10, జనవరి 2018, బుధవారం

Airavateswarar Temple, Darasuram

             శ్రీ ఐరావతేశ్వర స్వామి ఆలయం, ధారసురం 

              ఐరావతం కొలిచిన శ్రీ ఐరావతేశ్వర స్వామి 



ఆలయాల రాష్ట్రం తమిళనాడులో ఉన్న అద్భుత ఆలయాలు మరెక్కడా కనిపించవు. ముఖ్యంగా చోళ రాజుల కాలం(క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తు శకం 13వ శతాబ్దం)లో నిర్మించిన ఆలయాలు మనోహరమైన శిల్పాలకు నిలయాలు. తమిళ దేశంలో ఆలయాల నిర్మాణానికి ఆద్యులు పల్లవులు. వీరి కాలంలో ఎక్కువగా నిర్మించబడినవి గుహాలయాలు. మహాబలిపురం దీనికి నిదర్శనం. చోళుల తరువాత పాండ్యులు, విజయనగర, నాయక, హొయసల రాజ వంశాల వారు కూడా చక్కని ఆలయాల నిర్మాణాలు చేశారు. 
చోళుల నిర్మాణాలన్నీ విశాల ప్రాంగణంలో, రాతిని మైనపు ముద్దలా మలచగల నేర్పులైన శిల్పులు చిత్రవిచిత్రమైన శిల్పాలు, పురాణ ఘట్టాలను రమణీయంగా చెక్కారు. 
చోళ రాజుల నిర్మాణాలలో ప్రతివొక్కటి ఎన్నదగ్గవే ! కానీ శ్రీ బృహదీశ్వర ఆలయం, తంజావూరు, గంగై కొండ చోళ పురం లాంటివి ఆణి ముత్యాల లాంటివి. అదే కోవకి చెందిన మరో ఆలయం శ్రీ ఐరావతేశ్వర స్వామి కొలువైన ధారాసురం లో ఉన్నది.













 దారాసురం నేటి శిల్పులకు ఒక పాఠశాల వంటిది. అత్యంత ప్రతిభావంతులైన శిల్పులు తమ ప్రతిభను ప్రతిబింబించేలా శిల్పాలను చెక్కారు. రధం ఆకారంలో ఉండే ఆలయానికి రాతి చక్రాలు, వాటిని లాగుతున్నట్లుగా ఏనుగులను, అశ్వాలను మలచారు. ఆలయ గోపురం ఎనభై అడుగుల ఎత్తుతో ఠీవీగా కనపడుతుంది.
మండపానికి చెక్కిన మెట్లు ఒకప్పుడు సరిగమ పదనిస అన్న స్వరాలను పలికేవట ! ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉంటున్నాయి. మండప స్థంభాల పైన చెక్కిన శివకళ్యాణ దృశ్యాలు, శివ పురాణ ఘట్టాలు ఎంతో రమణీయంగా ఉంటాయి. మహేశ్వరుని పెళ్లి కుమారుని చేయడం, ఆ సుందర మూర్తిని మహిళలు మైమరచిపోయి చూస్తుండటం, సకల సరంజామా, మేళతాళాలతో, రాధాలు, గుర్రాలు,ఏనుగుల ఊరేగింపు ఓహ్ గొప్పగా ఉంటాయి.అదే విధంగా త్రిపురాంతక సంహార దృశ్యాలు, త్రినేత్రుడు మన్మధుని దహించే దృశ్యం, యోగ ముద్రలో ఉన్న పరమేశ్వరుని గణాలంతా ప్రార్ధించడం ఇవన్నీ బహు చక్కగా మలచారు. సూక్ష్మ శిల్పాలలో చాలా భాగం భరత  నాట్య అంశాలతో చెక్కినవి కావడం విశేషం. నాట్యకళకు చెందిన భంగిమలను మనోహరంగా చెక్కారు.















కొన్ని సందేశాత్మక శిల్పాలు కనపడతాయి. మహిళలకు యుద్ధ విద్యల ఆవశ్యకత తెలిపే విధంగా వారికి పోరాట కళలో శిక్షణ ఇస్తున్న దృశ్యాలు, పాఠశాలలో విద్య అభ్యసిస్తున్న శిల్పాలు కనపడతాయి. నాటి ప్రజల జీవన శైలిని తెలిపే శిల్పాలు నాటి విశేషాలను తెలుపుతాయి. 
ప్రతి ఒక్క అంగుళంలో చెక్కిన శిల్పాలు ఎన్నో విశేషాలను తెలుపుతాయి. రాతిని మట్టి ముద్దలాగా మార్చి శిల్పాలుగా మరల్చిన శిల్పుల గొప్పదనం ఎంతైనా కొనియాడతగినది. 
మూడు తలతో, నాలుగు చేతులతో అఘోర వీరభద్రుడు, మూడు ముఖాలు, ఎనిమిది చేతులతో అర్ధనారీశ్వరుడు, లింగోద్భవ మూర్తి, నాగరాజు, శ్రీ లక్ష్మీనారసింహ మూర్తి గర్భాలయ వెలుపలి గోడలలో కొలువై ఉంటారు. 













గర్భాలయంలో పెద్ద లింగ రూపంలో శ్రీ ఐరావతేశ్వర స్వామి పూజలందుకొంటుంటారు. దక్షిణ దిశగా అమ్మవారు శ్రీ పెరియ(దేవ)నాయకి నిలువెత్తు రూపంలో కొలువై ఉంటారు.  గర్భాలయ ప్రవేశ ద్వారానికి రెండుపక్కలా ద్వారపాలకులు శంఖ నిధి, పద్మనిధి శిల్పాలు నల్ల రాతి మీద చెక్కబడినాయి.
వెరసి పేరుకు తగినట్లుగా శ్రీ ఐరావతేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నీ భారీగా ఉంటాయి.
ఇక ఉపాలయాలలో శ్రీ దుర్గ, శ్రీ నారసింహ, శ్రీ చండికేశ్వర స్వామి ఉంటారు.
చోళులకు వాస్తు పట్ల అపార నమ్మకం. దానికి తగినట్లుగా ఇక్కడ గురువు, రాహుకేతువులకు వారి స్థానాలలో ప్రతిష్టించారు. ఇదే విధమైన గ్రహ ఆలయాలు ప్రఖ్యాత శ్రీ బృహదీశ్వరాలయంలో కూడా కనపడుతుంది.
కుంభకోణం చుట్టుపక్కల నవగ్రహ ఆలయాలను, అదే విధిగా చెన్నై చుట్టుపక్కల ఉన్న తొండైమండల నవగ్రహ ఆలయాలను నిర్మించినది చోళులే !!











ఇంతటి విశేష ఆలయాన్ని నిర్మించడానికి కారణం ఏమిటి అంటే పన్నెండవ శతాబ్దానికి చెందిన రెండవ రాజరాజ చోళుని కాలంలో ఒక చెట్టు క్రింద ఏనాటి నుండో ఉన్న శివలింగానికి ఆలయం కట్టించమని ఒక గొల్ల స్త్రీ కోరడం ! పరమశివ భక్తుడైన రాజరాజ చోళుడు స్వయంగా వెళ్లి లింగాన్ని సందర్శించి పూజించి, జోతిష్యులను లింగం గురించిన విశేషాల గురించి విచారించారట. 
వారు గ్రంధాల ఆధారంగా స్థల పురాణాన్ని వెలికితీసి రాజుకు విన్నవించారట . ఈ లింగం స్వయంభూ . ఇంద్రుని వాహనమైన ఐరావతం శివదర్శనాన్ని ఆపేక్షిస్తూ తపస్సు చేయగా భక్తవత్సలుడు దర్శనం అనుగ్రహించి, అతని కోరిక మీద అక్కడే లింగరూపంలో కొలువైనారట  అని తెలిపారట పండితులు. 
విషయం తెలుసుకొన్న చోళుడు మరింత భక్తి శ్రద్దలతో నిర్మాణంలో పాల్గొన్నాడట . తానే  స్వయంగా రాతి ఎంపిక నుండి, ఏయే శిల్పాలు చెక్కాలి అన్నదాకా నిర్ణయించారట .సుమారు ఇరవై అయిదు సంవత్సరాలు సాగిన నిర్మాణం కారణంగా ఈ ఊరిని రాజరాజ పురం అని పిలిచేవారు. తదనంతర కాలంలో ధారాసురం గా మారింది. 
ఆలయ కోనేరును యమ పుష్కరణి అని పిలుస్తారు. ఒక ముని శాప కారణంగా శరీరం మంటలలో మండుతున్న భాధ ఆవరించినదట  యమ ధర్మరాజును ! అది పోగొట్టుకోడానికి ఇక్కడకు వచ్చి ఈ కోనేరులో స్నానమాచరించి శాప విమోచనం పొందారని, ఆ కారణంగా ఈ పేరు వచ్చినది అని చెబుతారు. దీని లోనికి కావేరి నీరు వచ్చే ఏర్పాటు ఉన్నది. 










రాజరాజ చోళుని తరువాత పరిపాలించిన రాజులు, తమ వంతు కృషి చేసి ఆలయాన్ని అభివృద్దిచేసారు అనడానికి సాక్ష్యంగా ఎన్నో పురాతన తమిళ శాసనాలు ఆలయ గోడల పైన కనిపిస్తాయి.
ప్రస్తుతం పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయం ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఆరు వరకు తెరచి ఉంటుంది.
కుంభకోణం నుండి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ధరాసురాన్ని సులభంగా  చేరుకోవచ్చును.














కుంభకోణం వెళ్లే వారు తప్పకుండా దర్శించి కొంత సమయం గడపవలసి ప్రదేశం శ్రీ ఐరావతేశ్వరస్వామి వారి ఆలయం.

నమః శివాయ !!!

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...