2, అక్టోబర్ 2018, మంగళవారం

Nataraja Temples, Tamilnadu

                            

                           

                              పంచ నటరాజ ఆలయాలు

                                                                                                         = ఇలపావులూరి వెంకటేశ్వర్లు                         



నటరాజ ఆలయం అనగానే అందరికీ కళ్ళ ముందు లేదా మదిలో మెదిలేది చిదంబర నటరాజ స్వామి ఆలయం ఒక్కటే. లింగ రూపంలో పూజలందుకొని కైలాసనాధుడు మూర్తి రూపంలో     ఆరాధించబడేది ఒక్క చిదంబరంలోనే. అసలు శివాలయాలలో ఉత్సవమూర్తి నటరాజే.  నాట్యానికి మూలపురుషుడైన నటరాజు ఆనందతాండవం సలిపిన అయిదు నాట్య సభలు తమిళనాడులో ఉన్న సంగతి తెలిసినదే. అవే తిరువళంగాడు, చిదంబరం, మధురై, తిరునెల్వేలి మఱియు కుర్తాళం. వివిధ సందర్భాలలో ఈ క్షేత్రాలలో నాట్యం చేసినట్లు ఆయా క్షేత్రాల గాధలు తెలుపుతున్నాయి. వీటిల్లో చిదంబర స్థానం విశేషమైనది. 
రమణీయమైన పుష్ప అలంకరణతో చిత్ సభలో నేత్రపర్వంగా కొలువైన నటరాజ స్వామి సౌందర్యాన్నివర్ణించడం సాధ్యం కాదు. అంతే సౌందర్యం ప్రదర్శించే మరో నాలుగు నటరాజ విగ్రహాలు తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో వివిధ ప్రాంతాలలో ఉన్న ఆలయాలలో    నెలకొని ఉన్నాయి. ఈ విగ్రహాలను తయారు చేసిన శిల్పి ఒకరే కావడం విశేషం. 
ఆ విశేష క్షేత్రాలు వరసగా చిదంబరం, రాజ వల్లి పురం (చెప్పరాయి), మేళ కరు వేళన్ కుళం, కరిసులంద మంగళం మఱియు కట్టారి మంగళం. 
ఈ విగ్రహాలలో తేడా ఏమిటంటే చిదంబరంలో ఉన్నది స్వర్ణ మూర్తి  కాగా మిగిలిన నాలుగు కాంస్య మూర్తులు.
స్వర్ణ కాంతులు

నటరాజు 

పరమశివుని అవతారం. నాట్యానికి ప్రతిరూపం. శివాలయాలలో ఉత్సవమూర్తి. నటరాజ మూర్తిలో కనపడే ప్రతి ఒక్కటి ప్రత్యేకమైనవే.  సందేశాన్ని అందించేవే కావడం విశేషం. శిరస్సున గంగ, చంద్రవంక, జటాజూటాలతో నాట్యానికి ప్రత్యక్ష రూపంగా కనపడతారు. కుడి వెనక చేతిలోని ఢమరుకం ఒక్క లయకే కాదు కాలానికి సంకేతం. ముందు కుడి చేయి అభయ హస్తం.ఎడమ వెనక హస్తంలో ఉన్న అగ్ని సృష్టి, లయలకు నిదర్శనము. ముందు ఎడమ చేయి  గజ హస్త ముద్ర  చూపుతుంటుంది.
దేహానికి చుట్టుకొన్న సర్పాలు కోరికలకు నిదర్శనం. త్రినేత్రుని మూడు నేత్రాలు సత్వ, రజ, తమో గుణాలకు ప్రతీక. కుడి పాదం క్రింద ఉన్న మరగుజ్జు అపస్మార పురుషుడు అజ్ఞానానికి నిదర్శనం. ఇవన్నీఎవరైతే  సంపూర్ణ శరణాగతిని కోరుకొంటారో వారికి అది లభ్యమవుతుంది అని తెలిపే సంకేతాలని పెద్దలు అంటారు. నటరాజ ఆరాధన మానవులకు ఇహపర సుఖాలను అనుగ్రహించేదిగా పురాణాలు తెలుపుతున్నాయి. 












చిదంబరం  

పడాల్ పెట్ర స్థలాలలో అగ్రస్థానం చిదంబరానిది. కోవెల అంటే శైవులకు చిదంబరమే గుర్తుకు వస్తుంది. అక్కడితో చిదంబర గొప్పదనం ఆగిపోలేదు. పంచ భూత స్థలాలలో, పంచ నాట్య సభలలో, పంచ పులియూర్ ఆలయాలలో ఇలా ఎన్నో ప్రత్యేకత ఆలయాలలో ఒకటిగా గుర్తించబడినది. పంచ భూత స్థలాలైన చిదంబరం, కాళహస్తి మరియు కాంచీపురం ఆలయాలు ఒకే సరళ రేఖలో ఉండటం నాటి శిల్పుల నైపుణ్యానికి నిదర్శనం గా పేర్కొనాలి. అసలు చిదంబర ఆలయంలోనే అయిదు సభలున్నాయి. శివగామి సమేత నటరాజ స్వామి కొలువైనది చిత్ సభ. ఆలయ పూజలను నిర్వహించే కనకసభ చిత్ సభకు ఎదురుగా ఉంటుంది. ధ్వజస్థంభానికి దక్షిణంగా ఉంటుంది నాట్య సభ. ఇక్కడే స్వామి కాళీదేవితో నాట్యపోటీలో తలపడినది. ప్రాంగణంలో ఉన్న వెయ్యి కాళ్ళ మండపాన్ని రాజసభ అంటారు. కుమారులైన వినాయక, కుమారస్వామి మరియు అమ్మవారితో కలిసి సోమస్కంద స్వామి మరియు చండికేశ్వరుడు కొలువైనది దేవ సభ. ఆలయంలోని అనేక నిర్మాణాలు ఎన్నో విశేషాలకు  ప్రతీకలుగా చూపబడుతున్నాయి. ఇంతటి గొప్పదనం  కలిగిన ఆధ్యాత్మిక సౌరభాలను కలిగి ఉన్న ఆలయం మరొకటి కనపడదు అంటే దానిలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. 
నలభై ఎకరాల ఈ ఆలయ ప్రాంగణంలో మరో అరుదైన విశేషం కనపడుతుంది. శ్రీ నటరాజ  స్వామికి ఎదురుగా శ్రీ గోవింద రాజ స్వామి శయనభంగిమలో కొలువై ఉంటారు. ఆళ్వారులు తమ పాశురాలతో శ్రీ గోవిందరాజ పెరుమాళ్ ని కీర్తించారు.
ఈ నటరాజ మూర్తిని మలచిన శిల్పి నమః శివాయ ముత్తు. వివిధ సందర్భాలలో ఆయన మిగిలిన నాలుగు విగ్రహాలను తయారు చేసాడు.చిదంబరంలో కొలువైన నటరాజ స్వామి మూర్తికి మిగిలిన నాలుగు నటరాజ మూర్తులకు గల సంబంధం గురించి ఒక గాధ స్థానికంగా వినిపిస్తుంది. 
సింగవర్మ అనే పాలకుడు తపస్సు చెయ్యడానికి అరణ్యాలకు వెళ్లగా అక్కడ పంతంజలి మరియు వ్యాఘ్రపాద మునీశ్వరుడు కనపడ్డారు. వారితో కలిసి సింగ వర్మ మహేశ్వరుని ఆనంద తాండవాన్ని వీక్షించే అదృష్టాన్ని పొందాడు. మహర్షుల ఆదేశం మేరకు చిదంబర ఆలయాన్ని నిర్మించారు. ప్రతిష్టించడానికి తగిన సుందర నటరాజ మూర్తిని తయారు చేయమని శిల్పుల నాయకుడైన నమః శివాయ ముత్తును ఆదేశించారు. వారు భక్తిశ్రద్దలతో చక్కని నటరాజ మూర్తిని రాగితో తయారు చేసి రాజుకు చూపారు. ఆ మూర్తిలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్న సుందరతను చూసి రాజు రాగితో చేస్తేనే ఇంత అందంగా ఉన్నది అదే బంగారంతో చేస్తే ఇంకెంత సుందరంగా ఉంటుందో అని శిల్పిని స్వర్ణమూర్తిని చేయమని ఆదేశించాడట. అతను అదే శ్రద్ధాభక్తులతో తయారుచేసాడట. సంతృప్తి చెందిన రాజు దానిని ఆలయంలో ఉంచారట. కానీ రాత్రి పూట ఆ విగ్రహం బంగార వెలుగులు చిమ్మకుండా వెలవెల పోతూ రాగి వర్ణం లోనికి మారిపోయేదట. బంగారం మీద ఆశతో శిల్పి ఇలాంటి విగ్రహాన్ని తయారు చేసాడని తలచిన రాజు ముత్తును చెఱసాలలో పెట్టాడట. నిజాయితీపరుడైన ముత్తు పరమేశ్వరుని ప్రార్ధించారట.
ఆ నాటి రాత్రి రాజుకు స్వప్న దర్శనమిచ్చిన నటరాజ స్వామి, శిల్పి పొరబాటు ఏమీ లేదని తాను తామ్రవర్ణంలో ఉండటానికి ఇష్టపడతానని తెలిపారట. జరిగిన పొరబాటుకు రాజు పశ్చాత్తాపం చెంది నమః శివాయ ముత్తును విడుదల చేసి రాగి విగ్రహాన్ని బహూకరించి సన్మానించారట. అలా చిదంబర ఆలయంలో స్వర్ణ నటరాజ మూర్తి కొలువైనారని తెలుస్తోంది.

చెప్పరాయి శ్రీ నటరాజ స్వామి ఆలయం, రాజవల్లి పురం 

నమః శివాయ ముత్తు,  రాగి నటరాజమూర్తితో తమిరబారాణి నదీతీరంలోని రాజవల్లిపురం వద్దకు వచ్చేసరికి విగ్రహం యొక్క బరువు మోయలేనంతగా పెరిగి పోయిందిట. చేసేది లేక క్రింద ఉంచేశారట. అలా చిదంబర ఆలయం కొఱకు తయారు చేసిన రాగి విగ్రహం రాజవల్లి పురం చేరుకొన్నది. ఈ కారణంగా దీనిని దక్షిణ తిలై (చిదంబరం) అని అంటారు. తమిళంలో రాగిని చెప్పు అంటారు. రాగితో తయారు చేసిన విగ్రహం కొలువైనందున చెప్పరాయి శ్రీ నటరాజ స్వామి ఆలయం అని పిలుస్తారు. 
సుందర నటరాజ స్వామి కొలువైనందున అళగియ కూతనార్ కోవెల అని కూడా పిలుస్తారు. పాండ్యరాజుల సేనాధిపతి అయిన వీర పాండ్యన్  నటరాజ స్వామి విగ్రహ సౌందర్యానికి ముగ్ధుడై శ్రీ కాంతిమతి సమేత శ్రీ నెల్లిఅప్పార్ (పరమశివుడు)లను మూలవిరాట్టులుగా ప్రతిష్టించి చిదంబర ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మించాడని గ్రంధాల ఆధారంగా తెలుస్తోంది. చిదంబరానికి వెళ్లలేని భక్తులు ఇక్కడికి వస్తుంటారు. విద్యాప్రసాదునిగా శ్రీ నెల్లిఅప్పార్ స్వామికి పేరు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు దర్శించుకొంటుంటారు. వివాహం మరియు సంతానం కొఱకు వచ్చే భక్తుల అభీష్టము మేరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 
తిరునల్వేలి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నరాజవల్లిపురం సులభంగా చేరుకోవచ్చును. 
ఉదయం ఆరు నుండి పదకొండు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు ఆలయం భక్తుల కొఱకు తెరిచి ఉంటుంది. 
డిసెంబర్ నెలలో వచ్చే  ఆరుద్ర దర్శనం సందర్బంగా గొప్ప ఉత్సవం నిర్వహిస్తారు. త్రయోదశి పూజలు, నవరాత్రులు, శివరాత్రి, చవితి మరియు షష్టి పూజలు ఘనంగా చేస్తారు. 
నమఃశివాయ ముత్తు ఇక్కడే స్థిరపడి రాగితో మరో రెండు నటరాజ విగ్రహాలను తయారు చేసాడట. 

శ్రీ కనక సభాధిపతి ఆలయం, కరిసులంద మంగళం 

వీరపాండ్యన్, రాజవల్లిపురం ఆలయం నిర్మించిన తరువాత మరి కొన్నినటరాజ విగ్రహాలను తయారు చేయించాలన్న తలంపు కలిగింది. నేరుగా రాజు ముళుతం కంద రామ పాండ్యన్ వద్దకు వెళ్లి విషయం చెప్పి తగిన శిల్పి కావాలన్నారట. సంతసించిన రామ పాండ్యన్ శిల్పి నమః శివాయ ముత్తు గురించి తెలిపారట. 
పిలిపించి కావలసిన ముడి లోహాన్ని ఇచ్చి విగ్రహాలను చేయమని ఆదేశించారట. మరో మారు తనకు లభించిన అవకాశానికి ఆనందించిన ముత్తు తన విద్యను పూర్తి స్థాయిలో ప్రదర్శించే విధంగా రెండు అద్భుత రూపాలను తయారు చేసి వీర పాండ్యన్ కి చూపించారట. శిల్పి నైపుణ్యానికి ఆశ్చర్యపోయిన వీర పాండ్యన్ లో స్వార్ధం తలెత్తినదట.ఇంతటి అపురూప నటరాజ  రూపాలను చేయించిన కీర్తి శాశ్వితంగా తనకే దక్కాలని ఇంకొకరికి చెందరాదన్న తలంపుతో ముత్తు మరెవ్వరికీ అలాంటి రూపాలను తయారు చేయకుండా అతని కుడి చేతిని నరికించేశాడట.  
మరోసారి తనకు జరిగిన అన్యాయానికి వగచిన ముత్తు అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయాడట.  తాను చేయించిన రెండు విగ్రహాలలో ఒకదానిని నేటి తూత్తుకుడి జిల్లా లోని కత్తరి మంగళం గ్రామంలోని శ్రీ అళగియ కూత్తర్ స్వామి ఆలయంలో ఉంచాడు. రెండో దానిని తిరునెల్వేలి నగరంలోని శ్రీ నెల్లిఅప్పార్ ఆలయంలో ఉంచమని పంపించాడట. కానీ తమిరబారాణి నదికి సంభవించిన వరదల కారణంగా మూర్తిని తీసుకొని వెళుతున్న బృందం మొత్తం కొట్టుకొని పోయిందట. ప్రవాహంలో కొట్టుకొని పోయిన విగ్రహం కరి సులంద మంగళం గ్రామస్థులకు లభించడంతో వారు రాజు వద్దకు వెళ్లి విషయం తెలిపారట. వీరపాండ్యన్ చేసిన ఆకృత్యం తెలుసుకొన్న రామ పాండ్యన్, అతనికి మరణశిక్ష విధించి, గ్రామస్థుల కోరిక మేరకు  స్వామివారికి ఇక్కడే ఆలయాన్ని నిర్మించారట. చిదంబరం లోని కనకసభలో కొలువైన నటరాజ   ప్రతిరూపం కనుక భక్తులు ప్రేమగా శ్రీ కనకసభాధిపతి అని పిలుచుకొంటారు. గర్భాలయంలో మాత్రం శ్రీ సుందరాంబికా సమేత శ్రీ సుందరేశ్వర స్వామి కొలువు తీరి ఉంటారు. ప్రస్తుత ఆలయాన్ని మారవర్మన్ సుందర పాండ్యుడు పదమూడవ శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. నెలకొక ఉత్సవం నిర్వహించే ఆలయంగా ఈ ప్రాంతాలలో ప్రసిద్ధి. భక్తులు గ్రహసంబంధిత దోష పరిహారార్ధం పూజలు జరిపించుకొంటుంటారు. 
తిరునెల్వేలి కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న కరి సులంద మంగళం గ్రామం చేరుకోడానికి ప్రతి పదిహేను నిమిషాలకి బస్సు లభిస్తుంది. ఆలయం ఉదయం ఏడు నుండి పదకొండు వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఏడు వరకు తెరిచి ఉంటుంది.  గ్రామంలోని శ్రీ వెంకటా చలపతి ఆలయం తప్పక సందర్శించ వలసినది.















శ్రీ వీర పాండేశ్వర స్వామి ఆలయం, కత్తరి మంగళం 

శిల్పి ముత్తు తయారు చేసిన రెండు నటరాజ విగ్రహాలలో ఒకటి ఇక్కడ ఉంచబడినది. వీర పాండ్యన్ నిర్మించిన ఆలయం మరియు ప్రతిష్టించిన నటరాజ విగ్రహం కావడాన అతని పేరు మీదే పిలుస్తారు. తమిరబారాణి నదీతీరంలో తూత్తుకుడి జిల్లాలో ఉన్న ఈ క్షేత్రం తిరునెల్వేలి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మూలవిరాట్టు లింగ రూపంలో దర్శనమిస్తారు.  అమ్మవారు నల్ల తావం నాంచారి. ఉపాలయాలలో శ్రీ కన్నిమూల గణపతి, వల్లీదేవసేన సమేత శ్రీ కుమారస్వామి, శ్రీ దక్షిణామూర్తి,  కాలభైరవ, చండికేశ్వర స్వామి, దుర్గ మరియు శనీశ్వరుడు కొలువై ఉంటారు. 
ఈ ఆలయంలో కనిపించే విశేషం ఏమిటంటే నవ గ్రహాలు పత్నులతో కొలువై ఉంటారు. భక్తులు ఎక్కువగా నవగ్రహ, పితృ దోష పూజల నిమిత్తం అధిక సంఖ్యలో వస్తుంటారు. స్వామి మానసిక అశాంతిని, అనారోగ్యాలను తొలగించేవానిగా ప్రసిద్ధి. 

శ్రీ సుందర పాండీశ్వర స్వామి ఆలయం, మేళ కరువేళన్ కుళం 

చేతిని పోగొట్టుకొన్న శిల్పి నమః శివాయ ముత్తు తిరిగి తిరిగి కాలక్కాడను పాలించే  రాజా వీర మార్తాండ సుందర పాండేశ్వర సంస్థానం చేరుకొన్నాడు. ఆ సమయంలో ఒక విధంగా రాజు అతని కొఱకు  చూస్తున్నాడు. రాజకుమారి మానసిక స్వస్థత కోల్పోయి, ఎన్ని రకాల వైద్యం చేసినా గుణం కనపడలేదు. అప్పుడు కేరళకు చెందిన వైద్యులు ఒకరు వచ్చారట. ఆయన వైద్యములోనే  కాకుండా జోతిషంలో కూడా అపార ప్రావీణ్యం కలిగిన వాడట. అరణ్యం మధ్యలో ఉన్నస్వయంభూ లింగానికి ఒక ఆలయం, అక్కడ ఏనుగులు నీరు త్రాగడానికి అవసరమైన పుష్కరణి నిర్మించమని, నియమంగా మండల కాలం స్వామికి పుష్కరణి నీటితో అభిషేకం జరిపిస్తే రాజకుమారి కోలుకొంటుంది అని తెలిపారట.అంతే కాకుండా ఒక శిల్పి త్వరలో రాజు వద్దకు వస్తాడని అతని చేత నటరాజ విగ్రహం లోహంతో చేయించి ఆలయంలో ఉంచమని  చెప్పారట. ఆలయము, పుష్కరణి నిర్మించిన పాండ్యుడు శిల్పి కోసం ఎదురు చూడసాగారు.
విషయం తెలుసుకొన్న ముత్తు విగ్రహ నిర్మాణానికి సమ్మతించాడట.కానీ రాజు మనసులో సందేహం తలెత్తినది ఒక్క చేతితో ఎలా చేస్తాడు అని. వెదురుతో కృత్రిమ హస్తాన్ని ఏర్పాటు చేసుకొని చిదంబర నటరాజ విగ్రహాన్ని పోలిన నటరాజ విగ్రహాన్ని తయారు చేసాడు ముత్తు. అబ్బురపడిన పాండ్యుడు అతనిని ఘనంగా సన్మానించి,విగ్రహాన్ని ఆలయంలో ఉంచారట. త్వరలో రాజకుమార్తెకు స్వస్థత చేకూరిందిట.
ఈ సంఘటనకు నిదర్శనంగా పుష్కరణి మధ్యలో ఒక స్తంభాన్ని స్థాపించాడు పాండ్యుడు. నేటికీ దానిని చూడవచ్చును. క్షేత్ర నామం కూడా ఈ వృత్తాంతాన్ని తెలిపేదే కావడం విశేషం. కరి - ఏనుగు, వేళన్ -ప్రదక్షణ, కుళం - కోనేరు అని అర్ధం.
ప్రస్తుత ఆలయాన్ని ఒకటవ రాజేంద్ర చోళుని కుమారుడైన జటవర్మ సుందర చోళుడు మధురై మీద సాధించిన విజయానికి గుర్తుగా పునః నిర్మించినట్లుగా శాసనాలుతెలుపుతున్నాయి. భక్తులు  మానసిక ఆరోగ్యం కొఱకు ప్రత్యేక పూజలు చేయించుకొంటారు.మండప స్థంభం పైన శ్రీ పరమ కల్యాణీ అమ్మన్ కొలువై ఉంటారు. సంతాన ప్రదాతగా అమ్మవారు ప్రసిద్ధి. విశేష పూజలు  సంతానం లేని దంపతులుజరిపించుకొంటుంటారు.
తిరునెల్వేలి కి నలభై అయిదు కిలోమీటర్ల దూరంలో పాపనాశం వెళ్లే దారిలో పొదిగై  పర్వత పాదాల వద్ద ఉంటుంది ఈ క్షేత్రం. తమిర బారాణి నది జన్మ స్థానం ఈ పర్వతాలే.
కార్తీక మాసంలో భక్తులు మూడు రోజులలో దీక్షగా ఈ అయిదు ఆలయాలను సందర్శిస్తుంటారు. దీని వలన ఆర్ధిక, ఆరోగ్య, కుటుంబ సంబంధిత సమస్యలు తొలగిపోతాయని విశ్వసిస్తారు.
తొలి నటరాజ ఆలయం, పావన క్షేత్రం, పెరియ కోవెల అయిన చిదంబరంలో ఉండగా శివానుగ్రహం పొందిన శిల్పి నమః శివాయ ముత్తు మలచిన మిగిలిన నాలుగు విగ్రహాలు కూడా చిదంబర నటరాజ స్వామి పోలి ఉండటం చూడవలసినదే !




నమః శివాయ !!!!



     

   




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...