2, జులై 2019, మంగళవారం

Elephant race at Guruvayur




  ఆహ్లాదం  మరియు  ఆధ్యాత్మికతల కలయిక అనేయోట్టం


                                                                                              



భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలోని ఆలయాలలో ఏనుగు ఉండటం ఒక తప్పనిసరి ఆనవాయితీ. అన్ని ప్రముఖ దేవాలయాలు నియమంగా  గజ సేవ నిర్వహించడం కూడా ఒక సంప్రదాయంగా నెలకొని ఉన్నది. ప్రత్యేకంగా తయారు చేసిన ఆభరణాలు ధరించి,పుష్పాలతో తీర్చిదిద్దిన   అంబారీతో సుందరంగా అలంకరించిన ఏనుగు మీద నయనమనోహరంగా ముస్తాబు చేసిన ఉత్సవ మూర్తులను ఉపస్థితులను చేసి మాడ  లేదా నగరవీధులలో ఊరేగించడం అనాదిగా వస్తున్న ఒక సేవ లేదా సాంప్రదాయం.
 గజాలు చాలా తెలివిగలిగిన జంతువులు. సూక్ష్మ గ్రాహులు. నేర్పించే వాటిని సులభంగా గ్రహించగలవు. వాటి పెద్ద శరీరం, తల, చెవులు, దంతాలు, తొండం మరియు చిన్న తోక అన్నింటికీ మించి వాటి నడక చూపరులను దృష్టి మరల్చుకోకుండా చేస్తాయి. ప్రజలకు ఏనుగుల పట్లగల ఆకర్షణ అంతులేనిది.  వాటి విన్యాసాలను చూడటానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఏనుగులు పర్యాటకకులకు ప్రధాన ఆకర్షణగా  నిలుస్తున్నాయి.
ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ఏనుగుల పట్ల గల ఆదరాభిమానాలు ఎనలేనివి. వారి పర్వదినాలలో జరిగే ఉత్సవాలలో ఏనుగుకు  ఉన్న స్థానం ప్రత్యేకమైనది. కేరళీయులు అభిప్రాయంలో ఏనుగులు లేని ఉత్సవం ఉత్సవం కానే  కాదు. అందులోనూ ఊరిలోని ఆలయ ఉత్సవం అయితే  అస్సలు తగ్గే ప్రసక్తి లేదు. తమ గ్రామంలో ఏనుగు లేక పోతే లక్షల రూపాయల అద్దె పోసి తీసుకొని రావడానికి సిద్ధపడతారు. అక్టోబర్ నుండి ఏప్రిల్ మధ్యకాలంలో రాష్ట్రంలోని అన్ని ఆలయాల ఉత్సవాలు వరసగా జరుగుతాయి.ఆ సమయంలో ఏనుగుల పెంపకందారులు, ఏనుగులు కలిగిన ఆలయాల వారు వారి ఏనుగులు  క్షణం తీరిక లేకుండా ఉంటారు. మలయాళీలకు ఏనుగు పట్ల అంతటి వ్యామోహం.
అందువల్లనే తమ ఆరాద్య దైవాలకు ఏనుగులనే కానుకగా సమర్పించుకొంటుంటారు. ముఖ్యంగా  శ్రీ గురువాయూరప్పన్ కి అత్యధిక సంఖ్యలో ఏనుగులను బహుమతిగా రాజకీయ నాయకులు, సినీ తారలు, వ్యాపారవేత్తలు ఇచ్చారు . అలా వచ్చిన ఏనుగుల కొరకు "పునత్తూరు కోట" అనే ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు దేవస్థానం వారు. నేడు సుమారుగా అరవై కి పైగా ఏనుగులు గల గురువాయూర్ దేవస్థానం గతంలో  ఒక్క ఏనుగు లేని పరిస్థితిలో ఉన్నదంటే నమ్మగలమా ! కానీ అది చరిత్రలో లిఖించబడిన నిజం. ఇరవయ్యో శతాబ్దపు తొలినాళ్లలో ఒక్క ఏనుగు కూడా లేని రోజుల గురించి గురువాయూర్ ఆలయ చరిత్రలో ఉదాహరించబడినట్లుగా తెలుస్తోంది. చుట్టుపక్కల ఆలయాల వారు స్వచ్చందంగా వచ్చి ఉత్సవాలలో పాల్గొనేవారట.

గత చరిత్ర  

ప్రశాంతంగా ఉన్న కేరళలో  వాస్కోడిగామా అడుగు పెట్టడంతో అలజడులు మొదలయ్యాయి. నాటి దాకా  కాలికట్ (కోళికోడ్) పాలకులైన జొమారిన్ రాజులకు, కొచ్చిన్ వంశ పాలకులకు మధ్య ఉన్న సత్సంబంధాలు పోర్చుగీసు వారి రాకతో విచ్చిన్నమయ్యాయి. 
పదిహేనో శతాబ్ద కాలంలో గురువాయూర్ జొమారిన్ రాజులు ఎక్కువగా ఆరాధించే శ్రీ కృష్ణుడు కొలువైన చిన్న ఆలయం మాత్రమే!  ఆలయానికి ప్రత్యేక గజం అంటూ లేదు. ఇవ్వడానికి రాజులకు గజసంపద లేదు. ఆలయ ఉత్సవాల కొరకు నేటి కొడంగళ్ళూరుకు సమీపంలోని "త్రిక్కనమతిలకం" ఊరి విష్ణు ఆలయ గజరాజును తీసుకొని వచ్చేవారు. ఈ ప్రాంతం కొచ్చిన్ రాజుల పాలనలో ఉండేది. పాలకుల మధ్య తలెత్తిన విభేదాలు ఆలయ నిర్వాహకులకు దాకా   వ్యాపించాయి. దానితో త్రిక్కనమతిలకం ఆలయం వారు గురువాయూర్ ఆలయ ఉత్సవాలకు ఏనుగును ఇవ్వడానికి నిరాకరించారు.
ఉత్సవ సమయం దగ్గర పడింది. ఏనుగు లేదు. అద్దెకు తెచ్చే ఆనవాయితీ లేదు. ఆలయ నిర్వాహకులకు ఏమి చేయాలో పాలుపోలేదు. అప్పుడొక చిత్రం జరిగింది. సరిగ్గా ఉత్సవాలు ఆరంభమయ్యే సమయానికి త్రిక్కనమతిలకం ఆలయానికి చెందిన ఏనుగు తనంతట తానుగా గురువాయూర్ చేరుకొన్నది. దాని పాదాలకు ఉన్న తెగిన గొలుసులను చూడగానే అది వాటిని తెంపుకొని వచ్చింది అని అర్ధమయ్యింది. గురువాయూర్ కి త్రిక్కనమతిలకం నూట ఇరవై కిలోమీటర్ల దూరం .
విషయం తెలుసుకొన్న త్రిక్కనమతిలకం ఆలయ నిర్వాహకులు ఆశ్చర్యం చెంది వచ్చి గురువాయూరప్పన్ ని దర్శించుకొని తమ తప్పిదనానికి క్షమాపణలు చెప్పుకొన్నారు.  ఉత్సవంలో పాలుపంచుకున్నారు. ఇక్కడ ప్రస్తావించవలసిన  విషయం ఏమిటంటే పోర్చుగీసు వారి తరువాత జొమారిన్ రాజులతో స్నేహం చేసిన డచ్చి వారు  ఆ రోజులలో ప్రముఖ క్షేత్రంగా పేరొందిన త్రిక్కనమతిలకం ఆలయాన్ని 1755వ సంవత్సరంలో పూర్తిగా నేలమట్టం చేయడం.

ఉత్సవాల ఆలయం  

కేరళ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో ఒకటి శ్రీ గురువాయూరప్పన్ కొలువైన గురువాయూర్ ఆలయం. విశేష పౌరాణిక చారిత్రక విశేషాలు ఈ ఆలయంతో ముడిపడి ఉన్నాయి. స్థానిక  హిందూ సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించే ఆలయాలలో ఒకటి. 
ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు రాష్ట్రం నుండి మరియు సుదూర ప్రాంతాల నుండి శ్రీ గురువాయూరప్పన్ దర్శనార్ధం తరలి వస్తుంటారు. నటన సూత్రధారి అయిన శ్రీ కృష్ణుడు కొలువైన క్షేత్రంలో రోజుకొక విశేష పూజ జరుగుతుంది. అష్టమి తిధి మరియు రోహిణి నక్షత్రం నాడు ప్రత్యేక పూజలు జరుపుతారు. ప్రతి నెల ఒక ఉత్సవం రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. 
అన్నింటి లోనికి మళయాళ పంచాంగం ప్రకారం కుంభం మాసంలో పది రోజుల పాటు జరిగే ఆలయ ఉత్సవాలు ముఖ్యమైనవి. కుంభం మాసం పుష్యమీ నక్షత్రం రోజున ఈ ఉత్సవాలకు అంకురార్పణ జరుగుతుంది. 
ఆ రోజు ఉదయం ధ్వజారోహణ, కలశ పూజ నిర్వహిస్తారు. తరువాత ఏనుగు మీద ఊరేగవలసిన వాసుదేవుని ఉత్సవిగ్రహాన్ని ప్రధాన పూజారి తన చేతులలో ఉంచుకొని మేళతాళాల మధ్య మాడ వీధులలో ఊరేగిస్తారు. ఆలయంలో ఏనుగు లేని రోజులకు గుర్తుగా నిర్వహించే దీనిని  "అనయిళ్ళ సీవేళి" అని అంటారు. ఆ రోజు సాయంత్రం "అనే యోట్టం" జరుగుతుంది. త్రిక్కనమతిలకం నుండి ఏనుగు తనంతట తానుగా ఆలయ ఉత్సవాల రోజున చేరుకొన్న సంఘటనకు గుర్తుగా  దీనిని నిర్వహిస్తున్నారు. 
ఈ పది రోజులు కథాకళి నాట్యాలు,  పౌరాణిక నాటకాలు, ఇతర నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో పేరొందిన నాట్యకారులు, సినీ నటులు వీటిల్లో పాల్గొంటారు. చివరి రోజున "ఆరట్టు"(పవిత్ర స్నానం) తో ఉత్సవాలు ముగుస్తాయి. శబరిమల భక్తుల సందడి సద్దుమణిగిన తరువాత ఆరంభమయ్యే ఈ ఉత్సవాలు గురువాయూర్ శోభను ఇనుమడిస్తాయి. ప్రతి ఒక్క ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమం భక్తులను అలరిస్తాయి. అన్నింటిలోకీ   అనే యోట్టం ప్రధానమైనది. 

అనెయోట్టం 

మలయాళంలో అనే అంటే ఏనుగు. అనె యోట్టం అనగా గజరాజుల పరుగు మరియు విందు  అని అర్ధం. దేవస్థానానికి ఉన్న గజాలలో బలమైన, ధృడమైన ఆరోగ్యవంతమైన కొన్ని గజాలను ఎంపిక చేస్తారు. వీటి సంఖ్య అయిదు నుండి ముప్పై దాకా ఉంటుంది. వీటి మధ్యనే  పరుగు పందెం ఉంటుంది. ఇవి పరుగు పందెంలో పాల్గొనడానికి తగిన ఆరోగ్యంతో ఉన్నాయని దేవస్థాన పశు వైద్యులు ధృవీకరించాలి. గతంలో దేవస్థానం వారు స్వతంత్రంగా వ్యవహరించేవారు. కానీ 1986 వ సంవత్సరం నుండి ఏనుగులను రక్షించవలసి జంతువుల జాబితాలో చేర్చడం వలన  అటవీ శాఖ వారు,జంతు సంరక్షణ సమితీ వారు ప్రస్తుతం ఈ కార్యక్రమానికి  పర్యవేక్షకులుగా వ్యహరిస్తున్నారు. పోలీసువారు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు.  
మధ్యాహన్నం మూడు గంటలకు పందెం ఆరంభం అవుతుంది. పరుగెత్తాల్సిన దూరం అయిదు వందల మీటర్లు.  గురువాయూర్ ఊరిలోనికి ప్రవేశించే ముందు ఆలయ తూర్పు ద్వారానికి వెళ్లే దారి వద్ద  పెద్ద గరుడ పక్షి బొమ్మ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని "మంజులాల్" అంటారు.  గజాలు వాటి మావటీలు సరిగ్గా రెండు గంటల నలభై అయిదు నిమిషాలకు అక్కడికి చేరుకొంటారు. 
పందెం ఏమిటంటే మంజులాల్ నుండి పరుగు ప్రారంభించి నేరుగా ఆలయ తూర్పు ద్వారం గుండా లోనికి ప్రవేశించి గర్భాలయానికి ఏడు  ప్రదక్షణలు  చేసి తిరిగి వెలుపలికి రావాలి. అలా మొదటగా తూర్పు ద్వారం గుండా లోపలికి ప్రవేశించిన  గజాన్ని విజేతగా నిర్ణయిస్తారు. ఎన్ని ఏనుగులు పందెంలో పాల్గొన్నా మొదటి  మూడు  గజాలనే ఆలయం లోనికి అనుమతిస్తారు. మిగిలినవి వెలుపలే నిలిచి పోతాయి. ఈ పందెంలో విజేత ఒక సంవత్సరం పాటు ఆలయంలో జరిగే అన్ని ఉత్సవాలలో "తిరంబు"(ఉత్సవిగ్రహం) ను ఊరేగించే  అవకాశాన్ని దక్కించుకొంటుంది. గత మూడు సంవత్సరాలుగా " గోపి కన్నన్" విజేతగా నిలవడం విశేషం. పందెం ముగిసిన తరువాత దేవస్థానం వారు అన్ని గజాలకు ప్రత్యేక అనె యోట్టం(విందు) ఏర్పాటు చేస్తారు. 
ఏనుగుల పరుగు పందెం ఆద్యంతం ఉల్లాస మరియు ఉత్సాహభరిత  వాతావరణంలో జరుగుతుంది. స్థానికులు,దేశవిదేశాల పర్యాటకులు మరియు భక్తులు తరలివస్తారు. ఏనుగులు తరలి రావడంతో వారి ఆనందహేలలు మొదలవుతాయి. పందెం ఆరంభం కాగానే వారి ఉత్సాహం పూర్తిగా హద్దులు దాటుతుంది. తమ అభిమాన ఏనుగును ప్రోత్సహిస్తూ కేకలు పెడుతుంటారు. వాటితో పాటు పరుగులు పెడతారు. ఆ నాలుగు గంటల కాలం గురువాయూర్ సందర్శించే ప్రతి ఒక్కరూ ఆ సంబరంలో భాగం అయిపోతారు. మరపురాని అనుభవాన్ని సొంతం  చేసుకొంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

(అనె యోట్టం గురించిన పూర్తి సమాచారాన్నిచ్చిన మిత్రులు, గురువాయూర్ దేవస్వం పూజారి శ్రీ రాజేష్ నంబూద్రి కి కృతజ్ఞతలు )





    


Sri Jagannatha Mandir, Koraput

                                          శబర శ్రీ క్షేత్రం 


శ్రీ జగన్నాథ స్వామి ఒరియా ప్రజలకు ప్రధమ ఆరాధ్య దైవం. సుందర సాగర తీరాన యుగాల క్రిందట అగ్రజుడైన శ్రీ బలదేవునితో మరియు సోదరి అయిన శ్రీ సుభద్ర దేవితో కలిసి  కొలువైన శ్రీ జగన్నాధుని స్మరణం, వీక్షణం ఇహపర సుఖాలను ప్రసాదించేదిగా విశ్వసిస్తారు ఒడిసా వాసులు. హిందువులకు ముఖ్యమైన దర్శనీయ నాలుగు క్షేతాలలో ఒకటి అయిన పూరి శ్రీ జగన్నాథుని స్వగృహం. 
దేశంలో పేరొందిన ఆలయాలతో పోలిస్తే పూరి క్షేత్రంలో జరిగే పూజలు, అలంకరణలు, యాత్రలు మరియు ఆరగింపులు చాలా ప్రత్యేకంగా ఉండటం పేర్కొనవలసిన అంశం. కాలక్రమంలో తొలుత ఏర్పడిన పూరి ఆలయ తరహాలో అనేక ప్రాంతాలలో అదే శైలిలో ఆలయాలను స్థానిక భక్తులు నిర్మించుకున్నారు. ఒక్క ఒడిసా రాష్ట్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాలలో, దేశాలలో ఏర్పడినాయి. శ్రీ జగన్నాథ తత్త్వం విశ్వవ్యాప్తం అయ్యింది. ఇలా ఇతర ప్రాంతాలలో శ్రీ జగన్నాథ మందిరాలు ఏర్పడటానికి మూలం తొలుత శ్రీ జగన్నాథుని ఆరాధించిన శబరులే కావడం విశేషం. 
ఆంధ్ర, ఒడిసా మరియు చత్తిస్గఢ్ రాష్ట్ర సరిహద్దులు కలిసే ప్రాంతాన్ని దండకారణ్యం అని పిలుస్తారు. ఇది శబరల నివాసస్థానం. పూరిలో కొలువు తీరడానికి పూర్వం జగన్నాధుడు శబరుల పూజలందుకొనేవారని పురాణాల ద్వారా తెలుస్తున్న విషయం. నేటికీ పూరి ఆలయంలో శబరుల ప్రాధ్యాన్యత చెప్పుకోదగినదే ! సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట స్థానిక శబర నాయకులు ఇక్కడ జగన్నాధుని ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారట. చిన్న పర్వతాన్ని ఎంచుకొని "నీలాంచల" అని నామకరణం చేసి అక్కడ సంప్రదాయం ప్రకారం దారు వృక్షాన్ని ఎంచుకొని విగ్రహాలను మలచారట. పూరి ఆలయ నమూనాలో మందిరాన్ని నిర్మించుకొన్నారట. పూరిలోని ఆలయం ఉన్న ప్రాంతాన్ని నీలాచలమని, మందిరాన్ని శ్రీ క్షేత్రం అని పిలుస్తారు.  కాలగమనంలో ఈ మందిరం కూడా "శబర శ్రీ క్షేత్రం" గా పేరొందినది. ఈ ప్రాంతం కోరాపుట్ నగరంగా అభివృద్ధి చెందినది. 
నగర నడిబొడ్డున ఉన్న నీలాచల శిఖరాన కొలువై ఉన్న శ్రీ జగన్నాధ, శ్రీ బలదేవ మరియు శ్రీ సుభద్ర కొలువై ఉంటారు. కొండా పై భాగానికి చేరుకోడానికి సోపాన మరియు రహదారి మార్గాలు ఉన్నాయి. భోగ, నట, ముఖ మండపాల తరువాత వచ్చే గర్భాలయంలోని రత్న బేది మీద సుందర అలంకరణ తో నేత్రపర్వంగా దర్శనమిస్తారు పురుషోత్తముడు సోదర మరియు సోదరితో కలిసి.  ప్రతి సంవత్సరం నూతన రథాలను తయారు చేస్తారు. 
పూరి క్షేత్రంలో జరిగే అన్ని పూజలు, యాత్రలు ఇక్కడ నిర్వహిస్తారు. కానీ ఒక తేడా ఉన్నది. పూరి ఆలయం లోనికి హిదువేతరులకు ప్రవేశం లభించదు. కానీ ఇక్కడ అలాంటి నిబంధన ఏదీ లేదు. పూరి లో స్వామివారికి సమర్పించే విధంగానే ఇక్కడ కూడా అన్న ప్రసాదం నివేదన చేస్తారు. దీని కోసం ఒక వంటశాల కలదు. పక్కనే భక్తులకు ప్రసాద వితరణ చేయడానికి "ఆనంద బజార్" కూడా కలదు. ప్రాంగణంలో భారతదేశంలో ప్రసిద్ధి చెందిన కేదారనాథ్, బద్రీనాథ్, అమరనాథ్, పుష్కర్, శ్రీరంగ, మధురై, శబరిమల, తిరుమల మూలవిరాట్టులతో పాటు శ్రీ పశుపతి నాధుని ఉపాలయాలు కనపడతాయి. పర్వత శిఖరాన విశాలమైన స్థలంలో దేవుల శైలిలో నిర్మించిన ప్రధాన ఆలయంతో పాటు చుట్టూ శ్రీ జగన్నాధుడు వివిధ సందర్భాలలో దర్శనమిచ్చే హతి, నాగార్జున, శ్రీ నారసింహ, శ్రీ రామ, బంకచూడ, కాళియ మర్దన, లక్షీనారాయణ, రఘునాథ, వామన మరియు సోనా వేషాలలో దర్శనమిస్తారు. ఉపాలయాల్లో శ్రీ వినాయక, శ్రీ హనుమాన్, శ్రీ లక్ష్మీనారసింహ, శ్రీ లక్ష్మి, శ్రీ కాళి మరియు నవగ్రహాలు కొలువుతీరి దర్శనమిస్తారు. ప్రతి నిత్యం స్థానిక మరియు దూరప్రాంత భక్తులు వస్తుంటారు. ఉదయం అయిదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు నిరంతరాయంగా తెరిచి ఉంటుంది. ఈ క్షేత్రంలో ముఖ్యమైనది శ్రీ జగన్నాధ రథ యాత్ర. కొండా మీద నుండి బయలుదేరి రాయగడ రహదారిలో ఉండే గుండిచా మందిరం వరకు సాగే ఈ రథయాత్రలో పాల్గొనడానికి మరియు వీక్షించడానికి వేళా సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.  
కోరాపుట్ జిల్లా అంటేనే ప్రకృతికి పుట్టిల్లు. ఎన్నో రకాల వృక్షాలు, మొక్కలు, జలపాతాలతో నిండిన పర్వతాలతో, లోయలతో ఎటు చూసినా పరవశింపచేసే పచ్చదనంతో నిండి ఉంటుంది. ఈ ప్రాంతంలో పలు గుహాలయాలు కనపడతాయి. ప్రకృతి ప్రేమికులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ముఖ్యంగా శీతాకాలంలో వీరి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఊటీగా ప్రసిద్ధికెక్కిన "అరకు" కోరాపుట్ కి సమీపంలోనే ఉంటుంది. కోరాపుట్ నగరంలో శ్రీ ముత్యాలమ్మ, శ్రీ తరణి, శ్రీ మహేశ్వర పురాతన ఆలయాలు ఉన్నాయి. తెలుగు జాతి ప్రజలు ఎక్కువగా నివసిస్తున్న కారణంగా అన్ని పర్వదినాలలో రెండు ప్రాంతాల సంప్రదాయాల కలయిక కనిపించడం విశేషం. 
విశాఖపట్నం,ఒడిసా రాష్ట్రం నలుమూలల నుండి రోడ్డు మరియు రైలు మార్గాలలో కోరాపుట్ చేరుకోవచ్చును. చక్కని వసతి సౌకర్యాలు మరియు భోజనం లభిస్తాయి. 
    



( జులై 4న తారీఖున జరిగే శ్రీ జగన్నాథ రథయాత్ర సందర్బంగా) 





1, జులై 2019, సోమవారం

Nava Kailasam's Thirunelveli

                          నవగ్రహ క్షేత్రాలు - నవ కైలాసాలు 


                                                                                                       



కైలాసనాధుడు ఇలలో పెక్కు క్షేత్రాలలో స్వయంభూలింగ రూపంలో కొలువై ఉన్నారు. ఆ ఆలయాలన్నీ భక్తులకు భువిలో కైలాస సమానంగాను,దర్శనీయ క్షేత్రాలుగా ప్రసిద్దమయ్యాయి. 
కానీ ఆలయాల రాష్ట్రం తమిళనాడు లోని దక్షిణ భాగాన ఉన్న తిరునెల్వేలి మరియు తూత్తుకుడి జిల్లాలను సస్యశ్యామలం చేసే నది తమిరపారాణి. ఆ నదీతీరంలో ఉన్న నవ కైలాస క్షేత్రాలు మిగిలిన వాటికి భిన్నమైనవి.  
పురాణ గాధలలో పేర్కొన్న ప్రకారం నవ కైలాసాలు ముక్తి ప్రసాదాలు. 
శివ పార్వతుల కళ్యాణం వీక్షించడానికి ముల్లోకాల నుండి తరలి వస్తున్న వారితో భూమి ఉత్తర భాగంలో భారం పెరిగి ఒక పక్కకు ఒరగసాగిందట. పరమేశ్వరుడు సప్తమహర్షులలో ఒకరైన అగస్థ్య మునిని పిలిచి, శిష్యప్రశిష్యులతో కలిసి దక్షిణ భాగానికి వెళ్ళమని ఆదేశించారట. చెమ్మగిల్లిన కనులతో "స్వామి!తమరి వివాహం వీక్షించే భాగ్యం నాకు లేదా ?" అని విషాదముగా ప్రశ్నించారట మహర్షి. ఆశీర్వదించిన మహేశ్వరుడు "నీవు ఎక్కడ ఉన్నా అక్కడ నుండి నా వివాహాన్ని చూడగలవు" అని వరం ప్రసాదించారట. త్రినేత్రుని ఆదేశం కాదనలేక వింధ్య పర్వతాలను దాటి దక్షిణాదిలో తాను ఎక్కడ విడిది చేశారో అక్కడ నిత్య పూజ నిమిత్తం ఒక లింగాన్ని ప్రతిష్టించేవారట. వాటినే నేటికీ మన రాష్ట్రంతో పాటు, కర్ణాటక మరియు తమిళనాడులలోని చాలా శివాలయాలలో కొలువైన లింగరాజుని "అగస్తేశ్వరుడు" అని పిలుస్తుంటారు. 
 పవిత్ర నదులలో స్నానమాడుతూ పుణ్య క్షేత్రాలనుసందర్శించుకొంటూ చివరికి పశ్చిమ కనుమలలో ఉన్న పొదిగై పర్వతాలను చేరుకొన్నారట. ఇక్కడే ఆయన సంస్కృత తమిళ భాషలకు లిపిని సృష్టించారని పురాతన తమిళ గ్రంధాలలో పేర్కొనబడినది.  అగస్త్య మలై మీద అగస్త్య మహర్షి ఆలయం ఉన్నది. 
ఈ కొండల పైనుండే కైలాసనాధుని కరుణతో స్వామివారి కల్యాణ సంబరాలను కమనీయంగా దర్శించుకొన్నారట అగస్త్యుడు. ఈ ఉదంతం గురించి వరాహ, స్కాంద పురాణాలలో, రామాయణ మరియు మహాభారతాలలో విశదీకరించబడినది. రోమశ ముని అగస్త్యుని ప్రధమ శిష్యుడు. తపస్సు చేసి నందివాహనుని సాక్షాత్కారం పొందారు. కానీ అతను కోరిన మోక్షాన్ని ప్రసాదించలేనని, దానికి గురువాజ్ఞ కావాలన్నారట. తిరిగి వచ్చి గురువునకు జరిగింది తెలిపి ముక్తిని పొందే మార్గాన్ని ఉపదేశించమని అర్ధించారట రోమశ ముని. అగస్త్యుడు శిష్యుని ఆకాంక్షకు ఆనందించి తొమ్మిది కమలాలను తమిరబారాణి నదీప్రవాహంలో విడవమన్నారట. అవి తీరాన్ని తాకి శివలింగాలుగా మారిపోతాయి. ఆ దివ్య క్షేత్రాలలో సర్వేశ్వరుని అర్చించి, చివరగా నది సముద్రునితో కలిసే సంగమ స్థలంలో తపస్సు చేస్తే కోరిక సిద్ధిస్తుంది అని తెలిపారట. 
శిష్యుడు అదే విధంగా చేసి ముక్తిని పొందారు. అలా రోమశ మహర్షి వదిలిన పుష్పాల నుండి ఉద్భవించిన లింగాలు కొలువైన క్షేత్రాలు నవ కైలాసాలుగా ప్రసిద్ధి చెందాయి. అవి పాపనాశం, చేరన్ మహాదేవి, కొడగనల్లూరు, కూనత్తూరు, మూరప్పనాడు, శ్రీ వైకుంఠం, తెందూరిపెరై, రాజపతి మరియు సెందపూమంగళం. శైవ సంప్రదాయం ప్రకారం ఇవి మానవ జీవితాలను ప్రభావం చేసే నవ గ్రహాలకు ప్రతీక.జాతకరీత్యా ఏ గ్రహ ప్రభావంతో జీవితంలో ఎదుర్కొంటున్న   ఒడుదుడుకులు ఆ గ్రహ క్షేత్రాన్ని సందర్శించుకొంటే తొలగిపోతాయి అన్న విశ్వాసంతో ప్రతి నిత్యం ఎందరో ఈ క్షేత్రాలను సందర్శించుకొంటుంటారు.చోళలు నిర్మించిన ఆలయాలను, పాండ్య మరియు నాయక రాజులు అభివృద్ధి చేసినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. 
నవ కైలాస క్షేత్రాలన్నీ విశేష పురాణ నేపథ్యం కలిగినవి. అన్ని క్షేత్రాలలో (పాపనాశం తప్ప) కొలువైన ఆదిదంపతులను శివగామి సమేత కైలాసనాథర్ అనే పిలుస్తారు. కైలాస సమాన ప్రదేశాలు కదా ! కార్తీకమాసం,ఆరుద్రోత్సవం,నవరాత్రులు,గణేశ చతుర్థి,స్కంద షష్టి, శివరాత్రి,   త్రయోదశి ప్రదోష పూజలు, పర్వదినాలను వైభవంగా నిర్వహిస్తారు. అన్ని చోట్లా శైవాగమన విధానాన్ని అనుసరించి రోజుకు ఆరు పూజలు జరుపుతారు. 
మరో విశేషం ఏమిటంటే పావన తమిరబారాణి నదీతీరంలో ఆళ్వారుల పాశురాలతో దివ్యదేశాల హోదా పొందిన తొమ్మిది శ్రీమన్నారాయణుని ఆలయాలు కూడా ఉన్నాయి.వీటిని నవ తిరుపతులు అని పిలుస్తారు.చిత్రమైన విశేషం ఏమిటంటే ఇవి కూడా నవగ్రహ క్షేత్రాలే.   కాకపోతే శ్రీ వైష్ణవ నవగ్రహ  క్షేత్రాలు. 

పాపనాశం  శ్రీ పాపనాశనాథర్ స్వామి అర్ధాంగి లోకనాయకి (ఉళగమ్మాళ్) సమేతులై కొలువైన ఈ క్షేత్రం రోమశ ముని వదిలిన పుష్పాలలో తొలి పుష్పం తీరాన్ని తాకడంతో ఏర్పడినది.  స్వామివారు ఆరోగ్యప్రదాత. అందుకని సూర్యగ్రహానికి సంకేతమీ ఆలయం. 
దేవతలను నాశనం చేయాలన్న ఉదేశ్యంతో తపమాచరిస్తున్న రాక్షస గురువు శుక్రాచార్యుని కుమారుడైన  ద్వస్థ అనే వాడిని సంహరించారు దేవేంద్రుడు. దాని వలన సంక్రమించిన బ్రహ్మహత్య పాపాన్ని తొలిగించుకోడానికి నీలకంఠుని ఆదేశం మేరకు ఇక్కడికి వచ్చి తపస్సు చేసి పాపాన్ని తొలగించుకున్నారు. ఆ కారణంగా స్వామిని పాపనాశనాథర్ అని పిలుస్తారు. 
సుందర జలపాతాలు, నదీ తీరం, వనాల మధ్య ప్రకృతి పూర్ణస్వరూపంగా దర్శనమిచ్చే పాపనాశం క్షేత్రంలో వినాయక, షణ్ముఖ, దక్షిణామూర్తి, దుర్గ ఆదిగా గల దేవీ దేవతలు ఉపాలయాలలో కొలువై ఉంటారు. విజయనగర మరియు నాయక రాజులు పునః నిర్మించిన ఈ ఆలయంలో రమణీయమైన శిల్పకళ కనపడుతుంది. ఆలయం ఉదయం ఆరు నుండి ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల దర్శనార్ధం తెరచి ఉంటుంది. జిల్లా కేంద్రమైన తిరునెల్వేలికి అరవై కిలోమీటర్ల దూరం. పాపనాశంలోని శ్రీ నారాయణ స్వామి, శ్రీ కాళీ అమ్మన్ ఆలయాలు తప్పక దర్శించుకోవలసినవి. 
ప్రకృతి ప్రేమికులకు ఈ క్షేత్ర సందర్శన ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలుగ చేస్తుంది. చుట్టుపక్కల ఉన్న అంబ సముద్రం, విక్రమసింగ పురం,మన్నార్ కోయిల్, శివశైలం గ్రామాలలో గొప్ప పురాతన ఆలయాలను దర్శించుకోవడం అదనపు అవకాశం. 
చేరన్ మహాదేవి   శ్రీ కైలాసనాథర్ శివగామీ అంబాళ్ సమేతులై కొలువు తీరిన చేరన్ మహాదేవి నవ కైలాసాలలో రెండవది. ఇది చంద్ర క్షేత్రం. రోమశ మహర్షి తొలుత తపస్సు చేసి శివ దర్శనాన్ని పొందినది ఈ క్షేత్రంలోనే . అందుకే మహర్షి ఒక ఉపాలయంలో కొలువై ఉంటారు. 
గర్భాలయానికి ఎదురుగా ఉండే నందీశ్వరుడు ఇక్కడ కొద్దిగా పక్కకు ఉంటాడు. దీనికి సంబంధించిన గాధ ఇలా ఉన్నది. అంటరాని కులానికి చెందిన నందనార్ గొప్ప శివభక్తుడు. దళితులకు ఆ రోజులలో ఆలయ ప్రవేశం ఉండేది కాదు. అయినా నందనార్ శైవ క్షేత్రాలను సందర్శించి వెలుపలి నుండే తన ఆరాధ్యదైవాన్ని ప్రార్ధించుకొనేవాడు. ఒకనాడు నందనార్ ఇక్కడికి వచ్చి వెలుపల నిలిచి ప్రార్ధిస్తున్నాడు. భక్తవత్సలుడు తన భక్తుడు చూడటానికి వీలుగా నందిని పక్కకు జరగమన్నారు. అందుకని నంది పక్కకు ఉంటాడు. 
ఉపాలయాలలో శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ విశ్వనాథ, నటరాజ, సప్త మాతృకలు దర్శనమిస్తారు. నవగ్రహ మండపం ఉంటుంది.  ఆలయం ఉదయం ఏడు నుండి పది వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి ఆరువరకు మాత్రమే తెరిచి ఉంటుంది. చేరన్ మహాదేవి లో  శ్రీ వైద్యనాథర్ , శ్రీ భక్తవత్సల పెరుమాళ్, శ్రీ మారియమ్మన్ ఆలయాలు దర్శనీయాలు.   పాపనాశం నుండి చేరన్ మహాదేవికి  పాతిక కిలోమీటర్లు. 
కొడగనల్లూరు చేరన్ మహాదేవికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న కొడగనల్లూరు నవ కైలాసాల్లో మూడవ క్షేత్రం. ఈ ఆలయం మహాభారతంతో ముడిపడి ఉన్నట్లుగా క్షేత్ర గాధ తెలుపుతోంది. పరీక్షిత్తు మహారాజు మృతికి కారకుడైన తక్షకుడు (కర్కోటకుడు) పాపపరిహారార్ధం  శ్రీ కైలాసనాథర్ ని ప్రార్ధించి అనుగ్రహం పొందాడట. అంగారక క్షేత్రం. కుజ గ్రహ వక్ర దృష్టితో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నవారి ఉపశమనార్ధం పూజలు నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో వృశ్చిక మరియు మేష రాశి వారికి కూడా దర్శనీయం. సాదాసీదాగా ఉండే ఈ ఆలయంలో ఒక విశేషం కనపడుతుంది. దీర్ఘకాలంగా వివాహం కాని యువతీయువకులు యాభై యెనిమిది పసుపు కొమ్ములు కట్టిన దండ నంది మెడలో వేస్తారు. దీని వలన కళ్యాణ ఘడియలు తొందరగా వస్తాయని విశ్వసిస్తారు. లెక్కలేనన్ని పసుపు కొమ్ముల దండలతో నంది నిండుగా కనపడతాడు. 
బృహదీశ్వర ఆలయం తరువాత అంత పెద్ద లింగాన్ని ఇక్కడ చూడవచ్చును. గర్భాలయంలోని కైలాసనాథర్ లింగానికి కట్టడానికి ఎనిమిది గజాల ధోవతులు ఎనిమిది కావాలంటే లింగ పరిమాణాన్ని ఊహించుకోవచ్చును.అమ్మవారు ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తారు. ఆలయం ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు, సాయంత్రం అయిదు గంటల నుండి ఏడు వరకు తెరచి ఉంటుంది. 
ఈ ఊరిలోని శ్రీ బృహన్ మాధవ స్వామి ఆలయం, శ్రీ అభిముక్తేశ్వర స్వామి ఆలయాలు పురాతనమైనవి. తప్పక సందర్శించవలసినవి. 
కున్నత్తూర్  కొడగనల్లూరు కు పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న కున్నత్తూర్ నవ కైలాసాలలో నాలుగవది. ఇక్కడ కొలువైనదీ శ్రీ శివగామి సమేత శ్రీ కైలాసనాథర్ స్వామి. కానీ స్థానికంగా శ్రీ గోత పరమేశ్వరస్వామి కోవెలగా పిలుస్తారు. సాధారణంగా కనిపించే ఈ క్షేత్రం రాహు గ్రహ పరిహార క్షేత్రం మరియు పూజలకు ప్రసిద్ధి. జాతక రీత్యా రాహు వక్రదృష్టితో ఇక్కట్లు పడుతున్నవారు ఎక్కువగా వస్తుంటారు.  
మరెక్కడా చూడని విశేషం ఇక్కడ కనపడుతుంది. లింగం మీద సర్పాకృతి ఉంటుంది. ఇలాంటి విశేష లింగాన్ని  మరెక్కడా చూడలేము.  సాదా సీదా గా ఉండే ఆలయం ఉదయం ఏడు నుండి పదకొండు వరకు, సాయంత్రం అయిదు నుండి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది. 
మూరప్పనాడు    నవ కైలాసాలలో అయిదవది. కున్నత్తూర్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కూడా శ్రీ శివగామి సమేత శ్రీ కైలాసనాథర్ స్వామి కొలువై ఉంటారు. గురు గ్రహ క్షేత్రం. ధను మరియు మీన రాశిలో జన్మించినవారికి కూడా దర్శనీయ క్షేత్రం. ఇక్కడ తమిర బారాణి నది ఉత్తర వాహిని. ఇక్కడ స్నానం సమస్త పాపహరం. గంగా స్నానముతో సమానం. అమావాస్య మరియు పౌర్ణమి రోజులలో అదే విధంగా నెల చివరి శుక్ర, శని వారాలలో వేలాదిగా భక్తులు ఇక్కడ స్నానమాచరిస్తారు.మరో విశేషమేమిటంటే గర్భాలయం వద్ద నిలబడి చూస్తే నదిలో స్నానమాచరించి భక్తులు కనపడతారు. దక్షిణ గంగలో స్నానమాచరించే వారిని   గంగాధరుడు లోపలి నుండే ఆశీర్వదిస్తున్న అనుభూతి కలుగుతుంది భక్తజనులకు. 
విజయనగర మరియు నాయక రాజులు యుద్దానికి తరలి వెళ్ళేటప్పుడు ఈ ఆలయంలో ప్రత్యేకంగా గురువుకు పూజలు చేసేవారట. గురు అనుగ్రహం విజయాన్ని అదృష్టాన్ని తెస్తుంది అన్నది తరతరాల విశ్వాసం.
సూరపద్ముని అరాచకాల నుండి కాపాడమని మునులు నదీతీరంలో వరుసలో నిలబడి నందివాహనుని ప్రార్ధించారట. అందుకని ఈ పేరు వచ్చినట్లుగా చెబుతారు. ఆ సమయంలో మునులు ప్రతిష్టించిన "మురంబేశ్వర స్వామి" లింగం ఈ సంఘటనకు గుర్తుగా చూపుతారు. 
ఈ ఆలయంలో అనేక ప్రత్యేకతలు కనిపిస్తాయి. ద్వారపాలకులుగా వినాయకులు ఉంటారు.   భైరవ సన్నిధిలో రెండు భైరవ మూర్తులు ఉంటాయి. శునకంతో ఉన్నరూపాన్ని కాలభైరవగా  లేకుండా ఉన్న మూర్తిని వీరభైరవగా ఆరాధిస్తారు. 
ఈ ఆలయంలో కనపడుతుంది మరెక్కడా కనిపించని ప్రత్యేకత నంది విగ్రహంలో. వృషభ (ఎద్దు) మొహానికి బదులు అశ్వవదనంతో కనిపిస్తాడు శిలాద తనయుడు.దీనికి సంబంధించిన కధ ఇలా ఉన్నది. ఒక చోళ రాజుకు అశ్వవదనంతో కుమార్తె జన్మించినది. తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. ఇక్కడికి వచ్చి తదైకదీక్షతో తపమాచరించి కైలాసనాథుని ప్రసన్నం చేసుకొన్నాడు. ఆయన నందిని బాలిక మోమును స్వీకరించమని ఆదేశించారు. అలా బాలిక మోము నందికి వచ్చింది. 
ఉపాలయాలలో సూర్య, అష్టలక్ష్మి, నయమ్మార్లు, పంచ ముఖ లింగం, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి, దక్షిణామూర్తి, చండికేశ్వర స్వామి, శని భగవాన్ కొలువై ఉంటారు. గురు మరియు నవగ్రహ అనుగ్రహం కొరకు భక్తులు దక్షిణామూర్తి, శని భగవానునికి తొమ్మిది చొప్పున ప్రదక్షణాలు చేస్తారు. 
ఏనుగు, నెమలి మరియు గోమాత శివపూజ చేస్తున్నచెక్కడం, ఆంజనేయ మూర్తి, కన్నప్ప శిల్పం జీవకళ ఉట్టిపడుతూ చూపరులను నిలబెట్టేస్తాయి. ఈ విశేష ఆలయం ఉదయం ఏడు నుండి పదకొండు వరకు, సాయంత్రం అయిదు నుండి ఏడు వరకు తెరచి ఉంటుంది. 
శ్రీ వైకుంఠం పేరు తెలుపుతున్నట్లుగా ఇది ముఖ్యంగా శ్రీ వైష్ణవ  క్షేత్రం. శ్రీ వైకుంఠనాథ పెరుమాళ్ కోవెల నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి. శ్రీ వైష్ణవ నవగ్రహ క్షేత్రాలలో సూర్య క్షేత్రం. 
ఈ ఆలయానికి ఒక కిలోమీటరు దూరంలో ఉంటుంది నవ కైలాసాలలో ఆరవది శని క్షేత్రమైన 
శ్రీ కైలాసనాథర్ స్వామి ఆలయం. చోళ, పాండ్యులు నిర్మించిన ఆలయాన్ని నాయక రాజులు అభివృద్ధి చేశారు అని శాసనాలు తెలియజేస్తున్నాయి. చక్కని శిల్పాలకు నిలయం. జన్మ, అర్ధాష్టమ,ఏలినాటి శని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నవారు విశేష సంఖ్యలో వస్తుంటారు. 
పరివార దేవతలుగా వినాయక, సుబ్రహ్మణ్య, దుర్గ, దక్షిణామూర్తి కనపడతారు. శని దేవుడు ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. ఆలయ కావలి దేవత భూతనాథర్ విగ్రహం చెక్కతో చేసినది కావడం ఒక విశేషంగా పేర్కొనాలి. 
ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు, సాయంత్రం నాలుగు నుండి ఏడు గంటల వరకు తెరచి ఉంటుంది. మూరప్ప నాడు నుండి శ్రీ వైకుంఠం ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
తెందురి పెరై ఈ క్షేత్రం కూడా నవ కైలాసాలు మరియు నవ తిరుపతులలో స్థానం పొందినది. 
శ్రీ మకర నెడుంకులైనాథ పెరుమాళ్ ఆలయానికి సమీపంలోనే ఉంటుంది శ్రీ శివగామీ సమేత శ్రీ కైలాసనాథర్ ఆలయం. నవ కైలాసాలలో ఏడవది. ఇది బుధ క్షేత్రం. 
ప్రాంగణ నలుదిక్కులా వల్లభ గణపతి,శక్తి వినాయక,కన్నెమూల గణపతి, సిద్ది వినాయక కొలువై ఉంటారు. శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి, దక్షిణామూర్తి ఆదిగా గలవారు పరివార దేవతలుగా కొలువుతీరి ఉంటారు.  వేదరూపిగా పేర్కొనే అష్టభుజ భైరవునికి అష్టమి మరియు పౌర్ణమినాడు విశేష పూజలు చేస్తారు. బుధుడు ప్రత్యేక సన్నిధిలో ఉంటారు. బుధ శాంతికి భక్తులు పెసలు, పచ్చ వస్త్రాలు సమర్పించుకొంటుంటారు. 
నవగ్రహ మండపంలో సూర్యుడు ఏడు, చంద్రుడు పది, శుక్రుడు మరియు గురువు ఎనిమిది అశ్వాలు పూంచిన రధాలలో ఉండటం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి. ఉదయం ఎనిమిది నుండి పది వరకు, సాయంత్రం అయిదు నుండి ఏడు వరకు మాత్రమే తెరిచి ఉండే ఈ ఆలయం శ్రీ వైకుంఠం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరం లో ఉంటుంది. 
రాజపతి తెందురి పెరై కి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కేతు క్షేత్రమైన రాజపతి. 
రోమశ మహర్షి వదిలిన తొమ్మిది పుష్పాలలో ఆఖరి పుష్పం ఆగిన స్థలం ఇదే ! కేతువు శివానుగ్రహం కొరకు ఇక్కడ తపస్సు చేశారట.
అవివాహితులు, ఆనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు, సంతానం లేని దంపతులు అధిక సంఖ్యలో వస్తుంటారు.కేతు పరిహార పూజలు ఆదివారాలు మధ్యాహన్నం పన్నెండు గంటల నుండి ఒకటిన్నర దాకా నిర్వహిస్తారు. తిరిగి మంగళవారాలు ఉదయం తొమ్మిది నుండి పదిన్నర వరకు జరుపుతారు. మంగళ వారాలు హోమం కూడా ఉంటుంది.
గర్భాలయంలో శ్రీ కైలాసనాథర్ లింగ రూపంలో భక్తులను అనుగ్రహిస్తారు. ఉపాలయాలలో ఆది కైలాసనాథర్, శ్రీ వినాయక, శ్రీ సుబ్రమణ్య, నటరాజ స్వామి, దక్షిణామూర్తి, నయమ్మారులలో ప్రముఖులైన సంబందర్, సుందరార్, అప్పార్, మాణిక్యవాసగర్ కొలువై ఉంటారు.
దక్షిణ కాళహస్తీగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం ఉదయం ఆరు నుండి పదకొండు వరకు, సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు భక్తుల కొరకు తెరచి ఉంటుంది.
సెంద పూమంగళం నవ కైలాసాలలో ఆఖరిది. శుక్ర క్షేత్రం. ఇక్కడ కుబేరుడు శివగామి సమేత   కైలాసనాథర్ ని ఆరాధించారట. గర్భాలయం విమాన గోపురం పైన  సతులైన శంఖనిధి, పద్మనిధిలతో పాటు ఉన్న కుబేరుని చూడవచ్చును.
ఉపాలయాలలో గణపతి, మురుగన్, చొక్కనాథర్, చండికేశ్వరార్, దక్షిణామూర్తి, భైరవుడు,  కొలువై ఉంటారు. నవగ్రహాలు, సప్త మాతృకలు మరియు అరవై మూడు మంది నయమ్మార్లు విడిగా మండపాలలో ఉంటారు. మరో విశేషం ఏమిటంటే ఇక్కడ నవ కైలాసాల లింగాలను సందర్శించుకొనవచ్చును.
ఈ క్షేత్రం రాజపతి నుండి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ఇక్కడితో నవగ్రహ క్షేత్రాలుగా ప్రసిద్ధిగాంచిన నవ కైలాసాల సందర్శనం ముగిసినట్లే. సెంద మంగళం నుండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరుపాడై వీడు లలో ఒకటైన తిరుచెందూర్ ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. సాగరతీర ఆలయం ఆధ్యాతిక భావాలతో పాటు ఆహ్లాదాన్ని అందిస్తుంది.
తిరుగు ప్రయాణంలో కొత్తగా నిర్మించిన వన తిరుపతి శ్రీ బాలాజీ ఆలయాన్ని,నవ తిరుపతులను  దర్శించుకొని రాత్రికి తిరునెల్వేలి చేరుకోవచ్చును. తిరునెల్వేలిలోని శ్రీ నెల్లిఅప్పార్ ఆలయం శిల్పకళకు ప్రతిరూపం. సరైన ప్రణాళిక తో వెళితే దగ్గరలో ఉన్న టెంకాశీ, కుర్తాళం లాంటి క్షేత్రాలను కూడా సందర్శించుకునే అవకాశం లభిస్తుంది.

నమః శివాయ !!!!


  

    


Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...