Thirunangnoor Divyadesam 3
తిరునాంగూర్ దివ్యదేశాలు - 3 తిరునాంగూర్ దివ్య దేశాలు ఆకారంలో చిన్నవి కావచ్చును కానీ ప్రాధాన్యతలో ఆధ్యాత్మికతలో పెద్దవిగానే పేర్కొనాలి. ప్రతి ఆలయం ఒక తనదైన ప్రత్యేకతలతో, పరమాత్మను ఆకర్షించడమే కాక ఆళ్వార్లను కూడా ప్రభావితం చేయగలిగాయి. తిరునాంగూర్ దివ్య దేశాల విశేషాల మూడవ భాగంలో మిగిలిన ఆలయాల గురించి తెలుసుకొందాము. 7. తిరు వైకుంఠ విన్నగరం తిరునాంగూర్ దివ్య దేశాల వరుసలో ఏడవది అయిన ఈ దివ్య దేశం గురించి పద్మ పురాణంలో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. అగస్థ్య మహర్షి ఈ క్షేత్ర మహత్యం గురించి ఉపరిచర వాసు మహారాజుకు చెప్పినట్లుగా అవగతం అవుతోంది. గతంలో శ్వేతకేతు అనే ఇక్ష్వాకు వంశ రాజుకు వైకుంఠవాసం చేయాలన్న తలంపు కలిగిందిట. సతీ సమేతంగా తీవ్ర తపస్సు చేసి వైకుంఠం చేరుకోగలిగారట. కానీ వారికి అక్కడ శ్రీ మన్నారాయణుని దర్శనం లభించలేదట. పైగా అక్కడ వారిని ఆకలిదప్పులు బాధించ సాగాయట. ఈ పరిణామాలతో వ్యాకుల పడిన రాజ దంపతులు తిరిగి భూలోక మార్గం పట్టారట. మార్గమధ్యలో వారికి త్రిలోక స...