21, సెప్టెంబర్ 2017, గురువారం

Anegondi

                         నాటి కిష్కిందే .... నేటి అనెగొంది ...





చరిత్ర లోతుల లోనికి వెళితే ఎన్నో అద్భుతాలను వీక్షించవచ్చును. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలలో చారిత్రిక స్థలాలే  ఎక్కువగా  పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి.
గత తరాల పాలకుల గురించి, వారి పాలన గురించి, నాటి ప్రజల జీవన విధానాలు, స్థితిగతుల  గురించి తెలుపుతాయి ఈ స్థలాలు. చరిత్ర పట్ల ఆసక్తి గల వారికి ఇవి అక్షయ పాత్రలు. 
మిగిలిన దేశాలకు మన దేశానికి ఈ విషయంలో ఉన్న ఒక చిత్రమైన తేడా ఏమిటంటే మన దగ్గర చారిత్రక ప్రదేశాలు చరిత్రతో పాటు  విశేష పౌరాణిక నేపథ్యం మరియు ఊహకు అందని శిల్పచాతుర్యం కలిగి ఉండటం !!
                                                                                              
అంజనాద్రి 









అంజనాదేవి 




రామసేతు శిల 







కోణార్క, అజంతా,ఎల్లోరా, నాగార్జున కొండ, అమరావతి, గయ,  ఇవన్నీ ఆ కోవకు చెందినవే !
అలాంటి వాటిల్లో  అనెగొంది కూడా ఒకటి.
ఒకప్పుడు ఎంతో వైభవానికి చిరునామాగా ఉండి ప్రస్తుతం ఒక శిధిల నగరంగా మిగిలిన హంపికి పక్కనే ప్రవహించే తుంగభద్రా నదికి ఉత్తరం పక్కన ఉన్న పురాతన ప్రశాంత పల్లె అనెగొంది. విజయనగరాన్ని పాలించిన రాజులకు హంపి కన్నా ముందు రాజధాని అనెగొంది. అనె అంటే కన్నడంలో ఏనుగు. విజయనగర రాజులు తమ గజ సైన్యాన్ని ఇక్కడ ఉంచడం వలన ఏనుగుల కొష్టం అన్న అర్ధంలో అనెగొందిగా పిలవబడుతోంది.
























ఈ ప్రాంతము  అశోక చక్రవర్తి పాలనలో ఉన్నట్లుగా పురాతన గ్రంధాలలో పేర్కొనబడినది. శాతవాహనులు, చాళుక్యులు,కాదంబులు, రాష్ట్రకూటులు, విజయనగరరాజులు, ఢిల్లీ మరియు  బహమనీ సుల్తానులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా శాసనాధారాలు లభించాయి.
అనెగొంది పరిసర ప్రాంతాలలో చరిత్ర కారులు జరిపిన త్రవ్వకాలలో  శిలా యుగం నాటి రాతి మరియు లోహ పరికరాలు, పనిముట్లు లభించాయి. అదేవిధంగా అనెగొందికి సమీపం లోని రాతి గుహలలో ఆది మానవులు యెర్ర రంగుతో రాతి మీద  చిత్రించిన పశువుల, సూర్య చంద్రుల, మానవ రూపాలను చూడవచ్చును. దీనికి ఈ ప్రాంతం మీద  పూర్తి అవగాహన గల మార్గదర్శి అవసరం. అనెగొందికి పది నుండి పదిహే కిలోమీటర్ల దూరం లో రాతి యుగం నాటి సమాధులు కూడా ఉన్నాయని చెబుతారు.


























లభించిన శిధిల నిర్మాణాలు, పరికరాలు, వస్తువులు,పురాతన గ్రంధాలు  మొదలైన వాటి ఆధారంతో  శాస్త్రవేత్తలు సుమారు నాలుగు బిలియన్ల (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) సంవత్సరాల నుండి ఇక్కడ జనావాసాలు ఉన్నాయని  తేల్చి చెప్పారు.వీటిల్లో రాతి యుగం, కొత్త రాతి యుగం,అధునాతన జీవన విధానం ఇలా అన్ని రకాల నాగరికత వర్ధిల్లినట్లుగా తెలిపారు. ఇక్కడ ఉన్న రాతి గుహలు,వాటిల్లోని చిత్రాలు మరియు సమాధులు కొత్త రాతి యుగానికి చెందినవిగా తేల్చారు.
పరిశోధనలు పురోగమిస్తే పాత శిధిలాల నుండి మరెన్నో కొత్త విషయాలు వెలుగు లోనికి రావచ్చును.


















ఇక పౌరాణిక విశేషాల గురించి మాట్లాడుకొంటే, వాల్మీకి మహర్షి రామాయణ మహా కావ్యంలో  ఉదహరించిన మాతంగ,  ఋష్యమూక, హేమకూట మరియు అంజనాద్రి పర్వతాలు, శ్రీ రాముడు భక్త శబరిని కలిసిన పంపా సరోవరం అన్నీ ఇక్కడ కనపడతాయి. వాలి మాయావి అనే అసురుని సంహరించిన గుహ, అన్నకు భయపడి సుగ్రీవుడు మాతంగ పర్వత పాదాల వద్ద  నివాసమున్న సుగ్రీవ గుహ కూడా ఉన్నాయి.  ఇదే కిష్కింద అన్నదానికి బలం చేకూరుస్తున్నాయి.
సంతానం కోసం అంజనాదేవి తపస్సు చేసి వాయునందనుని పొందినది ఇక్కడి అంజనాద్రి మీదే!  దీనికి గుర్తుగా శిఖరాన హనుమంతుని, అంజనాదేవి మరియు సీతా రామ లక్ష్మణ ఆలయాలు ఉంటాయి. కొండ పైకి చేరుకోడానికి 575  సోపానాలతో  మార్గం కలదు. ఈ ప్రాంతాలలో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చే ఆధ్యాత్మిక స్థలం.
















అంజనాద్రి పర్వతానికి కొద్ది దూరంలో కొండల మధ్య సుందర ప్రశాంత వాతావరణంలో ఉన్న పంపా పుష్కరణి ఒడ్డునే దశరధ తనయులు  భక్త శబరీని  కలిసి ఆమె  పెట్టిన ఎంగిలి పళ్ళను తిన్నది. కోనేరు ఒడ్డున శ్రీ మహాలక్ష్మి ఆలయం ఉంటుంది. విజయనగర రాజులు నియమంగా ఈ దేవిని కొలిచేవారట.
భాగవత పురాణం ప్రకారం పంచ పుష్కరుణులలో స్నానమాచరించడం పరమ పవిత్రం అని తెలుస్తోంది. అవి మానససరోవరం(కైలాస పర్వతం), బిందు సరోవరం (గుజరాత్), నారాయణ సరోవరం (గుజరాత్), పుష్కర సరోవరం (రాజస్థాన్) మరియు పంపా సరోవరం(కర్ణాటక,హంపి).
మరో గాధ ప్రకారం పంపా దేవి పార్వతీ దేవి అంశ. ఆమె ఇక్కడ తపమాచరించి సదాశివుని పతిగా పొందినది. హంపి శ్రీ విరూపాక్ష ఆలయం లోని ఒక ఉపాలయంలో శ్రీ పంపా దేవి కొలువుతీరి ఉంటారు.






ఎవరీ బాహుబలి ?









విరూపరూప గద్దె నుండి  అంజనాద్రి మీదగా  అనెగొంది గ్రామానికి వెళ్లే దారిలో పంపా సరోవరం దాటిన తరువాత శ్రీ దుర్గాదేవి ఆలయం వస్తుంది. ఋష్యమూక పర్వత పాదాల వద్ద ఈ ఆలయం నిర్మించారు. విజయనగర రాజులు దండయాత్ర లకు తరలి వెళ్లే ముందు ఈ దేవిని కొలిచి బయలుదేరేవారట. నేటికీ భక్తులు తమ కోర్కెలు అమ్మకు నివేదించుకొని ఇక్కడి చెట్టుకు కొబ్బరి కాయ కడతారు. అలా చేస్తే తమ కోర్కెలు నెరవేరతాయన్నది వారి నమ్మకం. ప్రాంగణంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉంటుంది. ఈ కోవెల వెనక పక్క అనెగొంది కోట ఉంటుంది. అందులో  వినాయక ఆలయం, నక్షత్ర మరియు రాశీ వృక్షాల వనం, కోనేరు,  వాలి గుహ ఉంటాయి.
దుంధిబి తనయుడు మాయావి అనేవాడు తన తండ్రిని చంపిన వాలి మీద పగతో అతనిని రెచ్చగొట్టాడు. కానీ వానర వీరుని  బలం ముందు ఆగలేక పారి పోయి ఒక గుహ లోనికి వెళ్ళాడు. వాలి తన తమ్ముడు సుగ్రీవుని బయట కాపలా ఉంచి తాను మాయావిని వెదుకుతూ లోపలి వెళ్ళాడు.





















రోజులు గడుస్తున్నా అన్న తిరిగి రాక పోవడంతో చనిపోయాడని తలంచిన సుగ్రీవుడు ఆ బిలానికి అడ్డంగా ఒక పెద్ద రాతిని ఉంచి వెళ్ళిపోయాడు. వాలి తిరిగి రావడం, సుగ్రీవుని ద్రోహిగా తలంచి రాజ్యం నుండి వెళ్లగొట్టడం అదంతా తరువాత కద. వాలి మాయావిని  చంపిన గుహ ఇదే అని చెబుతారు.
శిధిల కోట ద్వారం దాటి నేర్పరులైన అయిన శిల్పులెవరో పేర్చినట్లుగా కొండరాళ్ళు గుట్టలు గుట్టలుగా ఉండే మార్గంలో ఋష్యమూక పర్వతాగ్రభాగం చేరుకొంటే చుట్టూ ఎత్తుగా ఉన్న కొండలు, మధ్యలో పచ్చని పొలాలు, వాటన్నిటినీ చుడుతూ గలగలా పారే తుంగభద్రా నది.  ప్రకృతి సుందర రూపాన్ని సంపూర్ణంగా కన్నుల పండుగగా వీక్షించే అద్భుత అవకాశం. కొండ పైన ఉన్న గుర్తుల ప్రకారం  చివర దాకా నడిస్తే క్రింద ఉన్న గుహలోని శివ లింగాన్ని, పెద్ద పుట్టను పెద్ద పెద్ద రాళ్ళ మధ్య నుండి పాకుతూ చేరుకోవడం మరో అరుదైన అనుభవం.
రామబంటు తొలిసారిగా తన స్వామిని కలిసింది ఈ మాతంగ పర్వతం మీదనే!!





శ్రీ కృష్ణదేవరాయ సమాధి 





కోదండ రాముడు వానర రాజు వాలిని చెట్టు చాటు నుండి నేల కూల్చినది ఇక్కడకు దగ్గర లోని నింబపురం అని,ఇదే వాలి తాలూకు చితాభస్మం అని గుట్టగా కనిపించే బూడిదను చూపిస్తారు.
శ్రీ దుర్గా దేవి ఆలయాన్ని సందర్శించుకొని అనెగొంది గ్రామం వైపుకు వెళితే ఎన్నో నిర్మాణాలను చూడవచ్చును. పురాతన శ్రీ రంగనాధ స్వామి ఆలయం, రాజ భవనం అయిన గగన్ మహల్ సహా  మరెన్నో శిధిల మండపాలు, నిర్మాణాలు కనపడతాయి. తుంగభద్రా నదీ గర్భంలో  మధ్వ మతాచార్యులైన తొమ్మిది మంది గురువుల సమాధులను చూడవచ్చును. వీటిని నవ బృందావనాలు అంటారు.
ఇక్కడే ఆంద్ర భోజుడుగా ప్రసిద్ధికెక్కిన శ్రీ కృష్ణ దేవరాయల సమాధి ఉంటుంది. ఆయన అరవైనాలుగు కళల్లో నిష్ణాతుడన్న అర్ధం వచ్చేలా మండపాన్ని  అరవై నాలుగు స్తంభాలతో నిర్మించారు.
మరో ముఖ్య విశేషం ఏమిటంటే అంజనాద్రి, మాతంగ లేదా ఋష్య మూక,  పర్వతం ఏదైనా అన్ని శిఖరాల పై నుండి ఉదయాస్తమానాలను చూడటం చక్కని అనుభవం.





గగన్ మహల్ 








హంపి వైపున ఉంటుంది మాతంగ మహర్షి నివాసముండటం వలన ఆయన పేరు మీద పిలవబడే మాతంగ పర్వతం.
 దుందుభి అనే రాక్షసుని మృత దేహాన్ని విసిరేసి తన తపస్సుకు భంగం కలిగించిన వాలి ఈ  పర్వతం పైకి వస్తే మరణిస్తాడని శపించారు మాతంగ ముని.
అదే సుగ్రీవునికి రక్ష అయ్యింది.వాలి తో వైరం తలెత్తినప్పుడు ఇక్కడే తల దాచుకొన్నాడు. అది శ్రీ రామునితో స్నేహానికి దారి తీసింది. ఈ పర్వత అగ్రభాగాన వీరభద్ర స్వామి ఆలయం నిర్మించారు.
 పర్వతం వెనుక ప్రవహించే నదిలో స్నానమాచరించే  సమయంలో సుగ్రీవునికి రావణునిచే అపహరించబడి ఆకాశ మార్గాన వెళుతున్న భూజాత విడిచిన  నగలు లభించినది.
వాటిని అతను దాచిన సుగ్రీవ గుహను నేటికీ అచ్యుత రాయ నిర్మిత  శ్రీ రామాలయం వెళ్లే దారిలో చూడవచ్చును.
పంచమ వేదం వ్యాస విరచితం అయిన మహా భరతం పాండవ కనిష్ఠుడు సహదేవుడు, ధర్మరాజు చేసిన రాజసూయ యాగ సందర్బంగా ఇక్కడికి వచ్చినట్లుగా, ఈ ప్రాంత రాజులను ధర్మరాజు యొక్క సార్వభౌమత్వానికి అంగీకరింపచేసినట్లుగా  పేర్కొన్నది.
ఈ ప్రాంత రాజులు కురుక్షేత్ర మహాసంగ్రామంలో పాల్గొనట్లుగా తెలుస్తోంది.



















అనెగొంది నలుదిక్కులా పరిచినట్లుగా ఉండే  లెక్కలేనన్ని శిధిల నిర్మాణాలు మమ్ములను   కూడా అర్ధం చేసుకోండి అని మూగగా ప్రార్ధిస్తున్నట్లుగా కనపడతాయి. 
 హంపిలో శ్రీ విరూపాక్ష ఆలయం, ఆలయం పక్కనే ఉన్న హెమకూట పర్వతం మీది జైన ఇతర ఆలయాలు, ఊరి లోని కృష్ణాలయం, వీరభద్ర ఆలయం, కమలమహల్, గజశాల, విజయ విఠలాలయం,  బాడవ లింగం, మహానవమి గద్దె, నల్లరాతి మెట్ల కోనేరు, హజార రామ ఆలయం, స్నానశాల ఇలా ఎనభై నాలుగు విశిష్ట నిర్మాణాలను సందర్శించుకొనవచ్చును. ఇవన్నీ నాటి విజయనగర వైభావాన్ని తమ విషణ్ణ రూపాలతో తెలియజేస్తాయి. 
 శ్రీ విరూపాక్ష ఆలయం వెనక ఉన్న శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా పీఠం కూడా తప్పక సందర్శించవలసినదే !!!
శాస్త్రవేత్తలు,చరిత్రకారులు, గ్రంధాలు మరియు పురాణాలు ఏకాభిప్రాయంతో  ప్రస్తుతించిన ఏకైక ప్రదేశం అయిన అనెగొంది  సందర్శకులకు ఆధ్యాత్మిక, చారిత్రక మరియు ప్రకృతి సౌందర్యాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించే అరుదైన అవకాశాన్ని అందిస్తుంది.
హంపిలో అందుబాటు ధరలలో అద్దె గదులు, రిసార్ట్స్ (విరూపారూప గద్దె వద్ద) లభిస్తాయి. అతి దగ్గరలోని రైల్వే స్టేషన్ హాస్పెట. పది కిలోమీటర్లు. దేశం నలుమూలల నుండి ఇక్కడికి రైలు సౌకర్యం ఉన్నది.
స్థానికంగా తిరగడానికి ఆటోలు లభిస్తాయి. తమంతట తామే తిరుగుదాము అని తలచే పర్యాటకుల కోసం అద్దెకు సైకిళ్ళు మరియు మోటార్ సైకిళ్ళు రోజువారీ అద్దెకు లభిస్తాయి. వీటిని బసచేసిన హోటల్ వాళ్లే అమరుస్తారు.






Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...