29, జనవరి 2023, ఆదివారం

Navagraha Mandapam

                                      నవగ్రహ మండపం 



                                                                                                     

ప్రతి శివాలయంలో ఈశాన్యంలో కనపడుతుంది నవగ్రహ మండపం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితాలను ప్రభావితం చేసే నవగ్రహాలైన సూర్య, చంద్ర, అంగారక, బుధ, గురు, శుక్ర, శని, రాహువు మరియు కేతువులు కొలువై ఉండే స్థలం.
పుట్టిన దగ్గర నుండి మరణించే దాకా మానవ జీవితాలో సంభవించే ఉద్దానపతనాలకు ఈ గ్రహాలే కారణం  అంటుంది జ్యోతిష్యశాస్త్రం. ఆ ఎత్తుపల్లాలు ఎలా ఉండబోతున్నాయి అన్నది మన జాతక చక్రంలో గ్రహాలు ఉన్న స్థానాల  ఆధారంగా ఒక అంచనాకు వస్తారు జ్యోతిష్కులు. ఏయే గ్రహాలు అననుకూలంగా ఉన్నాయో చూసి వాటి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడానికి నిర్ణయించిన శాంతులు, అభిషేకాలు, దానాలు, ప్రదక్షణాలను తెలుపుతారు.
సహజంగా నవగ్రహ మండపంలో ప్రధాన దైవం ప్రత్యక్ష నారాయణుడైన శ్రీ  సూర్య నారాయణ మూర్తి.  ఆయన వెనుక పడమరలో పుత్రుడైన శని భగవానుడు ఉంటారు. ఈశాన్యం లో కేతువు, ఆగ్నేయంలో శుక్రుడు, ఉత్తరంలో బుధుడు, దక్షిణంలో కుజుడు, వాయువ్యంలో చంద్రుడు, నైరుతిలో రాహువు కొలువై ఉంటారు. 
ఆదిత్యుడు సప్తాశ్వ రధారూరుడై కనపడతారు. చంద్రుడు పది తెల్లని అశ్వాల కలిగిన రథంలో ఉంటారు.  దక్షిణంలో ఉండే అంగారకుడు ఒకరకమైన గొఱ్ఱె వాహనం కలిగి ఉంటారు. బుధుడు సింహవాహనుడు. గురువు లేదా బృహస్పతి పద్మ వాసనుడు. శుక్రుడు అష్ట అశ్వ వాహనుడు. శని భగవానుడు కాకి వాహనుడు. వీరు మన జీవితాలలో ఒక్కో సమయంలో ఒక్కో విధమైన ప్రభావాన్ని చూపిస్తారు. 
మనందరం జీవితంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక కారణంగా నవగ్రహాలకు ప్రదక్షణలు చేసిన వాళ్ళమే.ప్రదక్షణలు చేస్తున్నప్పుడు నవగ్రహాలను పరీక్షగా చూసి ఉన్నామా ? తొమ్మిది గ్రహాలూ ఏ విధంగా ఉన్నాయి,  ఏయే దిక్కులను చూస్తున్నాయి, వారి వాహనాలు ఆయుధాలు ఏమిటి అన్న విషయాలను గమనించామా ?
ఇప్పటి దాకా చూడక పోతే ఇక ముందు చూడండి. ఎన్నో అరుదైన విషయాలు తెలుస్తాయి. తమిళనాడు రాష్ట్రంలో కుంభకోణం చుట్టుపక్కల మరియు చెన్నై చుట్టుపక్కల నవగ్రహ ఆలయాలు నెలకొని ఉన్నాయి. ఆ ఆలయాలలో పరమశివుడే లింగ రూపంలో  ఆయా గ్రహాల తరుఫున  పూజలు అందుకొంటారు. కానీ నవగ్రహ మండపంలో తొమ్మిది గ్రహాలే ఉండి భక్తుల అభిషేకాలు,పూజలు స్వీకరిస్తుంటారు. దాని వలన మన జీవితాలలో గ్రహ సంబంధిత సమస్యలు దూరం అవుతాయని భావిస్తాము .  
నేను స్వయంగా సందర్శించిన కొన్ని ఆలయాలలో ఉన్న నవగ్రహ మండప విశేషాలను అందరితో పంచుకొందామన్న ఉద్దేశ్యంతో ఈ వ్యాసం రాస్తున్నాను.

తిరువారూరు : తమిళనాడులోని అతి పెద్ద ఆలయాలలో ఒకటి. సంగీత త్రిమూర్తులుగా కీర్తించే శ్రీ త్యాగరాజు, శ్రీ ముత్తుస్వామి దీక్షితార్, శ్రీ శ్యామశాస్త్రి ల జన్మస్థలం. శ్రీ త్యాగరాజ స్వామి   ఆలయంలో ఉన్నన్ని పరివార దేవతల సన్నిధులు వేరెక్కడా కనపడవు. ఒక్క వినాయక విగ్రహాలే వంద దాకా ఉంటాయి. ప్రతి నిత్యం ప్రదోష పూజలు జరుగుతాయి.
ఆలయానికున్న మూడు ప్రాకారాలలో మొదటి ప్రాకారంలో ఉంటుంది నవగ్రహ మండపం.
సహజంగా సూర్యుడు, శుక్రుడు తూర్పు, చంద్ర, శని పడమర, బుధ, గురు ఉత్తరం, అంగారక, రాహు కేతువులు దక్షిణ దిశలను చూస్తుంటారు. కానీ ఇక్కడ నవగ్రహాలన్నీ ఒక వరుసలో పడమర దిశను   అంటే   గర్భాలయం లోని శ్రీ త్యాగరాజస్వామి ని చూస్తుంటాయి.హస్త, చిత్త నక్షత్ర జన్ములకు పరిహార క్షేత్రం తిరువారూరు.
తిరువారూరు కు తంజావూరు, కుంభకోణం, చిదంబరం,చెన్నై నుండి నేరుగా చేరుకోడానికి బస్సు రైలు సౌకర్యం లభిస్తుంది. తప్పక సందర్శించవలసిన ఆలయాలలో ఒకటి.
మైలాడుతురై  (మాయవరం) :   పట్టణంలోని శ్రీ మయూరనాథ స్వామి కోవెల కారణంగా  ఈ పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. నెమలి రూపంలో పార్వతీదేవి సర్వేశ్వరుని గురించి తపస్సు చేసి సాక్షత్కారం పొందినట్లుగా ఆలయ గాధ చెబుతోంది. విశేష ఆలయం. ఈ క్షేత్రంలోని నవగ్రహ మండపంలో శనీశ్వరుడు తల మీద అగ్ని శిఖలతో దర్శనమిస్తారు. జ్వాలాశని గా పిలిచే ఈయనకు అభిషేకాలు జరిపిస్తే ఏలినాటి శని ప్రభావం తొలగిపోతుంది అని చెబుతారు.
ఇలాంటి శని రూపం మరో ఆలయంలో కనపడదు.
మైలాడుతురై కి చెన్నై, మధురై, తంజావూరు, కుంభకోణం, చిదంబరం నుండి నేరుగా రైలు, బస్సు మార్గాలలో సులభంగా చేరుకోవచ్చును.
తిరుక్కొల్లిక్కాడు   : తిరువారూరు కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుక్కొల్లిక్కాడు శ్రీ అగ్నీశ్వర స్వామి ఆలయం ఒక విశేష నిర్మాణం.  శని భగవాన్ ప్రత్యేక సన్నిధిలో అనుగ్రహ మూర్తిగా దర్శనమిస్తారు. శనివారాలు ఉమ్మెత్త పూలతో అర్చన చేయడం వలన ఏలినాటి శని ప్రభావాన్ని తగ్గించుకోవచ్చును అంటారు.
గ్రహ సంబంధిత అభిషేకాలు, అర్చనలు గర్భాలయంలో కొలువైన శ్రీ అగ్నీశ్వర స్వామికే చేస్తారు. నవగ్రహ మండపంలోని నవగ్రహాలు అసహజ పద్దతిలో ఒకదానికి ఒకటి ఎదురు బొదురుగా కొలువై ఉంటాయి. శ్రీ అగ్నీశ్వరస్వామే భక్తులకు వాటి తరుపున ఉపశమనం కలిగించడం వలన పనిలేక నవగ్రహాలు కబుర్లు చెప్పుకొంటున్నాయి అని హాస్యమాడుతుంటారు స్థానికులు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించినవారి పరిహార క్షేత్రం.
విలంకుళం : తంజావూరు కు డెబ్భై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న విలంకుళం శ్రీ అక్షయపురీశ్వర స్వామి వారు కొలువైన దివ్య క్షేత్రం. సోదరుడు యమునితో జరిగిన ఒక వివాద సందర్బంగా శనీశ్వరుని కాలు విరిగిందట. ఈ క్షేత్రంలో పరమేశ్వరుని అనుగ్రహంతో సరైనదట. ఈ కారణంగా విలంకుళం శని పరిహార క్షేత్రంగా ప్రసిద్ధి చెందినది. భార్యలైన మందాదేవి మరియు జ్యేష్టాదేవి లతో కలిసి కళ్యాణ శనీశ్వరునిగా కొలువైన ఈయనకు నువ్వుల నూనెతో ఎనిమిది పర్యాయాలు అభిషేకం జరిపితే అర్ధాష్టమ, ఏలినాటి, జన్మ శని ప్రభావం తొలగిపోతుంది అన్నది స్థానిక విశ్వాసం. శనివారాలు పెద్ద సంఖ్యలో భక్తులు అభిషేకాలు జరిపించుకోడానికి వస్తుంటారు. సూర్యభగవానుడు మరో ఉపాలయంలో దర్శనమిస్తారు. 
అన్ని కోర్కెలను నెరవేర్చే శ్రీ అక్షయ పురీశ్వర స్వామి, కళ్యాణ శని మరియు ఆదిత్యుడు కొలువైనందున వేరుగా నవగ్రహ మండపం ఉండదు. నవగ్రహ మండపం లేని అతి తక్కువ ఆలయాలలో ఇదొకటి.
దేవీ పట్టిణం : రామేశ్వరానికి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సాగర తీర క్షేత్ర గాధ  రామాయణంతో ముడిపడి ఉండటం విశేషం. సీతాదేవిని రావణాసురుని చెర నుండి విడిపించడానికి లంకను చేరటానికి వారధి నిర్మించడానికి ముందు శ్రీ రాముడు వానర సేనతో ఇక్కడకి వచ్చారట. సముద్రం తీరాన తొమ్మిది శిలలను నవగ్రహ రూపాలుగా ప్రతిష్టించి పూజలు జరిపించారట. శ్రీ సౌందర్య నాయకీ సమెత శ్రీ తిలకేశ్వర స్వామి, శ్రీ అష్టభుజ దుర్గాదేవి ఆలయంలో కొలువై ఉంటారు. సముద్రంలో ఉన్న నవగ్రహ శిలలకు, అష్టభుజ దుర్గాదేవికి అర్చనలు జరిపించుకొంటే అన్ని గ్రహబాధలు తొలగిపోతాయి అని విశ్వసిస్తారు.
దేవీ పట్టిణం పితృకార్యాలకు ప్రసిద్ధి. ఇలా సముద్రం కొలువైన  రూపు లేని శిలలుగా నవ గ్రహాలు  పూజలు అందుకొనే క్షేత్రం దేవీ పట్టిణం ఒక్కటే !
తెందురి పెరై : పావన తమిరబారాణి నదీతీరంలో నెలకొన్న తెందురిపెరై శైవులకు దర్శనీయమైన నవ కైలాసాలలోను, వైష్ణవులకు పూజ్యనీయమైన నవ తిరుపతులలోనూ స్థానం పొందిన స్థలం. పెరుమాళ్ కోవెల వైష్ణవ సంప్రదాయం ప్రకారం సూర్య క్షేత్రం. దగ్గరలోనే ఉన్న శ్రీ శివగామీ సమేత  శ్రీ కైలాస నాథర్ కొలువైన ఆలయం బుధ పరిహార క్షేత్రం. ఇక్కడి నవగ్రహ మండపంలో సూర్యుడు ఏడు, చంద్రుడు పది, శుక్రుడు మరియు గురువు ఎనిమిది అశ్వాలు పూంచిన రధాలలో ఉపస్థితులై దర్శనం ఇవ్వడం అరుదైన విషయం. ఇలా మరెక్కడా కనపడదు.
తిరువణ్ణామలై  : స్మరిస్తే చాలు ఇహపర సుఖాలను అనుగ్రహించే పవిత్ర నామం అరుణాచలేశ్వర. ఈ దివ్య క్షేత్రంలో అయ్యన్ కుళం పుష్కరణి దగ్గర ఉన్న శ్రీ అరుణగిరినాథర్ లింగం శ్రీ మహావిష్ణు ప్రతిష్టగా చెబుతారు. ఈ ఆలయంలోని నవగ్రహ మండపంలో నవగ్రహాలు తమ భార్యలతో సహా తమతమ వాహనాల మీద కూర్చొని దర్శనమివ్వడం అత్యంత అరుదైనది  పేర్కొనవచ్చును.  వివాహం కానివారు, సంతానం లేనివారు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ నవగ్రహ పూజలు జరిపించుకొంటుంటారు.
తిరుకుళందై (పెరుంకుళం)  : తమిరబారాణి నదీ తీరంలో నెలకొన్న శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో మరియు నవ తిరుపతులలో శని క్షేత్రంగా పెరుంకుళం ప్రసిద్ధి. శ్రీదేవి మరియు శ్రీ వెంకట వాసన్ పెరుమాళ్ స్థానిక భంగిమలో దర్శనమిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం ఇది శని పరిహార క్షేత్రం. ఒక వైష్ణవ ఆలయంలో నవగ్రహ మండపం నెలకొని ఉండటం అరుదైన విషయం.  నవగ్రహలతో పాటు ప్రత్యేక సన్నిధిలో కొలువైన శ్రీ శని భగవానుకు జాతకరీత్యా శని ప్రభావాన్ని ఎదుర్కొంటున్నవారు ప్రత్యేక పూజలు జరిపించుకొంటుంటారు. పెరుంకులం తెందురిపెరై కి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
మధురై : శ్రీ మీనాక్షీ సమేత సోమసుందరేశ్వర స్వామి కొలువైన మధురై ఎన్నో విశేష ఆలయాలకు పుట్టినిల్లు. వాటిల్లో ఒకటి శ్రీ కూడల్ అళగర్ పెరుమాళ్ కోవెల ఒకటి. శ్రీ వైష్ణవ నూట ఎనిమిది దివ్యదేశాలలో ఒకటి. శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ అళగర్ పెరుమాళ్ గర్భాలయంలో ఉపస్థిత భంగిమలో నిలువెత్తు రూపంలో నయనమనోహరంగా దర్శనమిస్తారు.  మధురై రైల్వే స్టేషన్ కి సమీపంలో ఉన్న ఆలయంలో కూడా నవగ్రహ మండపం కనిపించడం ఒక ప్రత్యేకత. నియమంగా నవగ్రహ పూజలు నిర్వహిస్తారు. వైష్ణవ ఆలయంలో నవగ్రహ మండపం కనపడటం  అరుదైన విషయంగా పేర్కొనాలి. ఇలా నవగ్రహ మండపం కనపడే మరో విష్ణు ఆలయం శ్రీ శ్రీనివాస పెరుమాళ్ ఆలయం, పెరుంకుళం. ఈ ఆలయం శ్రీ వైష్ణవ నవగ్రహ దేవాలయాలలో ఒకటి. ఈ రెండు ఆలయాలు ఆళ్వార్లు పాశురాలు గానం చేసిన  శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో భాగంగా ఉండటం మరో విషయంగా పేర్కొనాలి.  
ఇలా ఎన్నో ప్రత్యేక విశేష రూపాలలో  నవగ్రహలు కొలువైన మండపాలను తమిళనాడులోని పెక్కు పురాతన చారిత్రక ఆలయాల్లో దర్శించుకోవచ్చును.


ఆదిత్యాయ సోమాయ మంగళాయ భుధాయచ!గురు శుక్ర శనిభేష్య రాహవే కేతవే నమః!









కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...