16, అక్టోబర్ 2020, శుక్రవారం

Dabaleshwar Mahadev Mandir, Titlagarh

                 శ్రీ ధవళేశ్వర్ మహాదేవ్ మందిర్, టిట్లాగర్హ్  



లయకారుడైన నిరాకారునికి పుడమిలో ఉన్న ఆలయాలకు లెక్కలేదు. అందులోనూ ప్రతి ఒక్క ఆలయం తనదైన ప్రత్యేకతను చాటుకొంటాయి. అవడానికి లింగాకారుడైనా ఆ లింగాలు కూడా భిన్న రూపాలలో ఉండి వివిధ నామాలతో పిలవబడటం విశేషం. ఈ లింగాలలో చాలా వరకు స్వయం భూలు కావడం మరో ప్రస్తావించవలసిన అంశం. 
ఈ లింగాలు ఎక్కువగా దట్టమైన అడవులలో, పర్వత ప్రాంతాలలో, సాగర సంగమ ప్రదేశాలలో  మరియు పవిత్ర నదీ తీరాలలో ఉన్నాయి. కానీ శక్తి ఆరాధన అధికంగా ఉండే ఒడిశా రాష్ట్రంలో అనేక లింగాలు కొండ గుహలలో ఉంటాయి. అన్నీ కూడా ఎత్తుగా, పెద్ద కైవారంతో కొద్ది కొద్దిగా పెరుగుతుంటాయి. ఉదాహరణకు కోరాపుట్ జిల్లాలో ఉన్న గుప్తేశ్వర్ గుహాలయాన్ని పేర్కొనవచ్చును. ఇలాంటి ఆలయాలు ఎక్కువగా మల్కనగిరి, బాలేశ్వర్, సంబల్పూర్ మరియు బోలంగిర్ జిల్లాలలో కనిపిస్తాయి. వీటి వెనుక చెప్పుకోదగిన పౌరాణిక లేదా చారిత్రక విశేషం ఉన్నది. 
అలాంటి ఒక విశేష ఆలయం గత నెలలో సందర్శించుకునే అవకాశం వచ్చింది.ఆ విశేషాలు అందరితో పంచుకొందామన్న ఉద్దేశ్యంతో ఈ పోస్ట్ రాస్తున్నాను.  









ఒడిషా పశ్చిమ ప్రాంతంలోని జిల్లాలలో ఎండ, వేడి, చలి, వర్షాలు అన్నీ ఎక్కువే ! శీతాకాలంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీలకు పడిపోతాయి. అదే విధంగా ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీలకు చేరుకొంటాయి. ఈ విషయంలో బలంగీర్ జిల్లాలోని టిట్లాగర్హ్ ప్రాంతంలో ఇవి రెండూ కొంచెం ఎక్కువగానే ఉంటాయి. కానీ ఈ పట్టణంలో చిన్న కొండ మీద ఉన్న శ్రీ ధవళేశ్వర మహాదేవ్ మందిరంలో మాత్రం ఏ  కాలంలో అయినా చల్లగా ఉంటుంది. వెలుపల యాభై డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నా లోపల మాత్రం పదిహేను డిగ్రీలు ఉండటం చెప్పుకోవలసిన అంశం. చలి కాలంలో అయితే రగ్గులు కప్పుకోవాలి అంటారు. మహేశ్వరుని నివాసం మంచు కొండలు కదా !
పది అడుగుల ఎత్తు యాభై అడుగుల వెడల్పు కలిగిన ఈ గుహాలయం గురించిన విశేషాలు అశోక చక్రవర్తి కాలానికి చెందినవిగా తెలియవస్తోంది. 














ఆలయ గాధ 

 క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన మగధ సామ్రాజ్యాధినేత అయిన అశోకుడు తన సామ్రాజ్యాన్ని విస్తరించే క్రమంలో చేసిన సమరాలలో  అతి భయంకరమైనది కళింగ యుద్ధం. సుమారు లక్ష మంది మరణించారని అశోకుడు స్వయంగా వేయించిన శాసనాల ద్వారా అవగతమౌతుంది. అంతకు రెండింతల సంఖ్యలో అశ్వాలు మరియు గజాలు చనిపోయాయి. ఇక గాయపడిన వారి సంఖ్య ఎంత అన్నది లెక్క లేదు. 
తాను సల్పిన చూడలేని కనీసం ఊహించలేని రక్తపాతాన్ని స్వయంగా చూసిన మౌర్య చక్రవర్తి తట్టుకోలేక పోయాడు. నాటి నుండి ఆయన అహింసావాదిగా మారిపోయారు. బౌద్ధమతాన్ని స్వీకరించారు. కళింగ యుద్ధమే ఆయన చేసిన ఆఖరి యుద్ధంగా అభివర్ణిస్తారు చరిత్రకారులు. 
విజయం వరించినా వివరించలేని విచారాన్ని అనుభవిస్తూ తిరుగు ప్రయాణం అయిన అశోకుడు మార్గమధ్యంలో ఇక్కడి కుమహదా పర్వత పాదాల వద్ద విడిది చేశారట. 











భద్రతా ఏర్పాట్లలో భాగంగా ఈ ప్రాంతమంతా కలయ తిరుగుతున్న సైనికులకు కొన్ని గుహలు కనబడ్డాయట. వాటిల్లో ఒకదానిలో శివ లింగం కనపడినదట. మరో గుహలో తన సహజ క్రూరత్వాన్ని ప్రదర్శించక సాధు జంతువు  మాదిరి ప్రవర్తిస్తున్న పెద్ద పులి కూడా కనపడినదట. 
దీనిని గమనించిన అశోక చక్రవర్తి తాను అహింసావాదిగా మారడానికి తీసుకొన్న నిర్ణయానికి సర్వాంతర్యామి ఆశీస్సులుగా భావించి పూజాదులు నిర్వహించి, గుహ వెలుపల చిన్న మండపాన్ని నిర్మించి నిత్య పూజలు చేయడానికి కావలసిన ధనసహాయం ఏర్పాటు చేసి వెళ్లిపోయారట. 
నాడు పులి కనపడిన గుహను పులి గుహ అని పిలుస్తారు నేటికి.  









టిట్లాగర్హ్ రైల్వే స్టేషన్ కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది "కుమహదా పర్వతం". పచ్చదనం ఏమాత్రం ఉండకుండా నున్నగా ఉండే ఈ పర్వతం రెండు అంచెలలో ఉంటుంది. కొండ పక్కన పట్టణానికి మంచి నీటిని అందించే పెద్ద చెరువు ఉంటుంది.  
పర్వత పాదాల వద్ద ఎత్తైన చెట్లు పచ్చదనాన్ని, చల్లని గాలి, నీడలను అందించడమే కాకుండా పరిసరాలను ఆకర్షణీయంగా చేశాయి. రాష్ట్ర పర్యాటక శాఖ వారు ఇక్కడ సంవత్సరానికి ఒకసారి జలక్రీడలు ఏర్పాటు చేస్తుంటారు. అలానే ఒక చక్కని ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. 
తోలి అంచెలో ఉన్న మందిరాన్ని చేరుకోడానికి సుమారు యాభై మెట్ల మార్గం ఏర్పాటు చేశారు. ఆలయానికి వెలుపల ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గద్దె మీద స్వామివారి వాహనం అయిన శ్రీ నందీశ్వరుడు ప్రభువు ఎప్పుడు పిలుస్తారా అన్నట్లుగా ఏకాగ్ర చిత్తంతో ఆలయం వంకే చూస్తుంటారు. 
 









నాడు అశోకుడు గుహకి అనుబంధంగా నిర్మించిన మండపం కాలగతిలో కనుమరుగయ్యింది. స్థానికులు కొత్తగా ఒక మండపాన్ని ఏర్పాటు చేశారు. మండపానికి ముందు పక్క యాగశాల కనపడుతుంది. 
విశాలమైన మండపం గుండా గుహ లోనికి మార్గం ఉన్నది. సుమారు ఎనభై అడుగుల వెడల్పు, యాభై అడుగుల లోతు కలిగిన గుహ మధ్యలో ఎత్తైన పానువట్టం మీద స్వయంభూ లింగాకారంలో శ్రీ ధవళేశ్వర మహాదేవుడు దర్శనమిస్తారు. 
పది అడుగుల ఎత్తు లో ఉండే గుహాంతర్భాగం లోనికి వెళ్ళగానే మంచు పర్వతాలలో శరీరాలను తాకే శీతల పవన స్పర్శ అనుభూతి ప్రతి ఒక్క భక్తునికి అనుభవం అవుతుంది. ఎందుకంత చలి గుహ లోపల ఉంటుందో చెప్పలేకపోయారు. కానీ బయట చమటలు కక్కే వేడి లోపల గజగజ వణికించే చలి. ప్రకృతి పరమాత్మ ఎంత గొప్పవి ! 














ఉపాలయాలలో ఘంటాసిని, తులసి చండి కొలువై ఉంటారు. మెట్ల మార్గంలో పర్వతాగ్రం చేరుకొంటే అద్భుతమైన ప్రకృతి సౌందర్యం దర్శనమిస్తుంది. నున్నటి రాతి కొండ పై భాగం మీద కురిసిన వానల తాలూకు నీటితో ఒక సహజ కోనేరు ఏర్పడింది. వర్షాలు బాగా కురిస్తే అది నిండి నీరు కొండ క్రిందకు ప్రవహించడం వలన అక్కడ కూడా ఒక చెరువు ఏర్పడినది. దాని క్రింద చాలా ఎకరాలలో పంటలు పండుతున్నాయి. పైనుండి టిట్లాగర్హ్ నగరం మొత్తాన్ని చూడవచ్చును. కొండకు ఒక వైపు పట్టణం మరో వైపు పచ్చని పొలాలు. నాయన మనోహరంగా ఉంటుందా దృశ్యం. 
కొండ పైన ఉన్న కోనేరు పక్కన శ్రీ సీతా లక్ష్మణ ఆంజనేయ సమేతంగా శ్రీ దశరధ రాముని మందిరం నిర్మించారు. అలానే ఒక పక్కన తార తరణి మందిరం కూడా కలదు. 
ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు తెరిచి ఉంటుంది ఈ ఆలయం. నియమంగా నిత్య పూజలు, అభిషేకాలు జరుపుతారు. ముఖ్యంగా శ్రావణ మరియు కార్తీక మాసాలలో భక్తులు అధిక సంఖ్యలో శ్రీ ధవళేశ్వర మహాదేవుని దర్శనానికి తరలి వస్తుంటారు. మహా శివరాత్రి పర్వదిన సమయంలో మూడు పాటు ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. 
దేశంలోని అన్ని ప్రాంతాల నుండి టిట్లాగర్హ్ చేరుకోడానికి రైలు సౌకర్యం కలదు. ఉండటానికి అందుబాటు ధరలలో వసతి మరియు  ఆహార శాలలు లభిస్తాయి. 
ఒక అరుదైన ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదించే  అరుదైన ఆలయం టిట్లాగర్హ్ లోని శ్రీ ధవళేశ్వర మహాదేవ్ మందిర్.  

4, అక్టోబర్ 2020, ఆదివారం

Marundeeshwara Temple, Thirukachur

                 సర్వరోగాలకు మందు ఈ మహేశ్వరుడు 





సింగపెరుమాళ్ కోయిల్ కి సమీపం లోని తిరుకచూర్ క్షేత్రం లోని మరో విశేష దేవాలయం శ్రీ మరుండేశ్వర స్వామి వారు కొలువైనది. ఈ ఆలయం ఉన్న రుద్రగిరి గతంలో అనేక మంది తాపసులకు నిలయంగా పేరొందినది అని పురాతన తమిళ గ్రంధాలు పేర్కొన్నాయి అని తెలుస్తోంది. ఎన్నో ఋష్యాశ్రమాలు ఇక్కడ ఉండేవట. ఎంతో పవిత్ర ప్రదేశంగా ఋషులు భావించిన ఈ క్షేత్ర గాధ దక్ష యజ్ఞం తో ముడి పడినట్లుగా తెలుపుతోంది. 
పిలవని పేరంటానికి పతిదేవుని మాట దాటి వెళ్లిన దాక్షయాణి అక్కడ జరిగిన అవమానాన్ని తట్టుకోలేక యజ్ఞ గుండలో దూకి ఆత్మాహుతి చేసుకొన్న విషయం మనందరకూ తెలిసినదే ! 
ఆగ్రహించిన పరమేశ్వరుడు వీరభద్రాది గుణాల ద్వారా దక్ష యజ్ఞాన్ని భగ్నం చేయించి సతీదేవి దేహాన్ని భుజాన వేసుకొని విరాగిగా సంచరించసాగారట. 
ఆయనను తిరిగి మామూలు స్థితికి తీసుకొని రమ్మని ముల్లోకవాసులు శ్రీమహావిష్ణువును ప్రార్ధించారట. అప్పుడు ఆయన తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలుగా విభజించారట. అలా చక్రాయుధ వేగానికి సతీదేవి శరీరభాగాలు పుడమి మీద పలు చోట్ల పడినాయి.  అవే శక్తి పీఠాలుగా పేరొందాయి. అవి మొత్తం యాభై రెండు అని అంటారు. వీటిల్లో ముఖ్యమైనవిగా అష్టాదశ పీఠాలు పేరొందాయి.  
ఆ సమయంలో సతీదేవి చర్మంలోని కొంత భాగం ఈ రుద్రగిరి మీద పడినదట. అమ్మవారి చర్మం పడటం వలన రుద్రగిరి మీద మన్ను,మొక్కలు అన్నీ సంజీవని స్వరూపాలుగా మారిపోయాయట. 
ఎన్నో అపురూప అరుదైన మూలికలు నిలయంగా రుద్రగిరి పేరొందినది అని అంటారు. నేడు రుద్రగిరి కనుమరుగైన దేవాలయంలో ధ్వజస్థంభం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రదేశంలోని మన్నును సర్వరోగ నివారిణి గా ప్రజలు విశ్వసిస్తారు. 











అసలు "మరుండు" అంటే ఔషధం అని అర్ధం. కొలిచినవారి ఆరోగ్యాన్ని రక్షించే స్వామి అన్న అర్ధంలో శ్రీ మరుండేశ్వర స్వామి అని పిలుస్తారు. ఒకసారి దేవతలా రాజైన దేవేంద్రుని అంతు తెలియని వ్యాధి సంక్రమించిందట. దేవ వైద్యులైన అశ్వనీ దేవతలు ఎన్నో రకాల ఔషధాలను  
ప్రయోగించినా ఫలితం లేకపోయినదట. దిక్కు తోచక ఇంద్రుడు. అశ్వనీ దేవతలు కైలాసానికి వెళ్లి మహేశ్వరుని ప్రార్ధించారట. 
ఆయన వారికి రుద్రగిరి మీద లభించే ఒక మూలిక గురించి తెలిపి దానిని వెలుతురులోనే సేకరించాలని తెలిపారట. భూలోకానికి వచ్చిన దేవవైద్యులు ఎంత వెదికినా సాయం సంధ్యా సమయం లోపల సేకరించలేక పోయారట. చీకట్లు కమ్ముకొనసాగాయిట. అంతట వారు అమ్మలగన్నఅమ్మ లోకనాయకిని ప్రార్ధించారట. రుద్రగిరి మీద పడినది సతీదేవి చర్మం కదా !  
కరుణించిన అమ్మవారు ఆ ప్రాంతమంతా వెలుగులతో నిండిపోయేలా చేసిందట. ఈ కారణంగా ఇక్కడ కొలువు తీరిన అమ్మవారిని "అంజనాక్షి లేదా అంధక నివారిణి" అని పిలుస్తారు. ఈమెను భక్తి శ్రద్దలతో సేవిస్తే జీవితంలో ఆవరించిన కష్టాల చీకట్లు తొలగి వెలుగులు నిండిపోతాయని విశ్వసిస్తారు స్థానికులు. ఆమె సన్నిధి వద్ద నేతి దీపాలను వెలిగించి తమ కష్టాలను తొలిగించమని ప్రార్ధిస్తుంటారు. 
 ఆ వెలుగులలో మూలికను సేకరించడంతో దేవేంద్రునికి స్వస్థత చేకూరిందట. ఆయన వినతి మేరకు స్వామి ఇక్కడ కొలువు తీరారట. కొలిచిన వారి ఆరోగ్యాన్ని మెరుగు పరిచే వానిగా స్వామిని శ్రీ మరుండేశ్వర స్వామి అని పిలుస్తారు. 
  
 





ఈ క్షేత్రంలో సృష్టి కర్త బ్రహ్మ మరియు ఆయన అర్ధాంగి విద్యల అధిదేవత సరస్వతీ దేవి శ్రీ మరుండేశ్వర స్వామి వద్ద వైద్య  శాస్త్రం అభ్యసించారట. అసుర గురువు శుక్రాచార్యుడు రుద్రగిరి మీద తపస్సు చేసి పరమేశ్వరుని సంతుష్ట పరచి "మృత సంజీవని విద్య"ను తెలుసుకొన్నారట. 
కలియుగ తొలినాళ్లలో ఈ ప్రాంతమంతా భయంకరమైన అంటువ్యాధి ప్రబలి పోయిందట. వేలాదిగా ప్రజలు మరణించసాగారట. 










ప్రజాభిమాని శివభక్తుడైన ఆ ప్రాంత పాలకుడు మునీశ్వరులు సలహా మేరకు శ్రీ మరుండేశ్వర స్వామి వారికి ప్రత్యేక అభిషేకాలు చేయించారట. నాటి రాత్రి ఆయనకు స్వప్న దర్శనమిచ్చిన స్వామి దేవాలయంలోని ఒక ప్రదేశాన్ని చూపి అక్కడ ఉన్న మట్టిని ఔషధంగా స్వీకరిస్తే వ్యాధి బారి న  పడరని  స్వస్థత చేకూరుతుందని తెలిపారట. ఆప్రకారం చేయగా కొద్దీ రోజుల లోనే వ్యాధి అంతరించి పోయింది. అప్పుడు లోకేశ్వరుడు రాజుకు చూపిన స్థలం నేటికీ ఉన్నది. ధ్వజస్థంభం వద్ద ఉన్న ఈ స్థలం నుండి భక్తులు అనారోగ్య నివారణకు మన్ను తీసుకొని వెళుతుంటారు.  











సుమారు ఒక ఎకరా విస్తీర్ణంలో చోళ రాజులు నిర్మించిన ఈ ఆలయం సుమారు క్రీస్తు శకం ఏదో శతాబ్దానికి చెందినది అంటారు. అనంతర కాలంలో నాయక రాజులు ఆలయానికి మర్మత్తులు చేయించి కొన్ని నూతన నిర్మాణాలను చేసినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. 








రాజ గోపురం లేని తూర్పు ద్వారం గుండా వెళితే నేరుగా గర్భాలయానికి చేరుకోవచ్చును. గర్భాలయంలో లింగ రూపంలో శ్రీ మరుండేశ్వర స్వామి పూజలందుకొంటుంటారు. అమ్మవారు అంజనాక్షి ప్రత్యేక సన్నిధిలో కొలువై ఉంటారు. నవగ్రహ మండపంతో సహా శ్రీ గణపతి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రమణ్య స్వామి ఉపాలయాలలో దర్శనమిస్తారు. 
తమిళనాడులో గర్భాలయానికి ఉత్తర భాగాన దక్షిణ ముఖంగా శ్రీ చెండికేశ్వరుడుప్రత్యేక సన్నిధిలో కొలువై కనిపిస్తారు. ఆయన వద్ద భక్తులు తమ గోత్రనామాలను చెప్పుకొని తమ కోరిక విన్నవించుకొంటారు . ఆలా చేయడం వలన మనోభీష్టం శీఘ్రగతిన ఈడేరుతుందని విశ్వసిస్తారు. 
ఈ ఆలయంలో కూడా శ్రీ చెండికేశ్వరుడు ఉన్నారు. కానీ అయన చతుర్ముఖునిగా కనిపిస్తారు. ఇలా నాలుగు ముఖాలు కలిగి ఉన్న చండికేశ్వరుని మరెక్కడా చూడలేము. 
ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఏడు గంటల వరకూ తెరిచి ఉండే ఈ ఆలయంలో నియమంగా రోజుకు మూడు పూజలు చేస్తారు. అన్ని పర్వ దినాలలో ప్రత్యేక పూజలు జరుపుతారు. శ్రీ కచ్చభేశ్వర స్వామి ఆలయానికి ఇది జంట ఆలయం కావడాన రెండు ఆలయాలకు కలిపి చైత్ర మాసంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. 


నమః శివాయ !!!!  




Kachabeshwara Temple, Thirukachur

                    మహాకూర్మం కొలిచిన మహేశ్వరుడు 


మన దేశంలో గ్రామగ్రామాన, పట్టణ నగరాలలో ఎన్నో ఆలయాలు నెలకొని ఉన్నాయి. అన్నింటిలోనూ చరాచర సృష్టికి మూలాధారమైన ఈశ్వరుడే వివిధ నామాలతో రూపాలలో కొలువై ఉన్నారన్నది పెద్దల మాట, వీటిల్లో కొన్ని చోట్ల స్వయంభూ గా, మరికొన్ని చోట్ల స్వయంవ్యక్త గా మిగిలిన క్షేత్రాలలో ప్రతిష్ఠిత మూర్తిగా సర్వేశ్వరుడు ప్రజల పూజలు అందుకొంటున్నారు. పరమాత్మకు చేసే వివిధ పూజలు, సేవల సమయంలో పఠించే వేదం మంత్రాల కారణంగా దేవాలయ ప్రాంగణంలో ఇది అని చెప్పలేని గొప్ప అనుకూల శక్తి నెలకొని ఉంటుంది. అనిర్వచనమైన ఆ శక్తి దైవ దర్శనానికి విచ్చేసే భక్తుల మదిలో ఆధ్యాత్మిక భావాలను పెంపొందించి స్థిరపరుస్తుంది. అంతులేని శాంతిని ప్రసాదిస్తుంది. అద్భుతమైన ఆనందాన్ని అందిస్తుంది. కానీ అదే శక్తి కారణ జన్ముల హృదయ అంతరాంతరాలలో పూర్వ జన్మ పుణ్య ఫలాన అంతర్యామి పట్ల  ఏర్పడిన అనుభూతులను,భావాలను,భక్తిని అసంకల్పితంగా వెల్లడించేలా చేస్తుంది. 
అలా జన్మించిన మహానుభావులకు యుగయుగాలుగా భారత దేశం పేరొందినది. వారు లోకరక్షకుని పట్ల తమకు గల అచంచల భక్తిని వివిధ మార్గాల్లో వెలిబుచ్చారు. అలాంటి వాటిల్లో ఒకటి కీర్తన గానం. 







కేశవుడు కీర్తనా ప్రియుడు కదా ! భక్తులు తమ మదిలో అక్కడి మూలవిరాట్టును చూసిన ఆ క్షణంలో స్ఫురించిన లలిత లలిత పదాలను కూర్చి పాడిన పాటలు  అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొన్న పరమేశ్వరుని ప్రేరణనే అని విశ్వసిస్తారు. దాని వలన ఆయా క్షేత్రాలు  ఈశ్వర స్థిరనివాసాలుగా పేరొందాయి. 
కీర్తనలను పాడిన వారిని "నయనారులు" అని కీర్తనలను "పాటికాలు " అని పాడిన ప్రదేశాలను "పడాల్ పెట్ర స్థలాలు" అని పిలవ సాగారు. నిరంతర శివ నామస్మరణ చేస్తూ ఆలయ సందర్శనలో కాలం గడిపిన నయనారులు మానవాళికి అందించిన ఆలయాలు రెండువందల డెబ్భై అయిదు. వారు ఒక క్షేత్రంలో గానం చేస్తూ ఆ కీర్తనలో ఉదహరించిన మరో క్షేత్రాన్ని "తేవర వైప్పు స్థలాలు" గా ప్రసిద్ధి చెందాయి. ఇవి రెండువందల తొంభై ఒకటి. 









పడాల్ పెట్ర స్థలాలు తమిళ నాడులో అధికంగా ఉన్నా మిగిలిన రాష్ట్రాలతో పాటు పొరుగు దేశాలైన శ్రీ లంక మరియు నేపాల్ లలో ఉన్నాయి. కానీ తేవర వైప్పు స్థలాలు మాత్రం ఒక్క తమిళనాడులోనే ఉండటం విశేషం. 
పురాణాల ప్రకారం నయనారులు సుమారు మూడు వేల సంవత్సరాలకు చెందిన వారు అన్న నమ్మకం ఉన్నది. కానీ శాస్త్రీయ పరిశోధనలు వీరు క్రీస్తు శకం ఆరు నుండి ఎనిమిది శతాబ్దాల మధ్య కాలానికి చెందిన వారుగా నిర్ధారించాయి. ఈ మహనీయులు సంచరించి ప్రేరణ పొందిన కాల నిర్ణయమే స్థిరం కానప్పుడు వీరు సందర్శించి కీర్తించిన నిరాకారుడు కొలువైన ఆలయాల నిర్మాణం ఏనాటిది ? స్వామి ఎప్పటి నుండి అక్కడ పూజలందుకొంటున్నారు ?
ఈ ప్రశ్నలకు సమాధానం ఆయా క్షేత్రాల పౌరాణిక గాధలు ఇస్తున్నాయి. ఈ క్షేత్రాల ప్రస్థాపన అనేకానేక పురాణాలలో మరియు పురాతన తమిళ గ్రంధాలలో ఉన్నట్లుగా తెలుస్తోంది.  నయనారుల పాటికాల ద్వారా పదుగురికి తెలిసిన మహోన్నత ఆలయాలను మనం ఈ నాడు సందర్శించుకోగలుగుతున్నాము.   
ఈ ఆలయాలు చిన్నవా లేక పెద్దవా అన్న విషయాన్ని పక్కన పెట్టి వాటి గాధలను పరిశీలిస్తే ప్రతి ఒక్క ప్రదేశం ఒక విశేషాన్ని కలిగి ఉంటాయి. 
అలాంటి విశేషము కలిగిన రెండు ఆలయాలను మనం సందర్శించుకొందాము. ఈ రెండు కూడా ఒకే ఊరిలో ఉండటం మరో విశేషం. 







శ్రీ కచ్చభేశ్వర స్వామి ఆలయం, తిరుకచూర్ 

తమిళనాట ప్రసిద్ధి చెందిన నృసింహ క్షేత్రాలలో ఒకటి సింగ పెరుమాళ్ కోయిల్. లోకకంటకుడైన హిరణ్యకశ్యపుని సంహరించిన హరి ఇక్కడ యోగ ముద్రలో త్రినేత్రునిగా దర్శనమిస్తారు. ఇలా స్వామి త్రినేత్రునిగా కనిపించే ఆలయం ఇదొక్కటే ! ప్రతి నిత్యం పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనార్ధం వస్తుంటారు. 
చెన్నై నుండి చెంగల్పట్టు వెళ్లే మార్గంలో ఉన్న సింగపెరుమాళ్ కోయిల్ కి సమీపంలోని చిన్న గ్రామం "తిరుకచూర్". గతంలో కచ్చపూర్, కచ్చోర్, కచూర్ గా పిలువబడి గౌరవ వాచకం "తిరు " చేరికతో తిరుకచూర్ గా నేడు పిలవబడుతున్న ఈ ఊరు "రుద్రగిరి " పాదాల వద్ద ఉన్నది. ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న రెండు విశేష ఆలయాల పౌరాణిక గాధ మరియు చరిత్ర ఒకదానితో మరొకటి  ముడిపడి ఉండటం తెలిసికోవలసిన అంశం. ఈ ఊరి గాధ తొలి యుగం నాటి క్షిరసాగర మధనంతో సంబంధం కలిగి ఉన్నది. ఆలయ ఉత్సవాలు కూడా కలిపే చేస్తారు. కారణం రెండు ఆలయాలు కలిసి ఒకే పడాల్ పెట్ర స్థలంగా గుర్తించడమే !
తిరుకచూర్ కి ఈ పేరు రావడానికి, సర్వేశ్వరుడు ఇక్కడ శ్రీ కచ్చభేశ్వర్ స్వామిగా కొలువు తీరడానికి సంబంధించిన గాధ ఇలా ఉన్నది. 
దేవదానవులు సంకల్పించిన క్షీరసాగర మధనంలో మందర పర్వతం కడలిలో మునిగిపోకుండా సహాయం చేస్తానని వైకుంఠవాసుడు వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోడానికి తగినదిగా భావించిన కూర్మావతారాన్ని ధరించ నిర్ణయించుకొన్నారు శ్రీహరి. తలపెట్టిన పని సక్రమంగా పూర్తి అవ్వడానికి, వాగ్దానభంగ దోషం తగలకుండా ఉండటానికి రుద్రగిరికి వచ్చి కైలాసనాధుని ధ్యానించారట. లోకరక్షకుని ప్రార్ధనను మన్నించిన లయకారుడు ఆయన చేపట్టిన విజయం కలిగేలా, దాని వలన లోకకల్యాణం చేకూరేలా ఆశీర్వదించారు. అలా తాబేలు రూపంలో శ్రీమన్నారాయణుడు తపస్సు చేసి మహేశ్వరుని అనుగ్రహం పొందిన స్థలంగా "తిరుకచూర్"గా  పిలవబడుతోంది. 
ఆలయం వెలుపల కూర్మ పుష్కరణి ఒడ్డున ఉన్న మండప స్థంభం పైన సగం కూర్మ సగం మానవ రూపంలో లింగాన్ని అర్చిస్తున్న శ్రీ మహా విష్ణువు శిల్పాన్ని చూడవచ్చును. 
రెండు ఎకరాల విశాల ప్రాంగణంలో చోళ  రాజులు నిర్మించబడిన ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. రాజగోపురం లేకుండా ఉన్న తూర్పు ద్వారం గుండా ప్రవేశించగానే కనపడే శివలీలా విన్యాస శిల్పాలు ఆకట్టుకొంటాయి. అన్నింటి లోనికి అన్నపూర్ణేశ్వరుడు నయనారులలో ప్రముఖుడైన "సుందరార్" కి స్వయంగా భోజనం పెడుతున్న శిల్పం. 
అరవై మూడు మంది శివ భక్తులైన నయనారులలో తొలి వారిలో ఒకరైన సుందరార్ నిరంతరం శివనామ స్మరణ చూస్తూ ఆలయ దర్శనం చేస్తుండేవారట. అలా పర్యటిస్తూ ఒకనాడు మధ్యహాన్న సమయానికి ఇక్కడికి చేరుకొన్నారట. ఆకలి దప్పలు దహించసాగాయట. కనుచూపు మేరలో మనుష్య సంచారం కనపడలేదట. ఆలయం వద్ద కూర్చొని ఇష్టదైవ ప్రార్ధన చేయసాగరట. కొద్దిసేపటిలోనే ఆలయ పూజారి వెలుపలికి వచ్చి నయనార్ ని సాదరంగా ప్రసాదం స్వీకరించడానికి లోనికి రమ్మని ఆహ్వానించారట. గౌరవ మర్యాదలతో, ఆప్యాయంగా ఆహారాన్ని వడ్డించారట. ఆ క్రమంలో నయనార్ కి ఆయన స్వయం అఖిలప్రియ వల్లభుడన్న నిజం  అర్ధమైనదట. నిజ  భక్తులనే ఆదుకొనే ఆపన్నమూర్తిని కీర్తిస్తూ గానం చేశారట. సంతసించిన స్వామి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించారట. అలా తిరుకచూర్ పడాల్ పెట్ర స్థలంలో శాశ్విత స్థానాన్ని పొందినది. 
మహా మండపం నుండి గర్భాలయానికి చేరుకొనే మార్గం కొంత భిన్నంగా ఉంటుంది. అన్ని ఆలయాలలో సహజంగా రాజద్వారానికి ఎదురుగా ప్రవేశ మార్గ కనపడదు. నిర్మాణానికి దక్షిణంలో ఉన్న మండపం గుండా లోనికి వెళితే ముఖ మండపంలో తొలుత దర్శనం ఇచ్చేది శ్రీ త్యాగరాజ స్వామి. చక్కని అలంకరణలో కనపడతారు ఉత్సవమూర్తి. పక్కనే పడమర ముఖంగా ఉన్న సన్నిధి అమ్మవారు శ్రీ సుందరాంబికై ది. దసరా నవరాత్రులలో అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. త్యాగరాజస్వామికి, అమ్మకి మొక్కి లోనికి వెళితే అక్కడి గోడలన్నీ వివిధ కాలాలకు చెందిన శాసనాలతో నిండి పోయి కనపడతాయి. ఇవన్నీ గతంలో ఈ ఆలయాన్ని పాలకులు విశేషంగా ఆదరించారు అన్న విషయాన్ని తెలుపుతాయి. ఒకటి రెండు తెలుగు శాసనాలు కూడా కనపడటం ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ గోడల క్రింద క్షీరసాగర మధనాన్ని చిన్న చిన్న శిల్పాల రూపంలో మలచారు. 
గర్భాలయంలో శ్రీ కచ్చభేశ్వర స్వామి చెందన కుంకుమ అలంకరణంలో దర్శనమిస్తారు. ఉపాలయాలలో శ్రీ గణపతి, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, నాగలింగం, శ్రీ కాశీవిశ్వనాధ లింగం, శ్రీ నటరాజ స్వామి మరియు తొలి నయనారులైన శ్రీ అప్పర్, సంబంధార్, సుందరార్ మరియు శ్రీ మాణిక్య వాచకర్ ఉపస్థితులై ఉంటారు. వీరి నలుగురిని కలిపి "నల్వర్" అని పిలుస్తారు.   
  
 











గర్భాలయ వెలుపలి గోడలలో వినాయకుడు, లింగోద్భవ మూర్తి,  దుర్గ,బ్రహ్మ ఉంటారు. నవగ్రహ మండపం విడిగా ఉంటుంది. ఈ ఆలయంలో చూడదగ్గ మరో విశేషం ఇరవై ఏడు స్తంభాలతో కూడిన నక్షత్ర మండపం. ఇందులోని ఒక్కో స్థంభం ఒక్కో జన్మనక్షత్రానికి ప్రతీక అని తెలుపుతారు. శ్రీ కూర్మనాధుడు కైలాసనాధుని పూజిస్తున్న శిల్పం మరియు అంజనా పుత్రుడు ఒక చేత్తో లింగాన్ని అర్చిస్తూ మరో చేత్తో  గంట కొడుతున్న అరుదైన శిల్పాలను ఈ మండప స్తంభాల పైన రమణీయంగా మలిచారు. 









ప్రతి నిత్యం ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహాన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఏడు గంటల వరకూ భక్తుల కొరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో రోజుకు నాలుగు పూజలు చేస్తారు. త్రయోదశి నాడు ప్రదోష పూజలు చేస్తారు. 
శివరాత్రికి, నవరాతులలో, గణేశ చతుర్థి, శ్రీ సుబ్రమణ్య షష్టి, తమిళ ఉగాది, దీపావళి, సంక్రాతి పర్వదినాలలో విశేష పూజలుజరుపుతారు . చైత్రమాసంలో పది రోజుల పాటు బ్రహ్మోత్సవాలను, చైత్ర పౌర్ణమి నాడు రథయాత్ర ఘనంగా నిర్వహిస్తారు. 
సింగపెరుమాళ్ కోయిల్ రైల్వే స్టేషన్లో చెంగల్పట్టు వెళ్లే అన్ని లోకల్ సబర్బన్ రైళ్లు ఆగుతాయి. అక్కడ నుండి ఆటోలో తిరుకచూర్ చేరుకోవచ్చును. 

నమః శివాయ !!!!





Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...