23, అక్టోబర్ 2022, ఆదివారం

Gaja Gamanam

                                           గజ "గమనం" 

                                                                                                         


ఏనుగమ్మా ఏనుగు 
మా ఊరొచ్చింది ఏనుగు ........ 
చిన్నప్పుడు అమ్మ ఒడిలో పడుకొని మనందరం పాడుకొన్న పాట ఇది. మనమే కాదు మన ముందు తరాలవారు మన తరువాత తరాల వారు పాడుకొన్నారు. పాడుకొంటారు కూడా. ఒకప్పుడు ఏ సర్కస్ కంపెనీ లేదా భైరాగులో, సాధువులో ఊరిలోకి వస్తే పిల్లలకు ఆటవిడుపే. ఏదో వంకతో అక్కడికి వెళ్లి ఏనుగులను చూస్తుండి పోయేవారు. నేటికీ పరిస్థితులలో మార్పు లేదు. పది అడుగుల ఎత్తుతో బలమైన శరీరంతో, తోక, చెవులు, తొండాన్ని గమ్మత్తుగా కదిలిస్తూ కదలి వచ్చే కరిరాజు కనపడితే పిల్లలే కాదు, పెద్దలు కూడా కళ్ళు అప్పగించి చూడాల్సినదే ! అంతటి విలక్షణ ఆకర్షణీయ ఆకారం ఏనుగులది.
నేడు పృథ్వి మీద ఉన్న జంతువులలో ఆకారంలో పెద్దది అయిన ఏనుగు మానవులతో యుగాల నుండి సహజీవనం చేస్తున్నది. ఒకప్పుడు భూగోళం లోని అన్ని దేశాలలో సంచరించిన ఏనుగులు ప్రస్తుతం ముప్పై రెండు దేశాలలో మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి అని జంతు ప్రేమికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులు ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల, జాతుల,తెగల, మతాల వారి ఆదరాభిమానాలను పొందాయి అని ఆయా ప్రాంతాల చారిత్రక గాధలు వెల్లడి చేస్తున్నాయి. దైవ స్వరూపంగానే కాకుండా, శక్తికి, యుక్తికి, తెలివికి, బలానికి, ధైర్యానికి, విజయానికి చిహ్నంగా ఏనుగులు కొనియాడబడుతున్నాయి. భారతీయ పురాణాలలో ఏనుగులతో ముడిపడి ఉన్న ఘట్టాలు అనేకం కనపడతాయి. హిందువుల తొలిపూజ గజ వదనునికే కదా !!

 ప్రపంచ ఏనుగుల దినోత్సవం 

ఆగస్టు పన్నెండో తేదీని ప్రపంచ ఏనుగుల దినోత్సవంగా జరుపుకోవాలన్న నిర్ణయాన్ని 12.08. 2012  తీసుకోవడం జరిగింది.  ఆ రోజునే ఎన్నుకోడానికి గల కారణం, దాని వెనక గల ఆశయం రెండూ మహోన్నతమైనవే ! 12.08.2012 నాటికి థాయిలాండ్ లో వివిధ వర్గాల వద్ద ఊడిగం చేస్తున్న వంద ఆసియా ఏనుగుల చెర విడిపించి, సగౌరవంగా పుట్టింటికి పంపడం జరిగింది. ఈ గొప్ప మానవీయ కార్యక్రమంలో కెనడాకు చెందిన ప్రముఖ డాక్యూమెంటరీ సినీ దర్శకురాలు "ప్యాట్రిసియా సిమ్స్"  తో పాటు నటుడు "విలియం షార్ట్నర్"లే కాకుండా ఏనుగుల మీద అభిమానం గల అనేక రంగాలవారు, జంతు ప్రేమికులు, సామాజిక కార్యకర్తలు, వన్యప్రాణి సంరక్షక బృందాల వారు పాల్గొన్నారు. థాయిలాండ్ ప్రభుత్వ నేతృత్వంలో పనిచేసే "ఎలిఫెంట్ రి ఇంట్రొడక్షన్ ఫౌండేషన్" అనే సంస్థ కూడా వీరితో జత కలిసింది. థాయిలాండ్ లోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి కారణం అధిక సంఖ్యలో పెంపుడు ఏనుగులున్నది అక్కడే !   ప్యాట్రిసియా సిమ్స్ ఏనుగుల నేపథ్యంలో నిర్మించిన రెండు చిత్రాలు థాయిలాండ్ నేపథ్యంలోనితీసినవి కావడం విశేషం.నటుడు విలియం షార్ట్నర్ ఈ రెండింటికీ వ్యాఖ్యాతగా పనిచేయడం మరో విశేషం.  వీరిరువురూ ఏనుగుల పట్ల ఆవాజ్య ప్రేమ కలవారు.
శతాబ్దాలుగా ఎందరినో ఆకర్షిస్తున్న జీవి ఏనుగు. ఇంతగా అందరి దృష్టినీ ఆకట్టుకొనే గొప్పదనం ఏమిటంటే, ఒకటి కాదు చాలా ఉన్నాయి అంటారు గజ ప్రేమికులు.

ఏనుగంటే .... 

.ఏనుగులు కొన్ని లక్షల సంవత్సరాలుగా ధరణిలో జీవిస్తున్నాయని పరిశోధనల అనంతరం శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు.అనేక శిలాజాలను ఆధారంగా చూపారు.రాతి యుగం నాటి ఏనుగులు పెద్ద పెద్ద దంతాలతో, శరీరమంతా రోమాలతో చూపులకు ఒకింత భయానకంగా ఉండేవని చెబుతారు. కాలగమనంలో మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా నేటి రూపును సంతరించు కొన్నాయన్నది వారి పరిశోధనల సారాంశం.
భారతీయ భాషలలో "దంతి" అనే ఒక పదం ఉన్నది. దానికి "దంతములు కల జంతువు" అని "ఏనుగు"అని అర్ధాలున్నాయి.లాటిన్ భాషలోని "ఎలిఫాస్" అనే పదానికి అర్ధం కూడా "దంతం" అనే ! ఆ పదం నుండి పుట్టినదే "ఎలిఫెంట్". ఏనుగులకు దంతాలు ఉంటాయి కదా ! ఎలిఫెంట్ లోని ప్రతి  భాగం ప్రత్యేకమైనదే !
శ్వాస పీల్చుకోడానికి, ఆహార సముపార్జనలో, ఆత్మ రక్షణలో, నీటిని తాగడానికి, ఇలా అనేక రకాలుగా ఉపయోగపడే పొడుగైన తొండంలో నలభై వేల కండరాలు ఉంటాయట ! దీని సాయంతో నాలుగు వందల కిలోల బరువును ఎత్తగలవు. ఒకేసారి పద్నాలుగు లీటర్ల నీటిని పీల్చుకోగలదు. తొండం చివర ఉండే వేలు వంటి భాగం సన్నని గరికను తుంపడానికి, చిన్న చిన్న గింజలను తీసుకోడానికి తోడ్పడుతుంది. అంగుళం మందాన రోమాలతో నిండి ఉండే చర్మం పైకి కనిపించేంత కఠినం కాదు. చాలా సున్నితం.ఈగ లేదా దోమ వాలినా తెలిసి పోతుంది.తోక,చెవులు,తొండంతో స్పందిస్తాయి.జలక్రీడల అనంతరం దేహం మీద మట్టిని జల్లు కొంటాయి.అలా చేయడం సూర్య కిరణాల వేడి నుండి చర్మాన్ని రక్షించుకోడానికే ! చేటల లాంటి చెవులను నిరంతరం కదిలిస్తూ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకొంటాయి. చెవులు, పాదాలలోని సున్నిత కండరాల సహాయంతో కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న జంతువు రాకను పసిగట్టగలవు. చిన్నవైన కళ్ళు సూక్ష్మ దృష్టిని కలిగి ఉంటాయి.
సంవత్సరానికి ఏడు అంగుళాల చొప్పున జీవితాంతం పెరిగే దంతాలు ఏనుగులకు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. పూర్తిగా పెరిగిన ఒక్కో దంతం బరువు ఇరవై అయిదు కిలోల బరువుంటుంది. నోటిలోని దంతాలు కూడా ఊడిపోయినా తిరిగి పెరుగుతాయి.

సహజీవన ప్రియులు 

నీటి వనరుల దగ్గర, సతత హరితారణ్యాలలో, గడ్డి వనాలలో ఎక్కువగా నివసించే ఏనుగులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడవు. పది నుండి వంద దాకా కలిసి ఒక సమూహంగా జీవిస్తాయి. వయస్సులో పెద్దదైన ఆడ ఏనుగు గుంపుకు నాయకత్వం వహిస్తుంది. యుక్తవయస్సుకు వచ్చిన మగ ఏనుగులు మాత్రం మంద నుండి విడిపోయి,తిరిగి జతకట్టడానికే ఆడవాటి వద్దకు వస్తాయి. ఇరవై రెండు నెలల పాటు గర్భం ధరించిన ఆడ ఏనుగులు, నూట పాతిక కిలోల బరువున్న శిశువుకు జన్మనిస్తాయి. 
ఏనుగులు సుఖం,సంతోషం,ఆనందం,బాధ,దుఃఖం,ఆందోళన లాంటి భావనలను సాటివాటితో పంచుకొంటాయట. తొండంతో తాకడం,తట్టడం,నిమరడం,తొండాన్ని తొండంతో మెలివేయడం, శరీరాన్ని శరీరంతో రుద్దడం లాంటి చర్యలు అందులో భాగమేనట !  సహచరులకు సంకేత మివ్వడానికి అనేక రకాల శబ్దాలు చేస్తాయట.వాటిల్లో ఘీంకారం ప్రత్యేకమైనది.పది కిలోమీటర్ల దూరం దాకా వినిపిస్తుందిట. అనేక సందేశాలను పంపుతుంది. 

నేర్పితే నేర్వగ రాని .... 

మానవ మెదడును పోలి ఉండే ఏనుగు మెదడు పరిమాణం అయిదు కిలోలు వుంటుంది. చాలా తెలివైనవి.అడ్డం ముందు నిలబడి తనను తాను గుర్తించుకోగల సామర్ధ్యం గల కొద్ది జంతువులలో ఏనుగు ఒకటి. నేర్పితే ఏనుగులు నేర్చుకోలేని విద్య లేదని చెప్పవచ్చును. సర్కసు, దేవాలయ ఏనుగులను చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. కొరియాలో ఒక ఆసియా ఏనుగు తన మావటి తరచూ ఉపయోగించే పదాలను విని విని కొంతకాలానికి వాటిల్లో కొన్నింటిని పలకడం మొదలుపెట్టినదట. లండన్ కి చెందిన "కరిష్మా", థాయిలాండ్ లోని "హాంగ్" అనే ఆసియా ఏనుగులు తొండంతో కుంచె పట్టి కాన్వాస్ మీద చిత్రాలను చిత్రించడం గురించి మనం వినే ఉన్నాము. 

జ్ఞాపక శక్తి అధికం 

తమకు మేలు లేదా హాని చేసినవారిని ఎన్ని సంవత్సరాలైనా తేలికగా గుర్తిస్తాయి.తగినట్లుగా స్పందిస్తాయి.పెంపుడువైతే మావటి ఆదేశాలను అర్ధం చేసుకొని పాటిస్తాయి.తొండం సహాయంతో నీరు ఎక్కడ, ఏ దిశలో, యెంత దూరంలో ఉన్నది అన్న అంచనాలు వేయగలవు. ఒకసారి వెళ్లిన ప్రదేశాలను,మార్గాలను మరచిపోవు.ఆపత్కాలంలో, దుర్భిక్ష పరిస్థితులలో నీరు ఆహరం లభించే సురక్షిత ప్రాంతాలకు చేరుకో గల సామర్ధ్యం వీటి సొంతం. 

మందగమనం 

గజాల నడకను మందగమనం అంటాము. కానీ అది నిజం కాదు. ఏనుగులు గంటకు ఇరవై అయిదు కిలోమీటర్ల వేగంతో వెనక్కి మరియు ముందుకీ కూడా పరిగెత్తగలవు. పాపం దూకలేవు. భారీ కాయం కదా ! పరిస్థితులకు అనుగుణంగా త్వరితంగా స్పందించడం వీటి సహజ లక్షణం. 

గజ "వంతరి"

ఏనుగులు తమకు తా మే ధన్వంతరి. శుభ్రమైన జలం, ఆరోగ్యకరమైన ఆహారం లభించే ప్రాంతాలనే ఎంచుకొంటాయి. తాము నివసించే సంచరించే పరిసరాల వాతావరణం గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటాయి. ఏదన్నా అసహజంగా కనిపిస్తే ఆ ప్రాంతాన్నివదిలేస్తాయి. అనారోగ్య పరిస్థితులలో ఆరోగ్యాన్ని కుదుట పరుచుకోడానికి ఏరకమైన ఆకులు, చెట్ల వేర్లు లేదా బెరడు తీసుకోవాలో అన్న అవగాహన కలిగి ఉంటాయి.శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో గర్భిణిగా ఉండే ఆడ ఏనుగులు సుఖప్రసవానికి దోహదపడే చెట్ల ఆకులను ఎక్కువగా తీసుకోవడం గుర్తించారు. 

సింహస్వప్నం 

భారీకాయ, కావలసినంత బలం,బోలెడంత తెలివి గల ఏనుగులకు "సింహం"అంటే పీడ కల అని అంటుంటారు.కలలోనే కాదు కేసరి పేరు వింటేనే కలత పడతాయి అన్న దానిలో లేశ మంతైనా నిజం లేదని పరిశోధకులు తేల్చేశారు.కాకపోతే అంత పెద్ద జంతువుకు సూక్ష్మజీవు లైన చీమ, తేనేటీగలంటే మాత్రం సింహస్వప్నమేనట !

జనాభా లెక్కలు - వర్గ విభజన 

ఆఫ్రికా మరియు ఆసియా ఖండాలలో నివసిస్తున్న ఏనుగుల సంఖ్య నాలుగు నుండి అయిదు లక్షల దాకా ఉంటుందని లెక్కలు చెబుతున్నాయి.వీటిలో అధిక శాతం అంటే నాలుగు లక్షలకు పైగా ఒక్క ఆఫ్రికా ఖండంలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది.ఆసియా ఖండంలో ఉన్న అర లక్షపై చిలుకు గజాలలో ఎక్కువ భాగం భారతదేశంలోనే నివసిస్తున్నాయి.తరువాత స్థానం శ్రీ లంకదే!  నేపాల్, చైనా,భూటాన్, మయమ్మారు, థాయిలాండ్,వియత్నాం,తైవాన్,కంబోడియా, మలేసియా,  బంగ్లాదేశ్ లలో కొద్ది మొత్తంలో ఏనుగుల సంచారం కనిపిస్తుంది. 
శారీరకంగా ఉన్న తేడాలు, నివాస ప్రాంతాల ఆధారంగా ఆఫ్రికా, ఆసియా, సుమత్రా అనే మూడు జాతులుగా ఏనుగుల వర్గ విభజన జరిగింది.ఇవి కాకుండా "బోర్నియో పిగ్మి ఏనుగులు" అనే మరో ప్రత్యేకమైన జాతికి చెందినవి కూడా కనపడతాయి. 

ఆఫ్రికా ఏనుగులు 

ప్రపంచంలోనే ఎత్తైన, బలిష్టమైన మరియు తెలివైనవిగా ఆఫ్రికా ఏనుగులు ప్రసిద్ధి. సుమారు పదమూడు అడుగుల ఎట్టు, పదివేల కిలోల బరువు గల శరీరంతో ఉండే వీటి శాస్త్రీయ నామం "జీనస్ లాక్స్లోడెంటా". పొడుగాటి తొండం,పెద్ద చెవులు, విశాలమైన నుదురు, తల, రోమాలు తక్కువగా ఉండే బూడిద రంగు చర్మంతో కనిపించే ఆఫ్రికా ఏనుగులలో ఆడా మగా రెండూ దంతాలు కలిగి ఉండటం విశేషం. వీటిల్లో "ఆఫ్రికన్ బుష్ ఎలిఫెంట్" మరియు "ఆఫ్రికన్ ఫారెస్ట్ ఎలిఫెంట్" అనే రెండు ఉపజాతులున్నాయి. 
నేటి వరకు లభించిన వివరాల ప్రకారం పదమూడున్నర అడుగుల ఎత్తున్న ఏనుగు అంగోలాలో, ఆరున్నర అడుగుల పొడవుగల దంతాల గజరాజు కెన్యాలో సంచరించినట్లుగా తెలుస్తోంది. 

ఆసియా ఏనుగులు 

ఆఫ్రికా వాటితో పోల్చితే ఆసియా ఏనుగులు ఆకారంలో చిన్నగా ఉంటాయి. ఏడు నుండి పది అడుగుల ఎత్తు, ఆరు నుండి ఎనిమిది వేల కిలోల బరువుతో మట్టి రంగు చర్మంతో కనిపిస్తాయి. ఎలిఫాస్ మాక్సిమస్ మాక్సిమస్ అనే శాస్త్రీయ నామంతో పిలవబడే శ్రీ లంక ఏనుగులు ఆసియా వాటిల్లో యెత్తైనవిగా ప్రసిద్ధి. "ఎలిఫాస్ మాక్సిమస్ సుమత్రాస్"గా పిలవబడే సుమత్రా దీవులలో నివసించేవి ఆసియా ఏనుగులతో ఆకారంలో చిన్నవి. చిత్రంగా ఈ రెండు జాతులలో దంతాలున్న మగవి అరుదుగా కనిపిస్తాయి. అసలు ఆసియా ఏనుగులతో మగవాటికే దంతా లుంటాయి. పేరుకే తప్ప ఆసియా లోని మూడు జాతులలో పెద్ద శారీరక తేడాలు కనపడవు. వీటిల్లో ఎక్కువ శాతం పెంపకం దారుల దగ్గర ఉండటం, సహజ నివాసాలకు దూరంగా ఉండటం, జనన మరణాల నిష్పత్తి పొంతన లేకుండా ఉండటం వంటి కారణాల వలన గత శతాబ్ద కాలంలో అరవై వేలకు పైగా ఆసియా ఏనుగులు మరణించాయని లెక్కలు తెలుపుతున్నాయి. వాటి ఆధారంగా 1986 నుండి వీటిని రక్షించవలసిన జంతువుల జాబితాలో చేర్చడం జరిగింది. ఇదే పరిస్థితి కొనసాగితే పాతికేళ్ల తరువాత మనం జీవించి ఉన్న ఆసియా ఏనుగును చూడలేమని జంతు ప్రేమికులు హెచ్చరిస్తున్నారు. 

భారతదేశ గజ సంపద 

ఎలిఫాస్ మాక్సిమస్ ఇండికస్ గా పిలవబడే భారత దేశ ఏనుగుల సంఖ్య 2015వ సంవత్సర లెక్కల ప్రకారం ఇరవై ఏడువేలు. ఇది 2012 వ సంవత్సరం నాటి సంఖ్య కన్నామూడు వేలు తక్కువ అంటారు. 1992లో ఆరంభించిన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ద్వారా ఆశించిన ప్రయోజనం రావట్లేదని గజ ప్రేమికులు బాధపడుతున్నారు. ఈశాన్య మరియు దక్షిణ భారత దేశంలో గజ సంచారం అధికం. మగవి పొడుగైన దంతాలతో గజ రాజుల మాదిరి కనపడతాయి. 

బోర్నియో పిగ్మి ఏనుగులు 

ఆసియా ఖండంలో అతి పెద్ద ద్వీపం బోర్నియో.ద్వీప భూభాగంలో అధిక శాతం ఇండోనేషియాలో, మిగిలినది మలేషియా మరియు బ్రూనే దేశాల పరిధిలో ఉంటుంది. ఆరు నుండి ఏడడుగుల ఎత్తుతో, మూడు నుండి నాలుగు వేల కిలోల శరీరంతో కనిపిస్తాయి బోర్నియో మరగుజ్జు ఏనుగులు. ఇవి ఇక్కడ తప్ప మరెక్కడా కనపడవు. అందుకే ద్వీపం పేరు తోనే వీటిని పిలుస్తారు. ఎత్తు మరియు బరువు తప్ప మిగిలిన విషయాలలో దరిదాపుగా ఆసియా ఏనుగులను పోలి ఉండే ఇవి కాలప్రవాహంలో చోటు చేసుకొన్న నివాస మరియు వాతావరణ పరిస్థితుల వలన చోటు చేసుకొన్న జన్యు మార్పులతో పొట్టిదనాన్నిపొందాయని పరిశోధకులు చెబుతారు. 
పసిపాపల ముఖంలో కనిపించే అమాయకత్వం, ముగ్ధత్వం వీటిల్లో కనిపిస్తుంది. ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. సిగ్గరులైన పిగ్మి ఏనుగులు చిన్న పిల్లల మాదిరి ఉత్సాహంగా ఉంటూ అప్యాయత చూపిన వారిని విడువవు. మగవాటికి ఆకారానికి మించిన దంతాలు మరియు చెవులు ఉండి చిత్రంగా కనపడతాయి. వేగంగా పరిగెత్తగలవు. కానీ వీటి ఎత్తే వీటి పాలిట శాపం. క్రూర జంతువుల దాడికి తరచూ గురి అవుతుంటాయి. వీటి దంతాల పట్ల నాగరీకులకు గల మోజు కూడా వీటికి ప్రాణాంతకంగా పరిణమించినది. ప్రస్తుతం పదిహేనువందల దాకా ఉన్న బోర్నియో పిగ్మి ఏనుగుల సంఖ్యను పెంచడానికి మలేషియా మరియు ఇండోనేషియా ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషి సల్పుతున్నాయి. 

ఏనుగుల ప్రాధాన్యత 

మానవుడు తొలుత మచ్చిక చేసుకొన్న జంతువులైన కుక్క, పిల్లి, గుఱ్ఱం, ఆవులు, మేకల తరువాత స్థానం ఏనుగుదే ! ముఖ్యంగా గృహ, రక్షణ మరియు ప్రార్ధానాలయాల నిర్మాణాల నిమిత్తం గజాలను లొంగదీసుకోవడం ఆరంభమైనది. బలమైన శరీరసౌష్టవం గల ఏనుగులు బరువైన రాళ్లను, చెట్ల మానులను అవలీలగా కొండలు, గుట్టల మీదకి, దూర ప్రాంతాలకు తొందరగా చేర్చగలిగేవి. దేశంలోని ప్రముఖ కోటల మరియు ఆలయాల నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు కరి రాజులే!
ఆధిపత్య పోరాటాలలో పాల్గొన్న మహావీరులు కూడా గజ కేసరులే ! గుప్తుల కాలం నుండి విజయ నగర రాజుల వరకూ విజేతలందరూ గజబలం మీద ఆధారపడిన వారేనని చరిత్ర తెలుపుతోంది. పంచమ వేదంగా కీర్తించబడే మహాభారతంలో కూడా గజాలు ఎన్నదగిన పాత్ర పోషించాయి. 
మొఘలాయీ చక్రవర్తి బాబరు వద్ద లక్షకు పైగా గజాలుండేవట. విజయనగర సామ్రాట్టు శ్రీ కృష్ణ దేవరాయల దగ్గర ఉండిన అరలక్ష సుశిక్షిత ఏనుగులు శత్రువులకు చెమటలు పట్టించేవట. కదనరంగం,కట్టుబడులలోనే కాదు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఏనుగుల పాత్ర నేటికీ ముఖ్యమైనదే ! ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో గజసేవ ఒక ప్రాతినిధ్యం ఉన్న సేవ. దీని కోసం దేవాలయంలో ఒక ఏనుగు తప్పనిసరి. భారతదేశంలో కేరళ రాష్ట్రంలో ఏనుగుల పట్ల గల ఆదరాభిమానాలకు కొలమానం లేదు. దాని గురించి ఒక పెద్ద గ్రంధమే రచించవచ్చును. 

కేరళతో కరి బంధం 

ఏనుగులు లేకుండా ఏ ఉత్సవాన్ని కేరళలో చూడలేము. కనీసం ఊహించలేము కూడా ! అలాంటి సంబరాన్ని సామాన్య మలయాళీలు అంగీకరించరు. బాణాసంచా ప్రేలుళ్ళకు, మేళతాళాల మ్రోతలకు, ప్రేక్షకుల హర్షధ్వానాలకు బెదిరిన ఏనుగులు చేసే భీభత్సవాలు ఎన్ని జరిగినా ఉత్సవాలలో ఏనుగు ఉండాల్సినదే ! ఈ విషయంలో రెండు వందల సంవత్సరాలుగా నిరాఘాటంగా నిర్వహిస్తున్న "త్రిసూర్ పూరం" ఒక ఉదాహరణ. 
ఒక ఊరి ఆలయంలో ఏనుగు లేకపోతే ఉత్సవానికి అద్దెకు తెస్తారు.ఏనుగు లేని ఉత్సవం ఉత్సవమే కాదు కదా మరి ! పైగా గ్రామానికి అవమానం కూడా ! ఈ వ్యామోహం వ్యాపారంగా మారింది. అయిదు వందల పైచిలుకు ఏనుగులు పెంపకందారుల వద్ద ఉన్నాయంటే ఇదెంత లాభసాటి వ్యాపారమో ఊహించవచ్చును.స్థానికంగా ఉన్నజనాదరణ ఆధారంగా ఒక్కో ఏనుగుకు  లక్ష నుండి రెండున్నర లక్షల దాకా రోజు అద్దె చెల్లించాలి. ఆపైన ప్రయాణ వాహనం, ఆహారం, మావటి ఖర్చులు అదనం. అయినా వెనుకాడరు. ఏనుగు ఉండాల్సినదే !

ఖర్చులు అధికమే 

డిసెంబరు నుండి ఏప్రిల్ వరకు కేరళలో ఆలయ ఉత్సవాల సమయం. పెంపకందారులకు కాసులు కురిపించే సమయం కూడా ఈ అయిదు నెలలే ! ఒక ఊరి నుండి మరో ఊరికి గజాలు నిరంతరాయంగా ప్రయాణిస్తూనే ఉంటాయి. విపరీతమైన శ్రమకు, అలసటకు లోనవుతాయి. అందుకే ఉత్సవాల కాలం తరువాత వచ్చే వర్షాకాలంలో వీటికి పూర్తి విశ్రాంతినిస్తారు. నలభై రోజుల పాటు మానసిక మరియు శారీరక స్వస్థతను ఇచ్చే "శుక చికిత్స" అందిస్తారు.దాని వలన కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతాయి. 
ఏనుగుల ద్వారా లభించే ఆదాయం వినడానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కానీ ఆహరం, వైద్య సేవలు, మావటి జీతభత్యాలు, వసతులను కలుపుకొంటే ఖర్చులు కూడా అదే స్థాయిలో భారీ గానే ఉంటాయి.
"పెరిగిన ఖర్చులు, మారిన నిబంధనల కారణంగా ఈ వ్యాపారం గతంలో మాదిరి లేదు. గజాలతో సంవత్సరాల నుండి పెనవేసుకున్న అనుబంధం వలన కొనసాగుతున్నాము" అంటారు పెంపకందారులు.కేరళలో జిల్లా కొక ఏనుగుల పెంపకందారుడు కనపడతారు.వీరిలో  పాలక్కాడ్  దగ్గర లోని "మంగళంకున్ను" లో ఉన్న హరిదాసు, పరమేశ్వరన్ సోదరులు ప్రముఖులు. వీరి  వద్ద పదహారు ఏనుగులున్నాయి.అవన్నీ మంచి జనాదరణ ఉన్నవే!

ఏనుగే కానుక 

తమ కులదైవాలకు, ఆరాధ్య దేవీ దేవతలకు ఏనుగులను కానుకగా సమర్పించుకునే అరుదైన సాంప్రదాయం కేరళలో కనపడుతుంది. ఈ విషయంలో గురువాయూరు శ్రీ కృష్ణ ఆలయం అగ్ర స్థానంలో ఉన్నది. ప్రస్తుతం ఈ దేవస్థానానికి యాభై తొమ్మిది ఏనుగులున్నాయి. అన్నీ భక్తులు సమర్పించుకొన్నవే! వారిలో మాజీ ముఖ్యమంత్రులు,రాజకీయనాయకులు,ప్రముఖ సినీ నటులు, వ్యాపారవేత్తలు ఉన్నారు.కేరళలో అత్యంత ప్రజాదరణ ఉన్న కేశవన్, పద్మనాభన్, లక్ష్మి లాంటి ఏనుగులు ఈ దేవస్థానానికి చెందినవే! ప్రస్తుతం ఏనుగుల అమ్మకం, కొనడం మీద దేశవ్యాప్త నిషేధం అమలులో ఉండటం, మారిన నిబంధనల వలన ఈ సాంప్రదాయం ఒకింత తగ్గుముఖం పట్టింది. 
ఏనుగును ఆలయానికి సమర్పించుకోవడం అంత తేలికైన విషయం కాదు. అన్ని ఏనుగులూ పనికి రావు.తల,తోక,తొండం,పాదాలు,కుంభస్థలం,దంతాలు ఇలా ప్రతి ఒక్క శరీర భాగాన్నీ పరిశీలించిన తరువాతే నిర్ణయిస్తారు.నిర్ణయించిన ఏనుగుకు ఆలయంలో "నాడయిరుతుల్"  అనే పూజ చేసి ఆలయసంపదగా స్వీకరిస్తారు.    బిరుదులు - సన్మానాలు - ప్రశంసలు 
సంవత్సరానికి ఒకసారి ఆకారంలో, వ్యవహారంలో హుందాగా ప్రవర్తించే ఏనుగును ఎంపిక చేసి "గజపట్టం" బహూకరించి సన్మానిస్తారు కేరళ గజ ప్రేమికులు. వీరిని ప్రేమికులు అనే కన్నా ఆరాధకులు అంటే సరిగ్గా సరిపోతుంది. 
ఆసియా జాతి ఏనుగులలో నల్ల లేదా బూడిద రంగు గలవి అరుదు. అలాంటి వాటిల్లో "పాంపాడి రాజన్" ఒకటి. కేరళ గజ సూపర్ స్టార్.పదిన్నర అడుగుల ఎత్తుండే రాజన్ గజోత్తమ,గజరత్న, సార్వభౌమన్ గజరాజ గంధర్వన్" లాంటి బిరుదులు ఎన్నింటినో అందుకున్నది. గురువాయూరు దేవస్థానం ఏనుగుల తరువాత ఎక్కువ బిరుదులు అందుకొన్న ఏనుగు రాజన్. ఆసియా ఏనుగులతో ఎత్తైనదిగా పేరున్న పదకొండు అడుగుల "తెచ్చికొట్టుక్కావు రామచంద్రన్" కూడా కేరళకు చెందినదే కావడం విశేషం. 
ఒక ఊరికి రాజకీయ ప్రముఖుల్లో, మరొకరో వస్తున్నప్పుడు స్వాగత తోరణాలు, విశ్లేషణాలతో కూడిన ఫ్లెక్సీలు పెట్టడం సహజం. అదే మాదిరి ఆలయ ఉత్సవాలలో పాల్గొనడానికి ఒక రోజు అతిధిగా విచ్చేసే గజరాజుకు స్వాగతాహం పలుకుతూ కట్టే ఫ్లెక్సీలకు లెక్కే ఉండదు. దివంగత నేతలకు పెట్టినట్లు తమ అభిమాన గజాలకు శిలా విగ్రహాలను పెట్టడం ఒక్క కేరళ లోనే చూడగలం. 
ఇరవయ్యో శతాబ్దానికి చెందిన ప్రముఖ మలయాళీ రచయిత "కొట్టరట్టిల్ శంకుణ్ణి" కేరళకు చెందిన ప్రముఖుల జీవిత చరిత్రలను ఎనిమిది భాగాల గ్రంధంగా రచించారు. "ఐతిహ్యమాల" అనే ఆ గ్రంధంలో రాష్ట్రానికి చెందిన ప్రముఖ గజాల జీవిత చరిత్రలు కూడా ఉండటం విశేషం. 

కెన్యా కధ 

కెన్యా దేశపు తెగలలో ఒక కధ ప్రచారంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకప్పుడు మనిషి, పిడుగు, ఏనుగు కలిసి అరణ్యంలో జీవించేవట. కొంతకాలానికి పిడుగుకు మనిషి యొక్క నిజ స్వరూపం అర్ధమయ్యింది. ఏనుగు వద్దకు వెళ్లి మనిషి నమ్మదగ్గవాడు కాదని, తాను మేఘాల మధ్యకు వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నానని చెప్పి, ఏనుగును కూడా రమ్మన్నదట. దానికి ఏనుగు " నీ అనుమానాలన్నీ నిజం కావు. మనిషి దుర్బలుడు. నన్నేమీ చెయ్యలేడు. నువ్వు వెళ్ళు. నేను రాను." అన్నదట. పిడుగు వెళ్ళిపోయినది. 
సమయం గడుస్తోంది. "అర్భకుడు నన్నేం చేస్తాడు !" అన్న ధీమాతో పట్టించుకోకుండా తన మానాన తాను ఉండసాగింది. కానీ మనిషి రకరకాల విద్యలను నేర్వసాగాడట. ఒక రోజున తానూ తయారు చేసిన విషపూరిత బాణాల ప్రభావం తెలుసుకోడానికి వెనుక నుండి ఏనుగు మీదకు సంధించాడట. విష ప్రభావంతో మరణానికి చేరువైన ఏనుగు రోదిస్తూ పిడుగును పిలిచి మనిషి చేసిన ద్రోహం చెప్పి అతనిని శిక్షించమన్నదట. స్నేహితుని దుస్థితికి బాధపడుతూనే "దుష్టులకు దూరంగా ఉండమని చెప్పినా వినలేదు. నీకు ఈ పరిస్థితులలో ఏ రకంగానూ సహాయ పడలేను. కానీ సమయం వచ్చినప్పుడు మనిషికి నా సత్తా చూపిస్తాను," అన్నదట. 
ఈ కధకి మన కథనానికి గల సంబంధం పాఠకులకు అర్ధమయ్యే ఉంటుంది. 

పేరు గొప్ప 

ఆగ్నేయ ఆఫ్రికా ప్రాంతాలలో నివసించే "స్వాహిలి" తెగ వారి భాష "క్విస్వాహిలీ". ఆ  భాషలో  "జంబో" అనే పదానికి "గౌరవనీయులు"అని అర్ధం. ఆ పదంతోనే ఏనుగులను సంబోధిస్తున్నాము. పౌరాణికంగా, చరిత్రకంగానే కాకుండా పేరులో కూడా గౌరవం మాత్రమే పొందుతున్న భారీజీవి తాను నివసిస్తున్న అన్ని ప్రాంతాలలో ప్రాణభయాన్ని ఎదుర్కొంటున్నాయి. వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. జీవంలేని విగ్రహాల, చిత్రాల, చరిత్ర పట్ల చూపుతున్న భక్తి గౌరవాలు జీవంతో మన కాళ్ళ ముందు తిరగాడుతున్న వాటి పట్ల చూపడం లేదని వన్యప్రాణి సంరక్షక సంస్థల వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. 
ప్రాజెక్ట్ ఎలిఫెంట్, సేవ్ ది ఎలిఫెంట్, ఇంటర్నేషనల్ ఎలిఫెంట్ ఫౌండేషన్, వైల్డ్ లైఫ్ కన్సర్వేటివ్ సొసైటీ, ది గార్డియన్ ఇలా ఎన్నో సంస్థలు ఏనుగుల వలన పర్యావరణానికి, అడవులకు జరిగే మేలు గురించి తద్వారా మానవాళి పొందే లబ్ది గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 
వన్యప్రాణి సంరక్షకులు ఏనుగుల సంతతి దారుణంగా తరిగిపోవడానికి ప్రధానంగా రెండు కారణాలను చూపుతున్నారు. 

ఏనుగు బ్రతికినా లక్షే .... 

ఏనుగు దంతాలతో, చర్మం, రోమాలతో చేసిన వస్తువుల పట్ల ఆర్ధికంగా ఉన్నత వర్గాలలోఉన్న వారికి విపరీతమైన మక్కువ. కిలో దంతం ఖరీదు మూడు లక్షలు. చర్మంతో తయారు చేసిన పర్స్ ఖరీదు రెండు లక్షల దాకా ఉంటాయంటే ఆ వ్యామోహం ఏ స్థాయిలో ఉన్నదో గ్రహించవచ్చును. చాలా దేశాలు ఏనుగు శరీర భాగాలతో చేసిన వస్తువులను నిషేధించడంతో మోజు ధరలు రెండూ పెరిగిపోవడం విచారకరం. 

ఆదాయం బోలెడు .... 

రెండు దంతాలు,చర్మం అమ్మితే చీకటి వ్యాపారులు సంపాదించేది అయిదు కోట్లు. ఒక వేళ దొరికితే వన్యప్రాణి చట్టాల క్రింద పడే శిక్ష ఏడు సంవత్సరాల కారాగారవాసం, యాభై వేల జరిమానా మాత్రమే ! అదీ పట్టుపడి, నేరం ఋజువైతేనే ! ఈ వ్యత్యాసం కారణంగా వేటగాళ్లు భయపడటం లేదు. రోజుకు వంద ఏనుగుల ప్రాణాలను తమ తూటాలకు బలి చేస్తున్నారు.
దీనిని అరికట్టడానికి ఉన్న ఒకే ఒక మార్గం ఏనుగు శరీర భాగాలతో చేసిన వస్తువుల పట్ల గల వ్యామోహాన్ని నాగరీకులు చంపుకోవడమే !

తరిగిపోతున్న సహజ నివాస పరిసరాలు 

ప్రతి దేశంలోనూ అభివృద్ధి పేరిట సంవత్సరానికి కొన్ని లక్షల ఎకరాల అటవీ భూమిని రహదారుల, కర్మాగారాల, కాలనీల నిర్మాణానికి మరియు గనుల నిమిత్తం కేటాయిస్తున్నారు. దీనికి ఉదాహరణ వేగంగా తగ్గి పోతున్న అటవీ భూములు. ఇవి కాకుండా సహజంగానే చోటుచేసుకునే ఆక్రమణలు. ఇవన్నీ పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నాయి. 
రోజుకు పది నుండి పాతిక కిలోమీటర్ల పరిధిలో ఆహారాన్వేహణ నిమిత్తం సంచరించే ఏనుగు లాంటి భారీ జీవి ఎక్కడికి పోగలదు ? కావలసిన రెండువందల కిలోల ఆహరం, రెండువందల లీటర్ల నీటిని ఎలా సంపాదించుకోగలదు ? దీనికి నిదర్శనమే తరుచుగా మనం వైన్ గ్రామాల, పొలాలు, తోటల మీద ఏనుగుల దాడుల వార్తలు. పాపం మనదైతే పాపం మూగజీవులు మరెక్కడికో ఎలా వెళతాయి ?
అడవుల విస్తీర్ణం తగ్గిపోవడం వలన ఎన్నో రకాల జంతువుల, పక్షుల, పాముల సంఖ్య తగ్గిపోయి, పరిరక్షించవలసిన వట్టి జాబితా పెరిగిపోతోంది. ప్రభుత్వాలు ఎన్నో పధకాలను ప్రవేశపెడుతున్నాయి. కానీ వాటి ప్రభావం అనుకున్న స్థాయిలో లేదని అంటారు జంతు ప్రేమికులు. 
భూమి మీద గాలి, నీరు, మట్టి వాతావరణం చాలామటుకు కలుషితమయ్యాయి అని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. ఇవే పరిస్థితులు కొనసాగితే భావితరాలకు మనం ధనం ఇవ్వగలమేమో కానీ ఆరోగ్యకరమైన వాతావరణాన్ని, ఆహ్లాదపరిచే సహజీవులను ఇవ్వలేమని నిపుణులు       హెచ్చరిస్తున్నారు.  
ఈ తరుణంలో అడవుల అభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించి పర్యావరణ సమతుల్యతకు దోహదపడే ఏనుగుల సంఖ్య పెరగడానికి మనం మన ఆశలు, వ్యామోహాలను వదిలి రేపటి తరాలకు కావలసిన కనీస సౌకర్యాల గురించి ఆలోచించవలసిన తరుణం ఆసన్నమైనది. లేకపోతే విషాదమే!  కాబట్టి మిత్రులారా ! సమయం లేదు ! ఆశయానందమా? విషాదమా ! తేల్చుకోవలసినది మనమే !

                                                                        





 ***********                                              **********                             **********

        




                        


                                                                                        















   




  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...