24, మార్చి 2020, మంగళవారం

Guruvayoor

                                దక్షిణ ద్వారక - గురువాయూరు 


                                                                                                          


త్రిమూర్తుల లో లోకసంరక్షకునిగా భక్తులు ఆరాధించే శ్రీ హరి దశావతారాలు ధరించిన విషయం తెలిసినదే ! ఈపదింటిలో అధిక ప్రాచుర్యం పొందినవి శ్రీ నరసింహ,  శ్రీ రామ మరియు శ్రీ కృష్ణ అవతారాలు. 
థశరధరాముని దేవాలయాలు గ్రామగ్రామాన నెలకొని ఉన్నాయి. నృసింహునికి కూడా పెక్కు విశేష ఆలయాలు కలవు. కానీ నటన సూత్రధారి అయిన శ్రీ కృష్ణుని ఆలయాలు కొద్దిగానే కనపడతాయి.
ద్వారక,  మధుర, బృందావనం,  ఉడిపి,  పూరి, జైపూర్,  ఉదయపూరు, కన్నంబాడి మరియు మన్నారుగుడి లాంటి శ్రీ కృష్ణ క్షేత్రాలతో పాటు శ్రీ గురువాయూరప్పన్ గా కొలువైన గురువాయూరు కూడా ఎంతో ప్రసిద్ధి చెందినది. 
కేరళరాష్ట్రం లో ఒక అరుదైన విశేషం అది కూడా వైష్ణవ ఆలయాల్లో కనపడుతుంది. అదేమిటి అంటే అక్కడ ఉన్న స్వామి పేరు రాముడుగా, కృష్ణుడైనా కొలువై దర్శనమిచ్చేది మాత్రం చతుర్భుజాలతో కూడిన శ్రీ మన్నారాయణుడే! గురువాయూరు లో కూడా అంతే! 
గురువాయూరప్పన్, బాలకృష్ణ గా పిలవబడే స్వామి నాలుగు చేతులతో కనపడతారు. కేరళలోని రెండవ వైష్ణవ క్షేత్రముగా గుర్తింపు పొందినది గురువాయూరు. మొదటిది శ్రీ అనంత పద్మనాభుడు కొలువైన తిరువనంతపురం. 
దక్షిణ ద్వారక గా పేర్కొనే ఈ క్షేత్రంలోని గురువాయూరప్పన్ కేరళ హిందువులకు ఆరాధ్యదైవం. ఆయన నామం వారికి నిత్య స్మరణం.అందుబాటులో ఉన్న కధనాల ఆధారంగా అయిదు వేల సంవత్సరాల క్రిందట అంటే ద్వాపర యుగ చివరి భాగంలో శ్రీ కృష్ణ భగవానుడు ఇక్కడ స్దిరనివాసం ఏర్పరచుకొన్నట్లుగా తెలుస్తున్నది.

క్షేత్రగాధ

తొలుత ఈ మూర్తిని కైలాసనాథుడు విధాత బ్రహ్మ దేవునికి ఇచ్చారట. ఆయన వద్ద నుండి "సూతపాశమహముని" వద్దకు తర్వాత కశ్యప ప్రజాపతి వద్దకు చేరి చివరగా వసుదేవునికి దక్కిందట. తండ్రి నుంచి వారసత్వంగా లభించిన శ్రీ మహవిష్ణు రూపాన్ని నియమంగా పూజించేవారట శ్రీ కృష్ణుడు.
అవతార సమాప్తి సమయాన ఉద్దవునికి విగ్రహన్ని ఇచ్చి దేవ గురువు బృహస్పతి కి అందచేయమన్నారట. గురువు వాయుదేవునితో కలిసి ఆకాశ మార్గాన వెళుతుండగా ఒక సరస్సు ఉత్తర భాగాన ధ్యానం లో ఉన్న సర్వేశ్వరుడు కనిపించారట. ఇంతకు మించిన ప్రశస్తమైన స్థలం లభ్యం కాదన్ననిర్ణయానికి వచ్చిన గురు వాయువులు ఆ కోనేటి దక్షిణ దిక్కున విగ్రహాన్ని ప్రతిష్టించి దేవ శిల్పి విశ్వకర్మ చేత ఆలయం నిర్మింపచేసారట. అలా గురువు వాయువు కలిసి ప్రతిష్టించడం వలన ఈ క్షేత్రానికి "గురువాయూరు" అన్న పేరు వచ్చింది అంటారు.
స్వామి కొలువు తీరడానికి పరమేశ్వరుడు కారణం గనుక క్షేత్ర పాలకుడు రుద్రుడు. నేడు ఆలయ ఉత్తర దిశన కనిపించే తటాకమే నాడు మహేశ్వరుడు తపమాచరించిన  "రుద్రపుష్కరణి". ఈ పుష్కరిణి వెనుక ఉన్న "మమ్మియూరు శివాలయం" లోనే క్షేత్ర పాలకుడు కొలువై ఉంటారు. ఈయనను దర్శించుకొన్న పిదపే శ్రీ కృష్ణ దర్శనానికి వెళ్లాలి అని భావిస్తారు భక్తులు. 

ఆలయ విశేషాలు 

విశ్వకర్మ నిర్మించిన ఆలయాన్ని అభివృద్ధి చేసినది పాండవుల ముని మనుమడైన జనమేజయుడు అని గాధలు తెలియజేస్తున్నాయి. సర్పయాగం చేసి లక్షలాది పాముల మరణానికి కారణమైనందున సంక్రమించిన పాపఫలం వలన కుష్టు వ్యాధి గ్రస్తుడైనాడు జనమేజయుడు. పండితుల సలహ మేరకు సంవత్సర కాలం భక్తి విశ్వాసాలతో గురువాయూరప్పన్ ని సేవించి వ్యాధి నుండి విముక్తి పొందాడు. కృతజ్ఞతగా ఆలయాన్ని అభివృద్ధి చేశారు. 
అనంతరకాలంలో పాండ్య, చేర, జోమారిన్,  కోచ్ఛిన్ వంశ రాజులు, స్థానిక పాలకులు,ధనవంతులైన భక్తులు ఆలయాభివృద్దికి కృషి చేసినట్లు తెలుస్తోంది. 1970లో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా  ఆలయం లోని అధిక భాగం ధగ్దమైనది. ప్రస్తుతం ఉన్నది ఆ ప్రమాదం తర్వాత పునః నిర్మించిన ఆలయాన్ని.
తూర్పు ముఖంగా కేరళ ఆలయ వాస్తుశైలిలో ఉంటుంది. ప్రధానద్వారం గుండా ప్రాంగణం లోనికి వెళితే గర్బాలయంలో శంఖ చక్ర గదా పద్మధారిగా చతుర్భుజాలతో స్తానక భంగిమలో చందన లేపనం, పుష్ప, తులసి మాలలతో అలంకరించబడి నేత్ర పర్వంగా దర్శనమిస్తారు బాలకృష్ణుడు.
ఉపాలయాలలో శ్రీ గణపతి,  శ్రీ ధర్మశాస్త మరియు శ్రీ భగవతివకొలువై ఉంటారు. 

ఆలయ నియమాలు 

కేరళ ఆలయాల్లో పూజ విధానంలో, ఆలయ తెరిచి మూసే సమయాలలో, అలంకార, నివేదనలలో ఇలా పెక్కు నిబంధనలు ఉన్నాయి. అదే విధంగా  భక్తుల వస్రధారణ విషయంలో కూడా నిర్ణయించిన సంప్రదాయాన్ని నేటికీ అనుసరిస్తున్నారు.గురువాయూరు లో మరింత కట్టుదిట్టంగా నియమనిభంధనలను పాటిస్తారు. 
ప్రధాన పూజారి ఉదయం నుంచి మధ్యహన్నం వరకూ మంచినీరు కూడా త్రాగకుండా పూజాధికాలు నిర్వహిస్తారు. అత్యంత భక్తి శ్రద్దలతో స్వామి సేవలో పాల్గొంటారు.భక్తులకు కూడా వస్త్రధారణ నియమాలు తప్పని సరి. పురుషులు తెల్లని పంచ కట్టుకుని నడుముకు తెల్లని పైపంచ కట్టుకోవాలి. మగ పిల్లలు కూడా ఇలాగే రావాలి. ఆడవారు సంప్రదాయ దుస్తులు ధరించి రావాలి.  ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే ఆలయ ప్రవేశం లభించదు. కెమెరాలు మొబైల్ ఫోన్లు తీసుకొని వెళ్ళరాదు.
గురువాయూరు ఆలయ పూజావిధానాలను జగద్గురువు శ్రీశ్రీశ్రీ ఆది శంకరులు రూపొందించారు అని అంటారు. వాటిని శ్రీ విళ్వమంగళ స్వామి స్దిరీకరించి ఆచరణలో పెట్టారంట.తెల్లవారుఝాము మూడు గంటలకు ఆలయాన్ని తెరుస్తారు. నిత్య పూజలు,  అలంకారాలు, ఆరగింపుల సమయాన్ని మినహాయించి మధ్యహన్నం పన్నెండు గంటల వరకు, తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తులకు శ్రీ గురువాయూరప్పన్ దర్శనం లభిస్తుంది.

ఆలయ ఉత్సవాలు 

భూలోక వైకుంఠంగా పేర్కొనే గురువాయూరు ఆలయం లో ప్రతి నిత్యం పర్వదినమే. ఎన్నో అలంకారాలు సేవలు స్వామి వారికి జరుపుతారు.  
శ్రీ కృష్ణ జన్మాష్టమి, వైకుంఠ ఏకాదశి ముఖ్య పర్వదినాలు. స్థానిక పర్వదినాలైన విషు, ఓణంతో సహ  అన్ని హిందూ పర్వదినాలు సందర్భంగా వేలాదిగా భక్తులు శ్రీ ఉన్ని కృష్ణన్ దర్శనానికి తరలి వస్తారు.ఏకాదశి మరియు అష్టమి తిధులలో, రోహిణి నక్షత్రం రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు.రోజుకు నాలుగు పూజలు. గజసేవ కూడా నియమంగా నిర్వహిస్తారు. 
ఇవన్నీ కాకుండా దేవస్వంవారి ఆధ్వర్యంలో జరిగే ఎన్నో కార్యక్రమాలలో ముఖ్యమైనవి రెండు. అవి
కృష్ణాట్టం మరియు అనెయోట్టం.

కృష్ణాట్టం 

16 శతాబ్దానికి చెందిన  జోమారిన్ రాజు "సముత్ర మానదేవ" శ్రీ కృష్ణ భక్తుడు. ఆయనకు తన ఆరాధ్యదైవం యొక్క దర్శనం చేసుకోవాలి అన్న తలంపు కలిగిందట.దానిని గురువైన శ్రీ విళ్వమంగళ స్వామి కి విన్నవించు కొన్నారట. ఆయన రాజుని ఆలయ ప్రాంగణంలో ఉన్న పొగడచెట్టు వద్ద తెల్లవారు జామున ఆడుకొనే బాలకృష్ణుని చాటుగా దర్శించుకొని వచ్చేయమన్నారట. 
మరునాటి ఉదయం  దుర్లభమైన దర్శనాన్ని పొందిన రాజుకి బాలయ్యను తాకాలి అనిపించినదట. ఎదురుగా వెళ్లి పట్టుకోబోగా స్వామి దరహాసం చేస్తూ మాయమయ్యారట. కాని మహదేవుని చేతిలో కృష్ణుని శిఖలో ఉన్న నెమలి ఫింఛం ఉండిపోయిందట.ద్వారకాధీశుని దర్శనం తో లభించిన ప్రేరణతో మానదేవుడు "కృష్ణ గీతి" అన్న పేరుతో శ్రీ కృష్ణుని జీవిత గాధను 8 భాగాలుగా రచించారు. తరువాత దానికి అనుభవజ్ఞులైన నాట్యాచార్యుల చేత నృత్య రూపకంగా తయారు చేయించారు. 
ప్రస్తుతం దేవస్థానం వారు రోజుకు ఒక భాగం చొప్పున ఆర్జితసేవగా ప్రదర్శింప చేస్తున్నారు. ప్రత్యేక నాట్య విధానంలో కృష్ణాట్టం ప్రదర్శించడానికి ఒక ప్రత్యేక నాట్య కళాకారుల బృందాన్ని దేవస్థానం ఏర్పాటు చేసింది. కృష్ణాట్టం లోని ఒక్కో భాగం ఒక్కో విధమైన కోరికను నెరవేర్చుతాయని విశ్వసిస్తారు భక్తులు.
అవతార ఘట్టం సంతానాన్ని, కాళియమర్దనం ఆరోగ్యాన్ని, రాసక్రీడ దంపతుల మధ్య అనుభంధాన్ని ధృఢం 
చేయడానికి, కంసవధ శత్రు భాధల నుండి ఉపశమనం, స్వయంవరం తగిన వధువు లేదా వరుడు కొరకు,  చక్కని సంబంధ బాంధవ్య అభివృద్ధి కోసం, బాణ యుద్ధం పాడి పంటల, సంపద అభివృద్ధి కొరకు, వివిధ వాదం దరిద్ర నాశనం కోసం మరియు ఆఖరిది అయిన స్వర్గారోహణం మరణించిన ఆప్తుల ఆత్మ శాంతి కొరకు. తిరిగి తొమ్మిదో రోజున అవతార ఘట్టంతో తో మొత్తం ఒక పర్యాయ కృష్ణాట్టం ప్రదర్శన ముగిస్తారు. భక్తులు దేవస్థానంవారు నిర్ణయించిన వారికి కావలసిన అంశానికి డబ్బులు కడతారు. కృష్ణాట్టం సంవత్సరంలో తొమ్మిది నెలలు మాత్రమే ప్రదర్శిస్తారు. మిగిలిన మూడు నెలలు సాధన కొరకు కేటాయిస్తారు.

అనెయోట్టం 

కేరళ లోని ఆలయాల్లో భక్తులు తమ మొక్కులను తులాభారం ద్వారా చెల్లించుకొంటారు. వాటిలో ఎక్కువగా ధాన్యం , పప్పులు, కూరగాయలు,  పండ్లు, కొబ్బరి కాయలు ఉంటాయి. అలా తులాభారం ద్వారా వచ్చిన పదార్థాలను భక్తులకు అందించే అన్న ప్రసాద తయారీలో వినియోగిస్తారు.  మరో విధమైన కానుకలు సమర్పించు కొనే పద్దతి కూడా ఇక్కడ కనపడుతుంది. కానీ అది చాలా ఖరీదు. అదే తమ ఇష్ట దైవాలకు గజాలను ఇవ్వడం.  
అలా అధిక సంఖ్యలో ఏనుగులను పొందిన స్వామి శ్రీ గురువాయూరప్పన్. ప్రస్తుతం ఉన్న అరవై పైచిలుకు  ఏనుగులను ప్రత్యేకంగా " పునత్తూరుకోట " అనే పది ఎకరాలు స్థలంలో ఉంచుతున్నారు.  
నేడు ఇంతటి గజ సంపద కలిగిన గురువాయూరు దేవస్థానం కొన్ని శతాబ్ధాల క్రిందట ఉత్సవాల సందర్భంగా గజసేవ నిమిత్తం  మరో ఆలయ గజరాజు ను తెచ్చుకొనేది అంటే నమ్మగలమా!  కానీ అది నిజం.
కొచ్చి రాజుల అధీనంలో ఉన్న ఒక ఆలయ ఏనుగును ప్రతి సంవత్సరం ఉత్సవాల సందర్భంగా తెచ్చుకొనేవారట గురువాయూరు వారు. జోమారిన్ మరియు కొచ్చి రాజుల మధ్య తలెత్తిన విభేధాల కారణంగా ఒక సంవత్సరం ఏనుగును ఇవ్వడానికి నిరాకరించారు ఆ ఆలయ నిర్వాహకులు. చేసేది లేక గజం లేకుండానే ఉత్సవాలు జరప నిశ్చయించారు.ఆశ్చర్యకరంగా ఉత్సవాల తొలి రోజున బంధనాలను తెంచుకొని మరీ ఆ గజరాజు గురువాయూరు చేరుకొన్నది. గజ సేవ ఘనంగా జరిగింది. ఈ సంఘటనను పురస్కరించుకొని నేటికీ ప్రతి సంవత్సరం ఆలయ ఉత్సవాల తొలి రోజు సాయంత్రం "అనెయోట్టం " పేరుతో ఏనుగుల పరుగు పందాన్ని ఏర్పాటు చేస్తారు. 
వేలాదిమంది భక్తులు దేశవిదేశ పర్యాటకుల హర్షధ్వానాల మధ్య జరిగే ఈ పందెంలో విజేత ఆ సంవత్సర కాలం అన్ని ఉత్సవాల్లో ఉత్సవ మూర్తులను ఊరేగించే అదృష్టాన్ని దక్కించు కొంటుంది. 
త్రిమూర్తుల పూజలందుకొని, రుద్రుడు  స్థలం లో గురువాయువుల చేత ప్రతిష్టించబడిన శ్రీ గురువాయూరప్పన్ కొలువై, ఎన్నో ప్రత్యేకతలు నిలయమైన గురువాయూరు కేరళ సంస్కృతి సంప్రదాయాల రాజధానిగా పేరుగాంచిన త్రిసూర్ పట్టణానికి పాతిక కిలో మీటర్ల దూరంలో ఉన్నది. దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి త్రిసూర్ కి రైలు సౌకర్యం ఉన్నది. 
గురువాయూరు లో దేవస్థానం ఆధ్వర్యంలో వసతి గృహాలు అందుబాటు ధరల్లో అద్దెకు లభిస్తాయి.గురువాయూరు లో మరియు చుట్టుపక్కల పెక్కు విశేష ఆలయాలు కలవు. అన్ని దర్శనీయాలే !

















కృ ష్ణం వందే జగద్గురుం !!!!

( ఈ వ్యాస రచనకు తగిన సమాచారాన్ని అందించిన గురువాయూర్ ఆలయ పూజారి చిరకాల మిత్రులు శ్రీ రాజేష్ నంబూద్రి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు)







                                

Thirunelveli Temples

                            తిరునల్వేలి దివ్య దేశాలు   


కాంచీపురం తరువాత ఎక్కువ సంఖ్యలో శ్రీ వైష్ణవ దివ్య తిరుపతులు ఉన్న మరో జిల్లా తిరునల్వేలి. జిల్లాలో మొత్తంగా పదకొండు దివ్య దేశాలు ఉన్నాయి. తమిళనాడు  దక్షిణ భాగాన మదురై, కన్యాకుమారి, రామేశ్వరం మరియు కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం మధ్యలో ఉంటుందీ జిల్లా. రాష్ట్రంలో ఆరో పెద్ద నగరంగాను, దక్షిణ భాగాన ముఖ్య వ్యాపార కేంద్రంగా ప్రసిద్ధి తిరునల్వేలి పట్టణం.
త్రవ్వకాలలో లభించిన వస్తువుల ఆధారంగా పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలో క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల క్రిందట నుండి జనజీవనం,  నాగరికత వెల్లివిరుస్తోందని తెలిపారు.
తిరునల్వేలి జిల్లా పర్యాటకులకు కావలసిన అన్ని రకాల ఆకర్షణలను కలిగి ఉన్నది. పురాతన కట్టడాలు, విశేష ఆలయాలు, జలపాతాలు,  పర్వత ప్రాంత విడిది కేంద్రాలు, అభయారణ్యాలు ఇలా ఎన్నో ఉన్నాయి.
ఇరవై ఒక్క చిన్నా పెద్ద  నదులు ప్రవహిస్తున్నాయి. వీటిలో తమిర పారాణి నది దాని ఉప నది అయిన చిత్రానది ముఖ్యమైనవి. తిరునల్వేలి నగరం మరియు ముఖ్య ఆలయాలు పర్యాటక కేంద్రాలు తమిరపారాణి నదీతీరం లోనే ఉంటాయి. 
నగరంలో శ్రీ వినాయక, శ్రీ వరదరాజ, శ్రీ అయిరతాంబాల్ ఆలయాలు సందర్శనీయాలు. అద్భుతమైన శిల్పాలు, సప్తస్వరాలు పలికే రాతి స్తంభాలతో పాటు మరెన్నో విశేషాల నిలయం అయిన  శ్రీ కాంతి మతి దేవి సమేత శ్రీ నెల్లియప్పార్ ఆలయ సందర్శన మరిచిపోలేని అనుభం. శ్రీ  నెల్లియప్పార్ కొలువైనందునే ఈ జిల్లాకు ఈ పేరు వచ్చింది.
తమిళ నాడులో ఉన్న అయిదు నాట్య సభలలో రెండు ఈ జిల్లాలో నెలకొని ఉన్నాయి. శ్రీ నెల్లియప్పార్ ఆలయంలో ప్రత్యేక కలప తో రమణీయంగా మలచిన శిల్పాలతో దర్శనమిచ్చేది తామ్రసభ.
 నవ కైలాసాలుగా పిలవబడే తొమ్మిది విశేష శివాలయాలు మరియు శ్రీ వైష్ణవ నవగ్రహ క్షేత్రాలు గా పేరొందిన తొమ్మిది దివ్య దేశాలు ఈ జిల్లాలో తమిరపారాణినదీ తీరంలో ఉండటం మరెక్కడా కనిపించని విశేషంగా పేర్కొనవచ్చును. 
ఇంకా జిల్లాలో తెన్ కాశి శ్రీ కాశీ విశ్వేశ్వర ఆలయం,  శంకరన్ కోవిల్,  కృష్ణా పురం శ్రీ మేళ వేంకటా చలపతి ఆలయం,  ఆరుపాడై వీడుల్లో  సముద్ర తీరంలో నెలకొన్న ఒకేఒక్క క్షేత్రం తిరుచ్ఛెందూరు ముఖ్యమైనవి. ఇవే కాకుండా జిల్లా వ్యాప్తంగా మరెన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. 
జిల్లా మొత్తం పర్వతాలు పచ్చని అడవులతో నిండి ఉన్నందున ప్రకృతి విశ్వరూపాన్ని కనులారా వీక్షించవచ్చును. పాపనాశనం,  బాణ తీర్థం,  కుర్తాళం ఎన్నో జలపాతాలకు నిలయాలు. ముఖ్యంగా కుర్తాళం లోనే చిత్రానది ఎనిమిది జలపాతాల రూపంలో నేలకు జాలు వారుతుంది. శ్రీ  కుర్తాళ నాధర్ కొలువైన ఈ క్షేత్రం మరో నాట్య సభ. వందల సంవత్సరాల క్రిందట సహజ వర్ణాలతో చిత్రించిన శివ లీలా చిత్రాలు నేటికి చెక్కు చెదరకుండా ఉండటం ఈ చిత్రసభ ప్రత్యేకత . ఈ జలపాతాల నీటిలో వేలాది వనమూలికల సారం ఉన్నదని తెలియడంతో ఎందరో నరాల బలహీనత, చర్మ వ్యాధుల,  పక్షవాత రోగులు నియమంగా ఈ జలపాతాల నీటిలో స్నానం చేస్తుంటారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వ ఆధ్వర్యంలో జులై నెలలో ఎనిమిది రోజుల పాటు "సరళ విళ" అన్న పేరుతో ఉత్సవాన్ని నిర్వహిస్తారు. లక్షలాది మంది ప్రజలు ఈ సందర్భంగా ఇక్కడికి వస్తుంటారు. కుర్తాళం లో తప్పక చూడాల్సినది " మౌన స్వామి" (కుర్తాళ పీఠం )ఆశ్రమం. 
పాపనాశనం కూడా ఎన్నో జలపాతాలకు నిలయం. బాణ తీర్దం, అగస్త్య జలపాతాలు మరియు శ్రీ అగస్త్య మహర్షి ఆలయం ఇక్కడి ఆకర్షణలు. 
కుర్తాళం సమీపంలో పంచ ధర్మశాస్త ఆలయాల్లో ని అచ్చం కోయిల్ మరియు ఆరియంగావు కలవు. శ్రీ   కుమార స్వామి కొలువైన మరో  విశిష్ట  తిరుమలై కుమారస్వామి ఆలయం కూడా ఇక్కడికి దగ్గర లోనే ఉన్నది. 
కొద్దిగా వెనక్కి వెళ్ళి నవ కైలాసాల గురించి మరియు నవ తిరుపతుల గురించి తెలుసుకొందాము. నవ తిరుపతులు అన్ని తూర్పు వైపున ఉంటాయి. నవకైలాసాలు కొన్ని పడమర వైపు మిగిలినవి తూర్పు వైపున ఉంటాయి. 
ఎంతో పౌరాణిక ప్రాశస్థ్యం గల ఈ ఆలయాల్లో నవ తిరుపతులు ఇవి. శ్రీ వైకుంఠం, తిరువరగుణ మంగై, తిరుప్పులింకుడి, తిరుకుళందాయ్,  తిలుతులై విల్లం మంగళం,  తెందురుపెరయ్,  తిరుక్కోలూర్,  తిరుకుగునూర్. 
వీటిలో తిరుకుగునూర్  (ఆళ్వారుతిరునగరి ) పన్నిద్దరు వైష్ణవ ఆళ్వారులలో ప్రముఖుడైన నమ్మాళ్వారు జన్మస్థలం. ఈయన కృప వలననే నాదముని"నళయర దివ్య ప్రభంధం" లోకానికి అందించారు. తిరుక్కోలూరు నమ్మాళ్వారు శిష్యుడైన మరో ఆళ్వారు అయిన మధుర కవి జన్మస్ధలం.  
ఇక నవ కైలాసాలు ఏమిటి అంటే పాపనాశనం,  చేర న్ మహదేవ, కొడకనల్లూరు, కున్నత్తూరు,  మూరప్పన ఆడు,  శ్రీ వైకుంఠం,  తెందురుపెరయ్,  రాజపతి , ఛందమంగళం. ఈ తొమ్మిది స్ధలాలు నయన్మారులు గానం చేసిన పాటికాల కారణంగా "పడాల పేట్రస్ధలాలు" గా  గుర్తింపు పొందాయి. 
జిల్లాలో ఉన్న మరో రెండు దివ్య దేశాలు అయిన "తిరుక్కురన్ గుడి మరియు వనమామలై" కన్యాకుమారికి వెళ్లే దారిలో ఉన్నాయి. వీటితో కలిసి జిల్లాలో మొత్తంగా పది దివ్య తిరుపతులు కలవు.
తిరునల్వేలి జిల్లాలో గల ముందతురాయ్,  కాలకాడు ప్రముఖ అభయారణ్యాలు. న్యప్రాణి సంరక్షకకేంద్రాలు.  పెద్ద పులి, చిరుతపులి లాంటి క్రూరమృగాలతో పాటు అంతరించిపోతున్న అనేక జాతుల పక్షులు,  అడవి జంతువులు ఇక్కడ కనిపిస్తాయి. కూన్థకుళం అనేక రకాల దేశవిదేశ పక్షుల నివాసం. మణిమత్తూరు జలపాతం వద్ద నిర్మించిన ఆనకట్ట సమీపంలోని "మన్ జోలామ్" పర్వత ప్రాంత విడిది కేంద్రాలు. 
వెరసి తిరునల్వేలి జిల్లా అందరి అభిరుచులకు తగిన ఆకర్షణలను కలిగి ఉన్నది.
తిరునల్వేలి వాసులు పర్యాటకులకు ఇచ్చే సలహ ఒకటున్నది. అదేమిటంటే కుర్తాళం జలపాతాలలో జలకాలడటం, ఇక్కడి మధురమైన హల్వా, అరటికాయ చిప్స్ ఆరగించడం చేయకపోతే తిరునల్వేలి పర్యటన అసంపూర్ణం అని. 
నగరంలో జంక్షన్ రైల్వే స్టేషన్ వద్ద అందుబాటు ధరల్లో అద్దెకు వసతి గృహలు లభిస్తాయి. రుచికరమైన భోజన ఫలహరాలు లభిస్తాయి. 
జై శ్రీ మన్నారాయణ! !!!

Thirunelveli Temples - 1


                           తిరునెల్వేలి దివ్యదేశాలు             

 



శ్రీ వైకుంఠం - సూర్య క్షేత్రం 

నవతిరుపతి ఆలయాలు అన్ని తిరునల్వేలి కి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కానీ వరుసగా చూడటానికి కుదరదు. కారణం ఏమిటంటే ఆలయాల దర్శన సమయాల్లో తేడా ఉండటమే! ఏ ఆలయం ఏ సమయానికి తీస్తారు, ఏ ఆలయం తరువాత ఏ ఆలయానికి వెళ్లాలి అన్నది ఇక్కడి అద్దె కార్ల వాళ్ళకి బాగా తెలుసు. సమయాల ప్రకారం దర్శనాలు చేయిస్తారు. అందువలన కారు తీసుకుని వెళ్లడం ఉత్తమం. అన్ని ఆలయాలను చూడవచ్చును శ్రమ లేకుండా!
నవతిరుపతులతో పాటు అందుబాటులో ఉన్న నవకైలాస ఆలయాలను, ఆరుపాడై వీడుల్లో ఒకటి సముద్ర తీరంలో శ్రీ సుబ్రమణ్యస్వామి కొలువైన తిరుచ్ఛెందూరు కూడా సందర్శించుకోవచ్చును.
పూర్వం ఈ ప్రాంతం పాండ్య రాజుల పాలనలో ఉన్నది. అందువలన పాండ్య నాడు అని పిలిచేవారు. ఇక్కడ ఉన్న పది దివ్య దేశాలను పాండ్య నాడు క్షేత్రాలు అని నిర్ణయించబడింది. ఈ తొమ్మిది స్ధలాలు శ్రీ వైష్ణవ నవగ్రహ క్షేత్రాలు. ఒక్కో క్షేత్రం ఒక్కో గ్రహ స్ధలంగా గుర్తించబడినది. 
నవతిరుపతులలో మొదటిది శ్రీ వైకుంఠం. ఇది సూర్య  క్షేత్రం. 

ఇక్కడొక విశేషం గమనించాలి. తమిళనాడు లోని క్షేత్రాల ముందు తిరిగి అనే గౌరవ వాచకం ఉంటుంది.  అలా కాకుండా శ్రీ తో ఆరంభమయ్యే  దివ్య దేశాలు రెండే! ఒకటి శ్రీ వైకుంఠం కాగా రెండవది శ్రీ విల్లిపుత్తూరు. 
తిరునల్వేలి కి  ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ వైకుంఠం ఆలయాన్ని తొలుత పాండ్య రాజులు కట్టించినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. అనంతరం చోళ, విజయ నగర,  నాయక రాజులు ఆలయాభివృద్దికి భూరి విరాళాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. 
సాక్షాత్తు శ్రీ మన్నారాయణుడే కొలువు తీరిన క్షేత్రమని భక్తులు విశ్వసిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన క్షేత్ర గాధ కూడా విశేషమైనదే! శ్రీహరి లోకకళ్యాణార్దం ధరించిన దశావతారాలలో  మొదటిదైన మత్య్సావతారంతో ముడిపడి ఉన్నది. 

పురాణ గాధ

జలప్రళయానికి పునఃసృష్టికి మధ్య ఉన్న సంధి కాలంలో సృష్టికర్త విశ్రమించారట. యోగనిద్రలో ఉన్న ఆయన వద్ద నుండి "సోమకుడు"  అనే అసురుడు వేదాలను అపహరించాడట. మేలుకొని విషయం తెలుసుకొన్న విధాత శ్రీ మహవిష్ణువు తప్ప అన్యులు తనను కాపాడలేరని భావించారట. ఆయన అనుగ్రహం కొరకు భూలోకం లోని పావన తమిరపారాణి (తామ్రపర్ణి )నదీతీరం లో తపస్సు చేశారట. దర్శనమిచ్చినగంగాధరుడు మత్య్స రూపం దాల్చి రాక్షసుని అంతం చేసి సృష్టికి మూలమైన వేదాలను హంసవాహనునికి ఇక్కడ అందించారట. చతుర్ముఖుని కోరిక మేరకు ఈ క్షేత్రంలో కొలువైనరట. తొలి ఆలయాన్ని బ్రహ్మ ఆదేశం మేరకు దేవ శిల్పి విశ్వకర్మ నిర్మించారట. 
కాలం ఎవరి కోసం ఆగదుకదా! విశ్వకర్మ కట్టిన ఆలయం కనుమరగైనది. స్వామి చుట్టూ పుట్టలు పుట్టాయి. నిత్యం రాజుగారి పశువుల మంద మేతకు ఈ ప్రాంతానికి వచ్చేవట. వాటిలోని ఒక ఆవు ఈ పుట్టల వద్దకు వెళ్లి ధారగా క్షీరాన్ని తన పొదుగు నుంచి వదిలేదట. అది గమనించిన గో పాలకుడు పాండ్య రాజు వద్దకు వెళ్లి విషయాన్ని విన్నవించుకొన్నాడట. ఆపుట్టలలో ఏదో మహత్యం ఉండి ఉంటుంది అని గ్రహించిన రాజు జాగ్రత్తగా తవ్వించగా నీలమేఘ శ్యాముడైన శ్రీ వైకుంఠనాధుడు విగ్రహ రూపంలో దర్శన మిచ్చారట.ఆనందపరవశుడైన పాండ్యుడు పునః ప్రతిష్ట చేసి ఆలయాన్ని నిర్మించారట. గోవు చేసిన పాలాభిషేకం కారణంగా దర్శనం ఇచ్చారు కనుక స్వామిని "పాలపాండ్యన్" అని పిలుస్తారు. అర్చనామూర్తికి ప్రతి నిత్యం పాలతోనే అభిషేకం చేస్తారు.
విశాల ప్రాంగణంలో  నిర్మింపబడిన ఈ ఆలయం చక్కని ఆకట్టుకునే శిల్పాలతో అలరిస్తుంది. భాగవత, విష్ణు లీలా విన్యాసాలు, చిత్ర విచిత్ర జంతువులు, లతలు పూలు చెక్కిన రాతి శిల్పాలు కనువిందు చేస్తాయి. రెండు వేల సంవత్సరాల నాటిదిగా చెప్పబడే చెక్క గరుడ వాహనం మరో ఆకర్షణ.
చాలా లోపలికి కొద్దిగా లోతులో ఉండే గర్బాలయంలో మూలవిరాట్టు శ్రీ వైకుంఠనాధుడు ఆదిశేషుని పడగ ల క్రింద తూర్పు ముఖంగా స్థానక భంగిమలో గదాయుధం ధరించి దర్శనమిస్తారు. శ్రీ మహవిష్ణువు అలంకారప్రియుడు. దానికి తగనట్లుగా రమణీయ పుష్పాలంకరణ చేస్తారు. అమ్మవార్లు అయిన శ్రీ వైకుంఠ వల్లి, శ్రీ చోరనాయకి విడిగా కొలువు తీరి ఉంటారు. ఉపాలయాలలో శ్రీ నరసింహ, శ్రీ వేణుగోపాల, శ్రీ ఆంజనేయ, శ్రీ మానవళమహర్షి దర్శనమిస్తారు. ప్రధాన ఆలయం వెలుపల తిరుమల వాసుడు కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి కి ఒక ప్రత్యేక ఆలయం కలదు. 
శ్రీ దేవి, భూదేవి సమేతంగా పూజలందుకొనే ఉత్సవమూర్తిని "కాలాపిరన్ లేదా చోరనాధన్ " అని పిలుస్తారు. దీనికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉన్నది. అది శ్రీ వైకుంఠనాధుని భక్తవత్సలతను లోకసంరక్షణాసక్తిని తెలియజేస్తుంది.

శ్రీ కాలాపిరన్ 

ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించే పాండ్యరాజు భోగలాలసుడై  ప్రజాసంక్షేమం పట్టించుకొనేవాడు కాదట.దానితో రాజ్యంలో అరాచకం, అవినీతి, అక్రమాలు, దొంగతనాలు పెరిగిపోయాయట. "కాలదోషకుడు" అనే వాడు పెద్ద దొంగల ముఠాకు నాయకుడు. రాజ్యంలో జరిగే అధికశాతం దొంగతనాలు ఈ ముఠా సభ్యులే  చేసేవారట. దొంగ అయినా కాలదోషకుడు శ్రీ వైకుంఠనాధుని భక్తుడు. చోరీ చేయడానికి ముందు స్వామికి పూజలు చేసి తన కార్యం సఫలమైతే సగభాగం లక్షీనాధునికి సమర్పించుకొంటానని మొక్కుకొనేవాడట. అదే విధంగా లభించిన దానిలో అర్థభాగం ఇచ్చేవాడట. అలా కాలం సాగిపోతున్నది. పెరుమాళ్ కాలదోషకునికి,  రాజు కి తగిన గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైనది అని తలంచి తన మాయను ప్రసరింప చేశారట.
దాని వలన కాలదోషకుని మదిలో అహం పెరిగి రాజుగారి ఖజానాని దోచుకోడానికి పధకం రచించాడట. అదృష్టం తారుమారవడంతో ముఠా సభ్యులు అందరూ రాజ భటులకు దొరికిపోయారట. కాలదోషకుడు ఒక్కడూ తప్పించుకొని దిక్కు తోచక శ్రీ వైకుంఠనాధుని శరణుకోరాడట.ఒక ముదుసలి రూపంలో దొంగల నాయకునికి అభయమిచ్చి తాను అతని వేషంలో రాచకొలువుకు వెళ్ళారట. 
తన దాకా వస్తే గానీ తెలియదన్నట్లుగా ఖజానా చోరీ విషయాన్నిపరువు సమస్యగా తీసుకొన్న రాజు ఆగ్రహంతో "ఎవరు నువ్వు? "అని ప్రశ్నించాడట. నవ్వి " నా పేరు కాలాపిరన్. ఊరు శ్రీ వైకుంఠం." అని బదులిచ్చారట.
"దొంగతనం నేరమని తెలియదా! " అన్నాడట పాండ్యుడు. సూటిగా రాజు వంక చూస్తూ "మరి నువ్వు చేస్తున్నది ఏమిటి ?" అని ఎదురు ప్రశ్నించారట దొంగ రూపంలో ఉన్నపెరుమాళ్.  
ఆయన చూపులకు, ప్రశ్నకు తన తప్పులను తెలుసుకొన్న రాజు కైమోడ్చాడట.  నిజరూప దర్శనమిచ్చి  జనరంజకంగా పాలించమని ఆదేశించారట. జరిగింది తెలుసుకొన్న కాలదోషకుడు నాటితో దొంగతనాలు మానేసి శ్రీ వైకుంఠనాధుని సేవ చేస్తూ ముక్తి పొందాడట. తన పేరు కాలాపిరన్ అని స్వామి స్వయంగా చెప్పినందున ఉత్సవ మూర్తిని అదే పేరుతో పిలవసాగారు.

సూర్యాభిషేకం 

స్వామి వారికి రోజూ క్షీరాభిషేకం జరుగుతుంది అని తెలుసుకొన్నాము కదా! అది కాకుండా మరో అభిషేకం కూడా జరుగుతుంది. అది సంవత్సరంలో రెండు సార్లు. ఉత్తరాయణంలో ఒకసారి దక్షిణాయణంలో మరోసారి. అదే ప్రత్యక్ష నారాయణుని కిరణాభిషేకం.
ఏంతో లోపలికి ఉండే గర్భాలయానికి ఉదయారుణ  కిరణాలు ఆ రెండు రోజుల్లో మాత్రమే ప్రవేశించి మూలవిరాట్టు ను నేరుగా తాకడం నాటి శిల్పుల నిర్మాణ చాతుర్యానికి నిదర్శనంగా చెప్పుకోవాలి.
నియమంగా రోజుకి నాలుగు పూజలు జరిగే ఈ ఆలయంలో ప్రత్యేక విశేష ఉత్సవం గరుడ సేవ.
అన్ని పర్వదినాల లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ వైకుంఠనాధుని దర్శనం చేసుకొంటారు.
పన్నిద్దరు వైష్ణవ ఆళ్వారులలో ప్రముఖుడైన నమ్మాళ్వారు శ్రీ వైకుంఠనాధుని కీర్తిస్తూ రెండు పాశురాలను గానం చేశారు.
మరో విశేషం ఏమిటంటే నవకైలాస క్షేత్రాలలో ఒకటి ఇదే ఊరిలో ఉండటం. అలా హరిహర క్షేత్రం గా శ్రీ వైకుంఠం అందరికీ పవిత్ర దర్శనీయకేద్రంగా పేరొందిన ది.


జై శ్రీ మన్నారాయణ! ! ! ! 

తిరుకుళందై  (పెరుంగుళం ) శని క్షేత్రం 

తమిరపారాణి నదికి ఉత్తరం పక్కన శ్రీ వైకుంఠానికి పన్నెండు కిలోమీటర్ల దూరం, తిరుప్పులింకుడి కి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తిరుకుళందై. నవతిరుపతులలో నాలుగోది. శని క్షేత్రం. స్ధానికంగా పెరుంగుళం అని పిలుస్తారు.
దీనికి కారణమేమంటే పురాణ కాలంనాటి ఆలయ కోనేరు కాలగతిలో అదృశ్యమైనదిట. దానిని తిరిగి నిర్మించడానికి కొన్ని వాస్తు శాస్త్ర అంచనాల ప్రకారం లెక్కలు వేసారట. గతంలో పుష్కరిణి ఉండిన స్ధలాన్ని గుర్తించారట.అలా ప్రస్తుతం మనకు కనిపించే కోనేరును పునః నిర్మించారట. అప్పట్లో దాని పేరు పెరుంగుళం. నేడు ఊరు కూడా అదే పేరుతో ప్రసిద్ధి చెందింది.
శ్రీ వెంకట వణ్ణన్ పెరుమాళ్  శ్రీ అలిమేలుమంగ తాయారు శ్రీ కుళందైవల్లి తాయారులతో కలిసి కొలువైన ఆలయం పెద్దదే. కానీ విశేష శిల్పకళ కనపడదు.ఇది కూడా పాండ్య వంశీయుల నిర్మాణమే!  
మూలవిరాట్టు స్ధానిక భంగిమలో చతుర్భుజాలలోని వెనుక హస్తాలతో శంఖు చక్రాలను ధరించి ముందు కుడి చేతిని వరద హస్తంగా, ఎడమ హస్తాన్ని నడుము పైన ఉంచుకొని విశేష పుష్పాలంకరణతో ప్రత్యేకంగా  కనిపిస్తారు. 
ఈ క్షేత్రంలో జగన్నాధుడు దేవ గురువు బృహస్పతి కి దర్శనమిచ్చారని తెలుస్తోంది. ఆలయం గురించి అనేక పురాతన గ్రంధాలలో ఉదాహరించబడినా ప్రత్యేకముగా  పురాణ గాధ గురించిన వివరాలు ఏవీ కనిపించవు. కానీ శ్రీ వెంకట వణ్ణన్ పెరుమాళ్ భక్తవత్సలుడని నిజ భక్తులను, ఆర్తితో అర్ధించిన వారిని కాపాడుతారని తెలిపే గాధలు చాలా స్థానికంగా వినబడతాయి. వాటిల్లో ముఖ్యమైనది "వేదసారన్" కధ. 

వేదసారన్ కధ  

వేదసారన్ , కుముదవల్లి అనే దంపతులు శ్రీ వెంకట వణ్ణన్ భక్తులు. నిర్మలమైన భక్తితో స్వామిని ఆరాధించేవారట. వారి ఏకైక కుమార్తె కూడా తల్లితండ్రుల బాటలో నడుస్తూ తిరుకుళందై నాధర్ ని ఆరాధించేదట. వయస్సుతో పాటు ఆమె భక్తి కూడా పెరిగిపోయిందిట. 
గోదాదేవి మాదిరి ఈమె కూడా శ్రీవారిని నాధునిగా చేసుకోవాలని తలపోసిందట. పెద్దలు అది సాధ్యం కాదని నచ్చచెప్ప ప్రయత్నించారట. కానీ బాలిక వారి అనుమతితోనే తీవ్ర తపస్సు చేసిందట. ఆమె భక్తికి సంతసించిన గరుడ వాహనుడు దర్శనమిచ్చి ఆమెకు తన హృదయంలో శాశ్విత స్థానం అనుగ్రహించారట. శ్రీ వెంకట వణ్ణన్ మూలవిరాట్టు వక్షస్థలంలో కౌస్తుభ మణితో పాటు ఈమె రూపాన్నిచూడవచ్చును. 
అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు అల్లుడయ్యాడని ఆనందంతో జీవితాన్ని ఆయన సేవలో గడుపుతున్న వేదసారన్ దంపతులకు అనుకోని ప్రమాదం ఎదురైనదట. "అసంసారన్" అనే అసురుడు విష్ణు ద్వేషి. విష్ణు భక్తుల పట్ల అకారణ ద్వేషం కలవాడట. 
వేదసారన్ కుమార్తె గురించి విని వారిని వేధించాలని తలచి కుముదవల్లిని  అపహరించుకొని పోయాడట. దిక్కు తోచని వేదసారన్ స్వామిని శరణు కోరాడట. ప్రజలకు రాక్షస బాధ తొలిగించాల్సిన సమయం ఆసన్నమైనది అని తలచిన జగద్రక్షకుడు గరుడ వాహనం మీద తరలి వచారట. అసురుని అంతం చేసి అతని దేహం మీద మహోగ్రనాట్యం చేశారట. ఈ కారణంగా ఉత్సవమూర్తిని రాక్షసుని మీద తాండవం చేసిన వాడు అని అర్ధం వచ్చేలా "మాయా కూతన్" అని పిలుస్తారు. శ్రీదేవి, భూదేవిల మధ్య చిద్విలాసంగా దర్శనమిస్తారు మాయాకూతన్. 

వినతా తనయుని విశేషం  

పై రెండు సంఘటనలలో పెరుమాళ్ గరుడుడిని అధిరోహించి వచ్చారు. అందువలన స్వామి వారు ఎప్పుడు ఏ భక్తుని కాపాడటానికి బయలుదేరుతారో అన్నది తెలియదు.  కనుక "నిత్య సూరి" అన్న తన పదవి, బిరుదును సార్ధకం చేసుకొంటూ గరుత్మంతుడు తన రెక్కలు చాపి ఎగరడానికి సిద్ధం అన్న భంగిమలో కనపడతాడు. వినతాసుతుని ఇలాంటి భంగిమలో మరెక్కడా చూడము. మిగిలిన  అన్ని చోట్లా ధ్వజస్థంభం వద్ద ముకుళిత హస్తాలతో ఉంటాడు. 

శని క్షేత్రం 

పెరుంగుళం శ్రీ వైష్ణవ శని క్షేత్రం. గర్భాలయానికి ఉత్తర భాగంలో సూర్య సుతునకు ప్రత్యేక స్థానం కేటాయించారు. మందగమనుని అనుగ్రహం కొరకు భక్తులు చేయించుకునే జపాలు, పూజలు, శాంతులు, దానాలు జరుపుతారు. ఇక్కడ నిర్వహించే శాంతి పూజలకు విశేష ఫలితం ఉంటుందని విశ్వసిస్తారు. ఇలాంటి ఏర్పాటు మనం ఈశ్వరాలయాలలో కూడా చూడలేము. 

ఆలయ విశేషాలు 

ఇది కూడా పాండ్య రాజుల నిర్మాణమే ! తూర్పున ఉన్న రాజా గోపురాన్ని కలుపుతూ ఎత్తైన రాతి ప్రహరీని నిర్మించారు. పెద్ద ప్రాంగణంలో ఉన్నా ఆలయం సాదాసీదాగా ఉంటుంది. ఎలాంటి శిల్పకళా కనపడదు. ఉపాలయాలు కూడా ఉండవు. ప్రధాన ఆలయానికి వెలుపల శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ వేంకట నాథన్ ఆలయం ఉంటుంది. 
తిరుకుళందై శాశ్విత దివ్య దేశ హోదా పొందడానికి కూడా శ్రీ నమ్మాళ్వార్ గానం చేసిన పాశురాలే కారణం.
" గొప్పవారమని గంభీరోపన్యాసాలు చేసే గౌరవనీయులు కాలాన్ని అశాశ్వితమైన ఇహలోక సుఖాలతో కాలక్షేపం చేస్తారు. జీవిత చరమాంకంలో తమ తప్పిదానాలకు చింతిస్తారు. పశ్చాత్తాపం చెందుతారు. దానికన్నా పరమాత్ముని దివ్యచరణాల వద్ద శరణాగతిని కోరుకొంటే అంతకన్నా అనిర్వచనీయమైన సుఖం మరియు సంతోషం ఉండవు. పెరుమాళ్ళు మాయాకూతన్ సమస్త రాక్షసులను, అన్ని దుష్ట శక్తులను అంతం చేసేవాడు" అని తన పాశురంలో పేర్కొన్నారు నమ్మాళ్వార్.
అప్పటికీ ఇప్పటికీ ఆయన చెప్పినదే జరుగుతున్నది కదా ! అందుకే ఆళ్వార్ పాశురాలను ద్రావిడ వేదం అని పేర్కొంటారు భక్తులు.


జై శ్రీమన్నారాయణ !!!


తిరువరగుణమంగై (నాతం)- చంద్ర గ్రహ క్షేత్రం 

నవతిరుపతులలో ఇది చంద్రగ్రహ క్షేత్రం. ఉండటానికి శ్రీ వైకుంఠానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నా ఆలయ సమయాలలో తేడా వలన వెంటవెంటనే దర్శించుకోడానికి కుదరదు. 
పురాతన గ్రంధాలలో, పాశురాల్లో " తిరువరగుణమంగై" అని పేర్కొన్నా స్థానిక నామం మాత్రం "నాతం". శ్రీ విజయాసన పెరుమాళ్ కొలువైన ఈ ఆలయాన్ని కూడా పాండ్య రాజులు నిర్మించారని శాసనాలుతెలుపుతున్నాయి. 
తమిరపారాణి నదీ తీరంలో ఈ ఆలయ పరిసరాలలో " శ్రీ రోమశ మహర్షి" తపస్సు చేసుకొనేవారట. ఆయన ఇష్టదైవం శ్రీ విజయాసనుడే ! మహర్షి మూలంగా ఈ క్షేత్రం మహరాజుల ఆదరణకు నోచుకొన్నది అని అంటారు. ఇంతకు మించి పురాణ గాధ అంటూ ప్రత్యేకంగా అందుబాటులో లేదు. 
అగ్నిదేవుడు శాపవిమోచన కొరకు పన్నగ శయనుని గురించి ఈ క్షేత్రంలో తపమాచరించి విముక్తి పొందారట. ఆయన నిర్మించినందున ఆలయ కోనేరును "అగ్ని పుష్కరణి" అంటారు. 
నాతం మోక్ష స్థలం. ఎవరైతే శ్రీ విజయాసన పెరుమాళ్ ని సేవించుకొంటారో వారికి పునర్జన్మ ఉండదని స్థానికులు విశ్వసిస్తారు. అలానే తిరువరగుణమంగై సర్వసిద్ది స్థలం కూడా ! ఆలయంలో స్వామి వారి ఎదుట నేతి దీపం వెలిగించి మదిలోని కోరిక విన్నవించుకొంటే తప్పక సిద్ధిస్తుంది అని క్షేత్ర మహత్యం తెలుపుతోంది అంటారు. ప్రతి నిత్యం ఎందరో భక్తులు వచ్చి దీపాలు వెలిగిస్తుంటారు. 
నాతం చంద్ర గ్రహ పరిహార స్థలం. జాతకరీత్యా చంద్ర గ్రహ దోషాలను ఎదుర్కొంటున్నవారు గ్రహ శాంతికి నిర్ణయించిన పూజలు, శాంతులు జరిపించుకొంటుంటారు. 
ఆలయ రాజ గోపురం దూరానికి ఎత్తుగా రంగురంగుల శిల్పాలతో ఆకర్షిస్తుంది. దాని మీద భాగవత, విష్ణు లీలా విన్యాసాలను రమణీయంగా మలచారు. మిగిలిన ఆలయం పెద్దదే కానీ మరెలాంటి శిల్పాలు కనిపించవు. 
గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీ విజయాసన పెరుమాళ్ ఉపస్థిత భంగిమలో ఇరుపక్కలా శ్రీదేవి, శ్రీ వరగుణ వల్లి తాయారులతో వెన్నెలకు ప్రతిరూపమైన వెండి ఆభరణాల అలంకరణలో నయనమనోహరంగా దర్శనమిస్తారు. శ్రీవారు  ఒక చేత్తో రమ్మని పిలుస్తూ, మరో చేత్తో పాదాలను చూపిస్తూ " శరణాగతే శరణ్యం " అన్న సందేశానిస్తుంటారు.  
నమ్మాళ్వార్ గానం చేసిన పాశురం వలన ఈ క్షేత్రం కూడా దివ్య తిరుపతుల జాబితాలో చేరింది. "శయన భంగిమలో తిరుపుళింగుడి లో, ఉపస్థిత భంగిమలో తిరువరగుణమంగై లో, స్థానిక భంగిమలో శ్రీ వైకుంఠంలో కొలువైన నీవు నా బాధలను దూరం చేసావు. నీ దయతో నన్ను నీ దాసుడను చేసుకున్నావు. నీ దరహాసం వర్షించడానికి సిద్ధంగా ఉన్న మేఘం మీది మెరుపు. ఓ దేవా నిరంతరం నిన్ను దర్శిస్తూ ఆనంద నృత్యాలు చేస్తూ మమ్ములను తరించేలా ఆశీర్వదించు" అంటూ భక్తులందరి తరుఫునా శ్రీహరికి విన్నవించుకొన్నారు ఆళ్వార్. 


 తిరుప్పులింగుడి - బుధ గ్రహ క్షేత్రం 


పాండ్య నాడులోని నవతిరుపతులలో మూడవది అయిన ఈ క్షేత్రం తమిరపారాణి నదికి ఉత్తర తీరాన తిరువరగుణమంగై కి ఒక కిలోమీటరు దూరంలో ఉంటుంది. ఇక్కడ కూడా సమయాల ఇబ్బంది ఉన్నది. ఒకేసారి దర్శించుకోడానికి వీలుకాదు. 
బుధ గ్రహ పరిహార క్షేత్రముగా పేరొందిన ఈ స్థలములో పరమాత్మ కొలువు తీరడానికి సంబంధించిన గాఢ సృష్ట్యాది కి చెందినదిగా తెలుస్తోంది. 

పురాణ గాధ 

లక్ష్మీనాధుడు దేవేరితో కలిసి గరుడవాహనం మీద విహరిస్తూ ఈ ప్రాంత ప్రకృతి సౌందర్యానికి ముగ్ధులైనారట. భువికి దిగి నదీతీరంలో వనాలలో విహరించసాగారట. వారి అన్యోన్యతకు, ఆనందానికి అసూయా చెందిన భూదేవి అలిగి భూలోకానికి వెళ్లిపోయిందట. 
దానితో లోకాల్లో అంధకారం అలముకొన్నదట. తల్లడిల్లిన జనులందరూ జనార్ధుని శరణు కోరారట. భువనపాలకుడు పాతాళానికి వెళ్లి భూదేవిని బుజ్జగించి తీసుకొని వచ్చారట. లోకాలలో వెలుగు తిరిగివచ్చినదట. అలా అమ్మవారిని తిరిగి తీసుకొని వచ్చినందున  అందరూ " శ్రీ భూమిపాలక పెరుమాళ్" అని కీర్తించారట. నేటికీ అలానే పిలుస్తారు.  భూమిని పాలించేవాడు అని అర్ధం వచ్చే ఈ సంస్కృత నామాన్ని నమ్మాళ్వార్ తమిళంలో " కైశిన వేందన్" అని పేర్కొంటూ రెండు అర్ధాలలో ఈ పేరును తన పాశురంలో వాడారు. రెండో అర్ధానికి సంబంధించిన గాధ ఇలా ఉన్నది. 
దేవేంద్రుడు జింకల రూపంలో క్రీడిస్తున్న ముని దంపతులను తెలియక వేటాడి చంపారట. దాని వలన ఆయనకు బ్రహ్మ హత్యాపాతకం సంక్రమించిందిట. దానిని తొలగించుకోడానికి బృహస్పతి సలహా మేరకు ఇక్కడికి వచ్చి స్వామిని సేవించుకొని కలిగిన పాతకాన్ని తొలిగించుకొన్నాడట. దానికి కృతజ్ఞతగా శ్రీహరిని సంతుష్టి పరచడానికి ఒక యజ్ఞం చేయ సంకల్పించాడట. కానీ దానికి దాపున ఉన్న అడవిలో నివసించే అసురుడొకడు ఆటంకాలు కలిగించసాగాడట. యాగ దీక్షలో ఉన్న ఇంద్రునికి దిక్కుతోచక దేవాధినాధుని ప్రార్ధించారట. ఆగ్రహించిన గరుడవాహనుడు సుదర్శన చక్ర ప్రయోగంతో రాక్షసుని అంతం చేశారట. తమిళంలో "కేశిన" అంటే కోపం. "వేందన్" అంటే సంహరించినవాడు. కోపంతో అసురుని సంహరించినవాడు అన్న అర్ధంలో ఆళ్వార్ ఈ పదాలను వాడారు. ఇలాంటి పద ప్రయోగం వలననే నమ్మాళ్వార్ గానం చేసిన పాశురాలు నేటికీ జనబాహుళ్యంలో విశేష ఆదరణ పొందుతున్నాయి. 

ఆలయ విశేషాలు 

పాండ్య నిర్మాణమైన ఈ చిన్న ఆలయంలో ఉన్న ఒకే ఒక్క విశేషం శ్రీ కేశిన వేందన్ పెరుమాళ్. 
అంత ఆకర్షణీయంగా నిలువెత్తు రూపంలో  విశేష అలంకరణలో శయనభంగిమలో ఉంటారు మూలవిరాట్టు. శేషతల్పం మీద విలాసంగా పవళించిన స్వామి పాదాలకు ఇరుపక్కలా తయారులు శ్రీ దేవి, భూదేవి ఉపస్థితులై ఉంటారు. ఈ భంగిమలో స్వామి సుందర ముఖారవిందాన్ని మాత్రమే భక్తులు దర్శించుకోగలరు. కానీ అర్చనామూర్తి పాదదర్శన చేయనిదే సందర్శనా ఫలితం దక్కదని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అందువలన బ్రహ్మ కడిగిన పాదాలను భక్తులు దర్శించుకోడానికి ఈ ఆలయంలో ఒక ప్రత్యేక ఏర్పాటు చేశారు. 
భూమిపాలక పెరుమాళ్ సున్దర వదనాన్ని దర్శించుకున్న భక్తులు గర్భాలయానికి ప్రదక్షణ చేస్తూ ఉత్తరం పక్కన ఏర్పాటు చేసిన కిటికీ గుండా ముల్లోకాలను కొలిచిన పాదాలను దర్శించుకొంటారు. ఇలాంటి ఏర్పాటు, విశేషం మరొక  దివ్య దేశంలో కనిపించదు. 
తిరుప్పుళింగుడి  బుధ గ్రహ పరిహార క్షేత్రం. దోషనివారణ పూజలు, జపాలను పెద్ద ఎత్తున జరుగుతుంటాయి ఇక్కడ. 
నమ్మాళ్వార్ తన పాశురంలో " ఆగ్రహంతో గరుత్మంతుని మీద కూర్చొని నీవు ఓ కేశినవెంద పెరుమాళ్ మాలి, సుమాలి లాంటి అసురులను సంహరించావు. ఆ సమయంలో నీ రూపం బంగారు వర్ణంతో శోభించే మేరు పర్వత శిఖరాన్ని ఆక్రమించిన కాలమేఘంలా దర్శనమిచ్చినది. రత్నఖచిత కిరీటంతో సహా అనేకానేక స్వర్ణాభరణాలను అలంకరించుకొని, పంచాయుధాలను ధరించి  తిరుప్పుళింగుడి లో కొలువైన నీవు నా ఇహలోక కష్టాలను దూరం చేసి నిరంతరం నీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించి ఆశీర్వదించు" అంటూ స్వామివారిని ప్రశంసిస్తూనే మదిలోని కోరికను విన్నవించుకొన్నారు ఆళ్వార్. 

రాహు కేతు స్థలం - ఇరట్టై తిరుపతి 

ఇరట్టై అంటే రెండు. రెండు ఆలయాలు పక్కపక్కనే ఉన్నందున ఈ క్షేత్రానికి ఈ పేరొచ్చినది. ఉండటానికి రెండు అయినా వీటిల్లో ఒక్కటే దివ్యదేశం. కానీ ఒక ఆలయం రాహు, మరో ఆలయం కేతు పరిహార స్థలాలుగా ప్రసిద్ధి.
తిరుప్పులింగుడి కి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో దక్షిణ పక్క ఉన్న ఆలయంలో  దేవేరులు శ్రీ దేవి, శ్రీ కరుణ తాండన్ నాంచారీలతో శ్రీ అరవిందలోచన పెరుమాళ్, ఉత్తరం పక్క ఉన్న దానిలో శ్రీ దేవపిరన్ పెరుమాళ్ కొలువై ఉంటారు.
నమ్మాళ్వార్ శ్రీ అరవిందలోచన పెరుమాళ్ ని కీర్తిస్తూ పాశురగానం చేశారు. అందువలన ఆ ఆలయమే దివ్యదేశం. రెండు ఆలయాలలో రాహుకేతు గ్రహ శాంతి జపాలు, పూజలు జరుగుతుంటాయి.
రెండూ చిన్న ఆలయాలే ! శ్రీ దేవపిరన్ ఆలయంలో స్వామి ఒక్కరే కొలువై ఉంటారు. అమ్మవార్లు ఉండరు.  ఈ క్షేత్రానికి సంబంధించిన గాధ ఇలా ఉన్నది.

పౌరాణిక గాధ 

సుప్రభ మహర్షి శ్రీ లక్ష్మీనారాయణుని దర్శనం అపేక్షించారట. శ్రీహరిని సంతృప్తి పరచడానికి తపస్సు చేయ నిర్ణయించుకున్నారట. దానికి తగిన స్థలం పవిత్ర తమిరపారాణి నదీతీరంలోని ఈ క్షేత్రం తగినదిగా తలంచారట. 
యజ్ఞగుండం తవ్వే క్రమంలో ఒక విల్లు, ఒక త్రాసు బయల్పడినాయట. మహర్షి వాటిని తాకిన మరుక్షణం త్రాసు సుందర యువతిగా , విల్లు అందమైన యువకునిగా మారిపోయారట. మహామునితో వారు  తాము గంధర్వులమని, ఇక్కడ సరససల్లాపాలలో మునిగి తేలుతూ కుబేరుని'రాకను గమనించక ఆయన శాపంతో ఇలా మారి పోయామని తెలిపారట. ఒక మహర్షి చేతి స్పర్శతో శాపవిమోచనం లభిస్తుంది అని అన్నారట కుబేరుడు. సుప్రభునికి కృతఙ్ఞతలు తెలుపుకొని వారు వెళ్లిపోయారట. అలా ఈ క్షేత్రానికి " తులం (త్రాసు), విల్లి (విల్లు) మంగళం" అన్న పేరొచ్చినది. కానీ రెండు ఆలయాలు ఉండటం వలన ఇరట్టై తిరుపతిగానే ప్రసిద్ధి. 
మహాముని తలపెట్టిన యాగం దిగ్విజయంగా పూర్తి అయినదట. సాక్షాత్కరించిన వైకుంఠనాధుడు ఇక్కడ " శ్రీ దేవపిరన్" గా కొలువుతీరారట. 
ప్రతి నిత్యం మహర్షి దాపున ఉన్న కోనేటి నుండి కలువ పూలను సేకరించి స్వామిని అందంగా అలంకరించేవారట. ఆ పుష్పాల సౌదర్యానికి, సౌగంధానికి మైమరచి అలంకార ప్రియుడు ముని ఎక్కడ నుండి ఇంత చక్కని పూలను తీస్తున్నాడా అన్న సందేహంతో ఒకరోజు ఆయనను అనుసరించారట. 
గలగలా సాగుతున్న నదీప్రవాహం, చుట్టూ పర్వతాలు, ఎత్తుగా పెరిగిన వృక్షాలు, మందగమనంతో సాగుతున్న వాయుదేవుని మృదుస్పర్శ ల మిశ్రమంగా అక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నది. అన్నింటికీ మించి కోనేరులోని పుష్పాలు. అన్నింటిని మైమరచి వీక్షిస్తున్న పరంధాముని వద్దకు ఇంద్రుడు, వాయువు, వరుణుడు వచ్చి ఈ పద్మనాభ పుష్కరణి ఒడ్డున కూడా కొలువు తీరమని అర్ధించారట. అంగీకరించారట  పద్మనాభుడు. నయనాలను విప్పార్చుకుని కలువ పూలను చూసిన స్వామిని తగినట్లుగా "శ్రీ అరవిందలోచనుడు" అని పిలవసాగారు. 

పద్మనాభ పుష్కరణి 

పెరుమాళ్ళనే ఆకర్షించిన పుష్పాలు  కలిగిన ఈ పుష్కరణి మరో విశేషం కలిగి ఉన్నది.  అదేమిటంటే తొలినాళ్లలో  మహర్షుల యజ్ఞ హవిస్సులో దేవ వైద్యులైన అశ్వనీ దేవతలకు భూగం ఉండేది కాదట. "తామూ దేవతలమే ! మాకూ భాగం కావాలని" వారు విధాతను కోరారట. ఆయన సలహా మేరకు వారు ఇక్కడికి వచ్చి నిత్యం పుష్కరణిలో స్నానం చేసి శ్రీ అరవిందలోచనుని అనుగ్రహం పొందారట. హవిస్సులో భాగం సంపాదించుకొన్నారట. దేవ వైద్యులు స్నానమాచరించిన నీరు కావడాన ఔషధ గుణాలను సంతరించుకొన్నవి అన్న విశ్వాసంతో భక్తులు ఈ నీటిలో స్నానం చేస్తారు. ముఖ్యంగా  మొండి చర్మవ్యాధులు గలవారు ఎక్కువగా వస్తుంటారు. 
మిగిలిన నవతిరుపతులలోని పెరుమాళ్ళ మీద మంగళ శాసనాలనుచేసిన శ్రీ నమ్మాళ్వార్ శ్రీ అరవిందలోచన స్వామి మీద కూడా ఒక పాశురాన్ని గానం చేశారు. 
పెరుమాళ్ సాక్షాత్కారం కాంక్షించే తన హృదయాన్ని వయస్సుకు వచ్చిన వనితతో, తనను తాను ఆమె తల్లిగా చూపుతూ  ఆమె తన కుమార్తె వేదనను ఎలా తెలుపుకుందో  వెలిబుచ్చారు ఈ పాశురంలో. 
"అందమైన నా కుమార్తె కాటుకతో తీర్చిదిద్దిన విశాల నేత్రాల నిండా పెరుమాళ్ళనే నింపుకొన్నది. నిత్యం వేదం పఠనం, వైదిక సిద్ధాంతం ప్రకారం సంప్రదాయాలను పాటించేవారితో, యజ్ఞయాగాదులను నిర్వహించేవారితో పవిత్రతను సంతరించుకొన్నది తిరు తులం విల్లి మంగళం. దివ్యదేశ గొప్పదనానికి చేతులు జోడిస్తోంది. శ్రీ అరవిందలోచనుని దివ్యనామం స్మరిస్తోంది. మితిమీరిన భక్తిభావంతో గొంతు జీరపోయింది. తాదాప్యంతో పరవశించి బాహ్యస్మృతి కోల్పోయినది" . యెంత గొప్ప భావన. 

తెందురిప్పెరై - శుక్రక్షేత్రం 

పావన తమిరపారాణి నదీతీరం లో నెలకొని ఉన్న నవ తిరుపతుల లో తెందురిప్పెరై ఒకటి శుక్ర క్షేత్రం. ఎవరైనా ఎంతటి వారైనా సవతి పోరును సహించలేరు  అన్న దానికి ఉదాహరణ గా నిలుస్తుంది ఈ క్షేత్ర గాధ.
శ్రీ జగన్నాధునికి తనకన్నా భూదేవి పట్ల అధిక ఆప్యాయత, అనురాగం ఉన్నాయనే అపోహతో భాధ పడేదట శ్రీ దేవి. ముల్లోకాలను సందర్శిస్తూ వైకుంఠానికి వచ్చారట దుర్వాస మహముని. ఆయనకు తన మనసులోని ఆవేదనను తెలుపుకొన్నదట శ్రీ దేవి. మంచి రోజులు వస్తాయని ఓదార్చి ఆయన వెళ్లి పోయారట. తన దర్శనా క్రమంలో భూదేవి మందిరానికి కూడా వెళ్ళారట. ఆమె ఆయన పట్ల కొంత నిర్లక్ష్య ధోరణి లో వ్యహ్వరించినదట. అతిధి మర్యాదలు సరిగ్గా చేయలేదట. ముక్కోపి అయిన మహర్షి ఆగ్రహించి పరంధాముని ప్రేమను పొందుతున్న ఆమె సౌందర్యం ఆమెను విడిచి పోవాలని శపించారట. 
శాపగ్రస్ధురాలైన భూదేవి శ్రీ మన్నారాయణుని శరణు కోరిందట. స్వామి వారు ముని శాపాన్ని తాము తొలిగించలేమని శాప విముక్తి కి తరుణోపాయం తెలిపారట. ఆ ప్రకారం తామ్రపర్ణి నదీతీరం లోని ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ వెలసిన స్వామి ని కొలుస్తూ తపస్సు చేయసాగిందట భూదేవి. ఒకనాడు నదిలో ఆమెకు మీనాకారంలో ఉన్న రెండు కర్ణ కుండలాలు లభించాయట. వాటిని శ్రీ వారి విగ్రహనికి అలంకరించినదట. దానితో ముని శాపం తొలగి పోయినదట. ఆమె సౌందర్యం తిరిగి పొందినదట. చేప ఆకారంలో ఉన్న చెవి కమ్మెలు ధరించినందున " శ్రీ మకర నెడుంకుళై కతార పెరుమాళ్ " అని పిలుస్తారు. అమ్మవార్లు శ్రీ కుళైకాడువల్లి మరియు శ్రీ తిరుప్పెరై నాంచారి. 
బ్రహ్మ, రుద్రుడు మరియు శుక్రుడు ఇక్కడ స్వామి దర్శనం పొందారు అని అంటారు. గురువు శాప కారణంగా అసురుల చేతిలో అపజయం పొందారట  వరుణుడు. ఇక్కడకు వచ్చి శ్రీ మకర నెడుంకుళై కతార పెరుమాళ్ ని సేవించి కోల్పోయిన శక్తి సామర్ద్యాలను  సాధించుకొని రాక్షసులను ఓడించారట. 
ఆలయం పాండ్య నిర్మాణం. సుందర పాండ్య కాలంలో వర్షాలు లేక కరువు ఏర్పడిందిట రాజ్యంలో. పండితుల సలహ మేరకు రాజు నూట ఎనిమిది మంది సామవేద పండితుల ఆధ్వర్యంలో స్వామి కి ప్రత్యేక పూజలు, వరుణుని రాక కొరకు యాగాలు నిర్వహంచారట. వానలు కురిసి దేశం తిరిగి సుభిక్షమైనదట. మరో విశేషం ఏమిటంటే అప్పటి దాకా సంతానం లేని పాండ్య రాజుకు ఈ యాగం తరువాత కుమారుడు జన్మించాడట. ఒకప్పుడు ఈ ఊరు వేద పండితుల అగ్రహారం. నిత్యం వేద పఠనం, యజ్ఞ యాగాదులు జరుగుతుండేవట . కాల క్రమంలో వారంతా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు అని అంటారు. 
చిన్న ఆలయం లోని మండప స్ధంభాల కు చక్కని శిల్పాలను చెక్కారు . గర్బాలయంలో శ్రీ మకర నెడుంకుళై కతార పెరుమాళ్ ఉపస్థిత భంగిమలో ఎడమ కాలుని చిత్రంగా మడిచి ఉంచి కనిపిస్తారు. మూలవిరాట్టు కు ఇరువైపులా బృగుమహర్షి,  మార్కండేయ మహర్షి నమస్కార ముద్రలో ఉంటారు. 
ఇద్దరు దేవేరులు విడి విడి సన్నిధులలో కొలువై ఉంటారు. 
తెందురిప్పెరై దివ్య దేశం గానే కాకుండా నవకైలాస క్షేత్రాల లో ఒకటి గా గుర్తింపు పొందినది. శ్రీ కైలాసనాధ స్వామి కొలువైన ఆలయ దర్శనం పుణ్యప్రదం. 
శ్రీ మకర నెడుంకుళై కతార పెరుమాళ్ ని కీర్తిస్తూ శ్రీ నమ్మాళ్వారు ఒక్కరే పాశురగానం చేసారు. ఆళ్వారు తిరునగరి కి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తెందురిప్పెరై. 

తిరునెల్వేలి జిల్లాలో పావన తమిరపారాణి నదీ తీరంలో నెలకొన్ని ఉన్న నవ తిరుపతులు లేదా శ్రీ వైష్ణవ నవగ్రహ క్షేత్రాలలో చివరి రెండు స్థలాలు ప్రముఖమైనవిగా పేరొందినవి. కారణం ఆ క్షేత్రాలు పన్నిద్దరు ఆళ్వారులలో ప్రముఖులైన శ్రీ నమ్మాళ్వార్ మరియు శ్రీ మధురకవి ఆళ్వారుల జన్మస్థానాలు కావడం. 

తిరుక్కోలూరు -  అంగారక క్షేత్రం    

పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ఒకరైన శ్రీ మధుర కవి జన్మస్ధలం. కవి, పండితుడు, శ్రీ మహవిష్ణువు భక్తుడు అయిన మధుర కవి ఎన్నో క్షేత్రాలను సందర్శించుకొన్నారు. దక్షిణ దేశంలో ఉన్న దివ్యదేశాలతో పాటు ఉత్తరభారతదేశం లోని దివ్య దేశాలను దర్శించుకొన్న ఒకే ఒక్క ఆళ్వారు ఈయనే ! 
యాత్రలు చేస్తూ అయోధ్య చేరుకుని రామ జన్మ భూమిని సందర్శించుకొన్న మధుర కవిని ఆకాశంలో అద్వితీయమైన ప్రకాశవంతమైన తార ఒకటి ఆకర్షించినదట. అది ఆయన ఉన్న ప్రాంతానికి దక్షిణ దిశగా ఉన్నదట. దానిని ఏదో దివ్య సందేశానికి సంకేతంగా భావించిన ఆయన ఆ దిశగా ప్రయాణించి తమిరపారాణి నదీతీరం లోని ఆళ్వారుతిరునగరి చేరుకొన్నారట. అక్కడ పుట్టినది మొదలు మౌనంగా చింత చెట్టు తొర్రలో ఉంటూ నిరాహరంగా ధ్యానంలో ఉన్న బాలుని గురించి తెలిసిందట. ఆయనే నమ్మాళ్వారు. ప్రధమ వీక్షణం లోనే ఆయన పట్ల గౌరవ భావం కలిగిందట. అది ఆయన తొలి సారిగా మధుర కవితో పలికిన మాటలతో స్థిరపడి వయస్సులో ఎంతో చిన్న వాడైన ఆయనను తన గురువు గా స్వీకరించారట. ఆ క్షణం నుండి ఆయన సేవలోనే ఉండిపోయారట. మధుర కవి గానం చేసిన కొద్ది పాశురాలలో నమ్మాళ్వారు గొప్పదనమే కనపడుతుంది. 
నమ్మాళ్వారు అవతార సమాప్తి సమయాన గరువు అండదండలు లేకుండా తను ఎలా ఉండగలను అని భాధపడ్డారట మధుర కవి. అప్పుడు నమ్మాళ్వారు ఒక మార్గం తెలిపి వైకుంఠానికి వెళ్ళిపోయారట. దాని ప్రకారం పవిత్ర తమిరపారాణి నీటిని తెచ్చి మరిగించగా ఒకటి తరువాత ఒకటిగా రెండు పంచ లోహ విగ్రహాలు ఉద్భవించాయట. మొదటిది అనంతరకాలంలో జన్మించిన శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులది కాగా రెండవది శ్రీ నమ్మాళ్వారు ది. నవతిరుపతులలో మరోక క్షేత్రమైన ఆళ్వారు తిరునగరిలో మనం దర్శించుకొనే నమ్మాళ్వారు  విగ్రహం అదే! 
ఇక తిరుక్కోలూర్ లో కొలువై ఉన్నది శ్రీ వైధమానిధి పెరుమాళ్. శయనభంగిమలో కనిపించే స్వామి పేరుకు తగ్గట్టుగా అర్హులైన వారికి నవనిధులను ప్రసాదిస్తారన్నది భక్తుల విశ్వాసం. 
క్షేత్రగాధ కూడా దీనిని బలపరిచేదిగా ఉండటం విశేషం.
ఆదిదంపతుల దర్శనానికి కైలాసం వెళ్లిన కుబేరుడు పార్వతీదేవి సౌందర్యానికి చలించాడట. గమనించిన అమ్మవారు ఆగ్రహించి అతని అధీనంలో ఉన్న నవనిధులను కోల్పోయి దరిద్రం అనుభవించమని శపించారట.  తన తప్పుకు క్షమించమని వేడుకున్న కుబేరుని పావన 
తామ్రపర్ణి  నదీతీరంలో కొలువైన శ్రీ మహవిష్ణువును సేవించి శాపవిమోచనం పొందమన్నారట. శివాజ్ఞ ప్రకారం తిరుక్కోలూర్ క్షేత్రం లో స్వామిని సేవించుకొని అమ్మవారి శాపాన్ని తొలగించుకొన్నారట కుబేరుడు. 
నాటి నుండి నవనిధులు శ్రీ వారి అధీనంలో ఉండసాగాయట. ఈ కారణాన మూలవిరాట్టును శ్రీ వైధమానిధి పెరుమాళ్ అని పిలుస్తారు. కుబేరుడు నిర్మించిన ఆలయ పుష్కరిణి ని ఆయన పేరుతోనే పిలుస్తారు. 
సాదాసీదాగ ఉండే ఆలయాన్ని పాండ్య రాజుల నిర్మించారట. గర్బాలయంలో ప్రధాన అర్చనామూర్తి భుజంగశయనుడై దర్శనమిస్తారు. శ్రీ కుముదవల్లి, శ్రీ కోలూరువల్లి తాయారులు విడివిడిగా సన్నిధులలో కనిపిస్తారు. 
తిరుక్కోలూరు అంగారక పరిహార క్షేత్రం. భూమి పుత్రుని తరఫున శ్రీ వారే అన్ని పూజలు, ప్రార్థనలు, దానాలు మరియు జపాలను స్వీకరిస్తారు. అనుగ్రహిస్తారు. శ్రీ వైధమానిధి పెరుమాళ్ ను కీర్తిస్తూ నమ్మాళ్వారు ఒక్కరే పాశురగానం చేసారు.

ఆళ్వారు తిరునగరి (తిరుకుగునూర్ )

నాదముని ద్వారా మానవాళి కి నలయిర దివ్య ప్రభంధనాన్ని అందించిన నమ్మాళ్వారు జన్మస్థలం తిరుకుగునూర్. కానీ మహనీయుని జన్మస్ధలం గా ఆయన పేరు మీద ఆళ్వారు తిరునగరి అని పిలవసాగారు. 
నమ్మాళ్వారు అసలు పేరు మారన్. పదహారు సంవత్సరాల పాటు చింత చెట్టు తొర్రలో తపస్సు చేసారు. జీవితకాలం లో అక్కడి నుండి కదలలేదు. అయినా ఎక్కడెక్కడో కొలువైన శ్రీ హరి ని కీర్తిస్తూ పాశురగానం చేసారు. వైకుంఠుడు ఆయా రూపాలలో ధ్యానంలో ఉన్న నమ్మాళ్వారు కు దర్శనమిచ్చే వారని ప్రజలు విశ్వసిస్తారు. జీవిత సత్యాలను, మానవ జీవిత పరమార్దాన్ని లలిత లలిత తమిళ పదాలతో అందరికీ అర్దమయ్యే రీతిలో పాశురగానం చేయడం వలన ప్రజలు ప్రేమతో మన ఆళ్వారు అని అర్దం వచ్చేలా నమ్మాళ్వారు అని పిలవసాగారు.
కీర్తనాప్రియుడైన శ్రీమన్నారాయణుని సైన్యాద్యక్షుడైన విష్వక్సేనుని అవతారమే నమ్మాళ్వారు అని భావిస్తారు. 
నలయిర దివ్య ప్రభంధం లోని నాలుగు వేల పాశురాలలో నమ్మాళ్వారు ఒక్కరే గానం చేసిన వెయ్యి పాశురాలు ఉండటం విశేషం . 
నమ్మాళ్వారు వైకుంఠం వెళ్లి పోయిన తరువాత మధుర కవి తన గురు దేవుడు రచించిన కీర్తనలను పాండ్య రాజు ఏర్పాటు చేసిన పండిత సమాఖ్య కు సమర్పించారట. వారు వాటిని మిగిలిన కవులు రచించిన కావ్యాలతో కలిపి ఒక తాటి ఆకు మీద ఉంచి కోనేటి లోనికి వదిలారట. చిత్రంగా మిగిలినవి నీటిలో మునిగిపోగా నమ్మాళ్వారు రచించినవి ఆకు మీద ఉండి పోయాయట. తరువాత వాటిని పూర్తిగా అధ్యయనం చేసిన సమాఖ్య ఆ నాలుగు సంపుటాలు నాలుగు వేదాలతో సమానమని నిర్ణయించారట. ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో నవతిరుపతులలో నమ్మాళ్వారు జన్నదినాన ఆయన గౌరవార్థం గరుడ సేవ ఘనంగా నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. 
శ్రీ ఆదినాధ పెరుమాళ్ ఈ క్షేత్రంలో మూలవిరాట్టు. ఇక్కడ ఇంద్రుడు,  విధాత,  బృహస్పతి,  నమ్మాళ్వారు మరియు మధుర కవి శ్రీవారి దర్శన భాగ్యం పొందారట
అయిదు ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మింపబడిన ఆలయానికి తూర్పున తొంభై ఏడు అడుగుల రాజగోపురం విష్ణు లీలా విన్యాసాల శిల్పాలతో సుందరంగా కనపడుతుంది. మూడు ప్రాకారాలు కలిగిన ఈ దివ్య క్షేత్రంలో ని తిరుమంజన, తిరుమామణి , కన్నాడి మండపాలు చక్కని శిల్పాలతో అలరిస్తాయి. ఇవే కాకుండా మరెన్నో శిల్ప విన్యాసాలు అబ్బురపరుస్తాయి. సప్త  స్వరాలు పలికే రాతి నాద స్వరం, సంగీత స్ధంభాలు నాటి శిల్పుల ప్రతిభాపాటవాలకు నిదర్శనంగా నిలిచి ఉన్నాయి. 
ఉపాలయాలలో శ్రీ రామ, శ్రీ వేణుగోపాల, శ్రీ నృసింహ, శ్రీ వరాహ స్వామి, శ్రీ ఆంజనేయ, శ్రీ లక్ష్మీ, శ్రీ ఆదినాధ వల్లి  కొలువైఉంటారు. 
ప్రత్యేక సన్నిధి లో దర్శనమిచ్చే శ్రీ నమ్మాళ్వారు విగ్రహం ఆయన సూచించిన మేరకు తమిరపారాణి నది నీటిని మరిగించగా మధుర కవి ఆళ్వారుకు లభించిన పంచలోహ విగ్రహం. ఎవరూ మలచిన ది కాదు. స్వయంవ్యక్త మూర్తి. 
గర్బాలయంలో శ్రీ ఆదినాధ పెరుమాళ్ స్ధానక భంగిమలో  రమణీయ పుష్పాలంకరణతో కనిపిస్తారు. ఇక్కడ స్వామి వారి పాదాలు భూమిలో ఉంటాయి. కనుక పాదదర్శనం లభించదు. 
నమ్మాళ్వారు తపస్సు చేసిన చింత చెట్టును  ప్రాంగణంలో చూడవచ్చును. దీని వయస్సు రెండు వేల సంవత్సరాల పైచిలుకు గా శాస్త్రవేత్తలు నిర్ణయించారట.  
నమ్మాళ్వారు శ్రీ ఆదినాధ పెరుమాళ్ మీద పదకొండు పాశురాలను గానం చేశారు.

జై శ్రీ మన్నారాయణ! ! ! ! 





Kanchipuram Temples - 2

                           కాంచీపురం - దివ్య దేశాలు -2




సప్త ముక్తి క్షేత్రాల లో ఒకటి గా కీర్తించబడే కాంచీపురం లో మొత్తంగా పదునాలుగు శ్రీ  వైష్ణవ దివ్య తిరుపతులు ఉన్నాయి అని గతంలో తెలుసుకొన్నాము కదా ! ఆ ప్రకారం ఇప్పటి దాకా పది క్షేత్రాలను పరిచయం చేయడం జరిగింది. మిగిలిన నాలుగు ఆలయాల గురించి ఈ సంచికలో తెలుసుకొందాము. ఈ నాలుగు కూడా పెద్ద లేదా శివ కంచి లో ఉండటం విశేషం.  అంతే కాదు వీటిలో ఒకటి శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో మరొకటి శ్రీ కామాక్షి అమ్మన్ కోవెలలో ఉండటం చెప్పుకోవలసిన విషయం. వీటితో పాటు కంచీపురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో  ఉన్న మరో దివ్య దేశ విశేషాలను కూడా చూద్దాము. 

శ్రీ పాండవదూత పెరుమాళ్ ఆలయం 

ఆళ్వారులు ఈ క్షేత్రాన్ని "తిరుప్పాదగం " ( శ్రీ +పెద్ద +క్షేత్రం ) అని పాశురాలలో సంభోధించారు. పేరుకు తగ్గట్టుగా కొలువైన "శ్రీ పాండవదూత పెరుమాళ్ " అర్చామూర్తి పాతిక అడుగుల ఎత్తు విగ్రహ రూపంలో దర్శన మిస్తారు. కురుక్షేత్ర యుద్దానికి ముందు వాసుదేవుడు పాండవుల తరుఫున రాయబారిగా కౌరవ సభకు వెళతారు. ఆయన హితోపదేశాలు,  హెచ్చరికలు రారాజు కు ఆగ్రహం కలిగించాయి. దూతను గౌరవించాలని తెలిసినా కోపంతో శ్రీ కృష్ణుని భంధించ యత్నించాడు. నిజభక్తులకు కన్నుల పండుగ కలిగించేలా, దూర్తులను భయకంపితులను చేసేలా జగద్రక్షకుడు విశ్వరూపాన్ని ప్రదర్శించారు.  తదనంతరకాలంలో పాండవుల ముని మనుమడైన జనమేజయుడు ఈ వృత్తాంతం విని శ్రీ హరి విశ్వరూప దర్శనాన్ని ఆకాంక్షించారట.  గురువైన హరిత మహర్షి సలహ మేరకు కాంచీపురం లో యజ్ఞం చేసి తన ఆకాంక్ష నెరవేర్చుకొన్నారట. ఆయన కోరిక మేరకు స్వామి ఇక్కడ శ్రీ పాండవదూత పెరుమాళ్ గా కొలువు తీరానికి క్షేత్ర గాధ తెలుపుతోంది.
తూర్పు ముఖంగా ఉండే ఆలయ గర్బాలయంలో సింహసనం మీద ఉపస్థిత భంగిమలో అభయ ముద్ర తో ఆకాశాన్ని తాకుతుందా అనిపించే రూపంతో కనిపించే మూలవిరాట్టు నేత్ర పర్వంగా దర్శనమిస్తారు. అమ్మవారు,  శ్రీ చక్రత్తి ఆళ్వారు తమ తమ సన్నిధులలో కొలువై  ఉంటారు. 
పల్లవులు నిర్మించిన ఆలయాన్ని చోళులు,  విజయనగర రాజులు అభివృద్ధి చేసారు అనడానికి ఆలయంలో లభించిన ఎనిమిదో శతాబ్దం నుండి పదిహేనవ శతాబ్దానికి చెందిన శాసనాలు నిదర్శనంగా కనిపిస్తాయి. 
శ్రీ కామాక్షి అమ్మన్ ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ పాండవదూత పెరుమాళ్ ను కీర్తిస్తూ మొదల్ ఆళ్వారులలో ఇద్దరైన పెయ్ ఆళ్వారు, భూతత్తి ఆళ్వారులతో పాటు తరువాతి కాలానికి చెందిన తిరుమలై సై ఆళ్వారు, నమ్మాళ్వారు పాశురగానం చేసారు. అలా దివ్య దేశ గౌరవాన్ని పొందిన ఈ క్షేత్రంలో మూలవిరాట్టు ప్రధాన ఆకర్షణ.

శ్రీ పావళవన్నన్ పెరుమాళ్ ఆలయం

స్థానికంగా శ్రీ పావళవన్నన్ కోవెల గా పిలవబడే ఈ దివ్య దేశాన్ని తమ పాశురాలలో ఆళ్వారులు "తిరుపళ్ళవణ్ణం"గా పేర్కొన్నారు. కుంకుమ వర్ణ శోభితులుగా దర్శనమిచ్చే స్వామిని శ్రీ పావళవన్నన్ అని పిలుస్తారు. కృతయుగం నుండి స్వామి ఇక్కడ కొలువై ఉన్నారని అనేక పురాణాలలో,  పెక్కు పురాతన తమిళ గ్రంధాల లో పేర్కొనబడినట్లు తెలుస్తోంది. ఈ క్షేత్ర గాధ ఇలలో తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువు తీరడానికి సంభంధించిన కధ తో ముడిపడి ఉండటం విశేషం. 
పూర్వం మహర్షులకు " త్రిమూర్తులలో ఎవరు అగ్రగణ్యులు, ప్రధమ పూజితులు?  ఎవరికి యజ్ఞఫలం సమర్పించు కోవాలి? "అనితలెత్తిన సందేహన్ని తొలిగించాలని, బయలుదేరారు బృగుమహర్షి  
తనను గుర్తించి  గౌరవించలేదని అహంకరించి విధాత ను,  కైలాసవాసుని శపించి శ్రీ మహవిష్ణువు హృదయం తన్నిన కధ మనకందరకూ తెలిసిందే!  అలా మహలక్ష్మీ నిలయం అయిన శ్రీ వారి వక్షస్ధలం పైన పాదం తో తప్పడం వలన సంక్రమించిన పాపఫలం తొలగించుకోడానికి ఇక్కడ తపస్సు చేశారు బృగుమహర్షి. సంతసించి దర్శనమిచ్చిన వైకుంఠుడు " శ్రీ పావళవన్నన్ " గా కొలువుతీరారు. గర్బాలయంలో మూలవిరాట్టు తో పాటు కనిపించే బృగుమహర్షి మూర్తి ఈ క్షేత్ర గాధ కు బలం చేకూర్చుతోంది. 
శ్రీ పావళవన్నన్ ఉపస్థిత భంగిమలో కుడి కాలును కొద్దిగా మడిచి శంఖ చక్రాలను ధరించి అభయ ముద్రలో పడమర ముఖంగా కొలువై మనోహరమైన పుష్పాలంకరణతో నేత్ర పర్వంగా దర్శనమిస్తారు. అతి పురాతనమైన ఈ ఆలయాన్ని పల్లవ రాజులు నిర్మించినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. 
తిరుమంగై ఆళ్వారు ఒక్కరే శ్రీ పావళవన్నన్ ని కీర్తిస్తూ పాశురగానం చేసారు. 
కంచి రైల్వే స్టేషన్ కు వెళ్ళేదారిలో ఉన్న ఈ ఆలయానికి ఎదురుగా "శ్రీ పచ్చయవన్నార్ పెరుమాళ్ " ఆలయం ఉన్నది. దివ్య దేశం కాకున్నా విశేష ఆలయం.దర్శనీయం. 

శ్రీ నీలత్తింగళ్ త్తూండ పెరుమాళ్ ఆలయం. 

ఒకప్పుడు సహస్రాధిక ఆలయాలతో అలరారిన కాంచీపురం లో ప్రస్తుతం కొద్ది మాత్రమే మిగిలాయి. వాటిల్లో ప్రముఖమైనవి  శ్రీ ఏకాంబరేశ్వర,  శ్రీ కైలాసనాధ, శ్రీ కామాక్షి అమ్మన్, శ్రీ వరదరాజ పెరుమాళ్ ఇలా ఉన్నది జాబితా!  
నగరంలో ఉన్న శ్రీ వైష్ణవ దివ్య తిరుపతులలో ఒకటి ప్రసిద్ధ శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ఉండటం విశేషం. 
దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఒకనాడు కైలాసంలో సరస సల్లాపాల మధ్య పార్వతీదేవి త్రినేత్రుని నేత్రాలను తన కోమల హస్తాలతో క్షణకాలం మూసిందట. జగత్తుకు వెలుగును ప్రసాదించే సూర్య చంద్రులు ఆ నేత్రాలు. క్షణకాలం అయినా లోకాలన్నీ తల్లడిల్లిపోయాయట. తెలియక చేసినా తప్పు తప్పే కనుక పరిహరం చెల్లించుకోడానికి అర్దనారీశ్వరుని అనుమతితో కాంచీపురం చేరుకొన్నదట గౌరీదేవి. ఒక మామిడి చెట్టు కింద ఇసుకతో లింగాన్ని చేసి భక్తి శ్రద్దలతో సేవించసాగిందట. కొంతకాలానికి ఆమె పరీక్షింపనెంచారట. తన జటాజూటాల నుండి గంగను వదిలారట. క్షణక్షణానికి పెరుగుతున్న నీటి ప్రవాహవేగానికి సైకతలింగం ఎక్కడ మునిగి పోతుందో అని భయపడిందట. ఆందోళనతో కామాక్షి దేవి శ్రీ మహవిష్ణువు ను శరణు కోరిందట. ఆయన ఆమెను లింగాన్ని ఆలింగనము చేసుకోమని చెప్పి తాను విశ్వరూపాన్ని ధరించి ప్రవాహనికి అడ్డుగా శయనించారట. ముల్లోకాలకు విస్తరించిన శ్రీహరి ని దేవతలు,  మహర్షులు స్థుతించసాగారట. ఆ సమయంలో చంద్రుని కిరణాలు సోకి శ్రీ వారి కంఠం నీలంగా మారిందట. అందుకే స్వామిని "శ్రీ నీలత్తింగళ్ త్తూండ పెరుమాళ్ "అని పిలుస్తారు.
శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ని అమ్మవారు కౌగలించుకోవడం వలన లింగం పైన ఆమె కరకంకళాల మరియు వక్షోజాల ముద్రలు పడినాయట. వాటిని నేటికీ లింగం మీద చూడవచ్చని చెబుతారు. ఉమా దేవి తపమాచరించిన మామిడి చెట్టు కూడా ప్రాంగణంలో ఉన్నది. 
విశాల ఆవరణంలో ఉండే  శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయాన్ని తొలుత పల్లవులు, చోళులు నిర్మించారని తెలుస్తోంది. తరువాత విజయనగరాధీశుడు శ్రీ కృష్ణ దేవరాయలు ఈ ఆలయంలో ఎన్నో మండపాలు,  ఉపాలయాలను నిర్మించారు. రాజగోపురం కూడ ఆయన కాలంలోని నిర్మాణమే. చక్కని శిల్ప సౌందర్యాన్ని ప్రదర్శిస్తుందీ ఆలయం. ప్రదక్షిణా మార్గంలో ఉన్న 
గర్భాలయానికి ఎదురుగా చిన్న మందిరంలో దర్శనమిస్తారు పెరుమాళ్. దేవేరులు, ధ్వజస్తంభం, బలిపీఠం,  గరుడుడు ఏమీ ఉండవు. శైవార్చకులే పూజలు చేసే ఈ మందిరంలో ఆదిశేషుని పడగ ను ఛత్రం చేసుకుని చతుర్భుజాలతో స్తానక భంగిమలో రమణీయ పుష్పాలంకరణతో కనిపిస్తారు శ్రీ నీలత్తింగళ్ త్తూండ పెరుమాళ్. 
పన్నిద్దరు వైష్ణవ ఆళ్వారులలో ఒక్క తిరుమంగై ఆళ్వారు ఈ పెరుమాళ్ ని కీర్తిస్తూ పాశురగానం చేసారు. 

శ్రీ కల్వర పెరుమాళ్ ఆలయం

కాంచీపుర ఏలిక ,అధిష్టాన దేవత, అష్టాదశ పీఠవాసిని అయిన శ్రీ కామాక్షి అమ్మన్ గాయత్రీ మండపంలో కొలువై పూజలందుకొంటుంటారు. కొలిచిన వారికి కొంగు బంగారం ఈ అమ్మ. సతీదేవి నాభి భాగం పడిన ప్రదేశం ఇదే అని చెబుతారు. 
ప్రతి నిత్యం వేలాది మంది భక్తులుఅమ్మవారిని దర్శించుకోడానికి వస్తుంటారు. నిత్యం పర్వదినమే ఈ ఆలయంలో. 
అమ్మవారి సన్నిధి కి సమీపంలోనే ఉంటారు " శ్రీ కల్వర పెరుమాళ్ ". అలాగని ఆయన ఉన్నది పెద్ద ఆలయమో లేక ఉపాలయమో కాదు. ఒక మండప స్ధంభం మీద చతుర్భుజాలతో స్తానక భంగిమలో దర్శనమిస్తారు. కానీ స్వామి ని నేరుగా చూసే భాగ్యం లేదు. ఆలయ వెలుపల ఉంచిన దర్పణం లోనే పెరుమాళ్ ప్రతి రుపాన్ని వీక్షించగలము. ఈ క్షేత్ర గాధ ఇలా ఉన్నది.
సముద్ర రాజ తనయ, వెన్నెల రేడు శశాంకుని సోదరి అయిన శ్రీ మహలక్ష్మీ దేవి మేనిది బంగారు వన్నె ఛాయ. మరి శ్రీ మన్నారాయణుడో నీలమేఘ  శ్యాముడు. నల్లని వాడని సరదాగా గేలి చేస్తుండేది పద్మనయన. అనుకోకుండా ఒక రోజు ఆగ్రహించిన లక్షీనారాయణుడు ఆమె దేహ వర్ణం కోల్పోవాలని శపించారు. నల్లగా మారిపోయింది దేవేరి. ఏమి చేయాలో తెలియక భూలోకం లోని కాంచీపురం లో ఉన్న కామాక్షి దేవి వద్దకు వెళ్లారు. ఆమె ఈమెను ఓదార్చి తనకు భక్తులు చేసే కుంకుమ పూజ వలన కోల్పోయిన మేని ఛాయను  తిరిగి పొందగలదని వరమిచ్చారు. అలా సకల సంపదలకు అధిదేవత కంచిలో "అరూపలక్ష్మి"గా నేటికీ కొలువైన ఉన్నారు. అక్కడ వైకుంఠంలో స్వామి ఆమె ఎడబాటు ను సహించలేక ఎక్కడ ఉన్నదీ తెలుసుకొన్నారు. దీంతో  ఆయన కూడా కంచి చేరుకొన్నారు. బింకం సడల కూడదు.  ఎవరికీ తెలియకూడదు అన్న ఆలోచనతో మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ గాయత్రీ మండపం వద్దకు వెళ్ళసాగారు. కానీ ఈయన రాకను గమనించిన హృదయవాసిని " కల్వరా" అంటూ ప్రేమగా పిలిచారు. కల్వర అనగా " అందమైన చోరుడు". 
ఉలికిపాటుకు గరైన వైకుంఠుడు మండప స్ధంభం మీద శిలగా నిలిచారు. కల్వరుడు కొలువైన ప్రదేశంగా దీనిని "తిరుకల్వనూరు "గా తిరుమంగై ఆళ్వారు తన పాశురంలో పేర్కొన్నారు. 

శ్రీ విజయరాఘవ పెరుమాళ్ ఆలయం. తిరుపహిషి 

పరంధాముని  భక్తవత్సలతకు ఎల్లలు లేవు అని తెలిపే ఈ ఆలయ గాధ శ్రీ మద్రామయణం నాటి సంఘటనతో ముడిపడి ఉన్నది. 
దశకంఠుడు అపహరించుకొని పోతున్న సీతాదేవి ని కాపాడాలని శక్తి మేరకు పోరాడాడు పక్షిరాజు జటాయువు. చివరకు రెక్కలు తెగి నేలవాలాడు. జానకి దేవిని వెతుకుతూ తన వద్దకు వచ్చిన రామలక్ష్మనులకు విషయం తెలిపి దశరధ రాముని ఒడిలో కన్ను మూసాడు. అతను తమకు చేసిన సహయానికి శాస్ర్తోక్తంగా అంత్యక్రియలు చేయ నిర్ణయించారు రామయ్య. 
కార్యక్రమానికి కావలసిన నీటి కొరకు శరప్రయోగం తో పాతాళగంగ ను రప్పించారు. అదే ఆలయంలో ఉన్న "జటాయువు పుష్కరిణి ". 
వేగావతి నదీతీరం లో ప్రశాంత రమణీయ వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ విజయ రాఘవ పెరుమాళ్ ఉపస్థిత భంగిమలో తూర్పు ముఖంగా దేవేరులు శ్రీ దేవి భూదేవి తో కలిసి దర్శనమిస్తారు. మూలవిరాట్టు ఒడిలో జటాయువు ను చూడవచ్చును.  పక్షిరాజు మరణానికి చింతిస్తున్నట్లుగా అమ్మవార్లు తమ ముఖాలను పక్కకు తిప్పుకొన్న భంగిమలో కనిపిస్తారు. కొద్ది దూరంలో ఉన్న చిన్న కొండ మీద జటాయువు ఆలయం కలదు.
పక్షిరాజు జటాయువు ప్రభుసేవలో ప్రాణం విడిచిన ప్రదేశం కనుక "తిరుపహిషి "(శ్రీ పక్షి ) అన్న పేరుతో పిలవసాగారు. 
తిరుమంగై ఆళ్వారు శ్రీ విజయరాఘవపెరుమాళ్ ను కీర్తిస్తూ పాశురగానం చేసారు.
ఈ క్షేత్రంతో ముడిపడి ఉన్న మరో విశేషం ఉన్నది . పరమాచార్య శ్రీ రామానుజాచార్యులు అద్వైత సిద్దాంతాన్ని గురువు శ్రీ యాదవ ప్రకాశుల వద్ద ఇక్కడి మండపంలో నేర్చుకొన్నారట. ఆలయం వద్ద ఆ మండపాన్ని నేటికి చూడవచ్చును.
కాంచీ పురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం చేరుకోడానికి బస్సులు, ఆటోలు లభిస్తాయి. 
ఇక్కడి తో కాంచీపుర దివ్య దేశాల విశేషాలు సమాప్తం.


జై శ్రీ మన్నారాయణ! !!!!

Veda Vyasa

                       మహాభారతం పుట్టింది ఇక్కడేనట !


"వింటే భారతం వినాలి. తింటే గారెలు తినాలి " అన్నది తెలుగునాట బాగా ప్రాచుర్యంలో ఉన్న నానుడి. పంచమ వేదంగా పరిగణింపబడే మహాభారతంలో లేనిది లేదు అంటారు పండితులు. అన్ని యుగాలకు, కాలాలకు అందరికీ వర్తించే మహాకావ్యంగా పేర్కొంటారు.
తొలుత "జయ" అన్న పేరుతొ, ఎనిమిది వేల ఎనిమిది వందల శ్లోకాలతో రచించబడిందిట. తదనంతర కాలంలో కొత్తగా చేరిన కొన్ని వృత్తాంతాలు, వాఖ్యలు జతపడి చివరకు పద్దెనిమిది పరువాలతో, లక్ష శ్లోకాలతో "మహా భారతం"గా మనకు అందుబాటు లోనికి వచ్చింది.
ఈ ఇతిహాసం లోని సంఘటనలు, పాత్రలు నేటికీ మనకు ఎక్కడొక్కడ, ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతుంటాయి. సత్కర్మ, దుష్కర్మల ఫలితాలను తప్పక అనుభవించాలని ఎన్నో ఘటనల, పాత్రల ద్వారా సవివరంగా తెలియజేస్తుంది.
















పరాశర మహర్షి కుమారుడైన "కృష్ణ ద్వైపాయనుడు". వేదాలను వర్గీకరించడం వలన "వేద వ్యాస"గా ప్రసిద్ధి చెందారు. అష్టాదశ పురాణాలను మనకు అందించినది వ్యాసుడే ! ఆయన స్వయంగా విరచించిన మహాభారతంలో ఆయనది  కీలక పాత్ర.  కురువంశ ఆవిర్భావానికి దారి తీసిన ఘట్టాల నుండి లక్షలాది మంది మరణానికి దారి తీసిన కురుక్షేత్రం వరకు జరిగిన విషయాలను అక్షరీకరించాలని తలంచారు వ్యాస భగవానుడు. తగిన లేఖరి కొరకు ముల్లోకాలను గాలించి చివరికి విఘ్ననాయకుడు వినాయకుని ఎన్నుకొన్నారట.
అంగీకరించిన గణేశుడు ఒక షరతు విధించారట. అదేమిటంటే ఆయన ఘటం ఆగకుండా కావ్యాన్ని విరచించాలని. సమ్మతించిన వ్యాసుడు గంగా ప్రవాహంలా ఒక పర్వం తరువాత మరో పర్వాన్ని అనర్గళంగా వివరించారట. అలా తెలిపినా "జయ" పూర్తి కావడానికి మూడు సంవత్సరాల కాలం పట్టిందిట. రచనా కాలం క్రీస్తు పూర్వం అయిదు నుండి మూడు శతాబ్దాల మధ్య కాలానికి చెందినది అని అంటారు ఆంగ్లేయ పరిశోధకులు. కానీ హిందువులు మాత్రం కావ్యరచనా కాలం అంతకన్నా ముందు నాటిదని విశ్వసిస్తారు. ఏది ఏమైనా హిందువులకు పరమ పవిత్ర పఠనీయ గ్రంధం మహా భారతం.
మరి వ్యాస గణపతులు కావ్యాన్ని రచించిన ప్రదేశం ఏది ? ఎక్కడ ? ఆ ప్రాంతాన్నే ఎంచుకోడానికి     కారణం ఏమిటి ?  ఆ పావన క్షేత్రం విశేషాలు ఏమిటి ?  ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా రెండు ప్రదేశాలు భారతావనిలో ఉన్నాయి అని తెలుస్తోంది. రెండూ కూడా పవిత్ర నదీతీరాలే ! సంగమ క్షేత్రాలే ! ప్రశాంతతకు నెలవులు ! ఈ ప్రదేశాలను ఎంచుకోడానికి కారణంగా భావించవచ్చును. రెండూ కూడా దర్శనీయ స్థలాలే కావడం విశేషం.

వేద వ్యాస 

"కోయిల్" మరియు "సరస్వతి" నదులు బ్రాహ్మణి నదిలో సంగమించే పవిత్ర త్రివేణి సంగమ ప్రాంతం. నలువైపులా ఏపుగా పెరిగిన వృక్షాలు. స్వచ్ఛమైన గాలి. శబ్ద వాయు కాలుష్యాలు కానరావు. అంతటా ప్రశాంతత. మధ్యమధ్యలో  ఆధ్యాత్మిక భావాలను  పెంపొందించేలా మ్రోగే గుడి గంటలు. ఇవీ "వేద వ్యాస" సహజ అందాలు. 
నిత్య జీవితంలో నిరంతరం పరుగులు పెడుతూ అలసి పోయిన మనస్సు, శరీరం రెండూ ఇక్కడ సేదతీరుతాయి. సుందర శాంటా ప్రకృతి మాయలో మమేకమైపోతారు ఎవరైనా ! ఒడిషా రాష్ట్రంలో పారిశ్రామిక నగరంగా ప్రసిద్ధి చెందినది "రూర్కెలా". ఈ నగరానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వేదవ్యాస. ఇక్కడే వేదవ్యాస మహర్షి మహాభారతాన్ని రచించారన్న నమ్మకంతో ఆయన పేరుతోనే పిలుస్తున్నారు. 
నదీతీరంలో చిన్న పర్వతం. పైకి వెళ్ళడానికి అనువుగా సోపాన మార్గం ఉంటుంది. కొండ చిన్నది అయినా మూడు అంతస్తులుగా విభజించబడినది. ఎన్నో చిన్న పెద్ద మందిరాలతో నిండి ఉంటుంది.
పర్వత పాదాల వద్ద శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధి, శ్రీ హరినామ సంకీర్తనా మండపం కనపడతాయి. పంతొమ్మిది వందల తొంభై వ సంవత్సరం నుండి ఇక్కడ నిరంతరాయంగా హరినామ సంకీర్తన జరుగుతోంది. అభినందనీయం. మండపంలో శ్రీ రామ మరియు శ్రీ కృష్ణ విగ్రహాలను  అఖండ జ్యోతి వద్ద ఉంచారు. మెట్ల మార్గంలో తొలి అంతస్తుకు చేరుకొంటే శ్రీ కాశీ విశ్వేశ్వర, శ్రీ హనుమాన్ సన్నిధులు, ఎన్నో పురాతన లింగాలు మరియు నంది విగ్రహాలు కనపడతాయి. ఇవి ఈ క్షేత్రం ఎంతో పురాతనమైనది అని తెలుపుతాయి. రెండో అంతస్థులో కొండా రాళ్లతో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ ఉంటుంది. ఇక్కడే శ్రీ వ్యాస మహర్షి జయ కావ్యాన్ని శ్రీ పార్వతీనందనుని చేత లిఖియింపచేశారు అని చెబుతారు. గుహ పైన హిందీ మరియు ఒడియా భాషలలో అదే విషయాన్ని రాశారు. గుహ ప్రవేశ మార్గం వద్ద శ్రీ వ్యాసుని, మూషిక వాహనుని విగ్రహాలను ఉంచారు. గుహ వద్ద చలువ రాళ్లను పరచి సుందరంగా శుభ్రంగా మలచారు. ప్రతి నిత్యం పూజలు జరుగుతాయి. ముఖ్యంగా గురు పౌర్ణమి నాడు విశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.















అన్నిటికన్నా పై అంతస్థులో శ్రీ తరణి మాత, శ్రీ హనుమాన్, శ్రీ కైలాసనాథర్, శ్రీ పార్వతి చిన్న చిన్న మందిరాల్లో దర్శనమిస్తారు. విశాలమైన మండపంతో  నిర్మించబడిన మందిరంలో శ్రీ రామచంద్రుడు, శ్రీ జానకీ మాత , శ్రీ హనుమాన్ తో పాటు భారత, లక్ష్మణ, శత్రుఘ్నులతో కలిసి కొలువై ఉంటారు. దశరధ నందనులంతా ఒకే చోట దర్శనమిచ్చే ప్రదేశాలు చాలా అరుదు. అలాంటి వాటిల్లో వేదవ్యాస ఒకటి.
శిఖరాగ్రం నుండి చూస్తే దూరంగా నిశ్శబ్దంగా ప్రవహించే నది, భక్తి విశ్వాసాలతో స్నానాలు ఆచరించే భక్తులు. సంగమ క్షేత్రంలో పితృ కార్యాలు చేస్తే గతించిన పెద్దలకు ముక్తి కలుగుతుంది అన్న విశ్వాసంతో పిండ ప్రదానం చేసే వారసులు. నలువైపులా పచ్చదనావు. చల్లని స్వచ్ఛమైన గాలి. అంతటా పరిపూర్ణ విశ్వాసంతో నెలకొన్న ఆధ్యాత్మిక వాతావరణం. సందర్శకుల మనస్సులను కట్టి పడేస్తుంది.
ప్రతి రోజు వందలాది పర్యాటకులు వేదవ్యాస వస్తుంటారు. రూర్కెలా రైల్వే స్టేషన్ నుండి ఆటోలు లభిస్తాయి.

మనా గ్రామం 

మన దేశానికి ఉత్తర దిశన సరిహద్దు హిమాలయ పర్వతాలు. హిందువులకు పరమ పవిత్రమైనవి. సర్వసంగ పరిత్యాగానికి చిరునామాలు. ముముక్షువులకు శాశ్విత నివాసాలు. ఎన్నో పావన క్షేత్రాలకు నెలవు. సంవత్సరానికి ఆరు నెలలు మాత్రమే జరిగే చార్ధామ్ యాత్రలో లక్షలాదిగా భక్తులు పాల్గొంటారు. గంగ, యమునా లాంటి పవిత్ర నదుల జన్మస్థానం హిమాలయాలే !ఎన్నో నిఘాఢ రహస్యాలు ఈ పర్వతాల సొంతం. గంగా యమునాలతో పాటు సరస్వతి నది   అంతర్వాహినిగా ప్రవహిస్తుందని చెబుతారు. నేడు పూర్తిగా అదృశ్యమైనది అని చెప్పే ఈ  నది కూడా హిమాలయాలలోనే జన్మించినది. 
ఈ నదీ తీరంలోనే ఉంటుంది మన దేశానికి ఆఖరి గ్రామం అయిన "మనా గ్రామం". ఇక్కడికి కొద్దీ దూరంలోని మనా పాస్ దాటితే టిబెట్ దేశ భూభాగం లోనికి ప్రవేశిస్తాము. మనా కి సమీపంలో రెండు కొండల మధ్య ఉన్న గుహ నుంచి ప్రవహిస్తుంది సరస్వతి. కానీ ఈ ప్రవాహం ఎక్కువ దూరం కనిపించదు. మాయమవుతుంది. అక్కడి నుండి అలకనంద తో కలిసి పోతుంది అని చెబుతారు. సరస్వతి నది అంతర్ధానానికి సంబంధించిన పురాణ గాధ ఒకటి స్థానికంగా వినపడుతుంది. ఎన్నో నదులుండగా తన తీరానే శ్రీ మహావిష్ణువు అవతారంగా పేర్కొనే శ్రీ వ్యాసుడు, ఏకదంతుని సహకారంతో జయ ను అక్షరీకరించడానికి ఉపక్రమించడంతో కొంత గర్వం తలెత్తినది సరస్వతిలో. అహంతో అట్టహాసంగా ప్రవహించసాగిందట. ప్రవాహ వేగం తాలూకు శబ్దం లంబోదరుని ఏకాగ్రతకు భంగం కలిగించసాగిందట. ఆగ్రహించిన గజముఖుడు నదిని అదృశ్యం కమ్మని శపించారట. శరణు కోరిన నదీమ తల్లిని క్షమించి, గంగ, యమునాలతో కలిసి అంతర్వాహినిగా ప్రవహించామని తరుణోపాయం తెలిపారట. ఒక్క మనా గ్రామం వద్దనే భక్తులకు సరస్వతి నది జలాన్ని సేవించే అదృష్టం దక్కుతుంది. గుహ వద్ద ఉన్న స్వరస్వతి మూర్తికి పూజలు చేసి నీటిని పవిత్ర తీర్థంగా స్వీకరిస్తారు. 
పక్కనే వ్యాస మరియు గణేష గుహలుంటాయి. ఈ గుహల లోని లోపలి భాగం లోని రాళ్లు పుస్తకాల దొందరను పోలి ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వ్యాస గుహలో వినాయక, వ్యాస, శుక మహర్షి మరియు వల్లభాచార్యుల విగ్రహాలుంటాయి. ప్రత్యేకంగా చేసిన అద్దాల  పెట్టెలో ఉంచిన  తాళపత్రాలను వ్యాసుడు చెబితే గణపతి లిఖించిన జయ తాలూకువి అని అంటారు. 
నిత్య పూజలు జరుగుతుంటాయి. 
మనా ప్రత్యేకతలు ఇంతటితో ఆగిపోలేదు. రాజ్యాన్ని పరిక్షిత్తుకు అప్పగించిన పాండునందనులు సతీమణి ద్రౌపది దేవి తో కలిసి స్వర్గారోహణ ఆరంభించింది మనా గ్రామం నుండే అని నమ్ముతారు. సరస్వతి నదీ ప్రవాహం మీద ఆ ఒడ్డు  నుండి ఈ ఒడ్డు కు వంతెనలా వేసిన ఏకరాతిని చూపుతారు. దీనిని భీమసేనుడు ద్రౌపది దేవి నదిని దాటడానికి వీలుగా పరిచారట. రాతి మీద ఉన్న నొక్కులను వాయునందనుని హస్త ముద్రలని భావిస్తారు. మనా గ్రామం దాటినా తరువాత ధర్మరాజు తప్ప మిగిలిన నలుగురు సోదరులు, సతీమణి దేహత్యాగం చేశారట. 
ఇలా అనేక విశేషాలతో పురాణ ఘటనలతో ముడిపడి ఉన్న మనా గ్రామా శ్రీ బదరీనారాయణ క్షేత్రం అయిన బద్రీనాథ్ కు సమీపంలో ఉంటుంది. నడిచి వెళ్లాల్సి వస్తుంది. చార్ధామ్ యాత్రలో భాగంగా సందర్శించుకోవచ్చును.





ఈ వ్యాసం ముగిస్తుండగా ఒక మిత్రులు మరో వ్యాస గుహ గురించి చెప్పారు. అది హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్ లో ఉన్నదట. అక్కడ ఉన్న గుహలో వ్యాస భగవానులు మహా భారత రచన చేసారని స్థానిక గాధలు తెలుపుతున్నాయి. చక్కని ఆహ్లాదకరమైన వాతావరణానికి నెలవు హిమాచల్ ప్రదేశ్. 
అసలు భగవాన్ శ్రీ వేద వ్యాసుడు వక్రతుండునితో కలిసి ఎక్కడ మహాభారతాన్ని రచించారు అన్న చర్చకు వెళ్లకుండా చూస్తే ఈ ప్రదేశాలు విశేషమైనవి. ప్రకృతి సౌందర్యానికి , ప్రశాంతతకు చిరునామాలు. పావన నదీ తీరాలు. విశిష్ట పౌరాణిక, చారిత్రిక ఘట్టాలకు కేంద్రాలు.  ఒక జీవిత కాల అనుభూతులను అందించే ఆధ్యాత్మిక ప్రదేశాలు. అన్నింటికీ మించి తప్పక సందర్శించవలసిన క్షేత్రాలు. 

   

















                                 


    

Kanchipuram Temples


                        కంచి లోని శ్రీ వైష్ణవ దివ్య దేశాలు 







కాంచీ పురంలో మొత్తం పదునాలుగు శ్రీ వైష్ణవ దివ్యదేశాలుండగా వీటిల్లో తొమ్మిది  శివ కంచిలో, అయిదు విష్ణు కంచిలో ఉన్నాయి. అన్నింటిలోనికి  ముఖ్యమైనది శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల. శివ కంచిలో నాలుగు దివ్యదేశాలు కలిసి ఒక్క  శ్రీ ఉలగండ పెరుమాళ్ ఆలయంలోనే ఉంటాయి.  ఒకటి శ్రీ కామాక్షీ అమ్మన్ ఆలయంలో మరొకటి శ్రీ ఏకాంబరేశ్వర స్వామి ఆలయంలో ఉండగా మిగిలిన మూడు  విడిగా ఉంటాయి. విష్ణు కంచిలో నాలుగు ఆలయాలు శ్రీ వరద రాజా స్వామి ఆలయానికి సమీపంలోనే ఉంటాయి. ఈ జాబితాలో లేని "తిరుప్పుకులి" కంచి కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
ఈ మాసం విష్ణు కంచి లోని నాలుగు దివ్య దేశాల గురించి తెలుసుకొందాము. ఈ నాలుగు దివ్యదేశాల ఆవిర్భావం వెనుక ఉన్న పురాణ గాధ ఒక్కటే !
 ఒకసారి తామిరువరులలో ఎవరు గొప్ప అన్న వివాదం తలెత్తినది శ్రీ లక్ష్మి మరియు సరస్వతి దేవిల డుమవివాదాన్ని పరిష్కరించుకోడానికి తొలుత  దేవేంద్రుని వద్దకు పిదప బ్రహ్మ వద్దకు వెళ్లారు.
వారి ఇద్దరి తీర్పు సరస్వతీ దేవికి నిరాశ కలిగించినదిఆమె ఆగ్రహం తో సత్య లోకం విడిచిపెట్టి అజ్ఞాతంలో ఉండసాగింది. అదే సమయంలో సృష్టి కర్త శ్రీమన్నారాయణుని సహకారం అపేక్షిస్తూ త్రీవ్ర తపస్సు చేసి ఆయన సలహా మేరకు అశ్వమేధ యాగం చేయ తలపెట్టారుకానీ ధర్మపత్నితో కలిసి చేయవలసిన యాగము అదిఏమి చేయాలో తెలియక అందరి సలహా మేరకు గాయత్రీ దేవిని సరసన పెట్టుకొని యాగం ఆరంభించారు బ్రహ్మఅసలే తాను  మహాలక్ష్మి కన్నా తక్కువ దానినని స్వయంగా తెలిపిన భర్త తానూ లేకున్నా యాగం ఆపకుండా మరో స్త్రీని సరసన పెట్టుకొనడంతో  సరస్వతీ దేవి ఆగ్రహం రెట్టింపు అయినదిఅదుపు తప్పిన ఆవేశంతో యాగాన్ని భగ్నం చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. వాటిని అడ్డుకొని యాగాన్ని రక్షించిన శ్రీహరి వివిధ ఆలయాలలో కొలువు తీరారు అని తెలుస్తోంది.  
పతి దేవుడు చేస్తున్న యాగాన్ని అరికట్టడానికి ఆగ్రహంతో వాగ్దేవి చేసిన ప్రయత్నాలలో ఒకటి  

శ్రీ యధోత్కారి పెరుమాళ్ ఆలయం ( తిరువెక్క)


 పన్నిద్దరు ఆళ్వారులలో ఒకరైన శ్రీ తిరుమలై సై ఆళ్వార్ కొంతకాలం కాంచీపురంలో నివసించారు. ఆ సమయంలో ఒక పేద వృద్ధ మహిళ ఆయనకు సేవలు చేసేది. ఆమె సేవలకు సంతసించిన ఆళ్వార్ తన తపశ్శక్తితో ఆమెను సుందర యువతిగా మార్చారు. అపురూప సౌందర్యంతో ఉన్న ఆమెను చూసిన రాజు వివాహమాడి తన మహారాణిగా చేసుకొన్నారు.
కాలం తనమానాన తాను సాగిపోసాగింది. రాజు వృద్దుడయ్యాడు. కానీ రాణి శరీరంలో ఆమె సౌందర్యంలో ఏమాత్రం మార్పు రాలేదు. ఆశ్చర్యపోయిన రాజు ఆమె కాలగమనంలో మారక పోవడానికి గల కారణం తెలుపమని నిర్బంధించాడు. తప్పక నిజాన్ని తెలిపింది రాణి.
అప్పటికి ఆళ్వార్ కాంచీపురం వదిలి వెళ్లిపోయారు. ఆయన శిష్యుడు " కని కణ్ణన్" శ్రీ యధోత్కారి పెరుమాళ్ కోవెలలో ఉండేవారు. రాజు ఆయనను ఆస్థానానికి పిలిపించుకొని ఆళ్వార్ ను పిలవమని ఆయన వచ్చి తనను కీర్తిస్తూ కీర్తనలను పాడాలని ఆదేశించారు. దానికి ఆగ్రహించిన కణ్ణన్ తన గురువు శ్రీమన్నారాయణుని తప్ప అన్యులను కీర్తించరని తెలిపారు. రాజు అతనికి ధనాన్ని ఆశ చూపించారు. అయినా శిష్యుడు సమ్మతించలేదు. దానితో పాలకుని అహం దెబ్బతిని కోపంతో కణ్ణన్ తన రాజ్యం నుండి బహిష్కరించారు.
రాజ్యం విడిచి పోతూ " నిన్ను నిత్యం సేవించే కని కణ్ణన్ ఈ రాజ్యం విడిచి పోతున్నాడు.  నీకు ఇక్కడ పని ఏమున్నది ? నాతొ రా !" అన్నాడు పెరుమాళ్ తో. భక్తుని ఆదేశంతో స్వామివారు ఆదిశేషుని చాపలాగా చుట్టుకొని అతనిని అనుసరించారు. ఇరువురూ  సరిహద్దులు దాటగానే
రాజ్య మంతటా చీకట్లు కమ్ముకున్నాయి. అనేక దుశ్శకునాలు కనిపించాయి. ప్రజలంతా భయభ్రాంతులు అయ్యారు. మంత్రుల సలహా మేరకు రాజు కణ్ణన్ విడిది చేసిన ప్రదేశానికి వెళ్లి క్షమాపణ చెప్పుకొని ఆయనను సగౌరవంగా రాజ్యానికి ఆహ్వానించారు.
తిరిగి వెళుతూ  " కణ్ణన్ తిరిగి వెళుతున్నాడు. నీవు తిరిగి రా !" అనడంతో స్వామి అనుసరించారు. ఈ సంఘటనకు నిదర్శనంగా మిగిలిన ఆలయాలలో కుడి చేతి మీద శయనించి స్వామి ఇక్కడి  గర్భాలయంలో శయన భంగిమలో ఎడమ చేతిని  శిరస్సు క్రింద పెట్టుకొని కనపడతారు. నాటి నుండి "సొన్న వనం సైద పెరుమాళ్" ( ఆజ్ఞను శిరసావహించి చేసే పెరుమాళ్) అని పిలవసాగారు.
అసలు శ్రీహరి ఈ క్షేత్రంలో  కొలువు తీరడం వెనుక ఉన్న గాధ ఏమిటంటే ఆగ్రహంతో ఎలాగైనా విధాత చేస్తున్న అశ్వమేధ యాగాన్ని విధ్వంసం చేయ తలపెట్టిన సరస్వతి దేవి జలరూపం దాల్చి మహోగ్ర వేగంతో యాగస్థలి వైపుకు ప్రవహించసాగింది. నీటి ప్రవాహాన్ని ఆపడానికి వైకుంఠ వాసుడు ప్రవాహ మార్గంలో ఆదిశయనునిగా అవతరించారు. ప్రవాహ మార్గం మారిపోయింది. నాడు సరస్వతీ దేవి దాల్చిన నీటి ప్రవాహమే నేడు కంచి పట్టణం పక్కన ప్రవహించే వేగావతి నది.
శ్రీ మన్నారాయణుడు నీటి వేగాన్ని ఆపిన స్థలంగా ఇది వేగవనై అని పిలువబడి కాలగతిలో తిరువెక్క గా మారింది. ఈ ఆలయ పుష్కరణిలోనే తొలి ముగ్గురు ఆళ్వార్ లలో ఒకరైన "పొయిగై  ఆళ్వార్" అయోనిజునిగా కలువ పూలలో అవతరించినది. తదనంతర కాలంలో ప్రముఖ శ్రీ వైష్ణవ ఆచార్యులైన "శ్రీ మానవల ముని" లోకానికి శ్రీ సూక్త భాష్యాన్ని తెలిపినట్లుగా తెలియవస్తోంది.
అమ్మవారు శ్రీ కోమలవల్లి" విడిగా సన్నిధిలో దర్శనమిస్తారు.
పొయిగై, తిరుమలై సై, తిరుమంగై ఆళ్వార్లులతో పాటు నమ్మాళ్వార్ శ్రీ యధోత్కారి పెరుమాళ్ ని కీర్తిస్తూ పాశుర గానం చేశారు.
 శ్రీ అష్టభుజ పెరుమాళ్ ఆలయానికి ఎదురు సందులో ఉండే ఈ ఆలయం ఉదయం  ఆరు నుండి పదకొండు వరకు, సాయంత్రం నాలుగు నుండి ఏడు వరకు భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉంటుంది.

శ్రీ దీప ప్రకాశ పెరుమాళ్ ఆలయం (తిరుత్తాంక)


శ్రీ అళగియ సింగ పెరుమాళ్ కోవెలకు సమీపంలో ఉంటుంది ఆలయం.
బ్రహ్మ దేవుని యాగం భగ్నం చేయడానికి  ఆగ్రహంతో ఉన్న వీణాధరి అసురులను పంపకం చేసింది. వారు వెలుతురు వస్తున్న ప్రతి మార్గాన్ని అడ్డుకొన్నారు. దానితో నలుదిశలా అంధకారం అలముకొన్నది.
విధాత విష్ణువును ప్రార్ధించారు. అంతర్యామి జ్ఞానమార్గాన్ని నిర్దేశించే జ్ఞానజ్యోతి రూపంలో లోకాలను అద్వితీయమైన వెలుగుతో ప్రకాశింపచేశారు. అందుకనే ఇక్కడి స్వామిని "శ్రీ దీప ప్రకాశ పెరుమాళ్" (విళక్కు ఓలి పెరుమాళ్) అని పిలుస్తారు.
తొలి ఆలయ నిర్మాణం చోళ రాజులు నిర్మించగా, విజయనగర ప్రభువులు ఆలయాభివృద్దికి కృషిచేశారు అని శాసనాల ఆధారంగా తెలుస్తోంది. రెండంతస్తుల రాజ గోపురాన్ని కలుపుతూ ఎత్తైన ప్రహరీ గోడ కలిగిన ఈ ఆలయంలో మూలవిరాట్టు స్థానక భంగిమలో పడమర ముఖంగా దర్శనమిస్తారు. అమ్మవారు శ్రీ మరకతవల్లీ తాయారు ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. ఉపాలయాలలో ఆండాళ్ళు, ఆళ్వారులు ఉంటారు.
తిరుత్తాంక శ్రీ వేదాంత దేశికుల జన్మస్థలం. అందుకని వీరికొక ప్రత్యేక సన్నిధి వీరి ఆరాధ్య దైవమైన శ్రీ లక్ష్మీ హయగ్రీవులకు మరో సన్నిధి కలవు. చక్కని పూల మొక్కల మధ్య అలరారుతూ ఉండే ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహాన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం ఆరు నుండి రాత్రి పది గంటల వరకు తెరచి ఉండే ఆలయంలో నిత్యం నియమంగా ఆరు పూజలు జరుపుతారు.
పన్నెండు మంది ఆళ్వారులలో ఒకరైన శ్రీ తిరుమంగై ఆళ్వార్ శ్రీ దీప ప్రకాశ పెరుమాళ్ ని కీర్తిస్తూ రెండు పాశురాలను గానం చేశారు.

నమో నారాయణాయ !!!!

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...