31, మే 2022, మంగళవారం

Gundicha Mandir, Puri

                      మూర్తి లేని మందిరం --- గుండీచా


బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం మరియు పూరీ మన భారత దేశానికి నాలుగు దిశలలో నెలకొని ఉన్న దివ్య ధామాలు. ఈ నాలుగు క్షేత్రాల సందర్శనాన్ని " చార్ ధాం " యాత్ర అంటారు. స్వయం పరమాత్మ నడయాడిన ఈ పవిత్ర స్థలాలు యుగాల క్రిందటి పురాణ గాధలతో ముడిపడి ఉన్నాయి. హిందువులు జీవితంలో ఒకసారి అయినా ఈ క్షేత్రాలను సందర్శించాలని అభిలషిస్తారు. ఈ నాలుగు క్షేత్రాల ప్రాధాన్యత, ప్రత్యేకతలను విడివిడిగానే చూడాలి. 
అన్నింటి లోనికి పూరీ క్షేత్రం పూర్తిగా భిన్నమైనది. శ్రీ జగన్నాథ సంస్కృతి సంప్రదాయాలకు కేంద్ర బిందువు అయిన పూరీ క్షేత్రం ఎన్నో విశేషాల సమాహారం. ఋగ్వేదంలో శ్రీ జగన్నాథ క్షేత్ర ప్రస్థానం వివరంగ ఉన్నది. బ్రహ్మ పురాణం, పద్మ పురాణం కూడా నీలాచల క్షేత్ర ప్రాధాన్యత ను తెలుపుతున్నాయి. 
సుందర సాగర తీరంలో ఉన్న ఈ క్షేత్రం లోని ఆలయం, మూలవిరాట్టుల రూపాలు, వారికి చేసే పూజలు, అలంకరణ, సేవలు, నివేదనలు, యాత్రలు అన్నీ ప్రత్యేకమైనవే! మరెక్కడా కనపడనవే! 
అగ్రజుడు శ్రీ బలరాముడు, చెల్లెలు శ్రీ సుభద్రలతో శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీ కృష్ణ భగవానుడు శ్రీ జగన్నాథునిగా కొలువైన ఏకైక క్షేత్రం పూరీ. 
పూరీ క్షేత్రం లో దర్శనమిచ్చే విగ్రహలు రాతివి కావు. దారు శిల్పాలు. అలా అవి స్ధిరంగా, ఎల్లప్పుడూ ఉండేవి కావు. అధిక ఆషాఢ మాసం వచ్చిన సంవత్సరం పాత విగ్రహలను తొలగించి నూతన విగ్రహములను నెలకొల్పుతారు. 
శతాబ్దాల క్రిందట నిర్ణయించిన విధానంలో తగిన వృక్షాలను గుర్తించి వాటిని మూర్తులుగా మలుస్తారు. 
నిర్ణయించిన విధానంలో కొత్త మూర్తులలో పాత వాటిలోని "బ్రహ్మ పదార్థం" ని మార్చే ప్రక్రయను  కనులకు గంతులు కట్టుకొన్న ప్రధాన పూజారి నిర్వర్తిస్తారు. వారికి కూడా ఈ బ్రహ్మ పదార్దం ఏమిటో తెలియక పోవడం  ఆశ్ఛర్యకరం. ఈ విగ్రహాల మార్పిడిని " నవ కళేబర ఉత్సవం( యాత్ర)" అంటారు
ఇంతకన్నా ఆశ్చర్యకర వివరం ఏమిటంటే పూరీ ఆలయంలో ప్రత్యేకమైన శ్మశాన వాటిక ఉండటం. బ్రహ్మ పదార్థాన్ని తీసివేసిన విగ్రహములను ఇక్కడ భూస్ధాపితం చేస్తారు. దీనిని " కోయిల్ వైకుంఠం " అంటారు. 
మరో విశేషం ఏమిటంటే పాత విగ్రహలతో పాటు రధాలకు అమర్చిన విగ్రహములను కూడా భూస్ధాపితం చేస్తారు. దీనిని " పాతాళి క్రియ" అంటారు. 
అన్నా చెల్లెలు కొలువైన పూరీ క్షేత్రం లో మూలవిరాట్టు లకు ఎన్నో అలంకరణ లను చేస్తారు. 
నాగార్జున బేష, వామనబేష, నారసింహ బేష, సోనా బేష ఇలా ఎన్నో రకాల అలంకరణ లను చేస్తారు. 
మూలవిరాట్టు లకు చేసే నివేదనలు కూడా మనం ఇండ్లలో ఆరగించే పప్పు, కూరలు లను ప్రత్యేక విధానంలో వండి నివేదన చేస్తారు. నివేదించిన పదార్థాలను ఆలయ ఈశాన్య భాగంలో ఉన్న " ఆనంద బజార్ " లో భక్తులకు విక్రయిస్తారు. కులాలకు అతీతంగా అందరూ వాటిని అక్కటే భుజిస్తారు. " సర్వం జగన్నాథం" అంటారు అందుకే! 
ఒడియా ప్రజలు  జగన్నాథుని తమ కుటుంబ పెద్ద క్రింద స్థిర స్ధానం ఇచ్చారు అనిపిస్తుంది వారు ఆయనను సేవించుకొనే విధానం పరిశీలిస్తే! 
సోదరి సోదరులకు రోజుకొక, నెలకొక ఉత్సవం లేక పర్వదినం పేరిట రకరకాల వేషధారణ లను చేస్తారు. సోనా బేష, నాగార్జున బేష, నారసింహ బేష, వామన బేష ఇలా ఎన్నో! 
పూరీ క్షేత్రం లో నెలకొని ఉన్న అనేక విశేషాలలో అతి ముఖ్యమైనది, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ, ఆకర్షణ కలిగినది శ్రీ జగన్నాథ రధ యాత్ర. 
మూలవిరాట్టులే తరలి వెళ్ళే ఈ యాత్ర గురించిన సమాచారం స్కాంద, బ్రహ్మ, పద్మ పురాణాలలో వివరించబడింది. కాని లభిస్తున్న ఆధారాల ప్రకారం ఈ యాత్ర పన్నెండవ శతాబ్దం నుండి నిర్వహిస్తున్నట్లు తెలియ వస్తోంది. 
మిగిలిన ఆలయాలలో రథోత్సవం అంటే పాత రధానికి మరమ్మత్తులు చేసి, రంగులు వేసి అందంగా అలంకరించి ఉత్సవ మూర్తు లను మాడ లేదా నగర వీధులలో ఊరేగిస్తారు. 
కానీ పూరీలో ప్రతి సంవత్సరం ఏనాడో నిర్ణయించిన విధానంలో కలపకు కావలసిన వృక్షాలను అన్వేషిస్తారు. వాటి తోనే మూడు రధాలను నియనిష్టలతో అక్షయ తృతీయ నాడు ఆరంభిస్తారు.  
మూలవిరాట్టల నూతన విగ్రహ లకు కావలసిన దారువు కొరకు, రథాల తయారీకి కావలసిన కలపను వేల సంవత్సరాల క్రిందట నిర్ణయించిన పద్ధతలతో సేకరిస్తారు. ఈ వృక్షాల కొరకు ప్రత్యేక పూజలు చేసి నయాగడ్ అడవులలో అన్వషించి సేకరిస్తారు. ఒడిషా లో ఎన్నో  అటవీ ప్రాంతాలు ఉన్నాయి. వాటిని కాదనీ నయాగడ్ అడవుల నుండి సేకరించడానికు ఒక ప్రత్యేక కారణం  ఉన్నది. 
శ్రీ జగన్నాథ స్వామి పూరీలో కొలువ తీరడానికి ముందు ఈ అడవులలో, మహనదీ తీరంలో శ్రీ నీల మాధవుడు అన్న పేరుతో స్ధానిక సవరల పూజలు అందుకొనే వారట. అనంతరం పూరీ క్షేత్రం లో స్ధిర పడ్డారు అని స్ధానిక గాధలు వినిపిస్తాయి. నేటికీ నయాగడ్ పట్టణానికి సమీపంలోని " కొంటి" అనే గ్రామంలో పురాతనమైన శీ నీల మాధవ ఆలయం కలదు. ఇదే అసలైన జగన్నాథ మూల పీఠం ఆని అంటారు. 
శ్రీ జగన్నాథ ప్రభువు నందిఘోష్ లో, శ్రీ బలభద్ర స్వామి తాళధ్వజ లో, శ్రీ సుభద్ర దేవి దర్పదళన లో ఉపస్థితులై  శ్రీ క్షేత్రానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండీచా మందిరానికి ఆషాడమాస శుక్లపక్ష ద్వితీయ (విదియ) నాడు బయలుదేరుతారు. రధాలను లాగడానికి లక్షల భక్తులు ముందుకు వస్తారు. 
రథయాత్ర కు ముందు పూరీ క్షేత్రం లో మరో రెండు యాత్రలు జరుగుతాయి. ఈ మూడు యాత్రల మధ్య సంబంధం ఉండటం చెప్పుకోవలసిన విషయం. 

చందన యాత్ర

జగములను ఏలే జగన్నాథుని కి వేసవి తాపం నుండి ఉపశమనం కలిగించడానికి ఉద్దేశించినదే చందన యాత్ర. దీనిని రెండు భాగములుగా నిర్వహిస్తారు. బాహర(వెలుపల) యాత్ర, బిత్తర ( లోపల) యాత్ర. బాహర యాత్ర లో భాగంగా అక్షయ తృతీయ నుండి జగన్నాథ ప్రభువు పరివారంతో కలిసి ఇరవై ఒక్క రోజుల పాటు సాయం సంధ్యా సమయంలో "మహేంద్ర పుష్కరిణి"లో జలవిహరం చేస్తారు. 
ఇరవై రెండో రోజు నుంచి బిత్తర యాత్రలో భాగంగా ఆలయం లోపల మూలవిరాట్టు లకు చందన లేపనం, పుష్పాలంకరణ ఇత్యాది సేవలు జరుపుతారు. 

స్నాన యాత్ర

జేష్ట మాస పౌర్ణమి శ్రీ జగన్నాథ స్వామి జన్మ దినం. పుట్టిన రోజు సందర్భంగా సంవత్సరంలో మొదటి సారి విగ్రహములను రత్న వేదిక నుండి ఆలయ వెలుపల ఉండే " స్నాన బేది " వద్దకు తీసుకొని వస్తారు. వేద మంత్రాలు, మేళతాళాల మధ్య, క్రింద విచ్చేసిన వేలాది భక్తుల సమక్షంలో ఘనంగా నిర్వహిస్తారు స్నాన యాత్ర. 
దీనిలో భాగంగా ప్రాంగణం లోని స్వర్ణ బావి నుండి నూట ఎనిమిది బంగారు కళశాలతో నీరు తెచ్చి స్వామివార్లకు జలాభిషేకం చేస్తారు. స్వర్ణ బావి నీటిని ఈ స్నాన యాత్ర కు మాత్రమే  వినియోగిస్తారట. 
మండు వేసవిలో వేడి గాలుల లో సాయం సమయంలో నౌకా విహరం, స్నానం పేరిట అన్ని బిందెల నీటిలో నానడం వలన అర్చామూర్తులకు అనుకోని అనారోగ్యం కలుగుతుంది. 
వెంటనే వారిని ప్రత్యేక మందిరానికి తీసుకొని వెళ్ళి రాజ వైద్యుల ఆద్వర్యంలో పూర్తిగా పథ్యపు ఆహరం అయిన పాలు, పండ్లు, మూలికలను మాత్రమే నివేదన చేస్తారు. ప్రధాన మూర్తులు చికిత్స పొందుతున్న కారణంగా పదిహేను రోజుల పాటు వారి దర్శనం భక్తులకు లభించదు. "అనగా లేక అనవసర కాలం" గా పిలిచే ఈ రోజుల లో స్ధానిక భక్తులు పూరీ క్షేత్రానికి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రహ్మ గిరిలో కొలువైన " శ్రీ అలర్నాధ స్వామి" ని దర్శించుకుంటారు. అది జగన్నాథ దర్శనంతో సమానమని అంటారు. 
జలాభిషేకం వలన, అనారోగ్యం తో పాటు దేహ శోభను వర్ణాలను కోల్పోయిన దారు రూపాలను ప్రకృతి వర్ణాలతో తీర్చిదిద్దుతారు. 
పదహరవ రోజున పూర్తి ఆరోగ్యం తో నూతన శోభతో వెలిగి పోతున్న మూర్తులను తిరిగి రత్న వేదిక మీద ఉప స్థితులను చేస్తారు. నేత్రోత్సవం లేదా నవయవ్వనోత్సవం సందర్భంగా లభించే దేవదేవుని పునః దర్శనానికి వేలాది మంది భక్తులు తరలి వస్తారు. 
నాటికి నూతన రధాల నిర్మాణం పూర్తి అవుతుంది. రధ యాత్ర సన్నాహాలు ఊపందుకొంటాయి. 
ఆషాడ మాస శుక్ల పక్ష విదియ నాడు ఆరంభమయ్యే శ్రీ జగన్నాథ, బలభద్ర, సుభద్రల రధ యాత్ర దశమి నాడు ముగుస్తుంది. అనగా మొత్తం తొమ్మిది రోజులు. రాకపోకలకు పట్టే రెండు రోజులను తీసివేస్తే స్వామివారు ఏడు రోజుల పాటు " గుండీచా మందిరం" లో ఉంటారు. 

ఎవరీ గుండీచా... 

సాగర తీరాన నీలాచల శిఖరాన వైకుంఠ వాసుని ఆదేశాల మేరకు శ్రీ జగన్నాథ ఆలయాన్ని నిర్మించి నది ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన అర్దాంగే గుండీచా దేవి. శ్రీ జగన్నాథుని పట్ల అచంచల భక్తి విశ్వాసాలు ఆమె సొంతం. ఆలయ నిర్మాణం, విగ్రహ తయారీ లలో తనదైన పాత్ర పోషించినదట. ఆలయ పూజలు, ఉత్సవాలు, యాత్రల వెనుక కూడా గుండీచా దేవి పాత్ర గణనీయమైనది అని పూరీ క్షేత్రానికి సంబంధించిన గాధలు తెలుపుతున్నాయి. 
భక్తురాలైన గుండీచా దేవి కోరిక మేరకు పురుషోత్తముడు ఈ మందిరాన్ని ఒక వారం రోజుల పాటు తన తాత్కాలిక విడిదిగా చేసుకుంటున్నారు అని క్షేత్ర గాధలు పేర్కొంటున్నాయి. గుండీచా దేవి నిర్మించడం వలన ఆమె పేరు తోనే పిలుస్తున్నారు. 
ఒడియా భాషలో గుండి అనగా మశూచి అని అర్దమట. ప్రాణాంతక వ్యాధి నుండి కాపాడిన దేవతగా ఆ పేరుతో పిలుస్తున్నారట. 
కొన్న గాధలు గుండీచా ను శ్రీ కృష్ణ భగవానుని పినతల్లి గా ఉదహరిస్తాయి. 
కానీ శ్రీ క్షేత్రానికి, గుండీచా మందిరానికి మధ్యలో "అర్దాసినీ దేవి మరియు శ్రీ కపాల మోచన మహదేవుడు" కొలువైన " మౌసిమా( పిన తల్లి) మందిరం " ఉంటుంది. వీరిరువురూ పూరీ క్షేత్రానికి రక్షకులు. తిరుగు యాత్ర సందర్భంగా శ్రీ జగన్నాథ స్వామి మౌసిమా మందిరం వద్ద ఆగుతారు. ఆమె ఆప్యాయంగా అందించే "పొడ పిట" అనే తీపి వంటకాన్ని ప్రీతిగా స్వీకరిస్తారు. 

గుండీచా మందిరం

వేణుగోపాల బృందావనంగా పిలవబడే ప్రధాన నిర్మాణం వివిధ జాతుల పుష్పాల మొక్కలను క్రమబద్ధంగా పెంచిన ప్రాంగణం మధ్యలో ఉంటుంది. కళింగ నిర్మాణ పద్దతిలో, దేవుళా శైలిలో ఇసుక రాయితో నిర్మించబడినది. చక్కని శిల్పాలతో నిండిన సభ, నాట్య, భోగ మరియు గర్బాలయాలు వరుసలో ఉంటాయి. ప్రాంగణానికి తూర్పు, పడమరలలో ఉన్న ప్రవేశ,  నిష్క్రమణ ద్వారా లన కలుపుతూ ఎత్తైన దుర్బేధ్యమైన ప్రహరి గోడ నిర్మించబడినది.
ఇరు పక్కలా సింహ రూపాలతో, గోపురం మాదిరి కనపడే స్వాగత శిఖరం తో ఉండే పడమర ద్వారం ప్రధాన ప్రవేశ మార్గం. దీని నుండి పరమాత్ముడు సోదరి, సోదరులతో కలిసి గుండీచా మందిరం లోనికి ప్రవేశిస్తారు. తిరిగి తూర్పు వాకిలి నుండి శ్రీ క్షేత్రానికి వెళతారు. 
సంవత్సరంలో ఈవారం రోజులు తప్పించి గుండీచా మందిరం లోని రత్న వేదిక పైన ఏలాంటి మూర్తులు ఉండవు. ఖాళీగా ఉంటుంది. 
జగత్పాలకుని రాక సందర్భంగా పాడ్యమి నాడు గుండీచా మందిరాన్ని శుభ్రం చేసి పుష్పమాలలతో, విద్యుత్ దీపాలతో రమణీయంగా అలంకరిస్తారు. 
అసలు ఈ సంప్రదాయాన్ని ఆరంభించినది గౌడీయవైష్ణవ స్ధాపకులైన శ్రీ చైతన్య మహ ప్రభువులు అంటారు. నేటికి గౌడీయవైష్ణవులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 
నిరంతరం శ్రీ జగన్నాథ నామస్మరణ చేసే శ్రీ చైతన్య మహా ప్రభువులు ఒక పాడ్యమి నాడు శ్రీ క్షేత్రం లోనికి వెళ్లి అదృశ్యులైనారట. తన ఆరాధ్య దైవం లో ఐక్యం అయ్యారని విశ్వసిస్తారు. 
విదియ నాటి రాత్రికి గుండీచా మందిరం చేరిన లోక సంరక్షకుడు  చెల్లి, అన్నతో కలిసి రధాలలోనే నిద్రిస్తారు. 
తదియ నాడు మేళతాళాలతో, వేద మంత్రాల మధ్య లోకేశుని సాదరంగా గుండీచా మందిరం లోనికి తీసికొని వెళ్లి రత్న వేదిక మీద ఉప స్థితులను చేస్తారు. 
గుండీచా మందిరం లో కొలువు తీరిన అన్నా చెల్లెల దర్శనాన్ని "అడప దర్శనం" అంటారు. ఈ దర్శనం జన్మ జన్మల పాపాన్ని, పాప కర్మను తొలగిస్తుంది అన్న నమ్మకంతో వేలాది మంది భక్తులు ప్రతి నిత్యం వస్తుంటారు. 
వారం రోజుల పాటు గుండీచా మందిరం నూతన శోభను సంతరించుకుంటుంది. శ్రీ జగన్నాథుని దర్శనార్థం విచ్చేసే భక్తుల సందడితో కళకళలాడిపోతుంది. మూలవరులకు నివేదించే నైవేద్యాలను కూడా ఇక్కడే సంప్రదాయబద్దంగా తయారు చేస్తారు. 
హేర పంచమి, రాసలీల, సంధ్యా దర్శనం, చందన లేపనం లాంటి ప్రత్యేక కార్యక్రమాలతో పాటు నిత్య పూజలు, అలంకారాలు ఘనంగా నిర్వహిస్తారు. 
అలా ఏడు రోజుల పాటు గుండీచా మందిరం లో సేద తీరిన సోదరి సోదరులు దశమి నాడు స్వస్ధానానికి తిరుగు ప్రయాణం అవుతారు. 
నవమి నాడు పడమర ద్వారం వద్ద ఉన్న మూడు రధాలను త్రిప్పి తూర్పు ద్వారం వద్ద నిలుపుతారు. 
తిరుగు యాత్ర ను బహుదా (బావడా) యాత్ర అని పిలుస్తారు. బావడా యాత్ర లో కూడా లక్షలాది మంది భక్తులు భక్తి వశ్వాసాలతో పాల్గొంటారు. 
శ్రీ క్షేత్రం చేరిన శ్రీ జగన్నాథ, శ్రీ బలభద్ర, శ్రీ సుభద్రా దేవులు ఏకాదశి నాడు రెండు వందల కిలోల పైచిలుకు స్వర్ణాభరణాలంకరణలో భక్తులకు " సోనా బేష " దర్శనం అనుగ్రహిస్తారు. 
శతాబ్దాలుగా క్రమం తప్పకుండా నిర్ణయించిన రీతి రివాజులను అనుసరిస్తూ లక్షలాది మంది భక్తజనుల మధ్య ఘనంగా జరుగుతుంది శ్రీ జగన్నాథ రధ యాత్ర. 
జై జగన్నాథ!!!! 





Sri Narasimha

                    శ్రీ ఉగ్ర నారసింహ ఆలయం. మద్దూరు 


భారతావనిలో అనేక శ్రీ మహావిష్ణు అవతారాల ఆలయాలు ఉన్నాయి. వాటిల్లో అధికశాతం శ్రీ రామచంద్ర మూర్తివి కాగా రెండో స్థానంలో శ్రీ కృష్ణ ఆలయాలు కనపడతాయి. తరవాత స్థానాలలో కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు, శ్రీ శేషశయన అనంత పద్మనాభుడు, శ్రీ రంగనాధుడు క్షేత్రాలలో కొలువై భక్తులకు దర్శనమిస్తుంటారు. 
కానీ ఖచ్చితంగా మూడో స్థానం మాత్రం శ్రీమన్నారాయణుని నాలుగో అవతారమైన శ్రీ నారసింహ స్వామి వారి ఆలయాలదే !
నారసింహుడు అపమృత్యు భయాన్ని తొలగించేవానిగా ప్రసిద్ధి. అభయ ప్రదాత, భూతప్రేత పిశాచ పీడల నుండి కాపాడే వానిగా, అధైర్యాన్ని అణచివేసి ధైర్యాన్ని అందించే వానిగా స్వామి రూపాన్ని ప్రార్ధిస్తారు భక్తులు. దక్షిణాదిన నృసింహ ఉపాసన, ఆరాధన అధికంగా చెప్పవచ్చును. 
అతి తెలివితో అసాధ్యం అని తలచిన కోరికలను పొంది ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్న దానవుడైన హిరణ్య కశ్యపుని బారి నుండి సమస్త సృష్టిని సంరక్షించడానికి సగం మానవ సగం మృగరాజ రూపంలో అవతరించారు శ్రీ హరి. తన భక్తుడైన ప్రహ్లాదుని మాటలను ఋజువు చేస్తూ సాయంసంధ్యా సమయంలో స్థంభం నుండి ఉద్భవించారు. 
భీకర రూపంతో అసురుని అంతం చేసిన తరువాత ఆగ్రహం చల్లారక అనేక ప్రదేశాలను తిరిగారట స్వామి. ఆలా ఆయన సంచరించినవి  ముప్పై అయిదు ప్రదేశాలు అని అక్కడ  ఆలయాలను నిర్మించినట్లుగా తెలుస్తోంది. యోగ నారసింహునిగా, ఉగ్రనారసింహునిగా, శ్రీ లక్ష్మీ నరసింహునిగా, శ్రీ ప్రహ్లాద వరద నారసింహునిగా స్వామి ఆయా క్షేత్రాలలో దర్శనమిస్తారు
సహజంగా నృసింహుని నివాసాలు గుహలు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తమిళనాడుల లోని ప్రముఖ నరసింహ ఆలయాలు అన్నీ గుహాలలోనే ఉంటాయి. 
వీటికి భిన్నంగా మానవ నిర్మిత సుందర ఆలయాలలో ప్రతిష్ఠిత మూర్తిగా శ్రీ నృసింహుడు కొలువు తీరిన క్షేత్రాలు ఎక్కువగా కర్ణాటక రాష్ట్రంలో కనిపిస్తాయి. హొయసల మరియు విజయనగర రాజులు నిర్మించిన ఈ ఆలయాలు అనేకం నేడు ప్రముఖ దర్శనీయ క్షేత్రాలుగా పేరొందాయి. అలాంటి వాటిల్లో శ్రీ ఉగ్రనారసింహ స్వామి కొలువు తీరిన మద్దూరు ఒకటి. 

క్షేత్ర నామం 

మహాభారత కాలం నాటి గాధతో ముడిపడి ఉన్న ఈ క్షేత్రాన్ని తొలుత "అర్జున పురి" అని పిలిచేవారట. శాసనాలలో కూడా అదే పేరు కనపడుతుంది. కానీ పదహారో శతాబ్దంలో ఇక్కడ ఫిరంగులకు కావలసిన మందుగుండు తయారీ కేంద్రాన్ని స్థాపించారట. మందుగుండు తయారుచేసే ప్రదేశంగా ఇది "మద్దూరు" అని పిలవబడసాగింది. గతంలో కదంబ మహర్షి ఆశ్రమం ఉండటం వలన దీనిని కదంబ క్షేత్రంగా పురాణాలలో పేర్కొన్నారు. 










క్షేత్ర గాధ 

కురుక్షేత్ర సంగ్రామ సమయం సమీపిస్తోంది. కౌరవ పాండవ పక్షాలు యుద్దానికి సిద్దపడుతూ ఎవరి ఏర్పాట్లు వారు చేసుకొంటున్నారు. అలాంటి ఉద్విగ్వభరిత వాతావరణంలో పాండవ పక్ష ప్రధాన వీరుడు అయిన అర్జనుడు చింతాక్రాంతుడయ్యాడు. 
గమనించిన శ్రీ కృష్ణుడు అతనిని తీసుకొని ఈ ప్రాంతాలకు వచ్చి ఏమైనది అని ప్రశ్నించారు.  అర్జనుడు "రాజ్యం కోసం అయినవారితో జరగనున్న పోరు నాలో ఏదో తెలియని ఆందోళన కలిగిస్తోంది. ధైర్యం తగ్గిపోతున్నది. నేను తిరిగి పూర్వపు వీర విజయనునిగా మారాలంటే శత్రుభయంకరమై భక్తుల పాలిట అభయ ప్రసాది అయిన నీ ఉగ్రనారసింహ రూప సందర్శన కలిగించు" అని ప్రార్ధించారు. 
 ఆ సమయంలో అతను ఉన్న పరిస్థితిలో తన రూపాన్ని చూసి తట్టుకోలేడని తలంచిన వాసుదేవుడు. విధాతను తన ఉగ్ర నారసింహ శిలా రూపాన్ని అర్జనునికి చూపించమని కోరారు. బ్రహ్మ దేవుడు దేవశిల్పి విశ్వకర్మ చేత ఆ రూపాన్ని చేయించి పార్థునికి చూపించారు. నేత్రపర్వంగా ఉన్న ఆ రూపాన్ని దర్శించుకొని, పూజించిన పాండవ మధ్యమునిలో యుద్ధం పట్ల నెలకొన్న సంశయాలు, భీతిభయాలు, ఆందోళన తొలగిపోయాయి. 
కురుక్షేత్ర యుద్ధంలో విజయలక్ష్మి పాండవులనే వరించింది. 
అర్జనునికి శ్రీ కృష్ణుడు తన ఉగ్రనారసింహ అర్చారూపాన్ని చూపించిన విషయం తెలుసుకొన్న కదంబ మహర్షి తాను కూడా ఆ రూపాన్ని వీక్షించాలి అన్న కోరికతో ఇక్కడికి వచ్చి వైకుంఠ వాసుని గురించి తపస్సు చేశారట. ఒక నాటి రాత్రి శ్రీహరి ఆయనకు స్వప్న సాక్షాత్కారం ప్రసాదించి దాపుల ఉన్న పుట్టలో తన ఉగ్రనారసింహ రూపం ఉన్నాడని తెలిపారట. 
మహర్షి పుట్టను తొలగించి స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని చూసి తరించారట. అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొన్నారట. ఈ కారణంగా ఈ ప్రదేశాన్ని "కదంబ క్షేత్రం" అని పిలిచేవారట. 

ఆలయ విశేషాలు 

దక్షిణ భారత దేశంలోని ముఖ్యమైన నదులలో ఒకటి కావేరి. అనేక ఉపనదులు కావేరినదిలో కలుస్తాయి. వాటిల్లో ముఖ్యమైనది "శింష నది". 
శింష నదీతీరంలో మద్దూర్ లో వెలసిన శ్రీ ఉగ్ర నారసింహ ఆలయాన్నితొలుత ఎవరు నిర్మించారోతెలియదు . కానీ  హొయసల రాజులు శిధిలావస్థలో ఆలయాన్ని పునః నిర్మించారని తెలుస్తోంది. అనంతర కాలంలో విజయనగర రాజులు మరికొన్ని నిర్మాణాలను చేసి ఆలయ నిర్వహణకు కావలసిన కైంకర్యాలను సమర్పించుకొన్నట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. 
ఆలయం రెండు ప్రాకారాలతో తూర్పు ముఖంగా అయిదు అంతస్థుల రాజగోపురంతో ఉంటుంది. హొయసల నిర్మాణం అంటే అద్భుత శిల్పాలకు నిలయాలుగా ప్రసిద్ధి. అదే విధంగా విజయనగర నిర్మాణ శైలి కూడా  ప్రఖ్యాతి.  కానీ ఆ రెండూ కూడా కనిపించవు. చాలా సాదాసీదాగా ఉన్న ఆలయంలో ప్రధాన అర్చామూర్తి, ఉపాలయాలలోని దేవీదేవతలు ప్రత్యేకంగా దర్శనమిస్తారు. 
ప్రధాన ద్వారం గుండా లోనికి ప్రవేశిస్తే మండపం, ధ్వజస్థంభం కనిపిస్తాయి. 
ముఖమండపం నుండి గర్భాలయం చేరుకుంటే ఏడు అడుగుల ఎత్తైన శిలా రూపంలో శ్రీ ఉగ్ర నారసింహ స్వామి ఉపస్థిత భంగిమలో కనిపిస్తారు. 
 ఒడిలో హిరణ్య కశ్యపుని ఉంచుకొని త ఆరు హస్తాలలో ముందు రెండు చేతులతో అసురుని పొట్ట చీల్చి పేగులను దండలుగా  మెడలో అలంకరించు కొంటుంటారు. మిగిలిన నాలుగు చేతులలో మధ్య వాటితో పాశం, అంకుశం, వెనక చేతులలో శంఖం, చక్రం ధరించి ఉంటారు. కనులు విప్పార్చి, నాలుక బయటికి పెట్టి కోరలు కనపడేలా నోరు తెరిచి ఉగ్రత్వం మూర్తీభవించిన ఇలాంటి సంపూర్ణ విలక్షణ ఉగ్ర రూప నారసింహుని మరెక్కడా చూడలేము. 
మూలవిరాట్టు పాదాలకు ఇరు పక్కలా  చేతులు జోడించి గరుత్మండు, ప్రహ్లాదుడు ఉంటారు. 
మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే స్వామివారు నుదిటిన నేత్రంతో త్రినేత్రునిగా దర్శనమివ్వడం. చెంగల్పట్టు సమీపంలోని సింగాపేరుమాళ్ కోవెలలో మూలవిరాట్టు కూడా త్రినేత్రాలతో ఉంటారు. చాలా అరుదైన విషయంగా పేర్కొనాలి. 











ఉపాలయాలు 

ప్రాంగణంలో అనేక ఉపాలయాలు ఉన్నాయి. శ్రీవారి దేవేరులైన భూదేవి శ్రీదేవి ఇక్కడ విడివిడిగా శ్రీ సౌమ్య నాయకి మరియు నరసింహ నాయకి అన్న పేర్లతో పూజలు అందుకొంటుంటారు. సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర మూర్తి మరో ఉపాలయంలో స్థానిక భంగిమలో కనపడతారు. ఇక్కడ విశేషం ఏమిటంటే స్వామివారి పాదాల వద్ద ఉండే హనుమంతుడు అమ్మవారి పాదాల వద్ద ఉండటం. ఇలా కొలువైన ఆంజనేయుని అరుదుగా మాత్రమే చూస్తాము. 
యశోదాదేవి ఒడిలో శయనించి స్థానాన్ని గ్రోలుతున్నఅరుదైన భంగిమలో  బాలకృషుడు మరో ఉపాలయంలో ఉంటారు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు ఇక్కడ శ్రీ శ్రీనివాసదేవర పేరుతొ అభయ హస్తంతో భక్తులను అనుగ్రహిస్తుంటారు. 
పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో ప్రఖ్యాతుడైన శ్రీ నమ్మాళ్వార్, శ్రీ వైష్ణవ గురువైన శ్రీ రామానుజాచార్యులు కూడా ఉపాలయాల్లో ఉంటారు. 
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో నియమంగా రోజుకు ఆరు పూజలు జరుగుతాయి. స్వాతి నక్షత్రం రోజున విశేష పూజలు నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, శ్రీ రామ నవమి, శ్రీ కృష్ణ జన్మాష్టమి, ఇతర హిందూ పర్వదినాలలో ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుపుతారు. 
నృసింహ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 
స్వామికి తిరుమంజనం చేయించిన వివిధ ద్రవాలతో స్నానం చేస్తే సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది అన్నది తరతరాల నమ్మకం. ఎందరో బిడ్డలు లేని దంపతులు ముందుగా తిరుమంజన సేవను జరిపించుకోడానికి వస్తుంటారు. 

శ్రీ వరద రాజ పెరుమాళ్ ఆలయం 

ఈ ప్రాంతాన్ని పాలించే హొయసల రాజు విష్ణువర్ధనుని తల్లి చూపును కోల్పోయిందిట. ఎన్నో వైద్యాలు చేయించినా ఫలితం లేకపోయిందట. అప్పుడు ఇక్కడే స్వామి సేవలో ఉన్న శ్రీ వైష్ణవ ఆచార్యులు శ్రీ రామానుజుల వారి వద్దకు వెళ్లిన రాజు తన తల్లికి తరుణోపాయం తెలుపమని అర్ధించారట. ఆయన ఆమెను కాంచీపురంలో కొలువైన శ్రీ వరదరాజ స్వామి ఆలయంలో నలభై ఎనిమిది రోజులు ప్రదక్షిణాలు చేస్తే దృష్టి వస్తుంది అని చెప్పారట. 
వృద్ధురాలు, చూపు లేదు అంత దూరం ప్రయాణించలేదు. ఎలా అని తలంచిన రాజు తిరిగి ఆచార్యుల సలహా కోరారట. 
ఆయన చెప్పిన ప్రకారం కంచి నుండి నేర్పరులైన శిల్పులను రప్పించి శ్రీ వరద రాజ పెరుమాళ్ ఆలయ నమూనా ప్రకారం శీఘ్రగతిన ఆలయం నిర్మింపచేశారట. అందులో పన్నెండు అడుగుల శ్రీ వరద రాజ స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించారట. 
ఆచార్యులు చెప్పిన ప్రకారం రాజమాత ప్రదక్షిణాలు చేసి చూపును పొందినదట. అందువలన స్వామిని శ్రీ కన్ను వరద రాజ స్వామి అని పిలుస్తారు. 
శ్రీ ఉగ్ర నరసింహ ఆలయం వెనక ఉండే ఈ చిన్న ఆలయంలోని మూలవిరాట్టు విగ్రహం నేత్రపర్వంగా ఉంటుంది. 
మద్దూర్ లోని మరో రెండు ముఖ్య ఆలయాలు శ్రీ విద్యనాథేశ్వర స్వామి మరియు శ్రీ ఆంజనేయ స్వామి వార్లు కొలువైనవి. 
మద్దూర్ కి సమీపంలోనే కొక్కెర బెల్లూరు అనే వలస పక్షుల రక్షణ కేంద్రం కూడా ఉన్నది. 
క్రీస్తు పూర్వం మూడో శతాబ్దానికి చెందిన జైన మందిరం ఒకటి మద్దూర్ లో ఉండటం గతంలో ఇక్కడ జైన మతం అవలంభించారని తెలుస్తోంది . 
ఇన్ని విశేషాలకు నిలయమైన మద్దూర్ మైసూరు మరియు బెంగళూరు నుండి నేరుగా చేరుకోడానికి తగిన రవాణా సౌకర్యాలు ఉన్నాయి. వసతి సౌకర్యాలు తగుమాత్రంగా లభిస్తాయి. 












నమో నారసింహాయ నమః !!!!



 






 

30, మే 2022, సోమవారం

Adhi Tiruvarangam Temple

               శ్రీ రంగ నాథుడు కొలువైన  ఆది తిరువరంగం 


పవిత్ర పాలరు (దక్షిణ పెన్న) నదీ తీరం ఎన్నో విశేష ఆలయాలకు నిలయంగా ప్రసిద్ధి కెక్కినది. నదికి ఉత్తరం మరియు దక్షిణ తీరాలలో శివ, విష్ణు, దేవి, గణేష మరియు సుబ్రమణ్య ఆలయాలు చాలా నెలకొని ఉన్నాయి. అన్నీ కూడా పది శతాబ్దాలకు పూర్వం నిర్మించబడినవి కావడం అన్నిటి పురాణ గాధలు కూడా అనేక పురాతన గ్రంధాలలో పేర్కొని ఉండటం ఇంకా చెప్పుకోదగిన విషయం. 









అలాంటి అనేకానేక ఆలయాల్లో తమిళనాడు  కాళ్లకురిచ్చి జిల్లాలో శ్రీ రంగనాధ స్వామి కొలువైన ఆది తిరువరంగం ఒకటి. కృతయుగం నాటి సంఘటనలతో ముడిపడి ఉన్న ఈ ఆలయం శ్రీ వైష్ణవ దివ్యదేశాల జాబితాలో లేకున్నా కావేరి నది తీరంలో కొలువైన శ్రీ రంగం కన్నా ముందు నుండి ఉన్నది అని అంటారు. 
చిత్రమైన విషయం ఏమిటంటే పాశుర గానాలు చేసి మొత్తం నూట ఎనిమిది దివ్య తిరుపతులను వెలుగు లోనికి తెచ్చిన పన్నిద్దరు ఆళ్వారులలో తిరుమంగై  ఆళ్వారు ఇక్కడ శ్రీ వైకుంఠ వాసుని దర్శనం పొందినట్లుగా తెలుస్తోంది. ఆయన తన పాశురాలలో ఆది తిరువరంగం గురించి ప్రస్థాపించినట్లుగా తెలుస్తోంది. అదే విధంగా మహా బలి చక్రవర్తికి  ఈ క్షేత్రంలో త్రివిక్రముని సాక్షాత్కారం లభించినట్లుగా ఆలయ గాధ తెలుపుతోంది. 
ఆదితిరువరంగం గురించి స్కాంద పురాణంలోని ఉత్తర కాండలో "ఉత్తర రంగ మహత్యం " పేరిట ఉన్నట్లుగా చెబుతారు. 
ఈ క్షేత్రం శ్రీమహావిష్ణువు లోకకళ్యాణార్థం ఎత్తిన అవతారాలలో మొదటిదైన మత్సావతారం తో ముడిపడి ఉన్నది. 










ఆలయ పురాణ గాధ 

 సోముఖుడు అనే దానవుడు సృష్టికర్త బ్రహ్మ దేవుని వద్ద నుండి వేదాలను అపహరించుకొని పోయి సముద్ర గర్భంలో దాక్కున్నాడట. వేదాలు లేకపోవడంతో సృష్టి కార్యం నిలిచిపోయినదట. దిక్కుతోచని విధాత దేవతలు, మహర్షులను తీసుకొని వైకుంఠం వెళ్లి అనంత శయనుని ఆశ్రయించారట. జరిగిన విషయాన్ని అర్ధం చేసుకొన్న లక్ష్మీపతి వారికి అభయం ఇచ్చి తాను మత్స్య రూపం దాల్చి కడలి ప్రవేశం చేశారట. భీకర సమరం తరువాత అసురుని అంతం చేసి విజయవంతంగా వేదాలను తీసుకొని సాగర గర్భం నుండి వెలుపలికి వచ్చారట. ఆయనకు దేవతలు, మహామునులు బ్రహ్మతో కలిసి స్వాగతం పలికి స్తోత్ర పాఠాలు చేశారట. 
లోకరక్షకుడు సృష్టికర్తకు పాలరు నది ఒడ్డున మరోసారి వేదసారం భోధించారట. కమలాసనుడు, దేవతలు, మునులు స్వామికి కృతజ్ఞతలు చెప్పుకొని ఈ పవిత్ర క్షేత్రంలో కొలువు తీరమని అర్ధించారట. శ్రీ మన్నారాయణుని ఆదేశం మేరకు దేవశిల్పి విశ్వకర్మ అద్భుతమైన శ్రీ రంగనాధ స్వామి విగ్రహాన్ని తయారు చేశారట. 
దానిని చతుర్ముఖుడు, దేవతలు ఇక్కడ ప్రతిష్టించారని అంటారు. 
స్వామికి తొలి ఆలయం కూడా దేవతల సారధ్యంలో విశ్వకర్మ నిర్మించాడని తెలుస్తోంది. 

శ్రుతకీర్తి ఉదంతం 

చాలా కాలం తరువాత ఈ ప్రాంతం శ్రుతకీర్తి అనే రాజు పాలన క్రిందకి వచ్చినదట. సువిశాల సామ్రాజ్యాన్ని జనరంజకంగా పాలించేవాడట. అన్నీ ఉన్న రాజ దంపతులకు సంతానం లేదన్న చింత మాత్రం వేధించేదట. బ్రహ్మ మానస పుత్రుడు,త్రిలోక సంచారి అయిన నారద మహర్షి ఒకనాడు శ్రుతకీర్తి ఆస్థానానికి వచ్చారట. సముచిత స్వాగత సత్కార్యాలు, అర్ఘ్యపాద్యాలు సమర్పించుకున్న రాజదంపతులు మహర్షికి తమ వేదనను తెల్పుకొన్నారట. 
ఆయన వారిని ఆది తిరువరంగం లో కొలువైన శ్రీ రంగనాధ స్వామిని మండలం రోజులు సేవించమని తరుణోపాయం తెలిపారట. 
రాజు రాణి మంది మార్బలంతో ఇక్కడికి చేరుకొని నిత్యం పాలరు నదిలో స్నానమాచరించి నియమ నిష్టలతో స్వామివారిని పూజించారట. సంతసించిన స్వామి వారి మనోభీష్టం నెరవేరేలా ఆశీర్వదించారట. కొంతకాలంలోనే వారికి ఒకరి తరువాత ఒకరుగా నలుగురు బిడ్డలు జన్మించారట. 
ఆనందంతో శ్రుతకీర్తి మహారాజు ఆలయానికి ఎన్నో కైకార్యాలను సమర్పించుకోవడమే కాకుండా ఆజన్మాంతం శ్రీ రంగనాథుని సేవించుకొన్నారట. 







చంద్రుని శాప ఉపశమనం 

వెన్నెల రేడు అయిన చంద్రుడు దక్ష ప్రజాపతి ఇరవై ఏడు మంది కుమార్తెలను వివాహం చేసుకున్నారట. అతను వారందరి లోనికి రోహిణి పట్ల కొంత అధిక ప్రేమ చూపడంతో మిగిలిన వారు తట్టుకోలేక తండ్రికి పిర్యాదు చేశారట. కోపంతో వెనుక ముందు చూడని దక్షుడు అల్లుని క్షీణించి నశించి పొమ్మని శపించాడట. 
అనుకోని ఉపద్రవానికి  ఇరవై ఏడు మంది తారకాలు, చంద్రుడు హతాశులై పోయారట. అప్పుడు నారద మహర్షి భూలోకం లోని ఆది తిరువరంగంలో కొలువైన శ్రీ రంగనాధ స్వామిని సేవించుకొంటే శాప భారం నుండి విముక్తి కలుగుతుంది అని సలహా ఇచ్చారట. 
మహర్షి సలహా మేరకు భూలోకం వచ్చిన చంద్రుడు స్వామి వారి ఆలయంలో ఒక పుష్కరణి ఏర్పాటు చేసుకొని ఏకాగ్రతతో నారాయణ మంత్ర జపంలో నిమగ్నమై పోయారట. అతని దీక్షకు సంతసించిన శ్రీహరి దర్శనమిచ్చి ప్రజాపతి ఇచ్చిన శాపాన్ని తొలగించడం ఎవరి వల్లా కాదు. కానీ దాని నుండి ఉపశమనం కలిగించవచ్చును అని చంద్రుని కైలాసనాధుని శిరస్సుని అలంకరించమన్నారట. సర్వేశ్వరుని శిరస్సున ఉన్నందున చంద్రుడు పదిహేను రోజులు క్షీణించడం, పదిహేను వృద్ధి చెందసాగాడు. అలా చంద్ర కళలు ఏర్పడ్డాయి. వాటితోపాటు అమావాస్య, పౌర్ణమి కూడా. అలా శశాంకుని ధరించడం వలన పరమేశ్వరుడు శశిధరునిగా పేరొందారు.  

ఆలయ విశేషాలు 

పాలరు నది దక్షిణ తీరంలో  నిర్మించబడిన ఈ ఆలయం సుమారు రెండు ఎకరాల విస్తీర్ణంలో తూర్పు ముఖంగా ఉంటుంది. ప్రవేశ ద్వారానికి రాజగోపురం ఉండదు కానీ అనుసంధానంగా నలుదిక్కులా విస్తరించి ఉన్న పాతిక అడుగుల ఎత్తైన ప్రహరీ గోడ ఉంటుంది. కోట బురుజును తలపిస్తుంది. 
ప్రధాన ద్వారం పైన సుందరమైన శ్రీ రంగనాథుని శిల్పాన్ని మలచి ఉంచారు. రెండు ప్రాకారాలు గల ఈ ఆలయంలో తొలి ప్రాకారంలో చంద్ర పుష్కరణి,నాలుగు స్తంభాల మండపం, శ్రీ విష్ణు పాదం మరియు పాత కాలపు ధాన్యపు గాదె ఉంటాయి. ఆలయ వృక్షం పున్నాగ పూల వృక్షం కూడా ఈ ప్రాకారంలో కనపడుతుంది. 

ధాన్యపు గాదె 

ఇటికలు సున్నంతో నిర్మించబడిన ఈ ఎత్తైన ధాన్యాగారం గతంలో భక్తులు ఆలయ నిర్వహణకు, ప్రసాదాల తయారీకి, యాత్రీకుల భోజనాదుల కొరకు ఇచ్చే ధాన్యంతో నిండి ఉండేదట. ప్రతి రైతు పంట నూర్చగానే తన వంతు భాగంగా కొంత ధాన్యాన్ని స్వామికి సమర్పించుకొనేవారట.  ప్రస్తుతం గతకాలపు వైభవంగా కనపడుతుంది. ఇలాంటి గాదెలు శ్రీరంగం, శ్రీ జంబుకేశ్వరం మరియు పాపనాశనం (తిరునెల్వేలి జిల్లా)ఆలయాలలో నేటికీ కనపడతాయి.  







శ్రీ రంగనాధ స్వామి 

రెండో ప్రాకారానికి దారి తీసే ద్వారం పైన మూడు అంతస్థుల గోపురాన్ని నిర్మించారు. మణి  మండపం, ముఖమండపం మరియు అర్థ మండపం దాటినా తరువాత గర్భాలయం వస్తుంది. 
సుమారు తొమ్మిది అడుగుల మూలికా శిలలతో నిర్మించబడిన శ్రీ రంగనాథ స్వామి మూలవిరాట్టు ఆదిశేషుని పడగల క్రింద శయనించిన భంగిమలో నేత్ర పర్వంగా దర్శనమిస్తుంది. స్వామి వారి తలా క్రింద ధాన్యాన్ని కొలిచేందుకు పూర్వం ఉపయోగించిన  సోల ఉంటుంది. పాదాల వద్ద గరుత్మంతుడు ఎగరడానికి సిద్ధంగా ఉన్న భంగిమలో ఉంటారు. శిరస్సు వద్ద శ్రీ దేవి తాయారు, పాద సేవలో శ్రీ భూదేవి తాయారు కనపడతారు.
స్వామి వారికి అభిషేకాలు ఉండవు. అలంకరణ మాత్రమే చేస్తారు. అభిషేకాలు శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ రంగనాథస్వామి ఉత్సవిగ్రహాలకు నిర్వహిస్తారు.  
పక్కనే ఉన్న మరో తూర్పు ముఖ సన్నిధిలో అమ్మవారి శ్రీ రంగనాయకి స్థానిక భంగిమలో శాంతమూర్తిగా భక్తులను అనుగ్రహిస్తారు. 
ఉపాలయాలలో శ్రీ రామ, శ్రీ ఆంజనేయ, శ్రీ కృష్ణ, శ్రీ వరదరాజ పెరుమాళ్, శ్రీ విష్వక్సేనుడు కొలువై ఉంటారు. 
బ్రహ్మ దేవునికి శ్రీహరి వేదాంతసారం బోధించిన స్థలంగా ప్రసిద్ధికెక్కిన ఆది తిరువరంగంలో  తమ  బిడ్డలకు అక్షరాభ్యాసం చేయించుకోడానికి తల్లితండ్రులు ఎక్కువగా వస్తుంటారు. అదే విధంగా సంతానం లేని దంపతులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారికి పూజలు జరిపించుకొంటుంటారు. 
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది గంటల వరకు భక్తులకు శ్రీవారి దర్శనం లభించే ఈ ఆలయంలో నియమంగా ప్రతి నిత్యం ఆరు సేవలు జరుపుతారు. ప్రతి నెల విశేష పూజలు ఉంటాయి. అన్ని హిందూ పర్వదినాలలో ప్రత్యేక ఉత్సవాలు ఏర్పాటు చేస్తారు. 
అష్టమి, నవమి, ఏకాదశి రోజులలో, ధనుర్మాసంలో పాశుర గానం జరుగుతుంది. 
చైత్ర మాసంలో జరిగే ఆలయ బ్రహ్మోత్సవాలలో రథయాత్ర ప్రత్యేకమైనది. వేలాదిగా భక్తులు తమిళనాడు నుండే కాక కర్ణాటక, కేరళ మరియు ఆంధ్రప్రదేశ్ నుండి కూడా తరలి వస్తారు. 
కాళ్లకురిచ్చి జిల్లాలోని దర్శనీయస్థలాల జాబితాలో ముందు వరుసలో ఉండే ఆది తిరువారంగం క్షేత్రాన్ని విల్లుపురం, తిరుక్కోవిలూర్ మరియు తిరువణ్ణామలై (అరుణాచలం) నుండి రోడ్డు మార్గంలో మానలూర్పేట మీదగా సులభంగా చేరుకోవచ్చును. బస్సులు లభిస్తాయి. వసతి సౌకర్యాలు మాత్రం ఉండవు. 

ఓం నమో నారాయణాయ !!!!   


3, మే 2022, మంగళవారం

Mahabalipuram Temples

             శ్రీ స్థల శయన పెరుమాళ్ క్షేత్రం , మహాబలిపురం 


మహాబలిపురం ఒక ప్రత్యేక చరిత్ర కలిగిన సముద్ర తీర నగరం. క్రీస్తుపూర్వం నాలుగు అయిదు శతాబ్దాల కాలంలోనే అనేక విదేశాలతో వ్యాపార లావాదేవీలు జరిగేవని ఇక్కడ లభించిన ఆ కాలం నాటి నాణాలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 
పల్లవ రాజుల కాలంలో పంచపాండవ రథాలు(ఏక శిల్ప నిర్మాణాలు), సముద్ర తీర ఆలయాలు, శ్రీ స్థల శయన పెరుమాళ్ ఆలయం, శ్రీ భూవరాహ స్వామి ఆలయం ఇలా చాలా ఉన్నాయి. పల్లవులు గుహాలయాలకు ఆద్యులుగా నిలుస్తారు. వారు నిర్మించిన అనేక గుహాలయాలలో సమీపంలోని సాలువకుప్పం లో ఉన్న టైగర్ కేవ్ ఒకటి. 
పాశ్చాత్య యాత్రికుడు, వ్యాపారి అయిన "మార్కో పోలో" మహాబలిపురాన్ని ల్యాండ్ అఫ్ సెవెన్ పగోడాస్ " అని వర్ణించాడు తన యాత్రా విశేషాల గ్రంధంలో. ప్రస్తుతం వాటిల్లో చాల వరకు సముద్రంలో మునిగి పోయాయి. 
ప్రస్తుతం మహాబలిపురంలోని నిర్మాణాలు మొత్తం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నాయి. 

మహాబలిపురం లేదా మామల్ల పురం   

ఈ పేర్ల వెనుక రెండు గాధలు వినపడతాయి. హిరణ్య కశ్యపుని కుమారుడైన బలిచక్రవర్తి పాలించిన ప్రాంతంగా "మహాబలిపురం" అన్న పేరు వచ్చినట్లుగా ఒక కధనం తెలుపుతుంది. రెండో కధనం ప్రకారం పల్లవ రాజైన ఒకటవ నరసింహ వర్మన్ పేరు మీదగా "మామల్ల పురం" అన్న పేరు వచ్చినట్లుగా తెలుస్తోంది. చరిత్రకారులు లభించిన శాసనాలను, పురాతన గ్రంధాలను పరిశీలించిన  తరువాత మామల్ల పురం అన్న పేరును నిర్ధారించారు. 
ఆళ్వారులలో ఒకరైన "తిరుమంగై ఆళ్వార్" కాలం ఎనిమిదో శతాబ్దం. ఈయన రాసిన గ్రంధంలో సముద్ర తీరాన పెద్ద పర్వతం ఉండేదని , దేశ విదేశ నౌకలు నిరంతరం రాకపోకలు సాగించేవని ఉన్నది. సముద్ర వ్యాపారాల కారణంగా మామల్ల పురం అత్యంత ధనిక ప్రాంతంగా వర్ధిల్లుతోంది అని ఆళ్వార్ తన గ్రంధంలో పేర్కొన్నారు. ఆళ్వార్లు పాశురాలలో క్షేత్రాన్ని "తిరుక్కాడల్ మలై " అని సంబోధించారు. అనగా సముద్ర తీరాన పర్వతం మీద ఉన్న ప్రదేశం అని అర్ధం. కాలక్రమంలో పర్వతం సముద్రంలో కలిసి పోయింది అని తెలుస్తోంది. చాలా వరకు గతకాలపు నిర్మాణాలు కడలిలో కలిసిపోయాయి. ప్రస్తుతం మిగిలిన వాటిని పరిరక్షించడానికి భావి తరాల వారికి అందించడానికి కావలసిన చర్యలు చేపడుతున్నారు అధికారులు.  
 పల్లవ రాజుల తరువాత చోళ, విజయనగర రాజులు మహాబలిపురం అభివృద్ధికి విశేష కృషి చేసినట్లుగా తెలుస్తోంది. 

శ్రీ స్థల శయన పెరుమాళ్ ఆలయ పురాణ గాధ  

మామల్ల పురంలో ఉన్న రెండు వైష్ణవ ఆలయాలు కూడా అత్యంత పురాతనమైనవి. వాటిల్లో ఒకటి 
దివ్య దేశమైన శ్రీ స్థల శయన పెరుమాళ్ ది కాగా  రెండవది శ్రీ భూవరాహ మూర్తిది. ఈ ఆలయం ఒకరకంగా సమీపంలోని మరో దివ్య దేశం అయిన"తిరు విదాండాయి"లో కొలువైన శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ తో ముడిపడి ఉండటం విశేషం. 
గతంలో ఇక్కడ "పుండరీకుడు" అనే విష్ణు భక్తుడు నివసించేవారట.ఆయన నిరంతరం హరి నామస్మరణ చేస్తూ దేవదేవుని సేవలో గడిపేవారట. విష్ణువు అలంకార ప్రియుడు కదా ! ఆయనను నిండైన సుందర అలంకరణలో నిత్యం చూసుకోవాలన్న ఆశతో పుండరీకుడు ఒక వనాన్ని, మడుగును ఏర్పాటు చేసుకున్నారట. కొంతకాలానికి కొలను అంతా అనేక వర్ణాల కలువ పూలు వికసించాయట. 
వాటి సౌందర్యం చూసిన పుండరీకుడు ఇవి వైకుంఠ వాసుని సుందర మేనిని అలంకరించ తగినవి రాతి విగ్రహం మీద కాదు అని నిర్ణయించుకొన్నారట. డానికి ఆయన ఎంచుకొన్న మార్గం సముద్రాన్ని తోడటం. సాగరమే తాను వైకుంఠానికి చేరడానికి అడ్డం అనుకున్నాడు ఆయన.  ఉదయాన్నే సముద్ర తీరానికి వెళ్లి తన చేతులతో సాగర జలాలను తీసుకొని దూరానికి విసిరేవారట. చూసిన వారి పిచ్చివాడని అన్నా లెక్క చేయలేదట.  
పుండరీకుని లక్ష్యం ఒకటే వైకుంఠాన్ని చేరాలి  చేతులతో కలువలు అలంకరించాలి. దానిలోని  సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించలేదు. తన ప్రయత్నం ప్రారంభించారు. రోజులు గడుస్తున్నాయి. పుండరీకుడు ప్రయత్నం ఆపలేదు. సముద్రపు నీరు తగ్గలేదు. 
ఒకరోజున నీటిని తోడుతున్న పుండరీకుని వద్దకు ఒక బ్రాహ్మణుడు వచ్చారట. అతని వివరాలను చేస్తున్న పని గురించి అడిగారట. వినయంగా జవాబులిచ్చిన పండరీకుడు ఆయనను మీరు ఎవరు అని అడిగారట.
 దానికి ఆయన  బాటసారిని ఆకలి వేస్తుంటే ఇటు వచ్చాను అని బదులిచ్చారట. 
అతిధి పైగా బ్రాహ్మణుడు. పుండరీకుడు మీరు నా పని చేస్తూ ఉండండి. నేను మీకు భోజనం తెస్తాను అని వెళ్లారట. 
కొంతసేపటి తరువాత భోజనం తీసుకొని వచ్చిన పుండరీకుడు ఆశ్చర్యపోయాడట. కారణం సముద్రపు ఒడ్డున ఇసుకలో సజ్జలోని కలువ పూలను ధరించి పాలకడలిలో మాదిరి శయనించిన శ్రీమన్నారాయణుడు కనపడ్డారట. బ్రాహ్మణుడు లేడు. 
ఆనంద పరవశుడైన భక్త పుండరీకుడు స్తోత్రాలతో స్వామిని స్తుతించి ఇక్కడే శాశ్వితంగా స్థిర నివాసం ఏర్పరచుకోమని అర్ధించారట. 
అతనికి ముక్తిని ప్రసాదించి కోరిక మన్నించి స్థిరపడిపోయారట పన్నగ శయనుడు. 
భుజంగశయనుడైన శ్రీహరి నేల మీద శయనించి దర్శనమిచ్చిన కారణాన స్వామిని "శ్రీ స్థల శయన పెరుమాళ్" అని పిలుస్తారు. మూలవిరాట్టు పాదాల వద్ద పుండరీకుడు ముకుళిత హస్తాలతో నిలబడి ఉంటారు. 
ప్రత్యేక సన్నిధిలో కొలువుతీరి దర్శనమిస్తారు. తాయారు "శ్రీ నీల మంగై తాయారు". 
ఉపాలయాలలో శ్రీ ఆండాళ్ మరియు శ్రీ రామచంద్ర మూర్తి కొలువై ఉంటారు. 
పల్లవులు కట్టించిన ఆలయాన్ని సముద్రుడు కబళించాడని చెబుతారు. ప్రస్తుత ఆలయాన్ని విజయనగర రాజులు కట్టించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. 
పన్నిద్దరు శ్రీ వైష్ణవ గాయక భక్తులైన ఆళ్వారులలో తొలి ముగ్గురు ఆళ్వార్లను కలిపి "ముదల్ ఆళ్వార్" అని అంటారు.  వారు పొయిగై ఆళ్వార్, భూతత్తి ఆళ్వార్ మరియు పేయి ఆళ్వార్. వీరిలో మధ్యవారైన భూతత్తి ఆళ్వార్ ప్రకటితమైనది ఈ క్షేత్రం లోనే !
ఆయన మరియు తిరుమంగై ఆళ్వార్ కలిసి శ్రీ స్థల శయన పెరుమాళ్ ని కీర్తిస్తూ ఇరవై ఏడు పాశురాలను గానం చేశారు. అలా ఈ క్షేత్రం నాట ఎనిమిది దివ్య తిరుపతులలో శాశ్విత స్థానం సముపార్జించుకొన్నది. 

శ్రీ భూవరాహ మూర్తి ఆలయం 

గతంలో ఈ ప్రాంతాన్ని పాలించిన పల్లవ రాజు నిత్యం దగ్గర లోని మరో దివ్య దేశమైన తిరువిదాందై లో కొలువైన శ్రీ నిత్యకళ్యాణ పెరుమాళ్ ( శ్రీ వరాహ మూర్తి) ని నిత్యం సేవించుకొని పేదలకు అన్నదానం చేసేవారట. ఎన్నో సంవత్సరాల పాటు రాజు నియమం తప్పకుండా స్వామి మరియు అన్నదాన సేవ చేశారట. ఆయన భక్తికి  భక్తవత్సలుడు ఆయనను పరీక్షింప నెంచారట. 
ఒకనాడు ఇరువురు వృద్ధ బ్రాహ్మణ దంపతులు సరిగ్గా రాజు తిరు విదాందై బయలుదేరుతున్న సమయంలో వచ్చారట. రాజు వారికీ నమస్కరించి ఏమి కావాలని ప్రశ్నించారట. ఈ వయస్సులో ఎంతో దూరం నుండి నడిచి రావడం వలన అలసి ఆకలితో భాధపడుతున్నామన్నారట వారు. 
మహారాజు వారికి తగిన ఉపచారాలు , అతిధి మర్యాదలు చేసి స్వయంగా తన స్వహస్తాలతో భక్తి భావంతో అన్నం వడ్డించారట. 
అతని సేవాభావనకు సంతసించిన వృద్ధ దంపతులు నిజరూపాలలో దర్శనమిచ్చారట. వారే శ్రీ భూవరాహ మూర్తి శ్రీ మహాలక్ష్మి. మహారాజు తన అదృష్టానికి సంతసించి వారిని అక్కడే కొలువు తీరమని అర్ధించారట. 
ఆలా శ్రీ భూవరాహ మూర్తి ఇక్కడ స్థిరపడ్డారు అని తెలుస్తోంది. మహాబలిపురం లైట్ హౌస్ దగ్గర ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది. చిన్నది కూడా. 
తిరు విదాందై కి ఇక్కడకి ఉన్న ప్రధాన వత్యాసం ఏమిటంటే అక్కడ  వారి ఎడమ పక్కన ఒడిలో కొలువై ఉంటారు. ఇక్కడ కుడి పక్కన తొడపై ఉపస్థితగా శ్రీ మహాలక్ష్మి దర్శనమిస్తారు. 

ఎన్నో విశేష సుందర నిర్మాణాలకు, ఆహ్లాద పరచే సముద్ర తీరానికి  నిలయమైన మహాబలిపురం చేరుకోడానికి చెన్నై నగరం నుండి చక్కని రవాణా సౌకర్యం కలదు. స్థానికంగా ఉండటానికి వివిధ రకాల వసతి సౌకర్యాలు లభిస్తాయి. 

జై శ్రీమన్నారాయణ !!!!





 

 

          శ్రీ రంగనాథ స్వామి ఆలయం, తిరునీరుమలై                


                   అప్ప కుడుత్తాన్ పెరుమాళ్ ఆలయం, కొయిలాడి


బ్రహ్మండ పురాణంలో ఆది రంగంగా ప్రస్ధాపించబడిన దివ్య దేశం తిరుప్పర్ నగర్. స్ధానిక వ్వవహరిక నామం కొయిలాడి. 
శ్రీ రంగంలో కన్నా ముందుగానే వైకుంఠ వాసుడు ఇక్కడ కొలువు తీరారన్న పురాణ గాథ ఆధారంగా ఆది రంగం అన్న పేరు వచ్చింది. 
పెరియ పెరుమాళ్ శ్రీ రంగ నాథుడు కొలువైన శ్రీ రంగంతో ఆరంభమైన శ్రీ వైష్ణవ దివ్య దేశాల వరుసలో ఆరో స్థానంలో ఉన్నది తిరుప్పర్ నగర్. 
కావేరి నది తీరప్రాంతం. పచ్చదనానికి ప్రసిద్ధి. తమిళ నాడు అన్నపూర్ణ గా పేరొందిన ప్రాంతం ఇది. 
మార్గానికి ఇరుప్రక్కల రెండు పాయలుగా చీలి కావేరి, కొల్లిడాం గా పిలవబడుతున్న నదీమతల్లి. 
యాత్రీకులను విస్మయపరిచే ప్రకృతి సోయగం కనపడుతుంది ఇక్కడ. 
తొలి తరం పాండ్య రాజులతో ముడిపడి ఉన్న "అప్ప కుడుత్తాన్ పెరుమాళ్" ఆలయ పురాణ గాథ కూడా తొలి యుగం నాటిదిగా తెలుస్తోంది. 
పురాణ గాథ
హస్తినాపురాన్ని పాలించిన కురు వంశం తో సంబంధ బాంధవ్యాలు గల పురు వంశంలో జన్మించారు " ఉపరిచర వాసు" గా పిలవబడిన పాండ్య రాజు. 
దేవేంద్రునితో గల సన్నిహిత స్నేహంతో దానవులతో జరిగిన యుద్దంలో దేవతల తరుఫున పోరాడి విజయం సాధించాడు పాండ్య రాజు. అతని సహాయానికి ఆనందించిన ఇంద్రుడు గగన మార్గంలో విహరించడానికి అనువైన విమానాన్ని కానుకగా ఇచ్చారట. దానిలో ఉపరితలం మీద విహరించే వానిగా ఉపరిచర వాసు అన్న పేరు పొందాడు పాండ్య రాజు. 
ఈయన ప్రస్తావన మహాభారతంలో ఉన్నది. 
ఒకసారి వేటకు వెళ్ళిన పాండ్య రాజు అనుకోకుండా ఒక బ్రాహ్మణుని మరణానికి కారణం అయ్యారట. దాని మూలాన సంక్రమించిన బ్రహ్మహత్యా దోషం తొలగించుకోవడానికి లయకారుని అనుగ్రహం కొరకు హిమాలయాలలో తీవ్రమైన తపస్సు చేసారట పాండ్య రాజు. సంతసించి ప్రత్యక్షమైన సదాశివుడు మోక్షప్రదాత శ్రీ హరి అని తెల్పి రాజును ఇంద్ర భవన క్షేత్రం లో తపమాచరించమని తెలిపారట. 

ఇంద్ర భవన క్షేత్ర ప్రాధాన్యత

ఒకసారి దేవేంద్రుడు ఐరావతం మీద ఉపస్ధితులై గగనసీమలలో విహరిస్తున్నారట. అదే సమయంలో ఎదురుగా వస్తున్న దూర్వాస మహమునిని గమనించలేదట. ముక్కోపి అయిన మహర్షి అహంకారంతో తనను అవమానించాడు ఇంద్రుడు అని భావించారట. అతి త్వరలో దేవేంద్రుడు తన స్వర్గాధిపత్యాన్ని కోల్పోయి, అరణ్యాలలో నివసించాలని అని శపించి వెళ్లి పోయారట. కొంత కాలానికి అసురులతో జరిగిన యుద్దంలో పరాజయం పొందిన దేవతలు భూలోకం వచ్చారు. విధాత బ్రహ్మ దేవుని సలహ మేరకు ఈ ప్రాంతానికి చేరుకొని వైకుంఠ వాసుని అనుగ్రహం కొరకు తపస్సు ఆరంభించారట. నిత్యపూజల నిమిత్తం ఒక కోనేరు నిరమించారు. అదే ఆలయంలో ఉన్న ఇంద్ర పుష్కరిణి.  
దేవతల తపస్సుకు సంతసించిన శ్రీ హరి, క్షీరసాగర మధనానికి తెర తీసారు. దేవతలకు కూర్మరూపంలోను, మోహిని గాను సహకరించి అమృతం, స్వర్గాధిపత్యం లభింపచేసారు. 
ఇంద్రాది దేవతలు తపస్సు చేసి శ్రీ మన్నారాయణుని ప్రసన్నం చేసుకొన్న స్థలంగా " ఇంద్ర భవన క్షేత్రం " అన్న పేరొచ్చినదట. 
నారాయణ అనుగ్రహం కొరకు శ్రీ మహాలక్ష్మి కూడా కొంతకాలం ఇక్కడ తపస్సు చేసారట. ఈ కారణంగా " తిరుప్పర్ నగర్ " అన్న పేరు వచ్చిందట. కాలక్రమంలో చివరకు " కొయిలాడి " గా పిలువబడుతున్నది. 
బ్రహ్మండ పురాణంలో ఇంద్ర భవన క్షేత్రం ప్రస్తావన ఉన్నట్లు తెలుస్తోంది. వైకుంఠ వాసుడు శ్రీ రంగం కన్నా ముందు నుండి ఇక్కడ కొలువు తీరి ఉన్నారని అంటారు. 
ఇంద్ర భవన క్షేత్రం గురించి మహేశ్వరుడు సవిరంగా తెలిపిన విషయాలను శ్రద్ధగా విన్న ఉపరిచర వాసుకి ఈ క్షేత్ర మహత్యం అవగతమైనదిట. 
పరిపూర్ణ భక్తి వశ్వాసాలతో నిష్టగా గరుడవాహనుని ధ్యానించసాగారట పాండ్య రాజు. నిత్యం వేలాది మంది బ్రాహ్మణులకు అప్పాలతో, పాయసం తో అన్నదానం చేసేవారట. 
ఒకనాడు మధ్యహన్న భోజనానికి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న రాజు వద్దకు ఒక వృద్ద బ్రాహ్మణుడు వచ్చారట. రాజు సాదరంగా ఆహ్వానించి అతిధి మర్యాదలు చేసారట. బ్రాహ్మణుడు "రాజా!  నేను చాలా దూరం నుండి వస్తున్నాను. చాలా ఆకలిగా ఉన్నది. భోజనం పెట్టు" అన్నారట. దానికి రాజు " అయ్యా! బ్రాహ్మణోత్తములు నదికి స్నానానికి వెళ్ళారు. రాగానే వారితో పాటు మీకు కూడా భోజనం పెడతాము " అన్నారట. దానికి ఆయన  "నేను ముసలి వాడిని. ఈ క్షుద్బాధ భరించలేకున్నాను. ఆకలితో నేను మరణిస్తే ఆ పాపం నీకు అంటుతుంది" అన్నారట. 
ఇప్పటికే తెలియక చేసిన పాపం తో చుట్టుకొన్న బ్రాహ్మణ హత్యా దోషం నుండి బయట పడటానికి ఇంత చేస్తున్నాను. మరల ఇంకొకటా అని భయపడిన పాండ్య రాజు వృద్ద బ్రాహ్మణనికి భోజనం పెట్టమని ఆదేశించారట. 
వారిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఆయన వేలాది మంది బ్రాహ్మణుల కొరకు వండిన ఆహారాన్ని పూర్తిగా ఆరగించి ఇంకా తెమ్నన్నారట. ఏమి చేయాలో పాలుపోని రాజు ఆయనను కొద్ది సేపు అప్పాలు ఆరగిస్తూ ఉండమని, ఈ లోపల మరల భోజనాన్ని సిద్దం చేయిస్తానని కోరారట. 
అంగీకరించిన బ్రాహ్మణుడు రాజు చూపిన పర్ణశాల లోనికి అప్పాల పాత్రతో వెళ్ళారట. ఈ లోపల నదికి వెళ్ళిన మిగిలిన బ్రాహ్మణులు కూడా వచ్చారట. విషయం తెలుసుకొన్న అందరూ పర్ణశాల వెలుపల గుమికూడారట. అదే సమయంలో సమీపంలో తపస్సు చేసుకుంటున్న మార్కండేయ మహర్షి అక్కడిక  వచ్చారట. రాజు ఆయనకు విషయం అంతా వివరించి ఆయనతో కలిసి భోజనం సిద్దం అయ్యింది అని తెలపడానికి లోనికి వెళ్ళిన వారికి  అక్కడ పాన్పు పైన అప్పాలను ఆరగిస్తూ శేషశయనుడు దర్శనమిచ్చారట. 
అమిత ఆనందంతో వారు స్వామిని స్తోత్రపాఠాలతో ప్రార్దించారట. ఆయన సంతుష్టుడై ఉపరిచర వాసు బ్రహ్మ హత్యా దోషం నుండి విముక్తి, మార్కండేయ మహర్షి కి యమపాశం నుండి తప్పించుకొనే మార్గం తెలిపి వారి కోరిక మేరకు అక్కడే కొలువుతీరారట. 
అప్పాలను ఆరగించిన స్వామిని "అప్పకుడుత్తాన్ పెరుమాళ్" అని పిలవసాగారు. 

ఆలయ విశేషాలు

తొలి ఆలయాన్ని పాండ్య రాజులు నిర్మించారని తెలుస్తోంది. అనంతరకాలంలో చోళ, విజయనగర, నాయక, మరాఠా రాజవంశాల వారు ఆలయ అభివృద్ధి నిమిత్తం అనేక కైంకర్యాలను సమర్పించుకొన్నారని శాసనాల ద్వారా తెలుస్తోంది. 
పడమర ముఖంగా ఉన్న ఆలయానిక మూడు అంతస్థుల రాజగోపురం ప్రధాన ప్రవేశ ద్వారం మీద నిర్మించబడినది. 
అంత విశేష నిర్మాణాలు లేని ఈ ఆలయంలో గర్భాలయంలో శ్రీ అప్పకుడుత్తాన్ పెరుమాళ్ శయన భంగిమలో దర్శనమిస్తారు. ఉపాలయాలు శ్రీ భూదేవి తాయారు, శ్రీ కోమలవల్లీ తాయారు, శ్రీ విష్వక్సేన, శ్రీ ఆంజనేయస్వామి కొలువై ఉంటారు. 
ప్రధాన అర్చనా మూర్తి తల వద్ద ఒక వెండి పాత్ర ఉంటుంది. ఉపరిచర వాసు ఈ పాత్ర లోనే స్వామికి అప్పాలు అందించారని చెబుతారు. దీనిని అక్షయ పాత్ర క్రింద పరిగణిస్తారు. 
స్వామి వారి శిరస్సు వద్ద మోకాళ్ళ మీద కూర్చొని ఉన్న మార్కండేయ మహర్షి కనిపిస్తారు. 
ఆలయ పూజలు మరియు ఉత్సవాలు
పవిత్ర కావేరి తీరం లోని పంచరంగ క్షేత్తాలైన శ్రీరంగపట్టణం, శ్రీరంగం, వటరంగం, సిర్కాళి, శ్రీ సారంగపాణి ఆలయం, కుంభకోణం తోపాటు కొయిలాడి ఒకటి. 
ఉదయం ఆరు గంటల నుండి మధ్యహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు తెరచి ఉండే ఆలయంలో నియమంగా నాలుగు పూజలు నిర్వహించారు. 
కైశిక ద్వాదశి, ధనుర్మాస పూజలు, అష్టమి, ఏకాదశి రోజులలో ప్రత్యేక పూజలు జరుపుతారు. వైకుంఠ ఏకాదశి విశేషంగా జరుపుతారు. 
ఫాల్గుణ మాసంలో పది రోజుల బ్రహ్మోత్సవాలు రంగ రగ వైభవంగా నిర్వహించెదరు. రథోత్సవం ప్రత్యేకం. 
ఇలా ఎన్నో విశేషాల నిలయమైన కొయిలాడి శ్రీరంగం నుండి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంది. వసతి సౌకర్యాలు లభించవు. తిరుచునాపల్లి లో అన్ని సౌకర్యాలు అందుబాటు ధరలలో లభిస్తాయి. 
ఓం నమో నారాయణాయ!!!!. 

Sri Nithya Kalyana Perumal Temple Divyadesm

      శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయం, తిరువిదాందై 

నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో   అధికశాతం శ్రీ మహా విష్ణువుతన నిజరూపంలో, శ్రీరామునిగా, శ్రీ కృష్ణునిగా, అనంత శయనునిగా, నారసింహునిగా, త్రివిక్రమునిగా దర్శనమిస్తారు. అంటే ఉపస్థిత, స్థానక మరియు శయన భంగిమలలో. 
కానీ శ్రీ వరాహ మూర్తిగా దర్శనమిచ్చే ఏకైక క్షేత్రం తిరువిదాందై. మన రాష్ట్రంతో సహా తమిళనాడు, కర్ణాటక, తమిళనాడు మరియు కేరళ రాష్ట్రాలలో కొన్ని చోట్ల శ్రీ వరాహస్వామి ఆలయాలు ఉన్నాయి. 
ఉత్తర భారత దేశంలో కూడా కొన్ని వరాహ స్వామి ఆలయాలు కనపడతాయి. 
అత్యంత అరుదైన శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయ విశేషాలు తెలుసుకొందాము. 

ఆలయ నామ విశేషాలు 

తాయారు శ్రీ మహా లక్ష్మీ దేవి శ్రీ ప్రసన్న నారసింహుని కుడి లేదా ఎడమ తొడపైన ఉపస్థితురాలై ఉండటం సహజంగా శ్రీ లక్ష్మి నారసింహుని ఆలయాలలో చూస్తుంటాము. ఈ క్షేత్రంలో శ్రీ వరాహ స్వామి అమ్మవారిని తన ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకొని దర్శన మిస్తారు. 
తిరు అనేది తమిళంలో గౌరవ పదం. "శ్రీ" అన్నదానితో సమానం. "ఎడ ఎంతాయి" అంగ ఎడమ పక్కన అని అర్ధం. శ్రీమతిని ఎడమ తొడ మీద ఉంచుకొన్న స్వామి కొలువైన స్థలంగా "తిరు విడ వేన్ తాయి" అని పిలిచేవారట. కాలక్రమంలో "తిరువిదాందై" లేదా "తిరు విదాం డాయి" గా మారింది అంటారు. కళ్యాణ క్షేత్రం అవ్వడం వలన "శ్రీ పురి" అని కూడా పిలుస్తారు. 
మహాబలిపురంలో ఉన్న శ్రీ భూవరాహ స్వామి ఆలయంలో అమ్మవారు స్వామి కుడి తొడ మీద ఉపస్థితులై ఉంటారు. అందువలన ఆ క్షేత్రాన్ని "తిరు వల వెన్ తాయి" అంటారు. 

ఆలయ పురాణ గాధ 

శ్రీ మన్నారాయణుని పరమ భక్తుడైన ప్రహ్లాదుని మనుమడైన  బలి చక్రవర్తి ఈ  ప్రాంతాన్ని పాలించారట. ఆయనకు భూమిని తన కోరల మీద నిలుపుకొని ఉన్న శ్రీ భూ వరాహ స్వామి రూపాన్ని ప్రత్యక్షంగా చూడాలన్న కోరిక కలిగినదట. 
శ్రీ పురి లోని వరాహ తీర్థం చేరుకొని తదేక దీక్షతో తపస్సు ఆరంభించారట బలి. భక్త జన పక్షపాతి అయిన శ్రీ హరి భూవరాహ మూర్తి రూపంలో బలికి దర్శనం ఇవ్వడమే కాకుండా  అతని కోరిక మేరకు ఇక్కడ స్థిరపడినారట. 
కాలక్రమంలో శ్రీవారు భూదేవితో కలిసి ఉన్న ప్రదేశంగా శ్రీపురి ఒక ముని వాటికగా మార్పు చెందినదిట. 

శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ 

శ్రీపురిలో వెలిసిన శ్రీ భూ సమేత వరాహ స్వామి గురించి విన్న "కల్వ మహర్షి" తన మూడువందల అరవై మంది కుమార్తెలతో సహా ఇక్కడికి తరలి వచ్చారట. 
మిగిలిన మునిపుంగముల ద్వారా క్షేత్ర గాధను తెలుసుకొని తాను కూడా ఇక్కడే ఉండదలచారట. 
నిత్యం స్వామిని నియమ నిష్టలతో సేవించుకొంటూ తపస్సు చేసుకొనేవారట కల్వ మహర్షి. 
కాలం తన గతిన తాను నడవసాగింది. కల్వ మహర్షి కుమార్తెలు యుక్తవయస్సుకు వచ్చారట. వారికి తగిన వరుల కోసం అన్వేషణ ప్రారంభించారట మహర్షి. 
ఒకనాడు యాత్రీకుడను అని అంటూ ఒక సుందర యువకుడు శ్రీపురి కి వచ్చాడట. అక్కడి వారు అతను ఉండటానికి తగిన ఏర్పాట్లు చేశారట. వరాన్వేషణలో ఉన్న కల్వ ముని యువకుని వివరాలను తెలుసుకొని యోగ్యుడు అని తలంచి తన కుమార్తెలలో ఒకరిని కళ్యాణం చేసుకోమని కోరారట. 
కానీ అప్పటికే సుందర యవ్వనుని పట్ల ఆరాధనా భావం ఏర్పరచుకొన్న మూడువందల అరవై మంది కన్యలు అతనినే వివాహం చేసుకొంటాము అని పట్టుబట్టారట. చేసేది లేక మహర్షి యువకుని అభిప్రాయం అడిగారట.కన్యలకు అభ్యంతరం లేకపోతే తనకు సమ్మతమే అన్నాడట. 
మిగిలిన ఋషులు కూడా ఇది ధర్మ సమ్మతము అని తెలపడంతో కల్వ మహర్షి తన కుమార్తెలను రోజుకు ఒకరిని ఆ యువకునికి ఇచ్చి కళ్యాణం చేశారట. మూడువందల అరవై రోజులు పూర్తి అయ్యేసరికి కల్వమహర్షి కుమార్తెలు అందరూ ఆ యువకుని భార్యలు అయ్యారట. 
అందరికన్నా చిన్నది అయిన కన్యతో కళ్యాణం పూర్తి అయిన తరువాత యువకుడు తన నిజరూపంలో దర్శనమిచ్చారట. అతను మరెవరో కాదు శ్రీ భూవరాహ స్వామి !
అక్కడి మునులందరూ స్వామిని స్తోత్రపాఠాలతో కీర్తించారు. కల్వ మహర్షికి ఆయన కుమార్తెలకు పట్టరాని ఆనందం కలిగిందట. 
స్వామి అందరినీ ఆశీర్వదించి మూలవిరాట్టులో కలిసిపోయారట. కన్యలు ఒక్క పెద్ద కుమార్తె తప్ప మిగిలిన వారు అందరూ ఒకరిగా మారి   అమ్మవారిలో ఐక్యం అయ్యారట. అందుకనే అమ్మవారిని "అఖిల వల్లీ తాయారు" అని పిలుస్తారు. అలా రోజుకొక కళ్యాణం చేసుకొన్న కళ్యాణ స్వరూపుని శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ అని పిలవసాగారు. కల్వ మహర్షి పెద్ద కుమార్తె "కమల వల్లి తాయారు"గా పిలవబడుతూ ప్రత్యేక సన్నిధిలో కొలువై తీరి ఉంటారు. 

ఆలయ విశేషాలు 

సుందర సాగర తీరాన పచ్చని తోటలతో మనస్సుకు ప్రశాంతతను చేకూర్చే పరిసరాల మధ్య సువిశాల ప్రాంగణంలో నెలకొని ఉంటుంది తిరు విదాందాయి ఆలయం. సుమారు ఏడో శతాబ్దంలో పల్లవులు కట్టించిన ఆలయాన్ని పదకొండవ శతాబ్ద కాలంలో చోళరాజుల పునః నిర్మించారు. 
స్వాగత ద్వారం దాటినా తరువాత వస్తుంది ఆలయ పుష్కరణి వరాహ తీర్థం. దీనిలో స్నానమాచరించిన వారి సర్వ పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ప్రస్తుతం పరిస్థితుల ప్రభావం వలన పాదాలు శుభ్రం చేసుకొని నీటిని శిరస్సున జల్లుకొంటున్నారు. 
పడమర ముఖంగా నిర్మించిన చిన్న ఆలయంలో అంజనా సుతుడు ముకుళిత హస్తాలతో స్వామివారికి అభిముఖంగా స్థానక భంగిమలో దర్శనమిస్తారు. 
ప్రధాన ఆలయ వెలుప ఉన్న మండపం స్థంభాలపైన దశావతారామరియు భాగవత ఘట్టాలను సుందరంగా మలిచారు. 
రాజగోపురం ఉండని ప్రధాన ద్వారం నుండి లోపలి ప్రవేశిస్తే నేరుగా గర్భాలయానికి వెళ్లే మార్గం ఉంటుంది. అక్కడే ధ్వజస్థంభం, బలి పీఠాలు  మరియు వినతా సుతుని సన్నిధి ఉంటాయి. 
సుమారు పది అడుగుల ఏకశిలా రూపంగా, ఎడమ తొడపైన ఉన్న  అమ్మవారిని చూస్తున్నట్లుగా కనపడే శ్రీ భూవరాహ మూర్తి రూపం గంభీరంగా ఉంటుంది. కుడి కాలిని భూమి మీద ఉంచి, ఎడమ పాదాన్ని ఆదిశేషువు పడగల మీద ఉంచి రమణీయ పుష్ప అలంకరణలో ఉత్తర దిశగా చూస్తున్న స్వామి శాంత గంభీర రూపం నేత్ర పర్వంగా ఉంటుంది.  భూముని మోసే కోరలు స్వామి వదనంలో ప్రస్ఫుటంగా కనపడతాయి. 
వరాహ, విష్ణు ఆదిగా గల పురాణాలలో పేర్కొన్న తిరువిదాందాయి ఆలయ ప్రస్తుత స్థితిలో ఉండటానికి పల్లవ, చోళ , విజయనగర మరియు నాయక రాజులు సమర్పించుకొన్న కైకర్యాలు మరియు నిర్మాణాలు అని అనేక శాసనాలు విశదపరుస్తున్నాయి. 

కల్యాణ రూపునకు నిత్యం కళ్యాణమే 

సంవత్సర కాలమంతా కల్యాణాలు చేసుకొన్న శ్రీ నిత్య కళ్యాణ పెరుమాళ్ కు ప్రతి రోజు కళ్యాణ అలంకరణ చేస్తారు. నేత్రపర్వంగా ఉండే ఆ అలంకరణ భక్తుల హృదయాలలో స్వామి రూపాన్ని శాస్వితంగా ముద్రిస్తుంది. 
ఆలయ పరిసరాలలో ఎన్నో పూల దుకాణాలు కనపడతాయి. 
పెద్ద వయస్సు వారు కానీ, మధ్య వయస్కులు కానీ, నవదంపతులు కానీ తిరువిదాందాయి ఆలయం సందర్శించుకొంటే వారికి ఆ రోజు మరో మారు కళ్యాణం జరిగినట్లే !
భక్తులు తీసుకు వచ్చిన పూల దండలను స్వామికి తాకించి భార్యాభర్తల చేత ఆ దండలను మార్పిస్తారు. ఆలయ ప్రాంగణంలో   ఉన్నంత సేపు దండలు తీయరాదు అన్న అలిఖిత నియమం ప్రకారం పూల దండాలు ధరించిన దంపతులు పెళ్లినాటి తలంపులతో సిగ్గుపడుతూ\సంచరిస్తుంటారు. 
ప్రతి నిత్యం ఎందరో నూతన దంపతులు స్వామి దర్శనార్ధం తరలి వస్తుంటారు. 
ఆళ్వార్లలో ఒకరైన తిరుమంగై ఆళ్వార్ శ్రీ భూవరాహ (నిత్య కళ్యాణ)పెరుమాళ్ ని కీర్తిస్తూ పదమూడు పాశురాలను గానం చేశారు. 

ఆలయ ఉత్సవాలు 

ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు తిరిగి సాయంత్రం మూడు నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు భక్తుల సౌకర్యార్ధం ఆలయం తెరచి ఉంటుంది. 
ఆలయంలో నిత్య , వార, పక్ష మరియు మాస ఉత్సవాలను ఆగమాల ప్రకారం జరుపుతారు. చైత్ర మాసంలో ఆలయ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వర్తిస్తారు. 
వైకుంఠ ఏకాదశి, వరాహ జయంతి, శ్రీ రామ నవమి, జన్మాష్టమి, హనుమజ్జయంతి ఇలా అన్ని హిందూ పర్వదినాలను సంప్రాదయపూర్వకంగా నిర్వహిస్తారు. ధనుర్మాసంలో పాశుర గానం జరుగుతుంది. 
నిత్య కళ్యాణం పచ్చ తోరణంగా దర్శనమిచ్చే తిరు విదాం దాయి చెన్నైమహా నగరం లోని కేలంబాక్కం  సమీపంలో "కోవళం" దగ్గర  ఉంటుందీ. ఆలయం దాకా నేరుగా చేరేందుకు చక్కని రహదారి కలదు. 

ఓం నమో నారాయణయః !!!! 
 

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...