30, మే 2014, శుక్రవారం

Vellamassery Garudan Kavu

                                     గరుడన్ కావు ( గరుత్మంతుని ఆలయం )

 ప్రత్యేక ఆలయాల కోవలోనిదే "వెళ్ళమ శ్శరీ  గరుడన్ కావు". 
శ్రీ మన్నారాయణుని సేవలలో నిరంతరం తరించేవిగా  సుదర్శన చక్రం, పాంచజన్యం (శంఖం), కౌమోదకి ( గద ), ఆదిశేషువు మరియు గరుత్మంతుడు ముఖ్యమైనవి అని చెప్పుకోవాలి. 
శంఖం మరియు గద శ్రీహరి హస్త భూషణాలుగా ప్రసిద్ది. 
 స్వామి ఆనతి మేరకు ఎందరో లోకకంటకులను హతమార్చిన సుదర్శన చక్రానికి శ్రీ వైష్ణవ పూజా విధానంలో విశేష ప్రాముఖ్యం ఉన్నది. 
ఎన్నో ఆలయాలలో సుదర్శన సన్నిధి ప్రత్యేకంగా ఏర్పాటుచేయబడినది. 
ఇక ఆదిశేషువు శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉంటే అక్కడే !
సర్వాంతర్యామికి వాహనంగా ప్రసిద్ది గరుత్మంతుడు. 
ప్రతి విష్ణు ఆలయంలో ధ్వజస్తంభం వద్ద వినమ్రంగా జోడించిన హస్తాలతో ఉండే వినతా సుతుని మనందరం చూస్తూనే ఉంటాం. 
కాని అతనికి ప్రత్యేకంగా ఉన్న ఏకైక కోవెల మాత్రం "గరుదన్ కావు"లో ఉన్నదే. 
బహుశా భారత దేశం మొత్తం మీద పక్షి రాజుకు ఉన్న ఆలయమిదోక్కటే అని కూడా తెలుస్తోంది.  










ఎన్నో యుగాలకు పూర్వం ఒక మహా మునికి మానవ జీవిత అర్ధం మరియు పరమార్ధం గురించి
స్వయంగా వైకుంఠ నాధుడే తెలిపే సమయంలో వాహనమైన గరుడుడు పక్కనే ఉన్న కోనేరు వద్ద వేచి ఉన్నాడట.
అలా పరమాత్మ సంచరించిన స్థలంగా ప్రసిద్ది కెక్కిన ఇక్కడ కొన్ని కుటుంబాలు జగన్నాధుని ఆలయం నిర్మించుకొని ఆరాధించుకోనేవట!
ఆ కాలంలో పేరొందిన శిల్పి "పేరున్ థాచన్" ( కేరళ లోని ప్రముఖ ఆలయాల నిర్మాణాల వెనుక ఉన్నది ఈయనే అన్న ఒక బలమైన విశ్వాసం ప్రజలలో ఉన్నది) స్థానిక "వేట్టాతు నాడు" పాలకుని వద్దకు వచ్చాడట.
మహా శిల్పిని సాదరంగా ఆహ్వానించిన రాజు ఆయన చేతిలో సహజత్వాన్ని కలిగి ఉన్న గరుడ బొమ్మను చూసి శిల్పి నేర్పరితనాన్నికొనియాడారట.
దానికి  పేరున్ థాచన్ పతివ్రత అయిన స్త్రీ గనుక తాకితే ప్రాణం పోసుకొని ఎగురుతుంది అన్నారట.
ఆ మాటకు ఆగ్రహించిన రాజు శిల్పి భార్యను రప్పించి తాకించారట.
ఆమె చేతి స్పర్శ తగలగానే ఆ చెక్క శిల్పం ప్ర్రాణం పోసుకొని గాలిలోనికి ఎగిరినదట.
 వెంటాడిన భటులు ఇక్కడి కోనేరులోని తెల్ల తాబేళ్ల మీద వాలి ఉన్నపక్షిని కనుగొన్నారట.
తరలి వచ్చిన రాజు ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యం తెలుసుకొని శిల్పాచార్యుని చేతనే ఇక్కడ ఒక నూతన ఆలయం శ్రీ మహా విష్ణువుకు, గరుత్మంతునికి కట్టించారట.
తదనంతర కాలంలో మైసూరును పాలించిన "టిప్పు సుల్తాన్" కేరళ ప్రాంతం మీద జరిపిన దాడులలో తొలుత నిర్మించిన ఆలయం పూర్తిగా ధ్వంసం అయినదిట.
మూల విరాట్టులు  సుమారు 1800 సంవత్సరాలుగా  పూజలందుకొంటున్నా ప్రస్తుత ఆలయం మాత్రం రెండువందల సంవత్సరాల క్రిందట నిర్మించబడినది.







ప్రశాంత వాతావరణంలో గుబురుగా పెరిగిన వృక్షాల మధ్య తూర్పు మరియు పడమర ద్వారాలు కలిగిన ఈ ఆలయం ఉంటుంది. పురుష భక్తులు తప్పని సరిగా పంచె ధరించాలి.
ధ్వజస్తంభం మరియు బలి పీఠాలు లేని ప్రాంగణంలో ఒక పక్క అంబల కార్యాలయము మరో పక్క ప్రసాద విక్రయ శాల ఉంటాయి.
ధ్వజస్తంభ  స్థానంలో నిలువెత్తు రాతి దీప స్థంభం ఉంచబడినది.
చిన్న ద్వారం గుండా లోనికి వెళితే లోపల మూడు చతురస్రాకార శ్రీ కోవెలలు, రెండు నమస్కార మండపాలు కనపడతాయి.
ఎదురుగా రెండంచెల గోపురాలున్నప్రధాన గర్భాలయంలో శ్రీ మహా విష్ణువు చతుర్భుజుడై స్థానక భంగిమలో దర్శనమిస్తారు. లోపల తాబేలు రూపంలో శ్రీ కూర్మనాథ స్వామికూడా దర్శనమిస్తారు. పక్కనే చిన్న ఉపాలయంలో   శ్రీ వినాయకుడు వెలసి ఉంటారు.









ఈ ప్రధాన శ్రీ కోవెల వెనుకే  శ్రీ గరుత్మంతుని సన్నిధి.
చందన పుష్పాలంకార శోభితుడైన గరుడుడు ఎగరడానికి సిద్దంగా రెక్కలు విప్పుకొన్న భంగిమలో దర్శనమిస్తాడు.
గరుడునికి ఇరుపక్కలా సదాశివుని మరో రూపమైన "వేట్టక్కారాన్" మరియు "కార్త వీర్యార్జున్" వెలసి ఉంటారు.
మరో  ఆలయంలో శ్రీ శంకర నారాయణ స్వామి, చివర ఉన్న దానిలో కైలాస వాసుడు కొలువుతీరి ఉంటారు.
 ప్రధాన గర్భాలయం తప్ప మిగిలినవన్నీ నూతనంగా నిర్మించబడినవి. 





 





కేరళ రాష్ట్రంలో విశేష ఆదరణ కలిగిన గరుడన్ కావు ఆలయంలో నిత్య పూజలు నియమంగా జరుగుతాయి.
ఉదయం నాలుగు నుండి పదిన్నర వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉంటుంది.
ఆదివారాలు, పర్వదినాలలో వేళలను మారుస్తారు.
భక్తులు ముఖ్యంగా అనారోగ్య పీడితులు, సర్ప (నాగ) దోషం లేదా కుజ దోషం కలిగి ఉన్నవారు ఎక్కువగా వస్తుంటారు.
మూడు ఆది వారాలు వచ్చి స్వామిని ఆరాధిస్తే సమస్త చర్మ, శ్వాస కోశ వ్యాధులు తొలగిపోతాయని తరతరాల నమ్మకం.
వ్యాధి గ్రస్తులు కంద దుంపను, నాగ రూపాన్ని  తమచుట్టూ తిప్పుకొని సంపూర్ణ విశ్వాసంతో ప్రార్ధిస్తారు.
తెలియక తేకపోతే అక్కడ ఉన్న దుంపను ఉపయోగించుకొని దానికి బదులుగా  శక్తి కొద్ది పైకాన్ని హుండిలో వెయ్య వచ్చును.
అదే విధంగా రాహు లేదా కుజ దోషం వున్నవారు ఇక్కడ నాగ ప్రతిష్ట జరిపిస్తారు.
ప్రాంగణమంతా ఎన్నో నాగ శిలలు లెక్కకు మిక్కిలిగా కనపడతాయి.









కొల్ల వర్షం (మలయాళీ పంచాంగం) ప్రకారం నవంబర్ - డిసెంబర్ మధ్య వచ్చే వృక్చిక మాసంలో జరిపే మండల పూజలలో వేలాదిగా భక్తులు పాల్గొంటారు.
పొంగలి, పళ్ళు గరుత్మంతునికి సమర్పించు కొంటారు.
నాగ  దోషం ఉన్న భక్తులు కొందరు బ్రతికి ఉన్న సర్పాన్ని మట్టి కుండలో బంధించి తెచ్చి మూలవిరాట్టు ముందు కుండను పగలకొడతారు.
బుసలు కొడుతూ బయటికి వచ్చిన పామును ఆలయ పూజారి గరుడ పంచాక్షరి మంత్రంతో శాంతింప చేస్తారట.
శాంతించిన పాము ఆలయ బయటికి వెళ్లి పోతుందట.
గరుడుని మహత్యమో మరొకటో ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ ఎవరూ పాము కాటుకు గురికాలేదని తెలుస్తోంది.










అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహిస్తారు.
ఎన్నో ఆర్జిత సేవలు భక్తుల కొరకు అందుబాటులో ఉన్నాయి.
ఆలయ వెలుపలి ప్రాంగణంలో శ్రీ ధర్మశాస్త, భద్రకాళి సన్నిదులుంటాయి.
గరుడన్ కావు  కేరళ రాష్ట్రం లోని మలప్పురం జిల్లాలో ఉన్నది.
షోరనూర్ లేదా గురువాయూరు నుండి "తిరూర్" మీదగా ఇక్కడికి చేరుకొనవచ్చును.
తిరూర్ నుండి పది కిలోమీటర్లు.
ఎలాంటి వసతులు లభించవు.
కనుక ఉదయం వెళ్లి తిరిగి రావడం ఉత్తమం.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...