16, జూన్ 2024, ఆదివారం

Pancha lingaala

                                        పంచ లింగాల 


రాయలసీమ ఎన్నో విశేష క్షేత్రాలకు నిలయం.  వాటిల్లో కొన్నింటిని సందర్శించే భాగ్యం దక్కించుకోవడం అంటే అది  పరమేశ్వరుని అనుగ్రహం తో !!  వాటిలో ఒకటి పంచ లింగాల. ద్వాపర యుగం నాటి సంఘటనలకు, కలియుగ చరిత్రకు మేలు కలయిక ఈ గ్రామం. చాలా చిన్న ఊరు. కానీ ఎంతో పౌరాణిక చారిత్రక విశేషాల నిలయం పంచ లింగాల. మన పూర్వ రాజధానిని పక్క రాష్ట్రంతో కలిపే ప్రధాన రహదారికి కొద్ది దూరంలో ఉంటుంది. 










 గతంలో కందెనవోలు గా పిలవబడిన నేటి కర్నూలు పట్టణానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పంచ లింగాల. 
శ్రీ పంచలింగేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో పెద్ద కోట ప్రహరీ గోడ మధ్యలో  ద్వారం కనపడతాయి. పక్కనే ఏనాటివో తెలియదు యుద్ధాలలో శత్రువుల మీద ప్రయోగించే పెద్ద పెద్ద గుండ్రటి రాళ్లు కూడా కనిపిస్థాయి. మనం ఇలాంటివి ఈ మధ్య కొన్ని సినిమాలలో కూడా చూడటం జరిగింది. 
పరిసరాలను చూస్తుంటే విన్నది నిజమే అనిపించింది. పురాణ కాల విశేషాలకు, చరిత్ర సత్యాలకు ఈ గ్రామం నిలయం అన్న విషయం. 
అవును. పావన తుంగభద్రా నదీ తీరంలో ఉన్న ఈ ప్రాంతం ఒకప్పుడు రాలయసీమకు ప్రవేశద్వారం. 
విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణ దేవరాయలు ఈ ప్రాంతానికి వచ్చారని, ఇక్కడ శ్రీ వీరభద్ర స్వామి మరియు శ్రీ చాముండీ దేవిని ప్రతిష్టించి శ్రీ పంచలింగేశ్వర స్వామిని కొలిచి విశేష కైంకర్యాలను సమర్పించుకొన్నారని ఇక్కడ ఉన్న శాసనాలు తెలుపుతున్నాయి. ఆలయం వెలుపల ఏ శాసనాలను చూడవచ్చును. 
చాలా పురాతన చిన్న ఆలయం. చుట్టూ నివాస గృహాలు. 
విశేష నిర్మాణాలు లేకుండా సాదాసీదాగా ఉంటుంది ఆలయం. ఒకమండపంలో ప్రధమ పూజ్యుడు శ్రీ గణపతి, పక్కనే బ్రహ్మసూత్రం ధరించిన లింగరాజు. ఇక్కడే భిన్న శిల్పాలను ఉంచడం జరిగింది.  పెద్దవటవృక్షం, దానితో సమానంగా పెరిగిన తెల్ల జిల్లేడు చెట్టు. 
విశేష నిర్మాణాలు కనపడవు. ఎవరు ఎప్పుడు ఈ ఆలయాన్ని నిర్మించారు అన్న వివరాలు కూడా తెలియరావడం లేదు. పూర్తిగా రాతి నిర్మాణం. గోపురం లాంటివి లేవు.  గర్భాలయం పైన మాత్రం ఒక విమాన గోపురం ఉంటుంది. పక్కనే ఉన్న మరో ఆలయంలో శ్రీ గదాధరుడు అయిన శ్రీ గయా నారాయణ స్వామి కూడా ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. నదీతీరంలో పిండప్రదానం చేసి స్వామిని ప్రార్ధిస్తే మరణించిన బంధువులకు సద్గతులు లభిస్తాయని అంటారు. 
ఈ రకంగా పంచలింగాల హరిహర క్షేత్రం. 
చాలా క్రిందకి ఉన్న పైకప్పుతో నిర్మించబడిన ముఖమండపంలో నందీశ్వరుడు గర్భాలయానికి అభిముఖంగా ఉపస్థులై కనిపిస్తారు. పక్కన చిన్న గద్దె మీద శ్రీ వినాయకుడు, శ్రీపార్వతీ అమ్మవారు దర్శనమిస్తారు. 
గర్భాలయంలో ఒకే పానువట్టం మీద అయిదు లింగాలు వరుసగా కనిపిస్థాయి. అరుదైన దృశ్యం. మధ్యలో ఉన్న లింగం మిగిలిన వాటిమీద కొద్దిగా పెద్దది.   ఏ ఆలయంలో కూడా  ఇలాంటి ప్రత్యేకత కనపడదు. కొన్ని ఆలయాలలో ఒకే పాణవట్టం మీద కొన్ని లింగాలు కనపడతాయి. కానీ ఆ లింగం ప్రధాన గర్భాలయంలో ఉండదు. పంచలింగాలలో మాత్రమే ఇలాంటి ప్రత్యేకత చూడగలం. ఇలా ఎందుకు ఎవరు ప్రతిష్టించారు అంటే ఆలయ పురాణ గాథ ఇలా తెలుపుతోంది. 

























పరీక్షిత్తు :

పాడవ మధ్యముడు అర్జనుని కుమారుడైన అభిమన్యుడు మహాభారత యుద్ధంలో పద్మవ్యూహం ఛేదిస్తూ మరణించిన విషయం మనకు తెలిసినదే !
అప్పుడు అతని భార్య ఉత్తర గర్భవతి. మహాభారత యుద్ధం చివరలో ద్రోణుని కుమారుడైన అశ్వద్ధామ కౌరవులు ఓడిపోయి మరణించడంతో కోపోద్రేకుడై "అపాండవం అగు గాక " అని బ్రహ్మాస్త్రం ప్రయోగించాడట. దాని ప్రభావం నుండి ఉత్తర గర్భస్థ శిశువును శ్రీ కృష్ణుడు కాపాడారట
అలా జన్మించినవాడే "పరీక్షిత్తు". ఒకనాడు వేటకు వెళ్లి తపస్సులో ఉన్న మహర్షి జవాబివ్వలేదన్న ఆగ్రహంతో చచ్చిన పాముని మహర్షి మెడలో వేసి పాము కాటుతో మరణించే శాపాన్ని పొందాడు. ఎన్ని విధాల ప్రయత్నించినా తప్పించుకోలేక తక్షకుని కాటుతో చనిపోయారు అని తెలుస్తోంది. 

జనమేజయుడు 

తండ్రి మరణానికి కారణమైన సర్పజాతి మీద ద్వేషంతో సర్ప యాగాన్ని తలపెట్టారు. కొన్ని లక్షల పాములు యాగగుండంలో పది అశువులుబాసాయి. చివరకు దేవతల కోరిక మేరకు ఆపేసారు. కానీ దాని వలన సర్పదోషం జనమేజయ మహారాజుకు సంక్రమించింది. 
దానిని తొలగించుకోడానికి గురువులు, పండితుల సలహా మేరకు భారతదేశ నలుమూలలా కోటి శివలింగాలను ప్రతిష్టించారు. వీటిలో అధికశాతం ఉత్తరభారతదేశంలో ఉన్నాయని అంటారు. అలా దేశం అంతా పర్యటిస్తూ మునివాటిక అయిన తుంగభద్రా నదీతీరానికి చేరుకొన్నారు. 
అక్కడి మహర్షులు సర్ప దోషాన్ని సంపూర్ణంగా తొలగిపోవడానికి ఈ పావన క్షేత్రంలో పంచభూతాలకు అధిపతి అయిన పరమేశ్వర లింగాలను ప్రతిష్టించమని కోరారు. ఆ ప్రకారం పంచభూతాలైన నింగి, నేల, నీరు, నిప్పు మరియు వాయువు లకు ప్రతిరూపంగా అయిదు లింగాలను ఒకే పానువట్టం మీద ప్రతిష్టించారు.  
ఈ ప్రత్యేక ప్రతిష్ట వలన జనమేజయ మహారాజుకు సంక్రమించిన సర్పదోషం సంపూర్ణంగా తొలగిపోయింది. 
జనమేజయుని సర్పదోషాన్ని తొలగించిన పంచలింగాల జిల్లాలో చాలా మందికి తెలియని పరిహార క్షేత్రం. నాగ లేక సర్ప దోషం, కుజ దోషం, జాతకరీత్యా ఏర్పడే నవగ్రహ దోషాలు, జన్మజన్మల కర్మఫలాన్ని, అప మృత్యుభయాన్ని తొలగించే క్షేత్రం. 
కానీ మిగిలిన క్షేత్రాల మాదిరి ఇక్కడ పెద్ద సంఖ్యలో నాగ ప్రతిష్టలు కనపడవు. అదే విధంగా పూజలు, యాగాలు, జపాల మరియు ప్రతిష్టల హడావిడి, సందడి కనపడదు. కారణం క్షేత్రానికి పెద్దగా ప్రచారం లేకపోవడం మరియు అన్ని దోషాలు శ్రీ పంచలింగేశ్వరునికి చేయిన్చే అభిషేకం మరియు దర్శనంతో తొలగిపోయి మనోభీష్టాలు నెరవేరతాయి అన్న  భక్తుల విశ్వాసం ముఖ్య కారణంగా చెప్పాలి. 
నిత్య పూజలు జరిగే ఈ ఆలయంలో వినాయకచవితి, మాస శివరాత్రి, వైశాఖ మరియు కార్తీక మాస పూజలు నియమంగా జరుపుతారు. మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులు కూడా విశేషంగా చేస్తారు. 
ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడు వెళ్లినా అర్చకస్వామి లేకున్నా దర్శనం చేసుకొనే అవకాశం లభిస్తుంది. కబురుచేస్తే అర్చకులు వస్తారు. 











శ్రీ చాముండేశ్వరి దేవి సన్నిధి 

ఆలయానికి ఎదురుగా కొన్ని శిధిల మండపాలు కనపడతాయి. వాటిల్లో ఒకదానిలో శ్రీ కృష్ణదేవరాయల కాలంలో ప్రతిష్టించిన శ్రీ చాముండేశ్వరి దేవి కొలువైఉంటారు . భూమిలోకి ఉన్న చిన్న శిధిల సన్నిధిలో ఉత్తర ముఖంగా దర్శనమిస్తారు అమ్మవారు. నిత్య పూజలు జరుగుతున్నాయి. 
శ్రీ కృష్ణ దేవరాయలు ప్రతిష్టించిన శ్రీ వీరభద్రస్వామి మాత్రం  ప్రధాన ఆలయంలో ఉత్తరాభిముఖులై ప్రత్యేక సన్నిధిలో దర్శనమిస్తారు. 
ఈ ఆలయానికి సమీపంలో శ్రీ  ఆంజనేయ స్వామి పక్కనే శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర మూర్తి ఆలయాలు ఉన్నాయి.  
చక్కని పల్లె వాతావరణంలో శబ్ద మరియు వాయు కాలుష్యాలకు దూరంగా ప్రశాంతంగా ఈశ్వర దర్శనం ఆధ్యాత్మిక భావాలను కలిగిస్తుంది. పంచలింగాలలో ఎలాంటి వసతి ఆహార సదుపాయాలకు అవకాశం లేదు. కర్నూలు పట్టణం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండటం వలన అన్ని సౌకర్యవంతమైన వసతులు అక్కడ లభిస్తాయి. అన్ని ప్రదేశాల నుండి కర్నూలు చేరుకోడానికి బస్సు మరియు రైలు రవాణా సౌకర్యం లభిస్తుంది. కర్నూల్ పట్టణంలో కూడా బళ్లారీ చౌరస్తాలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం, కొండారెడ్డి బురుజు, శ్రీ షిర్దీ సాయి బాబా ఆలయం, శ్రీ పంచవర్ణేశ్వర స్వామి ఆలయం జగన్నాథ గట్టు చూడదగినవి. 
అష్టాదశ పీఠాలలో ఒకటి అయిన శ్రీ జోగులాంబ దేవి కొలువైన అలంపురం కర్నూలు కు దగ్గరే !
 కుజ, సర్ప దోషాలు కలిగినవారు తప్పనిసరిగా ఒకసారి పంచలింగాల క్షేత్ర సందర్శించడం వలన ఉపయోగం పొందగలరన్నది భక్తుల విశ్వాసం. 

నమః శివాయ !!!!!

నమః శివాయ!!!! 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Durga bhavani Temple, Dhanakonda, Vijayawada

                        శ్రీ దుర్గ భవాని ఆలయం, విజయవాడ  ఇంతకు ముందు  చెప్పినట్లు మన రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ సరైన విషయసమాచారం అం...