29, ఏప్రిల్ 2018, ఆదివారం

Sri Tilai Kali Amman Temple, Chidambaram


 శ్రీ తిలై కాళీ అమ్మన్ ఆలయం, చిదంబరం 



             

వెయ్యి సంవత్సరాల క్రిందట నిర్మించబడిన ఆలయం స్థానికంగానే కాదు రాష్ట్రవ్యాప్తంగా విశేష ఆదరణ కలిగినది. చతుర్ముఖాలతో మరియు ఉగ్రరూపంతో కొలువైన శ్రీ తిలై అమ్మన్ మరియు శ్రీ తిలై కాళీ అమ్మన్ కృపాకటాక్షాల కొరకు మరియు జన్మ నక్షత్రవశాత్తు  సంగ్రమించే ఇబ్బందులులను భక్తులు ప్రతినిత్యం పెద్ద సంఖ్యలో ఈ ఆలయానికి వస్తుంటారు. 












పడమర దిశగా ఉండే శ్రీ తిలై కాళీ అమ్మన్ ఆలయం ఎన్నో ప్రత్యేకతల సమాహారం. ఆది దంపతుల మధ్య నెలకొన్న వివాదం త్రీవ్ర రూపం దాల్చినది. ఇద్దరిలో ఎవరు అధికం అన్న సమస్య తేలడానికి నృత్యాన్ని మాధ్యమంగా ఎంచుకొన్నారు. పోటీ హోరాహోరీగా సాగింది. నటరాజ ఓటమి తప్పదా అన్న శంక వీక్షకులలో తలెత్తినది. ఆ సమయంలో అందరినీ ఆశ్చర్య చకితులను చేస్తూ స్వామి ఊర్ధ్య తాండవ నృత్యం చేయసాగారు. స్త్రీ అయినందున ఆ భంగిమ పెట్టలేక పరాజయాన్ని అంగీకరించింది. కానీ స్త్రీ సహజమైన ఉక్రోషంతో అలిగి భీకరమైన కాళీ రూపం దాల్చినది.












విధాత ఆమెను ఓదార్చి శాంతింపచేశారు. శాంతించినా చతుర్ముఖాలు ధరించి చిదంబర ఆలయానికి దూరంగా వెళ్లి పోయి అక్కడ కొలువు తీరింది. 
కొప్పెరంచింగ అనే చోళరాజుల సేనాధిపతి అమ్మవారి పట్ల అమిత భక్తి విశ్వాసాలు కలిగి ఉండేవాడు. అమ్మవారి దయ వలననే తాను పాలితుని నుండి పాలకునిగా ఎదిగానన్న నమ్మకంతో ప్రస్తుత ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి. 
తదనంతర కాలంలో అనేక మంది పాలకులు, ప్రముఖులు మరియు భక్తులు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేశారు. 















ప్రధాన ద్వారంనికి ముందు మండపాన్ని నిర్మించారు. ఇందులో పెద్ద బలి పీఠం ఉంటుంది. దీని పైన భక్తులు భక్తి ప్రపత్తులతో పసుపు కుంకుమలు జల్లి, నేతి దీపాలను వెలిగిస్తారు.  సహజంగా కనిపించే ధ్వజస్థంభం కనపడదు. ఈ మండపంలో అమ్మవారి లీలల చిత్రపటాలను ఉంచారు. గోపుర ద్వారం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిస్తే ఒక పక్కన విఘ్ననాయకుడు మరో పక్క మయూర వాహనుడు ప్రత్యేక సన్నిధులలో కొలువై దర్శనమిస్తారు. వారికి మొక్కి లోనికి వెళితే ఎదురుగా గర్భాలయంలో స్వర్ణమయ ఆభరణాలను,పుష్పాలను ధరించి ఉపస్థిత భంగిమలో శ్రీ చతుర్ముఖ తిలై అమ్మన్ ప్రశాంత వదనంతో దర్శనం అనుగ్రహిస్తారు. భక్తులు అమ్మవారికి కుంకుమార్చన, పుష్పఅలంకరణ జరిపించుకొంటారు.
















పక్కనే ఉన్న మరో సన్నిధిలో శ్రీ తిలై కాళీ అమ్మన్ ఉగ్రరూపంలో ఎటువంటి అలంకరణ లేకుండా ఉంటారు. తైల అభిషేకం, కుంకుమ అర్చనల ప్రభావంతో మరింత గంభీరంగా కనిపిస్తారు. గ్రహ రీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఆదివారాలు రాహుకాలంలో, పౌర్ణమి లేదా అమావాస్య నాడు కాళీ అమ్మన్ కి తైలాభిషేకం మరియు కుంకుమార్చన జరిపించుకొని, వస్త్రం సమర్పించుకొంటారు. దీనివలన గ్రహ అననుకూలత తొలగిపోతుందని విశ్వసిస్తారు. 
ముఖ్యంగా మఖ నక్షత్రంలో జన్మించిన వారు జన్మదినం, ఆదివారం సాయంత్రం రాహుకాలంలో తిలై కాళీ అమ్మన్ కి తైలాభిషేకం మరియు కుంకుమార్చన జరిపించుకొంటే భావిజీవితం సంతోషమయం అవుతుందని చెబుతారు. ఆలయంలో మఖ నక్షత్ర జన్ములు చేయించుకోవాల్సిన పూజా వివరాలు చెబుతారు.     














గర్భాలయం పైన ఉన్న గజపృష్ఠ విమానానికి ప్రదక్షణ చేసే క్రమంలో గర్భాలయ వెలుపలి గోడలో ఉత్తర ముఖంగా శ్రీ బ్రహ్మ స్వరూపిణి గా పూజలందుకొంటుంటారు. భక్తులు దీర్ఘ సుమంగళత్వాన్ని కోరుకొంటూ నేతి దీపాలు వెలిగిస్తారు. పక్కనే శ్రీ చెండికేశ్వరి సన్నిధి ఉంటుంది. ఈమెకు మొక్కి గోత్రనామాలను చెప్పుకొంటే మనస్సులోని కోరికలు నెరవేరతాయి అని నమ్ముతారు.తూర్పు ముఖంగా శ్రీ నాగవేదస్వరూపిణి కొలువై ఉంటారు. దక్షిణ ముఖంగా 
శ్రీ కదంబవన దాక్షిణారూపిణి గా శ్రీ దక్షిణామూర్తి స్త్రీ వేషధారణలో కనిపిస్తారు. ఇక్కడొక్కచోటే జ్ఞాన ప్రసాద స్వామి ఇలా స్త్రీ రూపంలో కనపడేది. భక్తులు గురువారాలు ప్రత్యేక పూజలు జరిపించుకొని విద్యాజ్ఞానం కొరకు ప్రార్ధిస్తారు. 
పక్కనే సకల విద్యలకు అధిదేవత శ్రీ సరస్వతీ దేవి విద్యాఅంబికగా వీణాపాణిగా కొలువై ఉంటారు. తమ పిల్లలకు చక్కని విద్యాబుద్ధులు ప్రాప్తించాలని అమ్మవారి సమక్షంలో   అక్షరాబ్యాసాలు నిర్వహించుకొంటుంటారు. 























ఈ క్షేత్ర కావలి దేవత భైరవుడు. కానీ భక్తులు నేరుగా భైరవుని దర్శించుకోలేరు. శ్రీ సరస్వతీ దేవి సన్నిధికి ఎదురుగా ఒక కిటికీ ఉంటుంది. దానికున్న రంధ్రాల గుండా భైరవుని వీక్షించాలి. ఇలా ఎందుకు చేయాలో అన్నదాని మీద సరైన సమాచారం లేదు. 
ఆలయ గోడల మీద ఎన్నో తమిళ శాసనాలు కనపడతాయి. అవన్నీ ఆలయ అభివృద్ధికి అనేక మంది రాజులు, భక్తులు సమర్పించుకున్న కైంకర్యాల వివరాలను తెలిపేవిగా తెలుస్తోంది. 
గురువారాలు, అమావాస్య, పౌర్ణమి రోజులలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. నవరాత్రులలో ఎక్కడెక్కడి నుండో భక్తులు తరలి వస్తారు.    
ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల దర్శనార్ధం తెరచి ఉంటుంది. ఈ విశేష ఆలయం చిదంబర నటరాజ స్వామి ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 
చిదంబరం దర్శించుకొని వారు తప్పని సరిగా శ్రీ తిలైకాళీఅమ్మన్ ఆలయ సందర్శించుకోవడం అభిలషణీయం !  










25, ఏప్రిల్ 2018, బుధవారం

Puducherry Temples



                                పుదుచ్చేరి ఆలయాలు 







భారత దేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలన్నీపర్యాటకంగా మంచి గుర్తింపుగలిగినవి. గోవా, అండమాన్ నికోబార్ ద్వీపాలు, చండీగఢ్ ఇలా ప్రతి ఒక్కటి దేశవిదేశాల పర్యాటకులను తమవైన వివిధ రకాల ప్రత్యేకతలతో ఆకర్షిస్తున్నాయి. 
గోవా తరువాత దక్షిణాదిన ఉన్న పుదుచ్చేరి (పాండిచ్చేరి) సుందర సాగర తీరాలతో, విశిష్ట నిర్మాణ శైలిలో ఫ్రెంచి వారి హయాంలో నిర్మించిన ప్రార్థనాలయాలు, గృహాలతో దశాబ్దాలుగా పర్యాటకులను ఆహ్వానిస్తోంది. ముఖ్యంగా బెంగాలీయులు మరియు విదేశీయులు శ్రీ అరబిందో బోధనలకు ప్రభావితులై వస్తుంటారు. 
పుదుచ్చేరిలో ప్రతి ఒక్క హిందువు తప్పక దర్శించుకునే శ్రీ మనకుల మహాగణపతి ఆలయానికి అత్యంత సమీపంలో శ్రీ అరబిందో ఆశ్రమం ఉంటుంది. శ్రీ మహాగణపతి ఆలయం కాక పుదుచ్చేరి నగరంలో ఉన్న పురాతన ప్రముఖ ఆలయాలు మరికొన్ని ఉన్నాయి. అవి శ్రీ వరదరాజ పెరుమాళ్ కోవెల, శ్రీ వేదపురేశ్వర స్వామి, శ్రీ కోకిలాంబాల్ సమేత శ్రీ తిరుకామేశ్వర స్వామి ఆలయం, విల్లియనూర్ (10 కిలోమీటర్లు), శ్రీ జయమంగళ పంచ ముఖ ఆంజనేయ ఆలయం, పంచవటి (పది కిలోమీటర్లు, విల్లుపురం దారిలో) . మనకుల మహాగణపతి ఆలయ విశేషాలు ఈ బ్లాగ్ లో ఉన్నాయి). ఇవే కాకుండా మరెన్నో విశేష ఆలయాలు పుదుచ్చేరి చుట్టుపక్కల చాలా ఉన్నాయి. ప్రముఖ క్షేత్రాలైన చిదంబరం, కుంభకోణం, తిరువణ్ణామలై లను  పుదుచ్చేరి నుండి రైలు లేదా రహదారి మార్గంలో సులభంగా చేరుకోవచ్చును. 
   



శ్రీ వేదపురీశ్వర స్వామి ఆలయం 

శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం పక్కనే అదే మాదిరి రాజగోపురం తో నిర్మించబడినది శ్రీ వేదపురీశ్వర స్వామి ఆలయం. మూడు శతాబ్దాల క్రిందట స్థానిక భక్తులు నిర్మించుకున్న ఈ ఆలయం కూడా కాల ప్రవాహంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నట్లుగా చరిత్ర తెలుపుతోంది. 
పెరుమాళ్ ఆలయం కన్నా విశాలమైన ప్రాంగణం లో నిర్మించబడిన ఈ ఆలయంలో శ్రీ చిందబర నటరాజ, శ్రీ  వీరభద్ర స్వామి,  శ్రీ దక్షిణామూర్తి,శ్రీ వినాయక మరియు శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రమణ్యస్వామి ఉపాలయాలు నెలకొల్పబడినాయి. ఆలయ గోడలు, 























పైకప్పు శివ లీలల వర్ణచిత్రాలతో నిండిపోయి ఉంటాయి. 
గోపురాలన్నీ వర్ణభరితమై దృష్టిని ఇట్టే ఆకర్షిస్తాయి. పార్వతీ అమ్మవారు ప్రత్యేక సన్నిధిలో భక్తులకు దర్శనాన్ని అనుగ్రహిస్తారు. స్వామి శ్రీ వేదపురీశ్వర లింగ రూపంలో గర్భాలయంలో విభూతి, కుంకుమ, చందన లేపనాలతో పుష్ప మాలలను ధరించి కొలువై ఉంటారు. 
భక్తులు తమ జీవితాలు సుఖమయంగా సాగాలన్న ఆకాంక్షతో స్వామివారికి పన్నీరు, విభూతి, చందనం, గంగాజలం, కొబ్బరి నీరుతో అభిషేకం జరిపించుకొంటారు. శివరాత్రీ, కార్తీక మాస పూజలు, వినాయక చవితి, శ్రీ సుబ్రమణ్య షష్టి విశేషంగా నిర్వహిస్తారు. గురువారాలు శ్రీ దక్షిణామూర్తి ప్రత్యేక అభిషేకం,పూజలు జరుగుతాయి. త్రయోదశి నాడు జరిగే ప్రదోష పూజలలో ఎందరో భక్తులు పాల్గొంటారు. 
ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది వరకు భక్తుల కొరకు తెరిచి ఉంటుందీ ఆలయం. 







  












శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం 

ఎనిమిది వందల సంవత్సరాల క్రిందట నిర్మించబడిన ఆలయంఈ   సుదీర్ఘ కాలం లో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. తొలుత మహ్మదీయుల  తరువాత ఫ్రెంచ్ మరియు ఆంగ్లేయుల దండయాత్రలలో శిధిలమైనది. భక్తులు ప్రధాన అర్చనా మూర్తులను 
శత్రువులకు తెలీయకుండా దాచి పెట్టడం జరిగింది. పందొమ్మిదో శతాబ్దంలో తిరిగి పునఃనిర్మించబడిన ఆలయం నేడు ఎంతో సుందరంగా దర్శనమిస్తుంది. 
గర్భాలయంలో శ్రీ వరదరాజ పెరుమాళ్ స్థానిక భంగిమలో శంఖుచక్రాలు, గద ధరించి అభయ ముద్రతో, వర్ణమయ పుష్పాలంకరణతో నేత్రపర్వంగా కనపడతారు. అమ్మవారు శ్రీ పేరిందేవి ప్రత్యేక సన్నిధిలో కొలువు తీరి ఉంటారు. పరివార దేవతలలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ ఆంజనేయుడు విడిగా కొలువై ఉంటారు. స్వామి వారి "ఊంజల్ సేవ" నిమిత్తం ప్రత్యేకంగా మండపం నిర్మించారు. 




















ఆలయ పైకప్పుకు సుందర చిత్రాలను చిత్రీకరించారు. గోడలపైన నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్య దేశాల మూలవిరాట్టుల చిత్ర పటాలను అలంకరించారు. మొత్తం నూటఎనిమిది పెరుమాళ్ళను ఒకే సారి దర్శించుకునే అత్యంత అరుదైన అవకాశం లభిస్తుంది. గోదాపరిణయ చిత్రాలు చాలా సుందరంగా చిత్రించారు. 
శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయంలో శ్రీ రామనవమి, శ్రీ కృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు. 
భక్తులు తమ బిడ్డలకు అన్నప్రాసన శ్రీ వరద రాజ పెరుమాళ్ సమక్షంలో చేసుకోడానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. పెరుమాళ్ కృపతో వారి భావి జీవిత ఉన్నతంగా సాగుతుందని విశ్వసిస్తారు.  భక్తులు గ్రహరీత్యా ఎదురవుతున్న ఇబ్బందుల నుండి బయటపడటానికి స్వామివారికి తిరుమంజనం (అభిషేకం),పాయసం, తులసి మాలలను సమర్పించుకొంటుంటారు. 
ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు తెరిచి ఉండే ఈ ఆలయం మహాత్మా గాంధీ (M G) రోడ్ లో ఉంటుంది. 















పుదుచ్చేరిలోని వాతావరణం కూడా యాత్రీకులకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సముద్ర తీరాన ఎన్నో పురాతన ఫ్రెంచ్ వారి నిర్మాణాలు ఆకర్షిస్తాయి. స్థానికంగా చక్కని వసతి ఆహార సదుపాయాలు లభిస్తాయి. చెన్నై నుండి బస్సులు లభిస్తాయి. మనరాష్ట్రం నుండి కూడా నేరుగా పాండిచ్చేరి కి లేదా దగ్గర లోని విల్లుపురానికి నేరుగా రైలు సౌకర్యం కలదు. 

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...