18, మార్చి 2014, మంగళవారం

Tiruvalla - Sri Vallabha Swamy Temple

   శ్రీ వల్లభ స్వామి ఆలయం - తిరువళ్ళ 

అరుదైన వల్లభ క్షేత్రాలలో తిరువళ్ళ ఒకటి. 
ఒకప్పుడు చిన్న పల్లె ప్రాంతం అయిన తిరువళ్ళ నేడు కేరళలో ఒక ప్రముఖ పట్టణం. 
మణిమాల నదీతీరంలో ఉండటం వలన గతంలో "వళ్ళ వాయి " ( నదీ తీరం) అని పిలిచేవారట. 
గౌరవ పదమైన "తిరు" (శ్రీ ) చేర్చి తిరువళ్ళ గా మార్పుచెందినది.  
శ్రీ వల్లభ స్వామి కొలువు తీరిన క్షేత్రంగా కూడా ఈ పేరు వచ్చినది అంటారు. .
ఇక్కడ  శ్రీమన్నారాయణుడు  "ఘంటాసురుడు " అనే శివ భక్తుడైన అసురునికి ముక్తి ప్రసాదించారని అంటారు. 
ఏడో శతాబ్దానికి చెందిన తమిళ గ్రంధాలలో తిరువళ్ళ ప్రస్తావన ఉన్నందున అంతకు పూర్వం నుండే ఈ క్షేత్రం గుర్తింపు పొందినదని భావించవచ్చును. 
ఇతర ఆధారాల ద్వారా తిరువళ్ళ ఒకప్పుడు పేరుపొందిన విద్యా కేంద్రం. 
కేరళ భూ భాగాన్ని సముద్రుని నుండి తీసుకొన్న తరువాత పరశురాముడు రప్పించిన అరవై నాలుగు బ్రాహ్మణ కుటుంబాలలో కొందరు ఇక్కడే స్థిరపడినారని తెలుస్తోంది. 
ప్రధాన ఆధారాలుగా పేరొందిన వివిధ కాలాల తామ్ర ఫలకాల ద్వారా ఆలయ పౌరాణిక గాధ, చరిత్ర రెండువేల సంవత్సరాల క్రిందటివని నిర్ధారించారు. 
శ్రీ వల్లభ స్వామి విగ్రహాన్ని దేవ శిల్పి విశ్వ కర్మ రూపొందించి ద్వాపర యుగాంతంలో శ్రీ కృష్ణుని సోదరుడైన సాత్యకి కి ఇచ్చారట. 
అప్పటికే అవతార సమాప్తికి నిర్ణయించుకొన్న లీలా మానుష రూప ధారి గరుడుని పిలిచి విగ్రహాన్ని భద్రపరచమని ఇచ్చారట. అతను ఇక్కడి నదీ తీరంలో నిక్షిప్త పరచారట. 
కలియుగారంభంలో కేరళ రాజైన "చేరమన్ పెరుమాళ్" కు ఒక నాటి రాత్రి స్వప్నంలో శ్రీ హరి నదీ తీరంలో నిక్షిప్త పరచిన విగ్రహం గురించి ఆధారాలు ఇచ్చారట. 
వాటి ప్రకారం స్థానిక నంబూద్రీలు మరియు ఇక్కడ స్థిరపడిన తుళు బ్రాహ్మణులూ సంయుక్తంగా జరిపిన అన్వేషణలో స్వామి వారి అర్చనా మూర్తి వెలుగులోనికి వచ్చినదట. 
అందుకే నేటికి ఈ రెండు వంశాల వారే ఇక్కడ పూజాదికాలు నిర్వహిస్తారు. 
అలా లభించిన మూర్తికి పాలకుడు క్రీస్తు పూర్వం యాభై తొమ్మిదో సంవత్సరంలో ఆలయం నిర్మించారని అంటారు. 
సుమారు పది ఎకరాల వైశాల్యంలో ఉన్న ఆలయానికి చుట్టూ ప్రహరి గోడ, నలుదిక్కులా నాలుగు ప్రవేశ ద్వారాలుంటాయి.
ప్రాంగణం లోనికి అడుగు పెట్టగానే సందర్శకులను అబ్భుర పరచే ఎత్తైన ఏకశిలా గరుడ స్థంభం కనపడుతుంది.
పక్కనే ఉన్న బలి పీఠం, ధ్వజ స్థంభం దాటిన తరువాత ప్రధాన ఆలయంలోనికి దారి తీసే ప్రవేశ ద్వారం కనపడతాయి.
పూర్తిగా కేరళ నిర్మాణ శైలిని ప్రతిబింబించే ఈ ఆలయంలో ముఖమండపం, అగ్రమండపం మరియు నమస్కార మండపం ఉంటాయి. వర్తులాకార శ్రీ కోవెల లో స్థానక భంగిమలో సుందర రూపుడైన శ్రీ వల్లభ స్వామి సుదర్శన, శంఖ మరియు పద్మాలను ధరించి ఎడమ ముందు చేతిని నడుము మీద ఉంచుకొని చక్కని అలంకరణతో రమణీయంగా దర్శనమిస్తారు.
గమనించవలసిన విషయం ఏమిటంటే ఒకేసారి స్వామి వారి ముఖము పాదాలను దర్శించలేరు.
ఆలయ నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత అది.
స్వామి వారి వెనుక శ్రీ సుదర్శన చక్రము ( చక్రత్తి ఆళ్వార్ ) పడమర ముఖంగా కొలువు తీరి ఉంటారు.
దూర్వాస మహా ముని శ్రీ సుదర్శన చక్రాన్ని ప్రతిష్టించారని, ప్రతి రాత్రి ఆయన వచ్చి స్వామిని సేవించుకొంటారని అంటారు.
సుదర్శన చక్ర ప్రతిష్ట వెనక ఒక గాధ ప్రచారంలో ఉన్నది.
పురాణ కాలంలోశంకర మంగలతమ్మ అనే బ్రాహ్మణ వితంతువు ఇక్కడ నివసించేదట.
విష్ణు భక్తురాలైన ఆమె నియమంగా ఏకాదశి వ్రతం ఆచరిస్తూ ద్వాదశి నాడు బ్రాహ్మణునికి ఆతిధ్యం ఇచ్చేదట.





కొంత కాలానికి "తోలకాసురుడు" అనే రాక్షసుడు ఆ ప్రాంతాలకు వచ్చి ప్రజలను భయభ్రాంతులను చేసి వెళ్ళగొట్టేసాడట. దానితో ఆ సంవత్సరం శంకర మంగలతమ్మకు బ్రాహ్మణుడు దొరకలేదట. 
చింతాక్రాంతురాలైన ఆమె శ్రీ హరిని ప్రార్ధించినదట. 
అప్పుడు శ్రీ వల్లభుడు బ్రాహ్మణ వటువు రూపంలో వచ్చి ఆమెను పుష్కరణి వద్దకు బిక్ష తెమ్మనమని తెలిపారట. 
ఆమె అటు వెళ్ళగానే అక్కడికి భీకరంగా అరుస్తూ తోలకాసురుడు రాగా ఇరువురి నడుమ భీకర యుద్ధం జరిగినదట. 
చివరకు స్వామి సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా అది అసురుని సంహరించి తీర్థంలో అంటిన రక్తాన్ని కడుగుకొని భూమిలో స్థిరపడినదట. 
భిక్ష తీసుకొని వస్తున్న శంకర మంగలతమ్మకు రాక్షసుని మరణ వార్త తెలిసినదట. 
పుష్కరణికి చేరుకొని ఆమె ప్రార్ధించగా వటువు రూపంలో ఉన్న వల్లభుడు తన నిజ రూప దర్శనమిచ్చి, మోక్షం ప్రసాదించారట. 
ఈ సంఘటనకు నిదర్శనంగా నేటికి మహా నైవేద్యాన్ని మూల విరాట్టు కన్నా ముందు ఒక బ్రాహ్మణునికి పెడతారు.  


శ్రీ వల్లభ స్వామి సన్నిధిలో చందనాన్ని వెనుక ఉన్న శ్రీ సుదర్శన మూర్తి వద్ద శివాలయంలో మాదిరి విభూది ప్రసాదంగా ఇవ్వడం చెప్పుకోవలసిన విషయం. 
సుమారు యాభై సంవత్సరాల క్రిందటి వరకు స్త్రీలకు ఈ ఆలయ ప్రవేశం నిషిద్దం. 
అతి సుందరుడైన వల్లభుని చూసి మైమరచి మహిళలు గర్భాలయం లోనికి వెళ్ళడమే ఇందుకు కారణం అని చెబుతారు. 
పూర్వం సంవత్సరానికి రెండు సార్లు తిరువతిర (డిసెంబర్ ), ధనుర్మాసం ( జనవరి) సందర్భంగా స్వామి వారికి కిరాతక వేషం వెసేవారట. దాని వలన మూల విరాట్టు అందవికారంగా కనపడేదట. 
ఆ సమయాల్లోనే మహిళలను  ఆలయం లోనికి అనుమతించేవారట . 
1967లో న్యాయ స్థానం ఇచ్చిన తీర్పుతో నేడు ఆడవారు ఆలయం లోనికి రాగలుగుతున్నారు. 
ఇదే కాకుండా మరికొన్ని విశేషాలు ఉన్నాయి. 
ఆలయంలో స్వామికి ఒక రకమైన అరటి పండు మాత్రమే నివేదనగా పెడతారు. 
కధా కళీ నృత్య ప్రదర్శన మొక్కుబడిగా భక్తులు సమర్పించుకొంటారు. 
భక్తులు తాము కోరుకొన్న కోరిక నెరవేరితే స్వామివారికి కృతజ్ఞతగా ఒక రాత్రి కధాకళీ నృత్యాన్ని ఏర్పాటు చేస్తారు. దాదాపుగా ప్రతినిత్యం ఒక ప్రదర్శన ఉంటుంది అంటే ఊహించుకోవచ్చును భక్తులకు వల్లభ స్వామి మీద ఉన్న అచంచల భక్తి విశ్వాసాలను. 
కేరళలో పేరొందిన కధాకళీ కళాకారులు చాలా మంది తిరువళ్ళకు చెందినవారే కావడం ఈ మొక్కుబడే కారణమేమో !
ధనుర్మాసం, కార్తీక మాసం, శబరి మండల మరియు మకర విళక్కు సమయాలలో విశేష పూజలు జరుగుతాయి. 
ఏకాదశి, శ్రీ రామ నవమి, కృష్ణాష్టమి, శివరాత్రి రోజులలో, స్థానిక పర్వ దినాలైన విషు మరియు ఓనం సందర్భంగా వేలాదిగా భక్తులు వళ్లభ దర్శనానికి తరలి వస్తారు. 
మే నెలలో జరిగే ఒక రోజు ఉత్సవం తిరువళ్ళ ఆలయ శోభను పెంచుతుంది. 
ఆ రోజున సమీప గ్రామాలైన కావిళ్, పదప్పాడ్ మరియు అలంతురత్ లలో కొలువైన భగవతి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు గజారూఢులై ఊరేగింపుగా తిరువళ్ళ వస్తారు. 
వైకుంఠ ఏకాదశి తరువాత ఆ రోజే ఉత్తర ద్వారాన్ని తెరుస్తారు. 
రాత్రి అంతా నాట్య గానాలు నిర్వహిస్తారు. అలా వైభవంగా గడిపిన తరువాత మరుసటి ఉదయాన తమ సోదరుని నుండి నూతన వస్త్రాలను తీసుకొని  భగవతి అమ్మవార్లు తమ స్వస్థానాలకు వెళతారు. 
ఉదయం అయిదు గంటల నుండి పన్నెండు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి వుంటుంది ఈ ఆలయం. 
పన్నిద్దరు శ్రీ వైష్ణవ గాయక భక్తులైన ఆళ్వార్ లలో ప్రముఖుడైన శ్రీ నమ్మాళ్వార్ శ్రీ వల్లభ స్వామిని కీర్తిస్తూ పది పాశురాలు గానం చేసారు. 
ఎర్నాకుళం నుండి కొట్టాయం మీదగా తిరువనంతపురం వెళ్ళే మార్గంలో ఉన్నది తిరువళ్ళ. 
అన్ని రైళ్ళు ఆగుతాయి. 
యాత్రీకులకు కావలసిన వసతులు లభిస్తాయి. 
స్టేషన్ నుండి అయిదు కిలో మీటర్ల దూరంలో ఉంటుందీ ఆలయం.   
జై శ్రీమన్నారాయణ !!!!






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...