24, డిసెంబర్ 2018, సోమవారం

Pancha Aranya Temples

                   


                    పుణ్యప్రదం పంచవనేశ్వర దర్శనం 



                                                                                         


గంగాధరునికి ఉన్నన్ని గొలుసు కట్టు ఆలయాలకు లెక్క లేదు. పంచారామ క్షేత్రాలు, పంచ భూత స్థలాలు, పంచ నాట్య సభలు, పంచ బ్రహ్మ ఆలయాలు, పంచ క్రోశ ఆలయాలు, సప్త విదంగ క్షేత్రాలు, సప్త స్దాన క్షేత్రాలు, సప్త మాంగై స్థానాలు, అష్ట వీరట్ట స్థలాలు, నవ నందులు, నవ కైలాసాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇలా ఎన్నో ఉన్నాయి.
వీటిల్లో చాలా వరకు తమిళనాడులోనే నెలకొని ఉన్నాయి. ఇవి కాకుండా పంచ వనేశ్వర  ఆలయాలు అని కూడా ఉన్నాయి. వీటిని పంచ అరణ్య ఆలయాలు అని కూడా అంటారు.ఆలయాలున్న ప్రాంతాలు ఒకప్పుడు రకరకాల వనాలు. అందువలన ఈ అయిదు ఆలయాలను కలిపి చేసే యాత్రను పంచ వనేశ్వర దర్శనం అన్నారు. ఇవి కుంభకోణం నుండి తంజావూరు వెళ్లే దారిలో ఉన్నాయి.కుంభకోణం నుండి మొదలు పెట్టి అయిదు క్షేత్రాలను దర్శించుకొని తంజావూరు వెళ్ళచ్చు లేదా తిరిగి కుంభకోణం రావచ్చు. రాను పోను నూట ఇరవై కిలోమీటర్ల దూరం.  కుంభకోణం నుండి ప్రారంభించడం ఉత్తమం. ఎందుకంటే ఈ అయిదు ఆలయాలను దర్శించుకోడానికి ఒక పద్ధతి నిర్దేశించబడినది. దాని ప్రకారం ఉదయం అయిదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల లోపల ఒక్కో ఆలయంలో ఒక్కో సమయంలో అంటే   ఉదయ, మధ్యాహాన్న, అపరాహ్ణ, సాయం సంధ్య మరియు అర్ధజాము పూజల సమయాలలో ఆయా ఆలయాలలోని దేవీదేవతలు సందర్శించుకోవాలి. వీటిల్లో తొలి ఆలయం కుంభకోణానికి సమీపంలోనే ఉన్నది. 
అయిదు ఆలయాలు విశేషమైనవే. నయమ్మార్లు తేవరాలు గానం చేయడం వలన పడాల్ పెట్ర స్థలాలలో స్థానం సంపాదించుకొన్నవే. శైవాగమనం ప్రకారం పూజాదికాలు  నిర్వహిస్తారు. కార్తీక మాస పూజలు, శివరాత్రి, గణేష చతుర్థి, సుబ్రమణ్య షష్టి, త్రయోదశి ప్రదోషకాల పూజలు, నవరాత్రులు, ఆదిదంపతుల కళ్యాణ మహోత్సవాలను ఘనంగా జరుపుతారు.కాకపోతే    అన్నింటికీ కలిపి ఒకే క్షేత్ర గాధ లేదు. మరే పోలిక లేదు. ఇవన్నీ కావేరి తీరంలో ఉండటం శతాబ్దాల క్రిందట అయిదు రకాల వనాలలో ఉండటమే వీటి మధ్య ఉన్న బంధం.
నిర్ణయించిన సమయాలలో పంచ అరణ్య క్షేత్రాలను సందర్శించుకొంటే సత్సంతానం కలుగుతుంది. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. గ్రహ భాధలు తొలగిపోతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది అని విశ్వసిస్తారు.  అయిదు ఆలయాల విశేషాలు తెలుసుకొందాము. 

తిరుక్కరుగవూర్ 

సంతానం కోరుతూ, సుఖప్రసవం ఆశిస్తూ  మరియు గర్భాశయ వ్యాధుల నుండి కాపాడమని ప్రార్ధించే మహిళలతో సంవత్సరమంతా రద్దీగా ఉండే ఈ ఆలయంలో శ్రీ గర్భరక్షంబికై సమేత శ్రీ ముల్లైవననాథర్ కొలువై ఉంటారు. కానీ భక్తులు అధికంగా ఆరాధించేది అమ్మవారినే !  సంతానం లేనివారికి సంతానాన్నిఅనుగ్రహించే కల్పవల్లి, గర్భవతులకు సుఖ సురక్షిత ప్రసవాన్నిప్రసాదించే దేవి, గర్భాశయ వ్యాధుల నుండి రక్షించే అమ్మ పట్ల అత్యంత భక్తి విశ్వాసాలు కలిగి ఉంటారు మహిళా భక్తులు. దీని వెనుక ఒక గాధ ఉన్నది. 
చాలా కాలం క్రిందట ఈ ప్రాంతమంతా మల్లె చెట్లతో నిండిపోయి ఉండేది. వనంలో ఒక బ్రాహ్మణ దంపతులు నివసించేవారు. వారు శివ భక్తులు. లయకారుని అర్చించకుండా పచ్చి గంగ కూడా స్వీకరించేవారు కాదు. ఒకసారి బ్రాహ్మణుని మనస్సులో తీర్ధయాత్రలు  చెయ్యాలన్నసంకల్పం కలిగింది. అంతే గర్భవతిగా ఉన్న భార్యను వదిలి బయలుదేరారు. సంతోషంగా భర్తను పంపి తాను నిత్య పూజలు చేస్తూ ఆశ్రమంలో ఉండి పోయింది. గర్భవతి కావడాన తొందరగా అలసి పోయేది. ఒకనాడు అలానే అలసటతో వాళ్ళు తెలియకుండా నిద్రపోతోంది. ఆ దారిన పోతున్న మహర్షి ఒకరు ఆశ్రమం ముందు ఆగి దాహానికి మంచినీరు ఇమ్మని అర్ధించారు. కానీ గాఢ నిద్రలో ఉన్న ఆమె స్పందించలేదు. ఆగ్రహించిన మహర్షి అతిధిని ఆదరించని ఆమె బయటికి చెప్పుకోలేని వ్యాధితో క్రుంగి కృశించి పోవాలని శపించి వెళ్లిపోయారు. 
శాప కారణంగా సోకిన వ్యాధి వలన ఆమెతో పాటు గర్భస్థ శిశువు కూడా ఇబ్బంది పడుతుండటం చూసిన లోకనాయకి తట్టుకోలేక ఆమె గర్భంలోని పిండాన్ని ఒక మట్టి కుండలో కామధేను పాలల్లో ఉంచి సంరక్షించసాగింది. సరిగ్గా తొమ్మిది నెలలు నిండే సమయానికి బ్రాహ్మణుడు యాత్రలు  పూర్తి చేసుకొని ఇంటికి చేరుకొన్నారు.వ్యాధితో బాధపడుతున్న భార్యను చూసి విలపించి, ఆదిదంపతులు ప్రార్ధించారు. సాక్షాత్కరించినవారు ఆమెను రోగవిముక్తురాలిని చేసి, కాపాడిన శిశువును దంపతులకు అందించారు. సంతోషంతో బ్రాహ్మణ దంపతులు అమ్మవారిని ఇక్కడే కొలువుతీరి భక్తులను ఆదుకోమని  అర్ధించారు. నిజ భక్తుల విజ్ఞప్తిని కాదనలేక స్థిరపడి పోయారు. గర్భాన్ని రక్షించిన అమ్మవారిని శ్రీ గర్భరక్షంబికై అని, మల్లె చెట్ల వనంలో కొలువైనందున శ్రీముల్లైవననాథర్ స్వామి అని పిలుస్తారు.  గర్భాలయంలోని లింగం మీద మల్లె తీగలు పాకితే ఏర్పడే గుర్తులను స్ఫష్టంగా చూడవచ్చును. గమనించవలసిన అంశం ఏమిటంటే శ్రీ ముల్లైవననాథర్ స్వామి లింగం బంక మట్టితో చేసినది. అందువలన అభిషేకాలు ఉండవు. పునుగు పిల్లి తైలం జల్లుతారు. ఆరోగ్యం కొరకు దీనినే భక్తులు స్వీకరిస్తారు.
సంతానం లేనివారి కొరకు పూజలు చేస్తారు. నెయ్యి ప్రసాదంగా ఇస్తారు. నియమంగా భార్యాభర్తలు మండలం రోజులు సేవిస్తే గర్భం ధరిస్తారన్నది భక్తుల విశ్వాసం. అదే విధంగా సుఖ ప్రసవానికి ఆముదం నూనె ప్రసాదంగా ఇస్తారు. గర్భం మీద రాసుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యం కొరకు భక్తులు ప్రత్యేక పునుగు సత్తం పూజ చేయించుకొంటుంటారు. స్వయంగా వెళ్లలేనివారు నిర్ణయించిన పైకం చెల్లించి తమ వివరాలను పంపి ప్రసాదాలను తెప్పించుకోవచ్చును. పూజలు చేయించుకోవచ్చును. 
నియమంగా నాలుగు పూజలు జరుపుతారు. కానీ పంచ వనేశ్వర క్షేత్రాలను దర్శించాలి సత్ఫలితాలను పొందాలి అనుకునేవారు ఈ క్షేత్రంలో తొలిపూజ అంటే ఉదయం అయిదున్నర నుండి ఆరు లోపల చేయించుకోవాలి.  తిరుక్కరుగవూర్ కుంభకోణానికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

అవలియనల్లూరు 

స్థానికంగా పత్రి వనం గా పిలిచే ఈ ప్రాంతం ఒకప్పుడు ఉమ్మెత్త మొక్కలతో నిండి ఉండేదట. . గర్భాలయంలో లింగ రూపంలో శ్రీ సాక్షినాథర్ అన్న పేరు ధరించి కొలువై ఉంటారు కైలాసనాథుడు. అమ్మవారు శ్రీ సౌందర్య నాయకి విడిగా సన్నిధిలో దర్శనమిస్తారు.స్వామి వారికి సాక్షినాథర్ అన్న పేరు రావడానికి సంబంధించి ఒక కధ వినిపిస్తుంది. 
స్థానికంగా నివాసముంటున్న బ్రాహ్మణుడు భార్యను పుట్టింట వదలి తాను కాశీ యత్రకు వెళ్ళాడు. చాలాకాలం గడిచిపోయింది. బ్రాహ్మణుని భార్య అనారోగ్యంతో చిక్కి శల్యమై పోయింది. బాధపడుతున్నఅక్కకు చెల్లెలు సేవ చేయసాగింది. చాలాకాలానికి తిరిగి వచ్చిన బ్రాహ్మణుడు మంచంపట్టిన ఆమె తన భార్య కాదని, అదే పోలికలతో ఉన్న మరదలే భార్య అని అనసాగాడు. పెద్దలకు ఏమి చేయాలో పాలుపోలేదు. అందరూ కులదైవమైన పార్వతీ పతిని శరణు కోరారు. వారికి తనపైన గల విశ్వాసానికి ఆనందించిన భోళాశంకరుడు ప్రత్యక్షమై బ్రాహ్మణునికి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అతని భార్య అని సాక్ష్యం చెప్పారట. అంతే కాకుండా
ఆమెను ఆరోగ్యవంతురాల్ని చేసి అతనికి అప్పగించారు.బ్రాహ్మణ కుటుంబమంతా ఆనందంతో స్వామికి స్తోత్రం చేసి అక్కడే కొలువుండమని ప్రార్ధించారు. అలా భక్తవత్సలుడు సాక్షినాథర్ గా ఇక్కడ కొలువయ్యారు. స్వామివారిని అగస్త్య, కశ్యప, కణ్వ మహర్షులు, సూర్యుడు, చంద్రుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి సేవించారు. శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో ఇక్కడ స్వామిని ప్రార్ధించారట.
ప్రాంగణంలో వినాయక, కుమారస్వామి, కణ్వ ముని, వీరభద్ర, సప్త మాతృకలు, అరవై మూడు మంది నయమ్మార్లు, దక్షిణామూర్తి, భైరవ, నటరాజు, సూర్య, చండికేశ్వర మరియు బ్రాహ్మణుడు, అతని భార్య మరియు మరదలు ఉంటారు.
ఈ ఆలయంలోని నవగ్రహ మండపంలో ఒక విశేషం కనపడుతుంది. సహజంగా వివిధ దిశల వైపు తిరిగి ఉండే గ్రహాలన్నీ ఇక్కడ కేంద్రంలో ఉన్న సూర్యభగవానుని వైపు తిరిగి ఉంటాయి. అరుదైన దృశ్యం.
శ్రీ సౌందర్యనాయకీ సమేత శ్రీ సాక్షినాథర్ స్వామిని ఉదయం తొమ్మిదిన్నర నుండి పది గంటల మధ్య కాలంలో సందర్శించుకోవడం అభిలషణీయం. ఈ క్షేత్రం తిరుక్కరుగవూర్ కి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

హరిద్వార మంగళం 

పంచ వనేశ్వర ఆలయాలలో మూడవది. అవలియనల్లూరు కు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఊరు ఒకప్పుడు జమ్మి చెట్లతో నిండి ఉండేదట. ప్రస్తుతం ఆలయ వృక్షం జమ్మి చెట్టే. 
 బ్రహ్మకు తనకు మధ్య మొదలైన వివాదాన్ని పరిష్కరించడానికి అగ్నిరూపంలో సాక్షాత్కరించిన త్రినేత్రుని మూలం కనిపెట్టడానికి శ్రీహరి భూవరాహ రూపంలో పాతాళానికి వెళ్ళినది ఇక్కడ నుండే అని చెబుతారు. ఒకప్పుడు ఆలయంలో సొరంగం ఉండేదట. ప్రస్తుతం మూసివేశారు. ఈ కారణంగానే హరి ద్వార మంగళం అన్న పేరొచ్చినట్లుగా చెబుతారు.
పాతాళం దాకా ఉన్న లింగరాజుగా స్వామివారిని శ్రీ పాతాళేశ్వర స్వామి అని పిలుస్తారు. అమ్మవారు అలంకార వల్లి. విడిగా సన్నిధిలో కొలువై ఉంటారు.
శ్రీ పాతాళేశ్వరస్వామి భక్తుల ఋణ బాధలను, అమ్మవారు గ్రహ దోషాలను, మానసిక అశాంతిని తొలగిస్తారన్నది  భక్తుల నమ్మకం. రాజరాజ చోళుడు నిర్మించిన ఆలయ ప్రాంగణంలో ఏడుగురు వినాయకులు వివిధ సన్నిధులలో కొలువై భక్తులను ఆశీర్వదిస్తారు. ఉపాలయాలలో నటరాజ స్వామి, వ్యాఘ్రపాద మహర్షి, కాశి విశ్వనాధ లింగం, భైరవ, సూర్య, చంద్ర, శని, సప్త మాతృకలు మరియు జ్ఞాన సంబందార్ ఉపస్థితులై ఉంటారు. ఆలయానికి ఎదురుగానే పుష్కరణి  బ్రహ్మ తీర్థం ఉంటుంది.
పంచ అరణ్య క్షేత్ర ఫలితం దక్కాలంటే శ్రీ పాతాళేశ్వర స్వామిని మధ్యాహన్నం పదకొండు నుండి ఒంటి గంట లోపల సేవించుకోవాలని అంటారు.

ఆలంగుడి  

కుంభకోణం చుట్టుపక్కల నెలకొన్న నవగ్రహ స్థలాలలో గురు క్షేత్రం.  త్రిభువననాయకి సమేత శ్రీఆపత్సహాయేశ్వర స్వామి కొలువైన దివ్య క్షేత్రం. ఒకప్పుడు ఈ ప్రాంతం బూరుగ చెట్ల వనం. 
ఆది గురువు శ్రీ దక్షిణామూర్తి విద్య, ఆరోగ్యం, నిర్ణయ సామర్ధ్యం, ఆధ్యాత్మికత, జ్ఞాన వైరాగ్యా భావనలను అనుగ్రహించేవాడిగా ప్రసిద్ధి. గురువారాలు, గురువు ఒక రాశి నుండి మరో రాశికి మారే రోజులలో విశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఆ రోజున శ్రీ దక్షిణామూర్తికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుపుతారు.
అరవై మూడు మంది నయమ్మారులలో ప్రసిద్ధుడైన తిరుజ్ఞాన సంబందర్ శ్రీఆపత్సహాయేశ్వర స్వామి వారి మీద గానం చేసిన పాటికాల వలన ఈ క్షేత్రం పడాల్ పెట్ర స్థలాలలో ఒకటిగా గుర్తింపు పొందినది.
క్షీరసాగర మధన సమయంలో ఉద్భవించిన హాలాహలాన్ని స్వీకరించి సమస్త లోకాలను కాపాడిన స్వామి కనుక ఈ పేరుతొ పిలుస్తారు. స్వామి దక్షిణామూర్తి రూపంలో మునులకు సకల వేదసారం బోధించిన స్థలం కూడా ఇదే.
ఉపాలయాలలో వినాయక, సుబ్రహ్మణ్య, సూర్య, చంద్ర, శనీశ్వర, భైరవ, సప్త లింగాలు, శ్రీ దేవి భూదేవి సమేత వరదరాజ పెరుమాళ్, అగస్త్య, విశ్వమిత్ర   నయమ్మార్లు, నవగ్రహ మండపం ఉంటాయి. దక్షుడు మేక మొహంతో ఒక సన్నిధిలో కొలువై ఉండటం విశేషం. ఆ క్షేత్రంతో ముడిపడి ఉన్న ఎన్నో గాధలు స్థానికంగా వినిపిస్తుంటాయి. పంచ వన యాత్ర చేయువారు సాయంత్రం అయిదున్నర నుండి ఆరు గంటల మధ్యకాలంలో శ్రీ ఆపత్సహాయేశ్వర స్వామిని, శ్రీ దక్షిణా మూర్తిని, అమ్మవారిని సందర్శించుకోవాలి. హరిద్వార మంగళం నుండి ఆలంగుడి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

తిరుక్కోళ్ళంపుథూర్ 

పంచ అరణ్య దర్శన యాత్రలో ఆఖరి ఆలయం. ఆలంగుడి కి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు బిల్వ వృక్షాలతో నిండి ఉండేదట. ప్రస్తుతం ఆలయ వృక్షం బిల్వమే. 
శ్రీ సౌందర్య నాయకి సమేత శ్రీ విల్వారణ్యేశ్వర స్వామి కొలువు తీరి ఉంటారు. బ్రహ్మ ఈ క్షేత్రంలో పరమేశ్వరుని సేవించి బ్రహ్మ హత్య దోషం నుండి విముక్తులు అయ్యారని క్షేత్రగాధ. 
బ్రహ్మ పుష్కరణిలో స్నానమాచరించి స్వామివారికి అభిషేకం చేయిస్తే సకల జన్మల పాపం తొలగిపోయి ఇహపర సుఖాలు లభ్యమౌతాయి అంటారు. 
పరివార దేవతలుగా గణపతి, మురుగన్, పంచలింగాలు, శ్రీ గజలక్ష్మి కొలువు తీరి దర్శనమిస్తారు.  గర్భాలయానికి ఎదురుగా ఆలయాన్ని నిర్మించడానికి ధనాన్ని ఇచ్చిన చెట్టియార్, ఆయన భార్య, తమ్ముల నిలువెత్తు విగ్రహాలు జీవం ఉట్టి పడుతూ ఉంటాయి. 
పంచ వన ఆలయ సందర్శనలో ఈ ఆలయాన్ని రాత్రి ఎనిమిది నుండి ఎనిమిదిన్నర లోపల దర్శించుకోవాలి. 

అరుదైన మరియు పుణ్యప్రదమైన పంచ వన / అరణ్య ఆలయ సందర్శనం పూర్తిచేసుకొని తిరిగి కుంభకోణం చేరుకోవచ్చును. లేదా తంజావూర్ వెళ్లవచ్చును.  

నమః శివాయ !!!!
  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...