26, జులై 2024, శుక్రవారం

sri Ganga Bhramarambha sameta Sri Mallikharjunaswami Temple , Morjampadu

 

                             దక్షిణ శ్రీ శైలం మోర్జంపాడు 


మనం కొద్దిగా శ్రద్ధ పెట్టి వెతికితే మన రాష్ట్రంలో ఎన్నో విశేషాలకు నిలయమైన దేవాలయాలు చాలా కనపడతాయి. ప్రతి ఆలయ నిర్మాణం వెనుక ఒక గాథ లేక ఒక విశేషం నెలకొని ఉంటుంది. 
కాకపోతే వీటిలో చాలామటుకు మారుమూల పల్లెలలో లేదా గ్రామాలలో ఉండటం వలన క్షేత్ర వివరాలు బాహ్యప్రపంచానికి తెలియడం లేదు. స్థానికంగా కూడా వాటిని ఒక ఆలయంగా  మాత్రమే పరిగణించడం విచారకరం. 
ఈ మధ్య నేను దర్శిస్తున్న ఆలయాలలో మూడు గంగతో ఉన్న గంగాధరుని క్షేత్రాలే !
మొదటిది కర్నూల్ దగ్గర ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. రెండవది తాడిపత్రిలో ఉన్న శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం. మూడవది ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ బుగ్గ మల్లేశ్వర స్వామి ఆలయం. మోర్జంపాడు.  
ఈ మూడు ఆలయాలలో నీటి బుగ్గలు ఉండటం ప్రత్యేకతగా చెప్పుకోవాలి. పరమశివుడు అభిషేక ప్రియుడు కదా !
మారుమూల పల్లె మోర్జంపాడు శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం మరింత ప్రత్యేకమైనది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన క్షేత్రం. 






ఆలయ గాథ 

పావన కృష్ణానదీ తీరంలో ఉన్న ఈ ప్రదేశం ఒకప్పుడు మునివాటిక అని తెలుస్తోంది. మహర్షులు తమ నిత్య పూజ కొరకు మహాదేవుని ప్రతిష్టించుకొన్నారని అంటారు. 
ప్రస్తుతం కైలాసవాసుని పూర్తి పరివారం కొలువై ఉన్నారు. 
ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలియదు. కానీ అమరావతిని పరిపాలించిన జమీందారు శ్రీ వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు గారు ఈ ప్రాంతాల పర్యవేక్షణ నిమిత్తం వచ్చినప్పుడు ఈ క్షేత్రం గురించి విని దర్శించుకొని శిధిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించారని, ఆలయ నిర్వహణకు నిధులు సమర్పించారని తెలుస్తోంది. కాలక్రమంలో భక్తుల సహకారంతో ఆలయం అభివృద్ధి చెందసాగింది. 










దక్షిణ శ్రీ శైలం 

ప్రసిద్ధ జ్యోతిర్లింగ మరియు అష్టాదశ పీఠ క్షేత్రం అయిన శ్రీశైలంతో చాలా పోలికలు ఉండటం వలన దక్షిణ శ్రీ శైలం అని కూడా పిలుస్తారు. 
కొండగుట్టలతో నిండిన అటవీ ప్రాంతంలో, కృష్ణవేణీ పరివాహక ప్రాంతంలో చిన్న గుట్ట మీద  నెలకొన్న ఈ క్షేత్రంలో శ్రీ మల్లేశ్వర స్వామి తూర్పు ముఖంగా గర్భాలయంలో దర్శనమిస్తారు. పక్కనే చిన్న నీటి బుగ్గలో నిరంతరం స్వచ్ఛమైన నీరు ఉంటుంది. ఉదయం నుండి అలంకరణ దాకా వచ్చిన భక్తులు స్వయంగా బుగ్గ లోని నీటితో స్వామికి అభిషేకం చేసుకొనే అరుదైన అవకాశం లభిస్తుంది ఇక్కడ. 
గ్రామంలో నీటి ఎద్దడి వచ్చినా, కృష్ణలో నీరు లేకపోయినా, మండే వేసవిలో కూడా బుగ్గలో నీరు ఉంటూనే ఉంటుంది. బుగ్గలో నీరు పాచి పట్టదు. వాసన రాదు. ఎక్కడ నుండి నీరు వస్తుందో తెలియదు. కానీ సర్వకాలసర్వావస్థల యందు కూడా ఒకే పరిమాణంలో నీరు ఉండటం విశేషం. ఇలాంటిది మరెక్కడా కనిపించదు. 
శ్రీశైలం కూడా కృష్ణా తీరంలో దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉండటం తెలిసిన విషయమే !  శ్రీశైలంలో గర్భాలయానికి దక్షిణం పక్కన ఉన్న బావి నీటితోనే స్వామి వారికి అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీశైలంలో ప్రతినిత్యం స్పర్శ దర్శనం ఉంటుంది. 
శ్రీ శైలంలో శ్రీ వృద్ధ మల్లిఖార్జున స్వామి సన్నిధి ఉంటుంది. తన సాన్నిధ్యం కోరుకొన్న ఒక యువరాణిని పరీక్షించడానికి లింగరాజు ముదుసలి రూపంలో వచ్చిన ఉదంతానికి నిదర్శనంగా లింగం కొద్దిగా ముడుతలు పడి ఉన్నట్లుగా కనిపిస్తుంది. 
అదే విధంగా ఇక్కడ కూడా శ్రీ వృద్ధ మల్లిఖార్జున స్వామి సన్నిధి ఉంటుంది. ప్రత్యేకంగా ధ్వజస్థంభం ఉండటాన్ని బట్టి ఈ స్వామి ప్రధాన ఆలయంలో కన్నా ముందు నుండి ఉన్నారని అర్ధం చేసుకోవాలి. ఇలా స్వామి శ్రీ వృద్ధ మల్లిఖార్జునునిగా పిలవబడేది ఈ రెండు చోట్లలోనే !
శ్రీ శైల ఆలయానికి ఈశాన్య నైరుతి లో పుష్కరణి ఉంటుంది. ఈ క్షేత్రంలో కూడా అదే విధంగా ఆలయ కోనేరు ఉండటం ప్రత్యేకం. 
శ్రీ భ్రమరాంబ అమ్మవారు శ్రీ శైలంలో శ్రీ మల్లికార్జునస్వామి ఆలయానికి వెనుక ఎత్తైన ప్రదేశంలో కొలువై ఉంటారు. ఈ క్షేత్రంలో కూడా అదే విధంగా అమ్మవారు ఎత్తైన గుట్ట మీద ప్రత్యేక సన్నిధిలో కొలువై దర్శనమనుగ్రహిస్తారు. శ్రీశైలంలో ఉన్నంత పెద్ద సన్నిధి కాదు. సాదాసీదాగా ఉంటుంది. 
అమ్మవారి సన్నిధి సమీపంలో నూతనంగా శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామి  సన్నిధిని నెలకొల్పారు. అదే విధంగా ఈ ఆలయం లోని నవగ్రహ మండపం కూడా ప్రత్యేకంగా నిర్మించారు. మిగిలిన ఆలయాలలో మాదిరి కాకుండా ఏ గ్రహానికి ఆ గ్రహ విగ్రహాన్ని విడివిడిగా ప్రతిష్టించారు. ఇలా ఉండటం వలన ఏ గ్రహానికి సంబంధించిన అభిషేకం, పూజా విడివిడిగా చేసుకొనే అవకాశం లభిస్తుంది. 
శ్రీ శైలంలో స్వామివారి సన్నిధికి ఎడమ పక్కన నాగేంద్ర స్వామిపుట్ట ఉంటుంది. ఈ క్షేత్రంలో కూడా ఆలయ ప్రాంగణంలో వాయువ్యంతో పాటు ఆగ్నేయంలో కూడా నాగేంద్రుని నివాసం కనపడుతుంది. అరుదుగా అర్హులైన భక్తులకు నాగేంద్రుడు శ్వేతనాగు రూపంలో దర్శనమిస్తారట. 


నాగ బంధం 

ప్రధాన ఆలయ వెలుపలి గోడపైన అరుదైన నాగబంధం చెక్కబడి ఉంటుంది. మోక్షపురి వారణాసిలో ఉన్నాడని అంటారు. విడిగా రతి పలకల మీద చెక్కిన నాగబంధం  కొన్ని ఆలయాలలో కనిపిస్తుంది. 
పవిత్రమైన మహిమాన్వితమైన నాగబంధాన్ని దర్శించి పూజించుకొంటే అవివాహితులకు వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. శత్రు బాధలు తొలగిపోయి జీవితంలో అభివృద్ధి పొందుతారన్నది భక్తుల విశ్వాసం. 









క్షేత్రపాలకుడు 

మారుతీనందనుడైన శ్రీ ఆంజనేయస్వామి రుద్రంశగాచెబుతారు. ఈ క్షేత్రానికి ఆయనే క్షేత్రపాలకుడు. ప్రధాన ఆలయానికి నైరుతిలో ఉత్తరాభిముఖంగా శ్రీ రామదూత ముకుళిత హస్తాలతో స్థానక భంగిమలో సింధూవర్ణశోభితులుగా దర్శనమిస్తారు.  ఎదురుగా శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రమూర్తి వారి ఉపాలయం. 










పూజలు ఉత్సవాలు 

గతంలో ఒక్క సోమవారాలు మాత్రమే తెరిచే ఈ ఆలయం ప్రస్తుతం అన్ని రోజులూ  ఉదయం నుండి మధ్యాహన్నం వరకు భక్తుల సందర్శనార్ధం తెరిచి ఉంటోంది. ఊరికి దూరంగా అటవీ ప్రాంతంలో ఉండటం వలన సాయంత్రాలు వెళ్లడం అంత శ్రేయస్కరం కాదని అంటారు. 
స్వయంగా అభిషేకం చేసుకునే భాగ్యం లభించే ఈ క్షేత్రం పేరు "మోర్జంపాడు". 
ప్రస్తుత పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది.  
జ్యొతిర్లింగ క్షేత్రం అయిన శ్రీశైలంతో ఇన్ని సారూప్యాలు ఉన్నందున భక్తులు శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి కొలువైన మోర్జంపాడును దక్షిణ శ్రీశైలంగా భావిస్తారు. శ్రీశైలం వెళ్లలేని వారు ఈ క్షేత్రానికి వస్తుంటారు. 
కార్తీక మాసంలో, మహాశివరాత్రికి విశేష పూజలు పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీ వినాయక చవితి, శ్రీ రామనవమి,  దేవీనవరాత్రులు,శ్రీ హనుమజ్జయంతి పర్వదినాలను కూడా ఘనంగా నిర్వహిస్తారు. 
శ్రీ గంగా భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి భక్తసులభుడని దూరప్రాంతాల నుండి కూడా భక్తులు వస్తుంటారు. 





స్థానిక భక్తులు  సేకరించిన విరాళాలతో  వచ్చిన భక్తులకు నిత్యాన్నదానం ఏర్పాటు చేసారు. కానీ ఉండటానికి ఎలాంటి సదుపాయాలు లేవు. పిడుగురాళ్లలో వసతి సౌకర్యాలు లభిస్తాయి. పిడుగురాళ్ల నుండి ఆలయం వరకు వెళ్ళడానికి ఆటోలు లభిస్తాయి. సొంతవాహనంలో వెళ్లడం ఉత్తమం. 
ప్రశాంత ప్రకృతిలో పరమేశ్వరుని సన్నిధిలో కొన్ని గంటలు గడపడం ప్రయాణబడలికను పూర్తిగా తొలగించి, శాశ్విత ఆధ్యాత్మిక ప్రసాదించే క్షేత్రం మోర్జంపాడు. 
గ్రామంలో పురాతన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం, గ్రామదేవత శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం కూడా దర్శించవలసినవి.  

నమః శివాయ !!!!


24, జులై 2024, బుధవారం

Guttikonda Bilam



                  గోపాలుడు నడయాడిన గుత్తి కొండ బిలం 

మన రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన గుహలు లేదా బిలాలలో ప్రథమస్థానంలో ఉన్నవి బొర్రా గుహలు. తరువాత ఆ స్థాయిలో కాకున్నా స్థానిక ఆకర్షణ పొందుతున్నవి నంద్యాల జిల్లాలోని బెలుం గుహలు. 
వీటికి భిన్నంగా ఉండే గుహలు కూడా ఉన్నాయి. 
అవే పల్నాడు జిల్లాలోని గుత్తికొండ గ్రామ సమీపంలోని గుహలు. 
క్షేత్ర గాథ ప్రకారం గుత్తికొండ బిలం పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యం కలిగిన ప్రదేశం.  అనేక మంది మహర్షులు ఇక్కడ తపస్సు చేశారని చెప్తారు. 
గత శతాబ్దంలో ఎందరో మహనీయులు ఇక్కడ ఆధ్యాత్మిక సాధన చేసి ముక్తిని పొందారని అనేక గాధలు ప్రచారంలో ఉన్నాయి. 
















క్షేత్ర గాథ 

పురాణాలలో చూసినట్లయితే మహర్షుల తపోభూములు ఎక్కువగా నదీతీరాలలో అంటే నీటి వసతి ఉన్న కొండ గుహలలో, దట్టమైన వనాలలో ఉన్నట్లుగా తెలుస్తుంది. జలం జీవం కదా ! వివిధ ప్రాంతాలలో కనిపించే  ఆలయాలు వారు తమ నిత్య పూజల నిమిత్తం ఏర్పాటుచేసుకొన్నవి అని కూడా అర్ధం చేసుకోవచ్చును. 
తొలి గుహాలయాలు పల్లవుల కాలంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. 
గుత్తికొండ బిలం పురాణ ప్రాముఖ్యం తెలుసుకోవాలంటే భాగవతంలోని కొన్ని ముఖ్య పాత్రల పరిచయం చాలా ముఖ్యం. ఒకటొకటిగా తెలుసుకొందాము. 
గుత్తికొండ క్షేత్రగాథ ప్రధానంగా ముచికుందుడు అనే మహారాజుతో ముడిపడి  ఉన్నది. 
ఎవరీ ముచికుందుడు ?





ముచికుందుడు 

భాగవత పురాణం లో ఈయన ప్రస్థాపన ఉన్నది. సూర్యవంశానికి చెందిన మాంధాత మహారాజు పుత్రుడు. అనేక పురాణాలలో పేర్కొన్న అంబరీష మహర్షి ఈయన సోదరుడు. 
గొప్ప యోధుడు. సామ్రాజ్యాన్ని నలుదిశలా విస్తరింపచేసాడు. ధర్మబద్ధంగా ప్రజారంజకంగా పాలన చేసేవారు. 
ఆయన కీర్తి, ధైర్యసాహసాలు దేవలోకాన్ని చేరుకొన్నాయి. ఆ సమయంలో అసురులతో పోరాడుతున్న అమరులు ఓటమి అంచున ఉన్నారు. దేవేంద్రుడు శ్రీ మహావిష్ణువు సలహా మేరకు దూతలను ముచికుందుని వద్దకు పంపి యుద్ధంలో సహాయం చేయమని అర్ధించారు. 
వారి కోరికను మన్నించి దేవదానవ యుద్ధంలో పాల్గొన్నారు ముచికుందుడు. 
ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. దేవతలను విజయం వరించింది. 
ఆదిదంపతుల కుమారుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవసేనాధిపతిగా భాద్యతలు స్వీకరించారు. 
ముచికుందుడు శ్రీ మహావిష్ణువును సందర్శించుకున్నారు. ఆయనను భూలోకానికి వెళ్ళడానికి అనుమతి కోరారు. 
శ్రీహరి ఇప్పుడు భూలోకంలో ద్వాపరయుగం నడుస్తోంది. నీ అన్న వారంతా గతించారు అన్ని అన్నారట. అప్పుడు ముచికుందుడు నా అలసట తీరేలా నిద్రించాలి. నాకు నిద్రాభంగం కలిగించినవారు నా కంటి చూపుతో భస్మం అయిపోయేలా వరం ప్రసాదించండి అని కోరుకొని భూలోకానికి వచ్చి గుత్తి కొండ బిలంలో నిద్రపోయారు. 
కాలం గడిచిపోతోంది. 

కాలయవనుడు 

గర్గుడు అనే రాజు యాదవ  గురువుతో జరిగిన పండిత చర్చలో ఓడిపోయారట. ఆ అవమానం తట్టుకోలేక మహేశ్వరుని తపస్సుతో ప్రసన్నం చేసుకొని యాదవుల చేతిలో ఓడిపోని కుమారుని పొందాడట. 
అతనే కాలయవనుడు. ఇతను బ్రహ్మ నుండి ఎవరి చేతిలో ఓటమి పొందకూడదని వరం పొందాడట. కొన్ని లక్షల సైన్యంతో ఎందరినో ఓడించి వరగర్వంతో శ్రీ కృష్ణుని మీదకు యుద్దానికి సిద్దపడసాగాడట కాలయవనుడు. 

జరాసంధుడు 

మగధ సామ్రాజ్య పాలకుడు. కంసుని అల్లుడు. తన మామని చంపిన శ్రీ కృష్ణ బలరాముల మీద పగతో మధురానగరం మీదకు పెక్కుసార్లు దండయాత్ర చేసి అన్నిసార్లు ఓడిపోయాడు. పాగా తీరే మార్గం కోసం వెతుకుతుండగా కాలయవనుని విషయం తెలిసింది. 
అతనిని తనకు సహాయపడమని కోరాడు. ఎప్పటి నుండో శ్రీ కృష్ణుని మీద ద్వేషంతో ఉన్న కాలయవనుడు మధురానగరానికి బయలుదేరాడు. 
కొంతకాలం క్రిందటే జరాసంధునితో యుద్ధం గెలిచిన బలరామకృష్ణులు కాలయవనుని దండయాత్ర గురించి తెలుసుకొని ప్రజలను మధుర నుండి ద్వారకకు పంపించివేశారు. శ్రీ కృష్ణుడు ద్వందాయుద్ధానికి రమ్మని చేసిన సవాలును స్వీకరించిన కాలయవనుడు ఒంటరిగా వచ్చాడు. 
అతనికి ఉన్న వరాల సంగతి తెలిసిన వాసుదేవుడు ఓడిపోయినట్లుగా పారిపోసాగారు. కోపంతో కాలయవనుడు ఆయను తరమసాగాడు. గోపాలుడు నేరుగా ముచికుందుడు నిద్రిస్తున్న గుహ లోనికి వెళ్లారు. ఆవేశంతో లోపలి ప్రవేశించిన కాలయవనునికి చీకటిలో శత్రువు కనిపించక వెతుకుతూ నిద్రిస్తున్న ముచికుందుని పట్టుకొన్నాడు. 
నిద్రాభంగం కలగడంతో కనులు తెరిచిన ముచికుందునికి ఉన్న వరప్రభావంతో కాలయవనుడు భస్మం అయిపోయాడు. 
వరగర్వంతో లోకాలకు కీడు చేస్తున్న ఒక లోకకంటకుడి మరణం సంభవించినది గుత్తికొండ బిలం లో అన్నది క్షేత్రగాథ. 
కాలయవనుని మరణం తరువాత శ్రీ కృష్ణుని దర్శనం పొందిన ముచికుందుడు ఇక్కడే తపస్సు చేసుకున్నారట. నేటికీ ఆయన అర్హులైన భక్తులకు దర్శనమిస్తారని, ఉపదేశం చేస్తారని కొన్ని గాధలు ప్రచారంలో ఉన్నాయి. 





యోగిని కోలా పోలమాంబ 

సమీపంలోని పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లు గ్రామానికి చెందిన శ్రీ లింగారెడ్డి గారి పుత్రిక యోగిని కోలా పోలమాంబ. స్వయంగా ముచికుంద మహర్షి సాక్షాత్కారం మరియు ఉపదేశం  పొందిన మహనీయురాలు. ఎన్నో సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారని తెలుస్తోంది. సుమారు ఎనభై సంవత్సరాల క్రిందట యోగిని జీవ సమాధి చెందినా నేటికీ భక్తులను అనుగ్రహిస్తుంటారని చెబుతుంటారు. 
ఆమె జీవ సమాధి, యోగిని శిష్యురాలైన శనగపాటి సుభద్రమ్మ సమాధిని ప్రాంగణంలో దర్శించుకోవచ్చును. 
ప్రాంగణంలో శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ మల్లిఖార్జున స్వామి వార్ల సన్నిధులు, శ్రీ గణపతి మరియు నాగప్రతిష్ఠలు కనిపిస్తాయి. స్వామివారిని శ్రీ బాల మల్లేశ్వరస్వామి అని పిలుస్తారు. 














గుత్తికొండ బిలం 

 చుట్టూ పచ్చని పొలాలు. పచ్చని పరిసరాలు. స్వచ్యమైన గాలి. ప్రశాంత వాతావరణం నడుమ ఉంటుంది గుత్తికొండ బిలం. గుత్తికొండ ఊరి నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల మట్టి దారిలో ప్రయాణించాలి. 
ఎత్తులో ఉన్న ఆలయ ప్రాంగణం వరకు రహదారి ఉన్నది. 
ప్రాంగణం  లోని ఆలయాలను, జీవసమాధులను చూసిన తరువాత బిలం లోనికి వెళ్ళడానికి మనిషికి ముప్పై రూపాయల టికెట్. బిలం పక్కన భరతమాత సన్నిధి ప్రత్యేకం. 
బిలం యొక్క ముఖద్వారం పైన క్షేత్రగాథ ను తెలిపేలా మధ్యలో ముచికుంద మహర్షి ఇరుపక్కలా శ్రీ కృష్ణుడు మరియు కాలయవనుడు విగ్రహాలను ఏర్పాటు చేశారు. 
ఇంతకూ ముందు చెప్పుకున్నాము కదా ఇది ఒక మునివాటిక మునులు సాధువులు నివసించేవారని. అలంటి వారిలో ఒకరైన అవధూత శ్రీ స్వయంప్రకాశ స్వామి వారు బిలంలో శివలింగాన్ని 1754వ సంవత్సరంలో ప్రతిష్టించారని ఇక్కడి శాసనం తెలుపుతుంది. ఆ లింగాన్ని "చీకటి మల్లయ్య" అని పిలుస్తారు. 
సహజసిద్ధంగా ఏర్పడిన ఇందులోనికి వెళ్ళడానికి గతంలో కాగడాలు తీసుకొని వెళ్లేవారు.
బిలంలోనికి ప్రవేశించిన తరువాత మొదట దర్శనమిచ్చేది శ్రీ ముచికుంద మహర్షి విగ్రహం. పక్కనే శ్రీ చీకటి మల్లయ్య లింగం. 
గతంలో మొత్తం నూట ఒకటి బిలాలు ఉండేవట. కాలక్రమంలో ప్రస్తుతం ఏడు మాత్రమే మిగిలాయి. అందులో కూడా రెండు మాత్రమే చివరిదాకా వెళ్ళడానికి అనువుగా ఉంటాయి. 
చీకటి మల్లయ్య సన్నిధి దిగువన కొండరాళ్ళను తొలగించి విశాలమైన ప్రదేశాన్ని తయారు చేశారు. అక్కడ నుండి రెండు దారులు రెండు గుహలకు దారి తీస్తాయి. 
మొదటిది రేణుకా గుహ చాలా లోపలికి ఉంటుంది. ఎత్తు తక్కువ ఉన్న మార్గంలో ఏర్పాటు చేసిన మెట్ల మార్గంలో వెళ్ళాలి. విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసారు. 
గొప్ప అనుభూతి. గుహ చివర ఎక్కడ నుండి వస్తాయో తెలియదు స్వచ్ఛమైన నీరు. చల్లని నీటితో మొహం కడుక్కొని రెండు గుక్కలు తాగితే ఎక్కడలేని శక్తి ఉత్సాహం కలుగుతాయి. స్వానుభవం. 
తిరిగి వెనక్కి వస్తే రెండవ గుహకు నూతనంగా మెట్లను టీఏర్పాటు చేశారు. జల ఎదురుగా కనిపిస్తుంది. దీనిని బ్రహ్మనాయుడి బిలం అంటారు. రేణుక బిలం మాదిరిగా కాకుండా ఇది విశాలంగా ఉంటుంది. యాత్రీకులు ఎక్కువగా ఇక్కడే స్నానం చేస్తారు. 




పలనాటి బ్రహ్మనాయుడు 

మహాభారత యుద్ధంతో సరిపోల్చతగినది పన్నెండవ శతాబ్దంలో కారంపూడి వద్ద నాగులేటి ఒడ్డున నలగామ రాజు మరియు మలిదేవరాజుల సైన్యాల మధ్య జరిగిన భీకర యుద్ధం. 
విద్యావేత్త, రాజకీయ తంత్రాలలో మేటి, గొప్ప యోధుడు, చక్కని సలహాదారుడు అన్నింటికి మించి సంఘసంస్కర్త. తొమ్మిది వందల సంవత్సరాల క్రిందటి సమాజంలోని క్రిందివర్గాలకు తన ఆస్థానంలో సముచిత స్థానం ఇచ్చారు. 
యోధానుయోధులందరూ మరణించి యుద్ధం ముగిసిన తరువాత నలగామరాజుకు రాజ్యం అప్పగించి బ్రహ్మనాయుడు గుత్తికొండ బిలంలో చాలాకాలం ధ్యానంలో ఉండిపోయారని అంటారు. బిలం లోనికి వెళ్లిన తరువాత ఆయనను చూసినవారు ఎవ్వరూ లేరు. బిలంలో జరిపిన అన్వేహణలో బ్రహ్మనాయుడు ఉపయోగించిన ఆయుధం పురావస్తుశాఖ వారికి లభ్యమయ్యింది అని తెలుస్తోంది. 
నూతనంగా నిర్మించిన మెట్ల వద్ద శ్రీ బ్రహ్మనాయుని విగ్రహం ఉంచడం సముచితంగా ఉన్నది,
నీరు ఎక్కడ నుండి వస్తుందో కానీ కొండరాళ్ళు తేమగా ఉంటాయి. ముఖ్యంగా రేణుకా బిలం లోనికి వెళుతున్నప్పుడు ఒక సాహసకార్యం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. 
గుత్తి కొండ బిలం వెళ్లడం అంటే ప్రామాణిత పౌరాణిక చారిత్రక నేపథ్యం కలిగిన ప్రదేశంలో చేసే  ఒక సాహస ఆధ్యాత్మిక యాత్ర !
ప్రయత్నం చేయండి. ఆస్వాదించండి !!!!

నమః శివాయ !!!! 

  








మేము నరసరావుపేట నుండి బయలుదేరి మాచర్ల వెళుతున్నాము మోటార్ సైకిల్ మీద. దారిలో నకిరేకల్లు దగ్గర ప్రధాన రహదారి నుండి మాచర్లకు తిరగాలి. 
అక్కడ ఒక బోర్డు మమ్మల్ని ఆకర్షించింది. 
స్వయంభూ శ్రీ వృక్షాఆంజనేయ స్వామి వారి దేవస్థానం. నా ఆరాధ్యదైవం శ్రీ హనుమంతుడు. ఎన్నో ప్రదేశాలలో శ్రీ మారుతీతనయుని ఆలయాలనుసందర్శించే అవకాశం ఆయన దయ వలన లభించింది. 
ఇది మరొకటి అనుకోని ఆగాము. 
అక్కడ ఉన్న టీ కొట్టు సోదరుడు మా బ్యాగ్గులను పెట్టుకోమని చెప్పడమే కాకుండా ఆలయానికి దారి కూడా చూపించాడు. ఒక అయిదువందల అడుగులు ఉంటుంది రోడ్డు మీద నుండి. నడుచుకుంటూ వెళ్ళాము. 
ఆలయ ముఖద్వారం కొత్తగా నిర్మిస్తున్నారు. అర్చకస్వామి ఎవరూ లేరు. 
ప్రశాంతంగా ఉన్నది. గొప్ప ఆధ్యాత్మిక వాతావరణం తెలియకుండానే నన్ను ఆకర్షించింది. 
హనుమాన్ చాలీసా పఠిస్తూ ప్రదక్షిణలు చేసి స్వామిని కనులారా దర్శించుకొని వెలుపలికి వచ్చాము. 
ఆలయ వివరాలు తెలియ రాలేదు. కానీ ఒక మహత్తర దైవిక శక్తి అక్కడ ఉన్నది అన్న అనుభవం నేను పొందగలిగాను. చాలా తక్కువ ప్రదేశాలలో మాత్రమే అలాంటి అనుభవం కలుగుతుంది. 
ఆ మార్గంలో ప్రయాణించేవారు తప్పనిసరిగా అక్కడ ఆగి శ్రీ రామదూతను దర్శించుకొని వెళ్ళవలసినదిగా మనవి చేస్తున్నాను. 

జై శ్రీరామ్ !!!!





 

22, జులై 2024, సోమవారం

Veerula Gudi, Karampudi

                         

                             చరిత్రకు సాక్షి వీరుల గుడి 


మన దేశంలో ఎన్నో విభిన్న శైలులలో నిర్మించిన ఆలయాలు కనపడతాయి. ఎన్నో రూపాలలో ఉన్న దేవదేవుడు కొలువై పూజలందుకొంటున్నారు. శ్రీ వినాయకుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ మన్నారాయణుడు తన దశావతార రూపాలైన శ్రీ నారసింహ, శ్రీ రాముడు, శ్రీ కృష్ణుడు, శ్రీ రంగ నాయకుడుగా , శ్రీ పరమేశ్వరుడు పంచ భూత లింగాలుగా, పంచ ఆరామ క్షేత్ర పాలకునిగా మరెన్నో క్షేత్ర నాధునిగా, అమ్మలగన్న అమ్మ శ్రీ ఆది శక్తి గా దర్శనమిస్తారు. మన దేశంలో  వైష్ణవం, శైవం మరియు శాక్తేయం లాంటి అనేక ఉపాసనా పద్దతులను అనుసరించడం కూడా కనపడుతుంది. 
నిరాకారుడైన పరమాత్మకు రకరకాల రూపాలలో ప్రతిష్టించిన  తరువాత భక్తులు తమకు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం వహించిన గురువులు, అవధూతల మందిరాలను కూడా నిర్మించి ఆరాధిస్తున్నారు. 
మరో విశేషం ఏమిటంటే మన పురాణాల ప్రకారం ప్రతినాయకులాగా చిత్రీకరించబడిన రావణాసురుడు, సుయోధనుడు, కర్ణుడు మరియు శకుని లాంటివాళ్లకు కూడా ఆలయాలు ఉండటం భారతదేశంలోనే సాధ్యం. 
మన దేశంలో మరో గొప్ప సంస్కృతి నెలకొని ఉన్నది. దేశం కోసం పోరాడి ప్రాణత్యాగం చేసిన యోధుల గౌరవసూచనగా వారికి సైనికవందనంతో రాజలాంఛనాలతో అంతిమసంస్కరణ చేస్తారు. బిరుదులు ఇస్తారు. శిలా విగ్రహాలను పెడతారు. వారి జయంతి లేదా వర్ధంతి రోజున వారిని స్మరించుకొంటారు. 
బహుశా ఈ సంప్రదాయం ఎప్పటి నుండో ఉండి ఉండాలి. దీనికి భిన్నంగా మన రాష్ట్రంలో ఉన్న ఒక ఆలయం(గుడి) ఉన్నది. ఇక్కడ ఒక గొప్ప యుద్ధంలో అమరులైన వారిని గత ఎనిమిది వందల సంవత్సరాలుగా స్మరించుకొంటున్నారు. ప్రతి సంవత్సరం గొప్ప ఉత్సవాన్ని వారి గుర్తుగా ఘనంగా నిర్వహిస్తున్నారు.  
ఆ గుడి ఏమిటో ఎక్కడ ఉన్నదో  ఆ వివరాలు ఏమిటో చూద్దాము. 












ఆంధ్ర మహా భారతం 

పంచమ వేదంగా కీర్తించబడే మహాభారత పురాణానికి మన రాష్ట్రంలో పన్నెండవ శతాబ్దంలో జరిగిన పల్నాటి యుద్దానికి ఎన్నో పోలికలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. 
ద్వాపర యుగంలో రాజ్యాధికారం కోసమే కాకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మోసం చేసిన కౌరవులకు వారి దుష్టపన్నాగాలను సహనంతో భరించిన పాండవులకు మధ్య జరిగింది కురుక్షేత్ర యుద్ధం. 
కలియుగంలో ఒకే తండ్రి బిడ్డలు అయిన నలగామ రాజు, మలిదేవ రాజుల మధ్య జరిగింది పలనాటి యుద్ధం. ఇది కూడా దరిదాపుగా పై కారణాల వలననే సంభవించినది. 
 అక్కడ అన్నదమ్ముల బిడ్డలు. ఇక్కడ ఒకే తండ్రికి జన్మించినవారు. 
అక్కడ మామ శకుని. ఇక్కడ నాయకురాలు నాగమ్మ. 
అక్కడ పాచికలు. ఇక్కడ కోడి పందెం. 
అక్కడ కురుక్షేత్రం. ఇక్కడ కారంపూడి. 
అక్కడ శ్రీ కృష్ణుడు. ఇక్కడ బ్రహ్మనాయుడు. 
రెండు కాలాలలో జరిగిన యుద్ధంలో లక్షల సంఖ్యలో జరిగిన జన, జీవ నష్టం అంతిమంగా లభించిన ఫలితం. 

పూర్వ గాథ 

నేటి మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ ప్రాంతాన్నినాడు పాలించిన కార్తవీర్యార్జనుని వారసులైన  హైహేయ వంశానికి చెందిన అనుగు రాజు పన్నెండవ శతాబ్దకాలంలో ఆంధ్రప్రాంతానికివచ్చారట గుంటూరు జిల్లాలోని చెందోలును రాజధానిగా చేసుకొని పాలిస్తున్న వెలనాటి చోడులను ఓడించాడు. వారి కుమార్తెను వివాహం చేసుకోవడమే కాకుండా పలనాటి సీమను వరకట్నంగా తీసుకొన్నాడు. గురజాలను రాజధానిగా చేసుకొని పాలన సాగించాడు. 
ఆయనకు విద్యావంతుడు, గొప్ప వీరుడు, న్యాయకోవిదుడు, పరిపాలనాదక్షుడు,  అసామాన్య యుద్ధతంత్ర నిపుణుడు, సంఘసంస్కర్త అన్నింటికీ మించి దైవాంశసంభూతుడు అని ప్రజలు విశ్వసించే బ్రహ్మనాయుడు మంత్రి. 
అనుగురాజు తదనంతరం ఆయన పెద్ద కుమారుడు నలగామ రాజు రాజ్యాధికారం చేపట్టాడు. తమ్ములు మరియు బ్రహ్మనాయుని సహకారంతో రాజ్యాన్ని విస్తరించాడు. ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారు. 
కానీ కులాల పట్ల సదభిప్రాయం లేని బ్రహ్మనాయుడు నాటి సమాజంలోని అట్టడుగు వర్గాలవారిని చేరదీసి కీలక పదవులను ఇవ్వడం, అన్ని కులాలవారు పక్కపక్కనే కూర్చొని సహపంక్తి భోజనం చేసే "చాపకూడు" ను అమలులోకి తేవడం కొంతమందికినచ్చలేదు . 
దీనికి మరొకటి తోడయ్యింది. బ్రహ్మనాయుడు వైష్ణవుడు. శ్రీ చెన్నకేశవస్వామి భక్తుడు. భూరి విరాళాలు స్వామివారి ఆలయాలకు ఇచ్చాడు. 
వర్ణసంక్రమణం చేయడం, క్రింది వర్గాలవారిని అగ్రవర్ణాలవారితో సమానంగా గౌరవించడం సహించలేని వారి సహకారంతో నాయకురాలు నాగమ్మ నలగామ రాజు యొక్క ప్రాపకం సంపాదించినది. 
నెమ్మదిగా సవతి సోదరుల  గురించి,బ్రహ్మనాయకుని గురించి లేనిపోనివి చెప్పి మహారాజు కు వారిపట్ల ద్వేషభావం నెలకొనేలా చేసింది. దీనితో రకరకాల సమస్యలు ఎదుర్కొన్న బ్రహ్మనాయుడు , మలిదేవరాజు సోదరులను తీసుకొని మాచర్ల చేరుకొని అక్కడ రాజ్యస్థాపన చేసాడు. కొద్దీ రోజులలలోనే మాచర్ల రాజ్య వైభవం గురజాల చేరింది. తట్టుకోలేకపోయిన నాగమ్మ నలగామరాజు తో మలిదేవాదులను కోడి పందాలకు ఆహ్వానం పంపినది. 
మయా పాచికలతో ఎలా పాండవరాజ్యం కౌరవుల వశం అయ్యిందో అదేవిధంగా మోసపూరిత కోడి పందాలలో మలిదేవాదులు రాజ్యం కోల్పోయారు. 
వారు కృష్ణానది దాటి అక్కడ ఉండసాగారు. పందెం తాలూకు షరతు ఏడు సంవత్సరాలు. కాలం ముగిసినా గురజాల వారు రాజ్యం ఇవ్వకపోగా బ్రహ్మనాయుడు పంపిన దూతను చంపడంతో యుద్ధం తప్పలేదు. 
నాగులేటి వాగు ఒడ్డున ఉన్న  "కార్యమాపూడి లేక కార్యంపూడి"(కారంపూడి) వద్ద రెండు సైన్యాలు భీకర యుద్ధం చేశాయి. యోధానుయోధులందరూ మరణించారు. చివరకు మిగిలిన ముఖ్యులు నలగామరాజు, బ్రహ్మనాయుడు, నాగమ్మ. 
తన మూలంగా జరిగిన వినాశనానికి పశ్చాతాపం తో నాగమ్మ వెళ్లి పోయింది. 
బ్రహ్మనాయుడు నలగామ రాజుకు రాజ్యం అప్పగించి తాను గుత్తికొండ బిలం లోనికి వెళ్ళిపోయాడు. 







వీరుల గుడి 

బ్రహ్మనాయుని సైన్యంలో అన్ని కులాల వారు ఉన్నారు. పలనాటి యుద్ధంలో ముఖ్యపాత్ర పోషించిన మలిదేవ రాజు,అతని  సోదరులు, కన్నమ దాసు, బాలచంద్రుడు, కొమ్మరాజు అతని తమ్ములు ఇలా అరవైఆరు మంది వీరుల పేరిట నాగులేటి ఒడ్డున  ప్రతిష్టించి, వారి ఆయుధాలను అక్కడ ఉంచి సద్గతులు  ప్రార్ధనలు చేసి గుత్తికొండ బిలం కి వెళ్లిపోయారు. 
అనంతరం  కాకతీయులు, శాతవాహనులు, రెడ్డి రాజులు,  చోళులు, విజయనగర రాజులు పలనాటి సీమను పరిపాలించారు. 
ఎందరు పాలకులు వచ్చినా కార్తీక మాసంలో అరవై ఆరు యుద్ధ వీరుల వంశాలవారు తరలివచ్చి ఐదు రోజుల పాటు ఉత్సవాలు జరిపి తమవారికి ఘన నివాళులు సమర్పించేవారట. 
ఢిల్లీ సుల్తాను, ఆర్కాట్ నవాబు చాలాకాలం ఈ ప్రాంతాన్ని పాలించారు అని చరిత్ర తెలుపుతోంది. ఈ నవాబుల కాలంలో వీరుల గుడి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకొన్నది అంటారు. 
నవాబు సైనికులు జాఫర్ మరియు ఫరీద్ అనే ఇద్దరు సేనాపతుల నాయకత్వంలో ఈ ప్రాంతాలకు వచ్చారట. 
అప్పటికి వీరుల గుడిలోని లింగాలు మట్టిలో కలిసిపోయాయి. సైనికులు వాటిని సాధారణ రాళ్లుగా భావించి వాటి మీద గిన్నెలను ఉంచి వంట చేసుకున్నారట. ఆహరం తిన్న వెంటనే సైన్యం మొత్తంగా అస్వస్థతకు గురైనదట. కారణం తెలీక సేనాధిపతులు ఏమిచేయాలో పాలుపోని పరిస్థితులలో ఉండిపోయారట. నాటి రాత్రి జాఫర్ కు శ్రీ చెన్నకేశవ స్వామి స్వప్న దర్శనమిచ్చి  " మీరు వంట చేసుకొన్న రాళ్లు వీరుల జ్ఞాపకార్ధం వేసినవి. వారంతా నా భక్తులు. మీరు చేసిన పొరబాటుకు మీరంతా అనారోగ్యానికి గురయ్యారు. వారికి క్షమాపణ కోరుకొని ఒక గురి నిర్మించండి" అని ఆదేశించారట. 
మరునాటి ఉదయం సేనాపతులు ఊరి  పిలిచి విచారించగా కలలో శ్రీ చెన్నకేశవుడు చెప్పింది నిజమని తేలడంతో వారు ప్రస్తుతం నాగులేటి ఒడ్డున ఒక గుడిని నిర్మించారట. 
అలా ప్రస్తుత ఆలయం నెలకొన్నది. 







ఆలయ విశేషాలు 

నాగులేటి వాగు ఒడ్డున ప్రధాన రహదారి మీదనే ఉంటుంది ఆలయం. 
విశాల ప్రాంగణం లో అనేక నిర్మాణాలు కనిపిస్తాయి. 
విశాల మైదానంలో  కనిపించే మండపంలో  యుద్దభూమికి వెళ్లే వీరసైనికులకు బ్రహ్మనాయుడు స్వయంగా శంకు తీర్ధం ఇచ్చేవారట. అందుకని శంకు తీర్ధ మండపం అని పిలుస్తారు. 
పక్కనే బ్రహ్మనాయుడు ప్రతిష్టించిన శ్రీ కాలభైరవ మరియు శ్రీ ఎరుకల శక్తి చిన్న రాతి మండపాలలో కనపడతారు. 
దక్షిణ ద్వారం గుండా ప్రాంగణం లోనికి వెళితే ఎదురుగా వీరుల గుడి కనపడుతుంది. ఆస్థాన మండపం, గర్భాలయం అంతే ! 
ఆస్థాన మండపంలో పడిగం, కట్టే, పోతురాజు శిల కన్పిస్తాయి. గర్భాలయంలో అరవైఆరు యోధుల పేరిట వేసిన లింగాలు వారి ఆయుధాలు అయిన కుంతలం(త్రిశూలం), సామంతుల (చిన్న త్రిశూలం, ఖడ్గం కనిపిస్తాయి. వాటికే భక్తులు పూజలు చేస్తారు. 
ప్రాంగణంలో ఇంకా బలి ఇవ్వడానికి ఏర్పాటు చేసిన స్థానాలు, ఒక రాతి తోరణం, కన్నమదాసు గుడి తో పాటు రెండు సమాధులు కనిపిస్తాయి. 
అవి మరెవెరివో కాదు వీరుల గుడిని పునరుద్ధరించిన నవాబు సేనాపతులైన జాఫర్ మరియు ఫరీద్ లవి. ఎందరో వీరులను కన్న ఈ ప్రదేశంలో మరణించడం కూడా గొప్ప విషయం అన్న భావనతో వారు ఇక్కడే ఉండి పోయారట








ఆలయ ఉత్సవాలు 

ప్రతిరోజూ భక్తులు వచ్చి తమ మొక్కుబడులు తీర్చుకొని, వంటలు చేసుకొని నివేదన పెట్టి తాము తిని పెట్టి వెళ్ళిపోతారు. 
కానీ ప్రధాన ఉత్సవాలు కార్తీక మాసంలో చివరలో జరుగుతాయి. 
వీరులగుడి పలనాటి వీరాచార పీఠం యొక్క పీఠాధిపతి ఆధ్వర్యంలో ఉంటుంది. బ్రహ్మనాయుడు స్వయంగా "పిడుగు"వంశం వారిని నియమించారు.నేటికీ వారి వారసులే గుడిని నిర్వహిస్తుంటారు. 
కార్తీక పౌర్ణమి రోజున పీఠాధిపతుల సమక్షంలో కార్తీక అమావాస్య నుండి అయిదు రోజుల పాటు పలనాటి వీరుల గుడి ఉత్సవాలు జరుగుతాయని ప్రకటిస్తారు. అదే రోజున బ్రహ్మనాయుని నృసింహ కుంతలం. బాల చంద్రుని సామంతరాగోల, కన్నమదాసు భైరవ ఖడ్గం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం నుండి సగౌరవంగా తెచ్చి నాగులేటిలో వీరుల గుడి వెనుక ఉన్న "గంగాధరీ మడుగు" అన్న ప్రదేశంలో పవిత్ర స్నానం చేయిస్తారు. చుట్టుపక్కల గ్రామాలలో  గురించి టముకు వేయిస్తారు. 
గుడిలో ఉత్సవాల ఆరంభానికి గుర్తుగా జెండా ఎగురవేస్తారు.
ఈ అయిదు రోజుల ఉత్సవాలను "రాచ గావు, రాయబారము, మందపోటు, కోడిపోరు, కల్లిపాడు" అనే పలనాటి యుద్ధం గురించి తెలిపే అయిదు అంశాలుగా విభజించి రోజుకొక అంశాన్ని ప్రదర్శిస్తారు. 
 పిన్న పెద్దలు,  పోతురాజుల,కన్నమనీడులు, ఆచారవంతులు అందరూ దూరప్రాంతాల నుండి కూడా తరలివస్తారు. తమ వీరుల కుంతలాలను తీసుకొనివస్తారు. పూజలు నిర్వహిస్తారు.  
ఆ పదిహేను రోజులు ముఖ్యంగా ఉత్సవం జరిగే అయిదు రోజులు కారంపూడి లో పండుగ వాతావరణం వెళ్లి విరుస్తుంది. 
ఊరిలోని పురాతన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం మరియు శ్రీ అంకాళమ్మ ఆలయాలలో విశేష పూజలు నిర్వహిస్తారు. కారంపూడి ఊరి చివర శ్రీ మంత్రాలమ్మ తల్లి ఆలయం ఉంటుంది. 
యుద్దానికి తరలివస్తున్న బ్రహ్మనాయునికి నాగమ్మ అడ్డంకులు సృష్టించిందట. కోపోద్రేకుడైన బ్రహ్మనాయుడు అక్కడ ఉన్న కొండ శిలను తన కుంతలంతో రెండుగా చీల్చాడట. నేటికీ ఆ సంఘటనకు సాక్షిగా నిలిచిన ప్రదేశాన్ని సందర్శించవచ్చును. 












ఒకసారైనా తప్పక చూడవలసినవి కారంపూడి వీరుల గుడి ఉత్సవాలు. 
కారంపూడి, గురజాల, మాచర్ల చుట్టుపక్కల గ్రామాలలో నేటికీ పలనాటి పాలకులు నిర్మించిన కట్టడాల శిధిలాలు కనపడతాయి. 
కారంపూడి సమీపంలోనే గుత్తి కొండ  బిలం ఉన్నది. గురజాలలో శ్రీ ఇష్ట కామేశ్వరీ దేవి ఆలయం, శ్రీ వీరభద్ర స్వామి ఆలయం, కోట అవశేషాలు కనిపిస్తాయి. 
మాచర్లలో శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం, శ్రీ వీరభద్ర స్వామి ఆలయం , చుట్టుపక్కల అవతార పురుషుడు శ్రీ పరశురాముడు ప్రతిష్టించిన అయిదు శివాలయాలు ఉన్నాయి. 
ఒకసారైనా పలనాడు ప్రాంతాన్ని సందర్శించాలి అనిపించేంత గొప్ప ఆలయాలు మరియు చరిత్రను  తెలిపే నిర్మాణాలు కనిపిస్తాయి. 

జై శ్రీ చెన్నకేశవా !!!! 


Sri Durga bhavani Temple, Dhanakonda, Vijayawada

                        శ్రీ దుర్గ భవాని ఆలయం, విజయవాడ  ఇంతకు ముందు  చెప్పినట్లు మన రాష్ట్రంలో అనేక ఆలయాలు ఉన్నాయి. కానీ సరైన విషయసమాచారం అం...