19, మే 2018, శనివారం

The Bird

                                         పక్షి "ప్రపంచం"


                                                                                                   






సాయం సంధ్యా సమయం.చల్లని గాలి తెమ్మెరలు మందంగా వీస్తున్నాయి. నలు దిశలా దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. ప్రేరణ పొందిన మయూరం వర్ణభరితమైన పురి విప్పి తన నాట్య కౌశలాన్ని ప్రదర్శించడం చూస్తే ఎవరి హృదయమైనా స్పందిస్తుంది. 
కళ్ళ ముందు కువకువలాడుతూ ముద్దులు పెట్టుకొంటున్న పావురాల జంట ఎంతటి జడుడుల  మదిలోనైనా  ప్రేమానురాగ భావాలను రేకిస్తుంది అంటే అబద్దం ఏమీ లేదు. మిగుల పండిన జామ పండును కొమ్మ మీద వ్రాలి అలవోకగా వంగి ఎఱ్ఱని ముక్కుతో గబగబా కొరికి తినే  రామచిలుక ఆత్రం ముచ్చట గొలుపుతుంది. ఆ చిరు జీవి పట్ల అప్యాయత కలుగుతుంది ఎవరికైనా !   
దట్టంగా పెరిగిన గడ్డి పొదలలో చడీ చప్పుడు లేకుండా కదులుతున్నఎలుకను ఆకాశంలో ఎత్తుగా ఎగురుతూనే గమనించి రెప్పపాటులో పట్టుకున్న డేగ సునిశిత దృష్టి, ఒడుపు,నేర్పు మరియు వేగం సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది చూపరులను. 
ప్రధాన రహదారి మీద వాహనంలో వెళుతూ పరిసరాలను చూస్తూ సేద తీరుతున్న సమయంలో గుప్పున వచ్చిన కుళ్ళిన వాసన కలవరపెడుతుంది. చూస్తే పశు కళేబరాన్నివిందు భోజనంగా కేరింతలు కొడుతూ స్వీకరింస్తున్న రాబందుల గుంపు. మృత కళేబరాల మీద బ్రతికే   అందవిహీనమైన  రాబందులను చూడటానికి ఇష్టపడతారా ఎవరైనా ? కానీ శుభ్రత పరిశుభ్రత   సేవా విషయంలో తొలి సన్మానం వాటికే చేయాలి.

















దృశ్యాన్నిచూడటం వేరు  అనుభవించడం వేరు, వీక్షణం మూలంగా  భావావేశం కలుగుతుంది. అనుభవిస్తే అందులో మమేకమై పోతాము. అందుకే దృశ్యాన్ని,శబ్దాన్ని హృదయం నిండా నింపుకొన్నప్పుడే  తాదాప్యం చెందడం అన్నది జరుగుతుంది.అదే విధంగా  ఇవన్నీ వీక్షకునిలోని భావావేశం కారణంగా తాత్కాలిక సానుకూల స్పందన కలిగిస్తాయి తప్పశాశ్విత ముద్రను వేయవు.ఎప్పుడో సందర్భం వచ్చినప్పుడు ఉదహరించడానికి  గుర్తుకొస్తాయి అంతే ! 
చాలా విచారకరం ! కానీ పైన పేర్కొన్నసంఘటనలు మానవులు తమకు తెలియకుండానే  పక్షుల మీద ఎంతగా ఆధారపడుతున్నారో తెలియచెప్పేవే!
నేటికి అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం పుడమిలో పదివేలకు పైగా పలురకాల పక్షులు ఎగురుతున్నాయి.ప్రతి సంవత్సరం కొత్త జాతులు పుడుతున్నాయి. కొన్ని అంతరించి పోతున్నాయి. మరి కొన్ని పరిరక్షించవలసిన జాబితాలో చేరిపోతున్నాయి.ఇన్ని జరుగుతున్నాఈ చిన్న జీవులు తమకు చాతనైనంతలో ఎవ్వరూ చేయలేని సేవను భూమాతకి తద్వారా మానవజాతికి చేస్తున్నాయి. కిచకిచ ధ్వనులు చేయడం మాత్రమే తెలిసిన పక్షులకు  పర్యావరణ పరిరక్షణ పట్ల ఉన్న అవగాహన విపరీతంగా మాట్లాడే మనకు నేటికీ సంపూర్ణంగా తెలియదు అంటే అది విమర్శ కాదు. పరమ సత్యం.  
పండ్లను తినే పక్షులు తమ రెట్టల ద్వారా గింజలను తాము తిరిగే ప్రాంతంలో విసర్జించి మొక్కల సంఖ్య పెరిగేందుకు తోడ్పడతాయి. వృక్ష సంపద పెరగడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. వృక్షాల వలన స్వచ్ఛమైన గాలి,చల్లని పరిసరాలు, సకాలంలో వానలు పడతాయి. అడవుల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అన్నది అందరికీ తెలిసిన విషయమే కదా ! పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతుంది. పిచ్చికలు, హమ్మింగ్ బర్డ్ లాంటి చిన్నపిట్టలు పూల రంగులకు ఆకర్షించబడి తమ పాదాలు, ముక్కుల ద్వారా పుప్పొడి రవాణా చేసి వృక్ష సంతతి అభివృద్ధికి తోడ్పడతాయి. గద్దలు, గుడ్లగూబలు, కొంగలు లాంటివి పొలాలలో పంటలకు నష్టం     కలిగించే ఎలుకలు, కప్పలు లాంటి జీవులను, దోమలు, ఈగలు, మిడతలు లాంటి పురుగులను స్వాహా చేసి రైతులు నష్టపోకుండా సహాయపడతాయి. దీని వలన హానికారక క్రిమిసంహారక మందులు వాడవలసిన అవసరము తగ్గుతుంది. పిచ్చికలు, గోరింకలు, పావురాలు పొలాలలో పడిన కలుపు మొక్కల గింజలు తింటాయి. అలా కలుపు శాతాన్ని తగ్గిస్తాయి. రైతుకు ఖర్చు తగ్గుతుంది.పంట దిగుబడి పెరుగుతుంది.మనం ప్రమాదకరం అని భావించి కనపడగానే చంపేసే పాముల ద్వారా కూడా కర్షకులకు మేలు జరుగుతుంది. ఎలుకలను, కప్పలను పాములు తింటాయి కదా !












కాకులు,రాబందులు లాంటి పక్షులు ప్రకృతి తనకు తాను ఏర్పాటు చేసుకొన్న పాశుధ్య పనివారు. మరణించిన జంతువుల కళేబరాల మీద బ్రతుకుతాయి. దానితో వాటికి సంవృద్ధిగా ఆహరం, పరిసరాల శుభ్రత రెండూ జరుగుతాయి.
నాట్య మయూరిని, వర్ణమయ విహంగాలను, అరుదైన వలస పక్షులను చూస్తుంటే కాలం ఎలా గడిచిపోతుందో తెలియదు. దృష్టిని ఇట్టే ఆకర్షించే వాటి సౌందర్యం,చిత్ర విచిత్రమైన వాటి  విన్యాసాలు మనస్సును ఆహ్లాదపరుస్తాయి. ఇది నిత్య జీవితంలో ఎదుర్కొనే మానసిక మరియు శారీరక సమస్యల నుండి  స్వస్థత కలిగించే అద్భుతమైన ప్రకృతి వైద్యం. అనుభవజ్ఞులైన మానసిక వైద్యులకు కూడా సాధ్యం కానిదిగా చెప్పవచ్చును. పక్షులు మన కోసం తమ జీవితాలను త్యాగం చేస్తున్నాయి కూడా ! కోడి,పావురం,కణుజు పిట్టల మాంసంతో చేసే పదార్ధాలన్నీ మాంసాహార ప్రియులకు నోరూరించేవే ! జిహ్వను పెంచేవే !
ఇవే కాకుండా పైకి కనపడని ఆర్ధిక అంశం ఏమిటంటే పర్యాటకం ! పక్షుల కేంద్రాలకు ఎక్కువగా విదేశీ యాత్రీకులు వరస కడుతుంటారు. దీని వలన ఆర్ధిక అభివృద్ధి మరియు విదేశీ మారక ద్రవ్యం లభిస్తాయి. అంతర్జాతీయంగా గుర్తింపు అదనం !
శుక పికాలు ప్రత్యక్షంగా భూమాతకు పరోక్షంగా మానవ జాతికి ఇతర జీవులకు చేస్తున్న సేవను గుర్తించిన మన పూర్వీకులు వాటిని దేవతా స్వరూపాలుగా, మహనీయులుగా, మహర్షులుగా, దేవీ దేవతల వాహనాలుగా ప్రత్యేకమైన వివిధ హోదాలను ఇచ్చి గౌరవించారు. ఈ విషయంలో విదేశీయులు తమదైన మార్గాన్ని ఎంచుకొన్నారు. అదే సంవత్సరంలో ఒక రోజును పక్షులకు  కేటాయించడం ద్వారా !








ప్రపంచ పక్షుల దినోత్సవాన్ని తొలిసారిగా 1894వ సంవత్సరం మే అయిదో తారీఖున అమెరికా సంయుక్త రాష్ట్రాల పాఠశాలలో జరుపుకొన్నట్లుగా తెలుస్తోంది. అప్పటి నుంచి ఇదొక సంప్రాదాయంగా మారింది. కాకపోతే ఈ విషయంలో దేశాల మధ్య వత్యాసం ఉన్నది. కొన్ని దేశాలు మే అయిదుకు బదులు అక్టోబర్ రెండో శనివారం నాడు జరుపుకొంటాయి.ఏది ఏమైనా అన్ని దేశాలు విహంగాల అవసరాన్ని గుర్తించి వాటి పట్ల తమ అభిమానాన్ని చాటుకొంటున్నాయి. ప్రతి దేశానికీ ఒక జెండా, గీతం ఉన్నట్లే ఒక పక్షి కూడా ఉన్నది అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. తమ జాతీయ పక్షి పట్ల గౌరవాన్ని నూతన సంవత్సరం తొలి నెల అంటే జనవరి అయిదున వ్యక్తం చేస్తాయి.
పక్షులు ఎగురుతాయి కదా ! అంటే ఒక చోట స్థిరంగా ఉండవు. తాము నివసిస్తున్న ప్రదేశంలో అననుకూల పరిస్థితులు ఎదురైనప్పుడు అవి అనుకూల వాతావరణం ఉండే ప్రాంతాలకు తరలి వెళతాయి. అవే వలస పక్షులు. తమ బ్రతువు తెరువుకు పుట్టిన గడ్డను వదిలి వేరే ప్రాంతానికి తరలి వెళ్లి అతిధులుగా కూడా అక్కడ అలరించే వీటి సేవను గుర్తించి గత పుష్కరకాలంగా మే పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా వలస పక్షుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
వలస పక్షులకున్నట్లుగా మన కంటి ముందర ఎగురుతూ మనకెంతో మేలు చేసే పిచ్చికలు, కాకులు, పావురాలు, చిలకలు, గద్దలు, బాతులు, నెమళ్ళు, కోళ్లు, కొంగలు, రాబందులు , పెంగ్విన్స్, గుడ్లగూబలు, గబ్బిలాలు, కోయిలలు, చివరికి సీతాకోక చిలుకలు ( ఇవి కూడా ఎగురుతాయి మరి)
ఇలా ఇవన్నీ కూడా విడివిడిగా తమ పుట్టిన రోజులను సంవత్సరంలో ఒక రోజున జరుపుతుంటాయి. మనం నాగుల చవితి జరుపుకుంటాము కదా ! అదే విధంగా పాములకు కూడా ఒక రోజు నిర్ణయించబడినది. అది పదహారు జులై . గమనించవలసిన అంశం ఏమిటంటే ఈ  దినోత్సవాలన్నీ అధిక శాతం శనివారాలు కావడం ! పాశ్చాత్య దేశాలలో శనివారం శలవు దినం కదా ! ఎక్కువ మంది హాజరవుతారు. సందేశం అందుకొంటారు అన్నదే దీని వెనుక ఉన్న ముఖ్యోద్దేశ్యం. క్షీణించి పోతున్న విహంగాల సంతతి గురించి, ధరణికి, మానవాళికి వాటి వలన కలిగే లాభాలను గురించి తెలియ చెప్పడానికి సంవత్సరంలో కొన్ని రోజులను అవగాహనా దినాత్సవాలను జరపడానికి కూడా నిర్ణయం చేశారు.








మనకు ఇంత మేలు చేస్తున్నఈ చిన్ని ప్రాణులు మన నుంచి ఏమి ఆశిస్తున్నాయి ? నివాసము ఏర్పాటు చేసుకోడానికి కొన్ని చెట్లు. త్రాగడానికి కొంచెం నీరు. ఆహరం ఖర్చు మనకు లేదు. అవే వెతుక్కుంటాయి. అవన్నీ తినేవి మనకు హాని చేసే పురుగులూ, క్రిములు, కీటకాలు, గింజలు. అందుకని విహంగాలు కోరుకొంటున్న నాలుగు చెట్లను ఏర్పాటు చేద్దాం. ఇవ్వకపోతే మనకి మనమే అన్యాయం చేసుకొన్నట్లే ! నష్టం మనకే కదా ! ఇచ్చేద్దాం ! ఏమంటారు ?
 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...