28, ఫిబ్రవరి 2014, శుక్రవారం

My word

నా బ్లాగ్ ని చదువుతున్న అందరికి వందనం.

చిన్న తనం నుండి నాకు దైవ భక్తిని నా పితా మహులు స్వర్గీయ ఇలపావులూరి వెంకట
రమణయ్య గారు, మాతా మహులు  స్వర్గీయ దరిశి వీర రాఘవ స్వామి గారు పురాణ గాధలు
చెబుతూ పరిచయం చేసారు.
నా మాతా మహులతొ ఎన్నో పుణ్య క్షేత్రాలను సన్దర్శించుకొన్నాను.
మా తండ్రి కీర్తి శేషులు ఇలపావులూరి గోపాల కృష్ణ మూర్తి గారు కూడా
ఎన్నో ప్రదేశాలకు తీసుకొని వెళ్ళారు.
చిన్నతనంలో నాకొక ఆలోచన ఉండేది.
ఎన్నో దేవి దేవతా చిత్రాలు చిత్రించాలని.
కొంత వరకు కృషిచేసినా లక్ష్య సాధన మీద స్థిరమైన ద్రుష్టిలేక మధ్యలోనే
వదిలివేశాను.
స్వంత మరియు ఉద్యోగ సంబంధిత కారణాల వలన చాలా కొద్దిగా రచించాను.
అదికూడా స్థిరంగా కొనసాగించలేక పోయాను.
తిరిగి 2007 నుండి వరసగా ఆలయ దర్శనం గురించి, వివిధ హిందూ క్షేత్ర విశేషాల గురించి
రాయడం చేస్తున్నాను. 
గత కొద్ది రోజులుగా నేను అన్నీ విష్ణు ఆలయాల గురించే రాస్తున్నాను.
ఈ విషయాన్ని కొందరు మిత్రులు నా బ్లాగ్ చదివిన తరువాత అడిగారు.
2007 నుండి పూర్తి స్థాయిలో రాయడానికి, ఎక్కువగా విష్ణు ఆలయాల గురించి
ప్రస్తావించడానికి కొన్ని విశేష అనుభవాలే కారణం
వాటిని మీముందుకు సవినయంగా తెస్తున్నాను.
స్వతహాగా నేను అన్ని ఆలయాలకు ఎలాంటి భేద భావం లేకుండా సందర్శించు కోడానికి
వెళుతుంటాను.
ఈ నా రచనలకు మార్గం చూపిన తొలి గురువు శ్రీ ధర్మ శాస్త.
1979 నుండి శబరి యాత్ర చేస్తున్నాను.
2006లో నా కుటుంబం, చిన్ననాటి స్నేహితుడైన ఏక ప్రసాద్ కుటుంబం కలిసి కేరళ మరియు తమిళనాడు యాత్రకు వెళ్ళాము.
ఎన్నో క్షేత్రాలను దర్శించుకొన్నము.
నా కేరళా స్నేహితుడు శ్రీ సజ్జి శ్రీధరన్ ఏర్పాటు చేసిన కారు డ్రైవర్ శ్రీ ప్రమోద్ నా కుతూహలాన్ని గ్రహించి మమ్ములను గురువాయూరుకు చేరువలో ఉన్న ప్రముఖ శ్రీ రామ ఆలయం అయిన "త్రిప్రయార్" కు తీసుకొని వెళ్ళాడు.
పెరియార్ నది వడ్డున ఉన్న ఈ ఆలయంలో ఒక చిత్రమైన ( క్షమించాలి. ఆనాటి నా భావన ఇదే) ఆచారం ఉన్నది.
తడి బియ్యాన్ని నదిలో చేపలకు వేస్తున్నారు చాలా మంది భక్తులు.
నేను, నా భార్య అందరి మాదిరే చేసాము.
శ్రీ రాముని దర్శించుకొని త్రిచూర్ మీదగా తిరువనంతపురం రాత్రికి చేరుకొని లాడ్జిలో పడుకొన్నాము.
తెల్ల వారు ఝామున నాకొక కల.
అందులో ఒక ఛాయా మాత్ర రూపం కనిపించింది.
" అందరూ వేస్తున్నారని నువ్వూ బియ్యం వేసావు. కారణం ఏమిటో తెలుసుకోవా?" అన్న మాటలు వినిపించాయి.
అప్పటికి నాకు కంప్యూటరుతో ఎలాంటి పరిచయము లేదు.
తెలిసినదల్లా పుస్తకాలు చదవడం లేదా తెలిసిన వారిని అడిగి తెలుసుకోవడం.
నా అన్వేషణ ఆరంభించాను.
విశాఖ పట్టణం యెన్ ఏ డి కొత్త రోడ్ సెంటర్లో ఉన్న ప్రభా హోటల్ యజమాని ( మలయాళీ) తనకున్నపరిచయాల ద్వారా తెలుసుకొన్న విషయం నాకు తెలిపాడు.
అలా బియ్యం చేపలకు పెడితే ఉబ్బస వ్యాధి తగ్గుతుందని స్థానికులు విశ్వశిస్తారన్నది ఆ సమాచారం.
తెలుసుకొన్న విషయాన్ని నా భార్యకు చెప్పాను.
మీరు నమ్మక పోవచ్చును, నా కుమారుడు చిన్నతనం నుండి ఉబ్బసం తో భాధ పడేవాడు.
మేము త్రిప్రయార్ వెళ్ళినది డిసెంబర్ నెలలో!
జనవరి, ఫిబ్రవరి నేలలు గడచిపొయినాయి.
అతను ఎలాంటి ఇబ్బందికి గురికాలేదు.
త్రి ప్రయార్ వెళ్ళిన తరువాత అతఃని వ్యాధి తొలగిపొయినది.
అది మేము గ్రహించలేదు.
విషయం విన్న నా భార్య ఈ సంగతి నాకు చెప్పినది.
దొరికిన ఆదరంతో మరింత సమాచారం కొరకు ప్రయత్నించాను.
ఆ అన్వేషణలో శ్రీ వైష్ణవ దివ్య దేశాల గురించిన సమాచారం తెలుసుకొన్నాను.
వాటిని సందర్శించాలన్న అభిలాష మొదలయ్యింది.
2008లో నా చిన్ననాటి కల అయిన కుర్తాళం దర్శించుకోవడం జరిగింది..
కుర్తాళం వెళ్ళినప్పుడు క్షేత్ర విశేషాల గురించి ఎందరో స్థానికులను ప్రశ్నించాను.
సరైన సమాధానం లభించలేదు.
అప్పుడు నాకు ప్రతి ఒక్కరు తమ జీవన కాలంలో ఎన్నో ఆలయాలను, ప్రదేశాలను సందర్శిస్తున్నారు.
కాని ఎందరు ఆయా క్షేత్ర విశేషాలు తెలుసుకొంటున్నారు? అన్న ఆలోచన తలెత్తినది.
క్షేత్ర ప్రాముఖ్యతను అందరికి తెలపాలన్న శ్రద్ధతో రాసిన వ్యాసాన్ని "ఆంధ్ర జ్యోతి" దిన పత్రిక తన ఆదివారం అనుభందం లో ప్రచురించి రచయితగా నాకు జన్మనిచ్చినది.
వారికెంతో కృతజ్ఞుడను.
అప్పటిదాకా ఏదో రాయాలనిపించినప్పుదు రాయటం తప్ప మరో ఉద్దేశ్యం లేదు
 నాటి నుండి దర్శించిన ప్రతి ఆలయ విశేషాలను రాస్తున్నాను.
ఆంధ్ర జ్యోతి దిన పత్రిక నా వ్యాసాలను "ట్రావెలొగ్" శీర్షికన ప్రచురించినది.
ఆంధ్ర భూమి వార/మాస, చిత్ర, భక్తిసుధ'లాంటి పత్రికలు వాటిని ప్రచురిస్తున్నాయి.
అందరికి నా నమస్కారాలు.
అలా మొదలైన ఆలయ దర్శనం నా ఆభిలాష అయిన 108 శ్రీ వైష్ణవ దివ్య దేశ సందర్శనం
వైపు సాగింది.
 ఆసక్తి నాచేత ఇప్పటికి అరవై దివ్య దేశ సందర్శనా భాగ్యం కలిగించినది.
ప్రతి ఒక్క క్షేత్ర సందర్శనం ఒక  అపురూప అనుభూతిని ప్రసాదించినది.
అహోబిలం సందర్శన నా జీవితంలో ఒక మరుపురాని అనుభవం.
ఒక్క రోజులో నవ నారశింహ క్షేత్రాలతో పాటు శ్రీ వెంకటేశ్వర ప్రతిష్టిత శ్రీ ప్రహ్లాద వరద
నారసింహ ఆలయంతో మొత్తం పది దర్శించుకొనే భాగ్యం లభించినది. 
ఆంధ్ర జ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన వ్యాసానికి నేటికి  ఫోన్
కాల్స్ రావడమే అందుకు నిదర్శనం. ( 2010లో ప్రచురించబడినది, ఈ బ్లాగ్ లో ఉన్నది )
అదే విధంగా గిద్దలూరు (ప్రకాశం జిల్లా) సమీపంలోని నెమలి గుండ్ల శ్రీ రంగనాయక స్వామి ఆలయ సందర్శనం ఒక అద్భుతం.
శబరి దీక్షలో ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్లాను.
వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి.
కనక సురభెశ్వర కోన చూసుకొని రంగనాయక క్షేత్రాన్ని చేరుకొన్నాము.
మనసులను మైమరపించే వాతావరణం.
కొండ మీదకి చేరుకొని నా కెమేరాతో పరిసరాలను చిత్రీకరిస్తున్నాను.
ఒక మెరుపులా ఆలయానికి ఎదురుగా ఉన్న కొండల మీద శంఖు చక్రాలతో తిరునామం సందర్శనం కలిగినది.
పక్కనే ఉన్న నా మిత్రుడు ప్రసాదుకు ఏమి కనిపించలేదు.
అతను నన్ను పదేపదే అడిగాడు "నిజంగా కనిపించినదా ? అని.
నా సమాధానం ఒక్కటే "నిజం !".
దర్శనానికి వెళ్ళినప్పుడు ఆలయ పూజారి శ్రీ శైల శిఖర దర్శనంలా ఇక్కడ శంఖు చక్రాలతో తిరునామం సందర్శనం
అర్హులైన భక్తులకు లభిస్తుంది అని తెలిపినప్పుడు చకితుడనైనాను.
ఈ అల్పునికి ఇంతటి అదృష్టమా అనిపించినది.
 చిత్రించిన వీడియో "ijv291963 channel" you tubeలో చూడవచ్చును.
ఈ అనుభవాలు నాకు నిత్య జీవన విషయాలలో, ఆధ్యాత్మిక భావనలలో ఎన్నో విధాలుగా
మార్గదర్శనం చేశాయి.
మీ అందరి ఆశీర్వాదంతో సందర్శించుకొన్న దివ్య దేశాలతో పాటు శ్రీ మహా విష్ణువు గురించి తెలుసుకొన్న విశేషాలను తొందరలో  మీముందుకు తీసుకురావాలన్న ప్రయత్నం లో భాగమే నాయీ\వరుస శ్రీ మహా విష్ణు ఆలయాల పరిచయం.
హిందూ ధర్మ గొప్పదనాన్ని, ఆలయ స్థాపనా ప్రాధాన్యతను గురించి అవగతం అయిన ( అనుకొంటున్నాను)
వాటిని నలుగురితో పంచుకోవాలన్న తాపత్రయమే ఈ రచనల వెనక ఉన్న ఉద్దేశ్యము.
నిరంతరం మీ ఆదరాభిమానాలను కోరుకొంటూ
భవదీయుడు,
ఇలపావులూరి వెంకటేశ్వర్లు
09052944448
విజయవాడ


   

26, ఫిబ్రవరి 2014, బుధవారం

Sri Maha Ganapathi Temple, Tiruvananthapuram

                     శ్రీ మహా గణపతి ఆలయం - తిరువనంతపురం 

కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం పౌరాణికంగా మరియు చారిత్రకంగా విశేష చరిత్ర కలిగిన పట్టణం. 
తిరువనంతపురం పేరు చెప్పగానే అందరికి గుర్తుకు వచ్చేది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం. 
స్వామి కొలువైనందునే ఈ పేరు వచ్చినది. 
కాని ఈ ఊరిలో కొన్ని అరుదయిన ఆలయాలు ఉన్నాయి. 
తిరువళ్ళం శ్రీ పరశురామ, మిత్రానంతపురం త్రిమూర్తి కోవెల, అత్తుక్కాల్ భగవతి, కళ్ళం పల్లి మార్కండేయ ధర్మ శాస్త, శ్రీ లక్ష్మి వరాహ స్వామి ఆలయం, కౌరవుల తల్లి శ్రీ గాంధారి మాత ఆలయం ఇలా చాల ఆలయాలు ఉన్నాయి. 
ఒక్క తిరువళ్ళం శ్రీ పరశురామ ఆలయం తప్ప మిగిలిన ఆలయాలు అనంత పద్మనాభ స్వామి ఆలయ చుట్టుపక్కలే ఉంటాయి. 
ఇదే కోవకు చెందినది పళవంగాడు శ్రీ మహా గణపతి ఆలయం. 
నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్వామి సకల విఘ్నాలను తొలగించి విజయం కలిగించేవానిగా ప్రసిద్ది. 
పదిహేడో శతాబ్దపు తొలి సంవత్సరాలలో ట్రావెంకూర్ రాజుల ముఖ్య పట్టణం నాగర్ కొయిల్ పట్టణానికి దగ్గరలోని "పద్మనాభ పురం". 
నేడు పురావస్తు శాఖ వారి అధ్వర్యంలో ఉన్న నాటి కోటను సందర్శించుకోవచ్చును. 
ఆ రోజులలో రాజైన "ఇరవి వర్మ కులశేఖర పెరుమాళ్" ఒక గణేష మూర్తిని కోటలో ప్రతిష్టించారు. 
వేటకు, యుద్దానికి, ఏదైనా రాచ కార్యం మీద వెళ్ళే తప్పుడు ఈ విఘ్న నాయకునికి మొక్కి వెళితే కార్యంలో విజయం కలుగుతుంది అన్న నమ్మకం అందరిలో కలిగింది. 
కాలగమనంలో " రాజా మార్తాండ వర్మ" ట్రావెంకూర్ వంశాన్ని పద్మనాభ దాసులుగా ప్రకటించి రాజధానిని తిరువనంత పురానికి మార్చారు.     
అదే సమయంలో శ్రీ మహా గణపతి విగ్రహాన్ని తీసుకొని వచ్చి కోట తూర్పు భాగంలో "పళవంగాడు" గా పిలవబడే ప్రదేశంలో ప్రతిష్టించారు. 
నాటి నుండి విఘ్ననాయకుడు "పళవంగాడు శ్రీ మహా గణపతి" భక్తుల కొంగు బంగారంగా మారి కొలవబడుతున్నాడు. 
తిరువనంతపురం రైల్వే స్టేషన్ నుండి శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి వెళ్ళే రహదారి పక్కనే దూరానికి కూడా ప్రస్పుటంగా కనపడే నల్ల రంగు వేసిన గోపురాలు, మండపాలతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. 



తమిళనాడు ఆలయ నిర్మాణ శైలిలో చిన్న ఆవరణంలో ఉండే ఈ ఆలయం లోనికి ప్రధాన ద్వారం దాటి ప్రవేశిస్తే మహా మండపం చేరుకొంటాము.
మండప స్థంభాలకు లక్ష్మి, సరస్వతి మరియు ఇతర దేవతా మూర్తులను, మండప గోడలపై చిత్రించిన ముప్పై రెండు తీరుల గణేష రూపాలు ఆకట్టుకొనే విధంగా వుంటాయి.


అన్ని ఆలయాలలో ఎడమ కాలును మడచి కుడి కాలును క్రింద గద్దె మీద ఉంచినట్లుగా కనపడే గణ నాధుడు ఇక్కడ కుడి కాలు మడిచి ఎడమ కాలు క్రిందకు వదిలి ఉపస్థిత భంగిమలో దర్శనమిస్తారు.


స్వామిని దర్శించి మనోగతాలను తెలిపి అవి నెరవేరిన తరువాత కొబ్బరి కాయలు కొట్టటం ఇక్కడి అలిఖిత శాసనం.
నిత్యం అలా తమ మొక్కులు తీర్చుకొనే భక్తులు ఎందరో ఇక్కడ కాన వస్తారు.
ఉదయం నాలుగున్నర నుండి పదిగంటల నలబై అయిదు గంటల వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో నిర్మాల్య దర్శనం, అభిషేకం, ఉషః పూజ లాంటి ఇరవై రెండు రకాల సేవలు పార్వతీ నందనునకు జరుపుతారు.
నెల కొకసారి జరిగే "మాస విశేషం", అలానే సంవత్సరానికి ఒకసారి జరిగే "ఆట్ట విశేషం" సందర్బంగా ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహిస్తారు.
గణేష చతుర్ధి, ఆలయ ప్రతిష్టా దినోత్సవాలలో "కొడియాట్టు, శుద్ధి కలశ ఉత్సవ బలి" లాంటి పదకొండు రకాల పూజలు ఘనంగా ఏర్పాటు చేస్తారు.
అన్ని హిందూ పర్వదినాలు ఇక్కడ భక్త జన జయజయధ్యానాల మద్య సాంప్రదాయ బద్దం గా జరుగుతాయి. ఈ ఆలయంలో ప్రతి నెలా పౌర్ణమి తరువాత వచ్చే "సంకష్ట హర చతుర్ది " మాఘ మాసంలో అమావాస్య తరువాత వచ్చే "శుక్ల పక్ష చతుర్ధి" నాడు గణపతి హోమం నిర్వహిస్తారు.
జై గణేష !!!!!   

25, ఫిబ్రవరి 2014, మంగళవారం

Pandalam

                      హరిహర పుత్రుడు నడయాడిన - పందళం 

లోకంలో ధర్మం కాపాడటానికి అవతరించిన హరిహర పుత్రుని మరో అవతారమే " మణికంఠ స్వామి ". 
పందల రాజుకి అరణ్యంలో పసి బాలకునిగా లభించి, ఆయన రాజ భవనంలో పెరిగి, సకల విద్యా బుద్దులు నేర్చుకొన్నారు. 







స్వామి మానవ రూపంలో నడయాడిన పవిత్ర భూమి పందళం, పంబానది ఒడ్డున ఉన్నది.




శ్రీ అయ్యప్ప తిరువాభరణాలు ఉంచే భవనం, పందళ రాజ వంశీకుల "వలియకోయిక్కాల్ ఆలయం" కొన్ని పురాతన భవనాలు ఉంటాయి.











పందళ రాజ వంశానికి చెందిన ఒక మహిళ ఇక్కడ ఉంటారు. ఆమెకు మొక్కి ఆశీర్వాదాలు అందుకొన్నాను.
భగవద్గ కృప వలన  ముప్పై అయిదు సంవత్సరాలుగా చేస్తున్న శబరి యాత్రలో అయ్యప్పస్వామితో ముడిపడి ఉన్న క్షేత్రాలైన పందళం, శ్రీ గురునాధన్ ముఖాడి, కుళత్త పుళ, అరియంగావు, అచ్చంకోయిల్, రాణీ పెరునాడ్ శ్రీ అయ్యప్ప ఆలయం, అష్ట అయ్యప్ప క్షేత్రాలలో కొన్నిదర్శించుకొనే భాగ్యం కలిగినది.
మరి కొన్నింటిని ఈ సంవత్సరం చూడాలని ప్రయత్నిస్తున్నాను.

ఈ చిత్రాలన్నీ 2009 లో తీసినవి.










స్వామియే శరణం అయ్యప్ప !!!!

24, ఫిబ్రవరి 2014, సోమవారం

Attukkal Bhagavathi Amman Koil - Tiruvananthapuram

                              అతివల శబరిమల- అత్తుక్కాల్ 





కేరళలో అత్యధికులు ఆరాధించే భగవతి దేవి సాక్షాత్తుగా పార్వతి దేవి అవతారం. 
పరశు రాముడు సముద్రుని నుండి తీసుకొన్న భూ భాగంలో ( నేటి గోవా, ఉత్తర కర్నాటక, కేరళ) నూట ఎనిమిది శివాలయాలు, నూట ఎనిమిది శ్రీ ధర్మ శాస్త, నూట ఎనిమిది భగవతి అమ్మవారి విగ్రహాలు ప్రతిష్టించి, ఆలయాలు నిర్మించి కర్ణాటక నుంచి వేద విదులైన బ్రాహ్మణులను రప్పించి వారికి ఆలయ నిర్వహణా భాద్యతలు అప్పగించారు 
కాల క్రమంలో ప్రజలలో భక్తి భావాలు అభివృద్ధి చెంది గ్రామ గ్రామాన అమ్మవారి ఆలయాలు వెలశాయి. 
వాటిల్లో ప్రత్యేకమైనది కేరళ రాజధాని తిరువనంతపురం నడి బొడ్డున ఉన్న " అత్తుక్కాల్ భగవతి ఆలయం". 
చిత్రమైన విషయం ఏమిటంటే ఈ దేవి పరశురామ ప్రతిష్ట కాదు. 
అమ్మవారు కోరి కొలువైన క్షేత్రం. 
నేడు సువిశాల తిరువనంతపురం లో భాగమైన అత్తుక్కాల్ ఒకప్పుడు చిన్న పల్లె.
చాలా కాలం క్రిందట ఈ ప్రాంతం " మల్ల వీట్టిల్" వంశస్తుల అధీనంలో ఉండేది.
ఒకనాడు వంశ పెద్ద సమీపం లోని "కిళ్ళి నది"లో స్నానమాచరించరిస్తుండగా ముద్దులొలికే పాప ఆయన వద్దకు వచ్చి నది దాటించమని అడిగినదట.
ఆ చిన్నారిని చూడగానే హృదయాంతరాలలో చెప్పలేని ఆప్యాయత కలగడంతో పెద్దాయన నది దాటించి తన ఇంటికి తీసుకొని వెళ్లారట.
కుటుంబ సభ్యులంతా ఆ బాలికను ప్రేమాదరణలతో ఆహ్వానించి విందును ఏర్పాటు చేసారు.
విందు ఆరగించిన తరువాత ఆమె ఎవరికి కనిపించలేదుట.
చుట్టు పక్కల ఎక్కడా చూడలేదు ? ఎవరు ఆ పాప?అన్న రకరకాల ప్రశ్నలతో సతమతమౌతూ కలత నిద్రలో కెళ్ళిన పెద్దాయనకు స్వప్న దర్శనమిచ్చిన దేవి పసి పాప రూపంలో విచ్చేసినది తానేనని మరుసటి రోజున దాపుల ఉన్న తోట లో ఎక్కడ మూడు గీతలు కనిపిస్తాయో\అక్కడ గుడి కట్టమని తెలిపారట.
తెల్ల వారిన తరువాత తోటలో ఒక చోట గీతలు కనిపించడంతో తమ అదృష్టానికి మురిసిపోయిన  మల్ల వీట్టిల్ వంశస్తులు ఆలయం నిర్మించారట.
ఆ బాలిక మరెవరో కాదు అన్యాయం చేసిన పాండ్య రాజుని అతను పాలిస్తున్న మదురై నాశనాన్ని శాశించిన తమిళ ఆడబడుచు "కన్నగి" అని నమ్ముతారు. ఈమె ప్రస్తావన పురాతన తమిళ గ్రంధమైన "శిల్పాదికారం"లో ఉన్నది.
కన్నగి మధురై  నుండి కన్యాకుమారి మీదుగా కోడంగల్లూరు వెళ్ళే క్రమంలో ఇక్కడ "భగవతి అమ్మన్"గా ప్రకటితమయ్యిందని స్థానిక నమ్మకం.
కన్యాకుమారి మరియు కోడంగల్లూరు రెండూ శక్తి క్షేత్రాలే !
అత్తుక్కాల్ భగవతి తమిళ ఆడపడచు కావడం వలన ఆమె ఆలయం సాంప్రదాయ కేరళ ఆలయాలకు భిన్నంగా వివిధ శిల్పాలతో, ఎత్తైన గోపురాలతో ఉంటుంది.
ఆలయంలో గానం చేసే "తొట్టెం పట్టు" ( ప్రార్ధన గీతం) లో వినిపించేది కన్నగి జీవిత గాధే !






నగర రణగోణ ధ్వనుల మధ్య అత్యంత ప్రశాంత వాతావరణంలో ఉండే ఆలయ ప్రాంగణం లోనికి ప్రవేశించగానే మనస్సుకు ఏదో తెలియని అనుభూతితో కూడిన శాంతి సందర్శకులకు కలుగుతుంది.
గోపురం పైన , ద్వారాలకు అష్టా దశ అమ్మవార్ల రూపాలను సుందరంగా ఛెక్కారు.
ప్రదక్షిణా ప్రాంగణంలోని స్థంభాలకు దశావతార శిల్పాలను రమణీయంగా మలచారు.
శ్రీ వినాయక, శ్రీ సదాశివ,శ్రీ నాగ రాజు ఉప ఆలయాలలో కొలువుతీరి కనపడతారు.
గర్భాలయంలో రెండు భగవతి అమ్మన్ విగ్రహాలు దర్శనమిస్తాయి.
దృష్టిని ఆకర్షించే అలంకరణతో కనపడే పెద్ద విగ్రహం  మల్ల వీట్టిల్ వశస్థులు ఏనాడో పనస చెట్టు కాండంతో చెక్కిచ్చినది కాగా రెండవది పంచలోహ విగ్రహం. అభిషేకాలు అన్నీ చిన్న విగ్రహానికే జరుగుతాయి.

ఉఅదయమ్ నాలుగున్నరకి సుప్రభాతంతో ఆలయాన్ని తెరచిన తరువాత నిర్మాల్య దర్శనం, అభిషేకాలు, గణపతి హోమం, దీపారాధన,చందనాభిషేకం, పతిరాడి పూజ, ఉషః పూజ, ఉచ్చః పూజ, అతళ పూజ అన్ని నియమంగా జరుగుతాయి. 
భక్తుల సౌలభ్యం కోసం ఎన్నో ఆర్జిత సేవలలో ముఖ్యమైనవి ములక్కప్పు, చందనాభిషేకం మరియు పొంగలి నైవేద్యం. 
మొదటి రెండు సేవలు అత్తుక్కాల్ భగవతి దేవికి జరిపించాలంటే నేటికి నుంచి పాతిక సంవత్సరాలు వేచివుండాల్సినదే!!!!
మూడో దానికి ప్రతి మహిళకు స్వాగతమే !
కొళ్ళ వర్షం (మలయాళ పంచాంగం) లోని మకరం (ఫిబ్రవరి-మార్చి) లో జరిగే పది రోజుల ఉత్సవాలు ఈ ఆలయంలో ముఖ్యమైనవి. 
అందులో లక్షలాది మహిళలు భక్తి'శ్రద్దలతో సమర్పించుకొనే పొంగలి నైవేద్యం అమ్మవారే స్వయంగా కోరుకొన్నారు అని తెలిపే ఒక గాధ స్థానికంగా ప్రచారంలో ఉన్నది. 
మల్ల వీట్టిల్ వశస్థులు అమ్మవారిని ప్రతిష్టించి ఆలయం నిర్మించిన తొలి రోజులలో ఒక నాడు కొందరు మహిళలు పొలం పనులు చేసుకొంటుండగా నదిలో పాదాలను ఉంచి ఆడుకొంటున్న ఆడ మనిషి ఒకరు కనిపించారట. 
ఆమె ఎవరు ఈ ప్రాంతాలలో ఎప్పుడూ చూడలేదు అని వారు మల్ల గుల్లాలు పడుతూ ఉండగా ఆమె వారిని పిలిచి ఆకలిగా ఉన్నది ఏదన్నా ఉంటే పెట్టండి అని అడిగినదట. 
ఆమె తేజోమయ రూపం చూసిన మహిళలు తాము తెచ్చుకొన్న ఆహారం కాకుండా తమ వద్ద పాలు, బెల్లంతో మట్టి కుండల్లో పాయసం వండి చూడగా ఆ మహిళ కనపడలేదట. 
అప్పుడు వారికి అర్ధమయ్యింది వచ్చినది ఎవరో కాదు భగవతి అమ్మే అని, నాటి నుండి ఆ రోజున పాయసం వండి సమర్పించుకోవడం ఒక ఆనవాయతీగా రూపుదిద్దుకొన్నది. 
అంతే కాదు అమ్మవారు కాళ్ళు కడుకొన్న ప్రదేశం అవటం వలన అత్తుక్కాల్ అన్నపేరొచ్చినది అని అంటారు. 
ఉత్సవాలలోని తొలి తొమ్మిది రోజులు పూజలు, అభిషేకాలు, ఊరేగింపులు రంగరంగ వైభవంగా జరుగుతాయి. పదో రోజున తెల్ల వారక ముందే రహదారులు, భవనాలు, గృహాలు అన్నది లేకుండా తిరువనంతపురం అంతా రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి విచ్చేసిన మహిళలతో నిండిపోతుంది. 
ఎక్కడ స్థలం దొరికితే అక్కడ నాలుగు రాళ్ళను ఉంచి పొయ్యి వెలిగించి అమ్మవారికి ప్రీతికరమైన పొంగలి వండటంలో మహిళలు నిమగ్నమవుతారు. 
అందుకే అత్తుక్కల్ భగవతి ఆలయాన్ని ఆడవారి శబరిమలగా పేర్కొంటారు. సాయంత్రం అమ్మవారు స్వయంగా విచ్చేసి అందరి వంటకాన్ని ఆరగిస్తారు అంటారు. 
పంతొమ్మిది వందల తొంభై ఏడులో అత్యధికంగా పదిహేను లక్షల మంది మహిళలు పాల్గొనడం వలన ఈ ఉత్సవం గిన్నిస్ రికార్డ్స్ లో చోటుచేసుకొంది. 



పదో రోజు రాత్రి అమ్మవారు పుర వీధులలో విహరిస్తారు. 

ఇలాంటి ఎన్నో విశేషాలతో ముడిపడి ఉన్న "అత్తుక్కాల్ భగవతి ఆలయం" ప్రతి ఒక్కరూ దర్శించవలసిన దివ్య క్షేత్రం.
ప్రసిద్ద శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం. 

Rare Photos Of Alampur - 4










































Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...