29, జనవరి 2014, బుధవారం

sri sowmyanatha swamy temple, Nandalur


                       నంద నందనుడు కొలువైన నందలూరు 

శ్రీ మహా విష్ణువు భూలోకంలో అనేకానేక రూపాలలో, ఎన్నో నామాలతో  కోవెలలో కొలువుతీరి కొలిచిన వారికి కొంగు బంగారంగా పిలవబదుతున్నాడు. 
అలాంటి వాటిల్లో ఒకటి శ్రీ హరి సౌమ్య నాధ స్వామి గా వెలసిన క్షేత్రం నందలూరు. 
నందనందనుడు వెలసిన కారణంగా ఈ గ్రామానికి నందలూరు అన్న పెరోచ్చినదని చెబుతారు. 
 సుందర శిల్పాలతో కళకళలాడే ఆలయం శతాబ్దాల చరిత్రకు సాక్ష్యంగా పరిగణించవచ్చును. 

పౌరాణిక గాధ :

లోక కంటకుడైన హిరణ్యకశపుని సంహరించిన తరువాత కూడా నరసింహుని ఉగ్రత్వం తగ్గలేదు. 
అరణ్యంలో చెంచు వనిత రూపంలో లక్ష్మి దేవి సహచర్యంతో స్వామి సౌమ్యుడైనాడు. 
ఆ రూపనికే సౌమ్యనాదుడు అని పేరు. 
తొలుత నిరంతరం  నారాయణ నామాన్ని జపించే నారద మహర్షి ఇక్కడ ఎన్నో పురాణాలలో పేర్కొన్న బాహుదా ( చెయ్యేరు) నదీ తీరంలో ప్రతిష్టించారని స్థానికంగా ఒక కధనం ప్రచారంలో ఉన్నది. 
నారద ప్రతిష్టిత శ్రీ సౌమ్యనాధ స్వామికి దేవతలే ఆలయం నిర్మించారని, కాల గతిలో అది శిధిలం కాగా దాని మీదే ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారని అంటారు. 
ఆ కధనం నిజమా అన్నట్లుగా ఆలయ స్థంభాలకు మిగిలిన ఆలయాలలో ఉన్నట్లు పైన సింహపు తలలు ఉండకుండా క్రింద ఉంటాయి. 










ఆలయ విశేషాలు :

పది ఎకరాల విశాల స్థలంలో చుట్టూ ప్రహరి గోడ, నాలుగు వైపులా గోపురాలతో దుర్భేద్యమైన కోటలా కనపడుతుంది. 
పదకొండవ శతబ్దంలో కులోత్తుంగ చోళ రాజు ఇక్కడ ఆలయ నిర్మాణాన్ని ఆరంభించారు. 
తదనంతరం ఈ ప్రాంతాన్ని పాలించిన పాండ్య, కాకతీయ, విజయనగర రాజుల కాలంలో కూడా నిర్మాణ ప్రక్రియ కొనసాగింది. 
పదిహేడవ శతాబ్దంలో స్థానిక పతి రాజుల కాలంలో పూర్తి అయినట్లుగా శాసనాల ఆధారంగా తెలుస్తోంది. 
తూర్పు గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఈశాన్యంలో పుష్కరణి, రాతి స్థంభం, ధ్వజస్తంభం, గరుడా ఆళ్వార్ సన్నిధి, పక్కనే ఉన్న మండపంలో ఆంజనేయ స్వామి సన్నిది ఉంటాయి. 
పూర్తిగా ఎర్ర రాతితో నిర్మించబడిన ఈ ఆలయాన్ని తిరువన్నమలై లో ఉన్న శ్రీ అరుణాచలేశ్వర స్వామి ఆలయానికి చిన్న రూపంగా పేర్కొంటారు. 
మొత్తం నూట ఎనిమిది స్తంభాలపైన ప్రధాన ఆలయం నిర్మించారు. 
స్తంభాల పైన పురాణ ఘట్టాలను, నాటి ప్రజల జీవన శైలిని, చిత్ర విచిత్రమైన జంతువులను, ఆంజనేయ, గరుడ, రూపాలను సుందరంగా జీవం ఉట్టి పడేలా మలచారు. 
గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ గణేశ, శ్రీ ఆదిశేష విగ్రహాలను నిలిపారు. 











ముఖ మండపం నుండి కొద్దిగా ఎత్తులో వున్నగర్భాలయానికి సోపాన మార్గం ఉన్నది. 
ఇరు వైపులా జయ విజయులు ఉంటారు. 
 మండప ద్వారం వద్ద ఉండగానే శ్రీ సౌమ్యనాధ స్వామి దివ్య రూపం నయన మనోహరంగా దర్శనమిస్తుంది. 
అర్ధ మండపం, గర్భలయాలలొ విద్యుత్ దీపాలుండవు. 
అయినా కళకళలాడుతూ కనపడతారు స్వామి. 
ఉదయం నుండి సాయంత్రం వరకు ఉండే సూర్య కాంతితో ప్రకాశించుతారు మూల విరాట్టు.
ఇది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి 
కలియుగ వైకుంఠము లో కొలువు తీరిన వేంకటేశ్వరుని ప్రతి రూపంగా ఉండే ఈ ఏడు అడుగుల సుందర స్వామిలో కనపడే తేడా అల్లా అక్కడ వరద హస్తం కాగా ఇక్కడ అభయ హస్తం. 
రెండూ భక్తులు భగవంతుని నుండి కోరుకోనేవే కదా !
ఆలయ పైకప్పుకు ఒక పెద్ద చేప చెక్కబడి కనపడుతుంది. 
కలియుగంతానికి వచ్చే జల ప్రళయంలో ఇది జీవం పోసుకొని ఈదుకుంటూ వెళుతుంది అన్నది స్థానిక నమ్మకం. 
ఆలయంలో తమిళంలో ఎక్కువగా తెలుగులో కొద్దిగా శాసనాలు చెక్కబడి ఉంటాయి. 
వివిధ రాజ వంశాల రాజులు స్వామికి సమర్పించుకొన్న కైకర్యాల వివరాలు వీటిల్లో రాయబడినాయి. 
కాకతీయ ప్రతాప రుద్రుడు గాలి పురం నిర్మించి వంద ఎకరాల మన్యం ఆలయ నిర్వహణకు ఇచ్చినట్లుగాను, సమీపంలోని పొత్తపి ని పాలించిన తిరు వేంగ నాధుని సతీ మణి చనెన రాణి శ్రీ సౌమ్యనాదునికి బంగారు కిరీటం, శంఖు చక్రాలు , మరెన్నో స్వర్ణాభరణాలు సమర్పించుకొన్నట్లుగా శాసనాల ఆధారంగా అవగతమౌతోంది. 












అన్నమాచార్య : 

వాగ్గేయ కారుడు అన్నమయ్య కొంతకాలం నందలూరులో సౌమ్యనాధుని సేవలో గడిపారని, తన కీర్తనలతో స్వామిని ప్రస్థుతించారని శాసనాలలో పేర్కొనబడినది. 

తొమ్మిది ప్రదక్షిణాలు :


ధృడమైన నమ్మకంతో, బలమైన కోరికతో ఓం శ్రీ సౌమ్యనాదయ నమః అంటూ గర్భాలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షణలు చేసి మొక్కుకొంటే మనోభీష్టాలు నెరవేరుతాయి అన్న ఒక విశ్వాసం తరతరాల నుండి ఇక్కడ కొనసాగుతూ వస్తోంది. 
కోరిక నెరవేరిన వారం రోజులలో వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలి అని కూడా అంటారు. 








బ్రహ్మోత్సవాలు :  

మానస పుత్రుడు నారదుని సహాయంతో విధాత  బ్రహ్మ ఆరంభించినందున  బ్రహ్మోత్సవాలని పిలుస్తారు. 
ప్రతి సంవత్సరం జూలై నెలలో శ్రవణా నక్షత్రం నాడు ఆరంభించి తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుపుతారు. 
ఆలయ వెలుపల ఉన్న మరో కోనేరులో తెప్పోత్సవం జరుగుతుంది. 

పూజలు :

ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో ఎన్నో విధాల నిత్య పూజలు నియమంగా చేస్తారు. 
అన్ని పర్వ దినాలలో, అష్టమి, నవమి తిధులలో, ధనుర్మాసంలో విశేష పూజలు భక్తుల కోరిక మేరకు జరుపుతారు. 

 శ్రీ కామాక్షి సమేత ఉల్లంఘేశ్వర స్వామి దేవస్థానం :

శ్రీ సౌమ్యనాధ స్వామి ఆలయానికి వెలుపల ఈ ఆలయం ఉంటుంది.















26, జనవరి 2014, ఆదివారం

Radha sapthami

                          వందే సూర్యం నిత్య పూజితం 

వేదకాలంలోనూ తదనంతరం అంటే ద్వాపర యుగం దాక ముల్లోకాలకు అధిపతి అయిన సర్వేశ్వరుడు మానవ రూపంలో ఈ పుడమి మీద నడయాడినట్లుగా మన హిందూ పురాణాల ద్వారా అవగతమౌతున్నది.

ఆ కాలంలో దుష్టుల నుండి రక్షణకు, దైవ సాక్షత్కారంతో మోక్షం పొందేందుకు తమపు, యజ్ఞ యాగాదులే మార్గంగా ముముక్షువులు ఎంచుకోనేవారు తప్ప విగ్రహారాధన లేదని తెలుస్తోంది.

వారు చేసిన మరో ఆరాధనా ప్రక్రియ సూర్య దేవుని  కొలవడం.

పురాణాలలోని ముక్కోటి దేవతలలో ప్రతక్షంగా దర్శనమిచ్చేది దివాకరుదోక్కడే.

సూర్యునికి అర్ఘ్యం సమ ర్పించుకోవడం సాక్షాత్ శ్రీ మన్నారాయనునికి సమర్పించుకొవడంగా భావించేవారు.

సూర్య నమస్కారాలు కూడా ఆ కోవలోనివే.

ప్రతక్ష నారాయణునిగా కీర్తించబడే ప్రచండ తేజోమూర్తి అయిన భాస్కరుడు మానవ జీవితాలలో ఎంతో ముఖ్య భూమికను పోషిస్తున్నారు.

ప్రజాపతులలో మరియు  సప్తరుషులలో ఒకరు అయిన కాశ్యపకుని భార్యలలో ఒకరైన అదితికి జన్మించినవాడే ఆదిత్యుడు.

సూర్యుని హరిహరుల సమానాంశగా పేర్కొంటారు.

ఒకవిధంగా సూర్యుడు శ్రీహరికి అగ్రజుడు.

ఎలా అంటే కృతయుగంలో శ్రీ మహావిష్ణువు, బలిచక్రవర్తి ని శిక్షించడానికి అదితి, కశ్యపులకు వామనునిగా జన్మించారని వామన పురాణం  తెలుపుతోంది కదా !

భానుని, వైకుంఠ వాసుని చతుర్వింశతి రూపాలలో ఒకటిగా పురాణాలు పేర్కొన్నాయి.

అందుకనుగుణంగానే సూర్యుడు కూడా చతుర్భుజునిగా శంకు చక్ర పద్మ అభయ హస్తాలతో  గాయత్రీ , హరితి,   బృహతి, హుష్నిక్, జగతి, త్రిష్టుప్, అనుష్టుప్ మరియు పంక్తి అనే ఏడు అశ్వాలు పూన్చిన బంగారు రధంలో  దర్శనమిస్తారు.

అదే శ్రీ హరికి  రామావతార కాలంలో రావణునితో తలపడే ముందు విజయం సిద్దించాలని అత్యంత శక్తివంతమైన ఆదిత్య హృదయాన్ని తొలిసారిగా అగస్త్య మహర్షి ఉపదేశించారు. 
నిత్యం నియమంగా చదివితే జీవితం విజయవంతంగా సాగిపోతుంది. 



రధసారధి అరుణుడు. ఇతను కశ్యపమహర్షి మరో భార్య అయిన వినతకు జన్మించినవాడు. గరుత్మంతుని సోదరుడు.

సూర్యునికి కూడా సోదర సమానుడే. తల్లులు వేరైనా తండ్రి ఒక్కరే కాబట్టి.

చక్రం లేకుండా చక్రధారి శ్రీ హరిని ఊహించలేము.

ఎందరో లోకకంటకులను సంహరించిన సుదర్శన చక్రం కశ్పాత్మజుని కాంతి నుండి ఉద్భవించినది .

తన కుమార్తె సంధ్యాదేవి సూర్యుని తేజస్సుని తట్టుకోలేక పోవడంతో దేవ శిల్పి విశ్వకర్మ సూర్యుని తెజస్సు నుండి కొంత తీసుకొని సుదర్శన చక్రాన్ని తయారుచేసి శ్రిమన్నారాయనునికి  ఇచ్చారట.

విశ్వకర్మ ఆ చక్రాన్ని త్రిపురాసుర సంహారమప్పుడు కైలాసవాసునికి ఇచ్చారని తరువాత ఆయన చక్రదారికి బహూకరించారని మరో కధనం కూడా ప్రచారంలో ఉన్నది. 

సూర్యుడు కాంతి ప్రదాత. ఆయన కిరణాల ద్వారానే పృధ్వి పచ్చదనంతో పరవశించడమే కాకుండా సమస్త జీవ రాశికి అత్యంత అవసరమైన గాలి, నీరు, ఆహరము మరియు ఇతరములు లభిస్తున్నాయి.

సూర్య కాంతి లేని లోకాన్ని ఊహించలేము.
సూర్య రదానికున్నఏడు అశ్వాలు సప్త వర్ణాలకు లేదా వారంలోని ఏడు రోజులకు నిదర్శనమైతే, రదానికున్న పన్నెండు చక్రాలు పన్నెండు రాశులకు లేదా సంవస్సతరం లోని పన్నెండు నెలలకు ప్రతీకలు.
 సప్తాశ్వరధం మీద రాశి కొక నెల చొప్పున ప్రభావం చూపుతూ తన  లోక పర్యటనను పూర్తి చేయడానికి మూడువందల అరవై అయిదు రోజులు తీసుకుంటారు లోక నాయకుడు.
ఇలా తండ్రి లోకానికి  కాలనిర్ణయం చేస్తుంటే  తనయుడు అయిన వైవస్వత మనువు లోక పాలకునిగా తన భాద్యతను నిర్వర్తిస్తున్నారు.
వైవస్వత మనువు తర్వాత భాద్యతలు స్వీకరించే సవర్ణ మనువు కూడా  సూర్య పుత్రుడే.
ఇక సూర్య దేవుని ఇంకో కుమారుడైన శనిదేవుడు మానవుల జీవితాలపైన తిరుగులేని ప్రభావం చూపే గ్రహముగా భూలోకంలో ఎంతో భయాధరణ సమిస్తిగా పొందినవాడు.
ఈయన అనుగ్రహం కోరి మానవులు ఎన్నో జపాలూ, శాంతులు జరుపుతుంటారు.
మరో కుమారుడైన యముడు జీవుల మరణ కాలాన్ని నిర్ణయించేవాడు.
ఈయనను శాంతింపచేయడానికి ఎన్నో హోమాలు, యజ్ఞాలు, చేయడం ఈయన పాశం బారినుండి తమను తాము  కాపాడుకోడానికి మానవులు పడే పాట్లు లెక్కలేనన్ని.
కశ్యపాత్మజుడు  నవ గ్రహాధిపతి.

నిరంతరం రామ నామాన్ని జపించే వాయునందనుడు ఆదిత్యుని శిష్యుడే !

ప్రపంచ వ్యాప్తంగా సుర్యారాధన ఉన్నది అనటానికి ఆయన కున్న ఆలయాలు మరియు వివిధ దేశాలలో వ్యాప్తిలో ఉన్న అనేక నామాలే సాక్ష్యం. 

మన దేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలో సూర్య దేవాలయాలు ఉన్నాయి. 

అందులో కొన్ని చాలా ప్రాముఖ్యం పొందినవి. 

మొధేరా ( గుజరాత్ ), కోణార్క ( ఒడిస్సా ), అరసవిల్లి ( ఆంధ్ర ప్రదేశ్ ), సూర్యనార్ కోవెల ( తమిళనాడు ), మార్తాండ్ ( జమ్మూ కాశ్మీర్ ), ముల్తాన్ ( పంజాబ్ ) ముఖ్యమైనవిగా పేర్కొన వచ్చును. 

ఇంకా అస్సాం, మధ్య ప్రదేశ్, బెంగాల్, బీహార్ లలో కూడా స్థానికంగా పేరొందిన సూర్య ఆలయాలు ఉన్నాయి. 
మన రాష్ట్రంలో సూర్య దేవాలయం అనగానే అందరికి గుర్తుకొచ్చేది అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారే !
కానీ మన రాష్ట్రంలో మరో నాలుగు పౌరాణిక, చారిత్రక ప్రసిద్ది చెందిన దివాకరుని దేవాలయాలున్నాయి. 
బుదగవి ( అనంత పురం ), నందికొట్కూరు ( కర్నూల్ ), గొల్లల మామిడాడ ( తూర్పు గోదావరి), మరొకటి హైదరాబాద్ లో ఉన్నాయి. 
అదేవిధంగా ఒరిస్సాలో ప్రసిద్ద కోణార్క ఆలయం కాకుండా బరంపురంకి చేరువలో బుగద గ్రామంలో ఉన్న శ్రీ బిరించి నారాయణ స్వామి ఆలయం కూడా ప్రసిద్ది చెందినదే! 
ఈ ఆలయాన్ని చెక్కతో నిర్మించినందున కలప కోణార్క అని పిలుస్తారు. 
అలానే అదే రాష్ట్రంలో భద్రక్ సమీపంలో మరో చరిత్ర ప్రసిద్దికెక్కిన బిరంచి నారాయణ ఆలయం పాలియా గ్రామంలో ఉన్నది. 
ఇండోనేషియా, మలయా, చైనా, జపాన్, ఈజిప్ట్, ఇలా ఎన్నో దేశాలలో ప్రభాతుడు పూజ్యనీయుడు. 
ఈజిప్ట్ లో "రా", జపాన్ లో "అమెతెరాసు", సిరియా లో "ఎరిన్న", గ్రీక్ లో " హిలియోస్  ", "లిజా" అని ఆఫ్రికా ఖండంలో, పర్షియా లో " మిత్రాస్ " అని సూర్యుని పిలుస్తారు. 

అమెతెరాసు



"తై యాంగ్ జింగ్ జున్ ఆక" చైనా  సూర్యుడు 

 హిలియోస్
బుదగవి సూర్య దేవాలయం 


నందికొట్కూరు సూర్య దేవాలయం 

గొల్లల మామిడాడ మూల విరాట్టు 
హైదరాబాద్ సూర్య దేవాలయం 
పూర్వీకులు సూర్య ఆరాధనను ఆధ్యాత్మిక భావనలతోనే కాకుండా లోకాలకు వెలుగును, దాని వలన ఆహారాన్ని పొంది జీవిస్తున్నామన్న పవిత్ర భావనతో పాటు సూర్య కిరణాలలోని అద్భుత శక్తిని గుర్తించి  ఎలా ఆ శక్తిని సుఖమయ జీవితాల కొరకు  ఉపయోగించుకోవాలో కూడా వారు భావి తరాల వారికి తెలిపారు. 
సూర్యకిరణాలు ఏడు రకాలని వేదాలు తెలుపుతున్నాయి. ఒకొక్క కిరణంలో ఒక్కో శక్తి ఉన్నది. 
అవి వరసగా "సుష్మ , సురందన, ఉదన్నవాసు, విశ్వ కర్మ, ఉదవసు, విశ్వ వ్యాక , మరియు హరికేశ"
సుష్మ కిరణాల వలన చంద్రుడు ప్రకాశవంతంగా, ఆహ్లాద పరచే వెన్నెలను కురిపిస్తాడు. 
సురందన కిరణాల నుండే చంద్రుడు ఉద్భవించాడు. 
కుజ గ్రహ దోషాలను, జీవునకు తప్పక కావలసిన ఆరోగ్యము, తెలివితేటలు, ధనాన్ని ప్రసాదించేవి ఉదన్నవాసు అనే కిరణాలు. 
విశ్వ కర్మకిరణాల వలన మనిషికి మానసిక వేదన తొలగిపోయి ధృడత్వం పెంపొంది జీవితంలో అన్నింటా విజయం సాధిస్తాడు. ఈ కిరణాలు భుధ గ్రహాన్ని ప్రభావితం చేస్తాయి. 
ఉదవసు కిరణాలు నిత్య జీవితంలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించే సామర్ధ్యాన్ని అందిస్తాయి. ఇవి గురు గ్రహాన్ని ప్రభావితం చేస్తాయి. 
శుక్ర మరియు శని గ్రహాలని ప్రభావితం చేసే  విశ్వ వ్యాక కిరణాలు మానవునికి దీర్ఘాయువును ప్రసాదిస్తాయి. 
ఆఖరిదైన  హరికేశ కిరణాల నుండి ఉద్భవించిన నక్షత్రాలు మానవునికి కావలసిన తేజస్సు, బలం, ధైర్యాన్ని అందిస్తాయి. 
ఈ మహత్యాన్ని గ్రహించిన మునులు మానవులకు సూర్య నమస్కారాలను ప్రసాదించారు. 
సూర్య నమస్కారాల ప్రస్తావన ఋగ్వేదం లో ఉన్నది. 
తొలుత నూట ఎనిమిది గా ఉండే సూర్య నమస్కారాలు నేడు పన్నెండుకు చేరుకొన్నాయి. 
ఒక్కో నమస్కారానికి ఒక్కో మంత్రం ఉన్నది. 
మంత్రం తెలియకున్నా నియమంగా చేస్తే నేటి అదునాతన  జీవన శైలి వలన సంక్రమిస్తున్న అనేక రుగ్మతలను మనం దూరం చేసుకొనే అవకాశాన్ని పొందగలము. 
ఆధునిక వైద్య శాస్త్రం కూడా ఇదే విషయాన్ని నొక్కి చెప్తోంది ఉదయపు నడక యొక్క ప్రాధాన్యతను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. 
సూర్యుడు నమస్కార మరియు ప్రదక్షణ ప్రియుడు. 
ఏదైనా సూర్య దేవాలయంలో లేదా నవగ్రహ మండపంలో కొలువు తీరిన దినకరునికి నియమంగా నూట ఎనిమిది ప్రదక్షిణాలను పన్నెండు ఆదివారాలు చేస్తే విశేష ఫలితం ఉంటుందని, మనసులో కోరుకొన్న కోర్కెలు నెరవేరుతాయి అన్నది పెద్దల మాట. 
ఆ రోజులలో మధ్య మాంసాలకు దూరంగా ఉండాలి. 
తన అరుణారుణ కాంతులతో లోకాలను వెలుగుతో నింపే ప్రభాకరుడు మానవునికి కావలసిన వెలుగు, ఆహరం, ఆరోగ్యం, ఆనందం అన్నింటిని ప్రసాదించే వాడు. 
అందుకే శ్రీ సూర్య నారాయణుడు ప్రత్యక్ష దైవమే కాదు ప్రత్యక్ష ధన్వంతరీ రూపం. 
శ్రీ  సూర్య నారాయణుడు నిత్య పూజితుడు. 
జపా కుశుమ సంకాశం కాశ్యపేయం మహద్యుతమ్ 
తమోరిం సర్వ పాపఘ్నమ్ ప్రణతోస్మి దివాకరం !!! 














 


 

 

 


23, జనవరి 2014, గురువారం

Sri Soumya Narayana Perumal Temple, Thirukoshtiyur


 శ్రీ సౌమ్య నారాయణ పెరుమాళ్ ఆలయం. తిరుకోష్టియుర్ 



వైకుంఠ వాసునికి భూలోకంలో ఉన్న అనేకానేక ఆలయాలలో ఆళ్వారుల గానంతో దివ్య దేశాలుగా ప్రసిద్దికెక్కిన నూట ఎనిమిది దివ్య క్షేత్రాలలో ఒకటి తిరుకోష్టియుర్. తొలి యుగం నాటి పౌరాణిక గాధకు, కలియుగంలో ప్రసిద్దికెక్కిన వైష్ణవ గురువు శ్రీ శ్రీ శ్రీ రామానుజా చార్యుల జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ముడిపడి ఉన్న పవిత్ర క్షేత్రం తిరుకోష్టియూర్. 









ఆలయ విశేషాలు :

ఆలయ నిర్మాణమే ఒక విశేషంగా చెప్పాలి. ఆలయాన్ని ప్రస్తుత రూపంలో  తీర్చిదిద్దినది పది హేనవ శతాబ్దానికి చెందిన నాయక రాజులు అని శాసనాలు తెలుపుతున్నాయి. తూర్పు ముఖం గా ఉన్న రాజ గోపురం దాటి ప్రాంగణం లోనికి అడుగు పెడితే ఎన్నో ఉపాలయాలు కనపడతాయి. ఎడమ వైపునకు తిరిగి ప్రదక్షిణ ఆరంభించగానే ఎదురయ్యే తొలి సన్నిధి శ్రీ శ్రీ శ్రీ రామానుజా చార్యులవారిది. పక్కనే ఉన్న మరో సన్నిధి ఆయనకు అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించిన గురు దేవులు శ్రీ తిరుకోష్టియూర్ నంబి. చిన్నదైన ఇందులో అర్థ మంటపం,మున్మండపం,గర్భ గృహం. మున్మండపంలోనే  అద్దాల అరలో నమ్బిగల్ ఉత్సవ మూర్తి, పక్కనే ఆయన పూజించిన ఆంజనేయ, సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుల విగ్రహాలు ఉంటాయి. దర్శనం  తరువాత ముందుకు వెళితే ఏకాదశి మండపం,బలి పీఠం,ధ్వజస్తంభం తరువాత కళ్యాణమండపం వస్తాయి. చక్కని శిల్పాలను మలచారు కళ్యాణ మండపంలో.అక్కడే లింగ రూపంలో కైలస నాధుడు కొలువు తీరివుంటారు. ఈ కారణంగా తిరుకోష్టియూర్ ఆలయం శివ కేశవ నిలయం గా పేర్కొన వచ్చును. ఈ కళ్యాణ మండపంలో ఒక పక్కన శ్రీ నారసింహ సన్నిధి మరో పక్క శ్రీ రామ సన్నిధి ఉంటాయి.  

అరుదైన అష్టాంగ విమానం 

ప్రధాన ద్వారం గుండా గర్భాలయం వైపునకు కదిలితే మధ్యలో ఆళ్వార్ సన్నిధిని సందర్శించు కోవచ్చును. తిరుకోష్టియూర్ ఆలయ విమానగోపురం అరుదైన అష్టాంగ విమానం. ఇది మూడు అంతస్తులుగా ఉంటుంది.  









మొదటి అంతస్తును  భూలోకంగాను, రెండో అంతస్తును పాల కడలిగాను, పై అంతస్తును శ్రీ వైకుంఠముగా పేర్కొంటారు. ఇలాంటివి నూట ఎనిమిది దివ్యదేశాలలో మొత్తం మూడు ఉన్నాయి. ఈ ఆలయంతో పాటు మదురై నగరంలో ఉన్న కూడళ్ పెరుమాళ్ ఆలయం రెండవది కాగా మూడవది కాంచీపురంలోని శ్రీ వైకుంఠ పెరుమాళ్ ఆలయం. ఆళ్వారుల వర్ణన ప్రకారం క్రింది భాగంలో నర్తన మూర్తి, మధ్య భాగంలో శయన మూర్తి, పైభాగంలో స్థానిక మూర్తి ఉంటారు అష్టాంగ విమాన క్షేత్రంలో ! ఇక్కడ కూడా అడుగు భాగంలో శ్రీ రుక్మిణి సత్య భామా సమేత నర్తన కృష్ణ ఉంటారు. 






తొలి దర్శనం  నేత్ర పర్వంగా శయన భంగిమలో ఉన్నశ్రీ అనంతశయనునిదే. స్వామి పాదాల వద్ద శ్రీ దేవి, భూదేవి, శిరస్సు వద్ద కదంబ మహర్షి, ఎదురుగా బ్రహ్మ,ఇంద్రుడు,సూర్యచంద్రులు ఇంకా అనేక దేవతా మూర్తులు ఉంటాయి.మూలవిరాట్టును  శ్రీ ఉరగ మేళ్ళ నయన్ పెరుమాళ్ లేక శ్రీ పన్నగ సాయి అని పిలుస్తారు. శ్రీ సౌమ్య నారాయణ పెరుమాళ్ అని ఉత్సవమూర్తిని పిలుస్తారు. ఈ స్వామి పేరుతోనే ఈ క్షేత్రం ప్రసిద్ధి.  





శంఖు చక్రాలను వెనక హస్తాలలో ధరించి, ముందరి కుడి చేతిని ధ్యాన ముద్రలోను, ఎడమ చేతిని కటి హస్త ముద్రలోను ఉండే సుందర రూప స్వామిని ఇంద్రాది దేవతలు ఆరాధించేవారు. తరువాత ఇంద్రుడు కదంబ మునికి ఇచ్చారని తెలుస్తోంది. ఈ కారణంగా ఇక్కడ ఇంతమంది విగ్రహాలు 
ఉంటాయి. స్వామిని సేవించుకొని తిరిగి మెట్ల మార్గంలో రెండో  అంతస్తుకు చేరుకొంటే అక్కడ శ్రీ ఉపేంద్ర నారాయణ స్థానక భంగిమలో శ్రీ దేవి, భూదేవి సమేతులై దర్శనమిస్తారు. ఈ భాగంలోని గోడలకు సహజ వర్ణాలతో చిత్రించిన భాగవత ఘట్టాలుంటాయి. మరో పక్కన శ్రీదేవి భూదేవి సమేత పరవాసుదేవుడు కొలువై ఉంటారు. 








దర్శనానంతరం  క్రిందకు వస్తే అక్కడ తిరుమంగై తాయారు,శ్రీ భూ దేవి సమేత  చతుర్భుజ శ్రీ నృసింహ, సుదర్శన, శ్రీనివాస, శ్రీ వరద రాజ, శ్రీ రామ, యోగ నారసింహ, శ్రీ చక్రత్తి ఆళ్వార్, శ్రీ ఆండాళ్ సన్నిదులుంటాయి. ఆలయ ఉత్తర భాగంలో వెలుపల ఉంచిన రెండు నారసింహ, ఒక చక్రత్తి ఆళ్వార్ విగ్రహాలుంటాయి. ఒకప్పుడు ఈ విగ్రహాలు లోపలి భాగంలోనే ఉండేవిట. కానీ ప్రస్ఫుటంగా కనిపించే భీకర రూపం,ఆ రూపం కళ్ళలో కనిపించే రౌద్రానికి భక్తులు భయపడే వారట. దానితో వీటిని వెలుపల ఉంచారు. 






పేరులోని అంతరార్ధం 

సత్య యుగంలో ఈ ప్రదేశంలో అమిత విష్ణు భక్తుడైన కదంబ మహర్షి ఆశ్రమం నెలకొల్పుకొని విద్యార్థులకు విద్య ఉపదేశించేవారట. ఎందరెందరో మహర్షులు, మహాత్ములు తరచుగా ఈ ఆశ్రమానికి విచ్చేసి వేదాంత విషయాల గురించి చర్చించేవారట. అలా కదంబ మహర్షి ఆశ్రమం ముల్లోకాలలో పేరు గాంచిందట. 
అంతర్యామి వరాహావతారం ధరించి అసురుడైన హిరణ్యాక్షుని సంహరించారు. సోదరుని మరణంతో కుపితుడైన హిరణ్యకశ్యపుడు బ్రహ్మ దేవుని నుండి అనేక వరాలు పొంది లోక కంటకునిగా మారాడు. అతని బారి నుండి ముల్లోకాలను ఎలా రక్షించుకోవాలి ? అన్న దాని గురించి విధాత, పరమేశ్వరుడు ఇంద్రాది దేవతలు, సప్త మహర్షులు తదితరులు ఈ క్షేత్రములో సమావేశమయ్యారట. అలా అందరూ సమిష్టిగా "గోష్టి" చేసిన స్థలంగా "తిరుగోష్ఠియూర్" గా పిలువబడి క్రమంగా "తిరుకోష్ఠియూర్"గా పిలవబడుతోంది అంటారు. 



శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య :

అపర ఆదిశేష అవతారం గా పేర్కొనే  విశిష్ట అద్వైత సిద్దాంత రూపకర్త, నిరంతర విష్ణు సేవా తత్పరులు అయిన శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులు నేటి చెన్నై నగర సమీపంలోని శ్రీ పెరంబుదూర్ లో జన్మించారు. గురువు శ్రీ తిరుకంచి నంబి వారి ఆదేశానుసారం తిరుకోష్టియూర్ చేరుకొని శ్రీ తిరు కోష్టియూర్ నంబి వద్ద ఉపదేశం పొందదలచారు. కాని ఆయనలో ఉన్న నేను అన్న అహం తొలిగే వరకూ శ్రీ నంబి ఆయనకు దర్శనం కూడా ఇవ్వలేదు. ఏడు సార్లు తిప్పిపంపారట. తనను తాను పూర్తిగా అర్ధం చేసుకొని అహం తొలగించుకొని ఎనిమిదో సారి వచ్చిన రామానుజుని ఆప్యాయంగా ఆహ్వానించి అష్టాక్షరి మంత్రాన్ని ఉపదేశించారట. భక్తిశ్రద్దలతో జపిస్తే శ్రీ మన్నారాయణ దర్శన ప్రాప్తి కలుగుతుందని, ఎవరికైనా తెలిపితే  నరకప్రాప్తి తప్పదని హెచ్చరించారట. 
ఉపదేశానంతరం రామానుజులు,శ్రీ సౌమ్య నారాయణ ఆలయం పైకి ఎక్కి పెద్ద స్వరంతో "ఓం నమో నారాయణాయ !" అంటూ గ్రామస్తులందరికీ వినిపించేలా పలికారట. ఆగ్రహించిన గురువుతో " పవిత్ర మంత్ర జపంతో నేను ఒక్కడిని శ్రీ హరి దర్శనం పొందటం కన్నాఅందరికి ఆ మార్గం చూపించి నేను నరకానికి పోవడం మంచిదే కదా!" అని సమాధానమిచ్చారు. ఆయన పరోపకారతత్వానికి, పెరుమాళ్ మీద ఉన్న భక్తి శ్రద్దలకు సంతసించిన గురువు మనస్పూర్తిగా ఆశీర్వదించారు శిష్యుని. 
ఈ సంఘటనకు గుర్తుగా, రామానుజులు ఎక్కడ నుంచి అష్టాక్షరీ మంత్రాన్నిఎలుగెత్తి ఉచ్చరించారో ఆ గోపురం వద్ద  ఆయన మూర్తిని ఉంచారు. అలా తిరుకోష్టియూర్ తో  శ్రీ రామానుజా చార్యులవారికి  విడదీయరాని అనుబంధం ఏర్పడినది.



 

దివ్య దేశం :

పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ఆరుగురు తిరు కోష్ఠియూర్ మీద మొత్తం నలభై ఎనిమిది పాశురాలు గానం చేసి శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటిగా నిలిచిపోయే శాశ్విత స్థానం గుర్తింపు కలిగేలా చేశారు. 

పూజలు - ఉత్సవాలు :

ఉదయం ఆరు గంటల నుండి ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల కొరకు తెరచి ఉండే శ్రీ  సౌమ్య నారాయణ  పెరుమాళ్ ఆలయంలో ఎన్నో నిత్య పూజలు జరుగుతాయి. వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు, నృసింహ జయంతి, శ్రీ రామ నవమి ఇలా ప్రతి రోజు పండగ వాతావరణం ఇక్కడ నెలకొని ఉంటుంది. భక్తుల విరాళాలతో ఉచిత అన్నదానం ఏర్పాటు చేశారు. 
ఇంతటి ప్రముఖ పుణ్య క్షేత్రం సందర్శించుకోడానికి మదురై నుండి సులభంగా బస్సులో చేరుకొనవచ్చును. 
జై శ్రీ మన్నారాయణ !!!

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...