19, ఫిబ్రవరి 2023, ఆదివారం

Thirunangnoor Divyadesam 3

                             తిరునాంగూర్ దివ్యదేశాలు - 3


తిరునాంగూర్ దివ్య దేశాలు ఆకారంలో చిన్నవి కావచ్చును కానీ ప్రాధాన్యతలో ఆధ్యాత్మికతలో పెద్దవిగానే పేర్కొనాలి. 
ప్రతి ఆలయం ఒక తనదైన ప్రత్యేకతలతో, పరమాత్మను ఆకర్షించడమే కాక ఆళ్వార్లను కూడా ప్రభావితం చేయగలిగాయి. 
తిరునాంగూర్ దివ్య దేశాల విశేషాల మూడవ భాగంలో మిగిలిన ఆలయాల గురించి తెలుసుకొందాము. 

7. తిరు వైకుంఠ విన్నగరం 

తిరునాంగూర్ దివ్య దేశాల వరుసలో ఏడవది అయిన ఈ దివ్య దేశం గురించి పద్మ పురాణంలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అగస్థ్య మహర్షి ఈ క్షేత్ర మహత్యం గురించి ఉపరిచర వాసు మహారాజుకు చెప్పినట్లుగా అవగతం అవుతోంది. 
గతంలో శ్వేతకేతు అనే ఇక్ష్వాకు వంశ రాజుకు వైకుంఠవాసం చేయాలన్న తలంపు కలిగిందిట. సతీ సమేతంగా తీవ్ర తపస్సు చేసి వైకుంఠం చేరుకోగలిగారట. కానీ వారికి అక్కడ శ్రీ మన్నారాయణుని దర్శనం లభించలేదట. పైగా అక్కడ వారిని ఆకలిదప్పులు బాధించ సాగాయట. 
ఈ పరిణామాలతో వ్యాకుల పడిన రాజ దంపతులు తిరిగి భూలోక మార్గం పట్టారట. మార్గమధ్యలో వారికి త్రిలోక సంచారి బ్రహ్మఋషి అయిన నారద మహర్షి ఎదురయ్యారట. వారు ఆయనకు తమ బాధ తెలుపుకొని, తరుణోపాయం తెలుపమని అర్ధించారట. 
ఆయన గత జన్మలో వారు ఎలాంటి దానధర్మాలు, దైవకార్యాలు చేయనందున ఈ పరిస్థితి ఎదురయ్యింది అని చెప్పారట. ఆయన వారిని భూలోకం లోని పావన కావేరీ నదీ తీరంలోని పలాస వనంలో తపస్సు చేస్తూ తగిన విధంగా అన్నదానం చేయమని సలహా ఇచ్చారట. 
మహర్షి ఆదేశం మేరకు రాజదంపతులు పలాస వనం చేరుకొని అక్కడ కొలువైన "ఐరావతేశ్వర స్వామి"ని భక్తి శ్రద్దలతో సేవించుకోసాగారట. 
కొంతకాలానికి మహేశ్వరుడు దర్శనమిచ్చి వారి కోరిక విని తాను  కూడా మహావిష్ణువు దర్శనం కొరకు కలిసి అక్కడ తపస్సు చేశారట. వారి నిర్మలమైన భక్తికి సంతసించిన వైకుంఠవాసుడు శ్రీ దేవి, భూదేవి మరియు శ్రీ నీలాదేవి సమేతులై  సాక్షాత్కరించారట. 
రాజదంపతులు శాశ్వత వైకుంఠనివాస యోగం ప్రసాదించారట. సర్వేశ్వరుని కోరిక మేరకు అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారట. 
ఈ క్షేత్ర మహత్యాన్ని విన్న ఉపరిచర వాసు మరియు ఉదంగ మహర్షి తరలి వెళ్లి శ్రీ వైకుంఠనాధుని సందర్శించుకొన్నారట. 

ఆలయ విశేషాలు 

శిర్కాలి కి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో ఎలాంటి ఆకర్షణీయ నిర్మాణాలు కనిపించవు. కానీ పరిపూర్ణ విశ్వాసంతో కోరుకొంటే మోక్షాన్ని ప్రసాదించే వాడు శ్రీ వైకుంఠ నాథ పెరుమాళ్ అన్న నమ్మకంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. 
గర్భాలయంలో శ్రీ వైకుంఠ నాథ పెరుమాళ్ తో పాటుగా క్షేత్ర తాయారు  శ్రీ వైకుంఠ వల్లి, శ్రీదేవి. భూదేవి ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తారు. 
నియమంగా రోజుకు నాలుగు పూజలు నిర్వహించే ఈ ఆలయం ఉదయం ఎనిమిది గంటల నుండి పది వరకు, సాయంత్రం అయిదు నుండి రాత్రి ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది. 
తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే శ్రీ వైకుంఠ నాథ పెరుమాళ్ ని కీర్తిస్తూ పది పాశురాలను గానం చేశారు. 

8. తిరు సెంపోం అరంగ కోవెల 

పురుషోత్తమన్ కోవెలకు తూర్పుగా అర కిలోమీటర్ దూరంలో ఉంటుందీ దివ్య దేశం. 
క్షేత్రంతో ముడిపడి ఉన్న గాథ కారణంగా స్వామిని హేమ(బంగారు)రంగనాధుడు అని పిలుస్తారు. 
గతంలో హేమ రంగపురి అని పిలిచేవారట. 
శ్రీ రామచంద్ర మూర్తి రావణ సంహారం తరువాత ఇక్కడ ఒక యజ్ఞం చేసారని తెలుస్తోంది.  
పద్మ పురాణంలో ఈ క్షేత్రం గురించి అనేక గాధలు పేర్కొనబడ్డాయని తెలుస్తోంది.
వాటి ప్రకారం పెరుమాళ్ ను భక్తిశ్రద్ధలతో స్మరించిన వారి ఇహపర లోకాల దరిద్రం తీరిపోతుంది అని విశ్వసిస్తారు. 
కోరిన వారి కోర్కెలను తీర్చడంలో స్వామి ప్రసిద్ధి. 
తూర్పు ముఖంగా ఉన్న కోవెలలోని గర్భాలయంలో శ్రీవారు శ్రీదేవి, భూదేవి సమేతులై నేత్రపర్వంగా అలంకరణలో స్థానక భంగిమలో దర్శనమిస్తారు. 
తిరుమంగై ఆళ్వార్ స్వామిని కీర్తిస్తూ పది పాశురాలను గానం చేశారు. 

9.తిరుమణి కూడం 

పద్మ పురాణం ప్రకారం చంద్రుడు తన మామగారైన దక్ష ప్రజాపతి ఇచ్చిన శాప కారణంగా క్షీణించి పోసాగాడట. పుణ్య క్షేత్రాల సందర్శనంతో శాపం తొలిగిపోతుంది అన్న విశ్వాసంతో చంద్రుడు అనేక తీర్థ క్షేత్రాలను దర్శించుకుంటూ చివరికి నాగపురి గా పిలవబడిన నాంగుర్ చేరుకొన్నాడట. 
అక్కడి మునిపుంగవుల సలహా మేరకు సోమ పుష్కరణిలో స్నానమాచరిస్తూ పెరుమాళ్ ధ్యానంలో గడపసాగాడట. అతని భక్తికి మెచ్చిన శ్రీహరి దర్శనమిచ్చి స్వస్థత ప్రసాదించారట. 
చంద్రునితో పాటు అక్కడి మహర్షుల కోరిక మేరకు స్వామి అక్కడే స్థిరనివాసం ఏర్పరచుకొన్నారు. 
ఒక ప్రాకారంలో ఉన్న ఈ ఆలయంలో మూల విరాట్టు శ్రీ వరదరాజ పెరుమాళ్. గర్భాలయంలో స్దాన భంగిమలో చక్కని అలంకరణలో స్వామి కన్నుల పండుగగా దర్శనమిస్తారు. అమ్మవారు శ్రీ తిరుమామగళ్ నాంచారి విడిగా ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. 
తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే శ్రీ వరదరాజ పెరుమాళ్ ని కీర్తిస్తూ పది పాశురాలను గానం చేశారు. 

10. తిరు పార్థన్ పల్లి 

పడమర ముఖంగా ఉన్న ఈ ఆలయంలో మూలవిరాట్టు శ్రీ తామరయల్ కెల్వన్ (శ్రీ పార్ధసారథి). అమ్మవారు శ్రీ తామరై నాయకి. 
కురుక్షేత్ర యుద్ధంలో అర్జున రథసారథిగా నిలిచిన శ్రీ కృష్ణుని పార్ధసారధిగా పిలుస్తారు. స్వామికి ఈ పేరు మీద ఉన్న మరో దివ్య దేశం చెన్నై పట్టణంలోని ట్రిప్లికేన్ లోని శ్రీ పార్ధసారధి ఆలయం. 
కురుక్షేత్ర సమరానికి చాలా కాలం ముందు యుద్ధం అనివార్యమైతే తనవారిని చంపుకోవలసి వస్తుంది అన్న భయానికి లోనయ్యాడట. 
ఇక్కడ ఈ ప్రదేశంలో శ్రీ కృష్ణుడు మొదటిసారిగా పార్థునికి జ్ఞానోపదేశం చేసి యుద్దానికి సంసిద్దుని చేశారట. ఆలయంలో ఉత్తరాభిముఖంగా ఉన్న పాండవ మధ్యముని సన్నిధిని చూడవచ్చును. 
గతంలో గౌతమ, భరద్వాజ, అగస్థ్య మహర్షులు ఈ పుణ్య స్థలిలో తపమాచరించారట. 
గర్భాలయంలో మూలవిరాట్టు చతుర్భుజాలతో స్థానక భంగిమలో దర్శనమిస్తారు. అమ్మవారు సన్నిధి విడిగా ఉంటుంది. 
ఆలయం సాధారణంగా ఉంటుంది. ఎలాంటి విశేష శిల్పకళ కనపడదు. 
తిరుమంగై ఆళ్వార్ ఒక్కరే పది పాశురాలను శ్రీ పార్ధసారధి పెరుమాళ్ మీద గానం చేసారు. 

11. తిరు దేవనార్ తొగై 

తిరు నాంగుర్ దివ్యదేశాలలో ఆఖరిది తిరు దేవనార్ తొగై. 
శ్రీ దైవ నాయకన్ (శ్రీ మాధవ పెరుమాళ్) అమ్మవారు శ్రీ కడల్ మగళ్ నాంచారి విడివిడిగా రెండు సన్నిధులలో కొలువై దర్శనమిస్తారు. 
ఇక్కడ స్వామిని సేవించినవారి జీవితంలో అన్ని పనులలో విజయం సిద్ధిస్తుందని చెబుతారు. 
తిరుమంగై ఆళ్వార్ శ్రీ మాధవ పెరుమాళ్ ని కీర్తిస్తూ పది పాశురాలను గానంచేసారు. 
తిరు నాంగుర్ దివ్యదేశాలను, ఈశ్వర కోవెలలను శిర్కాలి లేక చిదంబరం నుండి ఒక్క రోజులో సందర్శించుకోవచ్చును. రెండు చోట్లా తగిన వసతి, భోజన సౌకర్యాలు లభిస్తాయి. 
చెన్నై నుండి రైలు లేక బస్సు ద్వారా చిదంబరం చేరుకోవచ్చును. 

ఓం నమో నారాయణాయ !!!!


 

 
 

18, ఫిబ్రవరి 2023, శనివారం

Nadakuduru Temple


                                      నరకోద్ధారక క్షేత్రం 


మన భారత దేశం పుణ్య భూమి. జగన్నాటక సూత్రధారి, అంతర్యామి అయిన నిరాకారుడు వివిధ రూపాలలో స్వయంగా నడయాడి స్థిరపడిన ప్రాంతాలు అనేకం కనిపిస్తాయి. 
ముఖ్యంగా లయకారుడైన పరమేశ్వరుని ఆలయాలు లెక్కలేనన్ని అనేక ప్రాంతాలలో నెలకొని ఉన్నాయి. అందులో ప్రతి ఒక్కటి ఒక పురాణ ప్రాశస్త్యం కలిగినది కావడం విశేషంగా చెప్పకోవలసిన సంగతి.
అలాంటి విశేష క్షేత్రాలలో ఒకటి సర్వేశ్వరుడు శ్రీ పృథ్విశ్వర స్వామి గా కొలువు తీరిన నడకుదురు ఒకటి. చాలా విశేష క్షేత్రం గా వెలుగులోకి వచ్చిన ఈ క్షేత్ర విశేషాలను తెలుసుకొందాము. 
ద్వాపర యుగం నాటి గాధలతో ముడిపడి ఉన్న క్షేత్రం. నరకాసుర సంహారం ఇక్కడే జరిగిందని, దీపావళి పర్వదినానికి నాంది పలికింది కూడా ఇక్కడే అన్నది వ్యాప్తిలో ఉన్న క్షేత్రపురాణం మాట.  స్కంద పురాణంలో ఈ క్షేత్ర ప్రస్తాపన ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. 

 







నరకాసుర ప్రతిష్ఠిత లింగం 

పావన కృష్ణా నదీ తీరంలో నెలకొన్న ఈ క్షేత్రంలో నరకాసురుడు ఈశ్వర కటాక్షం కొరకు మరియు చేసిన పాపం తొలగించుకోడానికి తపస్సు చేసినట్లుగా ఆలయ గాథ తెలుపుతోంది. 
ఆధిపత్య పోరులో భాగంగా నరకాసురుడు పంచముఖుడు అనే అసురుని సంహరించాడట. ఆ కారణంగా సంక్రమించిన బ్రహ్మహత్యా పాతకాన్ని తొలగించుకోడానికి నారద మహర్షి సలహా మేరకు ఇక్కడ తపస్సు చేశారట. 
భూదేవి పుత్రుడైన నరకుడు తల్లి పేరు మీద శ్రీ పృథ్విశ్వర అన్న పేరుతో లింగాన్ని ప్రతిష్టించి పుష్కర కాలం తపస్సు చేసి పొందిన బ్రహ్మహత్య దోషాన్ని తొలగించుకో గలిగాడట. మహేశ్వర సాక్షాత్కారంతో మరింత గర్వంతో ముల్లోకాలను ముప్పతిప్పలు పెట్టసాగాడట.  
 










రాక్షస బాధలు తట్టుకోలేక దేవతలు, మహర్షులు కైలాసానికి వెళ్లి త్రిశూలధరుణి శరణు కోరారట. ఆయన వారితో "నరకుని మరణం అతని తల్లి చేతిలోనే ఉన్నది.శ్రీ కృష్ణుని భార్య అయిన సత్యభామ దేవి భూదేవి అంశ. కనుక ద్వారక వెళ్లి మురళీధరుని శరణు కోరండి" అని తెలిపారట. 
అంతట వారంతా ద్వారకా నగరానికి వెళ్లి వాసుదేవునితో నరకుని వలన ఎదురవుతున్న ఇక్కట్లను తెలుపుకొన్నారట. 
అభయమిచ్చిన నందనందనుడు దేవేరితో కలిసి నరకుని మీదకు దండెత్తి వెళ్లారట. సమరంలో శ్రీ కృష్ణుడు సొమ్మసిలిపోగా సత్యభామాదేవి రంగంలోకి దిగి నరకాసురుని సంహరించినది ఈ ప్రదేశంలోనే అన్నది స్థలపురాణ గాథ. 
 
 






లోకకంటకుడి మరణంతో సంతసించిన దేవతలు పుష్పవర్షం కురిపించారట. యుద్ధంలో గాయపడిన అంతర్యామి త్వరగా కోలుకోవాలని స్వర్గం నుండి పాటలీ వృక్షాలను తెచ్చి ఇక్కడ నాటారట. అందుకే మరెక్కడా ఈ వృక్షాలు కనిపించవు. ఈ వృక్షాలకు మ్రొక్కి, మనసులోని కోరిక చెప్పుకొని ముడుపు కడితే మనోభీష్టాలు నెరవేరతాయన్నది భక్తుల విశ్వాసం. 
తేరుకున్న శ్రీ కృష్ణుడు శ్రీ పృథ్విశ్వర స్వామిని సేవించుకొని కొంతకాలం స్వామి సేవలో గడిపారట. ఆ సమయంలో పాటలీ వృక్షం క్రింద కనిపించే శ్రీ లక్ష్మీనారాయణ  స్వామిని ప్రతిష్టించారట. 







ఆలయ విశేషాలు 

కృష్ణానదీ తీరంలో పసుపు, అరటి, జామ, కొబ్బరి తోటల మధ్య ప్రశాంత ప్రకృతిలో నెలకొని ఉన్న ఈ ప్రాంతాన్ని గతంలో "నరాకోత్తరక క్షేత్రం"గా ప్రసిద్ధి చెందినది. కాలక్రమంలో నరకొత్తూరు,  నరకదూరుగా పిలువబడి నేడు "నడకుదురు"గా పిలువబడుతోంది. 
కరకట్ట ను ఆనుకొని స్వాగత ద్వారం నిర్మించబడినది. క్రిందకు దిగి మట్టి రోడ్డులో ఆలయానికి చేరుకొంటే నూతనంగా నిర్మించిన నాలుగు అంతస్థుల రాజ గోపురం కనపడుతుంది. 
గోపురం వద్ద శిలాద పుత్రుడు స్వామి వారి సేవకు నిరంతరం సిద్ధం అన్నట్లుగా కనపడతారు. విఘ్ననాయకుడు శ్రీ గణపతి, దేవసేనాధిపతి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి క్షేత్రానికి మేము సదా రక్ష అన్నట్లుగా గోపురానికి ఇరువైపులా ఉంటారు. అక్కడే కైలాస ద్వారపాలకులు "ముండి మరియు దిండి"కూడా నిలబడి ఉంటారు. 
ఆలయానికి వెలుపల గ్రామదేవత అయిన శ్రీ వనమలమ్మ తల్లి సన్నిధి ఉంటుంది. 
పురాతన నిర్మాణాల స్థానంలో కొత్తగా సువిశాల ప్రాంగణంలో నిర్మించిన ఆలయంలో తొలుత కనిపించేది అంబరాన్ని చుంబించేలా కనిపించే ధ్వజస్థంభం.  













మధ్య సన్నిధిలో శ్రీ పృథ్విశ్వర స్వామి లింగ రూపంలో చక్కని చందన కుంకుమ పుష్ప అలంకరణంలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. మరో సన్నిధిలో అమ్మవారు శ్రీ బాలా త్రివుర సుందరీ దేవి, మరో సన్నిధిలో శ్రీ వీరభద్రుడు కొలువై ఉంటారు. 
పక్కనే ఉన్న పాటలీ వృక్ష వనంలో నూతనంగా ద్వాదశ జ్యోతిర్లింగాలను, అష్టాదశ పీఠ పాలికలను ఏర్పాటు చేశారు. వనం మధ్యలో శ్రీ కృష్ణ దంపతులు ప్రతిష్టించిన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి సన్నిధి, కొన్ని నాగ శిలలు కనిపిస్తాయి. 










 


ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు తిరిగి సాయంత్రం అయిదు గంటలకు తెరిచే ఈ ఆలయంలో నియమంగా నాలుగు పూజలు జరుపుతారు. 
పౌర్ణమికి, మాస శివరాత్రికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. 
గణపతి నవరాత్రులు, శ్రీ సుబ్రహ్మణ్య షష్టి, దేవీ నవరాత్రులు మరియు మహా శివరాత్రి పర్వదినాలలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. 
ఆహ్లాదకర పరిసరాలలో పవిత్ర నదీతీరంలో లభించే దైవదర్శనం మానసిక శాంతితో పాటు చక్కని అవసర ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించే క్షేత్రం నడకుదురు  శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ పృథ్విశ్వర స్వామి కొలువైనది. 
విజయవాడ నుండి కరకట్ట మార్గంలో అవనిగడ్డ వెళ్లే దారిలో వచ్చే నడకుదురు రహదారి మార్గంలో సులభంగా చేరుకోవచ్చును. మార్గంలో తోట్లవల్లూరు, ఐలూరు, శ్రీ కాకుళం లాంటి ప్రదేశాలలో ఉన్న పురాతన ఆలయాలను సందర్శించుకునే అవకాశం కూడా లభిస్తుంది. 
కానీ తగిన వసతి సౌకర్యాలు లభించవు. విజయవాడ నుండి వెళ్లి రావడం ఉత్తమం. 
ఒక సెలవ దినాన్ని కుటుంబ సభ్యులతో ఒక విశేష క్షేత్రంలో గడిపిన అనుభవాన్ని పొందాలి అంటే తగిన ప్రదేశం నడకుదురు. కార్తీక సమారాధనలకు సరైన ప్రదేశం శ్రీ పృథ్విశ్వర స్వామి ఆలయం, నడకుదురు. 

నమః శివాయ !!!!

12, ఫిబ్రవరి 2023, ఆదివారం

Sri Vilvanatheswara Temple, Thiruvalam

           శ్రీ విల్వనాథేశ్వర స్వామి ఆలయం, తిరువాళం 


కైలాసనాధుడు పుడమిలో కొలువైన అనేక క్షేత్రాల గాధలు, ప్రత్యేకతలు ఒక్కదానితో మరొకటి పోల్చలేనివి. అంతటి విశేషతలు కలిగినవి. అలాంటి వాటిలో శ్రీ విల్వనాథేశ్వర స్వామి కొలువైన తిరువాళం ఒకటిగా పేర్కొనాలి. 
తిరువాళం ముక్తి స్థలంగా కీర్తించబడినది. 
 క్షేత్రంలోని వినాయకుడు, అమ్మవారు,నందీశ్వరుడు ఆలయ వృక్షం అన్నీ కూడా తమవైన ప్రత్యేకతలు కలిగి ఉండటం చెప్పుకోవలసిన విషయం. 









ఆలయ పురాణ గాథ 

ఆలయ గాథ మనం అనేక శైవ క్షేత్రాలలో విన్నదే ! యుగాల క్రిందట ఈ ప్రాంతమంతా బిల్వ వృక్షాలతో నిండి ఉండేదట. సమీపంలోకి పశువుల కాపరులు తమ గోవులను మేత కోసం ఇక్కడికి తోలుకొని వచ్చేవారట. 
గోవుల మందలో ఒక ఆవు బిల్వ వృక్షం క్రింద ఉన్న చీమల పుట్టలో పాలను ధారగా వదిలేదట. చూసిన కాపరులు గ్రామపెద్దకు మనవి చేశారట. వారు పుట్టాను తొలగించి చూడగా లోపల లింగరాజు దర్శనమిచ్చారట. 
విషయం తెలిసిన ప్రాంత పాలకుడు అక్కడ ఒక ఆలయాన్ని నిర్మించారని ఆలయ గాథ\ తెలుపుతోంది. 
అనంతర కాలంలో అరణ్యాన్ని, పక్కన ఉన్న పర్వతాలను"కంజన్"అనే రాక్షసుడు ఆక్రమించుకొని ప్రజలను ఇక్కట్లకు గురి చేయసాగాడట. అతడు పెడుతున్న ఇబ్బందుల గురించి ఆలయ పూజారి పరమాత్మకు ప్రతిరోజు విన్నవించేవారట. ఒకనాడు మహేశ్వరుడు వాహనమైన నందీశ్వరుని పిలిచి అసురుని అంతం చేయమని ఆదేశించారట. 
లయకారుని ఆజ్ఞ మేరకు శిలాద తనయుడు వాడి కొమ్ములతో రాక్షసుని శరీరాన్ని ఎనిమిది భాగాలుగా చీల్చి ఎనిమిది దిక్కులకు విసిరివేశారట. 
అప్పటికీ మరణించని అసురుడు తనను క్షమించి తన పాపాలను తొలగించమని ఆర్తితో ప్రార్ధించాడట. కరుణామూర్తి అయిన కైలాసనాధుడు కరుణించి కంజన్ కు ముక్తిని ప్రసాదించారట. అంతే కాకుండా అతని శరీరభాగాలు పడిన ప్రదేశాలలో తాను కొలువై ఉంటానని, అతని రక్తపు బిందువులు పడిన పర్వత ప్రాంతమంతా శివ నిలయంగా మారిపోతుంది అని వరమిచ్చారట. అదేవిధంగా కంజన్ దేహపు భాగాలు పడిన "లాలాపేట్టై, శీకరాజపురం, మావేరి, వడక్కాల్,  తెంకల్, మాణియంపట్టు, కుగయనల్లూరు మరియు నరసింగపురం గ్రామాలలో సర్వేశ్వరుడు స్వయంభూ లింగంగా ఉద్భవించారు అని చెబుతారు. తరువాత అక్కడ ఆలయాలు నిర్మించబడినాయి అని తెలుస్తోంది. 
 నేటికీ కంజగిరి పర్వతం మీద ఎక్కడ త్రవ్వినా లింగాలు లభిస్తాయి స్థానిక విశ్వాసం. 



















సహజంగా శివాలయాలలో నందీశ్వరుడు గర్భాలయంలో కొలువు తీరిన లింగరాజును తదేక దృష్టితో వారి పిలుపుకు సదా సిద్ధం అన్న భంగిమలో కనపడతారు అన్నది మనందరికీ తెలిసిన విషయమే ! కానీ ఇక్కడ నంది గర్భాలయానికి వ్యతిరేక దిశలో కొలువై కనపడతారు. దానికి కారణం 
కంజన్ మృతి చెందినా భవిష్యత్తులో మరి కొందరు అసురులు రావచ్చన్న అనుమానంతో కంజనగిరి వైపు చూస్తూ కనపడతారు. దీనిని ఒక ముందు చూపు చర్యగా అభివర్ణిస్తారు. 
ఇలా నందీశ్వరుడు స్వామికి వ్యతిరేక దిశలో కొలువై కనిపించే ఆలయం తమిళనాడులో మరొకటుంది. 
చెన్నై చుట్టుపక్కల చోళ రాజులు పదో శతాబ్ద కాలంలో నిర్మించిన "తొండై మండల నవ గ్రహ ఆలయాలు" ఉన్నాయి. వీటిల్లో"సోమ మంగళం"లో కొలువైన శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయం"(చంద్ర గ్రహానికి ప్రతి రూపం) లో కూడా నంది తూర్పు వైపుకు తిరిగి ఉంటారు. ఆ కథ వేరు. 
ఆ వివరాలు ఈ బ్లాగ్లో ఉన్నాయి. 
 










శ్రీ విల్వనాథేశ్వర స్వామి భక్త సులభుడు, కోరకనే భక్తుల కోర్కెలు తీర్చేవారు అన్నది స్థానిక విశ్వాసం. దీనిని నిరూపించే మరో ఘటన గురించి స్థానికంగా వినపడుతుంది. 
స్వామివారి పూజాదికాలు నిర్వహించే అర్చకస్వామి వృద్దుడయ్యారట. ఆ కారణంగా స్వామి అభిషేకానికి కావలసిన నీరు నది నుండి తేవడానికి శ్రమ పడేవారట. 
గమనించిన గంగాధరుడు ఆలయానికి దూరంగా ప్రవహించే నదిని "నీ... వా" అని ఆదేశించారట. దీనికి అర్ధం "నీవు ఇక్కడికి రా " అని. నాటి నుండి క్షేత్రానికి సమీపంలో ప్రవహించే నదిని "నీవా " అని పిలుస్తారు. 









పేరు వెనుక కథ 

కొన్ని వందల సంవత్సరాల క్రిందట "తీక్కలి" అనే భక్తుడు స్వామిని తదేక భక్తిశ్రద్దలతో సేవించుకొనేవాడట. ఆయన పేరు మీదగా ఈ గ్రామాన్ని "తీక్కలి వళ్ళం"అని పిలిచేవారట. 
అది "తిరువాళం" గా మారడానికి సంబంధించిన గాథ "విఘ్న రాజాధిపత్యం" గురించి ఆది దంపతుల పుత్రులైన శ్రీ గణపతి మరియు శ్రీ కుమార స్వామి మధ్య నెలకొన్న ఆధిపత్య నిరూపణ పోటీకి సంబంధించినది కావడం విశేషం. 
పరమేశ్వరుడు నిర్ణయించిన నిబంధన మేరకు ముల్లోకాలలో ఉన్న నదులలో స్నానమాచరించాలి అన్న సంకల్పంతో మయూర వాహనుడు రివ్వున వెళ్ళిపోయాడు. అలా వెళ్లలేని మూషిక వాహనుడు పరిపూర్ణ విశ్వసంతో, భక్తిగా తల్లితండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేసి విజయం సాధించాడు.
తమిళంలో "వాళం" అనగా ప్రదక్షిణ. ఆది దంపతుల చుట్టూ చేసిన పవిత్ర ప్రదక్షిణంగా "తిరు వాళం" గా పిలవబడుతోంది.    










ముక్తి క్షేత్రం 

పురాతన తమిళ గ్రంధాల ఆధారంగా మరో గాథ ప్రచారంలో ఉన్నది. 
ఒక విషయంలో సందేహనివృత్తి కొరకు  వైకుంఠవాసుడు కాంజ గిరి మీద కైలాసనాధుని సాక్షాత్కారం ఆశిస్తూ తపస్సు చేశారట. 
దర్శనం ఇచ్చిన జ్ఞాన ప్రదాత శ్రీహరి కోరిక మేరకు తిరు వాళం మోక్ష క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చారట. 
దానిని నిరూపించే ఘటన గురించి ఆలయ విశేషాలలో ఇలా  వివరించబడింది అని తెలియవస్తోంది. 
సమీప గ్రామంలో నివసించే ఒక బ్రాహ్మణుడు తన తండ్రి అస్థికలను పావన గంగా నదిలో నిమజ్జనం చేయదలచి బయలుదేరారట. మార్గంలో ఇక్కడ ఆగి పుష్కరణి పక్కన తండ్రి అస్థికలు ఉన్న పాత్రను ఉంచి స్నానం చేసి పరమాత్మను సందర్శించుకొన్నారట. తిరిగి ప్రయాణం ఆరంభించబోతూ చూడగా పాత్రలో అస్థికలను బదులుగా సువాసనలను వెదజల్లుతున్న మల్లెపూల దండ కనపడిందట. 
క్షేత్ర మహత్యాన్ని తెలుసుకొన్న అతను వారణాసి వెళ్లే ఆలోచన విరమించుకొని  అక్కడే తండ్రికి చేయవలసిన కర్మకాండను పూర్తి చేశారట. 
ఇలాంటి గాధలు ఎన్నో వినిపిస్తాయి. 

















ఆలయ విశేషాలు 

ఊరికి ఈ పేరు రావడానికి గల రెండు కారణాలను పైన తెల్పబడినాయి. అదే విధంగా మరో కారణం కూడా చరిత్ర పుస్తకాలలో పేర్కొనబడినట్లుగా అవగతం అవుతోంది. 
దాని ప్రకారం ఒకటవ రాజరాజ చోళుని సోదరి "కుందవై" ని వివాహమాడిన "వల్లవరాయన్ వండియదేవన్" వంశీకుల కులదైవం శ్రీ విల్వనాథేశ్వర స్వామి. వల్లవరాయన్ తొండై మండలాన్ని పరిపాలించినట్లుగా తెలియవస్తోంది. 
ఆలయంలోని చాలా నిర్మాణాలు ఆయన కాలంలో జరిగినట్లుగా శాసనాధారాలు పేర్కొంటున్నాయి. 
తూర్పు ముఖంగా ఉన్న ఆలయానికి మూడు ప్రాకారాలు కలవు. ఆలయానికి వెలుపల శ్రీ వినాయక సన్నిధి, ఆలయాభివృద్దికి పాటుపడిన శ్రీ శివానంద మౌన స్వామిగళ్ జీవ సమాధి ఉంటాయి. 
మూడంతస్థుల రాజగోపురం దాటి రెండవ ప్రాకారం లోపలికి ప్రవేశించడానికి దారి తీసే రెండవ గోపురం వద్ద రాతితో మలచిన సుందర తొట్టెలు కనిపిస్తాయి. వాటిని మలచిన తీరు అబ్బురపరుస్తాయి. 
రెండవ ప్రాకారంలో శ్రీ వినాయక, శ్రీ ఆత్మలింగేశ్వర, శ్రీ కాలభైరవ, శ్రీ రాజరాజేశ్వర స్వామి వార్ల సన్నిధులుంటాయి. మరొక వైపున శ్రీ సహస్ర లింగేశ్వర సన్నిధి కనపడుతుంది. 
మూడవ ప్రాంగణంలో శ్రీ కాశీ విశ్వనాథ, శ్రీ అరుణాచలేశ్వర, శ్రీ చంద్రమౌళీశ్వర, శ్రీ సదాశివేశ్వర, శ్రీ ఆనందేశ్వర, శ్రీ అంబికేశ్వర ఇత్యాది సన్నిధులు కనపడతాయి. 
శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సన్నిధి విడిగా ఉంటుంది. ప్రముఖ కవి శ్రీ అరుణగిరి నాథర్ తన "తిరుప్పుగళ్"లో స్వామిని కీర్తిస్తూ కీర్తనలు రచించారు. 
ప్రత్యేక మండపంలో గాయక శివభక్తులైన అరవై మూడు మంది నయనారులు కొలువై కనిపిస్తారు. 
అమ్మవారు శ్రీ వళ్ళాంబిక లేక శ్రీ తనుమాథ్యాంబాల్ ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తారు. ఒకప్పుడు అంబికా ఉగ్రరూపంలో ఉండేవారట. జగద్గురు శ్రీ శ్రీ శ్రీ ఆది శంకరులు ప్రార్ధించడం వలన శాంతించారని చెబుతారు. 
గర్భాలయంలో శ్రీ విల్వనాథేశ్వర స్వామి లింగ రూపంలో సుందర చందన , విభూతి కుంకుమ రేఖలతో, వివిధ వర్ణ పుష్ప మాలలతో రమణీయంగా దర్శనమిస్తారు. 
గర్భాలయం పక్కన నీరు నిండిన చిన్న గుంటలో ఉన్నశ్రీ జలకంఠేశ్వర స్వామి కొలువై ఉంటారు. సకాలంలో వర్షాలు పడకపోతే ప్రత్యేక అభిషేకాలు నిర్వహించడం వలన వానలు పడతాయని నమ్ముతారు. 
మహా నంది పక్కన నవగ్రహ మండపం ఉంటుంది. 
ప్రాంగణంలో శ్రీ మహావిష్ణువు సన్నిధి ఉండటం వలన తిరువాళం హరిహర క్షేత్రంగా పేర్కొనబడింది. 

ఆలయ ప్రత్యేకతలు 

ముఖ మండపంలోని మహా నంది, ధ్వజస్థంభం వద్ద నంది, అర్ధ మండపంలోని నంది విగ్రహాలు తూర్పు ముఖంగా ఉంటాయి. 
ఉపాలయాలో ఒక విమానం మీద ఇరవై ఏడు జన్మ నక్షత్ర దేవతల విగ్రహాలు ఉండటం మరెక్కడా చూడని విశేషం. 
సుమారు వెయ్యి సంవత్సరాల పైబడిన మామిడి వృక్షం కొంతకాలం క్రిందట గాలివానకు కూలిపోయింది. ప్రస్తుతం మోడును చూసే అవకాశం లభిస్తుంది. ప్రాంగణంలో వంద సంవత్సరాలకు పైబడిన పనస వృక్షం, ఆలయ వృక్షం అయిన బిల్వం కూడా కనపడతాయి. 
మండప స్థంభాలపైన చక్కని శిల్పాలను చెక్కారు. 
అర్ధ మండపంలో ఒక ప్రదేశంలో నిలబడితే హరిహరులను ఒకేసారి దర్శించుకునే అద్భుత అవకాశం లభిస్తుంది. 
ప్రాంగణంలో ఎన్నో శిలాశాసనాలు అనేక రాజ వంశాలకు చెందినవి వారు ఆలయ నిర్వహణకు సమర్పించుకున్న కైంకర్య వివరాలను తెలుపుతాయి. వీటిల్లో ఒకటి రెండు తెలుగు శాసనాలు ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 
ఆలయ మండప స్థంభాలపైన అనేక దేవీదేవతలు విగ్రహాలను సుందరంగా మలచారు. ఆలయ గాధను తెలిపే శిల్పాలు కూడా వీటిలో కనపడతాయి. 

ఉత్సవాలు 

నీవా నది పడమర తీరంలో ఉన్న ఈ ఆలయం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సౌకర్యార్ధం తెరిచి ఉంటుంది. 
నియమంగా ప్రతి నిత్యం అభిషేకాలు, అలంకరణలు, ఆరగింపులు జరుగుతాయి. 
అమావాస్య, పౌర్ణమి, మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. 
ప్రతి పౌర్ణమి రోజున కంజన్ గిరి పైన ఉన్న స్వయంభూ లింగానికి ప్రత్యేక అభిషేకాలు జరుపుతారు. 
కార్తీక మాసంలో, మహా శివరాత్రికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. 
వినాయక చవితి, సుబ్రహ్మణ్య షష్టి, కాలభైరవ అష్టమి, దేవీ నవరాత్రులను ఘనంగా నిర్వహిస్తారు. 
తమిళ "తై" మాసం (జనవరి-ఫిబ్రవరి)పదవ రోజు మహేశ్వరుడు కంజన్ కు ముక్తి ప్రసాదించారని చెబుతారు. ఆ రోజున స్వామి ఊరేగింపుగా పర్వతం వద్దకు తీసుకొని వెళతారు. 
ఆలయ బ్రహ్మోత్సవాలను ఫాల్గుణ మాసంలో పది రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

పడాల్  పెట్ర స్థలం 

నయనారులు గానం చేసిన పాటికాల కారణంగా రెండువందల డెబ్బై ఆరు శివ క్షేత్రాలు ఈ హోదాను పొందాయి. వీటిల్లో తొండై మండలంలో ఉన్న ముప్పై రెండు పడాల్ పెట్ర స్థలాలలో పదవది  తిరు వాళం. 
నయనారులలో ప్రముఖులైన శ్రీ తిరు జ్ఞాన సంబంధార్ శ్రీ విల్వనాథేశ్వర స్వామిని కీర్తిస్తూ పాటికాలను గానం చేసారు. 
కవి అరుణగిరి నాథర్ తన ఆరాధ్య దైవం అయిన శ్రీ కుమార స్వామి మీద ఎన్నో కీర్తనలను రచించారు. 

ప్రతినిత్యం ఎందరో భక్తులు శ్రీ విల్వనాదేశ్వర్ స్వామి దర్శనార్ధం తరలి వస్తుంటారు. ప్రసాదంగా అందించే బిల్వ పత్రాలను తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. 
ఇన్ని ప్రత్యేకతల నిలయమైన శ్రీ విల్వనాథేశ్వర స్వామి ఆలయం, తిరు వాళం కు  వెల్లూరు (కాట్పాడి) నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. 
చక్కని వసతి సౌకర్యాలు వెల్లూరులో లభిస్తాయి. 
      






నమః శివాయ !!!!!





            

 

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...