16, జనవరి 2022, ఆదివారం

             శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయం, మేల్పడి 

                        


ఆలయాల రాష్ట్రం తమిళనాడులోని అనేకానేక చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయాలు గల గ్రామాలలో ఒకటి మేల్పడి. వెల్లూరు జిల్లాలోని ఈ గ్రామంలో నెలకొల్పబడిన  రెండు ఆలయాలది ప్రత్యేక స్థానం.  
వీటిల్లో ఒకటి శ్రీ సోమనాథేశ్వర స్వామి ఆలయం కాగా రెండవది శ్రీ చోళేశ్వర స్వామి ఆలయం. ప్రస్తుతం ఈ రెండు చారిత్రక నిర్మాణాలు పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి. 





శ్రీ సోమనాధీశ్వర స్వామి వారి ఆలయాన్ని ఒకటవ పరాంతక చోళుడు నిర్మించినట్లుగా శాసనాల ఆధారంగా తెలియవస్తోంది. 

పావన పాలరు నది 

కర్ణాటక రాష్ట్రం లోని నేటి చిక్కబళ్లాపుర జిల్లాలోని నంది కొండల్లో ఉద్భవించి తొలుత ఆ రాష్ట్రంలో  తరువాత   ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొంత భాగం చివరికి తమిళనాడులో అత్యధిక భాగం ప్రవహించి చివరికి వయలూర్ వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది పాలార్ నది. ప్రవాహ మార్గంలో సుమారు ఏడు దాకా ఉపనదుల ప్రవాహాన్ని తనలో కలుపుకొని వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తూ, ఎన్నో నగరాల నీటి అవసరాలను తీరుస్తుంది పాలార్ నది. ఈ పావన నదీతీరంలో ఎన్నో విశేష ఆలయాలు నెలకొల్పబడినాయి. 
వాటిలో భాగమైన ఈ రెండు ఆలయాలు ఒకదానికి ఒకటి ఎదురెదురుగా నిర్మించబడినాయి. 









శ్రీ సోమనాధీశ్వర స్వామి ఆలయం 

మేల్పడి గ్రామాన్ని గతంలో ఒకటవ రాజరాజ చోళుని పేరు మీద "రాజాశ్రయ పురం " అని పిలిచేవారట. ఆ కాలంలో ఈ ప్రాంతం చోళ మరియు రాష్ట్రకూట సామ్రాజ్యాల సరిహద్దు ప్రాంతం. రాజకీయంగా కీలకమైనదిగా  గుర్తించబడినది. అత్యధిక కాలం చోళుల ఆధీనంలో ఉన్నప్పటికీ రాష్ట్రకూట రాజు మూడవ కృష్ణ పాలనలో కొంతకాలం వారి పాలనలో ఉండినది అని శాసనాలు తెలుపుతున్నాయి. 
విశాల ప్రాంగణంలో రెండు ప్రాకారాలతో నిర్మించబడిన ఈ ఆలయానికి సంబంధించి ప్రత్యేక పురాణగాథ ఏది అందుబాటులో లేదు. చోళుల ఆరాధ్యదైవం అయిన మహేశ్వరునికి మరో ఆలయాన్ని నిర్మించి తమకు అప్రతిహతంగా లభిస్తున్న విజయాలకు కృతజ్ఞత తెలుపుకోవాలన్న భావనతో ఈ ఆలయాన్ని ఒకటవ పరాంతక చోళుడు నిర్మించాడన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు చరిత్రకారులు. 








తూర్పు ముఖంగా ఉండే ఆలయానికి దక్షిణం పక్కన రాజగోపురం లేని ప్రధాన ద్వారం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే రెండో ప్రాకారం వెళ్లే ద్వారానికి మూడు అంతస్థుల గోపురం ఉంటుంది. 
గోడల పైన చిన్న చిన్న శిల్పాలను చక్కగా చెక్కారు. 
రెండో ప్రాకారంలో ఉన్న కళ్యాణ మండపం మరియు ఇతర మండపాల స్తంభాల పైన శ్రీ గణపతి, శ్రీ వీరభద్ర, శ్రీ భైరవ, సప్త మాతృకలు, కంకాళనాథర్, వృషభనాథర్, గంగాధరుడు, సూర్య, చంద్ర మరియు నాగులు తదితర రూపాలను ప్రాణం లేని రాతి మీద జీవకళ ఉట్టి పడేలా మలిచారు ప్రజ్ఞావంతులైన నాటి శిల్పులు. 
















నాటి శిల్పుల గొప్పదనాన్ని తెలిపే పెద్ద రాతి నీటి తొట్టి ఆలయ ప్రాంగణంలో కనపడుతుంది. 
ఎలా చెక్కారా అని ఆశ్చర్యం కలుగుతుంది చూపరుల మదిలో ! 
ఉపాలయాలలో శ్రీ గణపతి మరియు అమ్మవారు శ్రీ తపస్కృత దేవి కొలువై దర్శనమిస్తారు. 
సహజంగా ఎక్కడైనా గర్భాలయం పైన ఉండే విమానాన్ని పలుచని ఇటుకలను సున్నపు పూతతో ఏర్పాటు చేసి చక్కని శిల్పాలుగా మలుస్తారు. కానీ మేల్పడి లోని రెండు ఆలయాల విమానాలను నల్ల మరియు ఆకుపచ్చని మరకత శిలలతో నిర్మించారు. 
ఇలా నిర్మించిన  విమానాలు కలిగిన ఆలయాలు చాలా అరుదు అని పేర్కొనాలి. 



















సహజంగా మూలవిరాట్టుకు ఎదురుగా ఉండే ధ్వజస్థంభం మరియు నంది ఇక్కడ ముఖమండపానికి వెలుపల ఉండటం చెప్పుకోదగిన విషయం. నందీశ్వరుడు స్వామిని చూడటానికి వీలుగా రాతితో కిటికీ మలచిన విధానం గొప్పగా ఉంటుంది. 
గర్భాలయానికి ఎదురుగా ఉన్న ముఖ మండపం గుండ్రటి స్తంభాలతో ప్రత్యేకంగా కనపడుతుంది. ఈ స్తంభాల మీద ఎలాంటి శిల్పాలు ఉండవు. గర్భాలయానికి ఇరుపక్కలా ఉన్న నిలువెత్తు ద్వారపాలకుల విగ్రహాలు గంభీరంగా కనిపిస్థాయి  వారి ఆభరణాలు, ఆయుధాలు సహజత్వానికి దగ్గరగా ఉండటం విశేషం. గర్భాలయ వెలుపలి గోడలలో శ్రీ గణేష, శ్రీ దక్షిణామూర్తి, శ్రీ బ్రహ్మ, శ్రీ లింగోద్భవమూర్తి, శ్రీ విష్ణు దుర్గ కొలువై ఉంటారు. 
పెద్ద లింగ రూపంలో శ్రీ సోమనాథేశ్వర స్వామి చందన, విభూది రేఖలతో కుంకుమ మరియు పుష్ప అలంకరణలో సర్ప భూషణం ధరించి నేత్రానందంగా దర్శనం అనుగ్రహిస్తారు.పురావస్తు శాఖవారి ఆధ్వర్యంలో ఉన్నా నిత్య పూజలు జరుగుతాయి. 
అమావాస్య, పౌర్ణమి, త్రయోదశి పూజలు జరుపుతారు. నియమంగా నాలుగు పూజలు రోజులో నిర్వహిస్తారు. 
శివరాత్రికి విశేష సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.  












శ్రీ చోళేశ్వర స్వామి ఆలయం 


మనం అధికంగా చూసే ఆలయాలను, రాజ భవనాలను ఫలానా రాజ వంశానికి చెందిన ఫలానా రాజు నిర్మించారు అని తెలుసు కొంటుంటాము. కానీ అంతటి వైభవాన్ని చూసిన రాజుల చివరి విశ్రాంతి ప్రదేశం ఏమిటంటే ఎవరూ చెప్పలేరు. 
పల్లవ, చోళ, పాండ్య, విజయనగర, నాయక, చెర, హొయసళ, రాష్ట్రకూట, చాళుక్య ఆదిగా గల రాజవంశాల వారు భారత దక్షిణాపథాన్ని వందల సంవత్సరాల పాటు పాలించారు. కానీ వారెవ్వరి సమాధులను మనం ఎక్కడా చూడం. 
ఇందరు మహామహులైన పాలకులలో రాజరాజ చోళుని సమాధి మండపం మాత్రం కుంభకోణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న "ఉదయాలూరు" (శ్రీ గాంగేయపురం)లో కనపడుతుంది. మిగిలిన వారివి ఎక్కడ ఉన్నాయో ?
మనకెన్నో గొప్ప ఆలయాలను, నిర్మాణాలను అందించిన చోళ రాజులలో మరొకరి సమాధి మందిరం మేల్పడిలో కనిపిస్తుంది.  












అదే నేడు శ్రీ చోళేశ్వర స్వామి గా పిలవబడుతున్నఆలయం ఒకటవ పరాంతక చోళ మహారాజు ఆఖరి పుత్రుడైన "అరింజయ చోళుని సమాధి మందిరం. ఆయన పాలించింది తక్కువ కాలమైనా రాజ్యం పైన తనదైన ముద్ర వేశారని చరిత్ర గ్రంధాల వలన అవగతమౌతుంది. 
అరింజయుడు ఇక్కడికి సమీపంలోని ఆరూర్ వద్ద జరిగిన సమరంలో 967వ సంవత్సరంలో  అసువులు బాశారని తెలుస్తోంది. ఆయన పార్ధీవ శరీరాన్ని పాలరు నదీతీరంలోని మేల్పడి వద్ద సమాధి చేశారట. 
తదనంతర కాలంలో ఆయన మనుమడైన ఒకటవ రాజరాజ చోళుడు తాత మరణించిన నలభై ఏడు సంవత్సరాల తరువాత 1014వ సంవత్సరంలో ఆయన సమాధి మీద ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా గర్భాలయ వెలుపలి గోడల పైన ఉన్న శాసనాలు తెలియచేస్తున్నాయి. 
  










శాసనాల ప్రకారం గతంలో అరింజీశ్వర ఆలయంగా పిలవబడిన ఈ ఆలయం శ్రీ సోమనాధీశ్వర స్వామి ఆలయానికి ఎదురుగా పాలరు నదీ తీరంలో ఉన్నది. సమాధి మీద నిర్మించిన ఇలాంటి నిర్మాణాలను "పల్లి పడై ఆలయం" అని పిలుస్తారు. 
కాలక్రమంలో శ్రీ చోళేశ్వరస్వామి ఆలయంగా పిలవబడుతున్న ఈ ఆలయం విమానంతో సహా పూర్తిగా రాతి నిర్మితం. ఈ నలుచదరపు నిర్మాణంలో ధ్వజస్థంభం, బలిపీఠాలు లాంటివి కనపడవు. ఒక చిన్న ముఖ మండపం మరియు గర్భాలయం మాత్రమే ఉంటాయి. 






ముఖ మండపంలో నందీశ్వరుడు కొలువై ఉంటారు. గర్భాలయ వెలుపలి గోడల పైన రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు వేసిన  వివిధ కాలాలకు చెందిన శాసనాలు కనపడతాయి. గర్భాలయానికి నలువైపులా శ్రీ దక్షిణామూర్తి, శ్రీ మహా విష్ణు, శ్రీ బ్రహ్మ, శ్రీ విష్ణు దుర్గ కొలువై కనపడతారు. 
ఈ పరివార దేవతల పై భాగాన శ్రీ కన్నప్ప, ఋషి పత్నులతో ఉన్న శివుని మరో రూపం అయిన భిక్షందార్, శివ పూజ చేస్తున్న ఒకటవ రాజరాజ చోళుడు శిల్పాలను సుందరంగా మలచారు.  
గర్భాలయ ద్వారానికి ఇరుపక్కలా నిలువెత్తు ద్వారపాలక విగ్రహాలు ఉంటాయి. చిన్నదైన గర్భాలయంలో మూడు అడుగుల ఎత్తైన లింగ రూపంలో శ్రీ చోళేశ్వర స్వామి చక్కని పుష్ప అలంకరణలో దర్శనమిస్తారు. 
పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ఆలయంలో నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. 
 
















వెయ్యి సంవత్సరాల చరిత్రకు మౌన సాక్షిగా నిలచిన ఆలయాల నిలయమైన మేల్పడి పాలరు నదీ తీరంలో పచ్చని పొలాల మధ్య చక్కని పల్లె వాతావరణానికి మారు పేరులా ఉంటుంది. 

ఈ చారిత్రక ప్రసిద్ధి చెందిన ప్రదేశం వెల్లూరుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఎలాంటి వసతి, భోజన సౌకర్యాలు లభించవు. సమీపంలోని తిరువాళం , వల్లిమలై లాంటి ప్రదేశాలను మేల్పడి తో కలిపి దర్శించడం ఉచితం. అన్నీ పక్క పక్కనే ఉంటాయి. విశేష పౌరాణిక మరియు చారిత్రక నేపధ్యం గల ప్రదేశాలే ! అద్దెకు వాహనం తీసుకొని వెళ్లడం సౌకర్యంగా ఉంటుంది. 

అన్ని రకాల వసతి, భోజన సౌకర్యాలు వెల్లూరు (కాట్పాడి)లో లభిస్తాయి. దేశంలోని అన్ని ప్రాంతాల నుండి రైలు మార్గంలో కాట్పాడి చేరుకోవచ్చును. 

నమః శివాయ !!!!

 
















15, జనవరి 2022, శనివారం

Sri Mahamaya Temple, Ratanpur, Chattisgarh

                      ముగురమ్మల రూపం మహామాయ దేవి 





ఉత్తరాదిన చాలా రాష్ట్రాలలో దేవదేవి కొలువైన క్షేత్రాలను "శక్తి పీఠాలు"గా పేర్కొంటారు. కానీ వీటిల్లో అధిక శాతం యాభై రెండు శక్తి పీఠాల్లో కనపడవు. అయినా వీటిని శక్తి పీఠాలుగా పిలవడానికి ప్రధాన కారణం ఆ క్షేత్రాలన్నింటిలో అమ్మవారు స్వయంవ్యక్తగా కొలువు తీరడమే ! మరో విశేషం ఏమిటంటే వీటిల్లో చాలా చోట్ల జగజ్జనని లింగ రూపంలో ఉండటం.  అంతే కాకుండా ఆమె మహా సరస్వతి, మహా లక్ష్మి మరియు మహా కాళిగా ముగురమ్మల ఏక రూపిగా పూజలందుకోవడం విశేషంగా చెప్పుకోవాలి. అలాగని అక్కడ మూడు రూపాలు ఉంటాయి అనుకొంటే పొరబడినట్లే ! మూడు లింగ రూపాలు మాత్రమే ఉంటాయి. వాటికి పైన అలంకరణ చేసి అమ్మవార్లను ఆవాహన చేస్తారు. 
ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో అనేక అమ్మవారి ఆలయాలు కనపడతాయి. దంతెవాడ శ్రీ దంతేశ్వరి దేవి, డోంగర్ గఢ్ మా బమలేశ్వరి దేవి విశిష్టమైనవి. వీటిల్లో చాలా మటుకు అక్కడ పాలించిన రాజ వంశాల వారి కులదేవతలుగా ప్రసిద్ధి. ఆలయాలను కూడా ఆ వంశాల వారే నిమించినట్లుగా తెలియవస్తోంది. 
అలాంటి పవిత్ర క్షేత్రాలలో ఒకటి శ్రీ మహామాయ దేవి కొలువు తీరిన రతన్ పూర్. 

ఆలయ చరిత్ర 

క్రీస్తు శకం పదో శతాబ్దం నుండి పన్నెండో శతాబ్దం దాకా ఈ ప్రాంతాన్ని పాలించారు  కాలచూరి రాజ వంశీయులు. తొలుత వీరి రాజధాని నేటి కోర్బా కి సమీపంలోని "తుమన్". కాలచూరి వారు హైహేయ రాజులను ఓడించి అదే ఊరిని తమ రాజధానిగా కొనసాగించారు. కానీ కాలక్రమంలో వివిధ రాజకీయ కారణాలతో రాజధానిని తుమన్ నుండి మార్చవలసిన పరిస్థితులు వచ్చాయి. రాజా రతన్ దేవ్ అనువైన ప్రాంతాన్ని అన్వేషిస్తూ ఇక్కడికి వచ్చారు. నాటి రాత్రి కలలో  అమ్మవారు మహామాయ దర్శనమిచ్చి ఇది తన స్థలమని తనకు ఆలయం నిర్మించి, రాజధాని నిర్మించుకోమని ఆదేశించారు. 



















అమ్మవారి ఆజ్ఞ తల దాల్చి రతన్ దేవ్ అమ్మవారికి ఆలయాన్ని నిర్మించి రాజధానిని ఇక్కడికి మార్చారు. అలా క్రీస్తు శకం 1050వ సంవత్సరం నుండి ఈ ప్రాంతాన్ని రాజు పేరు మీద రతన్ పూర్ అని పిలవసాగారు. 
కాలక్రమంలో కాలచూరి వంశ ప్రాభవం తరిగిపోయింది. వారు అనేక ఉపశాఖలుగా విడిపోయి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. రాజ కోట మరియు  ఆలయం శిథిలావస్థకు చేరుకొన్నాయి. పదిహేనవ శతాబ్దంలో  ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొన్న రాజా బాహర్ సాయి ఆలయాన్ని పునః నిర్మించారు. 
ఈ ప్రదేశంలో సతీదేవి కాళీ గజ్జెలు పడటం వలన ఇది శక్తి పీఠంగా పిలవబడుతోంది అని అంటారు స్థానికులు. తొలి మందిరాన్ని రాజా విక్రమాదిత్య క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది. 

 ఆలయ విశేషాలు 

సువిశాల ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు ఎన్నో ఉపాలయాలు, మండపాలు మరియు కోనేరులు ఉంటాయి. 
నగారా శైలిలో నిర్మించబడిన ప్రధాన మరియు ఇతర నిర్మాణాలు ఆకర్షణీయంగా కనపడతాయి.  
మహామాయ దేవి కొలువు తీరిన మందిరానికి ఎదురుగా కొద్దిగా ఎత్తైన పీఠం పైన "కాంతి దేవళ సన్నిధి" ఉంటుంది. పరమశివుడు కొలువైన ఈ పురాతన మందిరం పక్కన మరో మందిరం కూడా కనపడుతుంది. ఇక్కడ లింగానికి పాలు మరియు మంచినీటితో అభిషేకం చేస్తే సకల గ్రహ దోషాలు తొలగిపోయి సర్వసంపదలు లభిస్తాయని చెబుతారు. 
ఇలాంటి మరికొన్ని పురాతన శిధిల నిర్మాణాలు చాలా రతన్ పూర్ లో కనపడతాయి. కాంతి దేవళ మందిరం నగారా మరియు మొఘల్ నిర్మాణ శైలిలో కట్టబడినది. వెలుపలి గోడలకు చెక్కిన సాలభంజికలు నేటికీ ఎంతో సుందరంగా జీవం ఉట్టిపడుతూ కనపడటం విశేషం. 
శ్రీ కాల భైరవుడు ఈ క్షేత్ర పాలకుడు. ప్రధాన ఆలయానికి వెలుపల రహదారి మీద ఒక సన్నిధి, మహామాయ దేవి కొలువైన మందిరానికి దక్షిణం పక్కన మరో సన్నిధిలో భైరవుడు కొలువు తీరి భక్తుల ప్రధమ పూజలు అందుకొంటుంటారు. 














పక్కనే అఖండ జ్యోతి ఇప్పటికి ముప్పై నాలుగేళ్లుగా వెలుగుతూనే ఉన్నది. మరో వైపు శ్రీ మహిసాసుర మర్ధిని, శ్రీ భద్రకాళీ అమ్మ కూడా ఆలయ వెలుపలి గోడలలో కనపడతారు. ఆలయానికి ఉత్తరం పక్కన ఉన్న పెద్ద మండపంలో అనేక మంది దేవీదేవతలు కొలువై ఉంటారు. 
ఉపాలయాలలో ప్రధానమైనవి శ్రీ గణపతి, శ్రీ హనుమాన్, శ్రీ సూర్య, శ్రీ మహావిష్ణు కొలువైనవి. 
లోపలి దారి తీసే ద్వారం చాలా చిన్నగా ఉండి ఇరుకుగా ఉంటుంది. తోలుతో చేసిన వస్తువులను ధరించి ఆలయం లోనికి వెళ్లనీయరు. గర్భాలయంలో రెండు అర్చనామూర్తులు ఒకదాని వెనుక కొలువై కనపడతాయి. ముందు ఉన్న విగ్రహాన్ని శ్రీ మహిషాసురమర్ధినిగా వెనుక ఉన్న రూపాన్ని శ్రీ మహా సరస్వతి మరియు శ్రీ మహా లక్ష్మి ఏక రూపంగాను పేర్కొంటారు. వెలుపల అమ్మవారి వాహనం అయిన మృగరాజు ఉపస్థిత భంగిమలో కనపడతారు. 
ప్రతి నిత్యం నియమంగా నాలుగు పూజలు జరుగుతాయి అమ్మవారికి. అన్ని హిందూ పండగల సందర్భంగా వేలాది సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా నవరాత్రులలో లక్షలాదిగా భక్తులు "అఖండ మనోకామ్న నవరాత్ర జ్యోతి కలశ" లను తీసుకొని వస్తారు. ప్రత్యేకమైన కోరిక కోరుకొని ఈ జ్యోతి కలశ తీసుకొని వచ్చే భక్తులను అమ్మవారు తప్పక అనుగ్రహిస్తుంది అని విశ్వసిస్తారు. 
































ప్రాంగణంలో నేపాలీ శైలిలో నిర్మించిన మందిరం ఒకటి కనపడుతుంది. అందులో సర్వేశ్వరుని పంచ ముఖాలైన ఈశాన, తత్పురుష, వామదేవ, సద్యోజాత మరియు అఘోర ల ప్రతీకగా పంచ ముఖ లింగం కొద్దిగా ఎత్తైన పీఠం మీద దర్శనమిస్తుంది. ఈ లింగాన్ని భక్తులు మహా మృత్యుంజయ పంచ ముఖ మహాదేవ అని పిలుచుకొంటూ  పరమ పవిత్రమైనదిగా ఇహపర కోర్కెలను నెరవేర్చిదిగా నమ్ముతారు. ఎవరైనా మహా మృత్యుంజయ పంచ ముఖ మహాదేవ  లింగానికి అభిషేకం చేసి, మనస్సులోని కోరిక తెలుపుకొని ఒక కొబ్బరి కాయను ఎఱ్ఱటి వస్త్రంలో కట్టి సన్నిధిలో ఉంచితే మండలం రోజులలో అది నెరవేరుతుంది అంటారు. మనోభీష్టం పూర్తి అయిన తరువాత మరో సారి ఆలయానికి వచ్చి కృతజ్ఞతాపూర్వకంగా మరో మారు అభిషేకం జరిపించుకొని ఇంతకు ముందు పెట్టిన కొబ్బరి కాయను ప్రసాదంగా స్వీకరించాలి. 
ఎఱ్ఱ వస్త్రంలో చుట్టి పెట్టిన కొన్ని వందల కొబ్బరి కాయలు కనపడతాయి అంటే స్వామి పట్ల భక్తులకు గల అనన్య విశ్వాసాన్ని అర్ధం చేసుకోవచ్చును. 















ప్రాంగణమంతా చిన్న చిన్న మందిరాలలో ఎన్నో దేవతా సన్నిధులు కనపడతాయి. భక్తులకు కావలసిన పూజాద్రవ్యాలు, పిల్లలు కోరుకొనే ఆట వస్తువులను అమ్మే దుకాణాలు ప్రాంగణంలో ఎన్నో కనపడతాయి. 
చక్కని పరిశుభ్ర వాతావరణంలో ఉంటె శ్రీ మహామాయ దేవి ఆలయం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి రెండు గంటల నుండి రాత్రి పది గంటల వరకు భక్తుల కొరకు తెరచి ఉంటుంది. 
ఆలయానికి కొద్ది దూరంలో ప్రధాన రహదారి మీద కాల చూరి రాజుల పురాతన కోట శిధిలావస్థలో కనపడుతుంది. 











నామమాత్రంగా మిగిలిన ప్రవేశ ద్వారాలు, పునాదులు, కొన్ని చిన్న మందిరాలు మాత్రమే కనపడతాయి. ద్వారం అమర్చబడిన గోడ పైన సుందర శిల్పాలు ఆకర్షిస్తాయి. పూర్తిగా ఎఱ్ఱ ఇసుక రాతితో ఈ కోట నిర్మించబడినట్లుగా తెలుస్తుంది. శ్రీలక్ష్మీ నారాయణ, శ్రీ ఆంజనేయ మందిరాలు పై భాగాన ఉంటాయి. 
ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న కోటను వారు చక్కగా సంరక్షిస్తున్నారు. 
కోటకు కొద్ది దూరంలో చిన్న కొండ మీద శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్రుల వారి ఆలయం ఉంటుంది. దూరంగా మరో పర్వతం మీద నిలువెత్తు హనుమాన్ విగ్రహం కనపడుతుంది. 
రతన్ పూర్ లో మాత్రమే నెలకొని ఉన్న విశేషం, ఆకర్షణ ప్రపంచంలో మరెక్కడా కనపడదు. అదే స్త్రీ రూపంలో దర్శనమిచ్చే శ్రీ అంజనా సుతుడు కొలువైన మందిరం. 
శ్రీ మహామాయ దేవి ఆలయం నుండి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుందీ ఈ విశేష ఆలయం. 




























ఇంతటి చారిత్రక విశేషాల నిలయమైన రతన్ పూర్ ఛత్తీస్ ఘర్ రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలలో ఒకటైన బిలాస్ పూర్ కి పాతిక కిలోమీటర్ల దూరంలో అంబికా పూర్ వెళ్లే మార్గంలో ఉన్నది. బస్సులు లభిస్తాయి. ఉండటానికి పరిమిత సంఖ్యలో వసతి సౌకర్యాలు కలవు. 

సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్ధ సాధకే 

శరణ్యే త్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే !!!!!


































Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...