23, ఆగస్టు 2013, శుక్రవారం

Ayothiyapattinam

గతంలో ఆలయాలను బహుళ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునేవారు అనిపిస్తుంది.
ఆద్యాత్మిక కేంద్రాలుగా, ఉత్సవాలకు, సభలకు, సత్కార్యాలకు, యాత్రికులకు విడిది కేంద్రాలుగా, యుద్ద సమయాలలో సైనిక స్థావరాలుగా ఇలా ఎన్నో రకాలుగా ఆలయాలను రాజుల కాలంలో వినియోగించేవారని చారిత్రిక గ్రంధాల ద్వారా తెలుస్తోంది.
అవసరాలకు అనుగుణంగా ఎన్ని రకాలుగా వినియోగించుకొన్నా నాటి రాజులు దేవాలయాలను దేవుని నిలయాల గానే భావించి అత్యంత భక్తిప్రపత్తులతో వాటిని అబివృద్ది చేసారని ఆ అద్భుత నిర్మాణాలను చూస్తే గ్రహించవచ్చును.
అక్షర జ్ఞానం లేని వారు కూడా దైవ దర్శనానికి వస్తారు గనుక వాటిని లోక జ్ఞానం నేర్పేకేంద్రాలుగా తీర్చిదిద్దారు. తమ కళాభిమానం, శిల్పుల, చిత్రకారుల నైపుణ్యాన్ని తెలిపే  ప్రదర్శన శాలలుగా రూపొందించారు.
ఈ విషయాన్ని ఎన్నోపేరొందిన  ఆలయాల దర్శనం ద్వారా అర్ధం చేసుకోవచ్చును.
కఠిన శిలలను నేర్పరులైన శిల్పులు రమణీయ శిల్పాలుగా అవి కూడా సామాన్యులకు పురాణాల గురించి, భగవంతుని లీలల గురించి, ప్రాపంచిక విషయాల గురించి దృశ్య మాధ్యమంలో తెలిపే విధంగా మలచిన తీరు ప్రశంసనీయం.
నాటి ప్రజలకే కాదు నేటికీ మనకు అలనాటి ప్రజల జీవన విధానాన్ని, నమ్మకాలను, భాషను, భావాలను తెలుపుతున్నాయి. దీనికి కారకులైన రాజుల అభిమతం, దాన్ని సరిగ్గా నిర్వహించిన శిల్పులు అభినందనీయులు.
చూపరులను విస్మయ పరచే శిల్పాలున్న ఆలయాలు ఎన్నో తమిళనాట ఉన్నాయి. అవన్నీ వాటికవే సాటి.
అలాంటి వాటిల్లో ఆకారంలో చిన్నదైన వాసిలో పెద్ద అయిన ఆలయం అయోధ్యా పట్టినంలోని శ్రీ కోదండ పాణి రామర్ ఆలయం ఒకటి.
త్రేతా యుగ పౌరాణిక గాధను, కలియుగ విశిష్ట నిర్మాణానికి ప్రత్యక్ష సాక్షి ఈ ఆలయం.








ఈ ఆలయ పురాణ గాధ త్రేతా యుగం నాటిది. 
రావణ సంహారం తరువాత సీతా దేవి, విభీషణుడు, ఆంజనేయుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు తదితర వానర వీరులతో కలిసి అయోధ్యకు పయనమయ్యారు శ్రీ రామ చంద్రుడు. 
అప్పట్లో ఇక్కడ భరద్వాజ మహర్షి ఆశ్రమం ఉండేది. ముని కోరిక మేరకు దశరధ తనయుడు పరివారంతో ఒక రోజు విడిది చేసారు. అప్పుడు మహర్షి, విభీషణుడు స్వామిని పట్టాభి రామునిగా దర్శనమివ్వమని అభ్యర్ధించారు. 
వారి ప్రార్ద్దనను మన్నించిన పావన నాముడు అలానే కనిపించారు. అయోధ్య లో కన్నా ముందే పట్టాభి రామునిగా కొలువైనందున ఈ క్షేత్రానికి అయోధ్యా పట్టిణం అన్న పేరొచ్చినది అని తెలుస్తోంది. 


త్రేతా యుగం నుండి ఇక్కడి ఆలయంలో పూజాదులు జరుగుతున్నట్లుగా చెబుతారు. ప్రస్తుత ఆలయాన్ని మదురై ని పాలించిన నాయక రాజులలో ప్రముఖుడైన తిరుమలై నాయకర్ నిర్మించినట్లుగా చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయి. 
విశాల ప్రాంగణంలోనికి వెళ్ళడానికి  తూర్పున ఉన్న అయిదు అంతస్తుల రాజ గోపురానికి  ప్రవేశ ద్వారం ఉన్నది. రాజ గోపురానికి ఎదురుగా ఎతైన రాతి గరుడ స్థంభం ఉంటుంది. దాని పీఠానికి నలువైపులా శంఖు, చక్ర, తిరునామం మరియు గరుత్మంతుని రూపాలను చెక్కారు. ప్రక్కనే చెక్కతో నిర్మించిన రధం కనపడుతుంది. చెక్క మీద అతి సూక్ష్మ చెక్కడాలు అందంగా కనిపిస్తాయి. 
రాజ గోపుర అంతర గోడల కిరుప్రక్కలా రెండు సుందర సాల భంజికలను నిలిపారు. 


ఆలయ ప్రాంగణంలో ఎన్నో నూతన ఉప ఆలయాలను నిర్మించారు. ఎదురుగా బాలి పీఠం, ధ్వజ స్థంభం, గరుడాల్వార్ సన్నిధి ఉంటాయి. 
ఎడమ పైపున ప్రదక్షిణా ప్రాంగణంలో శ్రీ చక్రత్తి ఆళ్వార్ ఆలయం ఉంటుంది. 
కొద్ది దూరంలో మండపంలో కొలువైన శంకు చక్రాలు ధరించిన విష్ణు గణపతి దర్శనమిస్తారు. 
ప్రక్కనే నాగ దేవతలను ప్రతిష్టించారు. 
ఆలయం వెలుపల కూడా గణేశ సమేత నాగ దేవతలను ఉంచారు. 
గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ నారసింహ, శ్రీ హయగ్రీవ, శ్రీ దేవి భూదేవి సమేత శ్రీనివాసుడు, శ్రీ ధన్వంతరి, శ్రీ విష్ణు దుర్గా మూర్తులనుంచారు. 





ఆలయ ఉత్తర భాగంలో ఆళ్వారుల మండపం, ఆంజనేయ సన్నిధి, శ్రీ గోదా దేవి మండపం ఉంటాయి. 


ప్రదక్షినానంతరం ముఖ మండపంలోనికి వెళితే ఒక రమణీయ శిల్ప సముదాయాన్ని, అపురూప చిత్రాలను వీక్షించవచ్చును. 
ఇరవై నాలుగు స్తంభాలలో ప్రతి ఒక్కటి ఒకో పురాణ ఘట్టాన్ని తెలుపుతుంది. 
ప్రతి ఒక్క స్థంభం ఏక శిల. 

ఒకే అశ్వం పైన రెండు ప్రక్కల రౌతు రెండు రకాల ఆయుధాలను ఉపయోగించ క్రింద మృగాన్ని చంపడం 

దశావతార స్థంభం 

తలలో దిగిన శూలం మృగం కంటి క్రిందగా బయటికి వచ్చుట 

ఎడమ ప్రక్క యోధుడు కత్తి ధరించి 

కప్పను పట్టుకొన్న పాము 

ఛత్రాన్ని పట్టుకొన్న సేవకుడు 

కుడి పక్క కరవాలం ఎత్తిన వీరుడు 

తలలో దిగిన శూలం మెడ క్రింద నుండి బయటికి రావడం 


సునిశిత చెక్కడాలు 




త్రివిక్రమ స్వామి 

యువతీ అద్దంలో చూసుకుంటూ సింగారించుకోవడం 

పూతన వధ 
ఇలా ఎన్నో శిల్పాలు వీక్షకులను సంభ్రమంలో ముంచుతాయి. ముఖ్యంగా స్వరాలను పలికే స్తంభాలు ముఖమండప నాలుగు ప్రక్కలా ఉంటాయి. 

మరో అపురూప శిల్పం ఒకే ఆకారంలో సింహం, ఏనుగు, మొసలి. 


మరెన్నో శిల్పాలు 

మండప పై భాగాన చెక్కిన రాతి పద్మాలకు రామ చిలుకలు ఆకర్షించబడటం చూడటానికి మనోహరంగా ఉంటుంది. 






ఇన్ని చెక్కిన శిల్పకారునిలో కాస్తంత హాస్య చతురత ఉన్నదని తెలిపే శిల్పం ఒకటి రాజ గోపురం వద్ద ఉన్నది. 

అలానే మడపం పైన  నాలుగు వందల సంవత్సరాల క్రిందట సహజ వర్ణాలతో చిత్రించిన చిత్రాలు మరో ఆకర్షణ. గజేంద్ర మోక్షం, గోపికా వస్త్రాపహరణం లాంటివి నేటికి సుందరంగా కనపడతాయి. 







ముఖమండపంలో ఆలయాన్ని నిర్మించిన తిరుమల నాయకుడు సతీ పరివార సమేతంగా స్వామి సేవకు సిద్దం అన్నట్లుగా ముకిళిత హస్తాలతో ఉంటారు. 
ఇదే ముఖ మండపంలో శ్రీ రాముడు కోదండపాణి గా సతి సోదర సమేతంగా దర్శనమిస్తారు. 


అర్ధ మండపంలో ఉత్స విగ్రహ మండపం ఉంటుంది. 
గర్భాలయంలో పట్టాభి రాముడు జానకీ సమేతంగా ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తారు. 
స్వామి వారికి ఇరు ప్రక్కలా లక్ష్మణ, భరతులు, కుడి ప్రక్కన శత్రుఘ్నుడు, హనుమంతుడు, ఎదురుగా సుగ్రీవుడు మరియు విభీషణుడు నమస్కార భంగిమలో కొలువు తీరివుంటారు. 
ప్రతి నిత్యం ఎందరో భక్తులు వివాహంలో ఎదురవుతున్న ఇబ్బందులను దూరం చేసుకోడానికి, దశరధ కుమారులలాంటి సంతానం కొరకు వస్తుంటారు. 
ఈ స్వామికి కష్టాలను దూరం చేసి సుఖ సంతోషాలను అనుగ్రహించే వానిగా పేరు. తమ కోరిక నెరవేరిన తరువాత భక్తులు సీతా రాములకు నూతన వస్త్రాలు సమర్పించుకొనడం ఇక్కడి ఆచారం. 
శ్రీ రామ నవమి, హనుమత్జయంతి, ధనుర్మాస పూజలు వైభవంగా నిర్వహిస్తారు. 
ఈ అపురూప శిల్ప కళా శోభిత దేవాలయం తమిళ నాడు లోని సేలం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 
పాత బస్సు స్టాండ్ నుండి సిటీ బస్సులు లభిస్తాయి. యాత్రికులకు కావలసిన అన్ని సదుపాయాలూ సేలం లో అందుబాటు ధరలలో దొరుకుతాయి. దేశం నలుమూలల నుండి సేలంకు రైలు సౌకర్యం ఉన్నది. 
ఆలయ పూజారి శ్రీ రాజు ఆలయ విశేషాలు చక్కగా వివరిస్తారు. 

జై శ్రీ రామ్ !!!









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...