11, డిసెంబర్ 2017, సోమవారం

Azhagar Kovil,

                              అళగర్ పెరుమాళ్ కోవెల 



మధురై చుట్టుపక్కల ఉన్న ఆరు శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ప్రముఖమైనదిగా పేరు పొందినది అళగర్ పెరుమాళ్ కోవెల. శ్రీ వైష్ణవ దివ్య తిరుపతి గానే కాకుండా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరు పాడై వీడు ఆలయాలలో ఒకటైన "పలమదురై చోళై" కూడా ఇక్కడే ఉండటం వలన ఇది అందరికీ దర్శనీయ క్షేత్రంగా ప్రసిద్ధి చెంది ఉన్నది.












అళగర్(అందమైన ) పర్వత పాదాల వద్ద ఉన్న ఈ దివ్య దేశం పాండ్య నాడు గా చరిత్రలో పేర్కొనబడిన నేటి మధురై నగరానికి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పచ్చని చెట్లతో,  జలప్రవాహాలతో అత్యంత సుందర ప్రకృతికి నిలయాలు ఈ వృషభాద్రి శ్రేణి !
బ్రహ్మాండపురాణం, వరాహ పురాణం, ఆగ్నేయ పురాణం, స్కాంద పురాణం  మరియు అనేకానేక పురాతన గ్రంధాలూ ఈ క్షేత్ర మహత్యాన్ని ఎంతో గొప్పగా పేర్కొన్నాయి. గ్రంధాలూ, పురాణాలు, ఆళ్వారుల పాశురాలు వృషభాద్రిని ముక్తి క్షేత్రం గా కీర్తించాయి. శ్రీదేవి మరియు సుందరవల్లీ తాయారు సమేత శ్రీ అళగర్ పెరుమాళ్ ఈ దివ్య తిరుపతిలో కొలువైన పురాణ గాధ కూడా పెక్కు గ్రంధాలలో లిఖించబడి ఉన్నట్లుగా తెలుస్తోంది.














మలయధ్వజ పాండ్య రాజు తనకు ఇంద్రుడు ప్రసాదించిన పుష్పక విమానంలో ప్రతి నిత్యం కాశీ క్షేత్రం వెళ్లి గంగాస్నానం చేసి, విశ్వనాధుని సేవించుకొని, తిరుగు ప్రయాణంలో గయా క్షేత్రం లోని గంగాధరుని కూడా పూజించుకొని మధురై చేరుకొనేవాడట.ఒకనాడు మార్గం మార్చి వృషభాద్రి మీదగా వస్తుండగా విమానం గగనాన నిలిచిపోయినదిట. విషయం అర్ధం కాని పాండ్య రాజుకు అశరీరవాణి ఈ పర్వతాలు లోక రక్షకుడైన శ్రీ హరి స్వయంగా  కొలువు తీరినవిగా తెలిపిందిట.
తెలియక చేసినా తప్పు తప్పే గనుక రాజు శ్రీ మన్నారాయణుని క్షమించమని వేడుకొన్నారట. తన పుష్పక విమానం నుండి దిగి "నూపుర గంగ" తీర్ధంలో స్నానమాచరించి పాదాల వద్ద కొలువైన శ్రీ అళగర్ పెరుమాళ్ ను సేవించుకొన్నారట. ఆయనే తొలి ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతున్నాయి గ్రంధాలు. కాలక్రమంలో మార్పులు చేర్పులు, మర్మత్తుల తరువాత ప్రస్తుత ఆలయం ఎనిమిదో శతాబ్దంలో నిర్మించబడినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి.













సువిశాల ప్రాంగణానికి చుట్టూ కోట గోడలాంటి ఎత్తైన ప్రహరీ నిర్మించారు. ప్రస్తుతం కొంతమేర శిధిలమైనది. ప్రాంగణం లోని ప్రధమ సన్నిధి శ్రీ భైరవునిది. ఈయన క్షేత్ర పాలకుడు.  గతంలో రాత్రి పూజాదికాలు పూర్తి అయిన తరువాత పూజారి ఆలయ తాళాలను క్షేత్ర పాలకునికి ఇచ్చి, తిరిగి ఉషోదయాన తీసుకొని ఆలయాన్ని తెరిచేవారట. ఒకనాటి రాత్రి ఇంటికి చేరుకున్నాక పూజారికి తన కుమారుని ఆలయంలో ఉంచి తాళాలు వేసినట్లుగా గ్రహింపు కలిగిందిట. పరుగు పరుగున ఆలయానికి చేరుకొని భైరవుని తలుపులు తెరిచి తన పుత్రుని బయటకు పంవలసినదిగా అర్ధించాడట. దానికి అంగీకరించని భైరవుడు అతని కుమారునికి వచ్చిన ఆపద ఏమీ లేదన్నాడట.
కానీ పుత్రప్రేమతో ఆందోళన చెందుతున్న పూజారి ఆగ్రహించాడట. కోపించిన క్షేత్రపాలకుడు అతని కుమారుని వెలుపలకు విసిరివేశారట. గాయపడిన పుత్రుని పరిస్థితికి మరింత ఆగ్రహించిన పూజారి, భైరవుని శక్తులను తన మంత్ర ప్రభావంతో సంగ్రహించి ఒక రాతిలో నిక్షిప్తం చేసాడట. నేటికీ భైరవుని సన్నిధికి ఎదురుగా ఉన్న "క్షేత్రపాలక శిల"ను చూడవచ్చును.

 










మరో విశేషం ఏమిటంటే సహజంగా శివాలయాలలో కొలువై ఉండే సప్తమాత్రికలు ఇక్కడ ఉండటం ! వీరికి నియమంగా నిత్య పూజలు జరుగుతాయి.
ఆలయ ఉత్తర భాగాన కొలువైన శ్రీ జ్వాలా నారసింహ సన్నిధి పైభాగాన ఒక పెద్ద రంధ్రం ఉంటుంది. స్వామి వారి నుండి వెలువడే ఆగ్రహ జ్వాలలు దాని నుండి ఆకాశం వైపుకి వెళతాయని, భక్తులు స్వామివారి అనుగ్రహలను  పొందుతారని చెబుతారు.

శ్రీ కరుప్ప స్వామి సన్నిధి 

మరో ప్రత్యేక సన్నిధి రాజ గోపురం ద్వారం వద్ద ఉన్న శ్రీ కరుప్ప స్వామిది. ఈయననే పదునెట్టాంపడి కరుప్పస్వామి అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రానికి కావలి దేవత మరియు రక్షకుడు అని అంటారు. రాజ గోపుర ప్రధాన ద్వారం వద్ద  గంధపు చెక్కలతో చేసిన తలుపులను అమర్చారు. కరుప్ప స్వామి పూజలన్నీ మూసి ఉన్న ద్వారం వద్దనే జరుగుతాయి. ప్రత్యేక ఉత్సవాలప్పుడు మాత్రమే తలుపులను తెరుస్తారు. కురువ కులస్థులు ఈ సన్నిధికి పూజారులుగా వ్యహరిస్తారు. చుట్టుపక్కల గ్రామాల వారు దొంగతనాలు, దోపిడీలు లాంటివి జరిగినప్పుడు నేరస్థులను ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రమాణం చేయమంటారు. కరుప్ప స్వామి ముందు ఎవరూ అసత్యం చెప్పరన్నది వారి విశ్వాసం. ఆషాడ మాస అమావాస్య మరియు పౌర్ణమికి విశేష పూజలు శ్రీ కరుప్ప స్వామికి చేస్తారు.
మరో విశేషం ఏమిటంటే పర్వదినాలలో నగర వీధులలో ఊరేగింపుకై వెళ్లే  శ్రీ పెరుమాళ్ కి అలంకరించే నగల వివరాలను ఈయన సమక్షంలో చదివి, ఊరేగింపు తరువాత మరోసారి సరి చూసుకొన్నాకే పెరుమాళ్ ఆలయం లోనికి వస్తారు.












నూపుర గంగ 

పర్వత శిఖరాన ఉన్నఅనేక తీర్ధాలలో నూపుర గంగ ఒక పవిత్ర జలధార. ఈ నీటికి సర్వపాపాలు హరించే శక్తి ఉన్నదని భక్తులు విశ్వసిస్తారు.  అరుదైన వనమూలికలు సారాన్ని నింపుకున్న నీరు ఆరోగ్యప్రదాయనిగా భావిస్తారు. సీసాలలో గృహాలకు తీసుకొని వెళుతుంటారు.
శ్రీ సుందరరాజ పెరుమాళ్ కోవెల కొండ క్రింద ఉండగా, అగ్రభాగాన నూపుర గంగా, మధ్యలో శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి ఉంటాయి.
 ఉత్సవమూర్తి శ్రీ సుందర రాజ పెరుమాళ్" విగ్రహాన్ని అరుదైన "అపరంజి" అని పిలిచే బంగారం తో తయారు చేసారు. నిత్య అభిషేకాలలో నూపుర గంగా జలాన్ని వాడాలి. లేని యెడల విగ్రహం నల్లగా మారిపోతుంది. పూజారులు రోజు పైకి వెళ్లి నీటిని తెస్తారు. వారు నిజంగా గంగ నీటినే తెచ్చారా ? అన్నదానికి వారి శ్రీ కరుప్ప స్వామి వద్ద ప్రమాణం చేసిన తరువాతనే నీటిని అభిషేకాలకు వినియోగిస్తారు.
నూపుర గంగ దాకా రహదారి మార్గం ఉన్నది. నడిచి కూడా వెల్లడానికి మెట్ల దారి కలదు. పరిసరాలు, ప్రకృతి ఆహ్లాదకరంగా  ఉండి మార్గాయాసం తెలియకుండా చేస్తాయి.











ఆలయ ఉత్సవాలు 


అళగర్ పెరుమాళ్ కోవెలలో ప్రతి నిత్యం ఉత్సవమే ! నిత్యం ఎన్నో పూజలు శ్రీ అళగర్ పెరుమాళ్ కి జరుపుతారు.
అన్నింటి లోనికి శ్రీ మీనాక్షీ సోమసుందరేశ్వర స్వామి వార్ల కల్యాణ మహోత్సవానికి స్వామి వారు తరలి వెళ్లే "చిత్తిరై తిరువిళ్ల" ఒక అద్భుతమైనది. మొత్తం తొమ్మిది రోజులలో మొదటి మూడు రోజులు ఇక్కడ, నాలుగు రోజులు మధురై వైగై నదీ తీరంలో, రెండు  రోజులు వెళ్లి రావడానికి ! ఈ తొమ్మిది రోజులు పెరుమాళ్ కి ఎన్నో రకాల అలంకరణలు చేస్తారు.  సోదరి వివాహానికి తరలి వెళ్లే సోదరుడు ఎంత సుందరుడైన, సరైన అలంకారం ఉండాలి కదా! వైగై నది ఒడ్డున జరిగే ఉత్సవం చూడటానికి లక్షలాది మంది తరలి వస్తారు.
వైకుంఠ ఏకాదశి, శ్రీకృష్ణ జన్మాష్టమి, శ్రీరామ నవమి మరియు ఇతర శ్రీ వైష్ణవ పుణ్య దినాలలో.  అష్టమి, నవమి తిథులలో, స్థానిక పర్వదినాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో తిరుప్పావై గానం జరుపుతారు. ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహాన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల సందర్శనార్ధం ఆలయం తెరిచి ఉంటుంది. 










ప్రస్తుత ఆలయాన్ని ఎనిమిదో శతాబ్దంలో పాండ్య రాజులు నిర్మించారు. తదనంతర కాలంలో చోళులు, విజయనగర రాజులు, నాయక రాజులు పెక్కు నిర్మాణాలను నిర్మించారు. ఆలయాన్ని అభివృద్ధి చేసారు. చక్కని శిల్పాలకు నెలవు ఈ ఆలయం.
రోజూ వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలి వస్తుంటారు.  మధురై పెరియార్ బస్టాండ్ నుండి బస్సులు లభిస్తాయి.







శ్రీ కరుప్ప స్వామి సన్నిధి 






పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్, భూతత్తి ఆళ్వార్, పేయాళ్వార్ మరియు నమ్మాళ్వార్ కలిసి నూట ఇరవై ఎనిమిది పాశురాలు శ్రీ అళగర్ పెరుమాళ్ మీద గానం చేశారు. చారిత్రక మరియు  పౌరాణిక పాశస్త్యం ఉన్న మధురై పట్టణం చుట్టుపక్కల ఉన్న ఆరు దివ్య దేశాలలో ప్రముఖమైనది అళగర్ పెరుమాళ్ కోవెల. 
మధురై నగరంలో ఉన్న కూడల్ అళగర్ కోవెల కూడా విశేషమైనదే !
నమో నారాయణ !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...