2, ఆగస్టు 2024, శుక్రవారం

Sri Bramaramba Sameta Sri Bugga Malleswara Swami Temple, Morjampadu

                               దక్షిణ శ్రీశైలం  మోర్జంపాడు


జిల్లాలోని చాలా మందికి కనీసం పేరైనా తెలియని కృష్ణానదీతీరం లోని చిన్న గ్రామం మోర్జంపాడు. 
కానీ చారిత్రకంగా పౌరాణికంగా గొప్ప పేరున్న తీర్థ పుణ్య క్షేత్రం. 




ఆలయ పూర్వ గాథ 

ఎవరు ప్రతిష్టించారో తెలియదు ? ఎప్పుడు ప్రతిష్టించారో అస్సలు తెలియదు ? ఎవరు తొలి ఆలయాన్ని నిర్మించారో కూడా తెలియదు ?
ఎన్నో విషయాలు గుప్తంగా ఉన్న మోర్జంపాడు ఒకప్పుడు మునివాటిక అని అంటారు. సహజంగా మహర్షులు నిత్య అనుష్టానానికి నీరు అవసరమని ఆశ్రమాలను ఎక్కువగా నదీతీరాలలో ఏర్పాటు చేసుకొంటుంటారు. అదేవిధంగా నిత్య పూజల నిమిత్తం ఒక శివ లింగాన్ని కూడా ప్రతిష్టించుకొనే వారు అని తెలుస్తోంది. 
అలా వందల సంవత్సరాల క్రిందట మహర్షులు ప్రతిష్టించిన శివలింగమే నేటికీ శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామిగా పూజలు అందుకొంటోంది. 
పద్దెనిమిదో శతాబ్దంలో అమరావతి జమీందారు శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఈ ప్రాంతాలలో పర్యటించారట. ఆ సమయంలో ఆలయం గురించి తెలిసి సపరివారంగా విచ్చేసి పూజలు చేయించుకొన్నారట. శిధిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునఃనిర్మించడానికి మరియు ఆలయ నిర్వహణ కొరకు కైకర్యాలు సమర్పించారట. 
అనంతర కాలంలో భక్తులకు లభించిన శుభఫలితాలతో ఆలయం క్రమంగా అభివృద్ధి చెంది ప్రస్తుత రూపు సంతరించుకొన్నది. 











దక్షిణ శ్రీశైలం 

శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి కొలువైన మోర్జంపాడు ఆలయానికి, జ్యోతిర్లింగ క్షేత్రం మరియు పద్దెనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధికెక్కిన శ్రీశైలానికి కొన్ని సారూప్యతలు ఉండటం వలన దక్షిణ శ్రీశైలంగా పిలవబడుతోంది. 
శ్రీశైలం మరియు మోర్జంపాడు రెండు క్షేత్రాలు అటవీప్రాంతంలో కృష్ణవేణీ నదీతీరంలో నెలకొని ఉన్నాయి. అక్కడ కొలువైనది శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జునస్వామి ఇక్కడ దర్శనమిచ్చేది కూడా శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి. రెండు క్షేతాలు మల్లయ్య స్వామి కొలువైనవే !
శ్రీశైలంలో ప్రత్యేకం శ్రీ వృద్ధ మల్లికార్జునస్వామి సన్నిధి. ముడతలు పడిన లింగ రూపంలో స్వామి ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తారు. 
అదేవిధంగా మోర్జంపాడులో కూడా శ్రీ వృద్ధ మల్లిఖార్జున స్వామి కొలువై ఉంటారు. స్వామి ఆలయానికి విడిగా ధ్వజస్థంభం ఉండటం మూలాన గతంలో మొదట ప్రతిష్టించిన స్వామి ఈయనే అని భావిస్తారు. 
శ్రీశైలంలో పీఠ పాలిక శ్రీ భ్రమరాంబ దేవి ప్రధాన ఆలయానికి వెనుక ఎత్తైన ప్రదేశంలో విడిగా కొలువై దర్శనమిస్తారు. మోర్జంపాడులో కూడా అమ్మవారు శ్రీ భ్రమరాంబ దేవి శ్రీ మల్లేశ్వరస్వామి కొలువైన ఆలయం వెనుక ఎత్తైన ప్రదేశంలో దర్శనమిస్తారు. 
శ్రీశైల క్షేత్రంలో గర్భాలయానికి సమీపంలోని బావి నీటినే స్వామివారి అభిషేకాలకు ఉపయోగిస్తారు. మోర్జంపాడులో గర్భాలయంలో స్వామివారి పక్కనే బుగ్గ రూపంలో గంగమ్మ కొలువై ఉంటుంది. 
ఈ సారూప్యాల వలన స్థానికులు మోర్జంపాడు దక్షిణ శ్రీశైలంగా భావిస్తారు. వివిధ కారణాల వలన శ్రీశైలం వెళ్లలేనివారు తమ మొక్కులను ఇక్కడ తీర్చుకొంటారు. 
 సువిశాల ప్రాంగణంలో కృష్ణా తీరానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ తూర్పు ముఖ ఆలయానికి పడమర వైపున ప్రవేశ ద్వారం ఉంటుంది. పచ్చని చెట్లతో ప్రశాంత వాతావరణం  నిండిన ప్రాంగణంలో భక్తులు విశ్రాంతి తీసుకోడానికి బల్లలు కూడా ఏర్పాటు చేశారు. బిల్వాష్టకం, శివ పంచాక్షరీ స్తోత్రం పెద్దగా రాయించి పెట్టారు. 
క్షేత్రానికి పాలకుడు రుద్రంశ అయిన అంజనీపుత్రుడు. శ్రీరామ దూత శ్రీ భక్త ఆంజనేయునిగా దర్శనమిస్తారు. ఎదురుగా శ్రీ సీత లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర మూర్తి ఉపాలయం ఉంటుంది. 
ఎత్తైన ప్రదేశంలో ఉన్న అమ్మవారి సన్నిధికి పక్కన నూతనంగా నాగ మిధున స్వరూప శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ప్రతిష్టించారు. 
ప్రధాన గర్భాలయ ముఖమండపం సాదాసీదాగా కనపడుతుంది. అర్ధమండపంలో శ్రీ గణపతి, శ్రీ భద్రకాళీ మరియు శ్రీ వీరభద్రుడు దర్శనమిస్తారు. 
గర్భాలయంలో లింగరూపంలో శ్రీ మల్లేశ్వరస్వామి కొలువై ఉంటారు. 
స్వామి వారి కుడివైపున నీటి బుగ్గ ఉంటుంది. సర్వకాలసర్వావస్థలలో బుగ్గలో స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఉదయం నుండి మధ్యాహన్నం అంటే అలంకరణకు ముందు వరకు భక్తులు స్వయంగా బుగ్గ నీటితో స్వామికి అభిషేకం చేసుకొనే భాగ్యం లభిస్తుంది. 
ఈ బుగ్గ లోనికి ఎక్కడ నుండి నీరు వస్తుంది అన్నది తెలియదు. నీరు పాచిపట్టదు. చెడువాసన రాదు. ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండటం విశేషం. 
లింగం క్రింద నుండి నీరు రావడం కొన్ని ఆలయాలలో కనపడుతుంది. కానీ పక్కనే బుగ్గతో కొలువైన గంగాధరుడు మాత్రం ఒక్క శ్రీ బుగ్గ మల్లేశ్వరుడు మాత్రమే !
ప్రధాన ఆలయానికి ఎదురుగా ఆలయ పుష్కరణి ఉంటుంది. 

నాగ బంధం 

మన రాష్ట్రంలో ఎక్కడా కనిపించని విశేషం మనకు ఇక్కడ కనపడుతుంది. 
గత కొంతకాలంగా మనం తరుచుగా వింటున్న పదం "నాగ బంధం". 
తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం మరియు పూరి శ్రీ జగన్నాధ మందిర విషయంలో కూడా ఈ పద ప్రయోగం జరిగింది. అందరిలో నాగ బంధం అంటే ఏమిటి అనే కుతూహలం పెరిగినది. 
నాగ బంధం అంటే రక్షణ కవచం. 
నాగ బంధం ఒక తాంత్రిక ప్రయోగం గా అభివర్ణిస్తారు. తంత్రంతో ఒక అయిదు తలల నాగసర్పాన్ని నాగ బంధంలో బంధనం చేస్తారు. ఎక్కువగా ఈ నాగ బంధం విశేష సంపదకు కాపలాగా ఉంచుతారు అని చెబుతారు. 
నాగ బంధం చేదు ఆలోచనలతో వచ్చినవారికి హాని, మంచి తలంపుతో వచ్చినవారికి మంచి చేస్తుంది అని విశ్వసిస్తారు. 
నాగ శిల్పాలు ఎక్కువగా బాదామీ చాళుక్యులు నిర్మించిన ఆలయాలలో కనపడతాయి. ఉదాహరణకు ఆలంపూర్ నవబ్రహ్మ ఆలయంలో పైకప్పుకు, స్తంభాల పైన సుందరంగా చిత్రమైన రూపాలలో చెక్కిన నాగశిల్పాలు కనపడతాయి. కొంతవరకు పల్లవుల మరియు చోళుల కాలంలో నిర్మించిన ఆలయాలలో కూడా నాగ శిల్పాలు కనిపిస్తాయి. 
మిగిలిన రాజులు ముఖ్యంగా విజయనగర రాజులు నిర్మించిన ఆలయాలలో నాగ శిల్పాలు చాలా అరుదు. 
ఎక్కడో దాచిన సంపదకు రక్షణగా ఉండే నాగ బంధం మోర్జంపాడు ప్రధాన ఆలయ వెనుక వేయడానికి కారణం ఏమిటి ?
ఆలయానికి రక్షణ అని అనుకుందాము. గతంలోనే కాదు నేటికీ ఇది అటవీ ప్రాంతం. ఇక్కడికి వచ్చే భక్తులకు రక్షణ. 
మనం సహజంగా అంటూ ఉంటాము కదా నాగ దోషం లేదా నాగ శాపం అని. జన్మ సమయాన్ని  బట్టి నిర్ణయించిన నక్షత్ర ప్రకారం నాగ, మణి లేదా ఫణి అన్న పేర్లు పెడుతుంటాము కదా పిల్లలకు. అదే విధంగా వివాహం  వారి చేత, వివాహం అయినా సంతానం లేనివారి చేత నాగ ప్రతిష్టలు చేయిస్తుంటాము. ఇవన్నీ నాగ దోషం తొలగిపోవడానికి చేసే పరిహారాలు. 
అన్నింటికీ మించి ధ్యానంలో యోగమార్గంలో భగవంతుని సందర్శించడం. మన శరీరంలో ఏడు చక్రాలు ఉంటాయని అంటారు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత , విశుద్ధ, ఆజా మరియు సహస్రార చక్రాలను ఒకదాని తరువాత ఒకటిగా సాధించడం వలన సహస్రార చక్ర దర్శనం అవుతుంది అంటారు. ఈ దర్శనం మానవ జన్మకు కావలసిన పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది అంటారు యోగులు. అనగా భగవంతుని సందేశం ఈ మానవ జన్మ పరమార్ధం అర్ధం అవుతాయి. 
పురాతన ఆలయానికి వేసిన నాగ బంధం కావడాన పై కారణాలలో ఏదైనా కావచ్చును. మహర్షులు వేయించింది కనుక ఏకారణం లేకుండానూ మానవాళికి ఏ ప్రయోజనం లేకుండా ఉండదు. 
ముక్తి క్షేత్రం అయిన వారణాసిలో కూడా ఒక ఆలయానికి ఇలాంటి ఒక నాగ బంధం ఉన్నది అంటారు. నేను ఇలాంటి నాగ బంధాన్ని గిద్దలూరు పట్టణానికి సమీపంలో ఉన్న మోక్షగుండం ఊరిలోని శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శిలా ఫలక రూపంలో చూడటం జరిగింది. 











ఆలయ పూజలు మరియు ఉత్సవాలు 

గతంలో ఒక్క సోమవారం మాత్రమే ఆలయం భక్తుల కొరకు తెరిచి ఉండేదట. కానీ ప్రస్తుతం ప్రతిరోజూ తెరుస్తున్నారు. నిత్య పూజలు జరుగుతున్నాయి. 
పరిమిత సంఖ్యలో భక్తులు ప్రతిరోజూ వస్తుంటారు. కానీ పెద్ద సంఖ్యలో భక్తులు కార్తీక మాసంలో సోమవారాలతో సహా అన్ని రోజులు  అదే విధంగా మహా శివరాత్రికి వస్తారు. 
యుగయుగాల నుండి పూజలు అందుకొంటున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి కొలువైన దక్షిణ శ్రీశైలం అయిన మోర్జంపాడు పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పిడుగురాళ్ల నుండి ఆటోలు లభిస్తాయి. ఆలయం వరకు చక్కని రహదారి ఉన్నది. 

నమః శివాయ !!!!  





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Durga bhavani Temple, Dhanakonda, Vijayawada

                        శ్రీ దుర్గ భవాని ఆలయం, విజయవాడ  ఇంతకు ముందు  చెప్పినట్లు మన రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ సరైన విషయసమాచారం అం...