20, మార్చి 2024, బుధవారం

Sri Bala Koteswara Swami Tempe, Govada,

 

               శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ 


చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలిగించే వాతావరణం. 
అలాంటి ప్రశాంత పరిసరాల మధ్యలో దర్శనమిస్తుంది శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి కొలువైన గోవాడ దివ్య క్షేత్రం.  
మహేశ్వరుడు కొలువైన అనేక దివ్యధామాలు మనకు భారతదేశం నలుమూలలా కనిపిస్తాయి. ఈ ప్రదేశంలో త్రవ్వకాలు జరిపినా శివలింగాలు వెలుగు చూస్తాయి. అంతగా విశ్వేశ్వరుని పట్ల అచంచల భక్తి భావాలు కలిగిన పవిత్ర భూమి మన భారత భూమి. 
శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాలకోటేశ్వర స్వామి ఇక్కడ కొలువు తీరిన గాథ యుగాల క్రిందటిదిగా పేర్కొనాలి. ఈ ఆలయం ఇక్కడ ఏర్పడానికి గల చారిత్రక ఆధారాలను చూద్దాము. 







చారిత్రక నిదర్శనాలు 

గతంలో ఈ ప్రాంతాన్ని చోళుల వంశం లో నుండి విడివడి ఇక్కడ స్థిరపడిన వారు అంటారు. అదే చరిత్రకారులు వీరు కన్నడ ప్రాంతానికి చెందిన పాలకవంశం అయిన చాళుక్య వారసులు అని పేర్కొంటారు. మరికొందరు వీరిని "వెలనాటి చోడులు" అని కూడా పిలుస్తారు. 
చారిత్రక సత్యం ఏది ఏమైనా చందోలు ను రాజధానిగా ఈ ప్రాంతాన్ని పాలించిన వీరు విశాల ప్రాంతాన్ని పాలించారు. తంజావూరు చోళరాజులతో మైత్రి మరియు బంధుత్వాన్ని కలిగి ఉన్నారు. తమ కీర్తిని శాశ్వతంగా నిలిపే ఎన్నో ఆలయాలను ఈ ప్రాంతంలో నిర్మించారు. వాటిల్లో తమ ఆరాధ్య దైవమైన కైలాసనాథుని ఆలయాలు అధికం అని చెప్పాలి. అలాగని వారు ఇతర దేవతారాధనలను అడ్డగించలేదు. అనేక విష్ణు ఆలయాలను, నిర్మించారు. పునరుద్ధరించారు. 
వీరి పాలనలో ఈ ప్రాంతం ఎంత గొప్పగా ఉన్నది అన్న విషయాన్ని ఆ నాటి కావ్యకర్త శ్రీ పాల్కురీ సోమనాధుడు: తన "బసవపురాణం" కావ్యంలో వివరిస్తారు. ఈ ద్విపద కావ్యం లింగాయత్ వ్యవస్థాపకుడు, సంఘసంస్కర్త , కవి మరియు తత్వవేత్త అయిన "శ్రీ బసవేశ్వర" జీవిత గాథను తెలియజేస్తుంది. 
















శ్రీ బసవేశ్వర పరమేశ్వరుని పట్ల తనకు గల భక్తి భావాన్ని "వచన " అనే విధానంలో ప్రజల లోనికి తీసుకొని వెళ్లారు. శివ గాయక భక్తులైన నయనారుల మాదిరి ఈయన కూడా నాటి కన్నడ ప్రాంతంలో ప్రజలను ప్రభావితులను చేయగలిగారు. 
ఇక అసలు విషయానికి వస్తే ఇంతటి ప్రభావాల వలన వెలనాటి చోడులు నిర్మించిన అనేక ఆలయాలు కాలప్రభావంతో మరుగున పడిపోయాయి. భూమిలో కలిసి పోయాయి. 
అలాంటి ఒక ఆలయంలోని లయకారుని లింగమే నేడు గత శతాబ్ద కాలంగా గోవాడలో శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ బాల కోటేశ్వర స్వామిగా పూజలు అందుకొంటున్నది. 
సుమారు వంద సంవత్సరాలకు పూర్వం కీర్తిశేషులు శ్రీ కూచిపూడి తిరుపతి రాయుడు పేరుమోసిన మోతుబరి. అనేక ప్రజల ఉపయోగార్థం మరియు సంక్షేమార్థం అనేక పనులను చేయించేవారు. అలాంటి ఒక కార్యక్రమం చేపట్టారు. నేటి గుంటూరు నగరానికి సమీపంలో ఉన్న బుడంపాడు గ్రామంలో ఒక మంచినీటి చెఱువును తవ్వించడానికి నిర్ణయించారు. తవ్వుతున్నప్పుడు పానువట్టంతో పాటు బ్రహ్మ సూత్రంతో దివ్యకాంతులు వెదజల్లుతూ లింగరాజు లభ్యమయ్యారు. ఏనాటి లింగమో ! చెక్కుచెదరకుండా శోభాయమానంగా దర్శనమివ్వడంతో రాయుడు గారు తమ గ్రామానికి తీసుకొనివచ్చారు. ఆ కాలంలో గోవాడ ఒక బ్రాహ్మణ అగ్రహారం. వేదవేదాంగాలను అభ్యసించిన బ్రాహ్మణోత్తములు నివసించేవారు. వారిని సంప్రదించి 1907 వ సంవత్సరంలో లభించిన ఉత్తమ లింగాన్ని శ్రీ బాల కోటేశ్వర స్వామి పేరిట ప్రతిష్టించారు. క్రమక్రమంగా ఆలయం అభివృద్ధి చెందసాగింది. అనేక నూతన నిర్మాణాలు జరిగాయి. 
1930 వ సంవత్సరం నుండి భక్తులకు లభించిన దివ్యానుభావాల కారణంగా ప్రభలతో అయిదు రోజుల పాటు మహా శివరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. నేటికీ కోటప్పకొండలో సమానమైన ప్రభలు గోవాడలో కనపడతాయి అంటే ఈ ఉత్సవాల వెనుక భక్తుల పాత్రను శ్రీ బాల కోటేశ్వర స్వామి పట్ల వారి భక్తి విశ్వాసాలను అర్ధం చేసుకోవచ్చును. 







 ఆలయ విశేషాలు 

తూర్పు ముఖంగా ఉన్న ప్రధాన ఆలయానికి పడమర వైపున ప్రవేశ ద్వారం ఉంటుంది. పచ్చని పొలాల మధ్య సువిశాల ప్రాంగణంలో అనేక దేవతా మూర్తులు దర్శనమిస్తారు. తూర్పున అయిదు అంతస్థుల రాజ గోపురం నిర్మించారు. 
ప్రాంగణం లోనికి ప్రవేశించగానే శ్రీ వినాయకుడు, శ్రీ జ్ఞాన సరస్వతి దేవి, గౌతమ బుద్ధుడు, శ్రీ షిర్డీ సాయిబాబా, శ్రీ అభయాంజనేయ స్వామి ఉపాలయాలు కనిపిస్తాయి. 
తూర్పువైపున వటవృక్షం క్రింద అనేక నాగ ప్రతిష్టలు ఉంటాయి. రాహుకేతు పూజలకు ప్రసిద్ధి ఈ ఆలయం. మరో పక్కన పద్మాసన భంగిమలో శ్రీ గంగాధరుడు. 
అక్కడే నింగిని తాకేలా ఏర్పాటు చేసిన ధ్వజస్థంభం, బలిపీఠాలు ఉంటాయి. 
విశాల ఆస్థానమండపం పూజాదులు, హోమాలు నిర్వహించడానికి అనువుగా నిర్మించబడినది. నందీశ్వరుడు గర్భాలయంలో లింగరూపంలో ఉన్న శ్రీ బాల కోటేశ్వర స్వామివారి ఆజ్ఞకు ఎదురుచూస్తున్నట్లుగా కనిపిస్తారు. విశేషం ఏమిటంటే చక్కని చందాన, విభూతి, కుంకుమ, పుష్ప అలంకరణలో శ్రీ బాల కోటేశ్వర స్వామి బ్రహ్మ సూత్రం కలిగిన లింగ రూపంలో దర్శనమిస్తారు. 
ఇరుపక్కలా ఉన్నరెండు సన్నిధులలో శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రుడు, శ్రీ  పార్వతీదేవి కొలువై భక్తులను అనుగ్రహిస్తారు. 
శ్రీ బాల కోటేశ్వరస్వామి వారి ఆలయంలో మరో విశేషం కనపడుతుంది.








 
సహజంగా ప్రతి శివాలయంలో నవగ్రహ మండపం ఉండటం విధాయకం. ఇక్కడ కూడా. కాకపోతే మొదటి నుండి లేదు. భక్తులు, ఆలయ పెద్దలు కలిసి 1988లో అష్టకోణ మండపాన్ని నిర్మించి, అందులో నవగ్రహాలను పీఠ, వాహన మరియు సతీ సమేతంగా ప్రతిష్టించారు. ఆ విధంగా  చూస్తే గోవాడలోని నవగ్రహ మండపం ప్రత్యేకమైనది. మండప వెలుపల ప్రత్యేక అద్దాల సన్నిధిలో  వాయస వాహనంతో కలిసి శ్రీ శనేశ్వరుడు దర్శనమిస్తారు. ఏలినాటి, అర్ధాష్టమ శని ప్రభావం ఎదుర్కొంటున్నవారు ప్రత్యేక పూజలు జరిపించుకొంటారు. 

ఆలయ పూజలు మరియు ఉత్సవాలు 

ప్రతినిత్యం నాలుగు పూజలు జరిగే ఈ ఆలయం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహన్నం పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల దర్శనార్ధం తెరిచి ఉంటుంది. 
శ్రీ వినాయక చవితి, శ్రీ సుబ్రహ్మణ్య షష్టి, శ్రీ దేవీ నవరాత్రులు, మహాశివరాత్రి, శ్రీ రామనవమి, శ్రీ హనుమజ్జయంతి, ఉగాది ఆదిగాగల పర్వదినాలలో పెద్దఎత్తున భక్తులు తరలి వస్తారు. 
ముఖ్యంగా అయిదు రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి తిరునాళ్ళు గోవాడ ను జనసముద్రంగా మార్చివేస్తాయి. దూరప్రాంతంలో స్థిరపడిన గ్రామస్థులు శివరాత్రి ఉత్సవాలలో పాల్గొనడానికి వస్తారు. చుట్టుపక్కల గ్రామాలూ, పట్టణాల నుంచి కూడా భక్తులు తిరునాళ్లను చూడటానికి వస్తారు. 
చుట్టూ పచ్చని పంట పొలాలతో ప్రశాంత వాతావరణం మధ్యన దేవతా వృక్షాలుగా కీర్తించబడే మారేడు, జమ్మి, తెల్ల జిల్లేడు, గన్నేరులతో   నిండిన ప్రాంగణం, అనేక దేవీదేవతల స్థిరనివాసం, మహేశ్వరుడు అమ్మవారితో కలిసి కొలువైన దివ్య క్షేత్రం గోవాడ నిరంతరం ఆధ్యాత్మిక సౌరభాలను వెదజల్లుతుంది. 
గోవాడ కు తెనాలి, గుంటూరు, పొన్నూరు నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. వసతి సౌకర్యాల కొరకు తెనాలి లేదా గుంటూరు పట్టణాల మీద ఆధారపడాలి. గోవధకు సమీపంలోని చందోలు లో శ్రీ బగళాముఖీ అమ్మవారి ఆలయం, పొన్నూరులో శ్రీ సాక్షి భావన్నారాయణ స్వామి ఆలయం  ఎత్తైన శ్రీ ఆంజనేయ మరియు శ్రీ గరుత్మంతుని ఆలయాలతో పాటు మరికొన్ని పురాతన ఆలయాలు కూడా ఉన్నాయి. గుంటూరు నుండి పొన్నూరు వెళ్లే దారిలో వచ్చే చేబ్రోలు దేవాలయాల గని. శ్రీ పంచ ముఖ బ్రహ్మ ఆలయంతో సహా అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. 
ఒక ప్రణాళికతో ప్రయాణం చేసినట్లయితే వీటన్నింటినీ ఒక రోజులో దర్శించుకోవచ్చును. 

నమః శివాయ !!!! 














కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...