17, ఏప్రిల్ 2014, గురువారం

Thiruninravur Temples

                           శ్రీ హృదయాలేశ్వర స్వామి ఆలయం 

త్రిమూర్తులలో సదాశివునికి భక్త సులభుడని, భోలా శంకరుడని పేరు. 
  ఇష్ట దైవాన్ని హృదయం నిండా నింపుకొని అన్యధా శరణం నాస్తి అని తలచే వాడే నిజమైన భక్తుడు అని మహానుభావులు ఏనాడో తెలిపారు.
అలాంటి నిజ భక్తులను అనుగ్రహించడంలో భక్తవశంకరుని మించిన వారు లేరన్నది యదార్ధం.
వీటికి తిరుగులేని నిదర్శనంగా నిలిచినదే  తిరునిన్రవూరు లోని శ్రీ హృదయాలేశ్వర స్వామి ఆలయం. 
సుమారు పద మూడు వందల సంవత్సరాల క్రిందట నిర్మలంగా, నిరాడంబరంగా శివ భక్తిని ప్రదర్శించిన భక్తుని, అతని హృదయ పూర్వక పవిత్ర భక్తిని ప్రేమతో స్వీకరించిన సదాశివుని మద్య జరిగిన యదార్ధ సంఘటనలకు నిలువెత్తు నిదర్శనం ఈ ఆలయం.
తిరు నిన్రవూరు ఊరు లో నివాసముండే అనేక మందిలో అతనొకడు.
భూమి, నగ నట్రా, ధనము లేకున్నా మది నిండా శివ భక్తిని నిలుపుకొన్న వాడు.
సర్వకాల సర్వావస్థలయందు దేహానికి విభూది పూసుకొని శివ నామం జపిస్తూ తిరుగుతుండే అతని పేరు ఎవరికి తెలియదు.
ప్రజలు పిచ్చివాడుగా భావించి "పూసలార్" అని ఎగతాళిగా పిలిచేవారు.
తమిళంలో ఆ పేరుకి అర్ధం పూసుకొన్న వాడు అని .
ఎలాంటి భవబంధాలు, ఆశలు లేని అతనికి ఉన్న ఒకే ఒక లక్ష్యం తన ఆరాధ్య దైవానికి ఒక ఆలయం కట్టించాలని.
కాని నిరుపేద.
ఎవరూ సహకరించని పరిస్థితి.
పట్టు వీడలేదు.
హృదయాంతరాలలో నిలుపుకొన్న సర్వేశ్వరునికి హృదయం లోనే గుడి ఎందుకు కట్టకూడదు ? అన్న ఆలోచన రావడంతో ఒక సుముహుర్తం నాడు తన ఊహలలోని ఆలయ నిర్మాణం తన హృదయం లో ఆరంభించాడు.
నాటి నుండి నిరంతరం ధ్యానంలో ఉంటూ రోజుకు కొంతగా ఆలయ నిర్మాణం జరుపుకొన్నాడు.
కొంతకాలానికి అనుకొన్న విధంగా హృదయ మండలంలో నిర్మాణం పూర్తికావచ్చినది.
తన జీవితేచ్చ నెరవేరుతున్నందుకు ఎంతో పొంగిపోయిన ఆ భక్తుడు ఆ ఆలయంలో ఆరాధ్య దైవాన్ని లింగ రూపంలో ప్రతిష్టించడానికి ఒక ముహూర్తం నిర్ణయించుకొన్నాడు.
అదే సమయంలో  కాంచీ పురాన్ని పాలిస్తున్న పల్లవ రాజు " రాజ సింహ" కూడా తన ఇష్ట దైవమైన కైలాస నాదునికి ఒక ఆలయం నిర్మించాడు.
పూసలార్ నిర్ణయించిన ముహుర్తానికే ఆ ఆలయంలో ప్రతిష్టకు జరపడానికి సిద్దమయ్యాడు.
నాటి రాత్రి నంది వాహనుడు రాజుకు స్వప్నంలో కనిపించి ముహూర్తాన్ని మార్చుకోమని, లేకుంటే తాను లేకుండానే ప్రతిష్ట జరుపుకోవాల్సి వస్తుందని తెలిపారట.
అర్దం కాని రాజు స్వామిని కారణమడిగారట.
అదే ముహూర్తానికి తన ప్రియ భక్తుడు తిరునిన్ర వూరులో నిర్మిస్తున్న ఆలయంలో ఉంటానని తెలిపారట.
నిద్ర నుంచి లేచిన రాజు తన రాజ్యంలో ఆ పేరుగల ఊరు ఎక్కడ ఉన్నది? అక్కడ ఏదన్నా ఆలయ నిర్మాణం సాగుతున్నదా ? అన్న విషయాలను కనుకొమ్మని ఆదేశించారు.
ఊరు ఎక్కడ ఉన్నదో తెలిసినా అక్కడ ఎలాంటి ఆలయం లేదని తెలిసింది.
పరమేశ్వరును వాక్కు సత్య దూరం కాదు. ఏదో అద్భుతం ఉన్నది అని తలచిన రాజు తానె స్వయంగా వెళ్లి విచారణ జరపగా పూసలార్ విషయం వెలుగు చూసింది.
ఊరి పెద్దలంతా అతనిని ఒక పిచ్చి వాడిగా తెలిపారు.
అయినా పల్లవ రాజు నమ్మక పూసలార్ను వెతుకుతూ వెళ్ళారు.
పేరుకు తగినట్లే హృదయాకారంలో ఉండే ఆలయంలో నవగ్రహ మండపం, శ్రీ పూసలార్, పల్లవరాజు శ్రీ రాజ సింహ విగ్రహాలుంటాయి.




ఒక చెట్టు క్రింద ధ్యానంలో ఉన్న అతనిని చూసి మహా భక్తునిగా గుర్తించి నమస్కరించిన రాజు తన స్వప్న వృత్తాంతం గురించి చెప్పారు.
ఆనందంతో పొంగిపోయిన పూసలార్ తన హృదయంలో నిర్మిస్తున్న ఆలయం గురించి రాజుకి వెల్లడించారు.
అప్పుడు రాజుకి అర్ధం అయ్యింది భగవంతుడు భక్తుని నుండి ఏమి కోరుకొంటారో !
పూసలార్ హృదయంలో నిర్మించుకొన్న ఆలయాన్ని తాను నిర్మిస్తానని దానికి అనుజ్ఞ ఇమ్మని అర్ధించాడు.
శివాజ్ఞ అదే అని భావించిన పూసలార్ సరే నన్నారు.
అదే నేడు తిరు నిన్ర వూరు లో ఉన్న శ్రీ హృదయాలేశ్వర స్వామి ఆలయం.
నాడు పల్లవ రాజు కాంచీ పురంలో నిర్మించినది ఒక అద్భుత శిల్ప నిలయంగా పేరొందిన కైలాస నాదర్ ఆలయం.
పూసలార్ గాయక శివ భక్తులైన నయన్మారులలో ఒకరుగా ప్రసిద్ది చెందారు.
సువిశాల ఆవరణంలో నిర్మించబడిన ఈ ఆలయానికి తూర్పు పడమరలలో ప్రవేశ ద్వారాలున్నాయి.


తూర్పు ద్వారంగుండా ప్రవేశిస్తే వచ్చే మండపంలో ధ్వజస్థంభము, బలిపీఠము నందీశ్వర మండపం ఉంటాయి











ప్రధాన ఆలయానికి శివ పుత్రులైన గణేశ కుమార స్వాములే ద్వారపాలకులు.  


మండప పై భాగంలో ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న గాధను తెలిపే చిత్రం, అదే విధంగా కన్నప్పవృత్తాంతము, కాంచీపుర శ్రీ ఏకాంబరేశ్వర ఆలయ వృత్తాంతము తెలిపే వర్ణ చిత్రాలను సుందరంగా చిత్రీకరించారు. 







అమ్మవారు శ్రీ మరకతాంబికై దక్షినాభి ముఖంగా కొలువు తీరి ఉంటారు. 
గజ పృష్ట విమానంతో ఉన్న గర్భాలయంలో శ్రీ హృదయాలేశ్వర స్వామి లింగ రూపంలో దర్శనమిస్తారు. 
తమిళనాడులో శివాలయాలలో ఒక అద్భుత అలంకరణ ఆవిష్కృత మవుతుంది. 
లింగానికి ధోవతి ఉత్తరీయం కట్టి చందన, కుంకుమ, విభూది తో పాటు సుందర పుష్పాలతో రమణీయంగా అలంకరిస్తారు. 
నేత్ర పర్వంగా ఉంటుందా అలంకరణ.  
గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ దక్షిణా మూర్తి, శ్రీ వీర భద్ర, శ్రీ దుర్గా, శ్రీ చెండికేశ్వర రూపాలను, శ్రీ తాండవ గణపతి రూపాన్ని విగ్రహాలుగా మలచి నిలిపారు. 




పడమర వైపున మరో వినాయక సన్నిధి, సప్త మాత్రుకల సన్నిధి ఉంటాయి. 
ప్రతినిత్యం ఎన్నో అభిషేకాలు, పూజలు, అలంకరణలు ఇక్కడ కొలువైన ఆది దంపతులకు జరుపుతారు. 
భక్తులు ముఖ్యంగా హృద్రోగాలతో భాదపడుతున్నవారు ఎక్కువగా వస్తుంటారు. 
ఇక్కడి అభిషేక జల సేవనంతో హృదయ సంబంధిత వ్యాదులు తగ్గుతాయి అన్నది తర తరాల విశ్వాసం. 









శివరాత్రి, నవ రాత్రులు, గణేష చతుర్ధి, కార్తీక మాస పూజలు, త్రయోదశి నాడు ప్రదోష సమయంలో ప్రత్యేక అభిషేకాలు ఘనంగా జరుపుతారు.  
మహోన్నత భక్తుని గురించి తెలిపే ఈ ఆలయం చెన్నైకి నలభై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరునిన్రావూరు లోని శ్రీ భక్త వత్సల పెరుమాళ్ ఆలయానికి అతి సమీపంలో ఉంటుంది. 
అరక్కోణం వెళ్ళే అన్ని లోకల్ రైళ్ళు ఇక్కడ ఆగుతాయి. 
స్టేషన్ నుండి ఆలయం మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

నమః శివాయ !!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...