28, జులై 2023, శుక్రవారం

Sri Panikeswara Swamy Temple, Panyam

 

                            కరములు ప్రసాదించిన కపర్ది 


తీర్ధయాత్రలు అనగానే ,మన ఆలోచనలు మరియు ప్రణాళికలు అన్నీ తమిళనాడు, కర్ణాటక లేదా ఉత్తర భారత దేశం వైపు మళ్ళుతాయి.  మనరాష్ట్రంలో ఎన్నో విశేష పౌరాణిక చారిత్రక నేపథ్యం కలిగి , శిల్ప సౌందర్యాలను ప్రదర్శించే ఆలయాలు కలవు. 


















రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ. అద్భుత ఆలయాలకు నిలయం కూడా !
అంతటి విశేషమైన సీమలో నేటికీ చక్కని ఆలయాలు, నిర్మాణాలు కనపడతాయి. 
ఒక్క రాయలసీమ లోనే కాదు కోనసీమ, కోస్తా ఆంధ్ర అన్నిచోట్లా చూడచక్కని దేవాలయాలు కనపడతాయి. 
స్థానికులు కూడా వాటి పట్ల ఆసక్తి చూపించకపోవడం విచారకరం. 
ప్రతి గ్రామం లేదా నగరంలో ఒక పురాతన ఆలయం కనపడటం మన  రాష్ట్ర గొప్పదనం. వాటిని అభివృద్ధి చేసుకోలేకపోవడం, వాటిని గురించి ప్రచారం చేసుకోలేక పోవడం మన దురదృష్టం. 
ఈ విషయాలను పక్కన బెట్టి నేను ఈ మధ్యన దర్శించిన మరో పురాతన దేవాలయం విశేషాలను చూద్దాము. 
నవనంది క్షేత్రాల సీమ నంద్యాల పట్టణానికి సమీపంలోని "పాణ్యం" లో గొప్ప ఆలయం ఒకటి కలదు. మరికొన్ని పురాతన ఆలయాలు ఉన్నాయి కానీ ఇది చాలా ప్రత్యేకమైనది. 
(శ్రీ సుంకులమ్మ ఆలయం, శ్రీ వీరనారాయణ స్వామి దేవాలయం, శివాలయం)
ఈ ఆలయ గాధ,చరిత్ర మరియు నిర్మాణ విశేషాలు అన్నీ సుమారు పన్నెండవ శతాబ్దపు నాటివిగా తెలుస్తున్నాయి. 














విష్ణువర్ధన రాజు 

హొయసల పాలకులలో ఈయన ఒక పేరొందిన పాలకుడు గా చరిత్ర గుర్తించింది. సుమారు అర్ధ శతాబ్ద కాలం దక్షిణ భారత దేశాన్ని ముఖ్యంగా నేటి కర్ణాటక ప్రాంతాలను జనరంజకంగా పాలించిన వాడు విష్ణువర్ధనుడు. 
జన్మతః విష్ణువర్ధనుడు జైనుడు. అప్పటి దాకా హొయసల రాజులు జైన మతాన్ని అవలంభించేవారు. ప్రముఖ వైష్ణవ గురువు, విశిష్టాద్వైత వ్యాఖ్యాత శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యుల ప్రభావంతో విష్ణువర్ధనుడు హిందూమతం లోనికి మారాడు. గురువు ప్రభావంతో శ్రీ వైష్ణవ సంప్రదాయాలను అనుసరించినా శైవంతో పాటు, జైన బౌద్ధ మతాలను ఆదరించారని తెలుస్తోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బేలూరు శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ నిర్మాత విష్ణువర్ధనుడే !
విష్ణువర్ధనునికి విపరీతమైన రాజ్యకాంక్ష ఉండేదట. స్వయంగా గొప్ప యోధుడు అయిన ఆయన నిరంతరం రాజ్య విస్తరణ కోసం యుద్ధాలలో మునిగి తేలుతుండేవాడట. ఒకసారి ఆయన యుద్దానికి బయలుదేరి తిరిగి తన మందిరానికి సుమారు పదిహేను సంవత్సరాల తరువాత వచ్చారట. 
విష్ణువర్ధనుడు యుద్దానికి వెడలినప్పుడు కుమార్తె వయస్సు ఒక సంవత్సరం మాత్రమే ! తిరిగి వచ్చేనాటికి యుక్తవయస్సుకు వచ్చింది. 
నాటి రాత్రి కుమార్తె తండ్రి వద్దనే నిద్రించినదట. నిద్రలో మహారాజు చేతులు తెలియకుండానే ఆ చిన్నారి వక్షస్థలం తాకాయట. వెంటనే నిద్ర లేచిన విష్ణువర్ధనుడు తాను తెలియక చేసినా తప్పు తప్పే కదా ! అని చింతించాడట. 


























మరునాడు సభలో జరిగినది చెప్పి దానికి తగిన శిక్ష కూడా తెలుపని గురువులను,న్యాయ కోవిదులను, మంత్రులను అడిగారట. వారు న్యాయ శాస్త్రాలలో చేతులను ఖండించడమే తగిన శిక్ష అని తెలిపారట. 
కుమార్తె, ఇద్దరు రాణులు వద్దని వారించినా వినకుండా చేతులను మోచేతి దాకా ఖండించుకున్నాడట. 
 బాధను తట్టుకోలేక రక్తసిక్తమైన చేతులతో తిరుగుతూ ప్రస్తుతం ఆలయం ఉన్న ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్న పెద్ద పాముపుట్టలో మరణించాలన్న ఆలోచనతో తెగిన చేతులు పెట్టి సృహతప్పి పోయాడట. అప్పుడతనికి స్వప్నంలో మహేశ్వరుడు దర్శనమిచ్చి ఇది ఒక పవిత్ర ప్రదేశం అని అతనిని ఇక్కడకు రప్పించడానికి ఇదంతా సృష్టించానని చెప్పారట. నీ చేతులు నీకు వస్తాయి. నాకు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించామని ఆదేశించారట. 
సృహ లోనికి వచ్చిన రాజు చేతులు యధాప్రకారం ఉండటం చూసి ఇదంతా ఈశ్వర లీల అని తలంచి ఆలయాన్ని నిర్మించారట. 
"పాణియం" అనగా హస్తాలు అని అర్ధం. తనను చేతులు ప్రసాదించి, చేసిన పాపాన్ని తొలగించిన స్వామి కనుక " శ్రీ పాణికేశ్వర స్వామి" అన్న పేరుతో లింగాన్ని ప్రతిష్టించారట. 








ఆలయ విశేషాలు 

పాణ్యం ఊరికి దూరంగా చెరువు గట్టున, పచ్చని పొలాల మధ్య నెలకొని ఉంటుంది ఆలయం. తూర్పుముఖంగా అయిదు అంతస్థుల రాజా గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఒక పురాతన, మరొక నూతన నిర్మాణ ఆలయము కనిపిస్తాయి.  
ప్రాంగణంలో దక్షిణ దిశలో నైరుతి దిక్కులో ఉన్న పురాతనమైనదే విష్ణువర్ధన మహారాజు నిర్మించిన ఆలయం అని చెబుతారు. 
ఆలయం దరిదాపుగా శిధిలావస్థలో ఉన్నదని చెప్పవచ్చును. అనంతర కాలంలో పాలన లోనికి వచ్చిన అన్యమతస్థుల దాడులలో ఆలయం ఈ స్థాయికి వచ్చిందని చెబుతారు. 
ముఖమండపం పూర్తిగా నేల మట్టమైనది. అందులో ఉండిన భిన్నమైన శ్రీ వినాయక, శ్రీ రామ, లక్ష్మణ, గుఱ్ఱం పైన ఖడ్గం ధరించి యుద్దానికి వెళుతున్న విష్ణువర్ధన శిల్పాలు ఒక పక్కన పెట్టి ఉంటాయి. నాటి శిల్పులు మలచిన శిల్పాలు, లతలు, యక్షిణులు, పుష్పమాలలు నేటికీ సుందరంగా కనిపిస్తాయి. స్తంభాల పైన తమిళ శాసనాలు కనిపిస్తాయి.   
గర్భాలయంలో శ్రీ పాణికేశ్వర స్వామి లింగ రూపంలో కొలువై ఉంటారు.

గోపురంలో గొడ్డలి 

ఆలయం విమానంలో ఒక గొడ్డలి ఉంటుంది. అది అక్కడ గుచ్చుకొని ఉండటానికి సంబంధించి రకరకాల కధలు స్థానికంగా  వినిపిస్తాయి. వాటి విషయం ఎలా ఉన్నా అది ఎలా అక్కడికి చేరుకొన్నది అన్నది ఒక పెద్ద ప్రశ్న.  రాతి పలకల మధ్య ఇరుక్కొని ఉన్న గొడ్డలిని తీస్తే ఆలయం మొత్తం కుప్పకూలిపోతుంది అని స్థానికులు విశ్వసిస్తారు.
క్రింద నుండి చూస్తే పూర్తిగాకాకున్నా పిడి భాగం కనపడుతుంది. 
ఆలయం వెనుక ఒక పెద్ద పాము పుట్ట కనపడుతుంది. ఆ నాడు విష్ణువర్ధన రాజు బాధ తట్టుకోలేక పాము కాటుతో మరణిద్దాం అన్న ఆలోచనతో చేతులు పెట్టినది దీనిలోనే అంటారు. 
పక్కనే నాగ ప్రతిష్టలు కనిపిస్తాయి. 

శ్రీ పాణికేశ్వర స్వామి ఆలయం 








పురాతన ఆలయం అంత కాదు కానీ ఈ నిర్మాణం కూడా పాతదే !
ఈ రెండు ఆలయాల మధ్యన ఒక రాతి కళ్యాణ మండపం ఉంటుంది. ఈ ఆలయానికి దక్షిణం పక్క ఒక ద్వారం కూడా కనపడుతుంది. ఇక్కడ ఒక ఋషి లేదా సిద్ధుని విగ్రహం కనపడుతుంది. 
గర్భాలయంలో శ్రీ పాణికేశ్వర స్వామి లింగ రూపంలో విభూది, చందన, కుంకుమ శోభితులై దర్శనమిస్తారు. ముఖ మండపంలో నందీశ్వరుడు కొలువై ఉంటారు. 
మండపంలో పైన తెలిపిన ఆలయ గాధ రాసి ఉంచారు. 
ప్రాంగణం ఉత్తర భాగాన మరో సన్నిధిలో అమ్మవారు దర్శనమిస్తారు. స్వామివారికి, అమ్మవారికి విడివిడిగా ధ్వజస్తంభాలు ఉంటాయి. 






ఆగ్నేయ దిశలో వట వృక్షం క్రింద పడమర ముఖంగా వాయునందనుడు చిన్న గద్దె  మీద సింధూరవర్ణ శోభితులై ఉంటారు. 
పాత ఆలయం వద్ద, రాజగోపురం వద్ద తెలుగు, కన్నడ మరియు తమిళ శాసనాలు కనపడతాయి. ఇవన్నీ ఆలయానికి సమర్పించుకున్న కైంకర్యాల వివరాలను తెలిపేవిగా చెబుతారు. 
రాజగోపురానికి, ముఖమండపానికి కొంత మర్మత్తుల ఆవశ్యకత కనపడుతుంది. 
నిత్య పూజలు జరిగే ఈ ఆలయాన్ని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడైనా వెళ్లి సందర్శించుకునే అవకాశం ఉన్నది. 
సోమవారాలు, కార్తీకమాసంలో, శివరాత్రికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. 











 నంద్యాల లేదా కర్నూలు నుండి సులభంగా పాణ్యం చేరుకోవచ్చును. ప్రధాన రహాదారి నుండి ఆలయం వరకు రానూ పోనూ ఆటో మాట్లాడుకొని వెళ్లడం ఉత్తమం. సొంత వాహనంలో అయితే ఆలయం వరకు వెళ్ళవచ్చును. 
వసతి మరియు భోజన సదుపాయాలు కర్నూలు లేదా నంద్యాలలో లభిస్తాయి. 
తగినంత ప్రచారం కల్పిస్తే శ్రీ పాణికేశ్వర స్వామి ఆలయం ఒక ప్రధాన దర్శనీయ క్షేత్రంగా మారుతుంది అనడంలో సందేహం లేదు. 











 నమః శివాయ !!!











26, జులై 2023, బుధవారం

Sri Sangameshwara Swami Temple, Machhumarri (Atmakuru)

           శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం, సంగమేశ్వరం














దేవాలయం అనగానే సుందరమైన ఒక పవిత్ర కట్టడం, పురాణ శిల్పాలతో నిండిన గోపురాలు, , దూరానికి కూడా వినిపించే చిరు గంటల నాదం తో శోభాయమానంగా నింగిని తాకేలా సగర్వంగా నిలిచిన  ధ్వజస్థంభం కనుల ముందు కదలాడతాయి. కర్ణ పుటాలు స్వామిని అర్చిస్తూ పలికే వేదమంత్రాలను హృదయానికి చేరుస్తాయి. గర్భాలయంలో నేత్రపర్వమైన అలంకరణతో కొలువైన దేవతామూర్తిని చూడగానే మనస్సు మరియు శరీరం పులకిస్తాయి. అసంకల్పితంగా  కైమోడ్చి మొక్కుతాము. స్వామి రూపాన్ని మది నిండా నింపుకొని పునః దర్శనాన్ని వాంఛిస్తూ వెనుతిరుగుతాము. 

సుప్రభాతాలు, అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు మరియు ఆరగింపులూ ప్రతి నిత్యం ప్రతి ఆలయంలో విధిగా జరిగే కైంకర్యాలు. 

 అలాంటివి నిత్యం జరగకుండా వారానికి ఒకసారి, నెలకొకసారి, సంవత్సరానికి ఒకసారి పూజాదికాలు నిర్వహించే ఆలయాలు కూడా కొన్ని మనదేశంలో ఉన్నాయి. అలా జరపడానికి క్షేత్ర గాధలు లేక కొన్ని స్థానిక నియామాలు కారణంగా ఉండటం మనకు తెలిసిన విషయమే !







 కానీ అలాంటి నియమ నిబంధనలు లేకుండా కేవలం ప్రకృతి కారణంగా పన్నెండు నెలలలో కేవలం నాలుగు నెలలు మాత్రమే భక్తులకు దర్శనమిచ్చే ఒక క్షేత్రం మన రాష్ట్రంలో ఉండటం విశేషంగా పేర్కొనాలి.

కైలాసనాధుడు కొలువు తీరిన ఈ క్షేత్రం పేరు సంగమేశ్వరం. 

శ్రీ సంగమేశ్వరునిగా గంగాధరుడు పిలవబడుతున్న క్షేత్రాలు అనేకం మన రాష్ట్రంలో ఉన్నాయి. కానీ ఈ ఆలయం అనేక  విశేషాల నిలయం. 

క్షేత్ర గాధ 

అందుబాటులో ఉన్న స్థానిక గాధల ద్వారా తెలుస్తున్న వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 
సతీ దేవి తండ్రి, ప్రజాపతి అయిన దక్షుడు అల్లుడు మహేశ్వరుని పిలవకుండా తలపెట్టిన యాగానికి సతీదేవి పిలవకుండానే వెళ్ళింది. కుమార్తె, లోకపాలకురాలు అని కూడా చూడకుండా అవమానించాడు అహంకారి దక్షుడు. అవమానాన్ని తట్టుకోలేక సతీదేవి యజ్ఞగుండంలో దూకి దేహత్యాగం చేసింది ఇక్కడే అని అంటారు. సతీదేవి దేహ నివృత్తి జరిగిన స్థలంగా "నివృత్తి సంగమేశ్వరం"గా కూడా పిలుస్తారు. 
పాండవులు వనవాస కాలంలో క్షేత్ర సందర్శనం చేస్తూ జ్యోతిర్లింగ స్థానమైన శ్రీశైలం వచ్చారట. శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామివార్లను కొంత కాలం సేవించుకొన్నారట. ఇప్పటికీ ఉన్న భీముని కొలను లాంటి ప్రదేశాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. 














తిరిగి తమ సంచారం సాగించిన వారు పావన కృష్ణాతీరాన్ని చేరుకొన్నారట. అక్కడ కృష్ణానదితో 
ఉపనదులైన భవనాశిని  తో పాటు మరో అయిదు నదులు సంగమిస్తాయని తెలుసుకొన్నారట. 
ఆ నదులు "కృష్ణ, వేణి, తుంగ, భద్ర, మలపహారిణి, భీమరాతి మరియు భవనాశిని". చిత్రమైన విషయం ఏమిటంటే  వీటిలో భవనాశిని మగ నది అని అంటారు. పురుషనది తూర్పు నుండి పశ్చిమానికి ప్రవహిస్తుంది. మిగిలినవి పడమర నుంచి తూర్పుకు ప్రవహిస్తాయి. అన్ని నదులూ కలిసి జ్యోతిర్లింగ మరియు అష్టాదశ పీఠమైన పవిత్ర  శ్రీశైలాన్ని తాకుతూ ఆ క్షేత్ర మట్టిని తమలో కలుపుకొని ప్రవహిస్తాయి.   
సప్త నదీ సంగమ క్షేత్రమే కాకుండా సంగమేశ్వరంలో ఆ కాలంలో ఏకాదశ తీర్ధాలు కూడా ఉండేవట. అవి "దేవద్రోణి, భుజంగ, భాణుక, దశాశ్వమేధ, సప్త కోటేశ్వర, గాయత్రి, వైశ్యానర, సౌభాగ్య, చక్రతీర్ధ, అఘనాశిని మరియు విశ్వామిత్ర". 
ఇంతటి పవిత్ర తీర్థ స్థలంలో శివలింగ ప్రతిష్ట చేయడం శుభకరం అని అక్కడ ఉన్న మహర్షులు ధర్మరాజుకు చెప్పారట. 
స్వయం జటాధరుడు, గంగాదేవితో కలిసి కొలువు తీరిన ముక్తి క్షేత్రం అయిన వారణాసి నుండి లింగాన్ని తెచ్చి ప్రతిష్ట చేస్తే ఇంకా దివ్యంగా ఉంటుందని కూడా వారు తెలిపారట. 
వాయునందనుడైన భీమసేనుడు ఆ భాద్యతను తీసుకొని బయలుదేరాడట. కానీ నిర్ణయించిన ముహూర్త సమయానికి తిరిగి రాలేక పోయాడట. 
మహర్షులు నిర్ణయించిన సుముహూర్తం దాటిపోకూడదని వారి సలహా మేరకు ధర్మనందనుడు వేప చెట్టు కాండాన్ని లింగంగా మలచి సమయానికి ప్రతిష్టించారట. 












భీమసేనుడు కాశీ నుండి తెచ్చిన లింగాన్ని ఆలయం వెనుక నేటికీ చూడవచ్చును. 
అనంతర కాలంలో రాజుల కైంకర్యాలతో ఆలయం అభివృద్ధి చెందినది అని అక్కడ కనిపించే శాసనాలు తెలుపుతాయి. 

ఆలయ విశేషాలు 

సుమారు 1981 వ సంవత్సరం వరకు ఆలయానికి భక్తులు నిత్యం వచ్చి స్వామివారిని దర్శించుకొనేవారట.   
కృష్ణానది మీద శ్రీ శైలం ఆనకట్ట నిర్మించిన తరువాత ఈ ఆలయం పూర్తిగా నీట మునిగిపోయిందట. తిరిగి ఆలయ దర్శనం జరిగింది 2003 వ సంవత్సరంలో ! అంటే దరిదాపుగా ఇరవై రెండు సంవత్సరాలు జలాధివాసం చేసిన తరువాత జలకంఠేశ్వరుడు వెలుపలికి వచ్చారు. 
ఈ రెండు దశాబ్దాల కాలంలో పురాతన ఆలయం చాలా మేరకు శిధిలం అయ్యింది. 
స్థానికులు కలిసి కొంతమేర ఆలయాన్ని పునఃరుద్దరించారు. 
ఈ రెండు దశాబ్దాలలో నీటి మట్టం తగ్గి ఆలయం వెలుపలికి వచ్చిన ప్రతిసారీ భక్తులు మరికొన్ని నిర్మాణాలను చేశారు.మరికొన్నింటిని పునఃనిర్మించారు. 
నేటికీ అత్యంత సాదాసీదాగా కనిపిస్తుంది నిర్మాణం. గతంలో ఈ ఆలయంలో అనేక ఉపాలయాలు ఉండేవట. వాటిని కర్నూలు మరియు మరికొన్ని ఇతర ప్రాంతాలలోని వివిధ ఆలయాలకు తరలించారట. 
























ప్రస్తుతం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ఉపాలయాలలో శ్రీ గణపతి, శ్రీ షణ్ముఖ, శ్రీ లక్ష్మీ నృసింహ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ సీతా లక్ష్మణ, హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పురాతన  విగ్రహాలను ఉంచారు. శ్రీ పంచముఖ ఆంజనేయ, శ్రీ దక్షిణామూర్తి, సప్త మాతృకల శిల్పాలు కూడా కనపడతాయి. 
ఉత్తర దిశగా ఉన్న ప్రవేశ ద్వారం ఒక్కప్పుడు గోపురంతో ఉండేదట.దక్షిణ , తూర్పు దిక్కులలో కూడా గోపురాలు ఉండేవట. నేడు లేవు.ముఖ మండపం  శిధిలమైనది. తాత్కాలిక మరమ్మతులు చేశారు. ముఖ మండపంలో కనిపించే స్థంభాల పైన చెక్కిన చెక్కడాలను చూస్తే ఒకప్పుడు ఈ దేవాలయం ఎంత చక్కని శిల్పసంపదతో శోభిల్లేదో అనిపిస్తుంది. ఇక్కడ కూడా కొన్ని దేవతా మూర్తులు ఉంటాయి. 
గర్భాలయంలో ఒక పక్కన శ్రీ గణపతి మరొపక్కన శ్రీ లలితా దేవి కొలువై ఉంటారు. మధ్యలో శ్రీ సంగమేశ్వర స్వామి శిలాజంగా మారిన దారు లింగ రూపంలో దర్శనమిస్తారు. 











నదిలో నీటి ప్రవాహం తగ్గడం మొదలయ్యే మార్చి నెల నుండి ఆలయం నెమ్మదిగా బయల్పడుతుంది. రాష్ట్రంలో, ఎగువ రాష్ట్రాలలో వర్షాల మూలంగా ఏర్పడే వరద నీటి ఆధారంగా జూన్ నెలాఖరు వరకు ఆలయ సందర్శనం చేసుకోడానికి అనువుగా ఉంటుంది. సరిగ్గా చెప్పాలంటే ఏప్రిల్ లేదా మే నెలలో వెళ్లడం ఉత్తమం. నది ఒడ్డు నుండి ఆలయం వరకు బాట ఏర్పాటు చేస్తారు. సొంత వాహనాలలో వెళ్లేవారు ఆలయం వరకు వెళ్లవచ్చును. 
ఇన్ని నదులు, తీర్థాలు గల ప్రదేశం బహుశా భారతదేశంలో మరెక్కడా లేదు. 
మార్చి నుండి జూన్ వరకు ఈ ఆలయాన్ని సందర్శించుకోవచ్చును. 
బస్సులలో వెళ్లదలచిన వారు కర్నూలు, విజయవాడ ఇతర ప్రాంతాల వారు ఆత్మకూరు చేరుకోవడం ఉత్తమం. అక్కడ నుండి "మచ్చుమర్రి"(సంగమేశ్వరం) చేరుకోడానికి బస్సులు, ఆటోలు దొరుకుతాయి. సొంత వాహనాలలో వెళ్లే వారు నందికొట్కూరు లేదా ఆత్మకూరు నుండి నేరుగా ఆలయం వద్దకు చేరుకోవచ్చును. 
యాత్రీకుల భోజనం కొరకు శ్రీ కాశీనాయన భక్త బృందం వారు ఏర్పాటు చేశారు. రోజంతా అన్నదానం జరుగుతుంది. 








విశేష పౌరాణిక గాధ , చరిత్ర మరియు పవిత్ర తీర్థ స్థలి అయిన సంగమేశ్వరం సందర్శించడం ఒక జీవిత కాలపు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది అంటే అతిశయోక్తి లేదు. 

నమః శివాయ !!!!   


  
























































































Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...