26, నవంబర్ 2014, బుధవారం

Sri Dharma Sastha Temple, Pakkil

పక్కిల్ శ్రీ ధర్మ శాస్త ఆలయం



శ్రీ ధర్మశాస్త సంప్రదాయము, ఆరాధనకు కేంద్రమైన కేరళలోని వివిధ ప్రాంతాలలో మొత్తం నూట ఎనిమిది శాస్త ఆలయాలు నెలకొల్పబడినాయి. అన్నింటినీ శ్రీ పరశురాముడు ప్రతిష్టించినట్లుగా పురాణ గాధలు తెలుపుతున్నాయి. ఈ కారణంగా ఈ క్షేత్రాలన్నీ  ఎంతో పౌరాణిక చారిత్రక ప్రాధాన్యత కలిగినవి. వీటిల్లో కొన్ని చోట్ల స్వామి తన యోగముద్ర భంగిమలో కాకుండా ఇతర భంగిమలలో కొలువై ఉంటారు. 
అసలు దేవతల స్వస్థలంగా పిలవబడే కేరళను సృష్టించిన పరశురాముడు స్వయంగా ప్రతిష్టించి స్థాపించిన శ్రీ ధర్మశాస్త ఆలయాలు ఎనిమిది మాత్రమే అని కొందరు అంటారు. ఆ ఎనిమిది క్షేత్రాలలో కొట్టాయం కు చేరువలో ఉన్న పక్కిల్ గ్రామంలో ఉన్న ఆలయం ఒకటిగా పేర్కొనబడినది.  శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన శ్రీ పరశురాముడు శ్రీ ధర్మశాస్తాను క్షేత్ర రక్షకునిగా నియమించారట. 
అందుకనే కేరళ లోని అన్ని ఆలయాలలో శ్రీ ధర్మశాస్త ఉపాలయంలో దర్శనమిస్తారు. మహిళలు ఈ ఉపాలయాలలోని స్వామిని దర్శించుకొనవచ్చును. కానీ ముఖ్యమైన క్షేత్రాలైన  
శబరిమల, అరియంగావు, అచ్ఛంకోవిల్, కులత్తపుల, శాస్తంకొట్ట లలో పది నుండి యాభై సంవత్సరాల మహిళలకు ప్రవేశం లభించదు.
కానీ పక్కిల్ ఆలయం లోనికి స్త్రీలను ఎలాంటి అభ్యంతరం లేకుండా అనుమతిస్తారు.






అందుకనే సుందర ప్రశాంత వాతావరణంలో ఆధ్యాత్మికత సంపూర్ణంగా నింపుకొన్న ఈ ఆలయం ఆడవారి శబరి మల గా కీర్తించబడుతోంది.







సువిశాల ప్రాంగణంలో  రహదారి నుండి కొద్దిగా దిగువకు ఉండే ఆలయ సముదాయం కొంత ప్రత్యేకంగా ఉంటుంది.








స్థానిక నిర్మాణ శైలిలో  నిర్మించబడిన ప్రధాన గోపురం దాటి ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఎత్తైన మండపం కనపడుతుంది.అక్కడే ద్వజస్థంభం మరియు బలి పీఠం ఉంటాయి. ప్రదక్షిణా పథంలో  గణపతి మరియు  భగవతి సన్నిదులుంటాయి.ప్రతి ఉపాలయం వద్ద దర్శించుకొనే దీక్షా దారులు కొబ్బరి కాయలు కొట్టడానికి ఏర్పాట్లు చేయబడినాయి








.




గర్భాలయంలో శ్రీ ధర్మ శాస్త సుందర స్వర్ణ పుష్పాలంక్రుతులై మనోహరంగా దర్శనమిస్తారు.
మిగిలిన శాస్త ఆలయాలకు పక్కిల్ లో ఆలయానికి ప్రధాన తేడా ఏమిటంటే శబరి మలలో మాదిరి ఇక్కడ కూడా ప్రాంగణంలోని ఈశాన్యంలో శ్రీ మాలికా పురత్తమ్మ సన్నిధి ఉండటం.
నూతనము గా నిర్మించబడిన ఆలయాలలో తప్ప పురాతన ఆలయాలలో మరెక్కడా  ఇలా అమ్మవారు కొలువై ఉండటం కనిపించదు.మహిళలు  భక్తి శ్రద్దలతో అమ్మవారిని కొలుస్తుంటారు.
 సౌభాగ్యాన్నిప్రసాదించే   దేవతగా భావించి పసుపు కుంకుమలతో అర్చిస్తారు. ముఖ్యంగా మండల సమయంలో మరియు మకర సంక్రాంతి రోజులలో అశేష సంఖ్యలో మహిళా భక్తులు వస్తుంటారు. స్వామికి , అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించుకొంటారు .
ఉదయం నాలుగు గంటల ముప్పై నిముషాల నుండి పదకొండు వరకు  అయిదు గంటల నుండి
రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఆలయంలో  నిత్యం అభిషేకాలు, అర్చనలు, అలంకారాలు చేస్తారు.శబరి మలలో మాదిరి వివిధ ఆర్జిత సేవలు నిర్వహిస్తారు. శబరిమల వెళ్లలేని వారు ఇక్కడ ఎరుముడి సమర్పించుకొంటారు . నెయ్యాభిషేకం జరిపించుకొంటారు .
శ్రీ ధర్మశాస్త ఆలయం కాకుండా మరో ప్రత్యేకత పక్కిల్ కలిగి ఉన్నది.













ప్రస్తుత ఆలయాన్ని పరయి పెట్ట పంతిరుకులం అనే వర్తక కుటుంబానికి చెందిన "పక్కనార్" అనే ఆయన నిర్మించారట . వారి కుటుంబం స్థానికంగా గృహోపకరణాల వ్యాపారం నిర్వహిస్తుండేదట . ప్రజల సౌకర్యార్ధం వారాంతపు సంతను ఏర్పాటు చేసేవారట. అదే కాలక్రమంలో పెద్ద సంతగా పేరొందినది .

సంవత్సరమంతా అనేకానేక గ్రామాల మాదిరి సాధారణంగా నిశ్శబ్దంగా ఉండే పక్కిల్ జూన్ జూలై మధ్య కాలంలో (మళయాళ మిధునం మాసం ) పండగ వాతావరణం సంతరించుకొంటుంది.
ఈ నెలలో కేరళలోనే  అతి పెద్దదైన సంత పక్కిల్ లో జరుగుతుంది. ఆ సంతలో దొరకని వస్తువంటూ ఉండదు అంటారు . అన్ని రకాల గృహోపకరణాలు లభిస్తాయి.చాటలు, బుట్టలు దగ్గర నుండి జాతి చెక్కతో చేసిన అనేక విధములైన బల్లలు, కుర్చీలు, మంచాలు ఇలా ఎన్నో విధములైన సామాన్లు లభిస్తాయి.నెల  రోజుల పాటు జరిగే ఈ సంతలో రాష్ట్రం లోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొంటారు.























"సంక్రాంతి వానిభ్యం" ( సంక్రాంతి వాణిజ్యం) గా పిలిచే పక్కిల్ సంత  సుమారు వెయ్యి సంవత్సరాలుగా నిర్వహించబడుతోందనితెలుస్తోంది.
ఇంతటి విశేషత విశిష్టత కలిగిన పక్కిల్, శబరిమలకు దారితీసే ఉత్తమమైన దారుల్లో ఉత్తమమైన మజిలీలలో ఒకటిగా పేరొందిన కొట్టాయం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చేరడానికి బస్సులు మరియు ఆటోలు లభిస్తాయి. కొట్టాయం నగరం లోనూ చుట్టుపక్కల ఎన్నో విశేష ఆలయాలు నెలకొని ఉన్నాయి.  అన్నీ దర్శనీయమైనవే !
స్వామియే శరణం  అయ్యప్పా !!!!!!




23, నవంబర్ 2014, ఆదివారం

Sri Kailasanathar Temple,Thara Mangalam, Salem



                         శ్రీ కైలాస నాథర్ ఆలయం, తారమంగళం 


To,


 

వినాయకుడు సదాశివుడు, శ్రీ హరి, అమ్మవారు, కుమార స్వామి ఇలా దేవుడు లేదా దేవత ఎవరు కొలువుతీరినా సుందర  శిల్ప శోభ మాత్రం అద్వితీయంగా దర్శనమీయడం తమిళ నాడులోని ఆలయాలలో ప్రస్పుటంగా కనపడుతుంది. దానికి మరో ఉదాహరణ "ధారైమంగళం "గా గతంలో పిలవబడి నేడు " తార మంగళం" పిలవబడుతున్న ఊరిలోని   "శ్రీ కైలాస నాథర్ ఆలయం ".












ఆలయ గాధ పరమేశ్వరుడు కొలువైన అనేక క్షేత్రాలలో వినిపించేదే !
సుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట స్థానిక రాజుగారి గోవుల మంద లోని ఒక ఆవు నిత్యం ఒక ప్రదేశంలో తన పొడుగు నుండి పాలను ధారగా వదులుతుండేదట. కారణాన్ని అన్వేషించే క్రమంలో అక్కడ తవ్వగా శివ లింగం లభించినదట. రాజు తన అదృష్టానికి పొంగిపోయి సాక్షాత్ కైలాస  వాసుడే సాక్షాత్కరించాడని స్వామిని " కైలాస నాథర్ "గా పేర్కొంటూ ఆలయాన్ని నిర్మించాడట. ఆలయంలో పాలు విడుస్తున్న గోవు శిల్పాలు చాలా స్తంభాల మీద కనపడతాయి. 
తదనంతర కాలంలో పల్లవ, చోళ, పాండ్య, నాయక రాజులు ఆలయ అభివృద్దికి తమ వంతు కృషి చేశారని ప్రాంగణంలో చెక్కిన ఆయా వంశ చిహ్నాలు ధనుస్సు, చేప లాంటివి   తెలుపుతున్నాయి. 


















ప్రస్తుత ఆలయానికి  పద్దెనిమిదో శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన "గెట్టి మొదలి " అనే రాజు తగిన  మరమ్మత్తులు చేయించడమే కాకుండా ఐదు అంతస్తుల రాజ గోపురాన్నికూడా నిర్మించాడని స్థానిక గాధల ఆధారంగా తెలుస్తోంది.  












తొంభై అడుగుల ఎత్తు గల గోపుర ద్వారానికి అమర్చిన ఇత్తడి రేకులు, గుబ్బలు నేటికీ చెక్కు చెదరక పోవడం నాడు నాణ్యతకు ఇచ్చిన ప్రాధాన్యత అర్ధం అవుతుంది. 


















ఈ ఆలయంలో ఆసక్తికర నిర్మాణ అంశం ఒకటి కనపడుతుంది. రాజ గోపురం ఆలయం కన్నా ఎత్తులో ఉండి దారిన పోయే వారు వెలుపలి నుండే చాలా లోపలికి గర్భాలయంలో కొలువైన  లింగాన్ని దర్శించుకోనేలా నిర్మించడం. గోపురం లోపలి వైపున మెట్లకు ఇరువైపులా రెండు ఏనుగుల విగ్రహాలతో కలిపి రధాన్ని పోలి వుండటం మరో ప్రత్యేకత. ఈ రెండు గజరాజులు  నిర్మాణపు పనులలో పాల్గొని శివుని సేవలో తమ జీవితాలను సార్ధకం చేసుకోన్నగుర్తుగా విగ్రహాలుగా నిలిపారని అంటారు. 


















సువిశాల ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలతొ పాటు ప్రధాన ఆలయం ఒక అద్భుత శిల్ప సంపదను కనుల ముందు నిలబెడుతుంది. యెర్ర ఇసుక రాతి మీద నాటి శిల్పులు చెక్కిన అనేకానేక పెద్ద మరియు చిన్న శిల్పాలు వారి  ప్రతిభా పాటవాలను తర తరాలకు తెలిసేలా చేస్తున్నాయి. ఎన్నో అద్భుత శిల్ప కళా విన్యాసాలను ఇక్కడ వీక్షించే అవకాశం లభిస్తుంది. 













ప్రాంగణం లోని వెలుపలి ప్రదక్షణా పధంలో కుడివైపున సహస్ర లింగం, ఎడమవైపున అవినాశి అప్పార్ సన్నిదులుంటాయి.















ధ్వజస్తంభం, బలి పీఠం మరియు నంది మండపం తో పాటు ప్రాంగణం మధ్యలో చిన్న వేదిక మీద నిర్మించిన చిన్న వినాయక సన్నిధి ప్రత్యేకంగా ఉంటాయి.












ప్రధాన ఆలయ వెలుపలి స్థంభాలకు చెక్కిన చిత్ర విచిత్రమైన జంతువుల శిల్పాలు చూపరులను ఆకట్టుకొంటాయి.












ముఖ్యంగా "ఎలి " అని పిలవబడే సింహము మరియు ఏనుగు రూపాలు కలబోసినట్లుగా ఉండే పురాణ కాలంనాటి మృగం తెరుచుకొన్ననోటిలో తిరిగే బంతిని చెక్కిన తీరు విస్మయపరుస్తుంది. 
అది నోటి లోంచి రాదు. అడ్డంగా చెక్కిన దంతాలు ఆపుతాయి. చేతితో తిప్పవచ్చు. 
అత్యుత్సాహం చూపిస్తున్న సందర్శకుల నుండి కాపాడటానికి ప్రస్తుతం వాటి చుట్టూ ఇనప పంజరాలను ఏర్పాటు చేసారు.  





















ప్రదక్షిణా పధంలో తూర్పు వైపు గోడల పైన పెద్ద నందులను ఏర్పాటు చేస్తున్నారు.












వాహన మండపంలో అనేక రకాల వాహనాలను ఉంచారు. ఉత్సవాల సందర్బంగా రకరకాల వాహన సేవలు నిర్వహిస్తారు. 














లోపలి ప్రవేశిస్తే ఒక అద్భుత శిల్ప ప్రపంచం కనుల ముందు కనపడుతుంది. ముఖ్యంగా చెప్పవలసినవి కొన్ని ఉన్నాయి.ద్వారం వద్ద నుండి గర్భాలయం వరకు ఉన్న మార్గానికి రెండు వైపులా చెక్కిన ఆరు స్తంభాల మీద చెక్కిన రాజు గారి వేట దృశ్యాలు మనోహరంగా ఉంటాయి.
గర్భాలయం ఎదురుగా ఉన్న ఆరో స్తంభం మొదలులో ధనుర్భాణాలు ధరించిన శ్రీ రామచంద్ర రూపాన్నినాలుగో స్థంభం మొదలులో మల్ల యుద్ధం చేస్తున్న వాలి సుగ్రీవుల శిల్పాలను చెక్కారు.రాముని వైపు నుంచి చూస్తే వాలి కనపడతాడు.కానీ వాలి వైపు నుండి రాముడు కనిపించడు. అలాంటిదే మరొకటి నటరాజ మండపం వద్ద కనపడుతుంది. రతీ మన్మధుల విగ్రహాలను  ఆరు అడుగుల దూరంలో రెండు స్థంభాల మీద మలచారు. మన్మధుని కంటి నుండి చూస్తే రతి కనపడుతుంది. కానీ రతి కంటి నుండి చూస్తే మన్మధుడు కనపడడు. ఒక నిర్ణీత స్థలం నుండి చూస్తే ఇద్దరూ మనకి కనపడతారు.
రాముని మూర్తి ఉన్న స్థంభం పైభాగాన నోటిలో తిరిగే రాతి బంతి ఉన్న మూడు ఎలి తలలను నేర్పుగా మలచారు నాటి శిల్పులు .ఇలాంటి మూడు తలల ఎలి మరో ఆలయంలో లేదని చెబుతారు. మార్గానికి ఎడమ వైపున అమ్మవారి, కుడి వైపున శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి ఉంటాయి.












అంతర ప్రదక్షిణ లో ఎన్నో శిల్పాలు కనపడతాయి. అందులో ఏక శిల పైన చెక్కిన ఊర్ధ్వ తాండవ మూర్తి, భిక్షాందార్, దేవి రూపాలు చెప్పుకోదగినవి. గణపతి, భైరవ, దుర్గా, చెండికేశ్వర  సన్నిధి లుంటాయి. ఇక్కడ కూడా నోటిలో బంతి ఉన్న ఎలి చెక్కారు ఒక స్థంభము మీద,కానీ ఈ బంతి తిరగదు. 
గర్భాలయ వెలుపలి గోడల పైన ఎన్నో శాసనాలు కనపడతాయి. గర్భాలయ ద్వారం వద్ద పై కప్పుకు చెక్కిన పద్మం మద్యలో తిరిగే లాగా చెక్కారు. దానికి నాలుగు పక్కలా ఏక రాతితో గొలుసులను చెక్కి వెళ్లాడ తీసారు. లోపల కొద్దిగా పక్కకు ఒరిగి ఉన్న లింగ రూపంలో శ్రీ కైలాస నాథర్ చందన విభూతి లేపనాలతో చక్కని పుష్పాలంకరణతో దర్శనమిస్తారు. గర్భాలయ   ద్వారం పైన సోదరి పార్వతిని కైలాస వాసునికి అప్పగిస్తున్న శ్రీ మహా విష్ణు రూపాలను అద్భుతంగా మలచారు. తమిళంలో ఈ ఘట్టాన్ని "తారై వర్తాల్" అంటారట. అందుకే ఈ క్షేత్రానికి "తార మంగళం" అన్న పేరు. 
మరొక నిర్మాణ కౌశలాన్ని తెలిపే విశేషం ఇక్కడ సంవత్సరానికి ఒక సారి కనపడుతుంది. 
ప్రతి ఏడాది ఫిబ్రవరి నెల ఇరవై ఒకటి నుండి మూడు రోజులు సాయం సంధ్యా సమయంలో అస్తమిస్తున్న సూర్య కిరణాలు గోపురాని కున్న రంధ్రాల గుండా నేరుగా లోపల ఉన్న లింగాన్ని తాకుతాయి. 














అంతరాలయంలో భూగర్భంలో ఆలయ ఆగ్నేయంలో ఉన్న బొటన వేలు పరిమాణంలో ఉండే  పాతాళ లింగం తప్పక చూడాలి. క్రిందకు వెళ్ళే మార్గం మూసి వేయబడి ఉంటుంది. పూజారి గారిని అడిగితే  తెరుస్తారు.  












ఈ ఆలయానికి కొద్ది దూరంలో శ్రీ వరద రాజ స్వామి ఆలయం ఉంటుంది.






తార మంగళం లో మరో విశేషం ఆలయ పుష్కరణి. 
బ్రహ్మ తీర్ధ పుష్కరణి నలువైపులా కలిపి గోడల పైన ముప్పై ఆరు నందులను నిలిపారు. 
గోడలకు మూడు మూడు చొప్పున  అంటే మొత్తం మూడు వందల అరవై అయిదు దీపాలను ఒక్కసారే వెలిగించే ఏర్పాటు చేసారు. 








ఈ అద్భుత ఆలయం సేలం పట్టణానికి సుమారు ఇరవై అయిదు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. సేలం రైల్వే స్టేషన్ నుండి 6 A నంబరు బస్సు నేరుగా తార మంగళం చేరుస్తుంది. బస్సు స్టాండ్ ఎదురుగానే ఆలయం. 


నమః శివాయ !!!!!




Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...