26, అక్టోబర్ 2013, శనివారం

KALKA

                          శ్రీ కాళీమాత కొలువుతీరిన కల్కా 

అసురులను అంతం చేసి ముల్లోకాలను కాపాడిన లోకపావని, ముగురమ్మల రూపం అయిన శ్రీ కాళికా దేవి కోరి కొలువుతీరిన ప్రదేశం "కల్కా". 



పురాణ గాధ :

కృత యుగంలో క్రూరులైన రాక్షసులు దేవతలను, మునులను, సామాన్య ప్రజలను ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుండేవారు. 
వారి భాదను తట్టుకోలేక అంతా కలసి కైలాసానికి వెళ్లి సర్వేశ్వరుని శరణుకోరారు. 
ఆయన వారికి అభయం ఇవ్వగలిగినది శక్తిస్వరూపిణి అయిన కాత్యాయని అని తెలిపారు. 
అంతట వారంతా తమ స్తోత్రపాఠాలతో అమ్మవారిని ప్రసన్నం చేసుకొని, తమను లోకకంటకులైన  కిరాతకుల బారి నుండి కాపాడమని కోరారు. 
ప్రసన్నురాలైన పరాశక్తి పసిపాపగా మారి , క్షణాలలో లోక భీకర రూపం ధరించారు. 
అప్పుడు మహా విష్ణువు తన సుదర్శన చక్రాన్ని, శంకరుడు త్రిశూలాన్ని, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, యముడు తన పాశాన్ని, యిలా అందరూ తమ ఆయుధాలను, శక్తులను ఆమెకు యిచ్చారు. 
పరిపూర్ణ శక్తిమంతురాలైన కాళికగా మారిన జగజ్జనని దుష్టులను తుదముట్టించి లోకాలకు ఆనందాన్ని ప్రసాదించారు. 
అంతట సమస్త ప్రజల కోరిక మేరకు అక్కడే కొలువుతీరారు. 
కాలగమనంలో ఈ క్షేత్రం మరుగున పడిపోయినది.
ద్వాపర యుగంలో ఈ ప్రాంతం మత్స్య రాజ్య రాజధాని అయిన విరాట నగరంగా పిలవబడినది. 
మాయ జూదంలో ఓడిపోయిన  పాండవులు జూద నిబంధనల ప్రకారం పన్నెండు ఏళ్ళు వనవాసము చేసిన తరువాత సంవత్సరం పాటు అజ్ఞాత వాసం గడపటానికి విరాట్ నగరాన్ని ఎంచుకొన్నారు.
మారు వేషాలలో విరాట రాజు కొలువులో చేరారు.
విరాట రాజుకు ఉన్న గోసంపద ఎంతో ప్రసిద్ది చెందినది.
ఆ గోవులలో శ్యామ అనే ధేనువు రాజ కుటుంబానికి ప్రీతిపాత్ర మైనది.
అకస్మాత్తుగా అది పాలు ఇవ్వడం మానేసినది.
ఎన్నో వైద్యాలు, చక్కని ఆహరం పెట్టినా పలితం లేకపోవడంతో రాజు గారు మేతకు వెళ్ళిన సమయంలో ఏదన్నా జరుగుతోందా అన్న అనుమానంతో " తంత్రీపాలకుడు" అన్న పేరుతొ గోపాలకునిగా ఉన్న సహదేవుని ఆవును అనుసరించి విషయాన్నీ తెలుసుకోమని ఆదేశించారు.
అతను "దామ గ్రంధి " అన్న పేరుతొ అశ్వ పాలకునిగా ఉన్న సోదరుడు నకులుని సహాయం తీసుకొన్నా పలితం లేకపోయింది.
అప్పుడు సోదరుల బాధ తెలుసుకొన్న బృహన్నల రూపంలో ఉన్న అర్జనుడు ఒక నాడు ఆవుని అనుసరించాడు.
ఆ గోవు అడవిలోకి వెళ్లి ఒక పుట్ట వద్ద నిలబడగానే పొదుగులో నుండి పాలు ధారగా కారి పుట్టలో పడసాగాయి.
అది చూసిన పాండవ మధ్యముడు అక్కడ ఏదో మహత్యం ఉన్నది అని అర్ధం చేసుకొని పుట్టను తొలగించి చూశాడు.  
అక్కడ లింగ రూపంలో కొలువు తీరిన శ్రీ కాళికా మాతను చూసి తన అదృష్టానికి ఆనందించి రాజ సహకారంతో మందిరాన్ని నిర్మించారు.
నాటి నుండి నేటి వరకు ఎన్నో రాజ వంశాలు, యోగులు, ప్రజలు అమ్మవారిని సేవించుకొని, ఆమె కృపాకటాక్షాలకు పాత్రులవుతున్నారు.
శ్రీ కాళికాదేవి కొలువుతీరిన క్షేత్రం "కాళికా పురి" గా పిలవబడి తదనంతరం "కల్క"గా మారింది.






ఆలయ విశేషాలు :

కల్కా పట్టణ ప్రధాన రహదారిలో ఉంటుందీ మందిరం. 
కాలక్రమంలో ఆధునీకరణను సంతరించుకొన్న ఈ మందిర ప్రవేశ ద్వారం ఉత్తరం వైపు ఉంటుంది. 
మందిరానికి సమీపంలో ఎన్నో పూజా సామాగ్రి దుకాణాలుంటాయి. 
ప్రవేశ ద్వారం మీద ప్రధమ పూజితుడైన వినాయకుడు ఉంటాడు. 
మందిర ప్రాంగణంలో ఐదడుగుల ఎత్తైన శివలింగం, పాతిక అడుగుల కాళికా దేవి మూర్తి ఉంటాయి. 

చిన్నదైన గర్భాలయంలో లింగ రూప శ్రీ కాళికా దేవి కొలువుతీరి భక్త జనుల పూజలను స్వీకరిస్తుంటారు.  
పడమర దిశగా ఉన్న ఈ ప్రధాన మందిరంలో తదనంతర కాలంలో ప్రతిష్టించబడిన దేవీ మూర్తులు కూడా ఉన్నాయి. 
మందిరంలోనికి కెమెరా తీసుకొని వెళ్ళరాదు. 
రహదారిన వెళ్ళే భక్తుల కొరకు బయటి దాకా డిజిటల్ స్క్రీన్ మీద మూల విరాట్టుకు జరుగుతుండే పూజలను ప్రసారం చేస్తుంటారు. 



ప్రతి నిత్యం ఎన్నో పూజలు అమ్మ వారికి జరుగుతాయి. 
గణపతి, దేవి నవరాత్రులలో ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. 
శ్రావణ,కార్తీక మాసాలలో ప్రత్యేక పూజలు జరుపుతారు.   
దుష్ట గ్రహ భాదలు తొలగి పోవాలని జీవితం సుఖంగా సాగాలని కోరుకొంటూ ఎందరో శ్రీ కాళి మాతను సందర్శించుకొంటూవుంటారు. 
ఇంతటి పురాణ ప్రసిద్దమైన కల్కా, చండీఘర్ కు నలభై కిలో మీటర్ల దూరంలో సిమ్లా వెళ్ళే దారిలో ఉంటుంది. 
పక్కనే ఉన్న "పరవానూ" లో ఒక పురాతన శివ మందిరం ఉన్నది.








  1964 లో పునరుద్దరించబడిన ఈ మందిరంలో పురాతన శివ లింగంతో బాటు శివ పార్వతుల, రాధా కృష్ణుల, సీతా లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీరామ, శ్రీ కాళికా దేవి, శ్రీ షిరిడి సాయి బాబా ఆదిగా గల దేవి దేవతల పాలరాతి విగ్రహాలను ప్రతిష్టించారు. 



SUKHANA LAKE

                                     సుఖన లేక్ , చండీఘర్ 


ఆధునిక భారత దేశంలో ఒక ప్రణాళికతో నిర్మించబడిన రెండు ముఖ్య పట్టణాలు భువనేశ్వర్ మరియు చండీఘర్. 
పురాణ కాల చరిత్ర కలిగిన భువనేశ్వర్ క్రొత్త హంగులతో స్వాతంత్రానంతరం ఒడిష రాష్ట్ర రాజధానిగా రూపు దిద్దుకోన్నది. 
కాని కేంద్ర పాలిత ప్రాంతమైన చండీఘర్ మాత్రం పంజాబు మరియు హర్యానా రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఒక ప్రత్యేకతను సంతరించుకొన్నది. 
వరసకు సోదరులైన ఇద్దరు స్విస్ దేశస్తులు "లి-కొర్బూసియర్" మరియు "పియరీ - జియన్నరెత్" ల తో పాటు పి. యల్.  వర్మ నేటి చండీఘర్ రూపకర్తలు. 
  

లి-కొర్బూసియర్ ( Le-corbusier ) 1887 - 1965

యూరప్, అమెరికా, భారత దేశాలలో ఎన్నో నిర్మాణాలకు రూపకల్పన చేసిన వాడు లి-కొర్బూసియర్. 
ముఖ్యంగా ప్రజల సౌకర్యార్ధం, భావి తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రణాలికాబద్దంగా ఆధునిక నగరాల నిర్మాణంలో ప్రపంచ ప్రసిద్ది పొందిన వాస్తు శిల్పి. 
సముద్రంలో ఈతకెళ్ళి మృతి చెందాడు. 

  పియరీ - జియన్నరెత్ ( Pierre Jeanneret ) 1896 - 1967 

లి-కొర్బూసియర్ కి  వరసకు సోదరుడైన "పియరీ - జియన్నరెత్" అతనితో కలిసి ఎన్నో పేరొందిన నిర్మాణాలలో పాలు పంచుకొన్నాడు. 
ముఖ్యంగా చండీఘర్ రూపకల్పనలో వీరి పాత్ర చెప్పుకోదగినది. 
పియరీ చండీఘర్ తో విడదీయలేని భందాన్ని ఏర్పరచుకొన్నాడు. 
మరీ ఎక్కువగా సుఖానా సరోవరంతో !
ఎంతగా అంటే జీవిత చరమాంకంలో తాను నిర్మించిన పట్టణంలోనే ఉండిపోయాడు. 
 చివరి కోరిక మేరకు ఆయన చితాభశ్మాన్నిసుఖానా సరోవరంలో నిమజ్జనం చేసారు. 

సుఖానా సరోవరం :

ఎంతో ముందు చూపుకలిగిన రూపకర్తలిద్దరూ నగర ప్రజల ఉదయ, సాయంత్రాలు మనోహరంగా ఉండటానికి ఈ సరోవరాన్ని నిర్మించారు. 
1958వ సంవత్సరంలో శివాలిక్ పర్వతాల నుండి వర్షాకాలంలో పారే నీటి ప్రవాహంతో ఈ మానవ నిర్మిత సరోవరాన్ని నిర్మించారు. 
మానవ నిర్మిత జలాశయాల్లో పేరెన్నిక పొందిన వాటిల్లో సుఖానా ఒకటి. 
1974వ సంవత్సరంలో కొండలనుండి ఉద్భవించే జల ప్రవాహాన్ని వ్యవసాయ మరియు ఇతర అవసరాల నిమిత్తం పక్కకు మల్లించడంతో ఈ జలాశయము పూర్తిగా వర్షాల మీద ఆధార పడింది. 

    వివిధ కాలుష్యాల బారినుండి సరోవరాన్ని కాపాడటానికి స్థానిక ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకొంటోంది. 
కాళ్ళతో తొక్కుతూ నడిపే పడవలకు తప్ప చమురుతో నడిచే వాటికి ఇక్కడ స్థానం లేదు. అదే విధంగా చేపల వేట నిషేధం. 
చండీఘర్ వాసులకు సుఖానా సరోవారంతో చెప్పలేని అనుబంధం ఉన్నది. 
ఉదయాన్నే ఎందరో ఇక్కడ నడకతో తమ రోజును ప్రారంభిస్తారు. 
సాయంత్రాలు భార్యా పిల్లలతో వచ్చి కులాసాగా గడిపి వెళతారు మరెందరో. 
శీతాకాలంలో దేశ విదేశ పక్షులు ఇక్కడ తమ తాత్కాలిక బస ఏర్పాటు చేసుకొంటాయి. 
సాయం సంధ్యా సమయంలో పడవను నెమ్మదిగా నడుపుతూ అస్తమించే సూర్యుని చూస్తూ స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ గడపటంతో  అనిర్వచనీయమైన మధురానుభూతులను మది నిండా నిండి పోతాయి. 
సరోవర తీరాన అన్ని రకాల వస్తువుల, తినుబండారాల దుకాణాలు ఉంటాయి. 
మనిషిని కూర్చోపెట్టి క్షణాలలో రేఖాచిత్రాన్ని గీసి చేతిలో పెట్టె చిత్రకారులెందరో ఉంటారిక్కడ. 






 పిల్లలకు ఆడుకోటానికి ఎన్నో ఏర్పాట్లు చేసారు. 
నిత్యం ఎదుర్కొనే శబ్ద, వాయు కాలుష్యాలనుండి కాపాడుకోడానికి, ప్రశాంత వాతావరణంలో కొద్దిసేపు గడపటానికి సుఖానా సరోవరానికి మించినది లేదు. 
ఇక్కడికి సమీపంలోనే చండీఘర్ లో ప్రసిద్ది చెందినా మరో ఆకర్షణ అయిన రాక్ గార్డెన్ ఉంటుంది. 
 

6, అక్టోబర్ 2013, ఆదివారం

penna ahobilam




స్థితి కారకుడైన శ్రీ మహావిష్ణువు ధరించిన అనేకానేక అవతారాలలో అత్యంత శక్తివంతమైనదిగా, ఆర్తులను రక్షించి, అపమృత్యు భయాన్ని తొలగించి సకల శుభాలను అనుగ్రహించేదిగా పేరుపొందినది శ్రీ నృసింహ అవతారం. 
 శ్రీ నరసింహ ఆరాధన దక్షిణ భారత దేశంలో ఎక్కువగా కనపడుతుంది. 
మన ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో ప్రసిద్ద నరసింహ క్షేత్రాలున్నాయి. 
అలాంటి వాటిల్లో ఒకటి అనంతపురం జిల్లాలోని పెన్నఅహోబిలం.  
పెన్నా నది ఒడ్డున ఉన్న ఈ క్షేత్రానికి సంభందించిన పురాణ గాధ కృత యుగ సంఘటనలతో ముడిపడి ఉన్నది. 
భక్త వరదుడైన శ్రీ మన్నారాయణుడు తండ్రి హిరణ్యకశపుని చేతిలో చిత్ర హింసలకు గురి అవుతున్న ప్రహ్లాదుని రక్షించ నారసింహ అవతారంలో బయలుదేరారు. 
అలా బయలుదేరిన స్వామి తన తొలి అడుగు భూమి పైన పెట్టిన స్థలమే ఈ అహోబిలం. పెన్నా నదీ తీరంలో ఉన్నందున దీనిని "పెన్నఅహోబిలం" అని పిలుస్తారు. 
(స్వామి తన రెండో అడుగును కర్నూలు జిల్లా లోని "అహోబిలం" లో పెట్టి హిరణ్యకశపుని సంహారించారని తెలుస్తోంది.)
హిరణ్యకశప సంహారం తరువాత కలియుగంలో స్వామి వారి పాదం పడిన స్థలం లోనే ప్రస్తుత ఆలయం నిర్మించబడినది.  
సమీపంలోని గ్రామం అయిన గొల్లపల్లి లో నివసించే ఒక గొల్ల వానికి విశేష పశు సంపద ఉండేది. 
అందులో ఒక గోవు ఉన్నట్లుంది పాలు ఇవ్వడం మానేసింది. 
అనారోగ్యమా లేక ఇంకేదైనా కారణమా అని యజమాని ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేక పోయినది. పశువులు మేతకు అడవికి వెళ్లినప్పుడు ఏదన్నా జరుగుతోందా అన్న అనుమానంతో ఒకనాడు దానిని అనుసరించి వెళ్ళాడు. 
ధేనువు అరణ్యంలో ఒక పుట్ట వద్దకు వెళ్లి అందులోనికి పాలను వదల సాగింది. 
అది చూసిన యజమానికి అక్కడ ఏదో విశేషం ఉన్నదని అనిపించినది. 
తవ్వి చూసిన అతనికి అందులో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి దివ్య మంగళ రూపం, అక్కడే పెద్ద పాద ముద్ర  కనపడినది. 
శ్రీ వారి భక్తుడైన అతని ఆనందానికి అంతులేకుండా పోయింది. 
ఒక చిన్న ఆలయాన్ని నిర్మించి నియమంగా కొలువసాగాడు. 
ఒక నాటి రాత్రి నారసింహుడు అతనికి స్వప్నంలో క్షేత్ర విశేషాన్ని తెలిపారు. 
లోక కంటకుడైనా హిరణ్యకశపుని సంహరించి లోక కల్యాణం కొరకు భువిపైన మోపిన దివ్య స్థలంగా పెన్నఅహోబిలం, మానవ జీవితాలలో సకల శుభాలను ప్రసాదించే వానిగా శ్రీ నారసింహ స్వామీ పేరొందారు.  


ఆలయ విశేషాలు :

ఆనాడు గొల్ల పల్లి పెద్ద నిర్మించిన చిన్న ఆలయాన్ని విజయనగర రాజైన సదాశివ రాయలు పదహారవ శతాబ్దంలో తన జైత్ర యాత్రలో స్వామి వారి కృపతో లభించిన విజయానికి కృతజ్ఞతతో ప్రస్తుత ఆలయాన్ని నిర్మించారు. 
చిన్న గుట్ట మీద సువిశాల ప్రాంగణంలో ఉన్న ఆలయాన్ని చేరుకోడానికి తూర్పున, దక్షిణాన రాజ గోపురాలు, సోపాన మార్గం ఉన్నాయి. 

 

ప్రాంగణంలోనికి  అడుగు పెట్టగానే భక్తులను ఆకర్షించేవి ధ్వజస్తంభాలు. రెండు రాతివి. ఒకటి పంచ లోహ కవచంతో కప్పబడిన కలపది.  

పక్కనే సుందర కళ్యాణ మండపం ఉంటుంది. 
దక్షిణ దిశలో ఉన్న రాజగోపురం పక్కన శ్రీ చెన్న కేశవ స్వామి ఆలయం ఉంటుంది. 

ద్వజస్తంబాలకు, కళ్యాణ మండప స్థంబాలకు దశావతారాలను, నరసింహ, ఆంజనేయ రూపాలను అందంగా మలచారు.  


గర్భాలయంలో అమ్మవారిని ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకొని రమణీయ పుష్పాలంకరణలో నయన మనోహరంగా దర్శనమిస్తారు శ్రీ నరసింహ స్వామి. 
మూల విరాట్టుకు పాదాల వద్ద స్వామి అడుగుతో పడిన గుంత ఉంటుంది. అభిషేక జలాలన్ని గుంత గుండా పెన్నా నదిలో కలుస్తాయని అంటారు.   







కొండ క్రింద అంజనా సుతుని ఉప ఆలయం ఉంటుంది. 

గుట్ట చుట్టూ ఎన్నో రాతి మండపాలు యాత్రీకుల సౌకర్యార్ధం నిర్మించబడినాయి. 


ఆలయ పుష్కరానికి సమీపంలో కొద్దిగా క్రిందకు ఉన్న  శ్రీ ఉద్భవ మహా లక్ష్మి ఆలయాన్ని మెట్ల మార్గం ద్వారా చేరవచ్చును. 


ప్రధాన రహదారి నుంచి ఆలయానికి వచ్చే బాటలో స్వాగత తోరణాన్ని దాటిన తరువాత  కొంత ఎత్తైన ప్రదేశంలో స్తంభాన్ని చీల్చుకొని అవతరించిన నారసింహుని ఎదురుగా నిర్ఘాంతపోతున్న హిరణ్యకశపుని, భక్తితో ప్రణమిల్లుతున్న ప్రహ్ల్లాదుని సుందరంగా మలచారు.






ప్రతి నిత్యం అనేక పూజలు, అర్చనలు, సేవలు నియమంగా జరుగుతాయి. ఏప్రిల్ నెలలో అతి వైభవంగా రథ యాత్ర నిర్వహిస్తారు. 
కళ్యాణ క్షేత్రమైన పెన్నఅహోబిలంలో చుట్టు పక్కల గ్రామాలు, జిల్లాల వాసులే కాకుండా కర్నాటక రాష్ట్రం నుండి కూడా భక్తులు తరలి వచ్చి తమ బిడ్డల వివాహాలను జరుపుకొంటారు.   




ప్రధాన రహదారికి అటు పక్కన లోయ లాంటి ప్రదేశంలో కొండ గుహలో స్వామివారి రూపం, దగ్గరలోనే పెద్ద పాద ముద్ర ఉంటాయి. 
నరసింహ స్వామీ ఇక్కడ వరాహ రూపంలో ఉన్న ఒక రాక్షసుని సంహరించారని చెబుతారు. 
యిరువురికి జరిగిన పోరులో స్వామి  రాక్షసుని అదిమి పెట్టినపుడు రాళ్ళలో పడిన కోరల, గిట్టల ముద్రలను చూడవచ్చును. 








లోకాలను కాపాడే లోకరక్షకుడైన శ్రీ హరి మరో నిలయమైన పవిత్రమైన పెన్న అహోబిలం మన రాష్ట్రంలోని అనంతపురం పట్టణానికి ముఫై కిలో మీటర్ల దూరంలో, ఉరవ కొండకు సమీపంలో ఉంటుంది.
అనంతపురం నుండి సులభంగా చేరుకోనవచ్చును.
అనతపురానికి రాష్ట్రం లోని అన్ని పట్టణాలనుండి నేరుగా చేరుకోనడానికి రైలు, బస్సులు ఉన్నాయి.
యాత్రికులకు కావలసిన సదుపాయాలూ లభిస్తాయి. 

Sri Trimoorthi & Trishakthi Temple, Nandyal

                                         అరుదైన ఆలయం   శ్రీ గురుభ్యోనమః  శ్రీ అరుణాచలేశ్వరాయ నమః  అందరికి నమస్కారం  గొప్ప చెప్పుకోవడం కాదు క...