28, మే 2016, శనివారం

Vishnu Pada, Gaya

                                              విష్ణు  పాద గయ 

 

                          ముక్తి క్షేత్రం - శ్రీ విష్ణు పాద గయ      

యుగయుగాల నుండి గయ హిందువులకు అత్యంత పవిత్ర ప్రదేశం.
జన్మ జన్మల పాపాలను హరించే ముక్తి క్షేత్రంగా శతాబ్దాలుగా ప్రశస్తి చెందినది.
ఇంతటి ప్రాముఖ్యం రావడానికి సంబంధించిన పౌరాణిక గాధలు అన్ని యుగాలకు చెందినవి. వాయు, గరుడ, కూర్మ,పద్మ, వరాహ పురాణాలతో పాటు రామాయణ మరియు మహా భారతాలలో ప్రస్తావించబడినవి.







పౌరాణిక గాధ 

సత్య యుగంలో గయాసురుడు అనే అసురుడు అమిత విష్ణు భక్తుడు. తన ఇష్టదైవం అనుగ్రహంతో తన శరీరాన్ని తాకిన వారు ముక్తిని పొందే వరం పొందాడు.  తన  మరణం ఒక్క త్రిమూర్తుల చేతిలోనే సంభవించాలన్న చిత్రమైన మరో వరం కూడా  దక్కించుకొన్నాడు.
వర ఫలం అందరికీ  దక్కాలన్న సదుద్దేశ్యంతో తన శరీరాన్ని విపరీతంగా పెంచసాగాడు.
అసురుని విపరీత చర్యలతో దేవతలు భయభ్రాంతులై పోయారు. కారణం ఏమిటంటే నరకం పూర్తిగా ఖాళీ అయ్యింది.  ప్రతి ఒక్కరూ స్వర్గానికే చేరసాగారు.  దేవతల అనుగ్రహం కొరకు చేసే యజ్ఞ యాగాదులు సంపూర్ణంగా నిలిచి పోయాయి. దేవతలు అశక్తులుగా మారిపోయారు.









దేవతల విన్నపాల మేరకు త్రిమూర్తులు బ్రాహ్మణ రూపాలలో గయాసురుని వద్దకు వెళ్ళారు. ఉచితరీతిన అతిధి సత్కార్యాలు చేసిన తరువాత అతను వారి రాకకు కారణం అడిగాడు.
లోకాలకు మేలు కలిగించే దివ్యమైన యాగం ఒకటి చేయ తలపెట్టామని దానికి తగిన స్థలాన్వేష్ణలో ఉన్నామని తెలిపారు. ఈ భూమండలంలో ఎక్కడైనా వారు స్థలాన్ని ఎంచుకోవచ్చునని అసురుడు హామీ ఇచ్చాడు.
తాకితేనే మోక్షాన్ని ప్రసాదించే అతని శరీరం కన్నా పవిత్ర స్థలం ఎక్కడ ఉంటుంది ? అని వారు అనగానే  తన దేహాన్నియాగ వేదికగా వినియోగించుకోడానికి సమ్మతించాడు.









కాకపొతే  వారం రోజుల పాటు నిర్వహించే యజ్ఞ సందర్భంగా గయాసురుడు కదలకూడదు. కదిలితే యాగము భగ్నం అవుతుంది. దానికి తగిన ఫలితాన్ని రాక్షసుడు  అనుభవించాలి. అన్ని నిబంధనలకు అగీకరించి, తన శరీరాన్ని పెంచి యజ్ఞ నిర్వహణకు అనువుగా పడుకొన్నాడు.
త్రిమూర్తులు హోమం వెలిగించి క్రతువును ఆరంభించారు.  ఆరు రోజులు  గడిచి పోయాయి. గయాసురునిలో ఎలాంటి చలనం లేదు.  ఒక్క రోజు గడిస్తే అతన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఇంద్రుడు ఎలాగైనా అసురుని కదిలించాలి అన్న నిర్ణయంతో కోడిలా మారి పెద్దగా కూత పెట్టాడు. గడువు పూర్తి అయినది అని భావించిన గయాసురుడు కదిలాడు. దేవతలు అతని శరీరం మీద పెద్ద శిలను ఉంచారు. దాని మీద శ్రీ మహావిష్ణువు తన పాదాన్ని అదిమిపెట్టారు.








అతనికి అర్ధమైనది తన అంత్యకాలం సమీపించినది అని. నిశ్చల మనస్సుతో శ్రీ హరిని  ప్రార్ధించాడు.
బ్రహ్మ, శివ సమేతంగా శ్రీనివాసుడు తమ నిజ రూపాలతో దర్శనమిచ్చి మరణానంతరం కూడా అతని శరీరం పవిత్రమైనదిగా నిలుస్తుందని, ఎవరైతే గయా క్షేత్రం సందర్శిస్తారో వారి జన్మ జన్మల పాపాలు హరించుకొని పోతాయని , గతించిన వారికి ఈ క్షేత్రంలో పిండ  ప్రధానం చేస్తే సద్గతులు కలుగుతాయని వరం ప్రసాదించారు.
అలా గయాసురుని  తల ఉన్నప్రాంతాన్నిఅతని పేరు మీదగా  గయ (శిరో గయ)అని , బొడ్డు ఉన్న ప్రదేశం నాభి గయ ( బిరజా దేవి, జాజ్ పూర్, ఒడిష ) పాదాలు ఉన్న స్థలం పాద గయ (పిఠాపురం ) గా పిలవసాగారు.







నాటి నుండి ప్రజల తమ పూర్వీకులకు సద్గతులు కలగడానికి, తమ జీవిత కాలంలో చేసిన కర్మల నుండి విముక్తి కలగడానికి గయా క్షేత్ర  సందర్శనం చేస్తున్నారు.
రామాయణంలో శ్రీ రామ చంద్రులు తన తండ్రి దశరధ మహారాజుకు తర్పణలు విడిచి పిండ ప్రదానం చేసినట్లుగా చెప్పబడినది. అదే విధగా ద్వాపర యుగంలో పాండవులు ఇక్కడ కురుక్షేత్ర యుద్దంలో మరణించిన వారందరికీ తిల తర్పణలు మరియు పిండ దానం చేసారని తెలుస్తోంది.






పాల్గు నది 


శ్రీ విష్ణు పాద ఆలయం గయ లో  "ఫాల్గు నది"  ఒడ్డున ఉంటుంది. శ్రాద్ధ కర్మలను ఈ నదీ తీరంలోనే నిర్వహిస్తారు.
గంగతో సమానంగా భావించే ఈ నది సాక్షాత్తు విష్ణు స్వరూపమని విశ్వసిస్తారు. ఫాల్గు అంటే కోరిన కోర్కెలు తీర్చే కామధేనువు అన్న అర్ధం ఉన్నది. వ్యాస భగవానులు మహాభారతంలో ఈ నదిని "నిరంజర" గా పేర్కొని మహిమను విపులంగా వివరించారు.
గయకు సుమారు వంద కిలోమీటర్ల దూరంలోని " కోరంబే పహార్"గా పిలిచే పర్వతాలలో ఉద్భవించే "లిలజన్" (నిరంజర) మరియు "మోహన" అనే రెండు నీటి ప్రవాహాలు గయ వద్ద సంగమించి "ఫాల్గు"గా మారుతాయి.










ఆలయానికి పడమర దిశలో ఉన్న నదీ తీరానికి సులభంగా చేరుకోవచ్చును. ఇంతటి పవిత్రతను ఆపాదించబడిన ఫాల్గు నది సంవత్సరంలో అధిక భాగం ఎడారిని తలపిస్తుంది. దీనికి సంబంధించి ఒక పురాణగాధ స్థానికంగా వినిపిస్తుంది. 
శ్రీ రాముడు లక్ష్మణ సీతా సమేతులై పాద గయ వచ్చారట.  అన్నదమ్ములు పిండ ప్రధాన కార్యక్రమానికి సిద్దమవుతున్న సమయంలో జానకీ దేవి నది వడ్డున కూర్చొని ఉన్నారట. 
ఆ కాలంలో పితృ దేవతలు స్వయంగా వచ్చి పిండాలను స్వీకరించి వారసులను ఆశీర్వదించి వెళ్ళేవారట. 











నీటి ప్రవాహంలో నుండి దశరధ మహారాజు వెలుపలికి వచ్చి కోడలిని పిండాలను ఇమ్మని అడిగారట. ఆయన కుమారులు క్రతువు చేయడానికి సిద్ద పడుతున్నారు కొంత సమయం ఆగమని అభ్యర్ధించినది సీతాదేవి. అయినా దశరధుడు తాను  ఆగలేను ఇప్పుడే కావాలని పట్టు పట్టారట. స్త్రీ పితృకార్యం చేయకూడదు అందులోనూ తనవద్ద ఎలాంటి వస్తువులు లేవు అని తన అసక్తతను తెలియ పరచినదట. 
అయితే నాకు ఇసుకతో చేసిన పిండాలను సమర్పించు ఫర్వాలేదు అన్న మామ గారి ఆత్మ ను సంతృప్తి పరచడానికి ఫాల్గు నది, అక్షయ వాట్ , ఆవు, భ్రాహ్మణుడు, తులసీ మొక్కను సాక్షులుగా ఉంచుకొని ఇసకతో చేసిన పిండాలనే దశరధునికి అందించినదిట. వాటిని స్వీకరించి కోడలిని ఆశీర్వదించి అదృశ్యులు అయ్యారట. 









పితృకార్య పూర్తి చేసిన తరువాత పిండాలను అందుకోడానికి తండ్రి గారి ఆత్మ రాకపోవడం శ్రీ రాముని చింతితుని చేసింది. భర్తను ఓదారుస్తూ సీతా దేవి జరిగిన విషయం తెలియచెప్పినది. నమ్మలేదట దశరధ తనయుడు. 
తన సాక్షులను పిలవగా ఒక్క "అక్షయ వాట్" తప్ప మిగిలిన నాలుగూ అబద్దం చెప్పాయట. ఆగ్రహించిన భూజాత   ఫాల్గు నది నీరు లేకుండా పోవాలని, గో పృష్ట భాగమే పూజర్హమని, గయలో తులసికి స్థానం ఉండదని, ఇక్కడి బ్రాహ్మణులు క్రతువుకన్న కాసుల మీద వ్యామోహంతో గౌరవాన్ని కోల్పోతారని శాపం ఇచ్చినదట.
నాటి నుండి ఫాల్గునది ఒక ఇసుక ఎడారి మాదిరిగా కనిపిస్తుంది. కార్యక్రమాల నిమిత్తం నదిలో లోతుగా గోతులు తీసి ఉబికిన నీటితో పూర్తి  చేస్తారు. సహజంగా విష్ణు ఆలయాలలో కనిపించే  తులసి మొక్క గయలో కనపడదు. 
ఆవు పృష్ట భాగాన్నే పూజిస్తాము కదా !
గయలో పాండాలు  (పూజారులు) అధిక ధనం వసూలు చేయడానికి చెప్పే కధలకు అంతే లేదు.  
కాశీలోని హరిశ్చంద్ర ఘాట్ మరియు మణికర్ణికా ఘాట్ లలో ఎలా అయితే నిరంతర శవ దహనాలు జరుగుతుంటాయో అలానే ఇక్కడ కూడా ఫాల్గు నది ఒడ్డున జరుగుతుంటాయి. పునః జన్మ ఉండదు అని నమ్ముతారు. 













అక్షయ వాట్ 

అక్షయవాట్ ఒక వట వృక్షం. నాలుగు యుగాల నుండి ఉన్నదని ప్రచారంలో ఉన్న గాధ ద్వారా అవగతమవుతోంది. 
పునః సృష్టికి ముందు సంభవించిన జలప్రళయంలో శ్రీ మహా విష్ణువు వట పత్రం మీద కాలి బొటన వ్రేలిని నోటిలో ఉంచుకొని చిన్న బాలునిగా కనపడతారు. ఆయననే "వట పత్ర సాయి " అని పిలుస్తారు. నాడు ఆయన శయనించిన పత్రం ఈ వృక్షానికి చెందినది అని ఆ గాధ తెలియ చెబుతోంది. అందుకే అక్షయ వాట్ అన్న పేరు వచ్చినది. 
పితృ ఋణం తీర్చుకొనే కార్యక్రమం కొంత ఇక్కడ నిర్వహిస్తుంటారు. 











త్రేతాయుగానికి ముందు నుండి ప్రజలలో విశేష ఆదరణ కలిగిన విష్ణు పాద ఆలయాన్ని మొట్టమొదట  ఎవరు నిర్మించారో తెలియదు.
ఈ ప్రాంతాల మీద ఆధిపత్యం పొందిన ప్రతి ఒక్క రాజ వంశం ఆలయాభివృద్దికి కృషి చేసారని తెలుస్తోంది.
పాత ఆలయాన్ని పునః నిర్మించి ప్రస్తుత రూపంలో మనకు అందించినది మాత్రం ఇండోర్ మహారాణి "అహల్యా బాయి హోల్కర్". ఆలయానికి వెళ్ళే మార్గంలో ఆమె పాలరాతి విగ్రహాన్ని గౌరవ సూచకంగా ఉంచారు.











యాత్రీకుల సౌకర్యార్ధం నిర్మించిన వసతి గృహానికి ఆమె పేరే పెట్టారు. ఈ విగ్రహం పక్కనే తెలుగు వారి కొరకు తెలుగు వారు ఏర్పాటు చేసిన శ్రీ మంగళ గౌరీ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం" ఉంటుంది. 







ఆలయ విశేషాలు 


ఆలయానికి కొద్ది దూరంలో ఉండే స్వాగత ద్వారం వద్ద నుండి నిలువుగా ఉండే విమాన గోపురం గుమ్మటంలా కనిపించే ముఖ మండపాలు ఆహ్వానం పలుకుతాయి. 
ఇక్కడ కుడి పక్క చిన్న గుట్ట మీద శ్రీ కామాఖ్య దేవి మందిరం ఉంటుంది. 
ఆలయ వెలుపల ఎక్కువగా రంగులు, కార్యక్రమాలకు కావలసిన వస్తువులు అమ్ముతుంటారు. 
ప్రవేశ ద్వారానికి పైన దశావతార రూపాలను సుందరంగా మలచి నిలిపారు. 











ప్రాంగణమంతా ఎన్నో రకాల విష్ణు రూప శిల్పాలు కనపడతాయి. చూడగానే తెలిసిపోతుంది అవి చాలా పురాతనమైనవి అని.
ఆలయం నుండి నదీ తీరానికి వెళ్ళే దారిలో అక్షయ వాట్ దాటిన తరువాత శ్రీ గయ గదాధరుని మందిరం, పక్కనే శ్రీ సాక్షి వేణుగోపాల స్వామి సన్నిది వస్తాయి.
శ్రీ గణపతి, శ్రీ నారసింహ, శ్రీ కైలాస నాధ, శ్రీ గౌరీ ఉపాలయాలు ఉంటాయి.
ప్రధాన గర్భాలయం మధ్యలో  "ధర్మ శిల " గా పిలవబడే రాతి మీద సుమారు పదహారు అంగుళాల పొడుగు, ఆరు అంగుళాల వెడల్పుతో శంఖు చక్ర ముద్రలతో దర్శనమిస్తుంది విష్ణు పాదం.
చట్టూ వెండితో ఒక హద్దులాగ నిర్మించారు. భక్తులు నేరుగా తాక వచ్చును, పూజాదికాలు అభిషేకాలు స్వయంగా చేసుకోవచ్చును.
గర్భాలయ అంతర గోడలలో శ్రీ వినాయక, శ్రీ మహా విష్ణు, శ్రీ నార సింహ, శ్రీ మహాలక్ష్మి, శ్రీ మహేశ్వరుడు, శ్రీ పార్వతీ దేవి ఆదిగా గల దేవి దేవతా రూపాలను నిలిపారు.
















శ్రీ గయా గదాధర్ 






ఆలయానికి చేరువలో శ్రీ రామ సాగరం, శ్రీ దక్షినార్క కుండం, వైతరణి లాంటి కోనేరులు ఉంటాయి. ఇవన్ని భక్తుల పాపాలను ప్రక్షాళన చేసేవిగా గ్రంధాలు తెలుపుతున్నాయి. కానీ వాటి ప్రస్తుత స్థితి స్నానం చేసేవారిని అనారోగ్యం పాలుచేసేవిగా ఉన్నాయి. పరిశుభ్ర పరచాల్సిన అవసరం వాటి పవిత్రతను పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
అసలు పిండ ప్రధానం గయకు ఈశాన్యంలో పది కిలో మీటర్ల దూరంలో ఉన్న "ప్రేత శిల " వద్ద జరిపించాలట. ఇక్కడ ఉన్న బ్రహ్మ పుష్కరణిలో స్నాన మాచరించిన వారి బ్రహ్మ హత్యా పాతకమైనా హరించుకొని పోతుందట.
కాకపోతే అక్కడ ఎవరు చెయ్యడం లేదు. అంతా ఫాల్గు నది ఒడ్డునే !!














పితృ ఋణం తీర్చుకోడానికి దేశం నలు మూలల నుండి యాత్రీకులు ప్రతి నిత్యం వేలాదిగా గయ తరలి వస్తుంటారు.
భక్తి శ్రద్దలతో తమ పితృ దేవతలకు తర్పణలు మరియు పిండ దానాలు చేస్తుంటారు.
అన్ని హిందూ పర్వదినాలలో విశేష పూజలు జరుపుతారు.













ఆలయానికి సమీపంలో ఉన్న శ్రీ మంగళ గౌరీ ఆలయం శక్తి పీఠాలలో ఒకటి ప్రసిద్ది చెందినది. సతీదేవి స్థనం ఇక్కడ పడినట్లుగా స్థల పురాణం తెలుపుతోంది.
ఇక్కడే మన పాప పుణ్యాలను లెక్క రాసే చిత్ర గుప్త ఆలయం లాంటి పురాతన ఆలయాలు చాలా కనపడతాయి.
ప్రధాన మందిరానికి సమీపంలోనే ఉన్న దక్షినార్క (సూర్య)మందిరం తప్పక దర్శించవలసినది.
మనం చేసే పితృ కార్యాలకు సాక్షిగా పురాణాలు పేర్కొన్న "శ్రీ ప్రపితామహేశ్వర"మందిరం చూడవలసినదే !!












విష్ణు పాద ఆలయ విమానం పైన ఉన్న బంగారు కలశ మరియు పతాక దర్శనాలు కూడా మోక్షదాయకాలని గ్రంధాలు తెలుపుతున్నాయి.   





బీహారు రాష్ట్రంలో రాజధాని పాట్నా తరువాత పెద్ద పట్టణమైన గయలో యాత్రీకులకు అన్ని రకాల సదుపాయాలు లభిస్తాయి. ఆలయ సమీపంలో ఎన్నో సత్రాలు, యాత్రి నివాసాలు ఉంటాయి.
దేశంలోని అన్ని ప్రముఖ నగరాల నుండి రైలులో నేరుగా చేరుకోవచ్చును.
గయలో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉన్నది.
శ్రీ మహా విష్ణు అవతారంగా భావించే గౌతమ బుద్దుడు జ్ఞానోపదేశం పొందిన బౌద్ద గయ ఇక్కడికి పదిహేను కిలో మీటర్ల దూరంలోనే ఉంటుంది.
ఎన్నో సంప్రదాయాల చిరునామా, మరెన్నో చారిత్రక విశేషాల సమాహారం అయిన గయ తప్పక దర్శించుకో వలసిన క్షేత్రం.

ఓం నమో నారాయణాయ నమః !!!!


Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...