30, ఆగస్టు 2013, శుక్రవారం

Maha Bharath - Characters

                                 అందరూ పూజ్యనీయులే 

                                                                                                              = ఇలపావులూరి వెంకటేశ్వర్లు 
భారత దేశం పుణ్య భూమి. వేద భూమి, దైవ భూమి, కర్మ భూమిగా పేరొందినది. 
వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు పుట్టినదిక్కడే!
అవి భారతీయుల నిత్య జీవితాల మీద తమవైన ముద్ర వేసాయి. 
అందుకే వాటిల్లోని పాత్రలను ఆదర్శంగా ఎంచుకొన్నారు. తమ జీవితాలను వాటికనుగుణంగా మలచుకొని తమదైన  విశ్వాసాలతో, నమ్మకాలతో జీవనం కొనసాగిస్తున్నారు. 
మహా విష్ణువు, సదాశివుడు, బ్రమ్హ దేవుడు, వారి అవతారాలు, మిగిలిన దేవతలు, దిక్పాలకులు, మహర్షులు అందరూ హిందూ మత గ్రంధాలలో ఉన్నవారే!
హిందువుల దైనందిన జీవితాలలో వీరి ప్రాధాన్యత ఎంత ఉన్నదో అందరికి తెలిసిన విషయమే!
పురాణాలలో రామాయణ భారతాల ప్రభావం హిందూ సమాజంమీద చాల శక్తివంతమైనది అని చెప్పవచ్చు. 
ముఖ్యంగా  పంచమ వేదంగా పేరొందిన మహా భారత ప్రభావం భారతీయుల మీద బలంగా కనిపిస్తుంది. 
పద్దెనిమిది పర్వాలతో, లక్షకు పైగా శ్లోకాలతో, కొన్ని వేల పాత్రలతో, వారి మధ్య నెలకొన్న అనేకానేక సంఘటనలతో నిడిన ఈ మహా కావ్యం ఎంతో సందేశాత్మకమైనది. 
హిందువులు అమితంగా గౌరవించే భగవద్గీత మరియు విష్ణు సహస్రనామం ఇందులోనివే !
మహా భారత గొప్పదనాన్ని విజ్ఞులు ఏక వాక్యంతో తెలిపారు. 
" ఇందులో ఉన్నది అన్నింటా ఉన్నది - ఇందులో లేనిది ఎక్కడా లేదు "
ఇంతటి ప్రశంస పొందటానికి కారణం దీనిలోని ప్రతి పాత్రా తనదైన లక్ష్యంతో ( అది చెడ్డదా, మంచిదా అన్నది పట్టించుకోకుండా ) దానిని సాధించే దిశగా విశేష కృషి చేసారని గ్రంధాన్ని చదివితే అవగతమౌతుంది. 
అందువలననే ఈ ఉద్గ్రంధం లోని ప్రతి పాత్ర దేశంలోని  ఏదో ఒక ప్రాంతంలో పూజలందుకొంటోంది. 
దీనికి కారణాలు అనేకం. 
ఆయా పాత్రల వలన ఆ ప్రాంతానికో, వర్గానికో లాభం జరగడం లేదా ఆ పాత్రలోని గుణగణాలు వారిని ప్రభావితం చెయ్యడం లేదా ఆ పాత్రతో భంధుత్వం ఉన్నది అన్న భావనో మరొకటో గానీ అందరూ మంచివి అని ఏక కంఠంతో పొగిడిన వారితో పాటు దుష్ట పాత్రలుగా తీర్మానించబడిన వారికి సంభందించిన ఆలయాలో, చిహ్నాలో, నిర్మాణాలో
ప్రముఖంగా గుర్తింపు పొందడం ఇక్కడ గమనించాల్సిన విషయం. 
మహా భారత గ్రంధాన్ని వేద వ్యాస మహర్షి చెబుతుండగా వినాయకుడు రచించాడని అంటారు. 



ప్రధమ పూజితునిగా పేరొందిన గణపతి ఆలయాలు ప్రతి గ్రామంలో, ప్రతి ఒక్క ఆలయంలో ఉంటాయి.
ఆయనే ప్రధాన అర్చా మూర్తిగా కొలువైన ఆలయాలెన్నో దేశవ్యాప్తంగా నెలకొల్పబడి ఉన్నాయి. కాణిపాకం, అయినవిల్లి, పంపా గణపతి, పలవంగాడు మహా గణపతి, కేరళ పుర  యిలా ఎన్నో క్షేత్రాలలో కొలువు తీరి కొలిచిన వారిని కాపాడుతున్నాడు పార్వతీ నందనుడు.
సకల విఘ్నాలను తొలగించి, సర్వ విద్యలను ప్రసాదించే విఘ్న నాయకుడు ఇతడు.
ఘంటం ఆపకుండా మహా భారాతాన్ని రచించిన ఆది రచయిత.   



ఆశువుగా మహా కావ్యాన్ని చెప్పిన వ్యాస భగవానుని సాక్షాత్ మహా విష్ణు అవతారమని పేర్కొంటారు. 
ఈయన మహా భారతం రచించారని తెలిపే క్షేత్రాలు రెండు ఉన్నాయి. 
మొదటిది ఉత్తరా ఖండ్ రాష్ట్రంలోని బదరీ నాథ్ కి దగ్గరలో సరస్వతీ నదీ తీరంలోని  మన గ్రామంలో ఉన్న వ్యాస గుహలోనే పురాణ రచన జరిగిందని స్థానిక నమ్మకం. దీనికి ఉదాహరణగా గుహలో పుస్తకాలలోని పుటల మాదిరి కనిపించే శిలలను చూపుతారు. వీటిని వ్యాస పుస్తకం అని పిలుస్తారు. 
ఇక్కడికి సమీపంలోనే గణేష గుహ కూడా ఉన్నది. 
రెండవది మన రాష్ట్రంలో ముగురమ్మల రూపం అయిన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి కొలువైన బాసర. 
బ్రహ్మాండ పురాణం ప్రకారం వ్యాసుడు ఇక్కడ గోదావరీ తీరంలో ఇసుకతో అమ్మవారిని ప్రతిష్టించి సమీపంలోని గుహలో భారత రచన చేసాడని తెలుస్తోంది. 
ఇక్కడీయనకొక ఆలయం ఉన్నది. 
నిత్య పూజలు జరుగుతాయి. 

వ్యాస మహర్షి మహా భారత సృష్టి కర్త కాగా కురు పాండవుల మూల పురుషుడు శంతను మహారాజు. 
శంతనునికి ప్రత్యేకంగా గుడి లేక పోయినా మథుర పట్టణానికి మూడు కిలోమీటర్ల దూరంలో గోవర్ధనగిరికి వెళ్ళే మార్గంలో ఉన్నది శంతన కుండ్. ఇక్కడే శంతనుడు సత్యవతిని చూసాడని, ఆమెను వివాహం చేసుకోన్నాక వంశాన్ని నిలిపే సుపుత్రుడు జన్మించాలని తపస్సు చేసాడని చెబుతారు . 
ఈ గుండం మధ్యలో ఉన్న చిన్న మందిరంలో "శ్రీ శంతను బీహర్జి" కొలువై ఉంటారు. సంతానాన్ని కోరుకొనే ఆడవారు ఈ గుండంలో స్నానమాచరించి శంతను బిహర్జి ని నియమంగా సేవిస్తే కోరిక నెరవేరుతుంది అన్నది తరతరాల విశ్వాసం. 
మథురకు ప్రక్కనే ఉన్న బృందావనం దగ్గరలో "పసోలి" అనే చోట మానస కుండ్ ఉన్నది. అక్కడ శంతను మహారాజు కుమారుడైన విచిత్ర వీర్యుడు తన తల్లి సత్యవతి మరియు అన్న భీష్ముని సంభందాన్ని శంకించినందుకు పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తంగా తపస్సు చేసాడని తెలుస్తోంది. 
ఒకప్పుడు చాలా పెద్దదైన గుండం ఇప్పుడు పూర్తిగా కనుమరుగై పోయినట్లు, తిరిగి పునరుద్దరించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. 

శంతనుడు కురు వంశానికి మూల పురుషుడు కాగా గంగా దేవి ఆ వంశానికి ఒక ఆదర్శ వీరుని ఇచ్చినది. 
అలాంటి గంగా దేవికి హరిద్వార్ చుట్టు ప్రక్కల చిన్నా పెద్ద మందిరాలు చాల ఉన్నాయి. 
కానీ రాజస్తాన్ లోని భరతపూర్ లో గంగ దేవికి అద్భుతమైన మందిరం ఉన్నది.  మహా రాజా బల్వంత్ సింగ్ సంతానం కొరకు గంగా మాతను ప్రార్ధించారు. వారసుడు జన్మించడంతో 1845 వ సంవత్సరంలో ఈ ఆలయ నిర్మాణం ప్రారంభించారు. వివిధ కారణాల వలన నిర్మాణ పనులు తొంభై ఒక్క సంవత్సరాలు కొనసాగింది. బల్వంత్ సింగ్ వంశంలో అయిదో తరం వాడైన బ్రిజేంద్ర సింగ్ అధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. చూడ చక్కని శిల్పాలతో సుందర గంగా మాత విగ్రహం, ఆమె వాహనం అయిన  అతి పెద్ద మొసలి విగ్రహం  ఇక్కడి ప్రధాన ఆకర్షణ. 

గంగా దేవికి, శంతను మహారాజుకి జన్మించినవాడే కురుకుల పితామహుడు భీష్ముడు. ఆయన అసలు పేరు దేవవ్రతుడు. కన్న తండ్రి కోరిక నెరవేర్చడానికి అనితర సాధ్యమైన ప్రతిజ్ణ చేసి భీష్మ అన్న బిరుదు  పొందారు. 
వార ణాసి ( కాశి  ) లో గంగ వడ్డున ఒక భీష్మ మందిరం ఉన్నది. భక్తులు దీర్గాయుషు కోరుతూ ఇక్కడ పూజలు చేస్తారు. 
హర్యానాలోని కురుక్షేత్రంలో నాగవాసుకి మందిర ప్రధాన ద్వారం వద్ద 1961వ సంవత్సరంలో శయన భీష్ముని మందిరాన్ని నిర్మించారు. 
మహాభారత యుద్ధం జరిగిన ఇదే కురుక్షేత్రం కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తనేసర్ లో అంప శయ్య మీద ఉన్న తాత దాహం తీర్చడానికి అర్జనుడు తన బాణంతో తెప్పించిన పాతాళ  గంగతో ఏర్పడిన భీష్మ కుండ్ ఉన్నది. 
ఈ స్థలంలోనే ధర్మరాజు అడిగిన సందేహాలకు సమాధానంగా భీష్ముడు శ్రీ విష్ణు సహస్ర నామ విశిష్టత తెలిపినదిక్కడే!
ఈ తటాకం  చుట్టు ప్రక్కల ఎన్నో మందిరాలుంటాయి. 

భీష్మ పితామహుని తరువాత మహా భారతంలో చెప్పుకోదగ్గ పాత్ర శ్రీ దూర్వాస మహామునిది. ఈ స్వామి ఉపదేశించిన మంత్రం మూలానే కుంతి దేవి వివాహానికి ముందే సూర్య వర ప్రసాదిగా కర్ణుని, వివాహానంతరం భర్త అనుమతితో పంచ పాండవులను పుత్రులుగా పొందినది. 
   ఒక్క మహా భారతమే కాదు అన్ని పురాణాలలో తనదైన పాత్ర పోషించారు ఈ మహర్షి. 
ముక్కోపానికి మారుపేరైన ఈయన ఈశ్వరుని అంశతో అత్రి మహా ముని అనసూయ దంపతులకు జన్మించారు. 
ఉత్తర ప్రదేశ్ లోని అజమ్ ఘర్ జిల్లా ఫుల్పూర్ లో టాన్స్ మరియు మజ్హుహూ నదుల సంగమ క్షేత్రంలో పురాణ కాలంలో దూర్వాసుని ఆశ్రమం ఉండేదట. ఎందరో విద్యార్ధులు ఇక్కడ విద్య నేర్చుకోవడానికి వచ్చేవారట. 
ప్రసిద్ద శైవ క్షేత్రం అయిన తిరువన్నమలై లో గిరి ప్రదక్షిణ చేసే క్రమంలో వచ్చే సోన తీర్థం దగ్గరలో దూర్వాస మునికొక ఆలయం ఉన్నది. పౌర్ణమినాడు ఎందరో భక్తులు ముఖ్యంగా సంతానం కోరుకొనేవారు, సొంత ఇంటి కల నిజం చేసుకోవాలనుకొనేవారు ఎక్కువగా వస్తారు. సంతానం కోరుకొనేవారు విగ్రహం వెనుక ఉన్న వేప చెట్టుకు పచ్చని తోరణం కట్టి మూడు నేతి దీపాలను వెలిగిస్తే సత్సంతానం కలుగుతుంది అన్నది స్థానిక నమ్మకం. అలానే సొంత ఇల్లు కట్టుకోవాలనుకునేవారు నాలుగు రాళ్ళను నలు పక్కలా పేర్చి మద్యలో దీపం వెలిగిస్తే వారి కల నెరవేరుతుందని చెబుతారు. 

కురు కుమారుల తల్లి తండ్రులైన ద్రుత రాష్ట్ర , గాంధారి దేవి దంపతులలో గాంధారి దేవికి ప్రత్యేక ఆలయాల రాష్ట్రం అయిన కేరళ రాజధాని తిరువనంతపురం రైల్వే స్టేషన్ కి రెండు కిలోమీటర్ల దూరంలో స్టాట్యూ సర్కిల్ దగ్గరలో ఉన్నది. మే నెలలో వచ్చే చైత్ర పౌర్ణమి నాడు పెద్ద ఉత్సవం జరుగుతుంది.
ద్రుత రాష్ట్ర మహా రాజుకు మన దేశంలో ఎక్కడా ఆలయం లేదు. కానీ ఒక చిత్రమైన విషయం తెలిసింది.
బౌద్ద మతం ప్రకారం ద్రుత రాష్ట్రుడు ఒక దిక్పాలకుడు.ఈయన తూర్పు దిక్కును, వాయువును శాసించే వాడని తెలుస్తోంది.చైనా లోని అతి పెద్ద బౌద్ద ఆరామాలలో ఒకటి అయిన లింగ్ యిన్ ఆరామంలోని దర్బార్ హాల్లో ( దీనినే వారు హాల్ ఆఫ్ హెవెన్లీ కింగ్స్ అంటారు ) "పిప" అనే ప్రత్యేక వాయిద్యం పట్టుకొన్నచిత్రమైన ధృతరాష్ట్ర చిత్రపటం ఉన్నది. ఈయనకు మహా భారత ద్రుతరాస్ట్రునికి సంభంధం లేక పోయినా పేర్లు ఒకటి అయినందున యిది ఉదహరించడం జరిగింది.
 పాండు నందనులుగా పేరొందిన పాండవుల తండ్రి పాండు రాజుకు ఎక్కడా ఆలయం లేదు.కాని సిక్కులకు పవిత్ర దర్శనీయ క్షేత్రం అయిన హేమకుండ్ సాహిబ్, (ఉత్తరా ఖండ్ )లో కొంత కాలం పాండు  రాజు తపస్సు చేసాడని, యోగ విద్య అభ్యసించారని తెలుస్తోంది.అలానే  కేరళ లోని చెంగనూర్ సమీపంలోని తిరు క్కోడి త్తానం అన్న ఊరిలో పాండు రాజు మరణించారని, అక్కడే ఆయనతో పాటు ఆయన చిన్న భార్య అయిన మాద్రి సహగమనం చేసారని అంటారు. ఈ సంఘటనకు నిదర్శనంగా ప్రతి సంవత్సరం నవంబర్ లో జరిగే ఆలయ ప్రధాన ఉత్సవాలలో ఒక రోజున దీప ఉత్సవం జరుపుతారు.ఆ సందర్భంగా మాద్రి చేసిన సహగమనాన్నితమదైన శైలిలో ప్రదర్శిస్తారు.ఈ ఆలయాన్ని సహదేవుడు నిర్మించాడన్నది పురాణ గాధ. తప్పక దర్శనీయ ఆలయం.ఎన్నో అరుదైన శిల్పాలు, చిత్రాలు, వివిధ రాజ వంశాల శాసనాలు ఉన్నాయిక్కడ.

పాండు రాజు సతీమణి కుంతీ దేవికి గుజరాత్ రాష్ట్రంలో చాలా ఆలయాలున్నాయి. వీటిల్లో అత్యంత పురాతనమైనది అహ్మదా బాద్ కి రెండు వందల కిలో మీటర్ల దూరంలోని "దేదియా పర" లో ఉన్నది. స్థానికులు "దేవి మొగ్రా మందిరం"గా పిలిచే ఈ ఆలయం ఆరువేల సంవత్సరాల చరిత్ర కలిగిఉన్నదని , వాయుసుతుడైన భీముడికి రాక్షస యువతి హిడింబ తో వివాహం జరిగినదిక్కడే అని తెలిపే ఎన్నో గాధలు ప్రచారంలో ఉన్నాయి. 

దుర్వాస మహా ముని ఉపదేశించిన మంత్రం ప్రభావంతో కుంతీ దేవికి తమ అంశలతో సంతానాన్ని ప్రసాదించిన వారు సూర్య భగవానుడు , యముడు, ఇంద్రుడు, వాయువు, అశ్వనీ దేవతలు. వీరిలో ఇద్దరికీ  మన దేశంలో ఆలయాలు ఉన్నాయి. మిగిలిన వారికి వారికంటూ విడిగా ఆలయాలు లేకున్నా వారితో  ముడిపడి ఉన్న దేవాలయాలు కొన్నిఉన్నాయి. 
ప్రత్యక్ష నారాయణుడు, లోకానికి వెలుగును ప్రసాదించే శ్రీ సూర్యనారాయణ స్వామికి దేశంలో చాలా ప్రదేశాలలో ఆలయాలున్నాయి. మన రాష్ట్రంలో అయిదు సూర్య దేవాలయాలున్నాయి. 
అరసవిల్లి, గొల్లల మామిడాడ, నంది కొట్కూరు, బూదగవి మరియు హైదరాబాద్. 
శ్రీ సూర్యనారాయణ స్వామి వర ప్రసాదిగా కర్ణుడు, కుంతీ దేవికి వివాహానికి ముందే జన్మించాడు. 


అరసవిల్లి 

నందికోట్కూరు 

వివాహానంతరం భర్త ఆజ్ఞ మేరకు యమ ధర్మ రాజును ఆరాధించి యుధిష్టరునికి జన్మనిచ్చినది. యమునికి తమిళ నాడు లోని తంజావూరు కి సమీపంలోని తిరు చిత్రాంబలంలో ఒక విశేష ఆలయం ఉన్నది. 
ఇక్కడ శివుని కోపాగ్నికి భస్మమైన మన్మధుడు పునర్జీవితుడైనాడట. 
ఆషాడ మాసంలో, మాఘ మాసంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి దీర్గాయువు కొరకు  యమ ధర్మ రాజుని ప్రార్ధిస్తారు. 

కుంతీ దేవికి భీమ సేనుకని అనుగ్రహించిన వాయు దేవునికి,అర్జనుని ప్రసాదించిన దేవేంద్రునికి ప్రత్యేకంగా ఆలయాలు లేకున్నా శ్రీ కాళహస్తి లోని శ్రీ కాళ హస్తీశ్వర స్వామి ఆలయం , గురువాయూర్ శ్రీ కృష్ణ ఆలయం వాయు దేవునితో, తమిళ నాడులోని అనేక ప్రముఖ ఆలయాలు ఇంద్రునితోనూ ముడిపడి ఉన్నాయి. 
అలాగే నకుల, సహదేవుల జన్మకు కారకులైన అశ్వనీ దేవతలకు  ఎక్కడా ఆలయాలు లేవు. 
కురు పాండవులకు చిన్నాన్న వరసయ్యే విదురునికి ఆలయాలు లేక పోయినా "విదురాశ్వద్ద" అనే పేరుతొ కర్నాటక రాష్ట్రం చిక్ బల్లారపూర్ జిల్లా గౌరిబిదనూర్ తాలూకాలో ఉన్నది. ఈ ఊరిలో విదురుడు నాటాడని చెప్పే అశ్వద్ద వృక్షం ఉంటుంది. భక్తులు సంతానం కొరకు ఇక్కడకు వచ్చి అశ్వద్ద వృక్షానికి, నాగ దేవతకి ప్రదక్షిణాలు చేస్తారు. ఈ పురాణ క్షేత్రం మన రాష్ట్రం లోని హిందూపూర్ ( అనంతపురం జిల్లా ) కి పదిహేను కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. 

ద్రోణాచార్య కురు,పాండవులకు విద్య నేర్పిన గురువు. 
మన దేశ రాజధాని ఢిల్లీకి చేరువలో ఉన్న గురుగావ్ ద్రోణా చార్యుని జన్మస్థలమని, ఆయన పేరు మీదగానే ఈ  పేరోచ్చినది అంటారు. అలానే ఢిల్లీ కి యాబై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ బుద్ధా జిల్లాలోని "దాన్కుర్" గ్రామంలో కురు పాండవులకు విద్య నేర్పారట. అప్పట్లో ఈ ప్రాంతాన్ని ద్రోణాచార్య నగరం అని పిలిచేవారట. ఇక్కడి ఆలయంలో ఏకలవ్యుడు తయారు చేసుకొన్నద్రోణుని విగ్రహాన్ని నేటికీ చూడవచ్చును. 
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రడూన్ కి దగ్గరలోని "శాస్త్ర ధర్" ఊరిలోని శివ లింగాన్ని గురు దేవుడే ప్రతిష్టిం చాడని, ఇదే రాష్ట్రంలోని కాశీ పూర్ ని పాండవులు గురు దక్షిణగా నిర్మించి ద్రోణునికి సమర్పించుకోన్నారని తెలుస్తోంది. అదే విధంగా ద్రోణునికి శిష్యుడు కాని శిష్యుడైన ఏకలవ్యునికి గురుగావ్ ముప్పై ఏడవ సెక్టార్ లోని ఫారుఖ్ నగరులో ఒక ఆలయమున్నది. 
ద్రోణుని భార్య అయిన కృపి కి ఒక విశిష్ట ఆలయం గురుగావ్ లోనే ఉన్నది. భక్తులు "శీతలా దేవి"గా పిలుస్తూ ఆరోగ్య ప్రదాయనిగా కొలుస్తారు. ప్రతి నిత్యం వేలాది భక్తులతో కళ కళ లాడే ఈ దేవాలయం చైత్ర, శ్రావణ మాసాలలో లక్షలాది భక్తులతో కిట కిట లాడుతుంది. ఈ ఆలయం ఐదు వేల సంవత్సరాల చరిత్రకలిగినదిగా పేర్కొంటారు. 
  ఈమె సోదరుడు, కురు పాండవులకు మరో గురువు అయిన కృపా చార్యునకు ఆలయం లేకున్నా కడప నగరంలోని తిరుపతికి గడప అని పేర్కొనే దేవుని కడప లోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కృపుడే ప్రతిష్టించారని ఒక గాధ ప్రచారంలో ఉన్నది. 

ద్రోణుని కుమారుడు, సప్త చిరంజీవులలో ఒకరైన అశ్వద్దామ కు ఒక ఆలయం కర్ణాటకలోని బెల్గావ్ నగరంలో ఉన్నది. సంవత్సరంలో ఒక్క సారికూడా సామాన్యులు ఆలయంలోనికి వెళ్ళే ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే పసి వారైన ఉప పాండవులను రాత్రి పూట అధర్మంగా సంహరించినవానిని దర్శించుకుంటే అశుభం అని భావించడమే దీనికి కారణం. కానీ హోలీ పండుగ మరునాడు వేలాదిగా భక్తులు ఆలయం చుట్టూ పొర్లు దండాలు పెట్టి, లోపలికి వెళ్లి దర్శనం చేసుకొంటారు.ఈ చిత్రమైన ఆచారానికి తగిన ఆధారం ఏమిటి అన్నది తెలియడంలేదు. 
మన రాష్ట్రంలోని నెల్లూరుకు సమీపలోని నారసింహ క్షేత్రం అయిన నరసింహ కొండ మీద ఉన్న గుహలలోఅశ్వద్దామ తపస్సు చేసాడని అంటారు. 
ఇక మహా భారత విజేతలైన పంచ పాండవుల విషయానికి వస్తే అగ్రజుడైన యుదిష్టునికి ద్రౌపది దేవితో కలిసి కొలువై ఉన్న ఆలయాలు మన రాష్ట్రంలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలో చాలా ఉన్నాయి. నెల్లూరు పట్టణం మూలపేటలో పురాతనమైన  శ్రీ కృష్ణ ధర్మ రాజ స్వామి ఆలయం ఉన్నది. అదే విధంగా గూడూరు, శ్రీ కాళ హస్తి, చిత్తూరు పట్టణాలలో శ్రీ ద్రౌపది సమేత శ్రీ ధర్మరాజ ఆలయాలున్నాయి. తమిళ నాడులో ద్రౌపది అమ్మన్ ఆలయాలు చాలా ఉన్నాయి. 
బెంగళూరు నగరంలో "నాగరత్"లో ఉన్న ధర్మరాజ ఆలయం చాలా ప్రసిద్ది చెందినది. ప్రతి ఏడాది మార్చి నెలలో "కరగ" ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. వేలాది భక్తులు పాల్గొంటారు. 

పాండవులలో రెండవ వాడైన భీమ సేనునికి కర్నాటక రాష్ట్రం, కోలార్ జిల్లా మోతకపల్లి గ్రామంలో మోదక వృక్షం క్రింద ఒక ఆలయం ఉన్నది.  కోరిన కోర్కెలు తీర్చేవానిగా, ప్రయాణాలలో ఆటంకాలు, ప్రమాదాలు రాకుండా కాపాడే వానిగా శ్రీ బాల భీమ స్వామి ప్రసిద్ది. 
భీమ సేనునికి అత్యంత పురాతనమైన ఆలయం ఒకటి హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఛండీ ఘర్ , సిమ్లా జాతీయ రహదారిలోవచ్చే "పింజోర్" గ్రామంలోని ఆలయాన్ని 606 వ సంవత్సరంలో "సిర్కా రామదేవ మహారాజు" నిర్మించారు. చాలాకాలం అజ్ఞాతంలో ఉండి 1974 వ సంవత్సరంలో వెలుగులోకి వచ్చిన ఈ ఆలయం అద్భుత శిల్పాలకు నిలయం. భీమసేనునికి మన పొరుగు దేశం అయిన నేపాల్లో కూడా ఆలయాలు ఉన్నాయి. ఆయనను వ్యాపార అభివృద్ధికి సహాయపడేవానిగా ఆరాధిస్తారు. 
పాండవ మధ్యముడైన అర్జనునకు భారత దేశంలో ఆలయాలు లేవు. ఇండోనేషియా దేశంలోని జావా లో ఉన్న దేయింగ్ ప్లాటో అనే శివాలయాన్ని అర్జున ఆలయం అని పిలుస్తారు. 809 వ సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఆలయం ఇండోనేషియాలో అతి పురాతన హిందూ ఆలయంగా పేరొందినది. అదే విధంగా కేరళలోని చాలా విష్ణు ఆలాయాల నిర్మాణం వెనుక అర్జనుడున్నాడని అక్కడి పురాణ గాధలు తెలియజేస్తున్నాయి. 

పంచ పాండవులలో ఆఖరి వారైన నకుల సహదేవులకు కూడా ఎక్కడా ఆలయాలు లేవు. కానీ కేరళలోని తిరువిత్తకోడ్, తిరుక్కోడిత్తనం, తిరువంవండూరు క్షేత్రాలలోని శ్రీ మహా విష్ణు ఆలయాలను వీరు నిర్మించినట్లుగా స్థల పురాణాలు తెలుపుతున్నాయి. ఇక పంచపాండవులతో ముడిపడి ఉన్న చారిత్రాత్మక నిర్మాణాలను మహా బలిపురంలో వీక్షించవచ్చును. 

కౌరవుల విషయానికి వస్తే అగ్రజుడు రారాజు దుర్యోధనునికి ఉత్తరా ఖండ్ రాష్ట్రంలో "మోరి, దివోర, ఓస్ల, గంగార్, దత్మీర్" లాంటి గ్రామాలలో ఆలయాలున్నాయి. 
ఇక్కడొక విశేషం ఉన్నది. హిమాచల్ ప్రదేశ్ లోని "ఘర్వాల్,కిన్నారు,కులు" ప్రాంతంలో పాండవులు పూజనీయులు. ఉత్తరా ఖండ్ లోని తమస్ నది పరివాహక ప్రాంతంలో కౌరవులు పూజ్యనీయులు. అసలు దుర్యోధనుని మరణ వార్త తెలిసి రొదించినవారి కన్నీటితో ఏర్పడినదే తమస్ నది అని ఒక నమ్మకం. అందుకే ఈ నది నీటిని తాగారు. 
మోరి గ్రామంలోని దుర్యోధన ఆలయం . 
కురు సార్వభౌమునికి కేరళలోని కొల్లం జిల్లా పొరువలి గ్రామంలో ఒక ప్రత్యేక ఆలయం ఉన్నది. 
పోరువాలి పెరువురితి మలనాడ దుర్యోధన క్షేత్రం 
ఇక్కడ నివసించే కురువ వంశం వారి కుల దైవం దుర్యోధనుడు.ఉత్తరాదిలోగాని,దక్షినాదిలోగాని దుర్యోధనుని  ఆలయాలలోఎలాంటి విగ్రహము ఉండదు.గద్దె లాంటి పీఠాన్ని పూజిస్తారు.పొరువలి పెరువురతి మలనాడ క్షేత్రంలో కూడా గద్దెకే ప్రత్యేకమైన పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తారు.పొగాకు, కొబ్బరి కల్లు లాంటి నివేదనలు సమర్పించుకొంటారు. కోడి పుంజులను కానుకగా యిస్తారు.  ఇక్కడికి సమీపంలోనే మాయా జూద నిపుణుడు, కురు వంశ నాశనానికి కారకుడైన శకుని ఆలయం కూడా కలదు. ప్రపంచం మొత్తంలో శకునికి ఉన్న ఒకే ఒక్క ఆలయమిది. పీఠం మీద కొలువుతీరి సేవకుల నీరాజనాలందుకొంటున్న గాంధార రాజ పుత్రుని వైభవం చూడాల్సినదే !

సూర్య పుత్రుడు, అడిగిన వారికి లేదని చెప్పని దానశీలి అయిన కర్ణునికి ఉత్తరాఖండ్ లో పెక్కు ఆలయాలున్నాయి. 
కర్ణ ప్రయాగ, దియోరా , నెట్వర్ అనే చోట్ల కర్ణుడు పూజ్యనీయుడు. 


ధుశ్యాసనునికి, మిగిలిన కౌరవులకు ఆలయాలు లేవు. 
బీమసేనుని వివాహమాడిన రాక్షస కన్య హిడింబికి హిమాచల్ ప్రదేశ్ లోని మనాలికి సమీపంలో ఒక ఆలయం ఉన్నది. 
హిడింబ దేవి ఆలయం 

ఇక్కడికి దగ్గరలోనే ఆమె కుమారుడైన ఘటోత్కచునికి  ఒక ఆలయం ఉన్నది. ఘటోత్కచునికి యాదవ రాజ కుమార్తె అయిన "ఆహిలావతి"కి జన్మించినవాడు "బర్బరీకుడు" (బారబరిక).  మహా యోధుడు. శ్రీ కృష్ణుని మాయ చేత కురుక్షేత్ర యుద్దానికి ముందే ప్రాణ త్యాగం చేసిన త్యాగశీలి. ఈయనను "ఖటు శ్యాం జీ" అని కృష్ణుని పేరుతోనే పిలుస్తూ ఆరాధిస్తారు. రాజస్తాన్ లోని శిఖర్ జిల్లా ఖటు గ్రామంలో వెయ్యి సంవత్సరాల క్రిందట నిర్మించబడిన సుందర ఖటు శ్యాంజీ ఆలయం ఉన్నది. మరో ఆలయం గుజరాత్ లోని సూరత్ లో ఉన్నది. 

బర్బరీకుని లాంటి కధే అర్జునునికి నాగ కన్య ఉలూచికి జన్మించిన "ఇరవన్" ది కూడా ! 
ఇతను కూడా మహా యోధుడు. వీరిద్దరి ప్రాణ త్యాగం వెనుక వున్నకధలలోఎన్నో సారూప్యాలున్నాయి. బారబరిక శ్రీ కృష్ణ నామాన్ని కోరుకోగా, ఇరవన్ నీల మేఘ శ్యామునినే భర్తగా వాంచింఛాదు. ఇరవన్ కూడా బారబరిక మాదిరి 
శ్రీ కృష్ణుని మాయ చేత యుద్దానికి ముందే బలిదానం చేసాడు. కాకపొతే ఇతని కోర్కె మేరకు శ్రీ కృష్ణుడు,మోహిని అవతారం ధరించి అతనిని వివాహం చేసుకొని ఆ రాత్రి గడిపారట. తొమ్మిదో శతాబ్దములో రచించిన తమిళ మహా భారతం ప్రకారం జరిగిన కధ ఇది. ఈయనకు తమిళ నాడులో ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అన్నింటి లోనికి విల్లుపురం జిల్లాలో ఉన్న "కూవగం" ఆలయం ముఖ్యమైనది. ప్రతి సంవత్సరం చైత్ర మాసం ( ఏప్రిల్- మే ) లో  పదిహేను రోజుల పాటు జరిగే ఉత్సవంలో వేలాది మంది కొజ్జాలు పాల్గొంటారు. వారు తమని తాము మోహిని అవతారంగా భావించుకొంటూ, ఇరవన్ ( స్థానికంగా కూతండవర్ అంటారు )ని వివాహమాడి, మరునాడు అతని మరణానికి దుఖాన్ని అనుభవించి, వైధవ్యాన్ని స్వీకరిస్తారు.దేశంలోనే హింజ్రాలు పాల్గొనే అతి పెద్ద ఉత్సవం యిది. 
బారబరిక విషయంలో లాగానే ఇరవన్ తల భాగాన్నే పూజిస్తారు. 
తమిళ నాడు లోని ప్రతి ద్రౌపది దేవి ఆలయంలో తప్పనిసరిగా కూతండవర్ ఉప ఆలయంలో కొలువుతీరి ఉంటాడు. 
ఇవే కాకుండా మహా భారత పాత్రధారులతో ముడిపడివున్న పర్యాటక స్థలాలు కొన్ని ఉన్నాయి. 
తమిళ నాడు లోని ధర్మపురి నుండి పళని వెళ్ళే మార్గంలో వెయ్యి సంవత్సరాల పురాతన శ్రీ వాగీశ్వర స్వామి ఆలయం ఉన్న కీరనూర్ అప్పట్లో విరాట్ నగరమని, భీముడు కీచకుని సంహరించినదిక్కడే అని ఒక గాధ ప్రచారంలో ఉన్నది. మరికొన్ని ఆధారాల ప్రకారం మన రాష్ట్రం ఖమ్మం జిల్లా లోని నేలకొండ పల్లినే నాటి విరాట్ నగరంగా పేర్కొంటారు.  తవ్వకాలలో విరాట రాజు దిబ్బ, కీచక గుండం బయట పడినాయి.  
భీమ జరాసంధుల యుద్ధం జరిగిందని తెలిపే "జరాసంధ అఖర" నలందా జిల్లా ( బీహార్ ) లోని రాజగిరి లో ఉన్నది అని తెలుస్తోంది.  
  ఇలా ఎన్నో మహా భారత పాత్రలు అనేక ప్రాంతాలలో పూజ్యనీయులుగా నీరాజనాలందుకొంటున్నారు.
యత్ భావమ్ తత్ భవతి!
అసలు సూత్రధారి అయిన శ్రీ కృష్ణునికి దేశంలో ఎన్నో ఆలయాలున్నాయి. ఉడిపి, గురవాయూర్, ద్వారక, పూరి లాంటి ఎన్నో క్షేత్రాలలో నటన సూత్రధారి స్థిర నివాసమేర్పరచుకొని ఉన్నారన్నది నమ్మిన భక్తుల స్వానుభవం.
కురుక్షేత్ర యుద్దారంభంలో అర్జనునికి ఉపదేశించిన భగవద్గీత హిందువులందరికీ నిత్య పారాయణ గ్రంధం.
శ్రీ విష్ణు సహస్ర నామం మోక్షప్రదాయకం అన్నది శ్రీ షిర్డీ సాయి బాబా లాంటి అవతార పురుషుల వాక్యం.
శ్రీ విష్ణు అన్న నామానికి అర్ధం సర్వాంతర్యామి.



25, ఆగస్టు 2013, ఆదివారం

perunad ( RANNY )


కార్తీక మాసం నుండి మన రాష్ట్ర నలుమూలల, గ్రామ గ్రామాన మాల ధరించిన అయ్యప్ప భక్తులు కనిపిస్తారు.
నలభై ఒక్క రోజుల దీక్ష పూర్తి చేసుకొని ఇరుముడి ధరించి పుణ్య క్షేత్ర దర్శనం చేసుకొంటూ శబరిమల చేరుకొంటారు.
పరశు రామ భూమి అయిన కేరళలో ఆయనే ప్రతిష్టించిన నూట ఎనిమిది శ్రీ ధర్మ శాస్త ఆలయాలున్నాయి.
అవన్నీ యుగయుగాల పౌరాణిక గాధలకు, శతాబ్దాల చరిత్రకు ప్రత్యక్ష సాక్ష్యాలు.
కానీ వాటికి దక్కని ఒక గొప్ప గౌరవం పదో శతాబ్దంలో నిర్మించిన ఒక ఆలయానికి దక్కటం విశేషం.
అదే కక్కట్టు కోయిక్కాల్ శ్రీ ధర్మశాస్తా ఆలయం.




ఈ ఆలయము శబరిమల ఆలయం తో పాటు ఒకేసారి నిర్మించబడినది. 
దీనికి సంభందించిన గాద పదో శతాబ్దానికి చెందినదిగా తెలుస్తోంది. 
మహిషి సంహారం తరువాత శ్రీ అయ్యప్ప శబరిమల మూలవిరాట్టులో  ఐక్యం అయిన తరువాత ఆయన ఆనతి మేరకు పందల రాజు శబరిమల ఆలయ నిర్మాణం ఆరంభించారు. 
నిర్మాణ సమయంలో రాజు ఇక్కడే బస చేసారట. గ్రామ ప్రజలందరూ నిర్మాణపు పనులలో పాలుపంచుకొన్నారు. వారందరికీ నాయకులుగా శివ వెళ్లల కులానికి చెందిన పిళ్ళై సోదరులు వ్యవహరించారు. 
వారి దైవ భక్తికి, సహాయ సహకారాలకు సంతోషించిన రాజు వారి కోరిక మేరకు శబరిమల ఆలయ నిర్మాణంలో మిగిలిన సామానులతో ఇక్కడ శ్రీ ధర్మశాస్త కు, కొద్ది దూరంలో శ్రీ మాలికా పురతమ్మ అమ్మవారికి విడివిడిగా ఆలయాలు నిర్మించి వారికి అప్పగించారు. 
సోదరులలో పెద్ద వాడు ఇక్కడే స్థిర పడగా రెండో వాడు ఎరుమేలి తరలిపోయాడు. అక్కడి పూతన్ వీడు లో ఉన్న శ్రీ అయ్యప్ప కరవాలాన్ని సంరక్షించే పనిలో ఉండిపోయాడు. నేటికి అది వీరి వంశం ఆధీనంలోనే ఉన్నది. 
గ్రామంలో స్థిరపడిన పెద్ద వాడి వారసులు ఇక్కడి ఆలయ నిర్వహణ చేస్తున్నారు. 
పెరునాద్ ( PERUNAD ) గ్రామ కేంద్రానికి మూడు కిలో మీటర్ల దూరంలో పంబా, కక్కాద్ నదుల సంగమ తీరంలో, ప్రశాంత ప్రకృతికి ప్రతి రూపాలుగా ఈ రెండు ఆలయాలు ఉంటాయి. 
రహదారికి కొద్దిగా పల్లపు స్థలంలో ఉంటుంది స్వామి ఆలయం. 
పైన నిర్మించిన స్వాగత ద్వారం దాటిన తరువాత దిగువన విశాల ప్రాంగణంలో ఆలయ సముదాయం కనపడుతుంది. 
తూర్పు ముఖంగా ఉన్న ప్రాంగంలోనికి ఉత్తరంలో ఉన్న మార్గంగుండా వెళితే కేరళ సాంప్రదాయ నిర్మాణాలు చాలా ఉంటాయి. ఒక దానిలో ఆలయ కార్యక్రమ నిర్వాహణా కేంద్రం ఉన్నది. 
పక్కనే ఎతైన మండపం, ప్రక్కనే ధ్వజస్తంభం, బలి పీఠం తరువాత ప్రధాన ఆలయంలోనికి వెళ్ళడానికి ద్వారం ఉంటాయి. 
రాతితో నిర్మించిన చతురస్రాకార గర్భాలయంలో శ్రీ ధర్మ శాస్తా రమణీయ చందన, పుష్పఅలంకరణతో నేత్ర పర్వంగా భక్తులకు దర్శనమిస్తారు. 
ప్రతి నిత్యం ఉదయం ఐదున్నరకు తెరచి మధ్యాహాన్నం పన్నెండు గంటల దాక తిరిగి సాయంత్రం ఐదున్నర నుండి రాత్రి తొమిదిన్నర వరకూ తెరిచివుండే ఈ ఆలయంలో నియమంగా పూజలు, ఆర్జిత సేవలు జరుగుతాయి. 
కాక్కట్టు కోయిక్కాల్ ఆలయంలోని ప్రత్యేక విశేషమేమిటంటే పందల రాజ మందిరం నుండి సన్నిధానం తీసుకువెళ్ళి మకర సంక్రాంతికి హరిహర సుతునికి అలంకరించే తిరువాభరణాలను అక్కడ ఉత్సవాలు పూర్తయిన తరువాత పందలానికి తిరిగి తీసుకొనివెళ్ళే సమయంలో వాటిని ఇక్కడి స్వామికి అలంకరిస్తారు. 
ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఒకటో తారీఖున జరుగుతుంది. చుట్టు ప్రక్కల గ్రామాలనుండి వేలాదిగాభక్తులు ముఖ్యంగా మహిళలు తరలి వస్తారు. 
శబరిమల తరువాత తిరువా భరణాలను ధరించేది ఇక్కడి శ్రీ ధర్మ శాస్తానే!
ప్రాంగణంలో ఎన్నో ఉప ఆలయాలు ఉన్నాయి. 
ధ్వజస్తంభం 

శ్రీ వినాయక 

బ్రమ్హ రాక్షస 



నాగ దేవత 

శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర 

ఆది దంపతులు 

నంది 

అమ్మవారి వాహనం సింహం 
ఆలయ ఉత్సవాలు నిర్వహించడానికి ఒక మండపం కూడా ఉన్నది. 
స్వామి ఆలయానికి కొద్ది దూరంలో శ్రీ మాలికా పురతమ్మ ఆలయం ఉన్నది. 
రహదారి నుండి దిగువకు ఉన్న మెట్ల మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చును. 
పురాతన నిర్మాణం శిధిలం కావడంతో ఈ నూతన ఆలయాన్ని కమిటి భక్తుల విరాళాలతో నిర్మించినట్లు తెలుస్తోంది. 




ఆలయం వెనుక పారుతున్న పవిత్ర పంబా నది 

శ్రీ మాలికా పురతమ్మ 
చిన్నదైన ఈ ఆలయంలో శ్రీ మాలికా పురతమ్మ సర్వాలంకృత భూషితగా కరుణ కటాక్ష వీక్షణాలను భక్తులపైన కురిపిస్తుంది. 
ఇక్కడ కూడా శ్రీ గణేశ. నాగ, రాక్షస, శివ, ఉపాలయలున్నాయి. 
శబరిమల యాత్రకు వెళ్ళే ప్రతి ఒక్కరూ తప్పని సరిగా దర్శించవలసిన చారిత్రక ప్రాధాన్యం గల క్షేత్రమిది. 
పత్తనమ్తిట్ట నుండి పంబకు వెళ్ళే మార్గంలో పెరునాద్ వస్తుంది. పంబకు వెళ్ళేప్పుడు గాని తిరిగి వచ్చేటప్పుడు గాని  సులభంగా దర్శించుకొనే అవకాశం ఉన్నది. 
స్వామి శరణం ! అయ్యప్ప శరణం !



23, ఆగస్టు 2013, శుక్రవారం

Ayothiyapattinam

గతంలో ఆలయాలను బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేవారు అనిపిస్తుంది.
ఆద్యాత్మిక కేంద్రాలుగా, ఉత్సవాలకు, సభలకు, సత్కార్యాలకు, యాత్రికులకు విడిది కేంద్రాలుగా, యుద్ద సమయాలలో సైనిక స్థావరాలుగా ఇలా ఎన్నో రకాలుగా ఆలయాలను రాజుల కాలంలో వినియోగించేవారని చారిత్రిక గ్రంధాల ద్వారా తెలుస్తోంది.
అవసరాలకు అనుగుణంగా ఎన్ని రకాలుగా వినియోగించుకొన్నా నాటి రాజులు దేవాలయాలను దేవుని నిలయాల గానే భావించి అత్యంత భక్తిప్రపత్తులతో వాటిని అబివృద్ది చేసారని ఆ అద్భుత నిర్మాణాలను చూస్తే గ్రహించవచ్చును.
అక్షర జ్ఞానం లేని వారు కూడా దైవ దర్శనానికి వస్తారు గనుక వాటిని లోక జ్ఞానం నేర్పేకేంద్రాలుగా తీర్చిదిద్దారు. తమ కళాభిమానం, శిల్పుల, చిత్రకారుల నైపుణ్యాన్ని తెలిపే  ప్రదర్శన శాలలుగా రూపొందించారు.
ఈ విషయాన్ని ఎన్నోపేరొందిన  ఆలయాల దర్శనం ద్వారా అర్ధం చేసుకోవచ్చును.
కఠిన శిలలను నేర్పరులైన శిల్పులు రమణీయ శిల్పాలుగా అవి కూడా సామాన్యులకు పురాణాల గురించి, భగవంతుని లీలల గురించి, ప్రాపంచిక విషయాల గురించి దృశ్య మాధ్యమంలో తెలిపే విధంగా మలచిన తీరు ప్రశంసనీయం.
నాటి ప్రజలకే కాదు నేటికీ మనకు అలనాటి ప్రజల జీవన విధానాన్ని, నమ్మకాలను, భాషను, భావాలను తెలుపుతున్నాయి. దీనికి కారకులైన రాజుల అభిమతం, దాన్ని సరిగ్గా నిర్వహించిన శిల్పులు అభినందనీయులు.
చూపరులను విస్మయ పరచే శిల్పాలున్న ఆలయాలు ఎన్నో తమిళనాట ఉన్నాయి. అవన్నీ వాటికవే సాటి.
అలాంటి వాటిల్లో ఆకారంలో చిన్నదైన వాసిలో పెద్ద అయిన ఆలయం అయోధ్యా పట్టినంలోని శ్రీ కోదండ పాణి రామర్ ఆలయం ఒకటి.
త్రేతా యుగ పౌరాణిక గాధను, కలియుగ విశిష్ట నిర్మాణానికి ప్రత్యక్ష సాక్షి ఈ ఆలయం.








ఈ ఆలయ పురాణ గాధ త్రేతా యుగం నాటిది. 
రావణ సంహారం తరువాత సీతా దేవి, విభీషణుడు, ఆంజనేయుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు తదితర వానర వీరులతో కలిసి అయోధ్యకు పయనమయ్యారు శ్రీ రామ చంద్రుడు. 
అప్పట్లో ఇక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉండేది. ముని కోరిక మేరకు దశరధ తనయుడు పరివారంతో ఒక రోజు విడిది చేసారు. అప్పుడు మహర్షి, విభీషణుడు స్వామిని పట్టాభి రామునిగా దర్శనమివ్వమని అభ్యర్ధించారు. 
వారి ప్రార్ద్దనను మన్నించిన పావన నాముడు అలానే కనిపించారు. అయోధ్య లో కన్నా ముందే పట్టాభి రామునిగా కొలువైనందున ఈ క్షేత్రానికి అయోధ్యా పట్టిణం అన్న పేరొచ్చినది అని తెలుస్తోంది. 


త్రేతా యుగం నుండి ఇక్కడి ఆలయంలో పూజాదులు జరుగుతున్నట్లుగా చెబుతారు. ప్రస్తుత ఆలయాన్ని మదురై ని పాలించిన నాయక రాజులలో ప్రముఖుడైన తిరుమలై నాయకర్ నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. 
విశాల ప్రాంగణంలోనికి వెళ్ళడానికి  తూర్పున ఉన్న అయిదు అంతస్తుల రాజ గోపురానికి  ప్రవేశ ద్వారం ఉన్నది. రాజ గోపురానికి ఎదురుగా ఎతైన రాతి గరుడ స్థంభం ఉంటుంది. దాని పీఠానికి నలువైపులా శంఖు, చక్ర, తిరునామం మరియు గరుత్మంతుని రూపాలను చెక్కారు. ప్రక్కనే చెక్కతో నిర్మించిన రధం కనపడుతుంది. చెక్క మీద అతి సూక్ష్మ చెక్కడాలు అందంగా కనిపిస్తాయి. 
రాజ గోపుర అంతర గోడల కిరుప్రక్కలా రెండు సుందర సాల భంజికలను నిలిపారు. 


ఆలయ ప్రాంగణంలో ఎన్నో నూతన ఉప ఆలయాలను నిర్మించారు. ఎదురుగా బాలి పీఠం, ధ్వజ స్థంభం, గరుడాల్వార్ సన్నిధి ఉంటాయి. 
ఎడమ పైపున ప్రదక్షిణా ప్రాంగణంలో శ్రీ చక్రత్తి ఆళ్వార్ ఆలయం ఉంటుంది. 
కొద్ది దూరంలో మండపంలో కొలువైన శంకు చక్రాలు ధరించిన విష్ణు గణపతి దర్శనమిస్తారు. 
ప్రక్కనే నాగ దేవతలను ప్రతిష్టించారు. 
ఆలయం వెలుపల కూడా గణేశ సమేత నాగ దేవతలను ఉంచారు. 
గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ నారసింహ, శ్రీ హయగ్రీవ, శ్రీ దేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, శ్రీ ధన్వంతరి, శ్రీ విష్ణు దుర్గా మూర్తులనుంచారు. 





ఆలయ ఉత్తర భాగంలో ఆళ్వారుల మండపం, ఆంజనేయ సన్నిధి, శ్రీ గోదా దేవి మండపం ఉంటాయి. 


ప్రదక్షినానంతరం ముఖ మండపంలోనికి వెళితే ఒక రమణీయ శిల్ప సముదాయాన్ని, అపురూప చిత్రాలను వీక్షించవచ్చును. 
ఇరవై నాలుగు స్తంభాలలో ప్రతి ఒక్కటి ఒకో పురాణ ఘట్టాన్ని తెలుపుతుంది. 
ప్రతి ఒక్క స్థంభం ఏక శిల. 

ఒకే అశ్వం పైన రెండు ప్రక్కల రౌతు రెండు రకాల ఆయుధాలను ఉపయోగించ క్రింద మృగాన్ని చంపడం 

దశావతార స్థంభం 

తలలో దిగిన శూలం మృగం కంటి క్రిందగా బయటికి వచ్చుట 

ఎడమ ప్రక్క యోధుడు కత్తి ధరించి 

కప్పను పట్టుకొన్న పాము 

ఛత్రాన్ని పట్టుకొన్న సేవకుడు 

కుడి పక్క కరవాలం ఎత్తిన వీరుడు 

తలలో దిగిన శూలం మెడ క్రింద నుండి బయటికి రావడం 


సునిశిత చెక్కడాలు 




త్రివిక్రమ స్వామి 

యువతీ అద్దంలో చూసుకుంటూ సింగారించుకోవడం 

పూతన వధ 
ఇలా ఎన్నో శిల్పాలు వీక్షకులను సంభ్రమంలో ముంచుతాయి. ముఖ్యంగా స్వరాలను పలికే స్తంభాలు ముఖమండప నాలుగు ప్రక్కలా ఉంటాయి. 

మరో అపురూప శిల్పం ఒకే ఆకారంలో సింహం, ఏనుగు, మొసలి. 


మరెన్నో శిల్పాలు 

మండప పై భాగాన చెక్కిన రాతి పద్మాలకు రామ చిలుకలు ఆకర్షించబడటం చూడటానికి మనోహరంగా ఉంటుంది. 






ఇన్ని చెక్కిన శిల్పకారునిలో కాస్తంత హాస్య చతురత ఉన్నదని తెలిపే శిల్పం ఒకటి రాజ గోపురం వద్ద ఉన్నది. 

అలానే మడపం పైన  నాలుగు వందల సంవత్సరాల క్రిందట సహజ వర్ణాలతో చిత్రించిన చిత్రాలు మరో ఆకర్షణ. గజేంద్ర మోక్షం, గోపికా వస్త్రాపహరణం లాంటివి నేటికి సుందరంగా కనపడతాయి. 







ముఖమండపంలో ఆలయాన్ని నిర్మించిన తిరుమల నాయకుడు సతీ పరివార సమేతంగా స్వామి సేవకు సిద్దం అన్నట్లుగా ముకిళిత హస్తాలతో ఉంటారు. 
ఇదే ముఖ మండపంలో శ్రీ రాముడు కోదండపాణి గా సతి సోదర సమేతంగా దర్శనమిస్తారు. 


అర్ధ మండపంలో ఉత్స విగ్రహ మండపం ఉంటుంది. 
గర్భాలయంలో పట్టాభి రాముడు జానకీ సమేతంగా ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తారు. 
స్వామి వారికి ఇరు ప్రక్కలా లక్ష్మణ, భరతులు, కుడి ప్రక్కన శత్రుఘ్నుడు, హనుమంతుడు, ఎదురుగా సుగ్రీవుడు మరియు విభీషణుడు నమస్కార భంగిమలో కొలువు తీరివుంటారు. 
ప్రతి నిత్యం ఎందరో భక్తులు వివాహంలో ఎదురవుతున్న ఇబ్బందులను దూరం చేసుకోడానికి, దశరధ కుమారులలాంటి సంతానం కొరకు వస్తుంటారు. 
ఈ స్వామికి కష్టాలను దూరం చేసి సుఖ సంతోషాలను అనుగ్రహించే వానిగా పేరు. తమ కోరిక నెరవేరిన తరువాత భక్తులు సీతా రాములకు నూతన వస్త్రాలు సమర్పించుకొనడం ఇక్కడి ఆచారం. 
శ్రీ రామ నవమి, హనుమత్జయంతి, ధనుర్మాస పూజలు వైభవంగా నిర్వహిస్తారు. 
ఈ అపురూప శిల్ప కళా శోభిత దేవాలయం తమిళ నాడు లోని సేలం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 
పాత బస్సు స్టాండ్ నుండి సిటీ బస్సులు లభిస్తాయి. యాత్రికులకు కావలసిన అన్ని సదుపాయాలూ సేలం లో అందుబాటు ధరలలో దొరుకుతాయి. దేశం నలుమూలల నుండి సేలంకు రైలు సౌకర్యం ఉన్నది. 
ఆలయ పూజారి శ్రీ రాజు ఆలయ విశేషాలు చక్కగా వివరిస్తారు. 

జై శ్రీ రామ్ !!!









Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...