28, సెప్టెంబర్ 2016, బుధవారం

Sri Kanaka Durga Devi Temple, Vijayawada


                   శ్రీ కనకదుర్గ ఆలయం, ఇంద్రకీలాద్రీ, విజయవాడ  

అమ్మలగన్న అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని సమస్త భక్తలోకం ఎలుగెత్తి కీర్తించే తల్లి ఇంద్రకీలాద్రి మీద కొలువైన శ్రీ కనక దుర్గమ్మ !
యుగాల క్రిందట భక్తుని కోరిక మేరకు, శిష్టరక్షణార్ధం, దుష్ట శిక్షణార్ధం దుర్గమ్మ వెలసిన విజయవాడ, పక్కన గలగలా పారే కృష్ణమ్మ ఎన్నో పురాణ గాధలను తెలుపుతాయి.  





కీలుడనే పర్వత రాజు అమ్మవారి భక్తుడు. జగన్మాత తన హృదయ కుహరంలో కొలువు తీరాలన్నఏకైక కోరికతో తపస్సు చేసాడు. సంతుష్టురాలైన జగదాంబ సాక్షాత్కారం ప్రసాదించి తొందరలోనే కలియుగాంతం వరకు ఇక్కడ నివాసముంటానని  వరము అనుగ్రహించింది.
అనంతర కాలంలో లోకకంటకుడైన దుర్గమాసురుని సంహరించిన దేవి ఈ పర్వతం మీద స్వయంవ్యక్తగా ప్రకటితమయ్యారు. అసురుని భాధ తొలగిన ఆనందంతో ఇంద్రుడు మిగిలిన దేవతలతో కలిసి పవిత్ర కృష్ణవేణిలో స్నానమాచరించి దుర్గంబను సేవించుకొన్నారు.





ఈ కారణంగాపర్వతకుని పేరు  ప్రధమ పూజ చేసిన ఇంద్రుని పేరు కలిసి  ఈ శిఖరం "ఇంద్ర కీలాద్రి "గా  జగత్ప్రసిద్దం అయ్యింది. దుర్గాదేవి ఇక్కడ శుంభ నిశుంభులను అంతంచేయడం వలన ఈ క్షేత్రానికి జయవాడ అన్న పేరు వచ్చినది. 







పాండవ మధ్యముడైన పార్ధుడు ఇదే ప్రదేశంలో పరమేశ్వరుని మెప్పించి పాశుపతాస్త్రం పొందినందున "ఫల్గుణ క్షేత్రం" అని "విజయపురి" అన్న నామాలను కూడా పొందినది. కాలక్రమంలో బెజవాడ గా మారి చివరకు విజయాలకు నిలయమైన విజయవాడగా  స్థిరపడినది.
అర్జనునితో పోరాటం సల్పిన పరమేశ్వరుని దేవతలు అమ్మవారితో పాటు ఇక్కడే కొలువు తీరమని అభ్యర్ధించారు. వారి కోరిక మేరకు లింగరూపంలో వెలసిన స్వామిని మల్లెలతో పూజించడం వలన శ్రీ మల్లిఖార్జును నిగా కైలాసనాధుడు భక్తులను అనుగ్రహిస్తున్నారు.






నిత్య కళ్యాణం పచ్చతోరణంగా వేలాది భక్తుల ప్రార్థనలతో, పూజలతో కళకళలాడే శ్రీ కనక దుర్గమ్మ నివాసమైన ఇంద్రకీలాద్రి వైభోగం నవరాత్రులలో అంబరాన్ని అంటుతుంది.
శుక్ల పాడ్యమి నాడు హిమగిరి సుత  పార్వతి ని శైలపుత్రిగా, విదియనాడు బ్రహ్మచారిణిగా, తృతీయ నాడు చంద్ర ఘంట గా, చతుర్థి నాడు కూష్మాండ, పంచమినాడు స్కంద మాత, షష్టి నాడు కాత్యాయనిగా, సప్తమి తిధిన కాళరాత్రి, అష్టమి నాడు మహా గౌరీ, నవమినాడు సిద్ది దుర్గగా కొలువుతీరి జగన్మాతను నవదుర్గలుగా ఆరాధిస్తారు.  








దసరాలలో మొదటి రోజున శ్రీదుర్గ గా అలరించిన అమ్మ మలి రోజున శ్రీ బాలాత్రిపుర  సుందరిగా,మూడో రోజున శ్రీ గాయత్రి దేవిగా, నాలుగో రోజున శ్రీ అన్నపూర్ణా దేవిగా, అయిదో నాడు శ్రీ లలితా త్రిపుర సుందరిగా, ఆరో నాడు చదువుల తల్లి శ్రీ సరస్వతీ దేవిగా దర్శనం ప్రసాదిస్తుంది.
సకల సంపదలను ప్రసాదించే కల్పవల్లి శ్రీ లక్ష్మీ దేవిగా ఏడో నాడు శ్రీ దుర్గాదేవిగా ఎనిమిదో రోజున, లోకకంటకులను దురుమాడిన శ్రీ మహిషాసుర మర్దినిగా తొమ్మిదో రోజున , చివరి రోజు  అయిన దశమి నాడు  భక్తుల కొంగు బంగారమైన "అపరాజిత" గా  "శ్రీ రాజ రాజేశ్వరీ దేవి" రూపంలో భక్తుల మనోభీష్టాలను నెరవేరుస్తుంది.
దశ విధ రూపాలలో లోకపావని దర్శనార్ధం దేశం నలుమూలల నుండి లక్షలాదిగా భక్తులు విజయవాడ తరలివస్తారు.






నిత్యం ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నిరంతరాయంగా భక్తుల సౌలభ్యం కొరకు ఆలయం తెరిచే ఉంటుంది.
ఎన్నో పూజలు, అలంకారాలు, అర్చనలు శాస్త్ర ప్రకారం శ్రీ కనక దుర్గా సమేత  శ్రీ మల్లిఖార్జున స్వామికి జరుపుతారు.  అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
విజయవాడ కనకదుర్గమ్మ సందర్శనార్ధం వచ్చే వారికి అదనపు అదృష్టం కృష్ణా నదిలో స్నానం. భూలోకంలో ప్రజలు తమ పాపాలను ప్రక్షాళన చేసుకోడానికి శ్రీ మహావిష్ణువు కృష్ణా నదిని సృష్టించారు. కానీ ఆ నదిని ఎక్కడ ఉంచాలని అన్న ప్రశ్న తలెత్తినది. పవిత్రమైన జలప్రవాహము ఉత్క్రుష్టమైన  స్థలం నుండి ఆవిర్భవించడం ఉచితమని భావించిన దేవతలు స్థలాన్వేషణ ప్రారంభించారు.






అప్పుడు వారికి పర్వత రూపంలో శ్రీ హరి సాక్షాత్కారం అపేక్షిస్తూ తపస్సు చేస్తున్న సహ్య మహా ముని కనిపించారు. అంతట వైకుంఠ వాసుడు ఆయనకు దర్శనం అనుగ్రహించి పుణ్యప్రదమైన కృష్ణను ఆ పర్వతం నుండి ఆవిర్భవించ దానికి అనుమతిని అడిగారు. ఆనందభరితుడైన మహాముని ఆజ్ఞను శిరసావహించాడు.
అంతట గదాధరుడు శ్వేత అశ్వద్ధ రూపం ధరించారు. మహర్షి కోరిక మేరకు గంగాధరుడు ఆమ్ల వృక్షం గా వెలిసారు.
శ్వేతాశ్వద్ధ నుండి కృష ప్రవాహం, ఉసిరి చెట్టు నుండి వేణి ప్రవాహం ఉద్భవించి  రెండూ కలిసి కృష్ణవేణిగా మారి లోక సంరక్షనిగా భూమండలాన్ని సస్యశ్యామలం చేస్తోంది.
హరిహరులు నుండి ఆవిర్భవించిన కృష్ణవేణిలో స్నానం సకల పాపహరణం, ఆరోగ్యదాయకం, పుణ్యప్రదం.
ఈ నదిలో స్నానమాచరించి ఇంద్రకీలాద్రి మీద కొలువుతీరిన శ్రీ మల్లిఖార్జున స్వామిని శ్రీ  దుర్గమ్మను సేవించుకొంటే  ఇహపర సుఖాలను పొందగలరు  అన్నది పురాణ వాక్యం.




సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే  

శరణ్యే త్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే !!!!


27, సెప్టెంబర్ 2016, మంగళవారం

Naulakha Mandir, Begusarai

                               నవలాఖా మందిర్, బెగుసరాయ్ 



గణపతి ఆలయం, అమ్మవారి గుడి, శివాలయం లేదా శ్రీ కృష్ణాలయం ఇలా నే మనం మనకు తెలిసినా  లేదా సందర్శించిన ఆలయాలను ఉదహరిస్తాము.  కానీ ఆ నిర్మాణానికి అయిన ధనం విలువతో ఆలయాన్ని పిలవడము చేయం. అయితే అలా నిర్మాణానికి పెట్టిన రూపాయల విలువతో పేర్కొనే రెండు ఆలయాలు మన దేశంలో ఉన్నాయి. ఒకటి ఝార్ఖండ్ రాష్ట్రంలోని దేవగఢ్ లో ఒకటి రెండవది బీహార్ రాష్ట్రం లోని బెగుసరాయ్ లో.









ఈ మధ్య ఉద్యోగరీత్యా బీహార్ రాష్ట్రంలో పర్యటించాల్సి వచ్చినప్పుడు బెగుసరాయ్ వెళ్లాను. అక్కడ శ్రీ సీతారామ లక్ష్మణ మందిరం ఒకటి ఉందని దానిని నవలాఖా మందిర్ అని పిలుస్తారు అని తెలిసింది.పనంతా పూర్తి అయిన తరువాత సాయంత్రం మందిరం చూడటానికి మా స్థానిక సహోద్యోగిని తో కలిసి వెళ్లాను.బస్ స్టాండ్ లేదా రైల్వే స్టేషన్ నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో విష్ణు పూర్ అన్న ప్రాంతంలో ఉన్న ఈ మందిరానికి చేరుకోడానికి ఆటోలు దొరుకుతాయి.








1853వ సంవత్సరంలో సంత్ శ్రీ మహావీర్ దాస్ జీ ఈ మందిరాన్ని నిర్మించారు అని తెలుస్తోంది. ప్రస్తుతం వారి మఠం ఆధ్వర్యం లోనే మందిర కార్యకలాపాలు జరుగుతున్నాయి.
శిథిలావస్థకు చేరుకొన్న ప్రధాన ద్వారం విశాల ప్రాంగణం లోనికి దారి తీస్తుంది. విచారకరమైన విషయం ఏమిటంటే నిర్మాణాలను పరిరక్షించడానికి ఎవరూ ఇక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం లేదు. కనీసం మరమత్తులు కూడా జరపడం లేదు.
కనీసం అడ్డదిడ్డంగా పెరిగి మందిర సౌందర్యాన్ని కనపడకుండా చేస్తున్నచెట్లను, మొక్కలను సరి చేసే ప్రయత్నాలు కూడా లేవు.








విశాల ప్రాంగణం లోనికి వెళ్ళగానే ఎదురుగా గుబురుగా పెరిగిన వృక్షాలు, మొక్కల మధ్య ఆకాశాన్ని తాకుతోంది అనిపించే మందిర విమాన గోపురం దానికి  నాలుగు వైపులా సుందర గుమ్మటాలు కనిపిస్తాయి.








ఆ రోజులలో ఈ నిర్మాణానికి తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేశారట. అందుకని స్థానిక యాసలో "నవలాఖ మందిరం'గా పిలుస్తున్నారు. సుమారు నూట యాభై సంవత్సరాల క్రిందట తొమ్మిది లక్షలు అయ్యాయంటే మారిన పరిస్థితుల ప్రకారం నేడు ఎంత అవుతుంది ???
ముఖ మండప పైభాగాన నిర్మాణ వివరాలను తెలిపే ఫలకాన్ని ఉంచారు. దానికి అలంకరణ గా ఏర్పాటు చేసిన మయూరాలు, లతలు, పుష్పాలు సహజ వర్ణాలతో ఆకట్టుకొంటాయి.











ప్రధాన విమాన గోపురం బాగున్నా పక్కన ఉన్న గుమ్మటాలు మాత్రం కొంత మేర నెర్రెలు వచ్చి తగిన మర్మత్తుల కొరకు ఎదురు చూస్తున్నాయి. కళాత్మకంగా  చెక్కబడిన విమాన గోపురం పైన కలశం దానికి ఇరుపక్కలా శ్రీ ఆంజనేయ మరియు శ్రీ గరుత్మంత మూర్తులను చెక్కారు. ఉత్తరాదిన సహజంగా గోపుర పైభాగాన కనిపించే ధ్వజం ఇక్కడ కనపడదు.
అదే విధంగా దక్షిణాదిన కనిపించే ధ్వజస్థంభం, బలి పీఠం  ఇక్కడ కనపడవు.









గర్భాలయానికి పైన చుట్టూ రామాయణ ఘట్టాలను తెలిపే సుందర వర్ణ చిత్రాలను నిలిపారు. వీటిల్లోభూజాత  భూదేవి ఒడిని చేరడం, శబరి చేతి నుండి ఎంగిలి ఫలాలను శ్రీ రాముడు స్వీకరించడం లాంటి అరుదైన చిత్రాలు ఆకట్టుకొంటాయి.













అన్నిటికన్నా ఆకర్షణీయమైనది పైకప్పును తీర్చిదిద్దిన విధానం. విలువైన రాళ్ళతోనో, ఖరీదైన అద్దాలతోనో నిర్మించారు అనిపిస్తుంది. కానీ అవి ఒక విధమైన రాళ్లు( మకరాణా  మార్బల్స్) మాత్రమే. దీపపు కాంతులను స్వీకరించిన  పైకప్పు రాళ్లు తిరిగి వెదజల్లే కాంతి అద్భుతంగా ఉంటుంది.











మండపం లో ఒకపక్క శ్రీ హనుమంతుడు మరో పక్క శ్రీ వినతాసుతుని  పాలరాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు.
గర్భాలయం లో ఎత్తైన గద్దె మీద మూలవిరాట్టులైన సీతారామ లక్ష్మణులు పీతాంబర ధారులై సుందర అలంకరణలో దర్శన మిస్తారు. గమనించదగిన అంశం ఏమిటంటే దశరధ నందానులు ధనుర్భాణాలు ధరించి ఉండరు.
అదే విధిగా సతతం రామ పాదాల వద్ద ఉండే శ్రీ రామదూత కూడా కనిపించరు.











వాయునందనునికి ఈ మందిరం ఎదురుగా నిర్మించిన మరో మందిరం నిర్మించారు. ఇక్కడ స్వామి పంచముఖాలతో ప్రసన్న మూర్తిగా కనిపిస్తారు.నిత్యం నియమంగా పూజాదికాలు నిర్వహిస్తారు. సాయంకాలాల్లో భజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీరామ నవమి, హనుమద్జ్జయంతి పర్వదినాలలో వేలాదిగా భక్తులు తరలివస్తారు,














బెగుసరాయ్ లో  రైల్వే స్టేషన్ ఉన్న అన్ని రైళ్లు అక్కడ ఆగవు. దగ్గరలో ఉన్న రైల్వే కూడలి "బరోని". దేశం లోని అన్ని ప్రాంతాల నుండి బరోని కి రైళ్లు ఉన్నాయి. స్థానికంగా ఉండటానికి వసతి గృహాలు ( హోటల్స్) ఉన్నాయి. 
సరి అయిన ప్రచారం, నిర్వహణ ఉంటే సందర్శకులను అమితంగా ఆకర్షించ దగిన విశేషాలు గలది నవలాఖా మందిరం బెగుసరాయ్. 

జై శ్రీ రామ్ !!!!! 


Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...