28, ఏప్రిల్ 2014, సోమవారం

Guntur Temples

           శ్రీ వేణుగోపాల స్వామి దేవాలయం , గుంటూరు 




మానవ జన్మ తాలూకు బంధాలు అనుబంధాల గురించి, ఆత్మ పరమాత్మల సంభంధం గురించి, సచ్చీలులను,  సజ్జనులను, నిజ భక్తులను, భగవంతుడు ఎలా ఆదరిస్తారో తన చేతల (లీలల), బోధనల ద్వారా తెలియ చెప్పిన పురాణ పురుషుడు శ్రీ కృష్ణుడు. 
అధర్మాన్ని అంతం చేసి ధర్మాన్ని కాపాడిన లీలా మానుష రూపుడు వాసుదేవుడు. సమస్త ప్రాణి కోటిని గమ్యం వైపుకు నడిపించే పార్ధసారధి. జగమంతా తానై నిండిపోయిన  జగన్నాదునికి ఆలయాలకు కొదవేమున్నది. పూరి, ద్వారక, ట్రిప్లికేన్, గురువాయూరు ఇలా ఎన్నో క్షేత్రాలలో గోపాల కృష్ణ మూర్తి కొలువై ఉన్నారు. 
ఇవే కాకుండా ఎన్నో ప్రాంతాలలో ఎన్నో పురాతన దేవాలయాలు ఆయన స్వగృహాలే! అలాంటి వాటిల్లో  గుంటూరు పట్టణంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం ఒకటి. చరిత్రలో "గర్త పురి"గా అనేక శాసనాలలో పేర్కొన్న నేటి గుంటూరులో  అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. 
పట్టణంలో పురాతన ఆలయాలలో మొదటిదిగా పాత గుంటూరులో ఉన్న శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం గుర్తింపు పొందగా, రెండవ స్థానం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానిదే అని చెప్పవచ్చును.సుమారు వెయ్యి సంవత్సరాల ఈ ఆలయం ద్వాపర యుగం నాటి విశేషాలకు, కలియుగ నిర్మాణాలకు ప్రత్యక్ష సాక్ష్యం.










సప్త మహర్షులలో ఒకరు మానవులకు మార్గ దర్శకం చేసే "మానవ ధర్మ శాస్త్రం" అందించిన వారు గౌతమ మహర్షి. ద్వాపర యుగంలో మహర్షి భూలోకములోని తీర్థస్థలాల సందర్శనలో  అనేక జలాశయాలతో నిండిన ఈ ప్రాంతం చేరుకొన్నారు. కొంత కాలం నివాసముండటానికి నిర్ణయం చేసుకొని శ్రీ మన్నారాయణ మూర్తి ధరించిన అనేక అవతారాలలో నేటికి ఆఖరిదిగా పరిగణింపదగిన జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ గోవర్ధన గిరిధారి మూర్తిని ప్రతిష్టించారట. ఇక్కడ ఉన్నంతకాలం నియమంగా సేవించుకొని, తాను వెళ్ళిన తరువాత ఆలయ నిర్వహణా భాద్యతలను స్థానిక పాలకునికి అప్పగించారట. 
ఆయనచే ప్రతిష్టించబడిన బృందావన విహారి విగ్రహం మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత జరిగిన దేశ విభజన సమయంలో తలెత్తిన దాడులలో భిన్నం కాబడినది అని తెలుస్తోంది. ఆలయ ఉత్తర గోడ వద్ద ఉంచబడిన ఆ విగ్రహాన్నినేటికి వీక్షించవచ్చును. 














తనంతర కాలంలో ఆ పంరంపర కొనసాగుతూ వచ్చి పన్నెండవ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పడుగు రాజు ప్రస్తుత ఆలయాన్ని నిర్మించినట్లుగా ఆలయంలోని శాసనాలలో ఉదహరించబడినట్లుగా తెలుస్తోంది. ఈ వంశ రాజుల గురించిన సమాచారం ఆంధ్రుల చరిత్రలో లభించుట లెదు. వీరు కొండవీటి, వేంగి చాళుక్యుల దండనాదులో లేక ఈ ప్రాంత అధికారుల గానో భావించ వచ్చును. ఆస్థాన మండప స్థంభాలకు ఉన్న శాసనాలు చాల వరకు వివిధ కారణాల వలన చెరిగి పోయాయి. కొన్ని జైపూర్ లోని  పురావస్తు శాఖ వారి సంగ్రహ శాలకు, కొన్ని విజయవాడ ఇంద్ర కీలాద్రి పైన ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఉన్నట్లుగా చెబుతారు. 




                                








మన జాతి, భాష, చరిత్రలకు శతాబ్దాల సాక్షులైన వీటిని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఒక వేళ వీటిని వేరే రూపంలో భద్ర పరచినట్లయితే అనువదించి సదర్శకుల సమాచార నిమిత్తం ఆలయంలో ఏర్పాటు చెయ్యడం వలన ఆలయ చరిత్ర అందరికి తెలిసే అవకాశం కలుగుతుంది.  
గోపురం లేకుండా ఉన్న రాతి ద్వారం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే కుడి వైపున 
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం దక్షిణ ముఖంగా ఉంటుంది.ఎదురుగా బలి పీఠం, ధ్వజస్తంభం, శ్రీ గరుడాల్వార్ సన్నిధి కనపడతాయి.  









గోపుర గోడలపైన చిన్న చిన్న శిల్పాలు భక్తులవో లేక ఆలయాన్ని నిర్మించిన పరుగు రాజులవో తెలీదు. హనుమంతుడు, శ్రీ కృష్ణ విగ్రహాలు కూడా చెక్కబడి ఉంటాయి. 








ముఖ మండప పైభాగాన శ్రీ రుక్మిణి, సత్యభామా సమేత శ్రీ కృష్ణ పరమాత్మ వర్ణమయ శిల్పాలను ఉంచారు.  









ముఖమండపం గోడలో శ్రీ రామదూత మూర్తిని నిలిపారు. 












మండప దక్షిణ పై భాగాన శ్రీ శేషశయనుని రూపాన్ని ఉంచారు.





ఆలయ నైరుతిలో చిన్న సభా వేదిక నిర్మించారు. పురాణ కాలక్షేపానికి ఇతర గోష్టి కార్యక్రమాలకు ఉపయోగపడుతుంది.అక్కడే గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ అనంత పద్మనాభుని, శ్రీ లక్ష్మి నారసింహుని, శ్రీ రామానుజాచార్య మూర్తులను పెట్టారు.









గర్భాలయ పడమర వైపున శ్రీ కృష్ణ, రుక్మిణి, సత్యభామ, శ్రీ లక్ష్మీ నారాయణ రూపాలను ఉంచారు.







ఉత్తరాన గోపికా సమేత గోవిందుని నాట్య మండపం కనిపిస్తుంది.ఇక్కడే శ్రీ గౌతమ మహర్షి ప్రతిష్టిత పురాతన విగ్రహాన్ని చూడవచ్చును.







ప్రాంగణంలో యాగశాల కూడా కలదు. 






ప్రదక్షిణ పూర్తి చేసుకొని ఆలయ అంతర్భాగం లోనికి ప్రవేశిస్తే స్థంభాలకు చెక్కిన శాసనాలు, వివిధ రూపాలను చూడవచ్చును.










ఆస్థాన మండపం తరువాత చిన్న అర్ధ మండపం ఆ తరువాత ఉన్న గర్భాలయంలో ప్రధాన అర్చనా మూర్తి శ్రీ వేణుగోపాల స్వామి చక్కని అలంకరణతో నేత్ర పర్వంగా దర్శన మిస్తారు. 
గమనించ వలసిన అంశం ఏమిటంటే శ్రీ వేణుగోపాల స్వామి చతుర్భుజునిగా ఉండటం. 
వెనుక హస్తాలలో శంఖు, చక్రాలను, ముందరి చేతులతో మురళిని ధరించిన ఇలాంటి రూపాన్ని అరుదుగా చూడగలం. 
 ఇలాంటి మూర్తిని  సుళ్ళూర్ పేటకు సమీపం లోని మన్నారు పోలూరు గ్రామంలో ఉన్న మరో అరుదైన శ్రీ జాంబవతి సమేత శ్రీ కృష్ణ స్వామి ఆలయంలో దర్శించుకోవచ్చును. పేరు మురళీధరునిది అయినా మూలవిరాట్టు చతుర్భుజునిగా కొలువైన ఆలయాలు కేరళలో అధికంగా కనపడతాయి. 








పక్కనే ఉన్న ఉప ఆలయంలో శ్రీ రాజ్య లక్ష్మి అమ్మవారు కొలువై ఉంటారు.










ధనుర్మాస పూజలు, వైకుంఠ ఏకాదశి, శ్రీ కృష్ణాష్టమి, హనుమజయంతి దినాలతో పాటు ఇతర పర్వదినాలలో ఎందరో భక్తులు ఇక్కడికి వస్తుంటారు.ప్రతి నిత్యం నియమంగా పూజాదికాలు జరుగుతాయి.ఈ ఆలయం సమీపంలో శ్రీ అంకాలమ్మ తల్లి, శ్రీ గుంటి  విఘ్నేశ్వర, శ్రీ షిర్డీ సాయి బాబా ఆలయాలు కూడా ఉన్నాయి.










గుంటూరు బస్సు స్టాండ్ కు దగ్గరలో శ్రీ బ్రహ్మానంద రెడ్డి స్టేడియం కు చేరువలో పాత గుంటూరు లోనికి ప్రవేశించే ముందు యెర్ర చెరువు పక్కనే ఉంటుందీ ఈ చారిత్రక ప్రసిద్ది చెందిన ఆలయం.
కృష్ణం వందే జగద్గురుమ్ !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...