1, అక్టోబర్ 2024, మంగళవారం

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం 


ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పురాతన గ్రంథ పఠన మరియు శిలా శాసనాలను  పరిశీలన చేయాలి. 
ఎందుకంటే ఈ రోజు మనం ప్రయాసపడుతూ సందర్శించే క్షేత్రాలు ఒకప్పుడు గొప్ప తీర్థ పుణ్య క్షేత్రాలుగా ప్రసిద్దికెక్కినవి అని గ్రంధాలు మరియు శాసనాలు తెలుపుతాయి. అంటే గతంలో నేటి చిన్న చిన్న గ్రామాలు నిరంతరం భక్తుల రాకపోకలతో సందడిగా నిత్య పూజలతో, ఉత్సవాలతో శోభాయమానం గా ఉండేవని తెలుస్తుంది. 
ఈ ఉపోద్ఘాతం వెనుక ఉన్న విషయం నేడు మరుగున పడిపోయిన ఒక విశేష క్షేత్ర ప్రాధాన్యత తెలుపడానికి చేస్తున్న ప్రయత్నంలో దొరికిన హృదయాలను కలచివేసే సమాచారం.

దక్షిణ భారత దేశ ప్రత్యేకత 

సువిశాల మన దేశం ఎన్నో ప్రత్యేకతలకు నిలయం అన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా భాష, ఆచారవ్యవహారాలు, ఆహార విహారాలు మరియు నిర్మాణశైలి విషయంలో ఉత్తర మరియు దక్షిణ భారత దేశాల మధ్య ఎన్నో వ్యత్యాసాలు కనపడతాయి. 
దక్షిణ భారత దేశంలో నేడు ఉన్న ఆరు రాష్ట్రాల మధ్య కూడా ఆది నుండి కూడా ఎన్నో భిన్న విభిన్న మరియు సమాన జీవనశైలి కనపడుతుంది. 
ఇక ఆలయ నిర్మాణశైలి తీసుకొంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం తనదైన ప్రత్యేక నిర్మాణ విశేషాలు కలిగి ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 
ముఖ్యంగా కర్ణాటకలో కనిపించే ఆలయ నిర్మాణశైలి అత్యంత క్లిష్టమైనది ప్రత్యేకమైనది. 
మనకు నేడు క్రీస్తుశకం నాలుగు లేదా అయిదు శతాబ్దాల నిర్మాణాలు కనపడతాయి. వీటిలో కొన్ని గుహాలయాలు. 
ఇవి ఎక్కువగా బాదామీ చాళుక్య రాజుల కాలంలో వారు పాలించిన బాదామీ, పట్టదక్కల్ మరియు ఐహోళే లలో కనపడతాయి. ఈ మూడు ప్రదేశాలలో గుహాలయాల నుండి విశేష రాతి కట్టడాల వరకు కనపడతాయి. 
వీరి నుంచి విడిపోయిన కల్యాణి లేదా పశ్చిమ చాళుక్యులు మరియు తూర్పు లేదా వేంగి చాళుక్యులు , రాష్ట్రకూటులూ, పశ్చిమ గంగ వంశం, శూణులు, కదంబ వంశం, హొయసల పాలకులు ఈ ప్రత్యేక ఆలయ నిర్మాణశైలిని మరింత మెరుగుపరిచారు. సుందరంగా, ఆకట్టుకొనే నిర్మాణాలను చేశారు. దక్షిణభారత దేశంలోని మరే  ప్రాంతంలోనూ కనిపించని విలక్షణశైలి అని చెప్పాలి. 
అవన్నీ కూడా ఆ రోజులలో ప్రజల ఆదరణ గొప్పగా పొందినవి కావడం ప్రత్యేకంగా చెప్పుకోవలసిన విషయం. ఆ రోజులలో మన దేశంలో పర్యటించిన విదేశీ యాత్రీకులు, నాటి రాజాస్థానాలలో ఉన్న కవిపండితులు 
ఈ రాజవంశాల వారు నిర్మించిన అనేక ఆలయాలు నేడు శిధిలావస్థలో ఉన్నాయి. అయినా వాటి ఆకర్షణ ఏ మాత్రం తగ్గలేదు. కాకపోతే వాటిని సందర్శన మాత్రం కొంత వ్యయప్రయాసలతో కూడుకున్న విషయం అని చెప్పాలి. ఇవన్నీ కూడా రక్షిత కట్టడాలుగా పురావస్తు శాఖవారి ఆధ్వర్యంలో ఉన్నాయి. 
అలాంటి వాటిలో గతమెంతో ఘనకీర్తి కలిగిన శ్రీ కైతభేశ్వర స్వామి వారు కొలువైన ఆలయం గురించిన విశేషాలు తెలుసుకొందాము. 





గతమెంతో ఘనకీర్తి 

" బంగారు కలశాలతో శోభించే విమానశిఖరాలతో, నిరంతరం ప్రతిధ్వనించే వేదమంత్రాలతో శాస్త్ర ప్రకారం విశ్వకర్మ నిర్మించిన ఆలయాలు ఒక ఎత్తు. విశాలమైన ప్రాంగణాలతో, చుట్టూ పచ్చదనపు సోయగం నిలుపుకొన్న చక్కని విశాలమైన గృహాలు మరో పక్క, కొనుగోలుదారులతో కిక్కిరిసిపోయి కనిపించే దుకాణాలు. యేమని చెప్పాలి "కుప్పతూర్" గొప్పదనాన్ని, యేమని పొగడాలి కుప్పత్తూర్ అందాలను ! అమరావతి, అలకాపురి ముల్లోకాలలోని ఏ పట్టణం కూడా కుప్పతూర్ కు సాటి లేదు రాదు"
ఇది ఒక శాసనంలో రాసిన విశేషాలు. సాటిలేని శోభను సంతరించుకున్న ఆ పట్టణం ఒకప్పటి పేరు కుప్పత్తూర్, కుంతలనగర నేటి పేరు "కుబతూర్". 
కర్ణాటక రాష్ట్రంలోని షిమోగా జిల్లా సొరబ్ తాలూకాలో రెండు వేలు కూడా దాటని జనాభా కలిగిన చిన్న పల్లె. 
ఒకనాటి గొప్పదనాన్ని ప్రదర్శించే ఆలయాలు, శిధిల నిర్మాణాలు మాత్రం చాలా కనపడతాయి. 

ఆలయాలు 

కుబతూర్ ఒకప్పుడు గొప్ప ఆధ్యాత్మిక క్షేత్రం. ఎన్నో ఆలయాలు కనిపించేవని చెబుతారు. హిందూ ఆలయాలు కాదు జైన మందిరాలు కూడా కనిపిస్తాయి.కల్యాణీ చాళుక్యులు జైనాన్ని గౌరవించారు. 
రామేశ్వర, కైతభేశ్వర(కోటిలింగేశ్వర) మరియు పారశ్వథనాథ్ బాసాడి ప్రస్తుతం వెలుగులో ఉన్న ఆలయాలు. 

శ్రీ రామేశ్వర ఆలయం 

మూలస్థాన ఆలయం అని స్థానిక నామం. ఇక్కడ ఈ ఆలయం మొదట నిర్మించారు,
 శ్రీ రామేశ్వర ఆలయం 1065 వ సంవత్సరంలో నిర్మించబడినట్లుగా శాసనాలు తెలుపుతున్నాయి. 
ప్రస్తుతం చిన్న మండపం గర్భాలయం ఎదురుగా చిన్న  నంది మండపం మాత్రమే ఉన్నాయి. 
ముఖ లేక రంగ మండపంలో శివతాండవ శిల్పం చుట్టూ దిక్పాలకులు, నంది, గణేశా కుమారస్వామి, పార్వతీదేవి కనిపిస్తారు. సప్త మాతృకలు మరియు కాళికాదేవి శిల్పాలు సుందరంగా ఉన్నాయి నేటికీ. 
చిన్న గద్దె మీద ఉన్న నాగ శిల్పాలు హిందూ సంప్రదాయంలో నాగ పూజకు ఉన్న ప్రాధాన్యతను తెలుపుతాయి. 






శ్రీ కైతభేశ్వర స్వామి ఆలయం 

మహేశ్వరుడు లింగరూపంలో శ్రీ కైతభేశ్వర స్వామి గా కొలువైన విశేషాలు ద్వాపర యుగం నాటివిగా తెలుస్తున్నాయి. 
బాణాసురుడు అనే అసుర రాజు గొప్ప శివ భక్తుడు. ఇతని కుమార్తె ఉష శ్రీ కృష్ణుని మనుమడైన అనిరుద్ధుని ప్రేమించి వివాహం చేసుకొన్నది. ఉషాపరిణయం గా ప్రసిద్ధి చెందిన వృత్తాంతం. 
ఇతని నగరానికి ఈశ్వరుడే రక్షణ. 
తనకున్న శివభక్తి కారణంగా అనేక శివలింగాలను ప్రతిష్టించాడు బాణాసురుడు. ఇక్కడ ప్రతిష్టించినది కోటి లింగాలలో చివరిది . అందువలన స్వామిని కోటీశ్వరుడు అని పిలిచేవారు. శాసనాలలో కూడా అదే పేరు కనిపిస్తుంది. కాలగతిలో శ్రీ కైతభేశ్వరస్వామి గా పిలవబడుతున్నారు. 
కానీ మరోగాధ కూడా వినిపిస్తుంది. 
మధుకైటభులు అనే అసురులు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలో ఉండగా ఆయన చెవి నుండి జన్మిచారని చెబుతారు. దేవీ భాగవతంలో వీరి వృత్తాంతం ప్రస్తాపించబడినది. వరగర్వంతో లోకకంటకులుగా మారిన వారిని శ్రీహరి తనదైన శైలిలో సంహరించారని పురాణం తెలుపుతోంది. 
వారిరువురూ అనేక శివలింగాలను ప్రతిష్టించారని అంటారు. 
అలా కైతభుడు ప్రతిష్టించిన లింగం కావడాన శ్రీ కైతభేశ్వర స్వామి అని పిలుస్తున్నారు అని చెబుతారు. మొదటివాడైన మధు ప్రతిష్టించిన లింగం శ్రీ మధుకేశ్వర స్వామి గా పిలవబడుతూ బనవాసి అనే ఉత్తర కన్నడ జిల్లా లోని ఊరిలో ఉన్నది అని చెబుతారు. ఇక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరం. 

ఆలయ విశేషాలు 

తుంగభద్రా నదికి ఉపనది అయిన "వరదా నది" తీరంలో ఉంటుందీ ఆలయం. 
తూర్పు ముఖంగా ఉండే ఏక కూట ఆలయంలో శ్రీ కైతభేశ్వర స్వామి లింగరూపంలో దర్శనమిస్తారు. 
పూర్తిగా నగీషీ చెక్కిన నున్నటి స్తంభాలతో కూడిన ఆలయ ముఖమండపానికి అయిదు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ముఖమండపానికి మూడు దిక్కులా ప్రహరీ గోడలాగా మూడు అడుగుల ఎత్తైన గోడ ఉంటుంది. ఆ గోడపైన సూక్ష్మాతి సూక్ష్మ చెక్కడాలను అతి రమణీయంగా చెక్కారు. పైకప్పు కూడా సుందరమైన పురాణగాధల, వివిధ దేవీ దేవతల రూపాలతో నింపారు. 
ముఖ మండపాన్ని గర్భాలయంలో కలుపుతూ చిన్న అర్ధ (అంతర) మండపం ఉంటుంది. 
ఇక్కడ శ్రీ మహావిష్ణువు, శ్రీ గణేష, సప్త మాతృకలు మరియు నాగదేవతలు కనిపిస్తారు. ఆలయానికి వెలుపల అష్టదిక్పాలకులను వారివారి స్థానాలలో సుందరంగా మలచి నిలపడం అపురూపంగా కనిపిస్తుంది. ఎలాంటి లెక్కలు కొలతలు వేసారో తెలియదు. కానీ అన్నీ ఒక ఎత్తులో సమాన దూరంలో ఉంటాయి. 
అష్టదిక్పాలకులే కాకుండా తాండవ గణేష, హరిహర, బ్రహ్మ, సదాశివ, భైరవ, పార్వతి, ఉమా మహేశ్వర మరియు సూర్య రూపాలను కూడా ప్రత్యేక స్థానాలలో నిలిపారు. 
ప్రతి శిల్పం లేదా చెక్కడం నాటి శిల్పుల నేర్పరితనాన్ని,వారి నైపుణ్యాన్ని,పురాణాల పట్ల దేవీదేవతా రూపాల పట్ల వారికీ గల అవగాహన ప్రశంసనీయం. 
చిత్రమైన విషయం ఏమిటంటే శివాలయాలలో తప్పనిసరిగా దర్శనమిచ్చే నందీశ్వరుడు ఇక్కడ కనిపించడు. ముష్కరుల దాడులలో నంది విగ్రహం భిన్నమైనది అని చెబుతారు. 
కొద్ది దూరంలో భూమి లో నిర్మించిన చిన్న ఆలయం కనిపిస్తుంది. క్రిందకి వెళ్ళడానికి మెట్ల దారి ఉన్నది. 
వివిధ పాలకుల కాలాల నాటి శాసనాలు చాలా కనపడతాయి. 
ప్రస్తుతం కనిపించే నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యబోయే మనలాంటి సందర్శకులు గతంలో ఈ ఆలయం ఎంత శోభాయమానంగా ఉండేదో ఊహించుకొంటే నేటి పరిస్థితికి బాధ కలగకుండా ఉండదు. 
 ఆలయాన్ని, చేరుకునే మార్గాన్ని,ప్రయాణ సౌకర్యాలను మరియు ప్రాంగణ పరిసరాల్లో కనీస సౌకర్యాలను ఏర్పాటుచేసి అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతో ఉన్నది. 

పారశనాథ ఆలయం (బసాది)

ఇరవై నాలుగు జైన తీర్థంకరులలో ఇరవై మూడో వాడు శ్రీ పారశనాధ్. ఈయన క్రీస్తు పూర్వం ఎనిమిదవ శతాబ్దానికి చెందిన వారు అని తెలుస్తోంది. 
కదంబ వంశ రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతారు. సాధాసీదా నిర్మాణం. 
కుబతూర్ లో శ్రీ లక్ష్మీనరసింహ మరియు గ్రామదేవత శ్రీ ద్యామవ్వ ఆలయాలు కూడా ఉన్నాయి. 
శ్రీ మహిషాసురమర్ధిని రూపంలో కనిపించే శ్రీ ద్యామవ్వ కోరికలుతీర్చే తల్లిగా స్థానికులు విశ్వసిస్తారు. 
మనదేశంలో మరుగునపడిన ఎన్నో పురాతన హిందూ పుణ్య క్షేత్రాలలో ఒకటైన కుబతూర్  
కు బెంగళూరు నుండి శివమొగ్గ (షిమోగా) మీదగా చేరుకోవచ్చును. వంద కిలోమీటర్ల దూరం.  గోకర్ణ నుండి కూడా సందర్శించుకునే అవకాశం ఉన్నది. నూటఇరవై కిలోమీటర్ల దూరం. 
వసతి సౌకర్యాలు భోజనం శివమొగ్గ లోనే లభిస్తాయి. 
కర్ణాటక రాష్ట్రంలో మారుమూల గ్రామాలలో నెలకొని బాహ్యప్రపంచానికి అంతగా పరిచయం లేని  అద్భుత నిర్మాణాల జాబితాలో ఉన్న కుబతూర్ తప్పనిసరిగా సందర్శించవలసిన ప్రదేశం. 

నమః శివాయ !!!!     



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Kaithabeshwara Swamy Temple, Kubatur, Karnataka

                              మరుగునపడిన మహా క్షేత్రం   ఆలయాల పూర్తి సమాచారం మరియు క్షేత్ర ప్రాధాన్యత, గాథల గురించిన సంపూర్ణ సమాచారం కోసం పు...