3, జూన్ 2014, మంగళవారం

Tripurantakam Temples

                                          త్రిపురాంతకం 


గడచిన నెల రోజులలో నా పూర్వ జన్మ తాలూకు పుణ్య ఫలమో లేక దైవానుగ్రహమో కానీ కొన్నిఅరుదైన ఆలయాలను తమిళనాడు, కేరళ మరియు మన రాష్ట్రంలో దర్శించుకొనే అదృష్టం దక్కినది. 

వాటిల్లో కొన్ని క్షేత్రాల గురించి ఈ బ్లాగులో రాయడం జరిగింది. 

మిగిలిన వాటిల్లో నన్ను ఎంతో ఆకర్షించిన నాలుగు మహా దేవ క్షేత్రాలను మీ అందరికి పరిచయం చేయదలిచాను. 

ఇవి  మూడు రాష్ట్రాలలో ఉండటం విశేషం.  అంతే కాకుండా రెండు ఆలయాలు కొద్ది పాటి తేడాలతో ఒకే విధమైన పురాణం ఘటనలతో ముడిపడి ఉండటం పేర్కొనవలసిన అంశం. 

మీలో చాలా మంది వాటిని దర్శించి ఉండవచ్చును. హృదయాంతరాలలో దాగివున్నఆ జ్ఞాపకాలను ఈ వ్యాసాలు తట్టి లేపుతాయని భావిస్తున్నాను. 

ఇవి మీకు నచ్చితే ఒక చిన్న సందేశం పంపండి సంతోషిస్తాను. 

చరాచర జగత్తు సర్వం శివమయం. 
శివాలయం లేని ఊరు ఉండదు. 
కొన్ని క్షేత్రాలు భక్తులను విశేషంగా ఆకర్షిస్తాయి. 
పౌరాణిక గాధ, క్షేత్ర మహత్యం ఇత్యాదివి దానికి కారణాలుగా భావించవచ్చును. 
అలా జనబాహుళ్యంలో ఒక నాడు ప్రముఖ స్థానంలో ఉంది నేడు కొంత మేర మరుగున పడిపోయిన గొప్ప క్షేత్రమైన " త్రిపురాంతకం  "గురించి మొదటగా తెలియపరచదలచాను. 

గుంటూరు నుండి కర్నూలుకు వెళ్ళే ప్రధాన రహదారిలో ఉంటుంది ఈ ఊరు. 
ప్రకాశం జిల్లాలో భాగం. 
వినుకొండ లేదా ఎర్రగొండపాలెం నుండి కూడా సులభంగా చేరుకోవడానికి సౌకర్యాలు లభిస్తాయి. 
నాలుగు యుగాలలో ప్రజల పూజలందుకొంటున్న అరుదైన ఘనత త్రిపురాంతకానిది. 
ఈ పర్వతం సంజీవినితో సహా ఎన్నో అద్భుత ఔషధ గుణాలు కలిగిన మూలికలకు నిలయమని పురాతన గ్రంధాలలోను, ఇక్కడ లభించిన శాసనాలలో పేర్కొనబడినది. 
గతంలో ఎందరో యోగులకు, సిద్దులకు ఈ ప్రాంతం స్థిర నివాసంగా ఉండినట్లు కూడా తెలుస్తోంది. 
యజుర్వేదంలో " త్రయంబకాయ -త్రిపురాంతకాయ " అని ఉన్నదంటే వేదకాలం నాటికే త్రిపురాంతకేశ్వర స్వామి లోకరక్షకునిగా, భక్త సులభునిగా ప్రసిద్దుడని అవగతమౌతోంది.  
స్కాంద పురాణంతో సహా అనేక గ్రంధాలలో, కావ్యాలలో త్రిపురాంతక ప్రస్తాపన ఉన్నది. 
శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా పేరొందిన ఈ మహా క్షేత్ర పురాణ గాధ సత్య యుగం నాటిది. 
తారకాసుర ఉదంతం అందరికి తెలిసినదైనప్పటికి స్థూలంగా మరో మారు తెలుసుకొందాము.
తారకాసురుడు తన తపస్సుతో పరమశివుని మెప్పించి ఆత్మలింగాన్ని వరంగా పొందాడు. అంతే కాకుండా శంకరుని సంతానం చేతిలోనే తను మరణించాలని కూడా కోరుకొన్నాడు.
స్మశానవాసుని సంసార మార్గం పట్టించడానికి దేవతల కోరిక మీదకు ప్రయత్నించిన మన్మధుని  త్రినేత్రుడు భస్మం చేసారు.
అయిన చెరుకు వింటి విలికానుని బాణం వృధాకాలేదు. ధ్యానం నుండి గంగాధరుని దృష్టి మరలడం వలన  జన్మించిన షణ్ముఖుని  చేతిలో అంతమైనాడు తారకాసురుడు.
ఆ యుద్దంలో శరాఘాతానికి  ఆత్మ లింగ  ముక్కలై అవే నేడు మనకు పంచారామ క్షేత్రాలుగా దర్శనమిస్తున్నాయి.( ద్రాక్షారామం, అమరావతి, పాలకొల్లు, భీమవరం, సామర్లకోట )
సమరానంతరం అలసిన కుమార స్వామి నేటి త్రిపురాంతక పర్వతం మీద కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం వలన "కుమార గిరి" అని పిలిచేవారట. 
తండ్రి మరణానికి ఆగ్రహించిన అసురుని కుమారులు "తారక్షుడు, విద్యున్మాలి, కమలాక్షుడు విధాత బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసారట.
ప్రత్యక్షమైన సృష్టి కర్తను వీరు కూడా తండ్రి మాదిరే చిత్రమైన కోరిక కోరుకోన్నారట.
తాము నిర్మించుకొనే పురాలతో పాటు తమ ముగ్గురిని ఒకే సమయంలో ఒకే ఆయుధంతో ఒకరే సంహరించాలని.
అలా వారలు పొందిన అన్నదమ్ములు మయుని సహకారంతో మూడు ఎగిరే పురాలను ఏర్పరచుకొని వాటిల్లో తిరుగుతూ ముల్లోకవాసులను ఇక్కట్లకు గిరిచేస్తుందే వారట.
దేవతలంతా వీరిని కడతేర్చగలవాడు కైలాసనాదుడే అని వెళ్లి శరణుకోరారట.
రుద్రుని ఆదేశం మేరకు సమస్త శక్తుల కలయికతో విశ్వ కర్మ  వాయువేగం తో పరిగెత్తగల అశ్వాలతో దుర్భేద్యమైన రధాన్ని, తిరుగులేని ఆయుధాలను అమర్చాడట.
అయిన త్రిపురాసురులు లొంగలేదట.
అప్పుడు పార్వతీ పతి జగన్మాతను ధ్యానించారట.
ఆమె వచ్చి శరంలో ప్రవేశించిన సమయంలోనే త్రిపురాలు ఒకే వరుసలోనికి రావడం శరాఘాతానికి అంతం కావడం జరిగినదట.
తనకు లోకకంటకులను హతమార్చడంలో ఆమె చేసిన సహాయానికి ఏమి కావాలని అడిగిన శివునితో జగజ్జనని తనతో పాటు ఇక్కడ కొలువుతీరమని కోరడం వలన నేడు త్రిపురాంతకం లో ఆది దంపతులను ఆరాధించుకొనే భాగ్యం మానవులకు కలిగింది.
కొండల నడుమ చెరువు గట్టున అమ్మవారి ఆలయం, పర్వతాగ్రాన అయ్యవారి ఆలయం ఉంటాయి. 
 త్రిపురాంతక గ్రామం నుండి రెండుకిలో మీటర్ల దూరం సన్నని మట్టి దారిలో ప్రయాణిస్తే శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయం వస్తుంది.
ఆలయానికి ఎదురుగా పెద్ద పుట్ట ఉంటుంది.
సర్ప దోషం తో పెళ్లి కాని వారు, సంతానం లేనివారు ఇక్కడ దోష నివారణార్ధం పూజలు చేస్తారు.  




కదంబ వృక్షాలతో నిండిన  ఈ ప్రాంతాన్నిగతంలో కదంబ వనం అని పిలిచేవారు. నేడు రెండు మాత్రం మిగిలాయి. 






పల్లంలో ఉన్న ఆలయానికి తూర్పున ఉన్న ద్వారం గుండా చేరుకొవాలి. 
విశాల ప్రాంగణంలో వర్ణమయ శిల్పాలతో నిండిన విమాన గోపురం, మండపం ఉంటాయి. 
భక్తులు పూజలు, శుభ కార్యాలు చేసుకోడానికి, విశ్రాంతి తీసుకోడానికి అనువైన ఏర్పాట్లు చేసారు. 









ధ్వజస్థంభము కాని బాలి పీఠం కాని కనిపించవు. 


















ఉత్తర దిశ లో ఎన్నో శిల్పాలు కనపడతాయి. 
వీటిల్లో కొన్ని శక్తి విగ్రహాలు కాగా మిగిలినవి అమ్మవారిని సంతృప్తి పరచడానికి, మొక్కిన మొక్కులు తీరుచ్చుకోడానికి తమ శరీరాలకు గాయాలు చేసుకొని రక్తం ఒడుతున్నవే ఎక్కువ. 
వీటిని "వీర శిలలు" అంటారు. 
ఇక్కడే నలుచదరపు రాళ్ళ తో చేసిన చిన్న మండపంలో "శ్రీ చిన్న మస్తా దేవి" కొలువై ఉంటారు. 
ఈమె అమ్మవారి సర్వ సైన్యాద్యక్షురాలాట. 






ఆలయ ఈశాన్యంలో భావి, దానికి కొద్దిగా ముందు ప్రవేశ మార్గం పక్కనే శివలింగ ఆకారంలో యూప స్తంభము మరియు రక్త పాత్ర కనిపిస్తాయి. 
ఎన్ని వేటలను బలి ఇచ్చినా ఈ రక్త పాత్ర ( ఉగ్ర పాత్ర ) నిండదట. 
యూప స్థంభం పైన సూర్య చంద్ర త్రిశూల చిహ్నాలు కనిపిస్తాయి.  



గర్భాలయం లోనికి దారితీసే మండపంలో జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారి  దశ విద్యా రూపాల చిత్రాలను అలంకరించారు. 









కొంచెం లోతుగా ఉండి  "చిదగ్ని కుండము" అని పిలవబడే అంతరాలయంలో ఉత్తర దిశగా నిరాకార శిలా రూపంలో ప్రధాన అర్చనామూర్తి శ్రీ బాలా త్రిపుర సుందరి, ప్రతిష్టిత రూపం రెండూ సుందర అలంకరణతో దివ్యంగా దర్శనమిస్తాయి.
మండపంలో ఉన్న శ్రీ చక్రానికి భక్తులు స్వయంగా పూజచేసుకొనే అవకాశం కల్పించబడినది.




నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తారు. 
సమీపంలో "బయట బాలమ్మ" మరియు శ్రీ పంచముఖ ఆంజనేయ ఆలయం" నూతనంగా నిర్మించారు.  

శ్రీ బాలా త్రిపుర సుందరి ఆలయం దగ్గరనుండి కొండ మీద ఉన్న శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం కనపడుతుంది. 


త్రిపురాంతకం పవిత్ర పుణ్య క్షేత్రం అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఎన్నో శిధిల ఆలయాలు కనిపిస్తాయి. 
చుట్టుపక్కల కొండల పైన కూడా శిధిల ఆలయాలు ఉన్నాయని వాటి గురించి ఎన్నో గాధలు స్థానికంగా ప్రచారంలో ఉన్నాయి. ఆ వివరాలు ఇక్కడ లభించిన శాసనాలలో ఉన్నవని చెబుతారు. పరిసర ప్రాంతాలలోని గ్రామాలలో కూడా ఉన్న ఆలయాలు విశేషమైనవి అన్నది ఇక్కడి వారి నమ్మకం.  























అమ్మవారిని సందర్శించుకొని రెండు కిలోమీటర్లు చెరువు గట్టున నడిచిగాని, వాహనంలో గాని పర్వత పాదాలకు చేరితే అక్కడ సోపాన మరియు వాహన మార్గం ఉంటాయి. 
పైకి చేరుకొంటే నాలుగు దిక్కులా ద్వారాలతో చుట్టూ ప్రహరి నిర్మించిన ఆలయం కనిపిస్తుంది. 

తూర్పు ముఖంగా ఉన్న గోపుర మార్గం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే అద్భుత ప్రశాంత ఆద్యాత్మిక లోకం లోనికి అడుగు పెట్టిన అనుభూతి కలుగుతుంది. 



గోపురం వద్ద స్థల పురాణ వివరాలు లిఖించబడి ఉంటాయి.
ఇక్కడే స్వామి వారి పాద ముద్రలు ఉంటాయి.  త్రిపురాంతక సంహార సమయంలో పడినవి అని అంటారు.

పాద ముద్రల పక్కనే ఉగ్రమైనదిగా పేర్కొనే శ్రీ బెక సోమేశ్వర స్వామి లింగం ఉంచారు.







ప్రదక్షిణ ఫదంలో గోపురం పక్కనే అశ్వారూడులైన రాజుల శిల్పాలు కనిపిస్తాయి. ఆలయాభివ్రుద్దికి కృషి చేసిన వారై ఉంటారు. 



గోపుర గోడలపైన జంతువుల శిల్పాలను చెక్కారు. 











కుడికి మరల గానే పంచలింగేశ్వర స్వామి నందితో కలిసి కోలువైవుంటారు. 




దక్షిణ ద్వారానికి పక్కనే "అపరాజితేశ్వర స్వామి" ఉపాలయం.  ఇక్కడ చిన్న గుమ్మం మాత్రం ఉంటుంది. 
బయట ఎన్నో శిధిల శిల్పాలు, మెట్ల దారి. 









శ్రీశైల బిళ మార్గం లేదా చీకటి గుహగా పిలిచే కట్టడం. 
పూర్వం సిద్దులు, మహర్షులు ఈ మార్గం ద్వారానే శ్రీశైల వెళ్ళేవారట. 
ఈ మిద్దె పైభాగాన సుందర శిల్పాలను చెక్కారు. 













ఇక్కడే ఎన్నో శిలా శాసనాలను ఉంచారు. వీటిల్లో తొమ్మిదో శతాబ్దానికి చెందినవి ఉన్నాయని తెలిసింది. 
కాకతీయ ప్రతాప రుద్రుడు, రాణి రుద్రమ దేవి, విజయనగర రాజులు, స్థానిక పాలకులు, మరెందరో పీఠాదిపతులు, ధనవంతులైన భక్తులు వేయించినవి. 
అరుదైన అమూల్యమైన చారిత్రిక సమాచారాన్నిఅందించే శాసన సంపదను అలా ఎండకు, వానకు వదిలేయడం హృదయాన్ని కలచివేస్తుంది.  










ఇది మరీ ఘోరం దేవభాషలో ఉన్న శాసనాని తల్లక్రిందులుగా ఉంచారు. 

చేకటి గుహ వద్ద ఉన్న విజయ (?) స్థూపం క్రింద  రాతి పలకం  మీద గణపతి, శివ విజయ దృశ్యమో (?) లేక రామ పట్టాభిషేకమో ( ?)  చెక్కారు.
శాసన సారాంశాన్ని, శిల్పాల వివరాలను క్లుప్తంగా రాసి ఉంచితే సందర్శకులకు ఎంతో ఆసక్తికరంగానే కాకుండా చరిత్రను తెలుసుకొనే అవకాశం లభిస్తుంది.





వర్ణమయ శోభిత గణేశ మండపం నైరుతిలో ఉంటుంది. 
నిలువెత్తు గణేశ మూర్తి భిన్నం కావడంతో తొలగించి, స్వామివారి కళ్యాణ మిక్కడే జరిపిస్తున్నారు.  










అద్భుత విషయం ఏమిటంటే శ్రీచక్ర ఆకృతిలో నిర్మించబడిన ఒకే ఒక్క శైవ ఆలయం ఇదే !

గమనిస్తే ఇలాంటి నిర్మాణం మరెక్కడా చూసి ఉండము. 








పడమటి ద్వారం మూసివేయబడినది. 












శ్రీ చెన్నకేశవ, మార్కండేయ ప్రతిష్టిత లింగం, మరియు నాగ ప్రతిష్టలు ఉంటాయి.








ఉత్తర ద్వారానికి ఎదురుగా గట్టు మీద మరో శివలింగము, నంది దర్శనమిస్తారు.
దీని వెనుకే అమ్మవారి ఆలయం ఉన్నది.
బయట సింహ వాహనం ఉన్నా తూర్పు ద్వారం మూసివేయబడి ఉంటుంది.
స్వామి వారి ఆలయానికి కూడా అంతే !
దీనికి రెండు కారణాలు వినపడతాయి.
రాక్షస సంహారం తరువాత కూడా ఉగ్రత్వం తగ్గని నేత్రాల నుండి ఉద్భవిస్తున్న అగ్ని కిరణాలకు అన్ని భస్మం కావడం.
రెండో కారణం ఆలయం రాక్షస నిర్మాణం. వారు తూర్పును పరిగణించరు. అందుకే నైరుతి నుండి ఆలయ ప్రవేశం.















ఈశాన్యంలో నవగ్రహ మండపం, యజ్ఞ మండపం నిర్మాణంలో ఉన్నాయి. 

అన్యోన్యంగా పెనవేసుకొన్న రావి వేప వృక్షాల వద్ద కాల గతిలో కూలిపోయిన మండప  శిధిలాలు కనపడతాయి.


అంతరించిపోతున్నాయి అనే శాస్త్రవేత్తలు, పక్షి ప్రేమికులకు  శుభవార్త. వేల సంఖ్యలో పిచ్చికలు సందడి చేస్తుంటాయి త్రిపురాంతకం పర్వతం మీద.



శాసనాలలో పేర్కొన్న విధంగా ఇక్కడ\అనేక అంశాల మీద పండిత చర్చలు జరిగేవని తెలిపే శిల్పం ఆలయ నైరుతి ప్రవేశ ద్వారం వద్ద కనపడుతుంది.





ఆస్థాన మండపంలో నంది ఉపస్తితుడై స్వామి సేవకు సిద్దం అన్నట్లుగా ఉంటాడు. 
ముందున్న నంది విగ్రహం భిన్నం అవ్వడంతో ఈ నందీశ్వరుని కొత్తగా ప్రతిష్టించారట. 
కొండ క్రింద తుమ్మ చెట్ల మధ్య భిన్నమైన విగ్రహాన్ని చూడవచ్చును. 







ద్వారపాలకులను దాటితే  అర్ధ మండపంలో శ్రీ నగరేశ్వర స్వామి లింగం, గర్భాలయంలో విరాట్ లింగ రూపంలో శ్రీ త్రిపురాంతకేశ్వర స్వామి చందన, కుంకుమ, విభూది లేపనాలతో, పుష్పమాలాలంకృతులై భక్తులకు దర్శనమిస్తారు. 
ఈ మహా లింగం క్రింద మరో రెండు రమణీయ రత్నమయ భూషిత లింగాలున్నాయని అంటారు. 
అమ్మవారి కోరిక మేరకు స్వామి ఇక్కడ స్వయంభూగా వెలసిన సమయంలో బ్రహ్మాది దేవతలు అమృతం తో అభిషేకం చేసారట. 
కలియుగంలో దానికి సమానమైన తేనే తోనే అభిషేకం జరుపుతారు. అదే భక్తులకు తీర్ధంగా ఇస్తారు.  





పక్కనే ఉన్న మరో ఆలయంలో శ్రీ స్కంద మాత పేరుతొ శ్రీ పార్వతి దేవి సర్వాభరణభూషితయై కరుణ నిండిన చూపులతో భక్తులను ఆశీర్వదిస్తుంది.
శివరాత్రులలో భక్తులు వేల సంఖ్యలో వస్తారు.
ఎన్నో పురాణాలలో, కావ్యాలలో పేర్కొన్న త్రిపురాంతక క్షేత్రానికి  తిరిగి గత వైభవాన్ని అందించే విధంగా అభివృద్ధి చర్యలు తీసుకోవాలని, శాసనాలలో పేర్కొన్న పరిసర ప్రాంతాల విశేషాల గురించి కూడా తగిన పరిశోధనలు జరగాలని,  మనస్పూర్తిగా కోరుకొంటున్నాను.
నమః శివాయ !!!





















కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...