1, మే 2024, బుధవారం

Penchelakona Temple

          శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం, పెంచెలకోన 

శ్రీ నృసింహ ఆరాధన దక్షిణ భారత దేశంలో ఎక్కువ. 
అందుకే శ్రీ నృసింహ ఆలయాలు దక్షిణాదిన అధికం. తమిళనాడు, కర్ణాటక మరియు కేరళలో చాలా విశేష నృసింహ ఆలయాలు ఉన్నాయి. 
మన తెలుగు రాష్ట్రాలలో కూడా అనేక పురాతన శ్రీ లక్ష్మీ నారసింహ ఆలయాలు నెలకొని ఉన్నాయి.  






ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో స్వామి నడయాడిన క్షేత్రాలుగా పేర్కొనే నవ నారసింహ క్షేత్రాలు ఉన్నాయి. అవి అహోబిళం, సింహాచలం, వేదాద్రి, మంగళగిరి, అంతర్వేది, మాలకొండ(మాల్యాద్రి), పెంచెలకోన,యాదాద్రి మరియు ధర్మపురి. 
 శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి కొలువైన సింహాచలం మరియు స్వామి లోకకంటకుడైన హిరణ్యకశ్యపుని సంహరించిన ప్రదేశముగా ప్రఖ్యాతి గాంచిన అహోబిళం వీటిలో మొదటి వరసలో ఉంటాయి. 
ప్రతిఒక్క క్షేత్రం తమవైన పురాణ గాధలు కలిగి ఉండటం విశేషం. 
నారసింహ అవతారంలో స్వామి చెంచు లక్ష్మీ అమ్మవారిని వివాహం చేసుకొన్న స్థలంగా నెల్లూరు జిల్లాలోని పెంచెలకోన (పెనుశిల) ప్రఖ్యాతి గాంచినది. 







క్షేత్ర గాథ 

చుట్టూ పర్వతాలు. వాటి నుంచి జాలువారే జలపాతాలు. నగర జీవితానికి భిన్నంగా ప్రశాంత వాతావరణం. గతంలో ఈ ప్రదేశం ఋషి వాటిక.  శ్రీ కణ్వ మహర్షి తపస్సు చేసిన ప్రదేశం. ఈయన ప్రస్తావన అనేక పురాణాలలో కనిపిస్తుంది. ముఖ్యంగా మహాభారతంలో !  
మేనకా విశ్వమిత్రుల పుత్రిక అయిన శకుంతలను పెంచిన తండ్రిగా కణ్వ మహర్షి ప్రసిద్ధి. శకుంతల కుమారుడైన భరతుని వలననే కదా మన  దేశాన్ని భరతభూమి అన్న పేరు వచ్చిన విషయం మనందరికీ తెలుసు ! కణ్వ మహర్షి శ్రీ నరసింహుని గురించి తపస్సుచేసి స్వామివారి దర్శనాన్ని పొందిన స్థలం ఇదే అని అంటారు. 
ఆలయ ప్రాంగణంలో శ్రీ కణ్వ మహర్షి సన్నిధి కనపడుతుంది. 
అహోబిళంలో అసురరాజు హిరణ్యకశ్యపుని సంహరించిన తరువాత కూడా నారసింహుని నెలకొన్న ఆవేశం తగ్గలేదు. భీకరంగా గర్జిస్తూ నేటి నల్లమల అటవీ ప్రాంతంలో సంచరిస్తూ ఇక్కడికి చేరుకొన్నారట. ఆ సమయంలో అక్కడ స్నేహితురాళ్ళతో కండలేరు తీరాన ఆటలాడుకొంటున్న చెంచుల ఇంటి ఆడపడచు చెంచు లక్ష్మి స్వామి భీకర రూపం చేసి బెదరకుండా సమీపించి శాంతింపచేయడానికి కౌగలించుకొన్నదట. కౌగలించుకోవడానికే ఉన్న మరో పర్యాయ పదం "పెనవేసుకోవడం". ఆ పదం నుండి పుట్టినదే ఈ పెనుశిల. రాయి కన్నా కఠినంగా కనిపించే స్వామిని ఆదరంతో ఆప్యాయంగా హత్తుకొన్న ప్రదేశంగా ఈ పేరు. కాలక్రమంలో పెంచెలకోన గా మారింది. పర్వతాల నడుమ కోన లో ఉన్నందున, చెంచుల రాజ్యం వారి కన్యను అవతార పురుషుడు వారి కట్టుబాట్ల ప్రకారం వివాహం చేసుకున్నందున ఈ పేరు కూడా సమంజసంగానే  కనిపిస్తోంది. 
 కొండల మీద ప్రవహించే కండలేరు ఆలయ వెనుక భాగాన పెద్ద జలపాతంగా మారి నేలకు జాలువారుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో చాలా సుందరంగా ఉంటుందా దృశ్హ్యం. 
శాంతించి చెంచు లక్ష్మిని వివాహం చేసుకొని అక్కడ నివసిస్తున్న స్వామివారి వద్దకు మహర్షులు వచ్చి తమకు సమీపంలోని భైరవ కోన లోని అసురులతో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి తెలిపి వారి బాధను తొలగించమని ప్రార్ధించారట. 
భైరవ కోన వెళ్లి స్వామి రాక్షసులను అంతమొందించి వచ్చి ఈ జలపాతంలో స్నానం   ఆచరించారని, తన నరసింహ అవతారాన్ని చాలించారని చెబుతారు.ఈ కారణంగా  భక్తులు ఇక్కడ కండలేరులో స్నానం చేయడం విధాయకంగా భావిస్తారు. తమలోని అసుర గుణాలు, చేసిన పాపాలు  తొలగిపోతాయన్న భావం దీనిలో కనపడుతుంది. 








ఆలయ విశేషాలు 

అనేక ఆలయాల మాదిరి పెనుశిల ఆలయాన్ని కూడా అనేక రాజ వంశాల వారు దర్శించి, అనేక కైకర్యాలు సమర్పించుకొన్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరాభిముఖంగా ఉన్న అయిదు అంతస్థుల రాజగోపురం విజయనగర రాజుల నిర్మాణ శైలిలో కనపడుతుంది .కానీ కాలగమనంలో ఆలయం శిథిలావస్థకు చేరుకొన్నది. చుట్టూ చెట్టూ చేమ పెరిగిపోయాయట. 
నిత్యం పశువులను తోలుకొని ఆ ప్రాంతానికి వచ్చే బోయ యువకునికి ఒక వృద్ధుడు కనిపించాడట. నిర్మానుష్యమైన అటవీ ప్రాంతంలో ఈయనను ఎప్పుడూ చూడలేదు. ఎవరీ ముసలివాడు ? ఎందుకు ఒంటరిగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్నాడు ? అన్న ఆలోచనతో యువకుడు ఆయన వద్దకు వెళ్లారట. ఆయన ఇక్కడ వెలసిన శ్రీ నృసింహుని సేవించుకోడానికి వచ్చానని తెలిపారట.  అతనికి ఈ  శ్రీ నృసింహ క్షేత్రగాధ తెలిపి గ్రామస్థులకు కూడా తెలియచేయమని చెప్పారట. ఆనందంతో అంగీకరించిన బోయ యువకుడు తిరిగి వెళుతూ వెనక్కి తిరిగి చూడగా ఆ వృద్ధుడు పెద్ద శిలగా మారిపోతూ కనిపించారట. 
అలా తెలియకుండానే స్వామివారిని సందర్శించుకొని మిగిలిన వారికి క్షేత్రం గురించి తెలియచేసిన ఆ గొల్ల బోయ యువకుని శిలా విగ్రహం నేటికీ పెంచెలకోనకు సమీపంలో ఉన్నదని చెబుతారు. 
సముద్ర మట్టానికి మూడువేల అడుగుల ఎత్తులో తూర్పు కనుమలలో ఉన్న ఈ ఆలయం విశాల లోయ నిర్మించబడినది. 
ప్రధాన ఆలయంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి అమ్మవారి సమేతంగా ఏకశిలా రూపంలో రమణీయ అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు. 

ఛాత్రవట  నరసింహుడు 

పెనుశిల నారసింహునికి మరో పేరు ఛాత్రవట నారసింహుడు. స్వామివారి ఆలయం వెనుక కొండలు గొడుగు రూపంలో ఉంటాయి. అదే విధంగా స్వామి భైరవ కోనలో అసురులను సంహరించి తిరిగి వస్తుంటే ఋషులు ఆనందంతో గౌరవసూచకంగా స్వామికి ఛత్రం పట్టారట. ఈ కారణంగా ఈ పేరు వచ్చింది. నేటికీ భక్తులు తమ మొక్కుబడులలో భాగంగా వెండి మరియు బంగారు గొడుగులు సంవర్పించుకొంటుంటారు. 














క్షేత్ర పాలకుడు ఆంజనేయుడు 

గమనిస్తే అనేక నరసింహ క్షేత్రాలకు వాయునందనుడు క్షేత్రపాలకునిగా దర్శనమిస్తారు. అదే విధంగా పెనుశిలలో కూడా శ్రీ ఆంజనేయుడు క్షేత్రపాలకుడు. స్వామి వారివి రెండు సన్నిధులు కనిపిస్తుంది. 
ఒకటి స్వయంవ్యక్త మూర్తి. పెద్ద రాతి మీద స్వామి ఒక పక్కకు తిరిగిన రూపంలో సింధూర వర్ణనలో శోభిల్లుతూ దర్శనమిస్తారు. రెండవది ప్రధాన ఆలయ ద్వారానికి ఎదురుగా రామదూత ప్రతిష్టించిన మూర్తి కొలువై ఉంటారు. 
హనుమంత సన్నిధి వెనుక ఆలయ పుష్కరణి కండలేరు పవిత్ర జలంతో నింపబడి ఉంటుంది. బ్రహ్మోత్సవాలలో తిరుమంజనం నిర్వహిస్తారు. భక్తులు ఈ పావన కోనేరులో స్నానం చేస్తే శారీరక రుగ్మతలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అడవుల గుండా ప్రవహిస్తూ వనమూలికల సారం ఈ నీటిలో ఉంటుంది అంటారు. 
ఈ క్షేత్రంలో మరో ప్రత్యేకమైన విశ్వాసం కనిపిస్తుంది. పిల్లలు లేని వారు ఆలయానికి ఎదురుగా నేల మీద కొంతసేపు పడుకుంటే పిల్లలు పుడతారు అని చెబుతారు. దీనిని "వరపడి సేవ"గా పిలుస్తారు. అనేక మంది సంతానం లేని దంపతులు అలా చేసి సంతానాన్ని పొందారని, పొందుతున్నారు అని, అలా జన్మించిన పిల్లల బారసాల, అన్నప్రాసన, అక్షరాభ్యాసం అన్నీ ఇక్కడే జరిపించుకొంటారని తెలుస్తోంది. . 







మహాలక్ష్మీ అమ్మవారి సన్నిధి 

ప్రాంగణంలో కండలేరు ప్రవాహం పక్కన శ్రీ మహాలక్ష్మి అమ్మవారు స్వామి సన్నిధికి దూరంగా కొద్దిగా ఎత్తైన ప్రదేశంలో నెలకొన్న సన్నిధిలో దర్శనమిస్తారు. 
దీని వెనుక ఒక కథ వినిపిస్తుంది. 
స్వామి ఈ క్షేత్రములో నరసింహ అవతారాన్ని విడిచి చెంచు లక్ష్మిని వివాహం చేసుకొని ఇక్కడే నివాసం ఏర్పరచుకున్నారు అన్న విషయం వైకుంఠంలో ఉన్న శ్రీ మహాలక్ష్మీ దేవికి చేరినదట. 
దేవేరి భూలోకానికి వచ్చి శ్రీవారు చెంచు లక్ష్మీ దేవితో వనాలలో విహరించడం కనులారా చూసి 
కినుక వహించి కండలేరు ఒడ్డున శిలారూపం దాల్చారట. ప్రతి నిత్యం అమ్మవారికి పూజలు జరుగుతాయి. శ్రావణ మాసంలో విశేష పూజలు నిర్వహిస్తారు. 
పక్కన శ్రీ కణ్వ మహర్షి సన్నిధి కూడా ఉంటుంది. 
ఇతర ఉపాలయాలలో శ్రీ కాళియ మర్దన కృష్ణుడు మరియు శ్రీ గరుడాళ్వార్ కొలువై ఉంటారు. 















ఆలయ పూజలు మరియు ఉత్సవాలు

పెనుశిల శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆలయం ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల భక్తుల దర్శనార్ధం తెరిచి ఉంటుంది. ఉత్సవాలలో ప్రత్యేక పర్వ దినాలలో భక్తుల రద్దీ ఆధారంగా దర్శన వేళలు మారుతాయి. 
నిత్యం నియమంగా అభిషేకాలు, అలంకరణలు, అర్చనలు మరియు ఆరగింపులు నిర్ణయించిన ప్రకారం జరుపుతారు. శనివారాలు, పర్వ దినాలు మరియు శలవు దినాలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. 
స్వామి వారి జన్మదిన సందర్బంగా వైశాఖ మాసంలో అయిదు రోజులపాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు. మన తెలుగు రాష్ట్రాల నుండే కాదు తమిళనాడు, పాండిచ్చేరి మరియు కర్ణాటక రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. 
దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన వసతి గృహాలు అద్దెకు లభిస్తాయి. భక్తులకు నిత్యం ఉచిత అన్నప్రసాద వితరణ జరుగుతుంది. 
పెంచెలకోన అభయారణ్యంతో కూడిన శేషాచలం కొండలలో అద్భుతమైన ప్రకృతికి, ఆధ్యాత్మిక పరిమళాలకు నిలయమై శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి కొలువైన పెనుశిల దివ్య క్షేత్రం నెల్లూరు పట్టణానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. చక్కని చిక్కని అడవుల గుండా సాగే మార్గం యాత్రీకులకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. 

ఓం నమో నారాయణాయ నమః 

 





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Narmada Pushkaraalu

                                       నర్మదా పుష్కరాలు  సృష్టి అది నుంచి భారతదేశంలో ప్రకృతిలో లభ్యమయ్యే ప్రతి ఒక్కదానిని భగవత్స్వరూపంగా భావ...