7, ఫిబ్రవరి 2019, గురువారం

          పశు పక్ష్యాదులకు కూడా ప్రత్యేక రోజులున్నాయిట




                                                                                                 



మనందరం ఉన్నంతలో ఆనందంగా, తాహతుకు తగినట్లుగా ఆర్భాటంగా జరుపుకొనేది పుట్టిన రోజు వేడుకలను. మనది లేదా మన కుటుంబ సభ్యుల జన్మదినోత్సవ సందర్బంగా ఒకరికొకరు శుభాకాంక్షలు అందుకోవడం లేదా తెలపడం, బంధుమిత్రులతో ఉల్లాసంగా గడపడం ఆ రోజున  సహజంగా చోటుచేసుకునే పరిణామాలు. అది ఒక ప్రత్యేకమైన రోజు మనందరికీ. 
మరి మనతో పాటు ఈ భువిలో నివసించే పశు పక్ష్యాదులు సంగతేమిటి ? వాటికి నోరు లేదాయ పాపం. ఏమి చేయాలి ? ఎక్కడో పుడతాయి. మరెక్కడో మరణిస్తాయి. జీవించడానికి ఎన్నో పాట్లు పడుతుంటాయి.  భావాలను వ్యక్తపరచడానికి మనకంటూ బాష ఉన్నది. మాట్లాడగలం. కానీ మన వలన పర్యావరణానికి హాని తప్ప జరుగుతున్నమేలు ఏమీ కనపడటం లేదు. కానీ వానపాములు, సీతాకోకచిలుక దగ్గర నుండి ఏనుగు వరకు అన్ని మూగ జీవులు పర్యావరణ పరిరక్షణకు తమ వంతు భాద్యతను సక్రమంగా నెరపుతున్నాయి. నిర్వహించడానికి కృషి చేస్తున్నాయి. అవి చేయలేకపోతే అది మన పొరబాటే. వాటి సంఖ్య గణనీయంగా తగ్గిపోవడానికి మనం చేస్తున్న కృషి అంతా ఇంతా కాదు కదా మరి!
సరే ఈ విషయాలను వదిలేసి అసలు విషయం దగ్గరకు వద్దాము. 
పశు పక్ష్యాదులు మానవాళికి ఆహరంగా , ప్రయాణ సాధనాలుగా ఉపయోగపడటమే కాకుండా భూమి మీద వాతావరణాన్ని అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అంతేనా మనకు మనోల్లాసం కలిగిస్తాయి. కుక్క, పిల్లి, పావురాలు,చిలకలు లాంటి పెంపుడు జంతువులు మరియు పక్షులు  మన భావోద్వేగాలను అదుపులో ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
పుడమి పరిరక్షణలో విశేష పాత్ర పోషిస్తున్న పశు పక్ష్యాదుల పట్ల ఆదరణతో కొందరు శాస్త్రవేత్తలు, జంతు పక్షి ప్రేమికులు, భూమి బాగోగుల పట్ల ఆలోచన ఉన్నవారు కలిసి కొన్ని సంస్థలను స్థాపించారు. ప్రతి ఒక్క పక్షి లేదా జంతువుకు సంవత్సరంలో ఒక రోజును కేటాయించారు. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించి ఆ జీవి గురించి, ఆ జాతి వలన ఒనగూడే ప్రయోజనాల గురించి వాటిని కాపాడవలసిన అగత్యం ఏ  స్థాయిలో ఉన్నది అన్న విషయాలను తెలుపుతారు. ఈ రోజులను నిర్ణయించినవారు పశ్చిమ దేశాలకు చెందినవారే కావడం విశేషం. వారిని హృదయపూర్వకంగా అభినందించాలి. ఇక్కడొక విషయం తెలుసుకోవాలి. ఈ పశుపక్ష్యాదుల గొప్పదనాన్ని గుర్తించిన మన పూర్వీకులు వాటికి పురాణాలలో దేవీదేవతల వాహనాలుగా విశిష్ట స్థానాలలో నిలిపారు. శనీశ్వరునికి సీసా నూనెతో అభిషేకం చేస్తాం. ఆయన వాహనానికి గుప్పెడు మెతుకులు వెయ్యం. అది వేరే సంగతి. 
అలా నిర్ణయం కాబడ్డ రోజే ఆ పక్షి లేదా జంతువు యొక్క ప్రత్యేకమైన రోజు. ముందుగా పక్షుల  గురించిన వివరాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల పక్షి జాతులున్నాయి. శాస్త్రవేత్తలు ప్రతి సంవత్సరం పదివేల కొత్త జాతి పక్షులను కనిపెడుతున్నారు. అంతే సంఖ్యలో వివిధ కారణాలతో  కొన్ని జాతులు పూర్తిగా అంతరించి పోవడమో లేదా వాటి సంఖ్య దారుణంగా తగ్గిపోవడమో జరుగుతోంది. అందువలన అన్ని జాతులకు కలిపి ప్రపంచ పక్షుల దినోత్సవాన్ని ఏప్రిల్ నెల పదమూడవ తారీఖుగా నిర్ణయించారు. గమనించదగిన అంశం ఏమిటంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఆ రోజు శలవగా ప్రకటించడం. ఒక చోట స్థిరంగా ఉండక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తాత్కాలికంగా వలస వెళ్లే విహంగాల దినోత్సవాన్ని మే నెల రెండో శనివారం నాడు  జరుపుతారు. 
కాకపోతే మెక్సికో, దక్షిణ, మధ్య అమెరికాలలో జాతీయ పక్షి దినోత్సవాన్ని అక్టోబర్ నెల రెండో శనివారం జరుపుకోగా మనదేశంలో జనవరి నెల అయిదో తారీఖున జరుపుకొంటాము. మన జాతీయ పక్షి తెలుసు కదా నెమలి.    
ఇక విడివిడిగా చూస్తే ఒక్క రోజు తప్ప మిగిలిన సమయం అంతా మనం అసహ్యించుకునే కాకికి కేటాయించిన రోజు ఏప్రిల్ ఇరవై ఏడు. అంతరించిపోతున్న పిచ్చికలది మార్చి ఇరవై. చిలక పలుకులు అంటూ మన అభినందనలను అందుకొనే రామచిలుకల రోజు మే నెల ఆఖరి రోజున. పెంపుడు పక్షులైన పావురం మే నెల పదమూడు, కోడి మే నెల నాలుగు,బాతు జనవరి పద మూడున తమ యజమానులు దయ తలిస్తే తమ ప్రత్యేక రోజులు జరుపుకొంటాయి. లేకపోతే లేదు. ఇక అందరూ అశుభంగా భావించడం వలన రాత్రి పూటే సంచరించే  గుడ్లగూబ ఆగస్టు నాలుగున, గబ్బిలం ఏప్రిల్ పదిహేడున చీకట్లోనే జరుపుకొంటాయి. 
నాట్యమయూరి మార్చి ఇరవైనాలుగున, సంగీత నిధి హమ్మింగ్ బర్డ్ మే పదిహేనున, గాన కోకిల ఏప్రిల్ ఇరవైన తమ ప్రత్యేక దిన సంబరాలను నృత్యగానాల మధ్య జరుపుకొంటాయి. తమను అస్యహించుకొన్నా మానవాళికి సేవ చేసే రాబందులు సెప్టెంబర్ మొదటి శనివారం నాడు, గ్రద్దలు మార్చి ఇరవై అయిదున గుట్టు చప్పుడు కాకుండా కొండల మీద వేడుకలను చేసుకొంటాయి. 
పంటలు సంవృద్ధిగా పండటానికి తమ వంతు కృషి చేసే సీతాకోక చిలుకలు పంటలు ఇంటికి వచ్చిన తరువాత అంటే పద్నాలుగు మార్చి, వానపాములు కొత్తపంట వేసే ముందు అనగా  అక్టోబర్ ఇరవై ఒకటిన పండుగ చేసుకొంటాయి. కస్సు బుస్సు మంటూ బెదిరిస్తూనే 
పుట్టలో పడుకొనే పాలు పూజలు స్వీకరించే  పన్నగం జులై పదహారున గుట్టుగా పుట్టలో ప్రత్యేక రోజు జరుపుకొంటుంది. 
ఇక పశువులు మరియు జంతువుల అంతర్జాతీయ దినోత్సవాల గురించి తెలుసుకొనే ముందు వాటి ప్రస్తుత జీవన విధానానికి ఎదురవుతున్న ముప్పును గురించి మాట్లాడుకొందాము. అరణ్యాల విస్తీర్ణం త్వరితగతిన తగ్గిపోవడం, తగినంత ఆహరం, నీరు లభ్యం కాకపోవడం, వేటగాళ్ల బారినపడటం లాంటి కారణాలతో పెక్కు వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతోంది. ఇక పెంపుడు జంతువులలో శునకాలు తప్ప మిగిలిన వాటి స్థితి కూడా ఏమంత ఆరోగ్యవంతంగా లేదు.తగ్గుతున్న పంట పొలాల విస్తీర్ణం, జరుగుతున్నవ్యవసాయంలో కూడా యంత్ర వినియోగం, వర్షాభావ పరిస్థితులు, గడ్డి కొరత, పెరిగిన నిర్వహణ ఖర్చుల కారణంగా  పాడి పశువుల నిర్వహణ తగ్గిపోతున్నది. వేరే  లాభసాటి వ్యాపారాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కఠిన పరిస్థితులలో తమ ఉనికిని మరియు అవసరాన్ని గట్టిగా లోకానికి తెలుపాలన్ననిర్ణయంతో అవన్నీవాటి ప్రత్యేక దినాలను వీలైనంత ఘనంగా జరుపుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి.
మానవుని తొలి నేస్తం విశ్వసానికి మారుపేరు కుక్క. తనకున్న ఆదరణతో ఆగస్ట్ ఇరవై ఆరున సంబరాలను జరుపుకొంటాయి. ఇక్కడ ఒక విషయం ప్రస్తావించాలి. ఎవరైనా మనిషికి అణిగి మణిగి ఉంటె ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా రాజభోగాలు అందుకోవచ్చును. అందుకే కామోసు కుక్క తినే బిస్కట్లకు కూడా ఒక రోజు కేటాయించారు. అది ఫిబ్రవరి ఇరవై మూడు. 
పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, కొత్తగా ఈ జాబితాలో పుణ్యం దక్కుతుంది అన్న ఆశతో పాటు  అనేకం చేరాయి. వీటన్నింటినీ అందిస్తున్న గోమాత జులై పదిన, నల్లగా ఉన్నా తన మనస్సు లాంటి స్వచ్ఛమైన తెల్లని పాలు, పాల పదార్ధాలను అందించే గేదె నవంబర్ నెల తొలి శనివారం నాడు, మిగిలిని పెంపుడు జంతువులైన మేకలు సెప్టెంబర్ తొమ్మిదిన, గొఱ్ఱెలు అక్టోబర్ ఇరవై ఏడున ప్రత్యేక దినాలను జరుపుకొంటాయి.
తొలినాటి ప్రయాణ సాధనం.తదనంతర కాలంలో కనిపెట్టిన ఎన్నో ఇంధన రవాణా వాహనాల  యంత్ర సామర్ధ్యాన్ని దాని బలంతో పోలుస్తున్నారు. ఇంత గొప్ప గౌరవాన్ని పొందుతున్న   అశ్వం మార్చి ఒకటవ తారీఖున మాంచి ఉషారుగా జరుపుకొంటుంది. ఎందుకూ పనికిరానివాడికి ప్రధానం చేసే బిరుదు ఒకటుంది అడ్డమైన చాకిరీ చేస్తూ కూడా ఇలాంటి అవమానాలను ఎదుర్కొనే గార్దభాలు అభావంగానే తమ రోజుని మే నెల  ఎనిమిది న చేసుకొంటాయి.
అరణ్యాలలో జీవించే సాధు మరియు క్రూర జంతువులకు కూడా ఒక్కో రోజు చొప్పున ఉన్నాయి. వీటిల్లో చాలా మటుకు అంతరించి పోతున్నవాటి జాబితాలో ఉండటం విచారకరం. ప్రస్తుతం పెద్ద జంతువుగా గుర్తింపు పొందుతున్న గజాలు సందడిగా మందతో కలిసి ఆగస్టు పన్నెండున, మృగరాజు ఆగస్టు పదిన, పెద్ద పులి జులై ఇరవై తొమ్మిదిన, చిరుతపులి డిసెంబర్ నాలుగున తమ ప్రత్యేక రోజులను ప్రపంచవ్యాప్తంగా జరుపుకొంటాయి. ఎలుగుబంట్లు ఫిబ్రవరి ఇరవై ఏడున, కంగారూలు మే పదిహేనున, గుఱ్ఱానికి దగ్గర చుట్టం అయిన జీబ్రా జనవరి ముప్పై ఒకటిన, ఎత్తైన జీవిగా పేరొందిన జిరాఫీ జూన్ ఇరవై ఒకటిన పండుగ  చేసుకొంటాయి. చూడగానే ఆమ్మో అనిపించే జంతువు ఖడ్గమృగం. అది సెప్టెంబర్ ఇరవై రెండున విశేష రోజు వేడుకలు చేసుకొంటే, కొంతవరకు దానిని పోలి ఉండి నీటి గుఱ్ఱం గా పిలవబడే హిప్పోపొటమస్ ఫిబ్రవరి పదిహేనున చేసుకొంటుంది.
చెట్ల మీద తిరుగుతూ చూడగానే ముచ్చట కలిగే పండా సెప్టెంబర్ పదిహేనున వృక్ష శాఖల మీద బిడియంగా ప్రత్యేక దినాన్ని జరుపుకొంటాయి. ఇలా చెప్పుకొంటూ పోతే ఈ జాబితా చాలా పెద్దదిగా ఉంటుంది. వీటి ముఖ్య ఉద్దేశ్యం ఒక్కటే మనతో  భూమి మీద నివసించే జీవుల ప్రాధాన్యాన్ని గుర్తించడానికే. దానిని గ్రహించి వాటికి ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలను తెలుపుదాం.  
  

Shraddha Narayana Temple, Nenmeli

              సద్గతులను ప్రసాదించే శ్రాద్ధ నారాయణుడు 





ప్రజలు ఆలయాలకు వెళ్లి కొలువు తీరిన దేవీదేవతలకు తమ కోరికల చిట్టా తెలుపుతూ  నెరవేర్చమని అర్ధిస్తుంటారు. వీటిల్లో అధికభాగం ఇహలోక సుఖాలే ఉంటాయి. ఇవి బొందిలో జీవం ఉన్నంత వరకూ ఒకదాని తరువాత మరొకటి చొప్పున కొనసాగుతూనే ఉండటం ఆ అందరికీ తెలిసిన విషయమే ! 
ఒకోసారి ఈ తాపత్రయం మరణానంతర లేదా మరో జన్మకు సంబంధించిన విషయాల పట్ల కూడా ఉండటం విశేషం. కానీ సమస్త జీవులను క్షమించి  ఆదరించి వారి కోర్కెలను నెరవేరుస్తారు పరాత్పరుడు. ఆ విధమైన అదృష్టానికి నోచుకొన్న ధన్య జీవులైన దంపతుల కారణంగా అందరికీ లభించిన ఒక అరుదైన ఆలయం తమిళనాడు రాష్ట్రం చెంగల్పట్టు పట్టణంలోని శ్రీ శ్రాద్ధ నారాయణ పెరుమాళ్ కోవెల.    
















చాలా చిన్నగా మన వాడకట్టులో కనపడే అతి సాధారణ నిర్మాణంలాగ కనిపించే శ్రీ మహా లక్ష్మి సమేత  శ్రీ నారాయణ పెరుమాళ్ ఆలయం ఎన్నో విశేషాలకు నిలయం. గతంలో ఈ క్షేత్రాన్ని "పుండరీక నల్లూరు" లేదా "పిండం వైత్త నల్లూరు" అని పిలిచేవారు. చెంగల్పట్టు పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో పక్షి తీర్ధం వెళ్లే దారిలో వచ్చే "నేన్మెలి" (Nenmeli) అనే చోట ఉన్న ఈ క్షేత్ర గాధ ఇలా ఉన్నది.



















పూర్వం ఆర్కాట్ నవాబ్ వద్ద యజ్ఞ నారాయణ శర్మ అనే బ్రాహ్మణుడు దీవానుగా పనిచేసేవారు. భార్యాభర్తలు శ్రీవైష్ణవులు. శ్రీ మన్నారాయణ స్వామిని అమిత భక్తి శ్రద్దలతో సేవించుకొనేవారు.
తమకున్న అధికారంతో శిధిలావస్థలో ఉన్న శ్రీహరి ఆలయాలను పునః నిర్మించడం, అర్చక స్వాములను నియమించడం, నిర్వహణకు నిధులు మరియు భూములు ఇవ్వడం చేసేవారు.
వీటికోసం తమ ఆస్తులు, జీతభత్యాలనే కాకుండా ప్రజల నుండి వసూలు చేసిన శిస్తుల, పన్నుల మరియు ఇతర ఆదాయ మార్గాల  ద్వారా లభించిన ధనాన్ని కూడా ఖర్చు చేశారు శర్మ గారు. కానీ నవాబ్ ఖజానాకు జమ కట్టలేదు.
కొంత కాలం గడిచింది. శర్మ వసూలు చేసిన సొమ్ము కట్టలేదని, ఆ ధనాన్నిఆలయాల అభివృద్ధి నిమిత్తం ఉపయోగించారని తెలిసింది.నవాబు ఆగ్రహించి ధనాన్ని దుర్వినియోగం చేసినందుకు   బ్రాహ్మణ దంపతులను చెఱసాలలో బంధించమని ఆజ్ఞాపించారు.

















అనుజ్ఞ తీసుకోకపోవడం నిజమే , కానీ తాము ఆ ధనాన్ని దైవకార్యాలకే వినియోగించాము తప్ప స్వంతానికి వాడుకోలేదు. చెప్పుడు మాటల ప్రభావంతో నవాబు తమ విన్నపాన్ని వినకుండా శిక్ష విధించారని వగచారు దివాను దంపతులు. ఆ ఆవేదనలో దేహత్యాగం చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. అప్పటికే వారు వృద్దులు. సంతానం లేదు. కానీ జన్మరీత్యా సంక్రమించిన కులం ప్రకారం మరణానంతరం తగిన శ్రాద్ధ కర్మలు జరిగితే గానీ ఉత్తమ లోకాలు లేదా ఉత్తమ జన్మలు  లభించవు అన్న విశ్వాసం వారికి కలదు. సరే ! చెఱసాల పాలై దుర్భర జీవితం గడిపే కన్నా మరణించడమే మంచిది. తరువాత విషయం పెరుమాళ్ నిర్ణయిస్తారు అని తలంచి ఆలయ పుష్కరణిలో దూకి మరణించారు.
మరణానంతరం వారికి శ్రీవారి సాక్షాత్కారం లభించినదట. వారికి తన యెడల గల భక్తిశ్రద్ధలు, విశ్వాసానికి ప్రతిగా స్వయంగా తానే వారికి మరణానంతర క్రతువులు, పిండ ప్రధానం మరియు తర్పణాలు సమర్పిస్తానని తెలిపి శాశ్వత వైకుంఠ వాస యోగం అనుగ్రహించారట.


















ఈ సంఘటన జరిగింది ఇక్కడే ! వృద్ధ దంపతుల కోరిక మేరకు, వారి నిస్వార్ధ భక్తికి ప్రతిగా   లభించిన ప్రతిఫలం అందరికీ తెలియాలన్న వారి కోరిక మేరకు శ్రీ మహాలక్షి సమేత   నారాయణ పెరుమాళ్ గా కొలువు తీరారు. నాటి నుండి నేటి వరకు శర్మ దంపతుల తిథిని శ్రీమన్నారాయణుడే జరుపుతున్నారు. నాడు శర్మ గారి వంశీయులు హాజరయ్యి తొలి తీర్ధం స్వీకరిస్తారు.
అందుకే ఈ ఆలయ ఉత్సవమూర్తిని "శార్ధ సంరక్షణ నారాయణుడు" అని అంటారు. స్వయం వైకుంఠ వాసుడు చేసే ఆబ్ధీకం కనుక ఈ క్షేత్రాన్ని గయ సమాన క్షేత్రంగా పరిగణిస్తారు. దాని వలన తదనంతర కాలంలో సంతానం లేని వారి, అవివాహితుల, అనాధల లేక బంధువులు ఎవరూ లేని వారి పిండ ప్రధాన భాద్యతను పరమాత్మకు అప్పగించడం ఆరంభమైనది.


















తమకు తెలిసిన సంతానం లేని దంపతుల, అవివాహిత అనాధ స్నేహితుల లేదా ఆత్మహత్య లేదా ప్రమాదాలలో అర్ధాంతరంగా మరణించినవారి శ్రాద్ధం ఇక్కడ జరిపించుకోడానికి చాలా మంది వస్తుంటారు. ముందు రోజు ఆలయ అర్చక స్వామిని సంప్రదించిస్తే చెల్లించవలసిన పైకం మిగిలిన వివరాలు తెలుపుతారు.
తిథిని అమావాస్య లేదా ఏకాదశి రోజున మధ్యాహన్నం పన్నెండు గంటల తరువాత ఆరంభిస్తారు. చెయ్యించదలచినవారు మరణించినవారి పేరు, గోత్రము, జన్మ నక్షత్రంలాంటి  వివరాలతో సంకల్పం చెప్పి మిగిలిన బాధ్యత శ్రీవారికి అప్పగిస్తారు సన్నిహితులు. కార్యక్రమం పూర్తి అయిన తరువాత స్వామివారికి ఆవు నెయ్యితో చేసిన బెల్లం పరమాన్నం మరియు పెరుగన్నం నివేదన చేస్తారు. క్రతువు నిర్వహించడానికి గర్భాలయం వెనుక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ గయలో దర్శనమిచ్చే గదాధరుని పాదాలను కూడా ఉంచారు.

















చిన్న ఆలయం.తొలుత అర్ధ మండపం, గర్భాలయం మరియు ముఖ మండపము మాత్రమే  ఉండేవని నిర్మాణాన్ని చూస్తే అర్ధం అవుతుంది. ఆలయ విశేషాలు వ్యాప్తి చెందిన తరువాత చుట్టూ ఇతర నిర్మాణాలు జరిగినట్లు తెలుస్తుంది. తూర్పు దిశగా ఉండే ఆలయానికి ఎదురుగా ధ్వజస్థంభం, శ్రీ గరుడాళ్వార్ మరియు శ్రీ ఆంజనేయ సన్నిధి కనపడతాయి.మండపంలో శ్రీవారి చిత్రపటాలను అలంకరించబడి ఉంటాయి.
గర్భాలయానికి దారితీసే ద్వారం స్వర్ణవర్ణ రేకులతో తాపడం చేబడినది. అర్ధమండపంలో ఉత్సవమూర్తులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శార్ధ సంరక్షణ నారాయణుడు దర్శనమిస్తారు. గర్భాలయంలో శ్రీ మహాలక్ష్మీ సమేత నారాయణ స్వామి నేత్రపర్వంగా కొలువుతీరి కనపడతారు.
స్వామివారికి నిత్య పూజలు నిర్వహిస్తారు. నిత్యం స్థానిక భక్తులు మాత్రమే కనపడే ఈ ఆలయంలో అమావాస్య మరియు ఏకాదశి రోజులలో వాటికి ముందు రోజులలో శ్రాద్ధం జరిపించుకోడానికి వచ్చేవారితో కోలాహాలం నెలకొంటుంది.
ఈ ఆలయంలో ఉన్న మరో విశేషం ఏమిటంటే శ్రీ మహాలక్ష్మీ సాలగ్రామం. అతి అరుదుగా లభిస్తుంది. అమ్మవారికి ప్రతిరూపం అయిన ఈ సాలగ్రామానికి భక్తిశ్రద్దలతో అభిషేకాలు, పూజలు జరిపితే  లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది అని అంటారు. ముఖ్యంగా మంగళ మరియు శుక్రవారాలలో ఈ సాలగ్రామానికి ప్రత్యేక కుంకుమ పూజ జరిపించుకొంటే ఆర్థికాభివృద్ధి కలుగుతుంది అని స్థానిక మహిళలు విశ్వసిస్తారు.













దేశంలోని అన్ని ప్రాంతాల నుండి చెంగల్పట్టు చేరుకోడానికి రైలు సౌకర్యం కలదు. అందుబాటులో వసతి మరియు భోజన సౌకర్యాలు లభిస్తాయి. చుట్టుపక్కల ఎన్నో పురాతన దర్శనీయ ఆలయాలు ఉన్నాయి. 
పంచభూత క్షేత్రాలలో ఒకటైన తిరువణ్ణామలై లో శ్రీ అరుణాచలేశ్వరుడు తన భక్తుడైన వళ్లాల రాజు కు సంతానం లేనందున మాసీ మాసంలో శ్రాద్ధం పెడతారు. కానీ ఇక్కడ పరమాత్మ అందరికీ సద్గతులు కలిగించడానికి స్వయంగా శ్రాద్ధము  పెట్టడం  మరెక్కడా కనపడని విశేష విశేషం. 

జై శ్రీమన్నారాయణ !!!!

4, ఫిబ్రవరి 2019, సోమవారం

Sri Gupteshwar Temple,

            గుహలో గుప్తంగా కొలువైన  శ్రీ గుప్తేశ్వరుడు 

                                                                                       
                                                                                               


లయకారకుడు,శుభంకరుడు మరియు భక్తవత్సలుడు అయిన కైలాసనాధుడు ఈ పుడమి మీద లింగరూపంలో  అనేకానేక దివ్య క్షేత్రాలలో కొలువుతీరి కోరినవారికి కొంగు బంగారంగా పూజలందుకొంటున్నారు. వీటిల్లో కొన్ని దుర్గమారణ్యాలలో పర్వత శిఖరాల మీద, గుహలలో నెలకొన్ని ఉన్న ప్రదేశాలు కలవు. అలాంటి వాటిల్లో ఒకటి శ్రీ గుప్తేశ్వర మహాదేవ క్షేత్రం. మన రాష్ట్రానికి చేరువలో ఉన్న ఒడిశా రాష్ట్రం లోని కోరాపుట్ జిల్లాలో ఉన్న విశేష దర్శనీయ క్షేత్రం. 
జిల్లా కేద్రమైన కోరాపుట్ కి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న గుప్తేశ్వర్ లోని మహాదేవ లింగం గత మూడు యుగాలుగా మహనీయుల, అవతార పురుషుల మరియు మహర్షుల పూజలందుకొన్నదిగా భక్తులు విశ్వసిస్తారు. 
స్థానికంగా వినిపించే గాధల ప్రకారం అవతార పురుషుడైన శ్రీరాముడు తన వనవాస కాలంలో భార్య సోదర సమేతంగా శ్రీ గుప్తేశ్వర స్వామికి అభిషేకాలు చేసినట్లుగా తెలియవస్తోంది. రామాయణ కాలంలో దండకారణ్యంగా పేర్కొన్న ప్రాంతములోని భాగాలే  నేటి ఒడిశా లోని కోరాపుట్, మల్కనగిరి, ఛత్తీస్ గఢ్ లోని బస్తర్ మరియు ఆంధ్రప్రదేశంలోని పశ్చిమ గోదావరి జిల్లాలు అని పేర్కొంటారు.  దాని ప్రకారం ఎప్పటి నుండి ఈ లింగం గుప్తంగా ఈ కొండ గుహలో ఉన్నదో ! అలా యుగాల నుండి గుప్తంగా గుహలో ఉన్నందున భక్తులు శ్రీ గుప్తేశ్వర మహాదేవ్ అని పిలుస్తుంటారు. నాటి నుండి నేటి వరకూ స్థానిక అడవి బిడ్డలే స్వామివారికి  పూజాదికాలు చేస్తున్నారు. బాహ్యప్రపంచానికి ఈ క్షేత్రం గురించి తెలియదు. 
కానీ మహాకవి కాళిదాసు విరచించిన "మేఘసందేశం"లో ఇక్కడి దట్టమైన దండకారణ్య వనాలను, పక్కనే పారే సావేరి నది మరియు గుహలో కొలువైన శ్రీ గుప్తేశ్వర మహాదేవ్ గురించి వర్ణించినట్లుగా తెలుస్తోంది.  































పంతొమ్మిదో శతాబ్దంలో జయపూర్ ని పాలించిన దేవ్ వంశ రాజుల యేలుబడిలో ఉండేది ఈ ప్రాంతం. ఒకనాడు వేట నిమిత్తం అడవిలోకి వచ్చిన రాజు గుహలో కొలువై బోయలచే సేవించబడుతున్న గుప్తేశ్వర లింగాన్ని దర్శించుకొన్నారట. నాటి నుండి పట్టణ ప్రాంతాల నుండి భక్తులు లింగరాజును సందర్శించుకోడానికి ఈ రామగిరి ప్రాంతాలకు రాసాగారు. ముఖ్యంగా శ్రావణ మాసం, కార్తీక మాసాలలో పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. మహాశివరాత్రి పర్వదినం నాడు లక్షల సంఖ్యలో తరలి వస్తారు. 
దండకారణ్యంలో భాగమైన రామగిరి అరణ్యాలలో నెలకొని ఉన్నది శ్రీ గుప్తేశ్వర. పావన సావేరి నదీతీరంలో ఉన్న ఈ  సున్నపు రాతి పర్వత శ్రేణిలో ఎన్నో గుహలున్నాయి. చాలా వాటిని భద్రతారీత్యా మూసివేయబడినాయి. కొన్ని వాటంతట అవే మూసుకొనిపోయాయి. ప్రస్తుతం సందర్శకులు దర్శించుకోడానికి అనువుగా ఉన్న గుహలు నాలుగు. మొదటిది గుప్తేశ్వర లోయలోనికి అడుగు పెడుతున్నప్పుడు ఎడమపక్కన కనపడుతుంది. ఇందులో శ్రీ గణపతి, శివ మరియు శ్రీ దుర్గ దేవి కొలువై ఉంటారు. పక్కన నిర్మించిన చిన్న మందిరం లాంటి నిర్మాణంలో శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుడు మరియు శ్రీ రామభక్త హనుమాన్ దర్శనమిస్తారు. మధ్యలో ప్రధాన గుహాలయానికి దారితీసే సోపాన మార్గాన్ని వదిలి నది వైపుకు వెళుతుంటే ఎడమపక్కన "పరబేద మరియు స్వర్గద్వార గుహలు అని మార్గాన్ని సూచించే సూచిక కనపడుతుంది.  కొండలలో చక్కని శాశ్విత నడక మార్గాన్ని నిర్మించారు. సుమారు అర కిలోమీటరు దూరం వెళితే  పరబేద గుహ కనిపిస్తుంది. మట్టితో నిర్మించిన మెట్ల మార్గంలో చీకటితో నిండిన గుహలోనికి వెళితే నాగాభరణంతో అలంకరించబడిన శివలింగం కనపడుతుంది. ఇక్కడ దేవ ధేనువు కామధేనువు పరమేశ్వరునికి క్షీరాభిషేకం చేసినట్లుగా చెబుతారు. దానికి నిదర్శనంగా ఆ చిన్న గుహ పై భాగం  ఆవు పొదుగును పోలి ఉండి బొట్లుబొట్లుగా నీరు క్రింద ఉన్న లింగం మీద పడుతుంటుంది. అక్కడ ఉండే పూజారి వచ్చిన భక్తులను మనసులో కోరిక కోరుకొని  దాని క్రింద అరచేతిని చాపి ఉంచమంటాడు. నీటిచుక్క పడితే  మనోభీష్టం నెరవేరుతుంది అని నమ్ముతారు. దర్శించుకొని ఇంకొంచెం ముందుకు వెళితే అరణ్యవాస కాలంలో సీతారాములు విడిది చేసిన స్వర్గద్వారం అనే గుహ వస్తుంది. ఇక్కడ కూడా మొదటి గుహలో మాదిరి నీటి చినుకులు లింగాన్ని అభిషేకిస్తుంటాయి. దీనికి అనేక మార్గాలున్నాయి. లోపలకు వెళితే నీటి ప్రవాహం పారుతున్న శబ్దం వినిపిస్తుంది. అంతర్భాగంలో యోగులు, మహర్షులూ తపస్సు చేసుకొంటుంటారని అంటుంటారు. ఈ గుహకి బయట ఒక ఓ పక్కన రామ తీర్ధం మరో పక్కన సీతా తీర్ధం కొంచెం దూరంలో లక్ష్మణ తీర్ధం ఉంటాయి. 





































పచ్చదనం పరుచుకున్న పర్వతాల నడుమ పక్షుల కిలకిలారావాలు, వానరాల సందడి, మంద్రంగా వీచే స్వచ్ఛమైన చల్లని గాలి మనస్సుకు యెనలేని శాంతిని కలిగిస్తాయి. అక్కడ నుండి నదీతీరానికి చేరుకొంటే మరింత ఆహ్లాదకర అనుభూతిని సొంతం చేసుకోవచ్చును. నదికి దారితీసే మార్గానికి ఏర్పాటు చేసిన ద్వారం మీద మకర వాహనం మీద ప్రయాణిస్తున్న గంగాదేవి శిల్పాన్నిఏర్పాటు చేశారు. పేరేదైనా ప్రవహిస్తూ ప్రాణాధారమైన నీరు గంగే కదా ! తూర్పు కనుమలలోని సింకారం పర్వతాల మీద జన్మించిన సావేరి నది (కోలాబ్ అని కూడా అంటారు) గోదావరి నదికి ఉపనది. అడవులలో నివసించే వారికే కాదు పట్టాన ప్రాంతవాసులకు కూడా  జీవనాధారం. ప్రవాహ ఒరవడికి అరిగిపోయిన శిలలు అనేక రూపాలను సంతరించుకొని ప్రకృతి గొప్పదనాన్ని స్పష్టంగా కనులకు చూపుతాయి. తీరంలో స్నానం చెయ్యడానికి క్షేమకరమైన ఏర్పాట్లు చేశారు. 
 వెళ్లిన దారినే తిరిగి ప్రధాన గుహాలయం వద్దకు వస్తూ దారికి రెండు పక్కలా ఏర్పాటు చేయబడిన పూజా సామాగ్రి, చిత్రపటాలు,పండ్లు, ఫలహారాలు అమ్మే దుకాణాలను  చూడవచ్చును. ఇక్కడ బస చేయడానికి దేవస్థానం మరియు ఒడిస్సా రాష్ట్ర పర్యాటక శాఖ వారి వసతి గృహాలు కలవు. 
సుమారు వంద మెట్లు ఎక్కి ప్రధాన గుహాలయం చేరుకొంటే స్వర్ణవర్ణం శోభితంగా ప్రవేశ ద్వారం ఎదురవుతుంది. అక్కడే అంజనాసుతుడు సంజీవరాయనునిగా  చిన్న గుహలో భక్తులకు దర్శనమిస్తారు. కొద్దిగా పైకి వెళితే గుహకి అనుసంధానంగా ముఖ మండపం నిర్మించారు. మధ్యలో పెద్ద విగ్రహ రూపంలో నందీశ్వరుడు ఉపస్థితులై కనపడతారు. గర్భాలయంగా పరిగణించే గుహ ద్వారానికి ఇరుపక్కలా నంది మరియు హనుమంతుడు స్దాన భంగిమలో ద్వారపాలకులుగా ఉంటారు. కొండరాళ్ళ మధ్య నిర్మించిన సన్నని మెట్ల మీదగా వంగి జాగ్రత్తగా క్రిందకి వెళితే పర్వతరాజు పడగ పెట్టినట్లుగా సహజసిద్ధంగా ఏర్పడిన గుహలో ఆరు అడుగుల ఎత్తు అంతే పరిమాణంలో చుట్టుకొలత తో తామ్ర వర్ణ ఛాయలో నాగాభరణాలు, రుద్రాక్షలు, పుష్పహారాలు, బిల్వపత్రాలను అలంకరించుకొని నయనమనోహరంగా దర్శనమిస్తారు. చూడగానే హిమాలయాలలో కనిపించే అమరనాథ హిమలింగం తలుపుకు వస్తుంది. 
 కాకపోతే దాని దర్శనం సంవత్సరంలో కొంతకాలమే ! కానీ శ్రీ గుప్తేశ్వరుని సంవత్సరమంతా సేవించుకొనవచ్చును. స్థానికులే పూజారులుగా వ్యవహరిస్తారు. స్వామిని దర్శించుకొని రెండో పక్కన ఏర్పాటుచేసిన మరో సన్నని మార్గం ద్వారా పైకి చేరుకోవచ్చును. నిత్య పూజలు జరుగుతాయి. 































కోరాపుట్ నుండి గుప్తేశ్వర దాకా చక్కని రహదారి కలదు. కానీ  ఉదయం ఆరున్నరకు కోరాపుట్ నుండి బయలుదేరే బస్సు ఒక్కటే అక్కడి చేరుకోడానికి ఆధారం. అదే బస్సు మధ్యాహాన్నం తిరిగి బయలుదేరుతుంది. లేకపోతే బోయపరిగూడ దాకా బస్సులో వెళ్లి అక్కడ నుండి ఆటో లేదా జీపు మాట్లాడుకొని వేళ్ళ వచ్చును. కాకపోతే కొంచెం ఎక్కువ తీసుకొంటారు. కోరాపుట్ లేదా జయపూర్ నుండి కానీ ప్రవేట్ లేదా స్వంత వాహనాలలో చేరుకోవడం ఉత్తమం. 
ఇబ్బందులున్నా శ్రీ గుప్తేశ్వర మహాదేవ దర్శనం భక్తులను ప్రకృతితో మమేకం చేసే ఒక అద్భుత ఆధ్యాత్మిక యాత్ర. 

నమః శివాయ !!!!
 



Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...