15, ఏప్రిల్ 2017, శనివారం

Sri Varadaraja Perumal Temple, Kanchipuram


          శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం 

                         


సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటి కాంచీపురం. విశేష పౌరాణిక చారిత్రిక నగరం. వేగావతి నదీ తీరాన ఉన్న ఈ నగర గొప్పదనాన్ని గురించి చెప్పాలంటే " పుష్పేషు జాతి పురుషేషు విష్ణు నారీషు రంభ నగరేషు కంచి" అన్న ఆర్యోక్తి ఉదాహరిస్తే  చాలు. 
కాంచీపురం లో నెలకొన్న అనేకానేక దేవాలయాలలో ప్రముఖమైనవి  శ్రీ ఏకాంబరేశ్వర స్వామి, శ్రీ కామాక్షీ దేవి, శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల. గతంలో వెయ్యికి పైగా దేవాలయాలు కంచి లో ఉండేవని చెబుతారు. 
శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయం. అంతే కాదు శ్రీరంగం, తిరుమల, మేల్కేటే ల తరువాత కంచి శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల వారికి అత్యంత పవిత్ర దర్శనీయ క్షేత్రం. మరో విశేషం ఏమిటంటే ఈ నూట ఎనిమిది దివ్య తిరుపతులలో పదునాలుగు కంచి లోనే ఉండటం. అందులో కొన్ని విష్ణు కంచిలో ఉండగా మరి కొన్ని శివ' కంచి ఉంటాయి. విష్ణు కంచి లో ఉండే శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల ఎంతో విశేష పౌరాణిక మరియు చారిత్రక నేపథ్యం కలిగి ఉంటుంది. 










కృతయుగంలో విధాత బ్రహ్మ, త్రేతాయుగంలో గజరాజు గజేంద్రుడు , ద్వాపర యుగంలో బృహస్పతి, కలియుగంలో ఆది శేషుడు, ఆళ్వారులు, శ్రీరామానుజాచార్యులు, శ్రీ ఆదిశంకరులు మరెందరో మహానుభావులు  ఈ స్వామిని సేవించారు అని పురాణాలు పేర్కొంటున్నాయి.
స్వామి ఇక్కడ స్వయంభూగా వెలయడం గురించిన కధ  సత్యయుగం నాటిదిగా తెలుస్తోంది.
సరస్వతీ దేవితో ఏర్పడిన వివాదంతో ఆగ్రహించి భూలోకానికి వచ్చిన సృష్టి కర్త శ్రీ మహా విష్ణు అనుగ్రహం కోసం అశ్వమేధ యాగం తలపెట్టారు.
కాకపోతే యజ్ఞ దీక్షలో సతీసమేతంగా కూర్చోవాలి.  అందుకని శ్రీ గాయత్రీ దేవిని సరసన కూర్చోబెట్టుకొని యాగం ఆరంభించారు. ఈ పరిణామానికి ఆగ్రహించిన సరస్వతీ దేవి నదీ రూపంలో  ఉదృతం వేగంతో ప్రవహిస్తూ యజ్ఞ వాటికను ముంచివేయబోగా శ్రీ హరి అడ్డుగా శయనించి ప్రవాహాన్ని పక్కకు మళ్లించారు. అలా శయనించిన ప్రదేశంలో మరో దివ్య దేశం ఉన్నది అదే " విన్నసైద పెరుమాళ్" కొలువైన "తిరువెక్క" ఈ ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది.










విధాత యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసుకున్న తరువాత శ్రీ మన్నారాయణుడు దర్శనమిచ్చి ఆలుమగల మధ్య వివాదాలు సహజమని తెలిపి సృష్టి కర్తను చదువుల తల్లిని కలిపారు.
అంతట పద్మాసనుడు, దేవతలు, మునులు స్వామిని ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకోమని ప్రార్ధించారు.అలా స్వామి ఇక్కడ కొలువుతీరారు.
త్రేతాయుగంలో గజేంద్రుడు ప్రతి నిత్యం సమీపంలోని పుష్పాలను సేకరించి స్వామిని పూజించేవాడు. ఇతను గత జన్మలో భరత మహారాజ పుత్రుడైన "ఇంద్రద్యుమ్ము"నిగా కొన్ని గ్రంధాలూ పేర్కొన్నాయి. అగస్త్య మహర్షి శాపకారణంగా ఈ జన్మలో ఏనుగుగా జన్మించాడు.
గజేంద్ర మోక్షం గాధ  మనందరకూ తెలిసినదే!మొసలి బారి నుండి రక్షించిన ఆదిదేవుని కరిరాజు మోక్షాన్ని అర్ధించడమే  కాకుండా  తన శరీరం మీద కొలువై ఉండమని కోరాడు.
అందుకని ఈ క్షేత్రాన్ని "హస్తిగిరి " అని పిలుస్తారు. అదే కాలక్రమంలో "అత్తిగిరి"గా మారిందని కొందరు  ఒకప్పుడు ఈ ప్రాంతమంతా అత్తి వృక్షాలతో నిండి ఉన్నందున ఈ పేరు వచ్చింది అని మరికొందరు అంటుంటారు.
గాయక భక్తులైన ఆళ్వారులు తమ పాశురాలలో ఈ క్షేత్రాన్ని "అత్తియూరు" అని పేర్కొన్నారు.











సుమారు ఇరవై అయిదు ఎకరాల స్థలంలో ఉండే ఈ ఆలయాన్ని తొలుత కంచిని పాలించిన పల్లవ  రాజు రెండవ నందివర్మ క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది.(కంచి లోని చాలా ఆలయాలు ఈయన నిర్మించినవే కావడం విశేషం) తరువాత చోళ రాజులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారని శాసనాలు తెలుపుతున్నాయి. మరెన్నో రాజవంశాలు ఆలయానికి తమ వంతు కర్తవ్యంగా కైకర్యాలు సమర్పించుకున్నారు. కానీ విజయనగర రాజుల కాలంలో పెక్కు నిర్మాణాలు జరిగి ప్రస్తుత రూపాన్ని సంతరించు కొన్నదీ కోవెల. ఎన్నో తమిళ, తెలుగు మరియు కొన్ని కన్నడ శాసనాలు కనపడటం విశేషం.
మొత్తం మూడు ప్రాకారాలతో,  ముప్పై రెండు ఉపాలయాలు, పంతొమ్మిది విమాన గోపురాలు, మూడువందల పైచిలుకు మండపాలతో  శోభాయమానంగా ఉంటుంది.
అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయ సొంతం. ముఖ్యంగా అనంత పుష్కరణి పక్కన ఉండే నూరు  స్తంభాల మండప శిల్ప శోభ వర్ణించ శక్యం కాదు. ఒకే రాతితో చెక్కిన గొలుసులు, కూర్మ సింహాసనానికి దిగువన అమర్చిన తిరిగే చక్రాలు, స్థంభాలకి చెక్కిన రామాయణ, మహా భారత సన్నివేశాలు మహాద్భుతంగా ఉంటాయి.







ముఖ్యంగా సందర్శించవలసిన ఉపాలయాలు శ్రీ నారసింహ, శ్రీ రామానుజ, ఆళ్వారుల సన్నిధులు.మూడో ప్రాకారంలో కొలువుతీరిన శ్రీ పేరుందేవి అమ్మవారిని దర్శించిన తరువాతే శ్రీ వరదరాజ పెరుమాళ్ దర్శనానికి వెళ్ళాలి. ప్రధాన ఆలయంలో మూలవిరాట్టు స్థానిక భంగిమలో దివ్యమైన అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు.ముఖమండపంలో విజయనగర రాజుల కాలంలో సహజ వర్ణాలతో చిత్రించిన వివిధ దేవతా రూపాల చిత్రాలు నేటికీ చెక్కుచెదరక పోవడం చెప్పుకోదగిన సంగతి.










స్వామి వారి దర్శనానంతరం వెలుపలకు వచ్చేటప్పుడు పైకప్పుకు ఒక రాతి దూలం పైన చెక్కిన బంగారు బల్లి మరియు వెండిబల్లిని తాకాలి.
దీనికి సంబంధించిన పురాణగాథ ఏమిటంటే గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు  ఉండేవారు.  వారు గురువు గారి దేవతార్చనకు కావలసిన పుష్పాలు, ఫలాలు మరియు నీరు ఏర్పాటు చేస్తుండే వారు. ఒకనాడు వారు పెట్టిన నీటి పాత్రలో ఒక బల్లి పడింది. ఆగ్రహించిన మహర్షి వారిని బల్లులుగా జీవించమని శపించారు. తెలియకచేసిన తప్పుకు క్షమించమని వేడుకొనగా ఆయన వారిని అత్తిగిరి క్షేత్రం వెళ్లి స్వామిని సేవించమని శాప విమోచన తెలిపారు.
కొంతకాలానికి ఇంద్రుడు సూర్యుడు మరియు చంద్రునితో కలిసి శ్రీ వరదరాజ పెరుమాళ్ దర్శనానికి తరలి వచ్చాడు. వారి దర్శనంతో శిష్యులకు శాపవిమోచనం లభించినది.
నాటి నుండి ఇక్కడ వారి రూపాలను ఏర్పరచారు. వీటిని తాకిన వారి సమస్త దోషాలు, పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారని చెబుతారు.











ఈ ఆలయంలో ఉన్న మరో విశేషము ఏమిటంటే గర్భాలయం లో ఒకప్పుడు అత్తి చెట్టు కాండంతో చేసిన విగ్రహం ఉండేది. చెక్క విగ్రహం. దీనిని బ్రహ్మదేవుని ప్రతిష్టగా భావిస్తారు. నిత్యపూజల కారణంగా విగ్రహా రూపం మారుతున్నందున దాని స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. పాత విగ్రహాన్ని అనంత పుష్కరణిలో వెండి భోషాణంలో ఉంచి నలభై సంవత్సరాల కొకసారి వెలుపలకు తీసి పది రోజుల పాటు భక్తుల దర్శనార్ధం ఉంచుతారు. అనంతరం తిరిగి పుష్కరణిలో ఉంచుతారు.  ఈ ఉత్సవం జరిగింది 1979 వ సంత్సరం జులై నెలలో జరిగింది.  తిరిగి 2019 వ సంవత్సరం జులై నెలలో అత్తివరద స్వామి దర్శనం లభించినది.















సంవత్సరమంతా ఎన్నో ఉత్సవాలతో, ప్రతి నిత్యము ఎన్నో పూజలతో సేవలతో భక్తులతో కళకళ లాడుతుంటుంది శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల.






పన్నెండు మంది శ్రీ వైష్ణవ ఆళ్వార్లలో పేయి ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ మరియు భూతత్తి ఆళ్వార్ తమ పాశురాలలో శ్రీ వరదరాజ స్వామిని కీర్తించారు.









 కాంచీపురంకు మనరాష్ట్రం లోని తిరుపతి, చిత్తూరు పట్టణాల నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. అదే విధంగా చెన్నై నుండి, చెంగల్ పట్టు నుండి ప్రతి పది నిముషాలకి ఒక బస్సు లభిస్తుంది.
ఓం నమో నారాయణాయ నమః !!!!

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...