13, ఫిబ్రవరి 2015, శుక్రవారం

Sri Veerabhadra Swamy Temple, Macherla

                              శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, మాచర్ల 

 

మాచర్ల పట్టణంలో ఉన్న మరో పురాతన ఆలయం శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీర భద్ర స్వామి మరియు శ్రీ ఇష్టకామేశ్వర స్వామి ఆలయం. 
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయానికి పక్కనే ఉంటుందీ ఆలయం.






 



వెయ్యి సంవత్సరాల క్రిందట చోళ రాజులు ప్రతిష్టించిన శ్రీ ఇష్ట కామేశ్వర స్వామి ఆలయంలో సుమారు ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట గ్రామ కరణం తమ ఇలవేల్పు అయిన శ్రీ వీరభద్ర స్వామిని ప్రతిష్టించి రాజ సహకారంతో ఆలయం నిర్మించారట.


 






పురాతన గాలి గోపురం దాటి ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఎదురుగా ధ్వజస్తంభం కనపడుతుంది.
పక్కనే శ్రీ నాగేంద్ర సన్నిధి.
చుట్టలు చుట్టలుగా ఉండే ఆరు అడుగుల నాగేంద్ర పడగలో సూక్ష్మ రూపంలో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి రూపాన్ని బహు చతురతతో చెక్కారు.
ప్రాంగణంలో ఎన్నో నాగ ప్రతిష్టలు కనపడతాయి.



 


ఆలయాన్ని నిర్మించిన శిల్పుల నాయకుని మూర కొలత ఆలయం లోని ఒక శాసనం వెనుక కనపడుతుంది.

 




ఒకపక్కన నవగ్రహ మండపం ఏర్పాటు చేసారు
ఎదురుగా తూర్పు ముఖంగా ఉన్న ఆలయంలో శ్రీ ఇష్టకామేశ్వర స్వామి సతీ సుతుల సమేతులై భక్తుల నీరాజనాలు అందుకొంటుటారు



 
 




ఉత్తర ముఖంగా శ్రీ వీరభద్ర స్వామి ఆలయం ఉంటుంది.
లోపల నిలువెత్తు రూపంలో శ్రీ వీరభద్ర స్వామి భక్తులకు అభయ ప్రదాతగా దర్శనమిస్తారు.
ఈ ఆలయంలో సర్ప దోష, రాహు కేతు శాంతి పూజలకు ప్రసిద్ది.
ముఖ్యంగా వివాహం కాని వారు, వివాహం అయినా సంతానం లేని వారు ఎక్కువగా ఈ పూజలలో పాల్గొంటారు.
వివిధ భయాలను  ఆందోళనలను శ్రీ వీరభద్ర స్వామి దర్శనంతో దూరం చేసుకొని జీవితంలో శాంతిని పొందటానికి , జాతక రీత్యా గ్రహ శాంతులు చేయించుకోడానికి ఎందరో దూర ప్రాంతాల నుండి వస్తుంటారు.




 



ఉదయం నుండి సాయంత్రం వరకూ తెరచి ఉంటుందీ ఆలయం.
మాచర్ల పట్టణానికి రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుండి బస్సు సౌకర్యం కలదు.
చక్కని వసతి భోజన వసతులు అందుబాటు ధరలో లభిస్తాయి.
ఓం నమః శివాయ !!!!






Sri Lakshmi Chennakeshava Swamy Temple, Macherla

                         శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయం, మాచర్ల 


                          


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  విశిష్ట నేపద్యం గల ప్రాంతంగా ప్రసిద్ది చెందినది పల్నాడు. 
నాటికి నేటికీ పల్నాడు ప్రాంతానికి కేంద్ర బిందువు మాచర్ల.
త్రేతాయుగంలో మారీచుడు అనే రాక్షసుడు పాలించిన ప్రాంతం గా ఈ పేరొచ్చినది  అన్న ఒక కధనం స్థానికంగా వినిపిస్తుంది. శాసనాలలో "మహాదేవి తటాక " అని పేర్కోబడినది. 
గత రెండు వేల సంవత్సరాలుగా అనేక రాజ వంశాలు ఈ ప్రాంతాన్ని పాలించాయి అని శాసనాలు నిర్ధారిస్తున్నాయి.
మహాభారతాన్ని పోలిన పల్నాటి యుద్ధం చోటుచేసుకోన్నదిక్కడే ! శ్రీనాధ మహాకవి తన పల్నాటి వీర చరిత్ర కావ్యంలో నాటి ప్రజల స్థితి గతుల గురించి, జీవనవిధానం, ఆచారవ్యవహారాల, స్థానిక పరిస్థితులను, పల్నాటి వీరుల ధైర్య సాహసాల గురించి సవివరంగా తెలిపారు . 
కాల గతిలో విభిన్న అంశాలలో అభివృద్ధి చెందిన ఈ ప్రాంతం నేటికీ చరిత్ర ప్రసిద్ది చెందిన అనేక స్థలాలను, కట్టడాలను మఱియు ఆలయాలను సగర్వంగా ప్రపంచానికి చూపుతోంది. 
అలాంటి వాటిల్లో శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయం ప్రధమ స్థానంలో ఉన్నది.







మాచర్ల నగర నడిబొడ్డున ఉన్న ఈ ఆలయం సుమారు వెయ్యి సంవత్సరాల పై చిలుకు చరిత్రకు ప్రత్యక్ష సాక్షి.
 హైహేయ వంశ రాజులు పల్నాటి ప్రాంతానికి రావడానికి ముందు నుండి అనగా పన్నెండవ శతాబ్దానికి ముందు కాలంలోనే  శ్రీ లక్ష్మి చెన్న కేశవ స్వామి మూర్తి ఆలయ నిర్మాణం జరిగినట్లుగా  కొన్నిశాసనాల ఆధారంగా నిర్ణయించారు.  
హైహేయ వంశం వారి స్వస్థలం నేటి ఛత్తీస్ ఘర్ రాష్ట్రం లోని జబల్ పూర్ గా చెబుతారు.కొన్ని   రాజకీయ కారణాల వలన వారు ఇక్కడికి వలస వచ్చి రాజ్య స్థాపన చేసారని చరిత్ర కారుల అభిప్రాయం.
పల్నాటిని పాలించిన దాదాపుగా అన్ని రాజ వంశాల కుల మఱియు ఆరాధ్య దైవం శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామే !!
వారి ఏలుబడిలో ఉండిన నేటి గుంటూరు, ప్రకాశం ప్రాంతాలలో అనేక సుందర చెన్న కేశవ ఆలయాలు ఉండటానికి కారణం ఇదే !

 


మొదట ఇక్కడ చాళుక్య దండ నాయకుడు  ఒకరు నిర్మించిన శ్రీ ఆదిత్యేశ్వర స్వామి ఆలయం ఉండేదని, ఆ స్థానంలో హైహేయ రాజులు తమ కుల దైవం అయిన శ్రీ చెన్నకేశవ స్వామిని ప్రతిష్టించారు అన్నది కొందరి అభిప్రాయం. కానీ చరిత్రకారులు దానిని అంగీకరించలేదు. 
 హైహేయ రాజు "నలగాము"ని మంత్రి అయిన "బ్రహ్మనాయుడు" వైష్ణవమతాభిమాని. శ్రీ వైష్ణవ ఆచార్యులైన శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యుల బోధనల ప్రభావం అధికంగా ఉండేది. 
 శిధిలావస్థలో ఉన్న శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయాన్ని  పునః నిర్మించి స్వామి వారిని కూడా పునః ప్రతిష్టించి వైఖానస ఆగమ విధాన పూజా కార్యక్రమాలను ఆరంభింప చేసారు అని నిర్ధారించబడినది. 

శ్రీ చెన్న కేశవ స్వామి ఎవరు ?

ఆంధ్రప్రదేశ్ లో అధిక క్షేత్రాలలో, కర్ణాటకలో కొన్ని చోట్ల మాత్రమే శ్రీ చెన్నకేశవ స్వామి దర్శనమిస్తారు. ఈయన చతుర్భుజాలతో కొలువైన శ్రీ వైకుంఠ వాసుడే ! సందేహం లేదు. కానీ ఈ పేరు రావడానికి గల కారణం మాత్రం ద్వాపర యుగానికి చెందినది. 
సోదరి అష్టమ గర్భాన జన్మించేవాని చేతిలో తనకు మృత్యువు ఉన్నది అన్న భయంతో దేవకి దేవి గర్భాన జన్మించిన శిశువులందరిని కంసుడు హతమార్చాడు. 
కానీ అష్టమ గర్భుడు గోకులంలో పెరుగుతున్నాడు అని తెలుసుకొన్న కంసుడు అనేకమంది రాక్షసులను శ్రీ కృష్ణుని చంపడానికి పంపాడు. వారిలో అశ్వ రూపంలో ఉన్న "కేశి" ఒకరు. అలా కేశి అనే రక్కసిని వధించిన అందాల కృష్ణుడు చెన్నకేశవునిగా పిలవసాగాడు. 
విష్ణు సహస్ర నామావళి లో కూడా కేశవ నామం కనిపిస్తుంది. భగవద్గీతలో కూడా అర్జనుడు శ్రీ కృష్ణుని  కేశవా అని సంబోధించడం కనిపిస్తుంది.  
ఒక వివరణ ప్రకారం ఒకసారి "కేశవా !" అని తలస్తే లోక పాలకులైన త్రిమూర్తులను స్మరించినట్లే !
అంతటి శక్తివంతమైన నామం కేశవా ! 


 






ఆలయ విశేషాలు 

సువిశాల ప్రదేశంలో చంద్ర వంక నదీ తీరంలో ఉంటుందీ ఆలయం. చంద్రవంక నది ఇక్కడ ఉతరవాహిని. ఈ కారణంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి  ఆలయం ప్రముఖ తీర్ధ క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది.  
ఆలయానికి వెళ్ళే దారిలో శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి మఱియు శ్రీ భక్తాంజనేయ ఆలయాలను సందర్శించుకోనవచ్చును.ఎత్తైన రాజ గోపుర ద్వారానికి ఎదురుగా, పెద్ద రాతి స్థంభం, కళ్యాణ మండపం, ద్వారానికి ఇరుపక్కలా ద్వార పాలకులు ఉంటారు.











ఆలయ చరిత్రను తెలిపే "పురాతన" బోర్డు సందర్శకులకు క్షేత్ర  చరిత్రను సంక్షిప్తంగా తెలుపుతుంది.ప్రాంగణం లోనికి ప్రవేశించగానే ఎదురుగా బలి పీఠం ధ్వజస్తంభం ఉంటాయి.
ధ్వజస్తంభానికి ఇరుపక్కలా రెండు రాతి స్తంభాల మీద నిర్మించిన చిన్న గూడు లాంటి వాటిల్లో శ్రీ గరుత్మంతుడు శ్రీ ఆంజనేయుడు ముకుళిత హస్తాలతో స్థానక భంగిమలో స్వామి వారి ఆనతి కొరకు ఎదురు చూస్తుంటారు. 
ధ్వజస్తంభం మూలంలో మరో వినతా సుతుని విగ్రహం కనపడుతుంది. పక్కనే కప్పక స్థంభం ఉంటుంది. నియమంగా ఈ స్థంభానికి ప్రదక్షిణలు చేస్తే మనోభీష్టాలు నెరవేరతాయన్నది స్థానిక నమ్మకం. 
ధ్వజస్థంభం వద్ద నాలుగు అడుగుల బలి పీఠం స్వయంగా శ్రీ చెన్నకేశవుడు అని విశ్వసిస్తారు. 





















ముఖ మండప పై భాగాన శ్రీ దేవి భూదేవి సమేత శ్రీమన్నారాయణ మరియు దశావతార రూపాలను నిలిపారు.
ఆగ్నేయంలో వంటశాల,ఈశాన్యంలో ఆలయ నీటి అవసరాల నిమిత్తం తవ్విన నూతి ఉంటాయి.












నాగ శిలా శాసనం 

ప్రదక్షిణా ప్రాంగణంలో  పెద్ద నాగ శాసనం ఉంటుంది. 
ఈ శాసనాన్నిశ్రీ ఆదిత్యేశ్వర ఆలయాన్ని నిర్మించిన ఆదిత్యుడు వేయించినట్లుగా తెలుస్తోంది.  శాసనంలో నాడు మహాదేవి తటాక అని పిలవడిన నేటి మాచర్ల లోని నిర్మించిన  ఆలయ నిర్వహణకు, ఆలయాన్ని నిర్మించిన శిల్పులకు కేటాయించిన గ్రామాల వివరాలు, నాటి మాచర్ల విశిష్టతను తొంభై నాలుగు వాక్యాలలో వివరించారు. ఆ ఆదితేశ్వర ఆలయం  నేడు  శ్రీ గిరీశ్వర స్వామి ఆలయంగా పిలవబడుతున్నది.  













శ్రీ గిరీశ్వర స్వామి ఆలయం 

శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలోనే ఉంటుంది శ్రీ గిరీశ్వర స్వామి ఆలయం. గతంలో దీనిని శ్రీ ఆదితేశ్వర స్వామి ఆలయం గ పిలిచేవారట. 

శ్రీ గీరీశ్వర స్వామి ఆలయంలో శ్రీ వినాయక, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ పార్వతీ దేవి విడివిడి సన్నిధులలో  కొలువై దర్శనమిస్తారు.
అమ్మవారికి ఎదురుగా సింహ వాహనానికి బదులుగా నంది ఉండటం అర్ధనారీశ్వర తత్వానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చును.
గర్భాలయంలో ఎత్తైన పానవట్టం మీద చిన్న లింగ రూపంలో శ్రీ గీరీశ్వర స్వామి భక్తుల నీరాజనాలు అందుకొంటూ దర్శనమిస్తారు.



 












శ్రీ గీరీశ్వర స్వామి ఆలయానికి ప్రత్యేకంగా బలి పీఠం మఱియు ధ్వజస్తంభం ఉంటాయి.
ఇక్కడ ఒక తెలుగు శాసనం కనపడుతుంది.



 





ప్రాంగణంలో ఎన్నో సుందర శిల్పాలు ఉన్నా అవన్నీ సంవత్సరాల తరబడి వేస్తున్న రంగుల మూలంగా సుందరత్వం కోల్పోయి నామ మాత్రంగా కనపడుతాయి.


 









ప్రదక్షణ పూర్తి చేసుకొని ప్రధాన ఆలయం లోనికి ప్రవేశిస్తే అన్ని పక్కలా అనేక వాహనాలు కనపడతాయి. 
గర్భాలయానికి ఎదురుగా  నల్ల రాతితో నిర్మించిన సుందర రంగ మండపం ఆకట్టుకొంటుంది.  మండపానికి ఉన్న నాలుగు స్తంభాలలో  ఒక దాని మీద రామాయణ, మరో దాని మీద మహా భారత, మూడో దాని మీద మహా భాగవత ఘట్టాలను రమణీయంగా చెక్కగా, నాలుగో దాని మీద దశావతార రూపాలను అత్యంత సుందరంగా మలచారు.
వీటిలో కొంతమేర చోళ శిల్పుల శైలి కనపడుతుంది అన్నది చరిత్రకారుల అభిప్రాయం. 
మహా భారత ముఖ్య ఘట్టాలైన పాచికల ఆట, కర్ణార్జునపోరు, భీమదుర్యోధనుల గదాయుద్ధం నేటికీ చెక్కుచెదరకుండా ఉంటాయి. 
అదే విధంగా శ్రీమద్రామాయణ శిల్పాలలో రావణుడు కైలాస గిరిని ఎత్తడం, వాలిసుగ్రీవుల మల్ల యుద్ధం, శ్రీ రాముడు మాయా లేడిని వెంటాడటం, రామ రావణ సమరం ఆకట్టుకొంటాయి. 
   















మిగిలిన స్థంభాల మీద లిఖించిన వివిధ రాజ వంశాల వారు వేయించిన శాసనాలు కనిపిస్తాయి.







కుడి వైపున శ్రీ రాజ్యలక్ష్మి  అమ్మవారి సన్నిధి, ద్వారానికి ఇరుపక్కలా గరుడుడు, హనుమంతుడు ఉంటారు.
ఆ పక్కనే ఆళ్వార్ సన్నిధి.
గర్భాలయ ద్వారానికి రెండుపక్కలా జయ విజయులు.
లోపల చతుర్భుజాలతో స్థానక భంగిమలో శ్రీ చెన్న కేశవ స్వామి భక్తులకు నయన మనోహర అలంకరణలో నేత్రపర్వంగా దర్శన మిస్తారు.




 








ప్రతి నిత్యం భక్తుల స్తోత్ర పాఠాలతో సందడిగా ఉండే ఆలయంలో పర్వదినాలలో మరింత కోలాహలం వాతావరం నెలకొంటుంది. నియమంగా రోజుకు నాలుగు పూజలు జరుపుతారు. 
అన్ని హిందూ పర్వదినాలలో విశేష పూజలు, నెలకొక ఉత్సవం నిర్వహిస్తారు. 
సంవత్సరానికి ఒకసారి ఘనంగా  ఆలయ ఉత్సవాలు జరుగుతాయి. ఆఖరి రోజున జరిగే రధోత్సవం ప్రత్యేక ఆకర్షణ. వేలాదిగా భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి తరలి వస్తారు. 
ధనుర్మాసంలో తిరుప్పావై గానం , భోగినాడు గోదా కల్యాణం రంగరంగ వైభవంగా చేస్తారు.
వైకుంఠ ఏకాదశి నాడు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని  ఉత్తర ద్వారం వద్ద దర్శించుకొని ధన్యులు అవుతారు. అష్టమి తిధి , రోహిణి నక్షత్రం  ఉన్న రోజులలో స్వామివారికి విశేష పూజలు, అలంకారం చేస్తారు. 
శ్రీ కృష్ణజన్మాష్టమి, శ్రీ రామనవమిలను ఘనంగా జరుపుతారు.    
ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు దాకా తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకూ ఆలయం భక్తుల కొరకు తెరచి ఉంటుంది.


 
 




మాచర్లకు హైద్రాబాద్, విజయవాడ, గుంటూరు పట్టణాల నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. అన్ని సౌకర్యాలు అందుబాటు ధరలలో లభిస్తాయి. 
మాచర్ల చుట్టుపక్కల అనేక బౌద్ధ నిర్మాణాలు ఉన్న స్థలాలు కనిపిస్తాయి. అనుపు, ఎత్తిపోతల జలపాతం, దత్త క్షేత్రం, నాగార్జునసాగర్ ఆనకట్ట, నాగార్జున కొండ ప్రదేశాలు చూడదగ్గవి. శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం పక్కనే శ్రీ వీరభద్ర స్వామి ఆలయం ఉంటుంది. తప్పక దర్శించవలసిన ఆలయం. 
వెయ్యి సంవత్సరాల పైచిలుకు నిర్మాణంగా చరిత్రకు సజీవ రూపం అయిన శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయం తప్పక సందర్శించవలసిన పవిత్ర క్షేత్రం.

నమో చెన్న కేశవాయ నమః !!!!

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...