9, అక్టోబర్ 2015, శుక్రవారం

Sri Irukalala Parameswari Temple, Nellore


   శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం, నెల్లూరు 




శతాబ్దాల ఘన చరిత్ర కలిగిన నగరం నెల్లూరు. 

క్రీస్తు పూర్వం మూడో శతాబ్ద కాలానికే నెల్లూరు అప్పట్లో "విక్రమ సింహపురి" దక్షిణాది లోని ముఖ్య నగరాలకు కూడలిగా ప్రాధాన్యత కలిగిన ప్రాంతంగా ప్రసిద్ది చెందినట్లుగా లభించిన శిలా శాసనాలు తెలియచేస్తున్నాయి. 
మౌర్య చక్రవర్తి అశోకుని నుండి పల్లవ, చోళ, కాకతీయ, శాతవాహన,పాండ్య, తెలుగు చోడ, విజయనగర ఇలా ఎన్నోరాజ వంశాలు ఈ పట్టణ సర్వతోముఖాభివృద్ది కి కృషిచేసినట్లుగా వివిధ చారిత్రిక పరిశోధనా గ్రందాల ఆధారంగా అవగతమవుతోంది. 
ఇలా ఎందరో రాజుల పాలనలో ఉన్న ఈ ప్రాంతంలో పురాణ ప్రసిద్దిచెందిన పురాతన ఆలయాలకు కొదవ లేదు. నగరంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో ఎన్నో విశేష ఆలయాలు నెలకొని ఉన్నాయి. వీటిల్లో చాలా మటుకు అరుదైనవి కూడా! 
విక్రమ సింహపురి గ్రామ దేవత శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయం వాటిల్లో ఒకటి. స్థానికంగానే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుండి కూడా ప్రతినిత్యం ఎందరో భక్తులు దర్శించుకొనే ఈ అమ్మవారు సుమారు ఎనిమిదో శతాబ్దానికి పూర్వమే కొలువుతీరినట్లుగా క్షేత్ర గాధ తెలుపుతోంది.










ప్రస్తుత ఆలయం  పదకొండు నుండి పన్నెండో  శతాబ్దాల మధ్యకాలాల నాటిదిగా చరిత్రకారులు భావిస్తున్నారు.ఆలయం పక్కనే ఉన్న స్వర్ణాల చెరువును కాకతీయ గణపతి దేవుడు తవ్వించాడు. ఈయన కుమారుడు కాకతీయ ప్రతాప రుద్రుడు ఈ ప్రాంతాన్ని తన సేనాని అయిన ముప్పిడి నాయకు నకు కానుకగా ఇచ్చాడు. వారి తదనంతరం వారి అనుచరులైన "లోక బోయడు" మరియు "బ్రాహ్మణ బోయడు" ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది.










లభించిన శాసనాల ఆధారంగా ఇక్కడ అనేక ఆలయాలు ఉండినట్లుగా తెలుస్తోంది. తెలుగు చోడులు, కాకతీయ ప్రభువులు, వారి సేనాపతులు ఈ ఆలయాభివృద్దికి ఎంతో పాటు పడ్డారు.
పదునాలగవ శతాబ్దంలో విజయనగర రాజుల ప్రతినిధిగా ఉదయగిరి ప్రాంతాన్ని పాలించిన "సావన్న ఒరియులు"కాలంలో ప్రతి శుక్రవారం స్వర్ణల చెరువు వద్ద పెద్ద సంత జరిగేది. స్థానికులే గాక విదేశీ వర్తకులు కూడా దానిలో పాల్గొనేవారు. సంతను నిర్వహించే అధికారి అయిన "కాంచనం" వసూలు చేసిన వర్తక సుంకం నుండి కొంత శాతం శ్రీ ఇరుకళల పరమెశ్వరీ అమ్మవారి నిత్య నైవేద్యాలకు, ఉత్సవాల నిమిత్తం కేటాయించేవారు.
ప్రస్తుతం సంవత్సరానికి ఒకసారి మూడురోజుల పాటు రొట్టెల పండగ ఈ స్వర్ణాల చెరువు దగ్గర జరుపుకొంటున్నారు. దేశం నలుమూలల నుండే కాక విదేశాల నుండి కూడా భక్తులు వచ్చి ఈ పండగ సందర్బంగా రొట్టెలు ఇస్తున్నారు. 












ఈ మధ్య కాలంలో తిరిగి ప్రాచుర్యం సొంతం చేసుకొంటూ పూర్వ వైభవాన్ని ప్రదర్శిస్తున్న ఈ ఆలయం సువిశాల ప్రాంగణంలో నిర్మించబడినది. స్వాగత ద్వారం, రాజ గోపురాలు నూతన నిర్మాణాలు.ప్రధాన ద్వారం వద్ద నుండి ఆలయం వైపుకు ఉన్న మార్గంలో ఉత్సవ మరియు కళ్యాణ మండపం కనిపిస్తుంది. ఇక్కడ పక్కన ఉన్న మండపాలలో భక్తులు పాసయం వండి అమ్మవారికి నివేదన చేస్తారు. ఈ మండపం పక్కనే శూలం మరియు శక్తి శిల ఉంటాయి.

















ప్రధాన ఆలయం ఎఱ్ఱని బొంత రాళ్ళతో నిర్మించబడినది.ముఖమండపం, నమస్కార మండపం , అర్ధ మండపం దాటితే గర్భాలయంలో స్వర్ణాభరణ భూషితురాలిగా, సప్తవర్ణ
పుష్పాలంకరణలో ఉపస్థిత భంగిమలో శ్రీ ఇరుకళల పరమేశ్వరీ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు.నమస్కార మండప ముఖ ద్వారం పైన ఉన్న రాతి స్తంభాల పైన తెలుగు శాసనాలు కనిపిస్తాయి.ఇదే మండపంలో కొన్ని దేవతా మూర్తులు కనిపిస్తాయి.  పూర్వం ముఖ మండప స్తంభాల పైనా కొన్ని తెలుగు, తమిళ మరియు దేవనాగరి శాసనాలు ఉండేవట. శిధలమవ్వడంతో రెండు వేల రెండో సంవత్సరంలో చేసిన ఆలయ పునః నిర్మాణ
సమయంలో తొలగించబడినాయి.













విశాల ప్రదక్షిణా ప్రాంగణంలో ఈశాన్యం లో వేపచెట్టు క్రింద లింగేశ్వరుడు కొలువై ఉంటారు. ప్రహరీ గోడపైన ఆలయ చరిత్ర లిఖించారు. ఈ గోడల పైన నవ విధ దుర్గా రూపాలైన శ్రీ శైల పుత్రి, శ్రీ కూష్మాండ, శ్రీ స్కంద మాత రూపాలను సుందరంగామలచి నిలిపారు. నైరుతిలో ఉన్న చిన్న కిటికీ ద్వారా చూస్తే "శ్రీ నరసింహ కొండ మీద వెలసిన శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహ
స్వామి" ఆలయ సుముదాయాన్ని చూడవచ్చును.


















ప్రతి నిత్యం స్థానిక దూర ప్రాంత భక్తులు వస్తుంటారు. ఆదివారాలలో అధిక సంఖ్యలో తరలి వచ్చేభక్తులు మొక్కుబడులను తీర్చు కొంటుంటారు. పర్వ దినాలలో విశేష పూజలు, వైశాఖ మాసంలో లక్ష పుష్పార్చన నిర్వహిస్తారు. నవ రాత్రులలో ఆలయం అపూర్వ కాంతులను సంతరించుకొంటుంది.




















జంతు బలులు అత్యంత సహజం. ముఖ్యంగా కోళ్ళు గొర్రెలు. ఆపితే బాగుంటుంది.
కోరిన వారి కుటుంబాలలో సుఖ శాంతులను ప్రసాదించే దేవతగా శ్రీ ఇరుకళల పరమేశ్వరీ అమ్మవారు ప్రసిద్ది. ఈ చారిత్రక ప్రసిద్ది పొందిన ఆలయం నెల్లూరు పట్టణంలో నరసింహ కొండకు వెళ్ళే మార్గంలో ఉంటుంది. రైల్వే స్టేషన్నుండి బస్సు స్టాండ్ నుండి సులభంగా చేరుకోవచ్చును.దేశం నలుమూలల నుండి రైలు మార్గం లో నెల్లూరు చేరుకోవచ్చును. చక్కని వసతి భోజన సదుపాయాలు లభిస్తాయి.
శ్రీ తల్పగిరి రంగనాయక స్వామి, నరసింహ కొండ, శ్రీ మూలస్థానేశ్వర స్వామి ఆలయాలను సందర్శించుకొనే  అవకాశం కూడా దక్కుతుంది. ( ఈ ఆలయాల వివరాలు ఈ బ్లాగ్ లో ఉన్నాయి )



  










1 కామెంట్‌:

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...