్తార్ "అని కూడా పిలుస్తారు.
మామిడి చెట్టు క్రింద వెలసిన స్వామిగా ఏకాంబరేశ్వరుడు అన్న పేరుతొ పిలవబడుతున్నారు.


 







సుమారు నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయ సముదాయం భారత దేశం లోని అతి పెద్ద ఆలయ సముదాయాలలో ఒకటిగా పేరొందినది.
క్రీస్తుపూర్వం ఆరో శతాబ్ద కాలంలో పల్లవ రాజులు శిధిలమైన ఆలయ స్థానంలో మరో గర్భాలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. తదనంతర కాలంలో చోళ, పాండ్య, విజయనగర, నాయక రాజులు మిగిలిన నిర్మాణాలను నిర్మించి తమ వంతు కైంకర్యాలను సమర్పించుకొని శ్రీ ఏకాంబరేశ్వరుని కృపకు పాత్రులైనట్లుగా శాసనాలు తెలియచేస్తున్నాయి.
ఆలయ దక్షిణ దిశలో ఉన్న రాజగోపురం తమిళనాడు లోని అతి ఎత్తైన రాజా గోపురాలతో ఒకటిగా పేరొందినది.  దీనిని విజయనగర చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు నిర్మించారు.
అదే విధంగా రమణీయ శిల్పాలతో నిండిన వెయ్యి కాళ్ళ మండపము కూడా ఆయన కాలంలోనే నిర్మించారు.
విజయనగర శిల్ప శైలిని ప్రదర్శించే స్తంభాలు కడు  రమణీయంగా ఉంటాయి.


















ఆలయ వృక్షం మామిడి చెట్టు. ఆలయ వెనుక భాగంలో ఉంటుంది. అమ్మవారి ఇక్కడే తపమాచరించినట్లుగా చెబుతారు. ఈ వృక్షం వయస్సు 3500 సంవత్సరాల పైచిలుకని, ఒక్కో దిక్కు కు ఉన్న ఒక్క శాఖా ఒకో రకమైన ఫలాన్ని కాస్తాయని చెబుతారు.
















ప్రతినిత్యం ఆరు  పూజలు జరిగే ఈ ఆలయం ఉదయ ఐదు గంటల నుండి పన్నెండున్నర వరకు తిరిగి  సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు భక్తుల దర్శనార్ధం తెరిచి వుంటుంది. గాయక శివ భక్తులైన అరవై మూడు మంది నయమ్మారులలో ప్రముఖులైన సంబంధార్, అప్పార్, సుందరార్, తమ తేవారాలలో శ్రీ ఏకాబరేశ్వరుని కీర్తించారు.
ఈ కారణం చేత ఈ ఆలయం రెండువందల డెబ్బై ఆరు పాదాల పెట్ర స్థలాల్లో ప్రముఖమైనదిగా పేరొందినది.
శ్రీ ఏకాంబరేశ్వర ఆలయంలో ప్రతినిత్యం ఒక పర్వదినమే !
ప్రతి మాసంలో విశేష పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు. కార్తీక మాసంలో ప్రత్యేక పూజలు ఉంటాయి.
సైకత లింగం కావడాన ప్రధాన లింగానికి అభిషేకాలు జరిపారు. మంగళవాయిద్యాల నడుమ వేదమంత్రాలతో పుష్ప పత్రార్చన చేస్తారు.
మరో విశేషం ఏమిటంటే ఇక్కడ అమ్మవారి ఆలయం ఉండదు. పక్కన ఉన్న శ్రీ కామాక్షీ దేవి ఆలయమే అమ్మవారి సన్నిధి. 
ఒకప్పుడు వెయ్యికి పైగా ఆలయాలు ఉన్న కాంచీపురంలో ప్రస్తుతం  వాటిల్లో శ్రీ ఏకాంబరేశ్వర స్వామి, శ్రీ కామాక్షీ దేవి మరియు శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయాలు ప్రముఖమైనవి. ప్రస్తుతం శివ మరియు విష్ణు కాంచీలలో ఉన్న సుమారు యాభై ఆలయాలు అన్ని దర్శనీయమైనవే!








ఎన్నో ఉపాలయాలతో నిండి ఉన్న శ్రీ ఏకాంబరేశ్వర ఆలయం సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పేర్కొనబడిన కాంచీపురం లోని శివ కంచి లో ప్రధాన ఆలయం.
చెన్నై నుండి విస్తారమైన రవాణా సౌకర్యం కలదు. మన రాష్ట్రం లోని తిరుపతి నుండి నేరుగా బస్సు, రైలు మార్గాలలో కంచి చేరుకోవచ్చును.
ఉండటానికి అందుబాటు ధరలలో లాడ్జీలు లభిస్తాయి.
చక్కని భోజన సదుపాయాలూ లభిస్తాయి.
కంచి పట్టు చీరలకు ప్రసిద్ధి. దేశం నలుమూలల నుండి వ్యాపారులు ఇక్కడికి వస్తుంటారు. శివ విష్ణు కంచి లను కలిపే ప్రధాన రహదారిలో ఎన్నో వస్త్ర దుకాణాలు ఉంటాయి యాత్రీకులను ఆకర్షిస్తాయి.





నమః శివాయ!!!!

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...