19, మార్చి 2014, బుధవారం

Tiruvattar sri aadi keshava perumal Temple


               శ్రీ ఆదికేశవ పెరుమాళ్ కోవెల - తిరువట్టార్ 

ప్రపంచ ప్రఖ్యాత చెందినది శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం, తిరువనంతపురం.
అలాంటి దానిని మరో ఆలయాన్ని చూసి ఆ ప్రకారం నిర్మించారని అంటే ఎవరైనా నమ్ముతారా ?
కాని అది నిజం. 
ఆధారాలు, ప్రమాణాలు, ప్రత్యక్ష నిదర్శనాలు తెలిపే వాస్తవం. 
ఆ వివరాలు తెలుసుకొందాము. 
భారత దేశ దక్షిణ భాగాన ఉన్న కన్యాకుమారి ఒక శక్తి క్షేత్రం. 
దేశ విదేశ సందర్శకులు ఎంచుకొనే పర్యాటక స్థలాలలో తప్పక ఉండేది.
ఎందరికో అద్భుత అనుభవాలను ప్రసాదించిన కన్యాకుమారి పరిసర ప్రాంతాలు పౌరాణికంగా, చారిత్రకంగా ప్రసిద్ది చెందిన ఆలయాలకు మరియు కడ్డడాలకు పేరొందాయి.
అలాంటి వాటిల్లో ఒకటి " తిరు వట్టారు".
పరలియార్ లేదా వట్టారు నది ఒక ద్వీప కల్పంగా మార్చిన తిరు వట్టారు చేరనాడు శ్రీరంగం, పరశురామ క్షేత్రం లేదా దక్షిణ వైకుంఠము గా ప్రసిద్ది.
అనేక పురాతన తమిళ గ్రంధాలలో ఉదహరించబడిన తిరువట్టారు ఆలయం సుమారు పన్నెండు వందల సంవత్సరాలుగా భక్తుల విశ్వాసాన్ని చూరగోన్నట్లుగా అవగతమౌతోంది.
సుమారు అరవై అడుగుల ఎత్తులో ఉండే ఆలయంలో కొలువు తీరిన "శ్రీ ఆది కేశవ పెరుమాళ్" ఈ ప్రాంతాన్ని పాలించిన ట్రావెంకూర్ రాజులకు, వారి బంధువులైన వేనాడ్ రాజుల ఆరాధ్య దైవం.
ఇక్కడికి సమీపంలోని పద్మనాభ పురం వీరి ఒకప్పటి రాజధాని.
పాత రాజ భవనాన్ని నేటికి వీక్షించవచ్చును.
ఈ ఆలయ నిర్మాణ శైలిలోనే తిరువనంత పుర శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని నిర్మించారు.
ఆలయ ప్రాంతం ఎత్తుగా ఉండటానికి, శ్రీ హరి ఆది కేశవ పెరుమాళ్ గా కొలువుతీరడానికి సంబంధించి ఒక పురాణ గాధ వ్యాప్తిలో ఉన్నది.
విధాత లోక కళ్యాణార్ధం ఒక యాగాన్ని తలపెట్టి, ఈ ప్రాంతాన్ని తగినదిగా ఎంచుకొన్నారట.
కానీ ఆయన తన సతీమణి సరస్వతి దేవి పక్కన లేకుండా యాగాన్ని మొదలుపెట్టడం ఆమెకు ఆగ్రహాన్ని కలిగించిందట.
దానితో దేవి పతిదేవుని యాగాన్ని భగ్నం చేయడానికి అనేక ఆటంకాలను సృష్టించినదట. ( ఇదే గాధ కంచి లోని పలు విష్ణు ఆలయాలతో ముడిపడి ఉండటం విశేషం ).
వాటిని ఎదుర్కోవటంతో కొంత మేరకు యాగం మీద ఏకాగ్రత కోల్పోవడంతో అనుకున్న విధంగా లోక కల్యాణం జరగకుండా లోక కంటకులైన కేశ మరియు కేశిని అనే ఇద్దరు రాక్షస సోదరీ సోదరులు ఉద్భవించారట.
యజ్ఞ గుండం నుండి పుట్టటం వలన వారికి చావు లేకపోగా, అనేక శక్తులు కూడా లభించాయట.
వారిరువురూ మునులను, మహర్షులను, సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టసాగగా, వారంతా కలిసి బ్రహ్మ వద్దకు ఆయన సలహా మేరకు వైకుంఠము వెళ్లారట.
వారి వేదనను విన్న వైకుంఠ వాసుడు కేశ కేశిని బారి నుండి లోకాన్ని కాపాడ భూలోకానికి వచ్చినారట.
స్వామి వారికి కేశ కు నడుమ భీకర యుద్ధం చోటుచేసుకోన్నదిట.
ఎంతో కాలం కొనసాగిన పోరాటంలో వానిని సంహరించలేక తన గదాఘాతంతో మూర్చిల్ల చేయగా అక్కడే ఉన్న ఆది శేషుడు వాని మీద పడి తన శరీరాన్ని చుట్టలుగా చుట్టు కొనగా వాటి మీద స్వామి శయనించారట.
లోపల బందీ అయిన అసురుడు తన చేతులను బయటికి చాపాడట.
అతని శక్తిని సంపూర్ణంగా నిర్వీర్యం చేయడానికి శ్రీ మన్నారాయణుడు ఆ చేతుల మీద పన్నెండు శివలింగాలను ప్రతిష్టించారట.
తిరు వట్టారు పరిసర ప్రాంతాలలో ఉన్న ఆ శివాలయాలు వరసగా తిరుమలై,తిరుపరప్పు, తిక్కురుచి,పొన్మనై, పన్నిప్పాక్కం,కాల్కుళం, మెలాన్కోడు, తిరు విదైకోడ్, తిరు విత్తంకోడ్, తిరుప్పన్నియోడ్ మరియు తిరునట్టాలం.
శివరాత్రి నాడు స్థానిక భక్తులు ఉదయాన్నేబయలుదేరి వరసగా పన్నెండు శివాలయాలను సందర్శించి చివరకు శ్రీ ఆది కేశవ పెరుమాళ్ ని సేవించుకొని తమ శివరాత్రి యాత్రను ముగిస్తారు. 
సోదరుని పరాజయంతో ఆగ్రహించిన కేశిని తన నెచ్చెలి కోదై తో కలిసి నదిగా మారి స్వామి కొలువుతీరిన ప్రాంతాన్నిముంచేయడానికి వేగంగా రాగా భూదేవి వెంటనే ఆ ప్రాంతంలో తన ఎత్తును పెంచుకోగా రెండు నదులూ ఆ స్థలం చుట్టూ తిరిగి ఒకటై విడదీయలేని విధంగా మారిపోయాయట.
నేటికి ఫాల్గుణ మాసంలో వచ్చేఉత్సవాలలో స్వామి వారి "ఆరట్టు" ( పవిత్ర స్నానం ) ఈ సంగమ క్షేత్రంలో జరుపుతారు.
ఆ విధంగా అసుర సోదర సొదరిల భాధ లోకాలకు లేకుండా పోయిందిట.
అలా కేశి కేశిని లను శాశ్విత బందీలుగా మార్చి ఇక్కడే కొలువైన శ్రీ హరి ఆది కేశవ పెరుమాళ్ గా పిలవబడుతున్నారు.




ఎత్తైన ప్రదేశంలో ఉన్న ఆలయానికి చేరుకోడానికి సోపాన మార్గం ఉంటుంది.
కేరళ శైలిలో నిర్మించబడిన రెండస్థుల రాజ ద్వారానికి అనుసంధానంగా ముప్పై అడుగుల ఎత్తుతో ప్రాంగణానికి నలువైపులా ప్రహరీ గోడ నిర్మించారు.మిగిలిన మూడువైపులా ద్వారాలుంటాయి.
ప్రాంగణంలో శ్రీ కోవెల చుట్టూ రెండువందల ఇరవై నాలుగు స్తంభాలతో నిర్మించబడిన  "శ్రీ బలిప్పుర" గా పిలవబడే రాతి మండపం ఉంటుంది.
ఒక్కో స్తంభానికి దీప లక్ష్మి గా పిలిచే దీపం పట్టుకొన్న స్త్రీ శిల్పాలుంటాయి.
ఒక్కో శిల్పానిది ఒక్కో అందం. ఇలాంటి మండపమే  తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కనపడుతుంది. కానీ అక్కడి మండపం వైశాల్యంలో చాలా పెద్దది. 




శ్రీ కోవెలకు ఎదురుగా ఉన్న "ఉదయ మార్తాండ వర్మ మండపం"లో చెక్కిన చెక్క చెక్కడాల సౌందర్యం వర్ణింప లేనిది. 
విఘ్ననాధుని ఆరాధిస్తున్న భక్తులు, వివాహానికి తరలి వెళుతున్న బృందం, లక్ష్మణ, ఇంద్రజిత్, వేణుగోపాల, పరాశక్తి, బ్రహ్మ, విష్ణు, కాలభైరవ,నంది, నమ్మాళ్వార్, హనుమంతుడు, మహర్షులు, రతి మన్మదుల విగ్రహాలు అత్యంత రమణీయంగా ఉంటాయి. 
చెక్కతో చేసిన పెద్ద గొలుసు నాటి శిల్ప కారుల నైపుణ్యానికి మచ్చుతునక. 
మురళిని వాయిస్తున్న కృష్ణుడు ఆ గానానికి మైమరచిపోయి నాట్యం చేస్తున్న శివ కేశవులు, మృదంగం వాయించే విధాత.  సహజ జాతి వైరం మరచి పక్కపక్కనే ఉన్న పులి మేక, పాము ముంగీస ఇలా రకరకాల జంతువులను చెక్కిన తీరు చూపరులను మంత్రం ముగ్ధులను చేస్తుంది.






వందల సంవత్సరాల క్రిందట మండప గోడలపైన సహజ వర్ణాలతో చిత్రించిన చిత్రాలు కొంత మేరకు రూపం కోల్పోయినా చక్కగా ఉంటాయి. 
వర్తులాకార శ్రీ కోవెల ముందు పెద్దదైన "ఒట్టుక్కాల్ మండపం" ఉంటుంది. 
దాని మీదకు చేరుకొంటే  పడమర ముఖంగా ఆది శేషుని మీద శయనించిన ఆది కేశవ స్వామిని మూడు ద్వారాల గుండా చూడాలి. తిరువనంతపురం లో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామిని కూడా ఇదే మాదిరి మూడు ద్వారాల గుండా వీక్షిస్తాము.  
గర్భాలయంలో ఎన్నో దేవి దేవతా మూర్తులు మరియు మహర్షుల రూపాలు కూడా ఉంటాయి. 
మరో నిర్మాణ పరమైన అద్భుతం ఏమిటంటే ప్రతి సంవత్సరం మార్చి లోను, అక్టోబర్ లోను మూడు రోజులపాటు సాయం సంధ్యా సమయంలో సూర్య కిరణాలు నేరుగా మూల విరాట్టు పాదాలను తాకుతాయి. 
మరో విశేషం ఇక్కడ కూడా ప్రధాన అర్చనా మూర్తికి అభిషేకాలు జరగవు. ఉత్సవ మూర్తులకే అభిషేకాలు. 
ఖండసారి విధానంలో మూల విరాట్టును పదహారు వేల ఎనిమిది సాల గ్రామాలతో తయారు చేసి, పైన కప్పిన బంగారు కవచానికి  వజ్రాలను చాతీ భాగంలో అమర్చారు. 
కాక పోతే ఆది కేశవ పెరుమాళ్ నాభి భాగంలో ఉండే బ్రహ్మ ఉండడు. విగ్రహం కూడా శ్రీ అనంత పద్మనాభ స్వామి అంత పెద్దదిగా ఉండదు. 
కొన్ని తరాల పాటు తిరు వట్టార్ శ్రీ ఆది కేశవ పెరుమాళ్ ని కొలిచిన ట్రావెంకూర్ రాజులు వారికి వారు పద్మనాభ దాసులుగా ప్రకటించుకొని తిరువనంతపురానికి రాజధానిని ( 1745 వ సంవత్సరంలో)తరలించి చిన్నగా ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని భారీగా పునః నిర్మించారు. 
ముందుగా చెప్పుకొన్నట్లుగా ఈ రెండు ఆలయాల మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ముఖ్యమైన తేడాలు రెండు. మొదటిది తిరువట్టారు మూల విరాట్టు పడమర ముఖంగా ఉండగా తిరువనంతపురం స్వామి తూర్పు ముఖం కొలువై ఉంటారు. 
రెండవది  ఆకారంలో ఈ ఆలయం చిన్నది. ఆ ఆలయం పెద్దది. 
శ్రీ కోవెల ముందున్న "ఒట్టుక్కాల్ మండపం"  తిరువనంతపురంలో చిన్నది. ఈ  ఆలయంలో శ్రీ కృష్ణ, శ్రీ  నారసింహ సన్నిదులుండగా తిరువట్టారు లో ఉప ఆలయాలుండవు. 
 రెండు ఆలయాలలో పూజలు, ఉత్సవాలు ఒకే రీతిన ఉండటం మరో విశేషం. ప్రధాన ఉత్సవాలకు రాజు స్వయంగా తరలి వస్తారు. 
పాలకులైన ట్రావెంకూర్ రాజులు శ్రీ మహా విష్ణువు మీద అపరిమితమైన భక్తి విశ్వాసాలు కలిగి ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. 
స్వామి వారిని ఆపత్ సమయాలలో ఆదుకొన్నారు అని తెలిపే కధనాలు ఎన్నో ప్రచారంలో ఉన్నా నేటికీ ఆలయ ఉత్సవాలతో, పూజలతో ముడిపడి ఉన్న కొన్నింటిని తెలుసుకొందాము. 
తిరు వట్టారు శ్రీ ఆది కేశవ పెరుమాళ్ విజయ కారకుడు. 
ఈ ప్రాంతాన్ని రాజా కేరళ వర్మ పాలించే కాలంలో మొఘలాయి సేనలు దండ యాత్రకు తరలి వచ్చాయిట. 
ఇరు దళాల మధ్యా జరిగిన భీకర పోరులో కేరళ సేనలకు  ఓటమి తప్పని పరిస్థితులలో నాటి సాయంత్రం రాజు ఆలయానికి వెళ్లి  ఆశువుగా పదు నాలుగు చరణాలతో కీర్తించారట. 
అది పూర్తయిన మరుక్షణం గర్భాలయం నుండి ఝుమ్మని శబ్దం చేస్తూ తేనే తీగల గుంపు వచ్చి మొఘలాయి సేనల పైన దాడి చేసాయిట. వారి సేనానితో సహా పెద్ద సంఖ్యలో సైనికులు మరణించడంతో విజయం కేరళ వర్మ ను వరించినది. 
నాటి నుండి నేటి వరకు సాయం సంధ్యా సమయంలో దీపాలు వెలిగించేటప్పుడు కేరళ వర్మ గానం చేసిన " పద సంకీర్తన లేదా ఆది కేశవ స్తవం" పాడతారు. 
మరో సారి రాజా మార్తాండ వర్మ రాజ్యం కోల్పోయి శత్రువుల బారి నుండి తనను తాను కాపాడుకునే ప్రయతంలో ఒక బ్రాహ్మణ గృహానికి చేరుకోన్నాడట. 
భర్తను కోల్పోయిన పేద విధవరాలు వచ్చినది రాజని తెలియక, అతిధిని ఆకలితో పంపకూడదని ఇంటిలో మిగిలిన అన్నం తో ఉడక బెట్టిన మామిడి కాయ ఉప్పు పెట్టినదట. 
కేశవ పెరుమాళ్ ని సేవించుకొన్న తరువాత శత్రువులను ఓడించి రాజ్య పాలనను చేపట్టిన తరువాత మార్తాండవర్మ నాటి సంఘటనకు గుర్తుగా స్వామి వారికి అన్నంతో ఉడక బెట్టిన మామిడి కాయ ఉప్పు నైవేద్యంగా పెట్టడం ఆరంభించి అదే విధమైన నైవేద్యం ఆ బ్రాహ్మణ కుటుంబం వారే సమర్పించాలని శాసనం చేసాడట. 
అది నేటికి కొనసాగుతోంది. 
డచ్ వారి మీద విజయం సాధించిన తరువాత విజయ కారకుడైన కేశవ పెరుమాళ్ కు రాజా వీర కేరళ వర్మ తన పేరు వచ్చే విధంగా "వీరళం" అనే ఒక రకమైన పాయసాన్ని సమర్పించు కొన్నారట. 
స్వామి వారి విగ్రహంలో ఎన్ని సాల గ్రామాలున్నాయో అన్నింటికీ ఒక్కో దానికి ఇన్నిఅని లెక్క కట్టి వందల కిలోల బియ్యంతో ఈ నివేదన తయారు చేస్తారు నేటికి. ( ఎంతో రుచిగా ఉండే ఈ పాయసాన్ని స్వీకరించే భాగ్యం నాకు లభించినది. తెలియకుండానే ఈ రోజునే ఈ క్షేత్రాన్ని దర్శించుకొన్నాను). 
ఆలయంలో ఉన్న అనేక తమిళ శాసనాలు ఎందరో రాజులు, ప్రముఖులు స్వామికి సమర్పించుకొన్న కైకర్యాల వివరాలు తెలుపుతాయి. 
శ్రీ ఆది కేశవ పెరుమాళ్ మహత్యాన్ని తెలిపే మరో గాధ 1740 సంవత్సర కాలంలో జరినట్లుగా తెలుస్తోంది. 
ఆర్కాటు ను పాలించే నవాబు ఈ ప్రాంతం మీదకు దండ యాత్ర జరిపి విజయం సాధించి తిరిగి వెళుతూ స్వామి వారి తనతో ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వెళ్లారట. 
తన రాజ భవనంలో పనికి రాని సామానులు పడవేసే గదిలో ఆ విగ్రహాన్ని అందునా కావాలని అన్నింటి క్రింద ఉంచారట సేవకులు. 
కానీ ఆశ్చర్యకరంగా  మరునాటి ఉదయానికి మూర్తి అన్నింటికన్నా పైన ఉండేదట. ఎన్నో   విధాలుగా విగ్రహాన్ని క్రింద ఉంచాలని చేసిన ప్రయోగాలన్నీ విఫలమయ్యాయిట. 
అదే సమయంలో నవాబు భార్యకు త్రీవ్రమైన కడుపునొప్పి వచ్చి ఏ వైద్యానికి లొంగలేదట. 
సరిగ్గా అప్పుడే ఆలయ పూజారికి స్వామి స్వప్నంలో కనిపించి నవాబు భార్య అనారోగ్యం గురించి తెలిపి, విగ్రహాన్ని తిరిగి ఆలయానికి పంపితే ఆమె ఆరోగ్యం చక్కబడుతుందని ఈ విషయాన్ని నవాబుకు అందజేసి విగ్రహాన్ని తెచ్చే భాద్యత అతనికి అప్పగించారట. 
దేవ దేవుని ఆదేశం ప్రకారం వెళ్లి విషయాన్ని నవాబుకు తెలిపారట పూజారి. 
అప్పటికే భార్య అనారోగ్యం వలన మనస్థిమితం కోల్పోయిన ఆయన విగ్రహం పైకి రావడాన్ని పరిగణ లోనికి తీసుకొని పూజారి చెబుతున్నది సత్యమే అని నమ్మి మూర్తిని తిరిగి ఇచ్చేసారట. 
విగ్రహం ఆలయానికి చేరిన మరుక్షణం ఆమె స్వస్థతను పొందినదట. 
స్వామివారి మహత్యాన్ని పూర్తిగా నమ్మిన నవాబు ఒక బంగారు కలశం, బంగారు పళ్ళెం తన కానుకగా సమర్పించుకొన్నారట. 
నేటికి నివేదనకు వాటినే వాడుతున్నారు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క రోజుల పాటు జరిగే "తిరు అల్ల పూజ "ను నవాబే ఆరంభించారట. ఆలయంలోని చిన్న మండపంలో నిర్వహించే ఈ కలశ పూజలో మహ్మదీయ ఆచారం ప్రకారం "అరిసె " నైవేద్యంగా పెడతారు. 
ఇవే కాకుండా ధనుర్మాస పూజలు, వైకుంఠ ఏకాదశి, శ్రీ రామ నవమి, జన్మాష్టమి ఇతర స్థానిక పర్వదినాలలో ఆలయం వేలాది భక్తులతో కళ కళలాడుతుంది. 
తిరువట్టారు శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి. 
శ్రీ నమ్మాళ్వార్ తన పది పాశురాలలో శ్రీ ఆది కేశవ పెరుమాళ్ ని అనేక విధాలుగా కీర్తించారు. 
ఇక్కడికి తిరువనంతపురం, కన్యాకుమారి మరియు నాగర్ కొయిల్ నుండి చేరుకొనవచ్చును. 
ఎలాంటి సదుపాయాలు లభించవు. 
వాహనాన్ని అద్దెకు తీసుకొంటే సమీపంలోని ప్రదేశాలను తక్కువ వ్యవధిలో సందర్శించే అవకాశం ఉంటుంది. 
ఆలయంలో ఎట్టి పరిస్థితులలోను ఫోటోలను తియ్యనీయరు. 
అద్భుత శిల్ప చెక్క శిల్పాల నిలయమైన ఈ ఆలయ సౌందర్యాన్ని నేత్రాలతో చూసి మనస్సులో భద్రపరచుకోవాలి. 
జై శ్రీ మన్నారాయణ !!!! 
 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...