26, ఆగస్టు 2024, సోమవారం

Sri Durga bhavani Temple, Dhanakonda, Vijayawada

 

                      శ్రీ దుర్గ భవాని ఆలయం, విజయవాడ 

ఇంతకు ముందు  చెప్పినట్లు మన రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ సరైన విషయసమాచారం అందుబాటులో లేకపోవడాన అవి పూర్తిగా వెలుగు లోనికి రావడం లేదు. 
అలాంటి ఒక ఆలయం మన విజయవాడ నగర నడిబొడ్డున ఉన్నది అంటే ఆశ్చర్యం వేస్తుంది. 
ఇంద్రకీలాద్రి మీద కొలువై ఉన్న అమ్మలగన్న అమ్మ శ్రీ కనకదుర్గమ్మ మొదట ఇక్కడే కొలువై ఉండేదన్నది క్షేత్రపురాణం. 
గుంటూరు నుండి వస్తున్నప్పుడు వారధి మీద నుండి  ఎదురుగా చూడండి ఈ సారి ఎత్తైన కొం మీదకు వెళ్లే దారి పైన ఆలయం కనపడతాయి. అదే శ్రీ దుర్గా భవానీ దేవి కొలువైన ధనకొండ. 
ఒకప్పుడు మొఘల్ రాజు విడిది చేసిన ప్రదేశం కావడం వలన మొఘల్రాజ పురం అనిపిలుస్తారు. 
 ఒకప్పుడు ఊరికి దూరమేమో కానీ నేడు ప్రధాన వ్యాపార, విద్యాసంస్థల, గృహాల సముదాయంతో నిండి ఉంటుంది మొఘల్రాజపురం. 
సరిగ్గా అక్కడే ఎత్తైన ధనకొండ మీద శ్రీ దుర్గాభవాని కొలువైన వృత్తాంతం ఏమిటో తెలుసుకొందాము. 





     

  


















క్షేత్రగాధ 

సుమారు రెండువందల సంవత్సరాలకు పూర్వం ఇదంతా అటవీ ప్రాంతం. పశువుల కాపర్లు తమ పశువులను మేత కోసం కొండ పరిసర ప్రాంతాలకు తీసుకొనివెళ్లేవారట. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కూడా పశువులు ఇటూ అటూ వెళుతుంటాయి కదా !
అలా కొన్ని పశువులు కొండ పైభాగానికి వెళ్లి పోయాయట. వాటికి కాచే బాలుడు వెతుక్కుంటూ తాను కూడా  పైకి వెళ్ళాడట. ప్రస్తుతం అమ్మవారు కొలువై ఉన్న గుహ ప్రాంతానికి వెళ్లేసరికి అతనికి కాలి గజ్జెల శబ్దం వివిపించిందట. ఎవరూ కనపడలేదు. కానీ శబ్దం మాత్రం ఆగకుండా ఎవరో అక్కడ సంచరిస్తున్నట్లుగా వస్తూనే ఉన్నది. 
భయపడిన బాలుడు పశువులను తోలుకొని వెనక్కి వెళ్ళిపోయాడట. ఇలా పశువులు పైకి వెళ్లడం, వెతుకుతూ బాలుడు వెళ్లడంకొన్ని రోజులు జరిగాయి. ప్రతి రోజు కాళీ అందేలా శబ్దము వినిపించేది. ఎవరూ కనిపించేవారు కాదు. 
ఒకరోజున అదే విధంగా పైకి వెళ్లిన బాలునికి గుహ వద్ద ఒక మహిళ కనపడిందట. ఎవరో తెలియకపోయినా నమస్కరించాడు బాలుడు. ఆమె ఆశీర్వదించి నీకు కొండా బంగారాన్ని ఇస్తాను తీసుకొని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి పో! అని సంచీడు స్వర్ణాన్ని ఇచ్చిందట. బాలుడు బంగారు మూట తీసుకొని క్రిందకి వెళుతూ కుతూహలంతో వెనక్కి తిరిగి చూశాడట. అప్పటిదాకా కనిపించి స్త్రీమూర్తి గుహలో శిలగా మారిపోయిందిట. ఇల్లుచేరిన బాలుడు బంగారాన్ని చూపించి తల్లితండ్రులకు విషయాన్ని తెలిపాడట. 
అందరూ కలిసి పైకి వెళ్లి చూడగా గుహలో శ్రీచక్ర రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారట. రూపం లేక పోయినా శ్రీ చక్రం లో అమ్మవారి రూపం కనులు, పాదాలు స్పష్టంగా కనిపించాయి. అప్పటి నుండి గ్రామస్థులు ప్రతి దసరాకు జాతర నిర్వహించి, అమ్మవారికి పూజలు చేసేవారట. వెళ్లడానికే సరైన దారి ఉండేదికాదట. 
1987 వ సంవత్సరంలో స్థానిక భక్తులు, యువకులు అందరూకలిసి ఈ దారి ఏర్పాటు చేశారు అని  తెలుస్తోంది. 











అసలు స్థానం 

శ్రీ దుర్గా భవాని దేవి ఇక్కడ శిలా రూపం ధరించడానికి ముందుగానే ఇక్కడి నుండి ఇంద్రకీలాద్రికి వెళ్లిపోయారని ఆలయ గాథ తెలియజేస్తోంది. కానీ నేటికి గజ్జెల చప్పుడు ఆలయ పరిసరాలలో వినిపిస్తుంది అని అంటారు. 
ఇంద్రకీలాద్రి మీద శ్రీ కనకదుర్గాదేవి సౌమ్య రూపిణి. కానీ ధనకొండ మీద   ఉగ్ర రూపం. 
శాంతింపచేయడానికి అనేక అర్చనలు జరుపుతారు. కానీ అమ్మ భక్తసులభురాలు. కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం. 
 మెట్ల మార్గం ఏర్పడిన తరువాత అమ్మవారి దర్శనానికి వచ్చే సంఖ్య పెరగసాగింది. గతంలో శుక్ర మరియు ఆదివారాలలో పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని పూజించుకొని పొంగలి వండి నివేదన చేసేవారట. 
నేడు ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నారు.











ఆలయ విశేషాలు

పర్వత పాదాల నుండి మెట్ల మార్గం ఉన్నది. మొక్కుబడి అంటే మెట్లకు పసుపుకుంకుమ పెట్టవలసి ఉన్న భక్తులు ఆ మార్గంలో వస్తారు. నిటారుగా ఉంటాయి మెట్లు.  సాధారణ భక్తులు కొండ సగం వరకూ మోటార్ సైకిల్ మీద లేదా ఆటోలో చేరవచ్చును. అక్కడి నుండి కొద్దీ మెట్లు ఎక్కితే అక్కడ శ్రీ గణపతి మరియు శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయం వస్తుంది. 
ఆదిదంపతుల కుమారులకు మొక్కి ముందుకు కదిలితే  తొమ్మిది మలుపుల దారి ప్రధాన ఆలయానికి దారి తీస్తుంది.  తొలి మలుపు  దగ్గర స్వాగత తోరణం, శ్రీ గణపతి శ్రీ కుమార స్వామి ఉంటారు. 
ప్రతి దగ్గర అమ్మవారి వివిధ రూపాలైన శ్రీ త్రిపుర సుందరి దేవి, శ్రీ రేణుకాదేవి, శ్రీ గాయత్రీ దేవి, శ్రీ దుర్గా దేవి, శ్రీ లక్ష్మీ దేవి, శ్రీ మహిసాసుర మర్ధిని, శ్రీ సరస్వతి దేవి విగ్రహాలను ఉంచారు. 
తొమ్మిదవ మలుపు దగ్గర శ్రీ అభయ ఆంజనేయ స్వామి దక్షిణాముఖునిగా  దర్శనమిస్తారు. పక్కనే నాగదేవతల సన్నిధి. 
సహజంగా కొండ ఎక్కేటప్పడు ఆయాసపడటం, కాళ్ళు నొప్పులు పుట్టడం జరుగుతాయి.  కానీ ఇక్కడ నిర్మించిన మార్గం అలాంటి ఇబ్బందులు లేకుండా వృద్దులు మరియు భారీకాయులు కూడా సులభంగా ఎక్కే విధంగా ఉంటుంది. 
కొండను తొలిచి గుహాలయానికి ముఖమండపం నిర్మించారు. ఆలయ విమానశిఖరం మరియు కలశ స్థాపన కూడా చేశారు. 
గర్భాలయంలో శ్రీ చక్ర రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు అని తెలుసుకున్నాము కదా ! పూజలకు, అలంకారాలు వీలుగా శ్రీ దుర్గ భవానీ విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. ప్రస్తుతం అన్ని పూజలు ఆ విగ్రహానికే !
ప్రస్తుతం గర్భాలయానికి ఇరుపక్కలా రెండు విగ్రహాలను ఏర్పాటు చేశారు. 
గర్భాలయానికి వెలుపల ధ్వజస్థంభం, పక్కనే అమ్మవారి సింహవాహనంకనిపిస్తాయి . 
ఆలయానికి వెలుపల భక్తులు కూర్చోడానికి వీలుగా విశాలమైన మండపాలను నిర్మించారు. 
దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. 
మంగళ, శుక్ర మరియు ఆదివారాలలో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండున్నర వరకు తిరిగి సాయంత్రం అయిదు గంటల నుండి ఏడు గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. 
ముఖ్యంగా అమ్మవారు ఐదోతనాన్ని కాపాడే దేవతగా, సంతానాన్ని ప్రసాదించే అమ్మగా, ప్రమాదాల బారి నుండి కాపాడే తల్లిగా ప్రసిద్ధి. 
పర్వత పైభాగం నుండి చూస్తే విజయవాడ నగరం దూరంగా ప్రవహిస్తున్న కృష్ణా నది మనోహరంగాకనిపిస్తాయి . 
ఆలయంలో ప్రతి శుక్రవారం మరియు ఆదివారం భక్తులకు అన్నప్రసాద వితరణ సేకరించిన విధుల ద్వారా ఏర్పాటు చేశారు. చిత్రమైన విషయం ఏమిటంటే ఆది దంపతులది అర్ధనారీశ్వర ఏకరూపం. అమ్మవారితో పాటు అయ్యవారు కూడా కొలువై ఉంటారు ప్రతి క్షేత్రంలో !
కానీ ఇక్కడ లింగరాజు ఉండరు. 







కొండ క్రింద కొద్దీ దూరంలో మొగల్రాజపురం శివాలయంగా పిలవబడే  శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ శంభులింగేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. స్వామివారు  బ్రహ్మ సూత్రం కలిగిన పెద్ద లింగ రూపంలో దర్శనమిస్తారు. 
పైన ఉన్న ఆలయానికి క్రింద ఉన్న ఆలయానికి క్షేత్రపాలకుడు రుద్రంశ సంభూతుడైన శ్రీ ఆంజనేయుడు. 
మొఘల్రాజపురంలో తప్పక చూడవలసినవి ఇక్కడ ఉన్న గుహాలయాలు. మొఘల్రాజపురం గుహలు గా పిలవబడే ఇవి మూడు భాగాలుగా ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరు లేక ఏడవ 
శతాబ్దంలో కొన్ని విష్ణుకుండిన వంశ పాలకుల చేత మిగిలినవి తూర్పు  రాజుల చేత నిర్మించబడినట్లుగా చరిత్రకారులు నిర్ధారించారు. ప్రస్తుతం పురావస్తు శాఖవారి నిర్వహణలో ఉన్న ఈ గుహలు తప్పక చూడవలసినవి.    



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Durga bhavani Temple, Dhanakonda, Vijayawada

                        శ్రీ దుర్గ భవాని ఆలయం, విజయవాడ  ఇంతకు ముందు  చెప్పినట్లు మన రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ సరైన విషయసమాచారం అం...