5, మార్చి 2025, బుధవారం

Sri Bhudevi sridevi Sameta sri Venkateswara swamy Temple, Anantavaram, Guntur district

                      కొండలలో నెలకొన్న కోనేటి రాయడు - 3

గతంలో మనం పావన కృష్ణవేణీ తీరంలో దేవదేవుడు కలియుగవరదుడు శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన రెండు గుహాలయాల గురించి తెలుసుకున్నాము. 
పుణ్య తీర్థ స్థలమైన కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో మరో దివ్య క్షేత్రంలో శ్రీవారు తన పూర్తి దివ్యమంగళ రూపంలోనే కాకుండా ఉభయ తాయారులతో కలిసి కొలువైన మూడవ గుహాలయం విశేషాలు తెలుసుకొందాము. 







క్షేత్ర గాథ 

శ్రీమన్నారాయణుడు కృష్ణాతీరంలో విహరిస్తూ తొలుత జూపూడి లో ఉన్న శ్రీగిరి మీద తరువాత వైకుంఠపురంలో  క్రౌంచగిరి మీద తన అర్చారూపాలలో స్వయంవ్యక్థగా కొలువు తీరారు. అలా విహరిస్తూ స్వామి కర్లపూడి పర్వతం వద్దకు వెళ్ళినప్పుడు ఆ పర్వతకుడు స్వామికి సవినయంగా పాదాభివందనం చేసి కీర్తించి "స్వామీ తమరు నా శిఖరం మీద నివసించాలన్నకోరిక బలంగా ఉన్నది కానీ నేను తమరి స్థిరనివాసానికి తగిన శక్తిమంతుని కాను. సమీపంలోని "అనంతాద్రి" అనంతుని వరం పొందిన వాడు. ఆయన మీరు స్థిరనివాసం ఏర్పరుచుకోడానికి తగిన పర్వతరాజు" అని వినయంగా తెలిపారట. 
సంతసించిన శ్రీనివాసుడు అతనిని ఆశీర్వదించి అనంతగిరి వద్దకు వెళ్లి పర్వత ఈశాన్య భాగంలో గల కొండ గుహలో స్వయంవ్యక్థగా అవతరించారు అన్నది స్థూలంగా క్షేత్రగాథ. 
ఈ ప్రాంతాన్ని పాలించిన పాలకులు అందరూ స్వామివారిని సేవించుకొని కైంకర్యాలు సమర్పించుకొన్నారని తెలుస్తోంది. 









క్షేత్ర విశేషాలు 

ఎత్తైన అనంతాద్రి ఈశాన్య భాగంలో ఉంటుంది ఆలయం. పర్వత పైభాగానికి చేరుకోడానికి సోపానమార్గం, రహదారి కూడా ఏర్పాటు చేశారు. 
పర్వత పాదాల వద్ద శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి, శ్రీ పోతులూరి వీరబ్రహేంద్ర స్వామి ఆలయం ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో దూరప్రాంతాల నుండి వచ్చే భక్తుల సౌకర్యం కొరకు  ప్రతి ఆదివారం అన్నదానం జరుగుతుంది. 
దశాబ్దాలకాలం క్రిందట ఈ దేవస్ధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంవారి ఆధ్వర్యంలోనికి తీసుకొనబడినది. అప్పటి నుండి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. 
ప్రస్తుతం పురాతన మెట్ల మార్గాన్ని పునఃనిర్మిస్తున్నారు. 
మెట్ల మార్గం పక్కన గోడ మీద బ్రహ్మకడిగిన దివ్య  పాదాలను, ఆకాశరాజ పుత్రిక పద్మావతితో శ్రీవారి కల్యాణ చిత్రాలను మనోహరంగా చిత్రించారు. 
ఆలయ ప్రాంగణం విశాలంగా భక్తులు దర్శనానికి వరుసలో నిలబడటానికి, సేదతీరడానికి వీలుగా పెద్ద షెడ్డు నిర్మించడం జరిగింది. 
శ్రీవారు కొలువైన గుహకు అనుసంధానంగా నూతనంగా ఒక ముఖ మండపం నిర్మించారు. గుహాలయం లోనికి ప్రవేశించడానికి ఒక ద్వారం, దర్శనానంతరం తొక్కిసలాట లేకుండా వెలుపలికి రావడానికి మరో ద్వారం ఏర్పాటు చేశారు. ప్రవేశద్వారానికి ఇరుపక్కలా ద్వారపాలకులైన జయవిజయుల విగ్రహాలను ఏర్పాటు చేశారు. 
గుహ ఆదిశేషుని పడగల మాదిరి వంపు తిరిగి స్వామివారికి ఛత్రం పడుతున్నట్లుగా ఉంటుంది. అక్కడే శ్రీహరి ని కీర్తిస్తూ పాశురాలను గానం చేసిన పన్నిద్దరు ఆళ్వార్ల విగ్రహాలను చూడవచ్చును. 
వైకుంఠపురం, జూపూడి ఆలయాలలో స్వామి వారి నేత్రాలు, శంఖుచక్రాలు మరియు తిరునామం మాత్రమే దర్శనం చేసుకొనే అవకాశం మాత్రమే లభిస్తుంది. కానీ ఇక్కడ శ్రీవారి దివ్యమంగళ రూపం సంపూర్ణంగా దర్శించుకునే భాగ్యం భక్తులకు కలుగుతుంది. స్వామి పర్వత గుహలో వెల్లికిలా సేదతీరుతున్న భంగిమలో కనిపిస్తారు. పక్కనే దేవేరులు శ్రీదేవి మరియు భూదేవి కూడా అదే భంగిమలో కొలువై ఉంటారు. 
పక్కనే స్వామివారికి ప్రీతికరమైన "తిరుప్పావై" రచించిన శ్రీ గోదాదేవి (శ్రీ ఆండాళ్)సుందర విగ్రహ రూపంలో దర్శనమిస్తారు. 
గమనించవలసిన విషయం ఏమిటంటే వైకుంఠపురం, జూపూడి మరియు అనంతవరం గుహాలయాలలో శ్రీవారు మీసాలతో దర్శనమివ్వడం !
గుహాలయానికి ఎదురుగా అరుదైన "చిట్టి కేసరి" వృక్షం ఉంటుంది. ఉసిరి కుటుంబానికి చెందిన ఈ వృక్షం ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉన్నదని ఆయుర్వేదశాస్త్రం తెలుపుతోంది. 
ప్రాంగణంలో ఉన్న చిట్టి కేసరి వృక్షాన్ని భక్తులు పూజిస్తారు. సంతానాన్ని ప్రసాదించే సంతాన లక్ష్మీగా విశ్వసిస్తారు. వృక్షానికి పూజచేసి ఊయల కడితే సంతానం లేనివారికి తొందరలోనే సత్సంతానం కలుగుతుంది అన్నది తరతరాల నమ్మకం. 







పూజలు - ఉత్సవాలు 

ప్రతి నిత్యం నిర్ణయించిన ప్రకారం పూజలు జరిగే ఈ క్షేత్రంలో శని మరియు ఆదివారాలలో భక్తుల సంఖ్య విశేషంగా ఉంటుంది. 
ముఖ్యంగా శనివారాలు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. శ్రీ వారిని శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు, శ్రీ సంతాన వేంకటేశ్వరుడు మరియు భక్తాభయ ప్రదాత గా కీర్తిస్తూ ఉంటారు.  భక్తులు తమ మనోభీష్టలను విన్నవించుకోడానికి అదే విధంగా తమ కోర్కెలు నెరవేరినందుకు కృతజ్ఞతగా ముడుపులు చెల్లించుకోడానికి వస్తుంటారు. 
కళ్యాణం కుదిరిన వారు స్వామివారిని వివాహా పత్రిక తో ఆహ్వానించడానికి వస్తారు. సంతానాన్ని పొందినవారు బిడ్డలను శ్రీవారికి చూపించి ఆశీర్వాదం పొందేందుకు వస్తారు. 
అన్ని హిందూపర్వదినాలలో విశేష పూజలు జరుపుతారు. శ్రీవైష్ణవ ఆగమ విధానంలో నిర్ణయించిన ముఖ్య రోజులలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. 
శ్రీ దేవి మరియు భూదేవి సమేతంగా శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన అనంత వరం లో ఫాల్గుణ మాసంలో మహాశివరాత్రి  నుండి ఉగాది వరకు విశేష పర్వదినాలుగా నిర్ణయించి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని సందర్శించుకొని పంటలు బాగా పండినందుకు కృతజ్ఞతగా పొంగలి నివేదన చేస్తారు. వాహనపూజలకు ప్రసిద్ధి ఈ క్షేత్రం. 
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఘనంగా జరుపుతారు. 










ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఆలయాభివృద్ది శీఘ్రగతిన జరుగుతోంది. కొద్దీ కాలంలోనే ఈ క్షేత్రం గొప్పదనం రాష్ట్రమంతా గుర్తిస్తుంది అన్న భరోసా కనపడుతోంది. 
చక్కని పల్లె పరిసరాలు. పచ్చని వాతావరణం. ప్రశాంత ప్రకృతి. ఇలాంటి ఆహ్లాదకర ప్రదేశంలో చరాచర సృష్టికర్త సన్నిధిలో గడపడం నిజంగా మరువలేని జీవితకాల అనుభూతిని ప్రసాదిస్తుంది. 
అనంతవరం ఊరిలో మరో రెండు విశేష పురాతన ఆలయాలు ఉన్నాయి. 
అనంతాద్రికి దిగువన చిన్న గుట్ట మీద శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి దేవాలయం నిర్మించబడినది. సుందర దేవాలయం. 
శివాలయం లేని ఊరు మనరాష్ట్రంలో కనిపించదు. అనంతవరంలో కూడా పురాతన శ్రీ మల్లేశ్వరస్వామి వారి ఆలయం ఉన్నది. ఆలయాన్ని చూడగానే తెలుస్తుంది ఎంత పురాతనమైనదో!








కొన్ని నూతన నిర్మాణాలు జరిగినప్పటికీ పురాతన నిర్మాణశైలి స్పష్టంగా కనపడుతుంది. 
కొత్తగా వినిపిస్తున్న జన్మ నక్షత్ర ఆలయం జాబితాలో ఈ శివాలయం మృగశిర రెండవ పాదంలో జన్మించిన వారు దర్శిస్తే సకల శుభాలు కలుగుతాయని తెలుస్తోంది. 
 ఇన్ని విశేషాలకు నిలయమైన అనంతవరం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో ఉన్నది. గుంటూరు, అమరావతి(పంచారామక్షేత్రం), అమరావతి(రాజధాని), విజయవాడ నుండి రహదారి మార్గంలో సులభంగా చేరుకోవచ్చును. విజయవాడ నుండి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 

నమో వెంకటేశాయ !!!! 

  



 

Sri MUktheshwara swami Temple, Kollipara

                                కోవెలల నిలయం కొల్లిపర 



మన రాష్ట్రంలో ప్రతి గ్రామంలో కూడా ఒకటి రెండు పురాతన ఆలయాలు కనిపిస్తాయి. అన్నీ కూడా వెయ్యి సంవత్సరాల చరిత్రకు సజీవ సాక్షులుగా నిలుస్తున్నాయి. 
ముఖ్యంగా కృష్ణాతీరం విశేష ఆలయాలకు ప్రసిద్ధి. గుంటూరు మరియు కృష్ణా జిల్లాలలో అనేకానేక చరిత్ర ప్రసిద్ధికెక్కిన దేవాలయాలు నెలకొని ఉన్నాయి. 
అలాంటి ఒక చిన్న ఊరు కొల్లిపర. 
గుంటూరు జిల్లాలో ఉన్న కొల్లిపరకు అనేక వందల సంవత్సరాల చరిత్ర ఉండటం చెప్పుకోవలసిన విషయం. ఆ చరిత్రకు నిదర్శనం గ్రామంలో ఉన్న శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి మరియు శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయాలు. 
ఈ రెండు ఆలయాలు గ్రామ ప్రధాన రహదారి మీద  దగ్గర దగ్గరగానే కనిపిస్తాయి. 







శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి ఆలయం 

శ్రీమన్నారాయణుడు లోకసంరక్షణార్ధం ధరించిన అనేకానేక అవతారాలలో జనార్ధన రూపం ఒకటి
మన దేశంలో ముఖ్యంగా దక్షిణ భారత దేశంలో అందులోనూ మనరాష్ట్రంలో మరియు కర్ణాటకలో ఎక్కువగా శ్రీ జనార్దనస్వామి ఆలయాలు కనపడతాయి. 
కేరళ లోని వర్కల ప్రసిద్ధికెక్కిన శ్రీ జనార్ధన స్వామి ఆలయం. అలానే  ఉడిపి జిల్లాలో కూడా ప్రసిద్ధి చెందిన శ్రీ జనార్ధన స్వామి ఆలయం ఎర్మల్ గ్రామంలోఉన్నది . 
మన రాష్ట్రంలో పవిత్ర గోదావరి తీరంలో పౌరాణిక చారిత్రక ప్రసిద్ధి చెందిన నవ జనార్ధన ఆలయాలు కనిపిస్తాయి. 
ఎక్కడ శ్రీ జనార్దనస్వామి కొలువై ఉంటారో ఆ క్షేత్ర పౌరాణిక గాథ త్రిలోక సంచారి, బ్రహ్మ మానస పుత్రుడు, నిరంతర నారాయణ నామస్మరణ చేసే నారద మార్షితో ముడి పడి ఉంటడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. పద్దెనిమిది శ్రీ జనార్ధన స్వామి విగ్రహాలను ప్రతిష్టించారు అని తెలుస్తోంది.  
కొల్లిపర లో కొలువు తీరిన శ్రీ జనార్ధన స్వామి కూడా నారద మహర్షి ప్రతిష్ట అని తెలుపుతోంది ఆలయ గాథ.  
తొలియుగంలో నారద ప్రతిష్ఠిత శ్రీ జనార్ధన స్వామి కి అందుబాటులో ఉన్న గాధల ప్రకారం  కలియుగంలో చాళుక్య రాజులు ఆలయాన్ని నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఆ రోజులలో ఈ ఊరిని జనార్ధన మిట్ట అని పిలిచేవారట. 
పదహారవ శతాబ్ద కాలంలో విజయనగర పాలకులైన శ్రీ సదాశివ రాయలు ఈ ప్రాంతానికి వచ్చారట. విజయనగర పాలకులు శ్రీ వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించేవారు. శిధిలావస్థలో ఉన్న శ్రీ జనార్దనస్వామి ఆలయాన్ని నిర్మించారని శాసనాలు తెలుపుతున్నాయి.  ఆలయ నిర్వహణ నిమిత్తం అనేక కైకార్యాలను, భూములను బ్రాహ్మణులకు దానం ఇచ్చి ఆలయ నిర్వహణ వారికీ అప్పగించారట. ఆ కాలంలో వేద పాఠశాలలతో వేదవిద్యకు ప్రసిద్ధి కెక్కిన  గ్రామాన్ని సదాశివ పురం గా పిలిచేవారట. 
కాలక్రమంలో ఇసుక గుట్టలతో నిండిన ప్రాంతంగా "కొప్పర్ర" గా పిల్లవాడి చివరకు "కొల్లిపర" గా మారింది అంటారు. 
తూర్పు ముఖంగా ఉండే ఈ ఆలయానికి ఎత్తైన రాజగోపురం ఉంటుంది. ఉపాలయాలు లేని చిన్న ప్రాంగణంలో దక్షిణ ముఖంగా శ్రీ అంజనేయస్వామి ఒక సన్నిధిలో ప్రధాన గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి కొలువై ఉంటారు. 
అమ్మవార్ల ప్రతిష్ట అనంతర కాలంలో జరిగినట్లుగా తెలుస్తోంది. 
ఇరుదేవేరులతో సుందర పుష్ప స్వర్ణ ఆభరణాలు, పట్టు పీతాంబరాలు ధరించి నేత్రపర్వంగా శ్రీ జనార్ధన స్వామి దర్శనమిస్తారు. 
శ్రీ వైష్ణవ ఆగమాలు ప్రకారం నిర్ణయించిన పూజలు ప్రాతినిధ్యం నిర్వహిస్తారు. హిందూ పర్వదినాలలో, ధనుర్మాసంలో, వైశాఖ మాసంలో, శ్రీ కృష జన్మాష్టమి, శ్రీ రామనవమి, వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుపుతారు. 
ముఖ్యంగా ఆలయ ఉత్సవాల సంధర్బంగా జరిగే శ్రీవారి కళ్యామహోత్సవాల సమయంలో సుముహర్త సమయానికి ఆలయం మీద రెండు గరుడ పక్షులు ప్రదక్షిణాలు చేస్తాయి. ఇలాంటి విశేషం ఒంగోలుకు సమీపంలోని చదలవాడ గ్రామంలోని శ్రీ రఘునాయక స్వామి ఆలయంలో కూడా కనపడుతుంది. 
శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ జనార్ధన స్వామి ఆలయం పరిహార క్షేత్రం. వివిధ కారణాల వలన వివాహం కానీ అవివాహితులు, సంతానం లేని దంపతులు, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఇక్కడ స్వామి వారి కళ్యాణం చేస్తే అన్నీ కల్యాణప్రదంగా శుభంగా జరుగుతాయన్నది తరతరాల విశ్వాసం. 

శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయం 











 శ్రీ జనార్ధన స్వామి ఆలయానికి సమీపంలో తూర్పు ముఖంగా విశాల ప్రాంగణంలో అనేక దేవీదేవతల సన్నిధులతో అలరారుతుంటుందీ ఆలయం. 
శ్రీ ముక్తేశ్వర స్వామి వారు స్వయంభూ లింగం అని చెబుతారు. 
ప్రస్తుతం ఉన్న ఆలయానికి కలియుగంలో తొలిరూపాన్ని ఇచ్చింది చాళుక్య రాజులకాలంలో అని శాసనాధారాలు తెలుపుతున్నాయి. అనంతరం అనేక మంది రాజవంశాలవారు ఆలయాభివృద్దికి తమ వంతు కృషి చేసారని తెలుస్తోంది. 
ముఖ్యంగా కాకతీయుల కాలంలో ఈ ఆలయ శోభ గొప్పగా ఉండేదట. 
కాకతీయులు శివారాధకులు. వారు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోజులలో ఇక్కడ వీరశైవం బాగా ప్రాచుర్యంలో ఉండేదట. ఆ రోజులలో పెద్ద సంఖ్యలో శివారాధకులు పవిత్ర కృష్ణా తీరానికి తరలి వచ్చారట. అందుకే ఈ ప్రాంతంలోని ప్రతి శివాలయంలో శ్రీ కాలభైరవ మరియు శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఉపాలయం కనపడతాయి. 
తూర్పున ఉన్న ఎత్తైన రాజగోపురాన్ని స్వామివారి భక్తులైన కీర్తి శేషులు శ్రీ ముక్కామల కనకరాయ శర్మ పాకయాజి వంద సంవత్సరాల క్రిందట నిర్మించారు. 
ప్రాంగణం లోనికి ప్రవేశించగానే ఎదురుగా ఎత్తైన ధ్వజస్థంభం, బలిపీఠాలు కనిపిస్తాయి. కనిపించే ఆస్థానమండపం నూతన నిర్మాణం. మండపం పైన స్వయంగా అభిషేకం చేసుకొంటున్న సుందర గంగాధరుని విగ్రహాన్ని  నిలిపారు. ప్రాంగణమంతా దేవతావృక్షాలైన మారేడు, అశ్వద్ధ, వేప, ఉసిరి, జమ్మి చెట్లతో పచ్చదనం పరుచుకొని ఉంటుంది. 
ప్రధాన ఆలయానికి ఉత్తరాన నవగ్రహ మండపం, ఆ వెనుక శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి, నాగ ప్రతిష్టలు, పుట్ట కనిపిస్తాయి. 
గతంలో అన్ని శివాలయాలలో నాగప్రతిష్ఠలు జరిగేవి అన్న విషయాన్ని ప్రాంగణంలో కనిపించే శిల్పాలు స్పష్టం చేస్తాయి. నేటికీ ఈ ఆలయం రాహుకేతు, సర్పదోష మరియు నవగ్రహ పూజలకు ప్రసిద్ధి. అదేవిధంగా ప్రతి మాసశివరాత్రి నాడు శ్రీ లక్ష్మీ గణపతి హోమం, రుద్ర మరియు చండీ హోమాలు భక్తుల కొరకు ఆర్జిత సేవగా జరుపుతారు. 
ఆస్థాన మండపానికి అనుసంధానంగా ఉన్న ముఖమండపం లో ధర్మానికి ప్రతీక, నిరంతర శివసేవలో నిమగ్నమై ఉండే నందీశ్వరుడు ఉపస్థితులై ఉంటారు. ఇక్కడ మూడు సన్నిధులు కనపడతాయి. కాకతీయ ప్రతాపరుద్రుని కాలంలో ముఖమండపం నిర్మాణం జరిగిందని తెలుస్తోంది. స్వయంగా ప్రతాపరుద్రుడు శ్రీ ముక్తేశ్వర స్వామిని సేవించుకొన్నారని కూడా చెబుతారు.  












దక్షిణం వైపున ఉన్న సన్నిధిలో ప్రధమ పూజ్యుడు శ్రీ వినాయకుడు ఉపస్థితులై దర్శనం ఇస్తారు. ఉత్తరం వైపున ఉన్న సన్నిధిలో జగన్మాత శ్రీ పార్వతీదేవి చతుర్భుజాలతో స్థానక భంగిమలో నేత్రపర్వమైన అలంకరణలో భక్తులను కాచే వరదాయనిగా కొలువై ఉంటారు. 
మధ్యలో ఉన్న ప్రధాన గర్భాలయంలో కొద్దిగా ఉత్తరం వైపుకు వాలి ఉండే ఎత్తైన పానువట్టం  మీద చందన , విభూతి,కుంకుమ లేపనలతో పాటు వర్ణమయ పుష్ప అలంకరణలో శ్రీ ముక్తేశ్వర స్వామి లింగరూపంలో నయనానందకరంగా దర్శనాన్ని అనుగ్రహిస్తారు. 
శైవాగమనాల ప్రకారం నిర్దేశించిన నిత్య పూజలు, అభిషేకాలు, అర్చనలు, అలంకారాలు, నివేదనలు జరుగుతాయి. వైశాఖ , కార్తీక మాస పూజలు విశేషంగా నిర్వహిస్తారు. 
మహాశివరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. 
ఉదయం ఆరు నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్ర అయిదు నుంచి రాత్రి ఎనిమిది వరకు ఆలయం తెరిచి ఉంటుంది. 

శ్రీ వీరభద్ర స్వామి ఆలయం 












శ్రీ ముక్తేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉత్తర దిశలో శ్రీ వీరభద్రస్వామి సన్నిధి కనిపిస్తుంది. ఇక్కడే ఈశాన్యంలో కల్యాణ మండపం కూడా నిర్మించబడినది. 
శ్రీ వీరభద్రస్వామి ఆలయ నిర్మాణం సుమారు మూడు శతాబ్దాల క్రిందట జరిగినట్లుగా తెలియవస్తోంది. ఆలయం విడిగా ధ్వజస్థంభం, ముఖమండపం అంతరాలయం కలిగి ఉంటుంది. 
శ్రీ వీరభద్రస్వామి భక్తసులభుడు. భక్తులు ఎవరైతే జాతకరీత్యా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో , నరదృష్టి, నరఘోష సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు స్వామిని నియమంగా సేవించుకొంటే సమస్యలు త్వరితగతిన దూరం అవుతాయన్నది తరతరాల విశ్వాసం. 
శ్రీ భద్రకాళీ శ్రీ వీరభద్ర స్వామి కళ్యాణం కూడా విశేషంగా జరుపుతారు. 
ముఖమండపంలో నందీశ్వరుడు, శ్రీ వినాయకుడు, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దర్శనమిస్తారు. గర్భాలయంలో స్థానక భంగిమలో అష్ట్భజాలతో శాంతి గంభీర రూపంలో కొలువై ఉంటారు. అదే గర్భాలయంలో శ్రీ భద్రకాళీ అమ్మవారు దక్షిణ ముఖంగా భక్తాభీష్ట వరదాయనిగా ఉపస్థితురాలై దర్శనమిస్తారు. 
కొల్లిపరలో శ్రీ ఆంజనేయస్వామి వారి దేవస్థానం, శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ సమేత శ్రీ గోపయ్య స్వమి ఆలయం, శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం కూడా ఉన్నాయి. అత్యంత సమీప గ్రామాలైన తూములూరు, చిలుమూరు, చివలూరు లలో కూడా పురాతన విష్ణు మరియు శివాలయాలు ఉన్నాయి. 
ఇన్ని విశేషాల కొల్లిపర విజయవాడకు, గుంటూరు కు కూడా ముప్ఫై అయిదు కిలోమీటర్లు, తెనాలికి ఇరవై  కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సు సౌకర్యం లభిస్తుంది. కానీ స్వంతవాహనంలో వెళ్లడం వలన దగ్గిరలో ఉన్న గ్రామాలలోని ఆలయాలను దర్శించుకునే అవకాశం ఉంటుంది. 
వసతి సౌకర్యం లేదు. భోజనసదుపాయాలు లభిస్తాయి. 
మన రాష్ట్రంలో గ్రామగ్రామాన ఉన్న పురాతన ఆలయాలను సందర్శిద్దాము. మన ఆలయాల గుర్తింపుకు పాటుపడదాము. మనవైన విశేష ఆలయాల ఖ్యాతి ప్రపంచవ్యాప్తం చేద్దాము. 

నమః శివాయ !!!! 


11, జనవరి 2025, శనివారం

Only One Brahma Temple, Chebrolu

 

శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర  స్వామి ఆలయం   

  
లోకాలను పాలించే త్రిమూర్తులలో లోకరక్షకుడు శ్రీ మహావిష్ణువు, లయకారకుడు శ్రీ సదాశివుడు లోకంలో ఆలయాలలో కొలువుతీరి భక్తుల సేవలు అందుకుంటూ కొలిచిన వారిని కాపాడుతున్నారు. 
కానీ సృష్టికర్త బ్రహ్మదేవునికి ఎక్కడా ఆలయం లేకపోవడం చెప్పుకోవలసిన విషయం. విధాతకు పూజార్హత లేకపోవడానికి సంబంధించి కొన్ని గాధలు వినిపిస్తాయి. అసత్యమాడినందుకు కైలాసనాధుడు ఇచ్చిన శాపం కారణంగా చెబుతారు.  మరో గాథ ప్రకారం త్రిమూర్తులలో ఎవరు గొప్పవారు అన్న విషయాన్నీ కనుగొనడానికి మహర్షుల కోరిక మీద సత్య లోకానికి వెళ్లిన భృగు మహర్షి తనను పట్టించుకోని కమలాసనునికి భూలోకంలో పూజలు ఉండవని శపించారని తెలుస్తోంది. 








ఈ రెండు గాధల సారాంశం ఏమిటంటే బ్రహ్మ దేవువునికి భూలోకంలో పూజలు చేయరు అన్నదే!
చిత్రంగా కొన్ని క్షేత్రాలలో హంసవాహనుడు కొలువై పూజలు అందుకోవడం కనపడుతుంది. వాటిల్లో విశేషమైనది రాజస్థాన్ రాష్ట్రంలోని "పుష్కర" క్షేత్రం. 
అదే విధంగా తమిళనాడు మరియు కేరళలో కొన్ని క్షేత్రాలలో సృష్టికర్త కొలువై ఉండటం కనిపిస్తుంది. 
మన రాష్ట్రంలో కూడా ఒక బ్రహ్మ ఆలయం ఉండటం చెప్పుకోవలసిన విషయం. 
ఈ బ్రహ్మ ఆలయం పద్దెనిమిదో శతాబ్దకాలంలో నిర్మించబడినట్లుగా తెలుస్తోంది. 
ఎవరు ? ఎందుకు ? ఎప్పుడు ? ఈ ఆలయాన్ని నిర్మించారు అన్న విషయాలను తెలుసుకొందాము. 

చేబ్రోలు 

క్రీస్తు పూర్వం నుండి మానవ నాగరికత నెలకొన్న చేబ్రోలు ఒకప్పుడు రాజకీయంగా మరియు ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి చెందిన ప్రదేశంగా అనేక గ్రంధాలూ, పరిశోధనలు, శాసనాలు తెలియచేస్తున్నాయి. క్రీస్తుశకం రెండవ శతాబ్ద కాలంలో శాతవాహన రాజులు వేసిన శాసనాన్ని నేటికీ మనం చూడవచ్చును. 
ఒకప్పుడు లోహపరిశ్రమకు ప్రసిద్దికెక్కి "తామ్ర పురి"గా పిలవబడిన నేటి చేబ్రోలు లో జైన, బౌద్ధ మరియు హిందూ మతాలు ఒకదాని తరువాత ఒకటి వెళ్లి విరిశాయని చెబుతారు. ఇక్కడ జరిపిన త్రవ్వకాలలో లభించిన శతాబ్దాల పూర్వపు జైన, బౌద్ధ మరియు హిందూ నిర్మాణాల అవశేషాలు, నాటి పత్రాలు, శాసనాలు దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. 
క్రీస్తుశకం తొలి శతాబ్దం నుండి ఇక్కడ హిందూ ఆలయాల నిర్మాణాలు వివిధ రాజ వంశాల కాలంలో జరిగినట్లు ఆధారాలు ఎన్నో లభించాయి. ఒకప్పుడు ఇక్కడ నూటికి పైగా ఆలయాలు ఉండేవని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ప్రస్తుతం కొన్ని ఆలయాలు మాత్రమే ఉన్నాయి. 
శ్రీ నాగేశ్వర స్వామి, శ్రీ భీమేశ్వర స్వామి, శ్రీ వీరభద్ర స్వామి మరియు శ్రీ ఆది కేశవ స్వామి ఆలయాలు తొమ్మిది నుండి పదకొండవ శతాబ్ద మధ్య కాలాలలో నిర్మించినట్లుగా ఆధారాలు ఉన్నాయి. 
ముఖ్యంగా ఒకే క్షేత్రంలో త్రిమూర్తులు కొలువై ఉండటం అత్యంత అరుదైన విశేషం. అలాంటి అద్భుతాన్ని మన రాష్ట్రంలో ఒక్క చేబ్రోలులోనే చూస్తాము.







 శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు 

వాసిరెడ్డి వంశానికి చెందిన ఈయన నిజాం మరియు ఆంగ్లేయులకు సామంతునిగా ఉండేవారట. తొలుత నేటి పల్నాడు జిల్లాలోని చింతపల్లి రాజధానిగా ఉండేదట. అనంతరం పంచారామ క్షేత్రాలలో ఒకటైన అమరావతికి మార్చరట. వీరి పరిపాలనా కాలం 1783-1816. 
నిజాం నవాబు మరియు ఈస్ట్ ఇండియా కంపెనీ వారు కూడా వీరి సామర్ధ్యాన్ని ప్రశంసించి అనేక బిరుదులు ఇచ్చారు. 
సుమారు మూడు దశాబ్దాలకు పైగా పాలించిన ఈయన గొప్ప పరిపాలనాదక్షునిగా, కవి పండిత పోషకునిగా పేరుగాంచారు. అనేక ఆలయాలను పునః నిర్మించడం, కొత్త ఆలయాలను నిర్మింపచేయడం. భూ, ధన విరాళాలు ఇవ్వడం చేసారు. 
ఈయన కాలంలో "పిండారీలు" గ్రామాల మీద దాడులు చేయడం,రహదారులలో ప్రయాణీకులను దోచుకోవడం అధికంగా ఉండేదట. అనేక పర్యాయాలు హెచ్చరించినా పిండారీలు పట్టించుకోలేదట. మంత్రులతో సంప్రదించి పిండారీలను ఆహ్వానించారట. అధికశాతం పిండారీలు వచ్చారట. వారితో మాట్లాడిన రాజావారు తమ షరతులకు అంగీకరించని వారికి ఆహారంలో విషం కలిపి అందరినీ సంహరించారట. ఇది తెలిసి భయపడి లొంగిపోయిన వారిని కూడా కఠినంగా శిక్షించారట. 
దీనితో రాజ్యానికి, ప్రజలకు దొంగల బాధ తప్పిపోయింది కానీ రాజావారికి అంతులేని మానసికవ్యధ కలిగించిందట. యెంత దొంగలైనా వారిని నమ్మించి చంపించాను అన్న ఒక క్షోభ ఆయనను నిరంతరం వేధించేదట. 
జోతిష్యులు, పండితులు చెప్పిన ప్రకారం ఆలయాలను నిర్మించడం, ఆలయాలను నిర్వహించడం, దానధర్మాలు చేయడం, ధర్మసత్రాలను ఏర్పాటు చేయడం ఇలా ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేశారట. అయినా మానసిక శాంతి లభించలేదట. చివరికి భోజనం చేయలేని పరిస్థితికి వచ్చారట. 









అప్పుడు జ్యోతిష్యులు "అన్నం పరబ్రహ్మ స్వరూపం" అందువలన ఒక బ్రహ్మ దేవుని ఆలయం నిర్మిస్తే అన్నీ సర్దుకొంటాయి అని సలహా ఇచ్చారట. 
కానీ విధాతకు పూజ మరియు ఆలయం యోగం లేదు కదా ? అన్న ప్రశ్న ఉత్పన్నమైనది. దానికి పండితులు శివలింగ ప్రతిష్ట హత్యాదోషాన్ని తొలగిస్తుంది. అందువలన ఉభయతారకంగా శివ లింగం మీద సృష్టికర్త రూపాన్ని చెక్కించి ప్రతిష్టించడం తగిన పరిష్కారం అని తెలిపారట. 
కానీ బ్రహ్మ దృష్టి సోకితే ఆ ప్రాంతంలో దుర్భిక్షం తాండవిస్తుంది అన్న మరో సందేహం తలెత్తినది. 
దానికి పరిష్కారంగా ఆలయాన్ని ఒక సరస్సులో ఏర్పాటు చేసి అష్టదిక్కులను దిగ్బంధం చేయడం ఉత్తమమని నిర్ణయం చేసారట. దీనికి తగిన ప్రదేశం శతాబ్దాలుగా ప్రసిద్ధికెక్కిన చేబ్రోలును ఎంచుకొన్నారట. 
అలా చేబ్రోలులో శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయానికి రూపకల్పన జరిగింది. 

శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం 

చేబ్రోలులో ప్రధాన ఆలయం శ్రీ నాగేశ్వర స్వామి వారు కొలువైనది. కానీ ప్రధాన ఆకర్షణ శ్రీ చతుర్ముఖ బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయం. రెండూ పక్కపక్కనే ఉంటాయి. 
చతురస్రాకార కోనేరు మధ్యలో ఉన్న ఆలయానికి చేరుకోడానికి వారధి ఏర్పాటు చేశారు. 
మండపంలాగా కనిపించే ఈ ఆలయానికి నలుపక్కలా స్తంభాలు ఉంటాయి. మధ్యలో ఉన్న సన్నిధికి నాలుగు ద్వారాలు, సున్నితంగా సుందరంగా రాతి మీద చెక్కిన కిటికీలు ఉంటాయి.
ఎత్తైన పానవట్టం మీద పద్మ పీఠం ఉంటుంది. బ్రహ్మ దేవుడు కమలసంభవుడు కదా !
పద్మాసనానికి కేంద్రంలో కనిపించే చతురస్రాకారపు లింగం పైన అభయ వరద ముద్రలలో ఉపస్థిత భంగిమలో  ఉన్న చతుర్ముఖ బ్రహ రూపాన్ని చెక్కారు. 
బ్రహ్మదేవునికి నాలుగు ముఖాలు ఉంటాయి కదా !
సన్నిధికి ఉన్న ద్వారాల నుంచి ప్రదక్షిణ చేస్తూ నాలుగు ముఖాలను దర్శించుకోవచ్చును. 
ఉపాలయాలు ఏమీ ఉండవు. సరస్సులో నీరు నిరంతరం నిండుగా ఉంటుంది. 
బ్రహ్మ దృష్టి పడకూడదని ఎనిమిది దిక్కులలో ఎనిమిది ఆలయాలను స్థాపించారు. వీటిలో నాలుగు అమ్మవారివి, రెండు పరమేశ్వరునివి కాగా మిగిలిన రెండు శ్రీ మహావిష్ణువు కొలువైనవి. 
ఎనిమిది అష్ట దిగ్బంధన ఆలయాలలో రెండు పూర్తిగా శిధిలమయ్యాయి. 
మిగిలినవి ఆగ్నేయంలో శ్రీ పార్వతీ దేవి, తూర్పున శ్రీ చంద్రశేఖర స్వామి, ఈశాన్యంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు, ఉత్తరంలో శ్రీ వేణుగోపాల స్వామి, వాయువ్యం లోశిధిల ఆలయం, పడమర శ్రీ సహస్ర లింగేశ్వర స్వామి,  నైఋతిలో శిధిల ఆలయం, దక్షిణంలో శ్రీ రంగనాధ స్వామి, శ్రీ ఆంజనేయస్వామి ఆలయాలు ఉంటాయి. పక్కనే నూతనంగా షిర్డీ సాయిబాబా మందిరం నిర్మించారు. 
ఈ ఆలయాలు అన్నీ కూడా పురవాస్తుశాఖవారి ఆధ్వర్యంలో ఉంటాయి. తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరంలో ఉన్న ఆలయాలను పునః నిర్మించడం జరిగింది. అష్ట దిగ్బంధ ఆలయాలలో ఉన్న ఆలయాలు అన్నీ కూడా ప్రత్యేకమైనవి కావడం చెప్పుకోవలసిన విషయం. అన్నింటినీ దర్శించడం విధాయకం. 
ముఖ్యంగా రెండు విషయాలు ఏమిటంటే దరిదాపుగా అధికశాతం శివలింగాలు బ్రహ్మ సూత్రం 
కలిగి ఉండటం, నంది విగ్రహాలు కుడి కాలికి బదులు ఎడమ కాలిని ఎత్తి ఉండటం ప్రత్యేకం చేబ్రోలులో. 








నిత్య పూజలు జరిగే ఈ ఆలయాలు శలవు రోజులలో  యాత్రీకులతో, పర్వదినాలలో స్థానిక భక్తులతో సందడిగా ఉంటాయి. 
చేబ్రోలులో ఉన్న అన్ని ఆలయాలు కూడా పక్కపక్కనే ఉంటాయి. ఈ పురాతన ఆలయాల సందర్శన నాటి ఆలయ నిర్మాణం పట్ల, ప్రజలు  పాలకులకు నిరాకారుడైన సర్వాంతర్యామి పట్ల గల భక్తివిశ్వాసాల గురించి కొంత అవగాహనను కలిగిస్తాయి. 
మన రాష్ట్రంలో త్రిమూర్తులను  ఒకే క్షేత్రంలో దర్శించుకునే అరుదైన అపూర్వ అవకాశం కలిగించే చేబ్రోలు గుంటూరు పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది వసతి సౌకర్యాలు లభించవు. 
శతాబ్దాలుగా రమణీయ ఆలయాల క్షేత్రంగా ప్రసిద్ధికెక్కిన చేబ్రోలు సందర్శన గొప్ప అనుభూతిని కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 
ఇలా మనరాష్ట్రంలో చిన్న చిన్న గ్రామాలలో కూడా పురాతన ప్రత్యేక ఆలయాలు నెలకొని ఉన్నాయి. వాటిని సందర్శించడం మన బాధ్యత. 

నమః శివాయ !!!!  


Sri Bhudevi sridevi Sameta sri Venkateswara swamy Temple, Anantavaram, Guntur district

                      కొండలలో నెలకొన్న కోనేటి రాయడు - 3 గతంలో మనం పావన కృష్ణవేణీ తీరంలో దేవదేవుడు కలియుగవరదుడు శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన రె...